నిన్నటి తరం రచయితలు మరోసారి తమ పఠనాప్రయాణాన్ని గుర్తు చేసుకోడానికీ, ఈ తరం పాఠకులు, రచయితలు ఏ రచయితలను విధిగా చదివి తీరాలో తెలుసుకోడానికీ ఎంతో ఉపకరించే రచన ఇది. చంద ‘మామ’ నుంచి సోమర్సెట్ ‘మామ’ వరకూ భార్గవి తన పఠనానుభవాన్ని ఒక రసగుళికగా మార్చి రాసిన అందమైన పుస్తకం ‘నా చదువు కథ’.
గత ఇరవై యేళ్ల పరిచయంలో నేను గమనించింది – భార్గవికి సహజంగా జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఆమె సమకాలీనంగా జన్మించి, వాటిలో చాలా భాగం ఎప్పుడో మరచిపోయిన నా వంటి వాళ్లకు మళ్లీ బాల్యపు రుచిని, మరిచిపోయిన చదువుల జ్ఞాపకాలను అందిస్తూ, తను మళ్లీ జీవిస్తూ, మనల్నీ జీవింపజేసింది ఈ పుస్తకం ద్వారా. ఈ రచనతో తెలుగులో ఒక కొత్త ఆత్మకథకు నాంది పలికింది భార్గవి. ఇది ‘పఠనాత్మకథ’. ప్రతి పాఠకుడూ ‘అరె. ఇలాంటి పుస్తకం నేను కూడ రాయగలను కదా’ అనుకునేలా రాసిన రచన. అందరం రాయగలమేమోగానీ, ఒక్క భార్గవికే ఆ ఆలోచన వచ్చింది మరి. ఇకపై అందరికీ ఇలాంటి పుస్తకం మేం కూడ రాయాలనిపించేలా రాసింది. అందరూ ఆమెతో పోటీపడగలరో లేదో అనుమానమే. చాలా సరదాగా, తన దెయ్యపు పాఠశాల చదువుతో ఆరంభించి, చందమామ, బాలమిత్రలతో మొదలై, యద్దనపూడి, కొమ్మూరి సాంశివరావు, శరత్ చంద్రఛటర్జీ వంటి వారితో పెరిగి చలం దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణ పాఠక స్థాయిని ఆమె చేరుకున్న వైనం అపురూపం. అంతవరకూ విభిన్న పత్రికలు, వాటి సంపాదకులు, ప్రత్యేక లక్ష్యం లేకుండా, రాండమ్గా తను చదివిన పుస్తకాలు ఆహ్లాదాన్ని చేకూర్చగా, తర్వాత నుంచి ఆమె విమర్శక పాఠకురాలి రూపు దాలుస్తుంది. చలం, కుటుంబరావు, వడ్డెర చండీదాస్, ఆర్. వసుంధరాదేవి, ఆచంట జానకీరామ్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, సత్యం శంకరమంచి వరకూ, ఇంగ్లీషు రచయితల్లో మార్క్ ట్వేన్, సోమర్సెట్ మామ్ వరకూ చాలా నిశితమైన విమర్శ చేసింది భార్గవి.
భార్గవి ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శ పాఠకురాలు. సాహిత్యాన్ని ఎందుకు చదవాలో తెలిసిన మనిషి. పుస్తకాల నుంచి జీవితంలో తనకు
ఉపయోగపడే విషయాల్ని స్వీకరించగలదు. వాటిని ఆచరించగలదు. ఉత్తమ రచయితల రచనలు చదివి తన ఆలోచనా పరిధిని విశాలం చేసుకోగలదు. తన ప్రవర్తనను మరింత పరిణతితో తీర్చిదిద్దుకోగలదు. మన సమాజంలో ఎంతమందికి పుస్తకాలు ఎందుకు చదవాలో తెలుసు? కేవలం భాష నేర్చుకోవడం కోసమో, విషయ పరిజ్ఞానం కోసమో, కాలక్షేపం కోసమో పుస్తకాలు చదివేవాళ్లు ఎక్కువ. కానీ అంతకు మించి వాటిని జీవితానికి అన్వయం చేసుకోవాలనుకునే పాఠకులే అసలైన పాఠకులు. భార్గవి అలాంటి పాఠకురాలు. కొడవటిగంటి కుటుంబరావు గురించి చెబుతూ, చెడిపోయిన మనిషి నవలలోని మాటలు ఉటంకిస్తూ ఆమె “నిజంగా ఈ మాటలు నా జీవితంలో నాకు శిలాక్షరాల్లాగా నిలిచి, అనేకసార్లు దిశానిర్దేశం చేశాయి’ అంటుంది (పుట 26). అదే సాహిత్యానికి పరమ ప్రయోజనం. ‘హృదయంతో జీవించడమెలాగో నేర్పింది చలమైతే, మెదడుతో ఎలా ఆలోచించాలో నేర్పింది కుటుంబరావు’ (పుట 25) అన్న మాటలు చాలు ఆమె ఎంత అవగాహన కలిగిన పాఠకురాలో చెప్పడానికి. భార్గవి తను చదివిన ఏ పుస్తకం గురించి చెప్పినా ఎంత ఆకర్షణీయంగా చెబుతుందంటే, మనకు వెంటనే ఆ పుస్తకం తెచ్చేసుకుని చదవాలనిపిస్తుంది. ముఖ్యంగా వడ్డెర చండీదాస్ నవలలు ‘హిమజ్వాల’, ‘అనుక్షణికం’ గురించి తను రాసిన పద్ధతి. ‘నేనిప్పటికీ బైబిల్ లాగానో, భగవద్గీతలాగానో ‘అనుక్షణికం’ పుస్తకం తీసి యే పేజీ వస్తే ఆ పేజీ చదువుఉంటూ పోతా! అంత ఇష్టం నాకీ పుస్తకమంటే. అసలు అనుక్షణికం పేరు చూశారా యెలా పెట్టారో! ప్రతి క్షణం నశించేదే (క్షణికమైనది). అయితే నశించిన ప్రతీక్షణం వెనకా మళ్లీ ఇంకో క్షణం పుడుతూనే వుంటుంది. నశిస్తూనే ఉంటుంది. ఇది ఒక అంతులేని వలయం’ (పుట 39). ఇలాంటి వాక్యాలు ఆమెలోని విశ్లేషణా ప్రతిభను మన కళ్లెదట నిలబెడతాయి.
(వడ్డెర చండీదాస్ గురించి ఆమె రాసింది చదువుతూంటె, ఆయనతో నా పరిచయం గుర్తుకొచ్చింది. ఒక సెమినార్లో ‘చివరకు మిగిలేది’ నవల ప్రస్తావన వచ్చినపుడు. అందులో ఈడిపస్ కాంప్లెక్స్ లేదని నేనన్నాను. అస్తిత్వవాద లక్షణాలున్నాయని అంటూ. సెమినార్ అయ్యాక, చండీదాస్ గారు నన్ను బయటకు వెళ్తూంటే ఆపి ‘ ఇంతకాలానికి ఈ మాట ‘చివరకు మిగిలేది’ గురించి చెప్పిన ఒక వ్యక్తిని చూశాను. నా అభిప్రాయమూ అదే’ అన్నారు. తర్వాత తన హిమజ్వాలను అందరూ అస్తిత్వవాద, మనోవైజ్ఞానిక నవల అంటారనీ, నిజానికి అది ఈస్తటిక్ నవల అనీ నాతో చెప్పారు. ఆ రెండో వాక్యం అనేవరకూ ఆయన చండీదాస్ అని నాకు తెలీదు). ఇలా భార్గవి పుస్తకం చదువుతూంటే ఎన్నో నా జ్ఞాపకాలను కూడ తడుముకున్నాను.
భార్గవి రచనలో మరో ప్రత్యేకత ఉంది. తను పుస్తకం గురించి చెప్పి ఆపదు, రచయిత జీవిత విశేషాలు, వారి రచనా సందర్భం, వారి ఇష్టాయిష్టాలు వంటి కొన్ని వ్యక్తిగత విశేషాలు తనకు తెలిసినంత వరకూ పంచుకుంటుంది. దీనివల్ల మనకు ఆ పుస్తకంతో పాటు ఆ రచయిత కూడ ఆత్మీయుడైపోతాడు. భార్గవి అభిరుచిలోని గొప్పదనం తెలియడానికి ‘నా అభిమాన రచయిత్రి ఆర్. వసుంధరాదేవి’ అన్న ఒక్క వాక్యం చాలు.
భార్గవి రచయితల గురించి చెప్పిన విశేషాలన్నీ మనలో కొందరికైనా ముందే తెలిసివుండొచ్చు. కానీ తను సందర్భ శుద్ధితోనూ, తనదైన వ్యాఖ్యానంతోనూ వాటిని కలగలిపి చెప్పిన పద్ధతి చదవాలనిపించేట్టు ఉంటుంది. ఆమె కథలను చెబుతున్నపుడు కూడా కొందరిలా, విపరీతమైన వివరాల్లోకి వెళ్లి బోరు కొట్టించక, ఎంత చెప్పాలో అంతవరకే సంక్షిప్తం చేసి, తన వ్యాఖ్యనీ, ఆ కథ తనపై చూపిన ప్రభావాన్ని విపులంగా చెబుతుంది. ఇది చాలామంది వ్యాసకర్తలు నేర్చుకోవలసిన పద్ధతి. అలాగే తను పేర్కొన్న రచయితలు, పత్రికాధిపతుల ఫోటోలు సేకరించి ఆ కథనానికి తగినట్టుగా వేయడం, అప్పటి పత్రికలు, సంపాదకుల సమాచారం కూడ పొందుపరచడం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణలు.
నిన్నటి తరం రచయితలు మరోసారి తమ పఠనాప్రయాణాన్ని గుర్తు చేసుకోడానికీ, ఈ తరం పాఠకులు, రచయితలు ఏ రచయితలను విధిగా చదివితీరాలో తెలుసుకోడానికీ ఎంతో ఉపకరించే రచన ఇది. ఇంతా చేసి ఈ పుస్తకం కేవలం 85 పేజీల్లో ముగుస్తుంది. కానీ అందులోని సమాచారం మాత్రం అపురూపమైంది. విలువైంది. ఇంతకూ మామ్తో ఆపేయడం దేనికి? భార్గవి ఇప్పటికీ నిత్యం చదువుతూనే ఉంటుంది. కనక ‘నా చదువు కథ’ కు రెండు, మూడు భాగాలు కూడ చులాగ్గా రాసేయగలదు. రాస్తుందని, రాయాలనీ నేననుకుంటున్నాను.
(సారంగ వెబ్మ్యాగజైన్ సౌజన్యంతో ….)
