రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన భన్వారీదేవి ఒక సాధారణ మహిళ. “సాథిన”గా పనిచేస్తూ బాల్య వివాహాలను అరికట్టడం ఆమె బాధ్యతల్లో ముఖ్యమైనది.
1992లో ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నించినందుకు, ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
భన్వారీ ఒక దళిత మహిళ. ఈ ఘటన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఆమె మాట నమ్మలేదు. ఎఫఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. మహిళా సంఘాలు, ఉద్యమాలు బలంగా స్పందించాయి. అప్పుడే పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ విచారణల తర్వాత కేసు రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ భన్వారీకి తీవ్రమైన అన్యాయం జరిగింది. తీర్పులో జడ్జి చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలోని కుల, లింగ వివక్షను బహిర్గతం చేశాయి. “అగ్రకులస్తులు దళితులను ముట్టుకోరు, అత్యాచారం ఎలా జరుగుతుంది?” అనే తర్కంతో ఆమె ఫిర్యాదును అనుమానించడం. ఇది న్యాయస్థానం కాకుండా ఖాప్ పంచాయతీలా వ్యవహరించినట్లే అనిపిస్తుంది.
భన్వారీకి న్యాయం దొరకలేదు. కానీ అక్కడితో ఆమె కథ ఆగలేదు. జైపూర్లో పనిచేసే “విశాఖ” అనే సంస్థతో పాటు మరికొన్ని మహిళా సంఘాలు కలిసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ కేసు Vishaka vs State of Rajasthan – భారతదేశ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
జస్టిస్ వర్మ, జస్టిస్ సుజాతా మనోహర్ల బెంచ్ ఈ కేసును విచారించింది. విచారణలో, మహిళలు పనిచేసే చోట ఎదుర్కొనే లైంగిక వేధింపుల సమస్యను సమగ్రంగా అర్థం చేసుకుని, వాటి నివారణ కోసం “విశాఖ మార్గదర్శకాలు” రూపొందించారు.
1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్య నిర్ణయాలు:
– కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నిరోధించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు
– ప్రతి సంస్థలో ఫిర్యాదు కమిటీ ఏర్పాటు తప్పనిసరి
– మహిళల భద్రత యాజమాన్య బాధ్యతగా ప్రకటించారు.
ఇవే “విశాఖ గైడ్లైన్స”గా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో పనిచేసేచోట లైంగిక వేధింపులపై ఇదే మొదటి చట్టపరమైన స్పష్టతే కాక ఈ వేధింపులు ఎలా ఉంటాయో వివరంగా నిర్వచనం కూడా ఇచ్చారు. తర్వాత 2013లో వచ్చిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013కి ఇవే పునాది అయ్యాయి. భన్వారీ దేవి అనుభవించిన బాధ, వేదనకు న్యాయం జరగకపోయినా, అదే న్యాయవ్యవస్థ దేశంలోని లక్షలాది మహిళల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించింది. జస్టిస్ వర్మ వంటి జెండర్ స్పృహ కలిగిన న్యాయమూర్తుల వల్లే ఇది సాధ్యమైంది.
డిగ్నిటీ మార్చ్ – ఒక అనుభవం
2018లో జరిగిన డిగ్నిటీ మార్చ్లో దేశవ్యాప్తంగా 10,000 మంది లైంగిక హింస బాధితులు పాల్గొన్నారు. “అత్యాచారం చేసిన వాళ్ళే సిగ్గుపడాలి. మేమెందుకు దాక్కోవాలి?” అనే నినాదంతో ఈ మార్చ్ దేశమంతా సంచరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ మార్చ్కి భూమిక అండగా నిలిచింది. మేము అనేక మీటింగ్లు, పత్రికా సమావేశాలు నిర్వహించాం. బాధిత మహిళల గొంతుకను సమాజానికి వినిపించాం. దేశంలోని అనేక రాష్ట్రాల గుండా సాగిన ఈ మార్చ్ చివరకు ఢిల్లీకి చేరుకుంది. రాంలీలా మైదానంలో జరిగిన భారీ సభలో భన్వారీ దేవి పాల్గొని, వేలాది మహిళలకు ధైర్యం చెప్పింది. ఆ సభలోనే నాకు “డిగ్నిటీ మార్చ్ అవార్డు” ప్రకటించారు. ఆ అవార్డును భన్వారీ దేవి చేతుల మీదుగా స్వీకరించడం నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు.
ఒక సాధారణ సాథిన్గా ప్రారంభమైన భన్వారీ దేవి పోరాటం, భారతదేశంలో లక్షలాది మహిళలకు రక్షణ కలిగించే చట్టానికి పునాది వేసింది.
ఆమె సాహసం — ఒక చరిత్ర.
ఆమె పోరాటం — ఒక మార్గదర్శకం.
సలాం భన్వారీ దేవికి.
వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న ఆమెకు నా హృదయపూర్వక నమస్కారం.
