టైమ్ 11 అవుతోంది. అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న ఆఫీసు రూమ్లో దాదాపు 20 మంది మహిళలు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా రావలసిన దోస్తుల కోసం వచ్చేయండంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి ఆటవిడుపు.
ఎందుకంటే అందరూ కలిసి కిట్టిపార్టీ చేసుకుంటున్నారు. బడికి, కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని పంపించేసి, ఇంట్లో సర్దుకోవాల్సినవి త్వరగా సర్దేసి రెడీ అయ్యి ఒకచోట చేరుకున్నారు. ముందే అనుకున్నట్టు చిరుతిళ్ళు, భోజనంలోకి ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ తయారు చేసి తెచ్చేశారు. ఇక సాయంత్రం వరకు సమయం వాళ్ళదే!
73 ఏళ్ళ రాధ ఆంటీ వాళ్ళందరికీ లీడ్. వయసుతో నిమిత్తం లేదు. తనింకా రాలేదు ఏమయ్యుంటుందో, చూసొస్తాం అంటూ బిందు, శ్వేత బయలుదేరేసరికి అప్పుడే లోపలికోస్తూ కనిపించింది రాధ ఆంటీ. ఇంతలో ఇంకొంతమంది కూడా చేరుకున్నారు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడు కున్నాక ఇక పాటలు, ఆటలు మొదలు పెట్టారు. ఇద్దరు మాత్రం పీరియడ్స్తో ఇబ్బందిగా ఉంది ఆడలేమని పక్కన కూర్చుండిపోయారు. ఎప్పుడూ చలాకీగా ఉండే రాధ కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే ఏమయ్యిందంటూ అందరి దృష్టీ ఆమె మీదికి మళ్ళింది. ‘పేగు జారినట్టు అనిపిస్తోంది, నిన్నటి నుండి నడుస్తుంటే అక్కడ ఏదో అడ్డంపడు తున్నట్టుంది, చేతికి కూడా తగులుతోంది, నించుని పనిచేసుకుంటుంటే కూడా కిందికి జారుతున్నట్టు ఉంది, అసలు రావొద్దను కున్నాను, కానీ మనసుకి కాస్త బాగుం టుందని వచ్చాను’ అని చెప్తుంటే అందరూ ఖంగారుగా చూశారు. ఇంతలో లక్ష్మీ ఆంటీ ‘అది పేగంటారా, గర్భసంచా’ అని అనుమానం వ్యక్తపరిచారు.
‘నాకు గర్భసంచి తీసేసి నలభై ఏళ్ళు అవుతోంది’ అన్న రాధ మాటకి ‘మీకింకా 75 కూడా నిండలేదుగా! అంటే మీకు 35 ఏళ్లలోపే హిస్టరెక్టమీ అయిపోయిందా’ అడిగింది స్వప్న. ‘అంత చిన్న వయసులోనా! గర్భసంచి తీసేస్తే చాలా సమస్యలు వస్తాయంట కదా! అసలు మీ పెళ్ళి ఎప్పుడ యింది, ఆపరేషన్ ఎందుకయ్యింది కొంచెం చెప్తారా’ అడిగింది నంద.
‘పధ్నాలుగో ఏట పెళ్ళయింది. సరిగ్గా ూూూజ పరీక్షలకి ముందు. చదువుకోవాలని చాలా ఉన్నా పిల్లలు నవ్వుతారని సిగ్గుతో పరీక్షలు కూడా రాయలేదు. 16 ఏళ్ళకి మొదటి కాన్పు. 19కి ముగ్గురూ పుట్టేశారు. తర్వాత సంవత్సరం కూడా కాలేదు, పీరియడ్స్లో విపరీతమైన నొప్పి, ఓవర్ బ్లీడిరగ్.. నానీకి ఇంకా సంవత్సరం కూడా నిండలేదు, చాలా ఇబ్బంది అయ్యేది. గర్భసంచి ఒరుసుకు పోయిందని, పుండు పడిరదని, అందుకే అంత ఇబ్బందని డాక్టర్ చెప్పారు. కాని అంత చిన్న వయసులో హిస్టరెక్టమీ మంచిదికాదని పుండుపడిన వరకు తీసేశారు. అప్పటి నుండి దాదాపు పధ్నాలుగేళ్ళు. మొదట్లో కొన్నేళ్ళపాటు సమస్య కొంత సర్దుకున్నా, రానురాను ఎక్కువయ్యింది. నాకు 32 ఏళ్ళు వచ్చే సరికి అది బాగా ఎక్కువయ్యింది, మొదట్లో లాగే. ఇంకో రెండేళ్ళు కొంత వ్యాయామం, మందులతో నెట్టుకొచ్చాను. తర్వాత ఇక తప్పదన్నప్పుడు ఆపరేషన్ చేసి గర్భసంచి పూర్తిగా తీసేశారు’ రాధ చెప్తుంటే నిశ్శబ్దంగా విన్నారు. మాట్లాడడం ఆపగానే ప్రశ్నల మీద ప్రశ్నలు..
అయితే అందరికీ ఉన్న ఒక ప్రశ్న మాత్రం గర్భసంచిలో కొంతభాగం తీస్తారా, అసలలా చేయొచ్చా, ఎప్పుడూ వినలేదు, అదెలా సాధ్యం అని. కొన్నేళ్ళుగా ఎక్కడ చూసినా 40 ఏళ్ళు కూడా నిండకుండానే ఆపరేషన్ తప్పట్లేదని, గర్భసంచి తీసేయి ంచుకోవాల్సి వచ్చిందని వింటున్నాం. తెల్లబట్ట ఎక్కువగా అవుతోందని, పీరియడ్స్ అప్పుడు పొత్తికడుపులో నొప్పి భరించలేకపోతున్నామని, బ్లీడిరగ్ ఎక్కువగా అవుతోందని, గడ్డలు గడ్డలుగా రక్తం పడు తోందని.. ఎన్నో కారణాలు. ఈ ఇబ్బందు లకి ఎన్నో రకాల మూలకారణాలు ఉండొచ్చన్న ఆలోచనకంటే ముందే, వాటి గురించి సరైన డాక్టర్లతో మాట్లాడాలని అనుకోకుండానే, పిల్లలు పుట్టేశారుగా ఇంక గర్భసంచితో ఏం పనని, పూజలు వ్రతాలకు అడ్డుగా ఉందని, ఈ బాధ నుండి పర్మనెం ట్గా విముక్తి పొందొచ్చని.. అందరూ కలగాపులగంగా మాట్లాడేసుకుంటున్నారు.
అవును మరి, ప్రస్తుత కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపారంలో డాక్టర్లలో కూడా ఎంతమందికి గర్భసంచిని ప్రొటెక్ట్ చేస్తూ సమస్యకు ట్రీట్మెంట్ చేయాలన్న ఆలోచన, వెసులుబాటు ఉంటోంది? ట్రీట్మెంట్ చేద్దాం, కొంచెం ఓపికతో ఉండాలని సలహా ఇచ్చే డాక్టర్ల ప్రావీణ్యం మీదే అనుమానపడే పేషెంట్లు, అంత సమయం లేదు ఉద్యోగం, ఇంటి పనులతో బాగా ఇబ్బంది అవుతోంది తీసేయండి అనే పేషంట్లు.. ఈ మొత్తంలో మెడికల్ ఎథిక్స్ కు, నైతిక బాధ్యతలకు విలువిచ్చే, గర్భసంచిని ప్రొటెక్ట్ చేయాలని చూసే డాక్టర్లు ఎంతమంది ఉన్నారు?
మహిళల శరీరాలు, పునరుత్పత్తి వ్యవస్థ, అతి ముఖ్యంగా గర్భసంచి పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు, దానిచుట్టూ వారి శారీరక, మానసిక ఆరోగ్యం ముడిపడుందని తెలుసుకోవలసిన సమయం, దాన్ని అందరికీ అర్ధంచేయించాల్సిన సందర్భంలో ఉన్నాం అందరం. గర్భసంచిని రక్షిస్తే మహిళల జీవితాల్ని సంరక్షించినట్లే. నేను ఆ పనిలోనే ఉన్నా.. మరి మీరు.
