భారతీయ సమాజంలో ఆధిపత్య ధోరణి కలిగిన అత్తకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీవీ సీరియళ్లలో ఆమె ప్రతినాయకురాలు, జోకులలో ప్రధాన పాత్ర, గృహహింస కేసుల్లో తరచూ కనిపించే వ్యక్తి. కోడలి శరీరం, లైంగికత, ప్రవర్తనలను నియంత్రించాలనే ప్రయత్నం ఈ సాంప్రదాయిక అత్త పాత్రను మరింత బలపరిచాయి.
ఈ మూస ధోరణి వెనుక ఒక అసౌకర్యకరమైన వైరుధ్యం ఉంది. ఒకప్పుడు తానే యువ కోడలిగా నియంత్రణ, అవమానం, హింసను అనుభవించిన అత్త, తరువాత అదే అనుభవాలను తన కోడలిపై ప్రయోగిస్తుంది. ‘క్యోకీ సాస్ భీ కభీ బహూ దీ’ొ అనే టీవీ సీరియల్ అత్త-కోడళ్ల మధ్య నిరంతర సంఘర్షణను ప్రజాదరణ పొందేలా చేసింది. వినోదం కోసం అతిశయోక్తులు ఉన్నప్పటికీ, ఈ కథనాలు అనేక కుటుంబాల్లో కనిపించే వాస్తవ ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తాయి. అక్కడ మహిళలు అధికారానికి పోటీపడే ప్రత్యర్థులుగా ఒకరినొకరు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
నిజజీవిత కేసులు మరింత ఆందోళనకరమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. వరకట్న మరణాలు, గృహహింస కేసుల్లో అత్తలు తరచుగా నిందితులుగా కనిపిస్తారు. జాతీయ నేర గణాంకాలు కూడా మహిళా బంధువులపై ఫిర్యాదులు తరచుగా నమోదవుతున్నాయని తెలియజేస్తున్నాయి. “మహిళలకే మహిళలు శత్రువులు” అనే వాదనకు ఆధారంగా చూపిస్తారు. కానీ అలాంటి వివరణలు ఈ సంఘర్షణలను సృష్టించే విస్తృత పితృస్వామ్య వ్యవస్థను కనిపించకుండాగా చేస్తాయి.
వరకట్న వ్యవస్థను మహిళలు సృష్టించలేదు. పితృస్వామ్య వివాహ వ్యవస్థను, వారసత్వ నిర్మాణాలను కూడా వారు రూపొందించలేదు. ఇవన్నీ పురుషులకు అనుకూలంగా ఏర్పడిన వ్యవస్థలు. అయినప్పటికీ, వాటిని కొనసాగించే సాధనాలుగా మహిళలే మారుతున్నారు. కుమార్తెలు, అక్కచెల్లెళ్ళు ఎంత ప్రేమించినా తండ్రి, అన్నల మాట వినాలని నేర్పుతారు. భార్యలు ఎంత స్వతంత్రులైనా భర్తకు లోబడాలని ఆశిస్తారు. మహిళల విలువను వారి త్యాగాల ద్వారా కొలుస్తారు.
పితృస్వామ్య సమాజంలో మహిళలు ఒకరినొకరు పర్యవేక్షించేలా, నియంత్రించేలా చిన్నప్పటి నుంచే శిక్షణ పొందుతారు. అత్త కోడలిని, పెద్ద కోడలు చిన్న కోడలిని, ఆడబిడ్డ వదినను నియంత్రించే సంబంధాలు ఏర్పడతాయి. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు; పితృస్వామ్య వ్యవస్థ ఇచ్చే శిక్షణ ఫలితం. చిన్నపిల్లలు మహిళల మధ్య సంబంధాలను అసూయ, పోటీ, అణిచివేతలను చూస్తూ పెరుగుతారు. అలాంటి మహిళల మధ్య ఐక్యత అసాద్యమని నమ్ముతారు. ఒక అమ్మమ్మ తన కోడలిని అవమానించి, ఆమెను ఒంటరిని చేసినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన చిన్నారి మహిళలు ఒకరికొకరు అండగా నిలబడరని నేర్చుకుంటుంది. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటారని అర్ధం చేసుకుంటుంది.
వివాహం తర్వాత ఒక మహిళ తన పుట్టింటిని విడిచి భర్త కుటుంబంలోకి వెళుతుంది. అక్కడ ఆమెకు మొదట్లో అధికారమేమీ ఉండదు. పెద్దల సేవ చేయాలి, ఇంటి పనులు చేయాలి, కుటుంబ నియమాలకు అనుగుణంగా జీవించాలి. చాలా మంది మహిళలు భావోద్వేగ హింస, సంచార స్వేచ్ఛపై ఆంక్షలు, పిల్లలు కనాలనే ఒత్తిడి, కొన్నిసార్లు శారీరక హింస, వరకట్న వేధింపులను ఎదుర్కొంటారు.
వయస్సు పెరిగేకొద్దీ, ముఖ్యంగా కుమారులకు తల్లిగా మారిన తర్వాత, మహిళ సామాజిక స్థానం మెరుగవుతుంది. ఆ కుమారుడే ఆమెకు భద్రత, ప్రభావం, గుర్తింపుకు మూలం అవుతాడు. కుమారుడు వివాహం చేసుకున్నప్పుడు, కోడలు ఇప్పటికే కష్టపడి సంపాదించిన తన అధికార నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కోడలి రాక అత్తకు తన అధికారం, భావోద్వేగ భద్రతకు ముప్పుగా అనిపించవచ్చు. ఇంటి పనులు, ఆర్థిక నిర్ణయాలు, పిల్లల పెంపకం, కుమారుడి శ్రద్ధ వంటి అంశాలపై తలెత్తే గొడవలు వాస్తవానికి అధికారం కోల్పోతామనే భయానికి ప్రతిబింబాలు. ఈ పరిస్థితిని టర్కీ స్త్రీవాద పండితురాలు Deniz Kandiyoti “పితృస్వామ్య ఒప్పందం” (Patriarchal Bargain) అని అభివర్ణించారు. అంటే, ఒక వ్యవస్థ తమను అణచివేసినా, దానికి లోబడితే కొన్ని సామాజిక ప్రయోజనాలు లభిస్తాయని భావించి మహిళలు దానిని కొనసాగించడంలో భాగస్వాములు అవుతారు. అందువల్ల హింసాత్మక అత్త పితృస్వామ్యానికి మినహాయింపు కాదు; అదే వ్యవస్థ సృష్టించిన ఉత్పత్తి. పితృస్వామ్యం కేవలం పురుషుల బలవంతం వల్ల మాత్రమే నిలవదు. దాని విలువలు కుటుంబాల్లో అంతర్గతమై, తరతరాలుగా పునరుత్పత్తి కావడం వల్ల నిలబడి ఉంది.
ఒక యువతి దుస్తులను ఆమె తండ్రి కాకుండా అమ్మమ్మ ప్రశ్నించవచ్చు. ఆమె సంచార స్వేచ్ఛను భర్త కాకుండా అత్త పరిమితం చేయవచ్చు. ఉద్యోగం, వివాహం, మాతృత్వం వంటి నిర్ణయాలపై పురుషులు మాట్లాడకముందే మహిళలే ప్రశ్నించవచ్చు. ఇదే పితృస్వామ్యాన్ని అంత బలంగా నిలబెట్టే కారణం. ఈ ఉద్రిక్తతల వెనుక ఉన్న నిర్మాణాత్మక కారణాలను అర్థం చేసుకోవడం వ్యక్తుల బాధ్యతను తగ్గించదు. కానీ పరిష్కారాల దిశగా చూపిస్తుంది. మహిళలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా, గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడే మిత్రులుగా చూడడం ప్రారంభించినప్పుడు మాత్రమే పితృస్వామ్యాన్ని కూల్చివేసే నిజమైన సామాజిక విప్లవం సాధ్యమవుతుంది.
