ఒక్కపూట బడులు మొదలై వారం రోజులైంది. చీకట్లో లేచి అమ్మకు పనుల్లో సాయం చేసి హుషారుగా బడికి పోతున్నాము. నేను, చెల్లి. మా పాఠశాల మా ఊరి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము.
దారిలో ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అప్పుడప్పుడే అతనికి ప్రమాదం జరిగింది. ఆ దగ్గరలోనే హాస్పిటల్ కూడా వుంది. అందరూ ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ అక్కడ గుమిగూడారు, ఆ వ్యక్తిని ఫోటోలు తీసుకుంటున్నారు కానీ, ఎవరు అతన్ని హాస్పిటలకు తీసుకెళ్లడం లేదు. ఆయన కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. మేము అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అడుగుతున్నా ఎవరు పట్టించుకోవడంలేదు. ఇది పోలీస్ కేసు అయ్యేది అంబులెన్స్ కు ఫోన్ చేశాము వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మీరు చిన్నపిల్లలు మీకెందుకు పొండి ఇక్కడి నుండి అని కసురుకుని మమ్మల్ని అక్కడి నుండి పంపించేశారు.
బడికైతే వెళ్ళాము కానీ ధ్యాసంత అతని మీదే వుంది. పాఠాలు కూడా సరిగా వినలేదు. అతనికి ఏమైందో తెలుసుకోవాలని ఆత్రం పెరిగిపోయింది. తలనొప్పిగా వుంది ఇంటికి వెళ్తానని అడిగి టీచర్ తో తిట్టించ్చుకున్న. చేసేదేమిలేక మధ్యాహ్నం వరకు అక్కడే వున్నా. బడి వదిలేయగానే గబగబా చెల్లి దగ్గరకు వెళ్ళి తనని తీసుకొని బయలుదేరి ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి చూశాను. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి కానీ ఆ మనిషి లేడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ దగ్గరలోని షాప్ అతన్ని అడిగితే అతను అప్పుడే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లారు. అయినా నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అతను అడిగాడు. మేము పొద్దున స్కూల్కు వెళ్లేటప్పుడు చూసాము. ఎవరైనా సహాయం చేస్తే అతను బతికేవాడు కదా. కానీ ఎవరు పట్టించుకోలేదు అందుకే అతను చనిపోయాడు అని నేను ఏడ్చాను. యాక్సిడెంట్ జరిగితే పోలీస్ కేసు అవుతుంది. ఒక్కోసారి అది మనమీదకే వస్తుంది. అందుకే ముందు పోలీసులకు చెప్పాలి. ఆ తర్వాతే ఏదైనా చేయాలి అని ఆ షాప్ అతను అన్నాడు. ఆ మాటలు నాకు నచ్చలేదు, ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాను. లోకం తీరు అంతే నాన్నా మా చిన్నతనంలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే సాయం చేయడానికి పదిమంది వచ్చేవారు ఇప్పుడు ఎవరు రారు. స్వార్థం పెరిగిపోయింది. మానవత్వం లేకుండా పోతుందని చెప్పింది. అమ్మ మాటలు విన్నాక నేను అలా వుండకూడదు అనుకున్నా.
– ,
మిలీనియం హైస్కూల్, మంకల్ గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా.
