తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ పట్టాలు అందని ఆదివాసీ రైతులు ఈ పథకాలకు దూరంగానే ఉండిపోయారు. అసలు వ్యవసాయం చేస్తున్నది ఎవరు అనేది పట్టించుకోకుండా, వ్యవసాయం చేస్తున్నవారితో సంప్రదింపులు జరపకుండా పై నుండి రుద్దుతున్న పథకాలు, ప్రణాళికల వల్ల మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు పనులు లేక, ఉత్పత్తి చేసిన కూరగాయలు, పాలు అమ్ముకోవడానికి మార్కెట్ లేక, సరైన ధర లేక ఆదాయాలు కోల్పోయారు. వారికి ఖరీఫ్ సీజన్లో పెట్టుబడికి ప్రైవేటు రుణాలు అందక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Continue reading →