మల్లెల సువాసనలను తన కథల ద్వారా వెదజల్లాలని ఆకాంక్షిస్తూ డా||తాళ్ళపల్లి యాకమ్మ గారు కథా రచనను మొదలు పెట్టారనిపిస్తుంది. తన అనుభవాలను రంగరించి పాఠకులకు తమ జీవితంలోని సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ కథలు కొనసాగుతాయి. అణగారిన వర్గంలో పుట్టిన దళిత బిడ్డగా, ఒక సగటు మహిళగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి తాను పడ్డ కష్టాలు, బాధలు, ఆవేదనలు ఈ కథలలో కనిపిస్తాయి. ఈ పుస్తకం మొత్తం 11 కథలతో రూపుదిద్దుకుంది. ఒక్కొక్క కథ కొన్ని వేల ఆలోచనలను రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ఇందులోని మొదటి కథ పుస్తకానికి హృదయం లాంటిది ”మమతల మల్లెలు”. ఈ కథలో రచయిత దళిత కుటుంబంలోని పరిస్థితులు, అనుబంధాలను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. సంపాదనతో నిమిత్తం లేకుండా ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే కుటుంబం. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న అనురాగం, అన్నాచెల్లెళ్ళ అనుబంధం, భార్యాభర్తల బంధం చాలా ఆత్మీయంగా చిత్రీకరించారు. మార్పును స్వీకరిస్తున్న దళిత కుటుంబాన్ని ఆవిష్కరించారు. తండ్రి తన బిడ్డలను చదివించాలని, పనికి తీసుకెళ్ళకుండా బడికి పంపడం, గుడిసె అయినప్పటికీ ఇంటి చుట్టూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రకరకాల చెట్లతో అందంగా అలంకరించుకోవడం వంటివన్నీ చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భావనలు ఆ కుటుంబంలో మనకు కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం చేసినా బిడ్డల కడుపు నింపడానికి ఎంత ఆరాటపడతారో అర్థమవుతుంది. తాము కడుపు కట్టుకుని మరీ బిడ్డల కడుపు నింపుతారు. నాన్న తువ్వాలులో మడిచి తెచ్చిన కొబ్బరిముక్క, అమ్మ చేయించిన అప్పాలు అందుకు నిదర్శనం. అంతేకాకుండా ఆడబిడ్డను ఆదరించడం ఇంకో గొప్ప అంశం. సంసారాలు చక్కదిద్దుకోకుండా గొడవలతో ఎన్నో సంబంధాలు కుప్పకూలిపోతున్నాయి. అలాంటిది ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత మర్యాదగా, ప్రేమగా చూసుకున్నారో చక్కగా వివరించారు.
Continue reading →