వాసిరెడ్డి సీతాదేవి

పి.సత్యవతి
స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రులలో ఒకరైన సీతాదేవి నవలారచయిత్రిగా ప్రఖ్యాతి పొందినప్పటికీ 1952లో రచన ప్రారంభించిందికథల తోనే. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఘోషా పాటించే కుటుంబంలో పుట్టి రోడ్డుదాటి పాఠశాలకు వెళ్లడానికి ఆడపిల్లలకు అనుమతి లేక, ప్రయాణించే ఒంటెద్దు బండీకో గుర్రం బండికో పరదా కట్టుకోడం తప్పనిసరి అయిన కాలంలో వీధి బడిలో అయిదవ తరగతి వరకే చదువుకుని ఆపైన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మగారు ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఒక సంవత్సరం మాత్రమే నడిపగలిగిన పాఠశాలలో హిందీ నేర్చుకుని స్వయంగా చదివి విశారద పాసై ఒంటరిగా మద్రాసులో సనాతన ధర్మ కన్యా పాఠశాలలో ఉద్యోగంతో మొదలుపెట్టి, హిందీలో అత్యున్నత పట్టమైన సాహిత్య రత్నేగాక ఎస్సెస్సెల్సీ దగ్గరనుంచీ ఎం.ఎ. వరకూ ప్రయివేటుగా చదువుకున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా చేశారు. హిందీ విద్యాలయంలో పనిచేసే రోజుల్లో నాటకాల్లో వేసి బహుమతులు కూడా  తెచ్చుకున్నారు. కొన్ని నాటకాలు డైరెక్ట్‌ కూడా చేశారు, యూడీసీగా ప్రభుత్వోద్యోగంలో చేరి జవహర్‌ బాలభవన్‌ డైరక్టర్‌గా పదవీ విరమణ చేసిన సీతాదేవిది అలుపెరగని జీవన ప్రయాణం, దానితో పాటు సాహితీ ప్రయాణం.. ఉద్యోగంలో ఊపిరి సలపని పని ఉన్నా కొన్ని సమస్యలెదురైనా ఆరోగ్యం ఇబ్బందిపెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచి సాహిత్య సృష్టి కొనసాగించారు.. 39 నవలలతో పాటు దాదాపు వంద కథల వరకూ తొమ్మిది కథాసంపుటాలుగా ప్రచురించారు…ఆ కథలన్నీ ఇప్పుడు దొరకక, పోయినేడాది సీతాదేవి సాహిత్యాన్ని అయిదు సంపుటాలుగా ప్రచురించిన విశాలాంధ్ర ఒక యాభై కథలను ఒక సంపుటంగా వేశారు. ఆమె వ్రాసిన మంచికథలు దాదాపు అన్నీ ఇందులో ఉన్నాయి. రచన ప్రారంభించిన 50 లలోనే ఆమె దాదాపు 15 కథల దాకా వ్రాసి 54 లోనే వాసిరెడ్డి సీతాదేవి కథలు అనే కథా సంపుటి ప్రచురించారు. రచయితల సమగ్ర కథా సంపుటులు ప్రచురించేటప్పుడు, ప్రచురణకర్తలు కొన్ని కనీసపు అలవాట్లు చేసుకుంటే బాగుంటుంది… కనీసపు అలవాట్లలో ముఖ్యమైనది కథలని కాలానుక్రమంలో (క్రానలాజికల్‌).. వెయ్యడం… విశాలంధ్ర వారి సంపుటిలో సీతాదేవి గారి మొదటి కథ చివర్లోనూ రెండవ కథ మధ్యలోనూ, మధ్యెప్పుడో వ్రాసిన కథ మొదట్లోనూ ఉండి ఆమె కథా రచనలో, తీసుకున్న వస్తువులో వచ్చిన పరిణామాలను తెలుసుకోడానికి ఒక పట్టిక తయారు చేసుకోవలసి వచ్చింది.
సీతాదేవి కథలెక్కువగా సమాజపు అంచులలో జీవించేవారి గురించి చింతనతో వుంటాయి. ఆమె తొలికథ ”సాంబయ్యపెళ్లి”లో ”కురూపీ, అష్ట దరిద్రుడూ” అయిన సాంబయ్య ఒకింట్లో జీతానికి వుంటాడు. చిన్నప్పుడే మశూచి సోకి మొహమంతా చెదలు తిన్నట్లయి పోవడమే కాక ఒక కన్ను కూడా కాయ కాసిపోయింది.. అతన్ని చూసి అసహ్యించుకునే వారే కానీ రవ్వంత ప్రేమగా మాట్లాడే వారే లేరు. అటువంటి సాంబయ్యకి పెళ్ళి కుదిరింది. పిల్ల మేనమామ వచ్చి తన మేనకోడల్ని ఇస్తానని చెబుతాడు. ఇన్నాళ్ళకు తనకో తోడు దొరుకుతున్నందుకు సంబరపడ్డాడు. ఆ విషయమే యజమానురాలికి చెబితే పది రూపాయలు చేతిలో పెట్టి ”పిల్ల కుంటిదో గుడ్డిదో కాదుకదా? అని అతని గుండెలో ఒక ముల్లు గుచ్చింది.. తన భార్య గుడ్డిదైనా ఫరవాలేదు తనను చూడదు కనుక అసహ్యించుకోదు అనుకుంటాడు సాంబయ్య… చివరికి  మూగపిల్లని తెలిసి కోపంతో బయటికి గెంటి తలుపేస్తాడు. తన దురదృష్టాన్ని, తనకు జరిగిన మోసాన్ని తలుచుకుని ఏడుస్తాడు. తరువాత తనలాగే పరమ పేదదైన ఆ దురదృష్టవంతురాలిని అక్కున చేర్చుకుంటాడు… ఆమె రెండవ కథ ”ధర్మదేవత గుడ్డికళ్లు”లో ఒక పేద దంపతులు తగాదా పడి కొట్టుకుని తిట్టుకుంటుంటే చూపరులు పోలీస్‌ రిపోర్ట్‌ ఇచ్చి కొట్టే భర్తని అప్పగిస్తారు. ఇలాంటి హింస మధ్యతరగతిలో కూడా వుంటుంది కానీ అది మూసిన తలుపుల వెనక జరుగుతుంది. ఈ దంపతుల జీవితం తలుపులు లేని రోడ్డుమీద కనక అంతా బాహాటమే.. జైలుకు వెళ్ళిన భర్తా, ఇంటి దగ్గర భార్యా పశ్చాత్తాపంతో ఒకళ్లకోసం ఒకళ్ళు ఎదురుచూస్తారు. జైలులో అతనికి ఒక విప్లవకారుడు భార్యని కొట్టడం తప్పు అని చెబుతాడు. అప్పటివరకూ భార్యల్ని కొట్టడం సహజమేననుకుంటున్న అతను ఇంక కొట్టకూడదని నిర్ణయించు కుంటాడు. మరొక కథ ”ఎల్లమ్మ తెల్ల రూపాయి” లో నెల్లూరు జిల్లానించీ మద్రాసుకు వచ్చి భోజనం కారేజీలు అందించి జీవనం సాగించే ఎల్లమ్మ ఆ క్యారేజీల్లో మిగిలిన అన్నాన్ని కూడా ముద్దలు చేసి బేడకీ పావలాకీ అమ్మి ఒక రూపాయి కళ్ళజూస్తుంది. అన్నం మిగలని రోజు రూపాయి వుండదు, క్యారేజీలు తెప్పించుకున్న వాళ్ళిచ్చే జీతమే. ఎల్లమ్మ దగ్గరకు ఒకనాడు పిచ్చివాలకంలో వున్న ఒకస్త్రీ అమిత ఆకలితో వచ్చి ఆమె దగ్గరున్న అన్నాన్ని ఆబగా తింటుందే కానీ డబ్బులివ్వదు. ఆమె జుట్టు పట్టుకున్న ఎల్లమ్మ ఆమె పరిస్థితీ, ఆమె ద్వారా తన ఊళ్ళో తన భర్త చనిపోయిన విషయమూ తెలుసుకుని తన మెళ్ళో వున్న చింతాకంత బంగారపు మంగళసూత్రం ఆమెకిచ్చి ఆమె భర్త బ్రతికే వున్నాడుకనుక వేసుకోమంటుంది. కానీ తన మొగుడే తాళితెంపి పొమ్మన్నప్పుడు ఇంక ఎందుకది అని ఎల్లమ్మకో సలహా ఇస్తుంది. అది అమ్ముకుని వ్యాపారం చేసుకోమని, అందులో ”లాజిక్‌” అర్థమైన ఎల్లమ్మ ఆ స్త్రీని కూడా తనతో వుండమనీ ఇద్దరం కలిసి అన్నం ముద్దల వ్యాపారం చేసుకుందామనీ తన గుడిసెలో చోటిస్తుంది. ఇప్పటికీ తాళి పవిత్రీకరణ సిండ్రోమ్‌ నించీ బయటపడని ప్రసార మాధ్యమాలకి,. 1953లోనే తాళి గురించి ఇలాంటి ”లాజిక్‌” వాడారు సీతాదేవి.., పురుషుడు తన్ని తగిలేసినా స్త్రీలు ఒకరికొకరు అండగా నిలిచి బ్రతకగలరనే భరోసాని ఈ కథ అర్థం చేయిస్తుంది.
”ఏడుకొండలవాడు” అనే కథలో వెంకాయి, ”మెలికెల కడియాలు” అనే కథలో రామిగాడు, ”నా కథ వ్రాయవూ”లో లక్ష్మి, ”చిచ్చుబుడ్డి” కథలో పోచయ్య.. వీరంతా భూస్వాముల చేత దగాపడ్డ వారే.. మెలికల కడియాలులో రామిగాడు, నా కథ వ్రాయవూలో లక్ష్మి తన తోటి వారి చేతకూడా మోసగింపబడతారు. చిచ్చుబుడ్డి అనే కథలో తన కొడుకు వెలిగించిన అటంబాంబు పేలకపోతే పెదజీతకాడైన పోచయ్య కొడుకు (చిన్నజీతగాడు) యాదగిరిని వెళ్ళి చూడమన్నాడు యజమాని భూషయ్య… దగ్గరకు వెళ్ళిన యాదగిరి మీద పేలిన ఆటంబాంబు అతని చావుకి కారణమైంది. అయినా ఆ ఇల్లు వదలక కొడుకు స్మృతులతో బ్రతుకుతున్నాడు పోచయ్య. సంవత్సరం తిరిగి మళ్ళీ దీపావళొచ్చింది. ఈ సారి వెలగని చిచ్చుబుడ్డి దగ్గరకు మరో చిన్న జీతగాడు నరిసింహను పంపుతున్నాడు భూషయ్య, అతన్ని వెనక్కి నెట్టి తను బలయ్యాడు పోచయ్య.. ఎవరి ప్రాణాలు ఖరీదో ఎవరివో చౌకో ఖామందులకి తెలిసినట్లు ఎవరికి తెలుస్తుంది కనుక!!
స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దాలలో ఆంధ్రదేశంలో వస్తున్న మార్పుల్ని, స్వామివార్ల ఆశ్రమాలలో జరిగే దుష్కృతాలను, ఉద్యోగినులెదుర్కొనే సమస్యల్ని, మూఢనమ్మకాలను గురించి, భర్తల హోదాలను బట్టి అతిశయం పెంచుకునే అజ్ఞానులైన స్త్రీలగురించి కొన్ని మానసిక సమస్యల గురించి వ్రాసిన సీతాదేవి, స్త్రీలపేరుతో కథలు వ్రాసే వారి మీద, దెయ్యాల కథలు వ్రాసేవారిమీద, రాజకీయాల మీద, వ్యంగ్య రచనలు కూడా చేశారు. ”అమ్మమ్మ చెప్పని కథ” అనే వ్యంగ్య హాస్య కథ కూడా రచయితల మీదే.. ”తరాలు అంతరాలు”, ”మారిపోయిన మనిషి” అనే కథల్లో భూస్వామ్య విలువల నించీ అప్పుడప్పుడే బయటపడుతున్న సమాజాన్ని చిత్రించారు. ”తరాలు అంతరాలు” కథలో ఇరవై సంవత్సరాలలో తన వూరిలోనూ అక్కడి స్త్రీల జీవితాల్లోనూ వచ్చిన మార్పుని అర్థం చేసుకుంటూ మరొక ఇరవై సంవత్సరాలలో స్త్రీలు చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకుని ఒకరి వ్యక్తిగత జీవితాలలో ఒకరు కల్పించుకోకుండా సఖ్యంగా జీవించగలరని ఆశిస్తుంది… తన నాయనమ్మను ఆమె అత్త పెట్టిన కష్టాలతో పోల్చుకుంటే ఆమె తన తల్లిని పెట్టిన కష్టాలు చాలా స్పల్పమైనవి.. ఇప్పుడు తన తల్లి ఆమె కోడలు తనను లక్ష్య పెట్టలేదని బాధపడుతున్నది. మగవాళ్ళతో సమానమైన తిండికి కూడా నోచుకోని తరం ఒకటి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, చదువుని, కలలో కూడా ఊహించని తరం ఒకటి, చదువుకోసం పోరాడిన తన తరం ఒకటి కాగా అప్పుడు ఆమె అన్న పిల్లలు పొరుగూరికి పోయి చదువుకుంటున్నారు మగపిల్లల్తో సమానంగా.. ఇరవై ఏళ్ళల్లో వూరు అనూహ్యంగా మారింది. పూర్వం స్త్రీలు ఊసుపోక కబుర్లతో పరస్పరం జుట్లు పట్టుకుంటూ వుండేవారు. ఇప్పుడు పత్రికలు చదువుతున్నారు. మహిళా మండళ్ళు పెట్టుకుంటున్నారు. ”ఈనాడు చదువుకుంటున్న పిల్లలు రేపు కోడళ్ళు, ఎల్లుండి అత్తలూ అవుతారు. వాళ్ళూ అత్తలయ్యేప్పటికి అత్తా కోడళ్ళు వొకరి వ్యక్తిగత విషయాలలో ఒకరు పట్టించుకోకుండా ఒకర్నొకరు అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నించవచ్చును” అనుకుంటుంది. ”మారిపోయిన మనిషి” కథలో శేషయ్యది జమీందారీ కుటుంబం. అతని తాత ఊళ్ళో ఒక దేవాలయం కట్టించాడు. ఒక సత్రం తవ్వించాడు. ఒక నుయ్యి తవ్వించాడు. ఒక మర్రి చెట్టు కూడ నాటించాడు. శేషయ్య తండ్రి దాన ధర్మాలకు పదిహేనెకరాల సుక్షేత్రమైన మాగాణి కర్పూర హారతిచ్చాడు. శేషయ్యకూడా ఉడతా భక్తిగా మిగిలిన పదెకరాలూ ఖర్చుచేసి వంశప్రతిష్ఠ నిలబెట్టి ఒక అర్థ శతాబ్దం హాయిగా కాలక్షేపం చేసాడు. ఇప్పుడతనకి మిగిలింది ఇల్లు మాత్రమే… పైగా అప్పులతో పాటు కూతురు పెళ్ళి సమస్య ఒకటి. ఇంట్లో వెండి బంగారం, చెంబు తప్పేలా కూడా మాయమై పోతున్నై. ఆ పరిస్థితిలో అతని భార్య రామ సుబ్బమ్మ ఇడ్డెన్ల వ్యాపారం చేసి ఇల్లు గడిపి కూతురికి పెళ్ళి చెయ్యాలనే నిర్ణయానికొచ్చింది. అది తన వంశ ప్రతిష్ఠకి భంగమని శేషయ్య ఆమె మీద చెయ్యెత్తాడు. అయినా గానీ ఆమే తన మెడలోని నల్లపూసల గొలుసమ్మి ఆ డబ్బుతో మినప్పప్పు బియ్యమూ ఇడ్లీ పాత్రా కొనాలని దాచింది. భార్య ఇడ్డెన్ల లమ్మడం అవమానమని భావించిన శేషయ్య ఆ డబ్బు తీసుకుని కాశికి పోయి అక్కడ గంగలో దూకి చనిపోవాలని వెళ్ళి పోయాడు. కానీ కాశీలో పోలీసులతన్ని దొంగగా అనుమానించి జైల్లో పెట్తారు. జైలు జీవితం అతని ఆలోచనల్లో మార్పు తెచ్చింది. శిక్ష పూర్తై ఇంటికొచ్చేసరికి రామ సుబ్బమ్మ ఒక హోటల్‌ నడపటమే కాక కూతురికి పెళ్ళి చేసి అల్లుడిని కూడా తన హోటల్‌ లోనే సహాయంగా వుంచుకుంటుంది. అంతవరకూ భౌతికంగా గాని మేధోపరంగా గాని శ్రమపడకుండా కూర్చుని తినడానికి అలవాటుపడ్డ మగవాడు పరువు పేరుతో పలాయనం చిత్తగిస్తే సంసార భారాన్ని నెత్తినేసుకున్న స్త్రీలు ఆరోజుల్లో ఎక్కువ కనిపించేవారు. బ్రతికి చెడ్డ కుటుంబాల నించీ అప్పటివరకూ నాలుగు గోడలమధ్య వున్న స్త్రీలు బయటకొచ్చి సంపాదించడం మొదలౌతున్న వైనం ఈ కథ..
భక్తి ఇబ్బడి ముబ్బడిగా పొంగిపోయిన డ్రయిన్‌లా ప్రవహిస్తూన్న తరుణంలో ఆ ధోరణిని ఉపయోగించుకుని డబ్బూ గ్లామరూ పది చేతులతో జుర్రుకుంటున్న స్వామివార్ల ఆశ్రమాల్లో జరిగే అరాచకాలను, ఆశ్రమాల మీద పట్టుకోసం అంతర్గత పోరాటాలనూ స్వాముల శృంగారం భక్త స్త్రీల పట్ల ప్రాణాంతకంగా మారడం మామూలు కథే.. అయితే ఎప్పుడైనా ఆత్మసాక్షాత్కారం కలిగి తమ తప్పు ఒప్పుకునే స్వేచ్ఛ స్వాములకి వుండదు. వాళ్ళు తమ పరువు ప్రతిష్ఠలకి బందీలు. స్వామి తప్పు చేస్తే ఆశ్రమానికే చెడ్డపేరొస్తుంది ఆదాయానికి గండి పడుతుంది. కనుక స్వామి వారికి మతిచలించిందని పిచ్చాసుపత్రికి పంపడం ఒక్కటే మార్గం. ”సత్‌ చిత్‌ ఆనంద్‌”, ”ధర్మాసనం” అనే రెండు కథల్లో ఆశ్రమ వాతావరణాలను కళ్లకి కట్టించారు సీతాదేవి. మూఢ నమ్మకాలపై గ్రహబలం కథ వ్రాసినట్లె ఆ మూఢనమ్మకాన్ని కూడా బ్రతుకు చక్క బెట్టుకోడానికి వాడుకున్న తెలివైన అమ్మాయి కథ ”గణాచారి”… పల్లెల్లో గణాచార్లకి చాలా విలువ వుంటుంది. ఆ పూనకాన్నీ అది వచ్చినప్పుడు జనాలు పోసే బిందెలకొద్దీ నీళ్ళనీ తట్టుకోగలిగితే గణాచారి పేరుమీద ఏ కార్యమైనా సాధించవచ్చు.. ఇరవై ఏళ్లకే భర్త పోయిన మంగమ్మ తన నోటి బలంతో బంధువుల బారినించి ఆస్తిని కాపాడ్డమే కాకుండా తన కొడుకుని మాటజవదాటకుండా కొంగుచాటున పెంచింది… అట్లా పెరిగిన చలపతి స్వయంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని వాజమ్మలా తయారయ్యాడు. అతనికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది. కానీ వియ్యంకుడు భద్రయ్య అల్లుడికిస్తానన్న పొలం కూతురిపేర పెట్టడంతో కోడల్ని పుట్టింట్లోనే వుంచేసింది… ఆ పిల్ల జాతకంలో భర్తృ వియోగం వున్నదని జ్యోతిష్యులు చెప్పడం వల్ల కూతురి పేరే ఆస్తి పెట్టాడాయన. అది మార్చడానికి ఒప్పుకోలేదు. చలపతి భార్య గంగాభవాని గణాచారి పూనకాన్ని చూసింది. తనకి కూడా అమ్మవారు ఆవేశించినట్లు ఊగిపోయి గంగాభవానిని తీసుకుపొమ్మని హుంకరించింది… ఇంకేం పనయిపోయింది. జాతకాల బూటకాన్ని అవి నమ్మినందవల్ల వచ్చే ఆపదలు జ్యోతిష్యునికే కనువిప్పు కలిగించిన కథ ”తమసోమా జ్యోతిర్గమయ”.
కార్యాలయాల్లో ఉద్యోగినులపై జరిగే పైకి కనిపించని లైంగిక వేధింపులు, కుటుంబభారాన్ని మోసే చిరు ఉద్యోగినులు వాటికి లొంగిపోయే పరిస్థితులు, ”ఆమె నవ్వింది” కథ… మానసిక విశ్లేషణతో కూడిన కథలలో ఇంటిపని అనే అనుదిన చర్య, బయట వినిపించే ఘోరమైన వార్తలు, ఒంటరితనం స్త్రీలకు ఎట్లా పిచ్చెక్కిస్తాయో చెప్పే కథ ”విభ్రమ”, అసలు సమస్య కన్న సానుభూతిపరుల మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో చూపే కథ ”సానుభూతి”. అట్లాగే ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో విపరీత ప్రవర్తనతో చివరికి మానసిక వైద్యశాలలో తేలిన వ్యక్తి గురించిన కథ ”భయం”. స్త్రీల అజ్ఞానపు అహంకారాన్ని వర్ణించే కథలు ”మిసెస్‌ కైలాసం”, ”రత్తమ్మ కష్టాలు.”. రత్తమ్మ కష్టాలు కథ హిందీ ప్రచార సభలో ఉద్యోగం ఊడగొట్టిందనీ సాహిత్యానికా ప్రభావం వుందనీ అంటారు సీతాదేవి, తన అనుభవాలు గురించి చెబుతూ… ”మీ ఓటు నాకే” అనేది అద్భుతమైన పొలిటికల్‌ సెటైర్‌. కొందరు రచయితలలో రచనకీ ఆచరణకీ మధ్య నుండే అఘాతాన్ని చెప్పే కథ ”తనదాకా వస్తే”. బొత్తిగా సాహిత్య పరిజ్ఞానమూ లోకజ్ఞానమూ లేకుండా కథలు వ్రాసే వాళ్ళమీద వ్యంగ్యాస్త్రం ”ఇంటర్‌వ్యూ”…
సీతాదేవిది సూటి అయిన కథనం. అదే ఆమె శిల్పం. ఇన్ని కథలలో ఎక్కడా తెలుగు తప్ప ఇంగ్లీష్‌ మాటలు కనపడకపోవడం కథలలో ఆయా వ్యక్తులకు తిట్ల దగ్గర్నుంచీ అచ్చమైన గుంటూరు భాష వాడడం స్థానికతను గుబాళిస్తుంది. అప్పట్లో అంటె స్వాతంత్య్రానికి ముందూ ఆ తరవాత కొద్దికాలమూ ”వెంకాయ్‌”, ”కోటాయ్‌, మాణిక్యాం, సుబ్బాం” అట్లాంటి పిలుపులు వుండేవి. అట్లాగే ”నీ శిరసు పగల”. ”నీ అమ్మ కడుపు మాడ” ”ఓరి నీ దుంపతెగ” లాంటి తిట్లు కూడా… ”మంచీ సెబ్బర” ”గుండెకాయ” ఇడ్డెన్లు… లాంటి అచ్చమైన గ్రామీణ భాష వాడతారు. ”మీ ఓటు నాకే” ”ధర్మాసనం” కథలు కొంచెం భిన్నంగా వున్నా అచ్చతెలుగే… దీర్ఘకాలం నగరంలో వున్నా ఆమె ఎప్పుడూ చేబ్రోలు అమ్మాయి భాషనే వాడారు. ఆమె కథల్లో ఎక్కడా ఉపన్యాసాలుండవు. కథ నడిచే పద్ధతిలోనే చెప్పదలుచుకున్న విషయం బయటపడుతుంది.. చుక్కలు కలుపుకుంటూ పోతే వచ్చే చిత్తరువులాగా… తొలి నాళ్ళలోనే కుటుంబరావు, గోపీచంద్‌ వంటి అప్పటికే ప్రఖ్యాతులైన రచయితల ప్రశంశలు పొందారు. నవలా రచనలో ముణిగి కథలు వ్రాయడం తగ్గించి వుండకపోతే ఆమెకున్న ఉద్యోగానుభవం, జీవితానుభవాలతో మరిన్ని మంచికథలు వ్రాసి వుండొచ్చేమో…
”ముందూ వెనకా ఎటువంటి రక్షణలు ఏర్పాటు చేసుకో కుండానే ఒంటరిగా ఇంతదూరం పయనించాను.. మరి ఈ నాడు తల్లితండ్రులు చదివిస్తుంటే కాలేజీ చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ భర్త బాధ పెడుతున్నాడంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న స్త్రీలనేమను కోవాలి?… పురుషుడి రక్షణలేని స్త్రీని ఈ సమాజం గౌరవించదనీ బతకనివ్వదనీ భ్రమ పడడం వలనా? అంత చిన్న వయసులో ఒంటరిగా స్వతంత్రంగా జీవితం ప్రారంభించిన నన్ను సమాజం ఏమీ చెయ్యలేకపోయింది. ఈ సమాజం నుంచీ నేను బోలెడంత గౌరవం, ప్రేమ, ఆదరణలను పొందాను…” అంటారు సీతాదేవి… స్త్రీలు సమరశీలురు కావాలంటారు..
స్త్రీవాదుల గురించి ”..వీరి రచనల్లో ఆవేశముంది, ఆవేదన వుంది, ఆర్ద్రత వుంది, భావవ్యక్తీకరణలో స్పష్టత, శబ్ద ప్రయోగంలో బలం, రచనా శిల్పంలో నైపుణ్యం కనిపిస్తాయి… చాలా పవర్‌ఫుల్‌గా వ్రాస్తున్నారు. స్త్రీవాద రచయిత్రులు తమ దృష్టిని సమాజంలోని ఇతర సమస్యల వైపు కూడా సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటారు (ఒక ఇంటర్‌వ్యూ). మట్టిమనిషి, మరీచిక, వైతరిణి వంటి ప్రసిద్ధ నవలలు వ్రాసిన సీతాదేవి అందుకోని అవార్డు లేదేమో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తప్ప…
డిసెంబర్‌ పదిహేను1932లో జన్మించిన వాసిరెడ్డి సీతాదేవి పదమూడు ఏప్రిల్‌ 2007లో వెళ్ళిపోయారు.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

One Response to వాసిరెడ్డి సీతాదేవి

  1. sivalakshmi says:

    సత్యవతి గారి విశ్లేషణ సీతాదేవి గారి కధలన్నిటినీ స్వయంగా చదివిన అనుభూతి ని కలిగించింది.తాళి సిండ్రోం ఇద్దరు స్త్రీలను ఏకం చేసిన వైనం ఎంతో నచ్చింది.ఉత్తర భారతం లో స్త్రీలకు తాళే లేదు.మనకు మాత్రం తాళి లేకుండా గడప దాట కూడదని తెగ నూరి పోశారు.ఇక మీడియా సరే సరి.జీళ్ల పాకం సీరియళ్ల లో రోజూ అవే మెలో డ్రామాలు.నాకు తెలిసిన ఒకావిడ తాళి లోని దారం తెగిపోయేటట్లున్నప్పుడు భర్త ను ఎదురుగ్గా కూర్చోబెట్టుకుని మరీ మార్చుకుంటుంది.అంటే వాయించీ వాయించీ నషాళాని కెక్కించారన్నమాట!
    ఆలోచనల్ని విశాలం చేసే మంచి విశ్లేషణ ను అందించిన సత్యవతి గారికి ధన్య వాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.