తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి

‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో! భగ్గున మండిందిరో’ అంటూ ఉరిమే మేఘమై, ఉరికే ఉప్పెనై, ఊరూ వాడా ఏకమై సాధించుకున్న తెలంగాణలో, ‘సాహిత్యానికి’ ఉన్న పాత్ర చాలా విశిష్టమైనది.
అంతకుముందు వరకు తెలంగాణ భాషను, యాసను కేవలం విలనిజానికి, ఒకరకంగా అవమానించే రకంగా మాట్లాడే పద్ధతికి మాత్రమే ఎన్నుకున్న తరుణంలో జరిగిన, ‘తెలంగాణ ఆవిర్భావం’ తెలంగాణ భాష, యాస మాధుర్యాన్ని అందరికీ చవిచూపించింది.

దానితోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముప్పయి మూడు జిల్ల్లాల్లో విస్తరించిన తెలంగాణ వైభవాన్ని, నలభై నాలుగు మంది తెలంగాణా మహిళామణుల గళం నుండి కలం ద్వారా వెలువడి, తెలంగాణ నారీశక్తికి ప్రతీకగా నిలబడిన వ్యాస సంకలనమే తెలంగాణా ప్రాభవాన్ని తెలిపే ఈ ‘తెలంగాణ వైభవం – మహిళా చైతన్యం’ గ్రంథమని చెప్పవచ్చు. తెలంగాణ వైభవం – మహిళా చైతన్యంపై వచ్చిన తొలి గ్రంథం కూడా బహుశా ఇదే అయి ఉండవచ్చును.
ఈ గ్రంథ సంకలన సారథి, కృతి స్వీకర్త తెలంగాణ సాహితీ ప్రపంచంలో పరిచయం లేని ప్రముఖ సాహితీవేత్త, విద్యా వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బండ సరోజన గారు.
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయాసి’ అని జన్మభూమిని మర్చిపోకుండా తెలంగాణలోని చెట్టును, పుట్టను, గట్టును గుర్తు చేసుకుంటూ ఈ తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగి, ఈ వాసనలన్నీ ఒళ్లంతా పులుముకున్న మనసున్న మహిళామణి నిరడంబరురాలైన డాక్టర్ బండ సరోజన గారు. సరోజన గారి కృషి ఫలితంగా వారి ఆకాంక్ష మేరకు, బలమైన నారీశక్తి అయినటువంటి రాజీవ (లక్ష్మీ వాసన్) చంటి ప్రసన్న కేంద్ర వ్యవస్థాపకురాలు, ప్రధాన సంపాదకురాలిగా, డాక్టర్ శారద హనుమాన్లుగారు సహా సంపాదకురాలిగా, తెలంగాణా ప్రతీకలైన కాకతీయుల తోరణాన్ని, చారిత్రిక కట్టడాలను, చార్‌మినార్‌లను ముఖచిత్రంగా వేసుకుని అందంగా ముస్తాబై వచ్చిందే ఈ వ్యాస సంకలనం. బండ సరోజన గారి కుమార్తె, కడారి అపర్ణగారి పలుకులతో ప్రారంభమైన ఈ వ్యాస సంకలనం, డాక్టర్ బండ సరోజన గారి అద్భుతమైన వాక్కులతో మొదలై ఆరోగ్యం సహకరించక పోయినా 60లో 20ల శ్రమిస్తూ ఉత్సాహపరిస్తూ, ప్రోత్సహిస్తూ దీనికి రూపం తెచ్చిన రాజీవ, ప్రముఖ రచయిత్రి డాక్టర్ శారద హనుమాన్ల గార్ల మాటలతో ముందుకు సాగింది. ఇది అద్భుతమైన గ్రంథంగా రూపుదిద్దుకోవడం కోసం నేపథ్యంలో కృషి చేసిన వారిలో చాలా ముఖ్యులు డాక్టర్ వంగరి త్రివేణిగారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రజనీవాసన్ గారు, కడారి అపర్ణ గారు, మేక రవీంద్ర గారు, బోడ నరేన్ గారు. ఇలా చరిత్రలో నిలిచి పోయే గ్రంథంగా రూపుదాల్చడానికి పనిచేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
తెలంగాణలోని ‘కుడుమంటే పండుగనే’ అమాయక మాయని మమతలను, మట్టి వాసనలను, ఆచారాల్ని, సంప్రదాయాలని, సంస్కృతిని, మహిళలకు ఇష్టమైన పసుపు కుంకుమలుగా ఒళ్లంతా పూసుకున్నట్లు తెలంగాణ చరిత్ర అంతటినీ ఐదు ప్రధాన అంశాలుగా తెలంగాణ వైభవాన్ని, శక్తి రూపిణులైన మహిళల గళాలని, కలాలుగా మలిచి విడుదల చేసిన చంటి ప్రసన్న కేంద్రం మేడ్చల్ తెలంగాణ వారు వెలువరించిన ఈ ‘తెలంగాణ వైభవం – మహిళ చైతన్యం’ అనే వ్యాస సంపుటి నిజంగా తెలంగాణ చరిత్రకు ఒక గీటురాయిగా నిలబడుతుంది అనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నేపథ్యంలో వచ్చిన శ్రేష్టమైన సంపుటులలో ఈ సంపుటికి అగ్ర తాంబూలమే! సంకలనంలోని అంశాలు: ఇందులోని విషయాలు ఐదు అంశాలుగా క్రోడీకరించారు. తెలంగాణ చరిత్ర మైలురాళ్ళు, తెలంగాణా నారీ శక్తి, తెలంగాణ సంస్కృతి – పండుగలు, తెలంగాణ కట్టడాలు – ప్రాచీన చరిత్ర, తెలంగాణ ముఖ్య వనరులు. మొత్తం 44 మంది రచయిత్రుల అద్భుతమైన కళా సృష్టి ఈ తెలంగాణ వైభవం- మహిళా చైతన్యం.
ముఖచిత్రం: తెలంగాణ ప్రతీకలైన కాకతీయ తోరణం, ప్రపంచ ప్రఖ్యాత రామప్ప శిలా వైభవం, గోల్కొండ కోట, చార్మినార్, తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన బతుకమ్మ, బోనాలు అన్నింటినీ కలగలుపుకున్న ముఖచిత్రాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయంగా చేయి పెట్టి ఆ గ్రంథాన్ని తడమాలనిపిస్తుంది. అలా తడిమిన మరుక్షణం చేయి నుండి విద్యుత్ నర నరాల్లో పాకినట్టుగా ఆ పుస్తకం పైన ఏమ్బోసింగ్ చేతికి అద్భుతంగా తగిలి నిజంగానే ఆ ప్రదేశాలలో మనం ఉన్నట్లుగా ఒకలాంటి తాదాత్మ్యం నరనరాన పాకుతుంది అనడంలో సందేహం లేదు. అందుకేనేమో తెలంగాణ మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయిన సీతక్క గారు కూడా తమ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణపై తన అభిమానాన్ని నరనరాన నింపుకున్న నారీశక్తి అయిన రాజీవ గారు దీనిని ముందుకు నడిపించి పుస్తక రూపం రావడానికి చేసిన కృషి అనన్య సామాన్యం. తెలంగాణ చరిత్ర మైలురాళ్లు అంశంలో ‘అస్మకుల మొదలు శాతవాహనుల వరకు’ స్త్రీ సాధికారతపై ప్రముఖ విద్యావేత్త సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న డాక్టర్ శారద హనుమాన్లు గారు వ్రాసిన వ్యాసం పుస్తకానికి మకుటాయమానమై నిలిచింది. అశ్మకులు భారతదేశంలోని మహాజనపదాల్లో ఒకటి అంటూ వారి సామాజిక జీవనం, వారి మాట, మతాచారాల గురించి, సాంస్కృతిక విశేషాల గురించి, అప్పటి భాషా సాహిత్యము, ఉత్సవాలు, ఆచారాలు, విద్య ఎలా ఉండేది అని చాలా వివరంగా తెలిపారు. అప్పట్లో కేవలము వేదమంత్రాలు బ్రాహ్మణ వంశానికి చెందిన స్త్రీలు మాత్రమే నేర్చుకునే అవకాశం ఉండేది. అప్పటి స్త్రీలు సంగీతం, నృత్యం, ఆభరణము, వస్త్రం ఇలాంటి వాటిలలో వారి ప్రతిభను చూపించే వారిగా ఉండే వారని, పరిపాలనలో కూడా భాగస్వామ్యం రాణులకు ఉండేదని, చారుమతి గురించి ఆమె అస్మకరాజకుమారిగా అభివర్ణిస్తూ, మౌర్యుల కాలంలో తెలంగాణలో మహిళల స్థానం గురించి, శాతవాహన యుగం గురించి, మలయావతి, శాతవాహన రాజు శాతకర్ణి భార్య గురించి, గౌతమపుత్ర శాతకర్ణి గురించి మొత్తం విపులంగా తన వ్యాసంలో తెలిపారు. కాకతీయులనాటి శాసనాలు అందులో స్త్రీల పాత్ర గురించి మనము చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకుంటే లాభమేంటి అనే విషయాలన్నింటిని చర్చిస్తూ రాసిన డాక్టర్ భిన్నూరి మనోహరి గారి వ్యాసం ఆద్యంతం మంచి విజ్ఞానదాయకంగా ఉంది. అందులో మైలమాంబ, కుందమాంభ, రుద్రమదేవి, కోట గణపాంబ, కుప్పాంబిక, నాగాంబిక, మైలాంబిక గురించి మొత్తం కాకతీయ కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న విషయాన్ని సవివరంగా వ్యాసంలో పొందుపరిచారు.
వై సుజాత ప్రసాద్‌గారు కాకతీయ రాజుల పరిపాలన, మొదటి రాజు బేతరాజు మొదలుకొని స్థాపించిన సంవత్సరము, కాకతీయను ఏలిన పాలకులు, పరిపాలించిన ఆయా కాలాల్లో జరిగిన విషయాలు సూక్ష్మంగా తెలిపారు. అప్పటి రాజకీయ చరిత్రలో ఆలయాల నిర్మాణాలు, సంస్కృతి సంప్రదాయాల వివరాలు, కళా పోషణ, అప్పటి గుట్టలపై, శిల్పాలపై నిర్మించిన అశేష శిల్ప సంపద గురించి పూర్తి వివరాలను సూక్ష్మంగా ఇప్పటికీ మనకు ప్రత్యక్ష నిదర్శనలుగా ఉన్న ఆలయాలను గురించి వివరిస్తూ సాగింది. ఇందులో ఓరుగల్లు కోటను ఏకశిలా నగరం అని ఎందుకంటారు? అక్కడి విగ్రహాలు, అక్కాచెల్లెళ్ల బావి, కుష్మహలు, హవా మహలు కాకతీయుల కాలంలో స్థాపించిన, కట్టించిన పద్మాక్షమ్మ గుడి, రుద్రేశ్వరాలయం, వేయి స్తంభాల గుడి వివరాలు చదువుతుంటే కళ్ల ముందు మనకు ఓరుగల్లు కోట సజీవంగా కథలాడుతుంది అనడంలో సందేహం లేదు.
డాక్టర్ మామిడాల శైలజ గారిది పరిచయం అవసరం లేని పేరు తెలంగాణలో సాహిత్యంలో. కుతుబ్షాహీల కాలంలో స్త్రీల యొక్క చారిత్రక విశ్లేషణ గురించి వ్రాస్తూ అప్పటి మతపరమైన నియమాలు, పరదావ్యవస్థ, ఘోష పద్ధతి, రాజ కుటుంబానికి చెందిన స్త్రీల యొక్క విద్య వివరాలు, కుతుబ్షాహీల వంశంలోని మహిళల యొక్క పాలన వ్యవహారాల్లో రాజకీయాలలో వారి పాత్ర ద్వారా వారి అలంకారీక విద్యలు, వారితో పోలిస్తే సాధారణ స్త్రీలకు ఉండే వ్యత్యాసాలు మరియు విద్యా సాహిత్య రంగాల్లో స్త్రీల యొక్క పరిస్థితులు, అప్పుడు ఉన్న భాషలు, అప్పటి కాలంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీలకు అందించే విద్యల గురించిన వివరాలు, అప్పటి కాలంలో మహిళల యొక్క పాత్ర, సంగీతం, నాట్యం, చిత్రకళ లాంటి అనేక లలిత కళలలో స్త్రీల యొక్క పాండిత్యం గురించిన వివరాలు స్త్రీల పైన మతపరమైన పరిమితులు, వారి యొక్క మతపరమైన నియమాలు, సామాజిక పరిమితులు, ముస్లిం స్త్రీల పైన మతపరమైన నియమాలు, హిందూ స్త్రీలపై నుండి సంప్రదాయపు పరిమితులు, మతేతర ధోరణులు, ప్రముఖ కుతుబ్షాహీ మహిళల యొక్క జీవితం, వారి పాత్రలు చరిత్రలో ఎంత గుర్తింపు పొందాయో అందులో ముఖ్యమైనటువంటి వారైనా బేగ్ మల్కా బేగం, తాహిరా బేగం, సుల్తానాల పేర్లు చరిత్రపుటల్లో పేర్లు నిలిచిపోకపోయినా కళ పరిపూర్ణంగా ప్రదర్శించి కళా పోషణ చేసిన కళాభిమానులైన అనేక మంది స్త్రీల యొక్క చిత్రణ ఇందులో మనకు కనబడుతుంది.
ఇందులో రజాకార్ల ధమనకాండ స్వయంగా చూసిన డాక్టర్ బండ స్వీయ అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. పీనుగుల పెంటగా మార్చిన ఊరి గురించి ఆమె వ్రాసిన అనుభవాలు చదువుతుంటే చెమ్మగిళ్ళని కన్ను ఉండదంటే అతిశయోక్తి కాదు. అనుభవాలన్నీ మనల్ని అప్పటి రజాకార్ల యొక్క దమనకాండలను కళ్ళ ముందు సజీవంగా కదలాడేలా చేస్తాయి.
ఇక స్వయంశక్తితో పైకి వచ్చిన ఆచార్య వంగరి త్రివేణి గారి వ్యాసాలు పరిశీలిస్తే బైరాన్ పల్లి వీరభైరాంపల్లిగా నిలిచిపోయిన చరిత్ర, దానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన డాక్టర్ బండ సరోజనగారి వ్యాసం అత్యంతము ఒళ్ళు గగుర్ పొడిచేలా చేస్తుంది. బ్రిటిష్ కాలంలోని తెలంగాణ స్త్రీ విద్య గురించి డాక్టర్ వంగరి త్రివేణి గారు ఆమూలాగ్రహం కూలంకషంగా చర్చించారు. తెలంగాణ స్త్రీల సంస్కరణ, ఉద్యమాల గురించి కొల్లాపురం విమలగారు చెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ అని, స్త్రీవాద ఉద్యమాల నేపథ్యాల గురించి తెలిపారు. డాక్టర్ అరుణ పరంథాములు గారు తెలంగాణ రావడంలో తెలంగాణ ఉద్యమంలోని మహిళ పాత్ర అందులో సాహిత్యం ద్వారా తెలంగాణను ఉత్తేజపరిచిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఉత్తేజపరిచిన మహిళామణుల యొక్క కృషిని చక్కగా అక్షరీకరించారు. రాజీవ్ గారు స్వతంత్ర తెలంగాణ మహిళ గురించి, మరియు తిరునగరిదేవికి దేవి గారు తెలంగాణ పోరాట నవలలలో స్త్రీ చైతన్యం గురించి, జ్వలిత గారు తెలంగాణ సాహిత్యంలోని మహిళ గురించి చక్కగా తెలిపారు.
తెలంగాణ నారీ శక్తి గురించి, రాణి రుద్రమదేవి, రణచండికా అంటూ కొలిపాక శోభా రాణి గారు, తెలంగాణకి ఎంతో కీర్తి తెచ్చిన పోరాట మహిళా మణులు సమ్మక్క సారమ్మల గురించి బండి ఉష గారు మరియు వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర గురించి డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ గారు, విప్లవంలో నిప్పుకణికలా మెరిసిన మల్లు స్వరాజ్యం గారి గురించి బండారు సునీత గారు, రాణి శంకరమ్మ గురించి రంగరాజు పద్మజ గారు, పోరాట తేజమైన ఆరుట్ల కమలాదేవి గారి గురించి ఎస్కే సలీమా గారు, సంఘసంస్కర్త అయిన ఈశ్వరీబాయి గురించి వసంత లక్ష్మణ్ గారు, వీరవనిత అయిన లక్ష్మీబాయి గురించి డాక్టర్ కే పద్మా రాణి గారు, సదాలక్ష్మి ఉద్యమ పోరాటం గురించి డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారు, డాక్టర్ కొండా శకుంతలా దేవి గారి గురించి లావణ్య గంగుల గారు, తెలంగాణ గురించి యశోద రెడ్డి గారి గురించి డాక్టర్ దాసోజు పద్మావతి గారు అలుపెరుగని అమృతమూర్తి తెలంగాణ నారిశక్తిలో పొందుపరిచారు.
తెలంగాణ సంస్కృతి పండుగలు బోనాలు, బతుకమ్మ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతటి పాత్ర ఇంతటి ప్రముఖ పాత్రను వహించే అందరికీ తెలుసు. అలాంటి జానపద కళారూపాలలో స్త్రీ చైతన్యం గురించి కొండపల్లి నిహారిణి గారు, డాక్టర్ ఆదివాసి దండాల యొక్క సంస్కృతి గురించి రావుల కిరణ్మయి గారు, బోసంగి మహిళా సంస్కృతి సాహిత్యాల గురించి డాక్టర్ గంధం విజయలక్ష్మి గారు, బతుకమ్మ రాష్ట్ర పండుగ విశిష్టత గురించి డాక్టర్ ఆర్ కమల గారు, రాష్ట్ర పండుగ బోనాల గురించి డాక్టర్ కందిపి రాణి ప్రసాద్ గారు, పెద్ద దేవుడైన ఇంటింటి దైవమైన దుర్గమ్మ తల్లి గురించి నామని సుజనా దేవి గారు తెలంగాణ యొక్క పంటల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేశారు.
తెలంగాణ కట్టడాలు: ప్రాచీన చరిత్రలో హైదరాబాద్ అనగానే గుర్తు వచ్చే చార్మినార్ గురించి నాంపల్లి సుజాత గారు, హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియం గురించి సుజాత తిమ్మన గారు, కాకతీయుల వైభవాలను ఓరుగల్లు కీర్తిని తెలిపి వేయి స్తంభాల గుడి గురించి సరిగమల ఒడి అంటూ చెప్పిన చంద్రకళ దీకొండగారు, ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందిన రామప్ప దేవాలయం గురించి శాంతా రెడ్డి గారు, స్వయంభూ దేవాలయాల గురించి గిరిజ పైడిమర్రి గారు, మన్యంకొండ పుణ్యక్షేత్రం సంధ్యా సూత్రావే గారు, శారదా పీఠం బాసర సరస్వతి గురించి డాక్టర్ సాయి లక్ష్మి గారు, శ్రీకరం శుభకరం శ్రీ విద్యాపురం గురించి అరుణ ధూళిపాల గారు, ఉరిమిల్ల సునంద గారు జోగులాంబ శక్తి పీఠం గురించి, వనజ గారు ప్రఖ్యాతి చెందిన భద్రకాళి ఆలయం గురించి 33 జిల్లాల ప్రత్యేకతల గురించి రజనీవాసన్ గారు మొత్తం తెలంగాణ గురించి వివరించారు.
తెలంగాణ ముఖ్య వనరులైన జల వనరుల గురించి, పర్యావరణ పచ్చదనం గురించి చేనేత పరిశ్రమ గురించి చాట్ల విద్యుల్లత గారు, డాక్టర్ విజయశ్రీ గారు, బండారి సుజాత గార్ల వ్యాసాలతో ముగించడం చాలా బాగుంది. ఈ పుస్తకంలో ఆయా కళాఖండాలకు సంబంధించిన వేయి స్తంభాల గుడి చిత్రపటాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాల యొక్క చిత్రపటాలను ఇందులో పొందుపరచడం వల్ల తెలంగాణ వాళ్లకు కాకుండా ఇతరప్రాంతాల వారికి కూడా ఆ చిత్రాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పించారు. ‘అద్దం ఎట్లాగైతే అబద్దం చెప్పదో, ఇందులోని వ్యాసాలన్నీ కూడా అద్దంలా ఆయా ప్రత్యేకతలను చూపించాయి.
అదుగో అంటే ఆరు నెలలు అన్న సామెత ఇక్కడ కుదరదు. ఎందుకంటే శారదా హనుమాండ్లు గారు దీక్షగా ఒక యజ్ఞంలా ఈ సంకలనాన్ని పూర్తీ చేయడమే కాదు. ఆవిష్కరణ రోజు డా. బండ సరోజనమ్మ గారు చీరల వితరణ, రాజీవ గారు బాగ్ కూడా రచయిత్రులకు ఇవ్వడం విశేషం. ‘అన్నం పెడ్తే అరిగిపోతది. చీర బెడితే చినిగి పోతది. కాని అక్షరం అలికితే అక్షరలక్షల పంటలొస్తాయి’, అని ఈ సంకలనం నిరూపిస్తుంది. ‘అమ్మవారి మొక్కు తీరది, ఆడబిడ్డ అప్పు తీరది’ అన్నట్లు తెలంగాణా ఆడబిడ్డ ప్రతీ గడపకి ఎంత ముఖ్యమో, తెలంగాణా సొగసులను అద్దుకున్న ఈ సంపుటి ఋణం కూడా ఈ తెలంగాణాకు తీరనిదే. ఇదే సంపుటి త్వరలో
ఇంగ్లీష్ లోకి కూడా అనువదించబడి (ఇప్పటికే అనువాదం పూర్తయింది) విశ్వవ్యాప్తం కానుండడం విశేషం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.