చలం – స్త్రీ – సాంఘిక వ్యవస్థ -కె. లలిత

 

అధికారం, లైంగికత, కుటుంబ వ్యవస్థ, మాతృత్వం బిడ్డల పెంపకం, వైయక్తికత, స్త్రీల పని అనే ఎన్నో రకాల అంశాలను ఫెమినిస్టు ఉద్యమం ‘రాజకీయాలలో’ ప్రధాన భాగాలుగా రూపొందించటంలో విజయం సాధించింది. వీటి గురించిన విస్తృత చర్చలు ప్రపంచమంతటా, మన దేశంలోనూ జరుగుతున్నాయన్న విషయం తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ ప్రస్తుత వాతావరణంలో చలం దృక్పథం – ఆయన ప్రధానంగా స్త్రీల గురించి, సాంఘిక వ్యవస్థ కట్టుబాట్ల గురించి చేసిన ఎన్నో రచనలను పునర్విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన రచనల్లో మనకు ప్రధానంగా కనిపించే విలువలు ఏమిటి? ఆ రచనలను ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? వీటిని ఎవరు ఆమోదించారు? ఎవరు వ్యతిరేకించారు? అనే ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది.

చలం స్త్రీకి చూపిన పరిష్కార మార్గం ఏమిటి అనే ప్రశ్న మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలో ఎన్నో అర్థాలు కనపడతాయి. స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా, మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అలా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు. అంతేకాక ప్రతి విషయంలోనూ మనకు సంపూర్ణమైన సిద్ధాంతాన్ని అందివ్వాలి. ఒక వ్యవస్థగా సమస్యలను పరిశీలించి, విశ్లేషించి మనకు ఒక మూసలో ఇవ్వాలని ఆశిస్తారు. నా ఉద్దేశ్యంలో చలం అట్లాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. ఆయన మొత్తం సమాజానికి ఒక పరిపూర్ణమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లు కానీ, అటువంటి సిద్ధాంతాలను నమ్మినట్లు కానీ మనకు అనిపించదు. కాకపోతే ఆయన రచనలన్నింటిలోనూ ప్రధానంగా స్త్రీల గురించే రాశాడనటంలో ఏం సందేహం లేదు. కానీ విషయాలను సిద్ధాంతాల కింద మార్చే ప్రయత్నం చేయలేదు. తన జీవితంలో చూసినవీ, అనుభవించినవీ, అర్థం చేసుకున్నవీ, ఊహించినవీ అన్నీ తన రచనల్లో వ్యక్తం చేశాడు. అప్పటి కాల పరిస్థితులను బట్టి ఆయన చైతన్యాన్ని, చూసిన వాస్తవాల పట్ల ఆయన అవగాహనను పరిశీలిస్తే చలం రాసిన విషయాలకు ఒక పరిమితి ఉండవచ్చు. కానీ ఇవాళ మనకున్న అవగాహనతో, 1920ల నుంచి 50ల వరకు రచనలు చేసి ఒక సంచలనాన్ని సృష్టించిన చలంను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలే తప్ప మన దృక్పథాన్ని ఆయన నెత్తిన రుద్దకూడదు. ఇవాళ మనను చాలామంది అడిగే ప్రశ్నలు కూడా ఇవే. మీరు స్త్రీ విముక్తి ఎలా కలుగుతుందంటారు? మొత్తం సమాజంలో భాగంగానేనా లేక స్త్రీ విప్లవం ప్రత్యేకమైనదా? స్త్రీ విముక్తి అంటే సెక్స్‌ విశృంఖలత్వమా? అసలు మీకొక సిద్ధాంతం ఉందా?

మనం ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా తయారు చేసి అందివ్వకపోతే మనం చెప్పే దానికేమీ విలువ ఉండదన్నమాట. మనం చాలా గందరగోళంలో ఉన్నామనీ, ఏ పాశ్చాత్య దేశాల ప్రభావంలోనో మన ఉనికినీ, మన పరిస్థితుల ప్రత్యేకతనీ మర్చిపోతున్నామనో దాడి మొదలవుతుంది. పరిపూర్ణమైన సిద్ధాంతాల్ని నమ్మేవాళ్ళు చెప్పేదానిలో కూడా ఎన్నో అంతుపట్టని విషయాలుంటాయని మనం మర్చిపోకూడదు. అందుకే ఏ విషయాన్నయినా అర్థం చేసుకోవడానికి ముందు దాని మంచీ, చెడూ గమనించే అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ’20లలో సంస్కరణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆ ఉద్యమం కంటే ఎన్నో అడుగులు ముందుకెళ్ళి రచనలు చేసిన చలాన్ని ఇదే ప్రశ్న అడిగితే ఇలా సమాధానం చెప్పాడు, ”స్త్రీలను తిరగబడమనటమే కానీ అభ్యుదయమిచ్చే మార్గం చూడలేదుట చలం. దేని కోసం తిరగబడమనటం! చావు, ఒదులు, దూకు అనే రాజకీయ నాయకుడ్ని అడగరేం ఆ మాటలు? చచ్చి, దూకి, ఒదిలి, మనుషులు ఒక బానిసత్వం నుంచి ఇంకో బానిసత్వానికి పాకడం కనపడ్డం లేదా? ఒక్క గంతులో స్వాతంత్య్రం పొందే మంత్రం స్త్రీకి చలం చూపాలా? ఎన్ని బైట దాస్యాలు వదిలితే లోపలి భావ దాస్యం వదులుతుంది మనుషులకి!…” (మ్యూజింగ్స్‌ పే.380)

తను చెప్పిందే సరైన మార్గమని చెప్పే అధికారం తనకి లేదని గుర్తించిన చలం ”ప్రజల మీదా, వారి స్వంత అభిప్రాయాల మీదా, వారి స్వేచ్ఛ మీదా నాకు గౌరవం ఉండటం చేత ప్రతివారి మార్గము, సత్యమనే విశ్వాసం చేత – నా మార్గం కొత్త కొత్త సూచనలకే కానీ, యావత్తు నాకు గాక, ఇంకెవరికీ సరిగా సరిపోదు అని తెలీటం వల్ల ప్రజలకి మొత్తం మీద ఈ మార్గం మంచిదని రాయడమున్నూ, ప్రత్యేకం ఒకరితో ఇది నీకు మంచిదని చెప్పడమున్నూ రెండూ వేరే సంగతులు” అందుకే పరిష్కార మార్గం అనేకంటే, స్త్రీల సమస్యనర్థం చేసుకోవటానికి మనకు చలం చేసిన రచనలు ఎంత వరకు ఉపయోగపడతాయని అడగటం సమంజసం. అప్పటి స్త్రీల పరిస్థితిని రచయిత ఏ విధంగా చిత్రించాడు? అది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది? ఆయన జీవితంలో ఎటువంటి అనుభవాన్ని చూశాడు? ఆయన అనుభవాన్నుంచి, రచనల్నుంచి మనం ఇప్పుడు నేర్చుకోగలిగేదేమిటి? అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించటానికి ప్రయత్నించదలచుకున్నాను.

చలం రచనలు రాకముందు స్త్రీ పరిస్థితి ఎట్లా ఉండేది? అప్పటి సాంఘిక పరిస్థితులు ఏమిటి? అని క్లుప్తంగా పరిశీలిస్తే వాటి నుంచి చలం ముందుకు వెళ్ళిందీ లేనిదీ మనకు బోధపడుతుంది. 1850 ప్రాంతంలో బెంగాల్లోని మేధావి వర్గంలో మొదలైంది సంఘ సంస్కరణోద్యమం (1825లో ప్రారంభమైంది బ్రహ్మ సమాజం). బ్రిటిషు వాళ్ళ దృష్టిలో భారతీయులం, మనల్ని మనం పాలించుకోలేని అసమర్ధులం, తక్కువ జాతి వాళ్ళం. స్త్రీలని హింసించే మూర్ఖులం, తెల్లవాళ్ళకి సమాధానం చెప్పటానికి, మన జాతి ఔన్నత్యాన్ని తెలియచేయడానికి మొదలైంది సంఘ సంస్కరణ ఉద్యమం. దీని ధ్యేయం ముఖ్యంగా మనం గుడ్డి విగ్రహారాధాన చేసే హిందూ మత మూఢులం కాదనీ, సతీసహగమనం లాంటి సంప్రదాయాలతో స్త్రీలను దారుణంగా హింసించే జాతి కాదనీ నిరూపించుకోవటం. అదే మొదలు బ్రహ్మ సమాజానికి. ఈ ఉద్యమంలో సంస్కర్తలందరూ వారి వారి రచనలతో భారతీయ స్త్రీ ఎంతటి ఉన్నత స్థానంలో ఉందో చూపించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ఉద్యమం తొలి దశలో సంస్కర్తలు సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తర్వాత్తర్వాత స్త్రీ ఆరోగ్యం, స్వేచ్ఛ, స్త్రీ విద్య, ఆస్తి హక్కుల వంటి విషయాలను గురించి కృషి చేయటం ప్రారంభమైంది. ఆంధ్రలో బ్రహ్మ సమాజం 1864లో ప్రారంభమయింది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు (ఆంధ్రలో చలం పే.604). దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరకముందే తన ఇంట్లో ఆడవాళ్ళనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్ళడం లాంటి పనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించక పోవచ్చు. కానీ అప్పటి వాళ్ళకవన్నీ విపరీతంగా కనిపించాయనటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు,

ఉమ్ములూసేవారు. అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి తాను చెప్పింది చేశాడు. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధనని, కులభేదాలని వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు. ముందు హేతువాదాన్ని నమ్మిన బ్రహ్మ సమాజం ఆ తర్వాత సంప్రదాయంతో రాజీపడటాన్ని చలం విమర్శించటం మొదలుపెట్టాడు. హిందూ మతాన్ని విమర్శించిన బ్రహ్మ సమాజం కుటుంబ జీవితంలో స్త్రీ, పురుష సంబంధాలు అనే హిందూ విలువలను పుణికి పుచ్చుకుంది. దాంట్లోని ప్యూరిటానిజంని చలం విమర్శించాడు. రత్నమ్మతో చలానికి సంబంధం ఏర్పడినప్పుడు బ్రహ్మ సమాజం ఆయన్ని వెలివేసింది. ఇక జాతీయోద్యమం సంగతి చూస్తే, అదీ చలంను అంతగా ఆకర్షించలేదనే చెప్పాలి. ”కుటుంబ జీవితంలోనూ, స్త్రీ విషయంలోనూ, సాంఘిక నీతుల విషయంలోనూ, చాలా సంకుచితంగా, దుర్మార్గంగా ప్రవర్తించేవారినీ, కులమత భావాల్ని వదలని వారినీ, వ్యక్తిగతంగా నిజాయితీ లేని వారినీ, అవకాశవాదులనూ, జాతీయోద్యమంలో ఎక్కువ చూసి ఆ ఉద్యమ రాజకీయాల వల్ల ప్రభావితుడు కాలేకపోయారు” (చలం సాహిత్యం – రంగనాయకమ్మ – పే.130). దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం ప్రభుత్వపు కాగితాలలో మాత్రమే ఉండటాన్ని గురించి 52లో రాశాడు చలం. (1952 సంపుటిలో స్త్రీకి రాసిన ముందు మాట ”ఇంకోసారి మళ్ళీ తప్పలేదు” పేజీ 20-25). ”ఆస్తినంతా లాగేస్తూ, ఆస్తి హక్కుని స్త్రీకి ఇచ్చి ఏం లాభం? బతుకంతా బానిసత్వం చేసి, భర్తనుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం?” అంటూ ఆస్తి హక్కు, విడాకుల చట్టాలకున్న పరిమితులను బయటపెట్టాడు. ఇదివరకు భర్తను వదిలి స్త్రీ ఇంకొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవచ్చని చట్టం చెప్పగానే ఇంత వరకు ఆ స్త్రీని వ్యభిచారిగా లెక్క గట్టిన సంఘం ఒక్కసారి ఆమెను పతివ్రతనెట్లా చేసిందని ఎద్దేవా చేశాడు. వ్యక్తి జీవితాన్ని సంఘం అదుపు చేయడం చలానికి ఆమోదయోగ్యం కాదు. ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎప్పుడు కనాలనే ప్రశ్నలన్నీ కూడా ”జాతీయం” అయిపోయాయని బాధపడ్డాడు. మనం ఈ రోజు చర్చిస్తున్న సాంఘిక వ్యవస్థ, నీతి, ధర్మాలు, ప్రభుత్వం/రాజ్యం-నీతి, ధర్మాలు – వాటిలో వ్యక్తికున్న స్వేచ్ఛ అనే అంశాలన్నీ స్ఫురిస్తాయనడం అతిశయోక్తి కాదు.

1921 నుంచి ప్రారంభించి 1945 వరకు చలం చాలావరకు నాటకాల్ని, నవలల్ని, ఇతర రచనల్నీ చేయటం జరిగింది. ’24లో ఆయన రాసిన వాటిల్లో బిడ్డల శిక్షణ, ఇంగ్లీషులో మాన్‌ అండ్‌ ఉమెన్‌లు…, 25లో స్త్రీ… 1939లో మ్యూజింగ్స్‌ ముఖ్యమైనవి. ఆయన తన నవలల్లో కంటే ఎక్కువగా ఇతర వ్యాసాల్లో, రచనల్లో వివాహం, సెక్స్‌ సంబంధాలు, విద్యా విధానం, సంస్కరణ, వ్యక్తిత్వం, వ్యక్తి చైతన్యం, వ్యక్తి విలువలు, సమాజంలోని ద్వంద్వ విలువలు, కళలు, సంగీతం, సాహిత్యం – ఒకటి కాకుండా తాను చూసినవన్నీ విమర్శనాత్మకంగా పరిశీలించి రాశాడు. అన్నింటికంటే ఎక్కువ మొదటి నుంచి ఆయన్ని బాధించింది స్త్రీ స్వేచ్ఛ అనే అంశం. తన స్వంత చెల్లెలు అమ్మణ్ణి విషయంలో తాను పడ్డ బాధ, ఎదుర్కొన్న వైరుధ్యాల గురించి ఆత్మకథలో రాశాడు. తన చెల్లెలి అనుభవమైన మొదలు ”అత్తవారింట స్త్రీ ఏం బాధలు పడుతుందో, ఏ విధంగా వాళ్ళ మెదళ్ళని అత్తవారు ఎలా నడిపించేస్తారో అర్థమయింది. ఆ రోజున స్త్రీ జనరక్షణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీ సంస్కరణ అంటే ఏమిటో తెలిసి వచ్చింది నాకు” (ఆత్మకథ పేజీ-23) అంటూ రాశాడు. ”నేను వాంఛించే మార్పు వివాహంలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు పోవాలని. ఈ దుర్మార్గాలు వదిలించినంత మాత్రాన అసలు చచ్చేటంత దుర్భరం కాదు వివాహం… వివాహం అయినంత మాత్రాన అవినీతి అనడమూ మూర్ఖమని నా వాదన! ఇట్లాంటివి బోధిస్తే ఈ ప్రజలకి కోపమెందుకంటే వాళ్ళ హృదయాలు విప్పి చూపగల యంత్రమో, మంత్రమో ఉంటే అర్థమవుతుంది. పురుషులకి – స్త్రీ మీద తమకి చెలామణి అవుతున్న హక్కులు పోతాయి అనీ, స్త్రీకి – పురుషులు పెడుతూ ఉంటే సుఖంగా, బద్ధకంగా బతికే భాగ్యం వదులుకోవలసి వస్తుందనీ భయం” (మ్యూజింగ్స్‌ పేజీ-34) అంటూ వివాహ వ్యవస్థని చీల్చి చెండాడాడు. అదివరకు ఇంత సాహసం ముందెవరూ చేయలేదు. సమాజం స్త్రీని ఒక మనిషిగా చూడదనీ, ఇంటి కోసం, యజమానికీ, పిల్లలకీ తన అభిరుచుల్ని, సుఖాల్ని, సంతోషాన్ని, శరీరాన్ని, ఆత్మగౌరవాన్ని అన్నింటినీ వదులుకునేట్లు చేస్తుందని సమాజం మీద దాడి చేశారు (‘మాన్‌ అండ్‌ ఉమెన్‌’లో – 1924). స్త్రీని భార్యగా, తల్లిగా గుర్తించి గౌరవిస్తున్నామంటూనే, ఆమె ‘సుకుమారమైన’ చేతులు గిన్నెలు తోమడానికీ, ‘బలహీనమైన మెదడు’ ఇంటిని నడపడానికీ, ‘వంకర బుద్ధి’ ముందు తరాన్ని తయారు చేయడానికీ ఉపయోగిస్తారన్నాడు. ఇవన్నీ కాకుండా చట్టాలు, ఆస్తి హక్కుల విషయంలో కూడా స్త్రీల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో వివరించాడు. మగవాళ్ళ లాగానే స్త్రీలూ గొప్ప, మధ్య తరగతి, బీద అనే మూడు వర్గాలనీ మొదటి రెండు వర్గాలూ తమ స్వంత సంపాదనైనా లేకుండా భర్తల మీద ఆధారపడతారనీ, బీద వర్గం స్త్రీకి ఆ సంపాదన ఉన్నా అది భర్త అజమాయిషీలో ఉంటుందనీ, భర్త ఆధీనంలో స్త్రీ శ్రమ, సంపాదన ఉన్నంత వరకూ బీద స్త్రీకైనా స్వతంత్రత లేదనీ వాదించాడు. ఇంటి దగ్గర మగవాళ్ళ అవసరాలు తీరుస్తూ స్త్రీలు వాళ్ళని ప్రపంచంలోకి వెళ్ళే స్వేచ్ఛను కలిగిస్తున్నారన్న మాట ఆనాడే (1924) చలం చెప్పాడు.

పిల్లల్ని కనడం అనే ప్రకృతి సహజమైన అంశం కోసం స్త్రీ తన ఇతర బాధ్యతలు (పని, ఉద్యోగం) వదులుకోవడం కృత్రిమమని అందుకే పిల్లల్ని చూసే కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కూడా చెప్పాడు. ”బిడ్డలు అఖ్ఖర్లేదనుకుంటే గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించడం న్యాయం కాని, గర్భం కలుగుతుందేమోనని భయంతో బతకడం ఘోరం… బిడ్డలు అఖ్ఖర్లేదనుకున్న వాళ్ళకు గర్భం కలిగితే, తగిన డాక్టర్ల చేత అది తీయించుకోవడం ఉత్తమం – కనడం కన్నా” (బిడ్డల శిక్షణ పే.130) అని గర్భనిరోధం, అబార్షన్ల గురించి చట్టవిరుద్ధమని తెలిసే ధైర్యంగా సూచనలిచ్చాడు. ”మనం ఇవాళ స్త్రీకి తన శరీరం మీద, సెక్సువాలిటీ మీద తనకే హక్కుండాలి అని నమ్మే విషయాన్ని ఆనాడే చలం చెప్పాడంటే అది మామూలు మాట కాదని గుర్తుంచుకోవాలి”. పిల్లలు పుడితే సంఘంలో ఎదురయ్యే చిక్కులు గుర్తించిన చలం కొందరు స్త్రీలు అసలు పిల్లలు కావాలనుకోకపోవచ్చునని కూడా అన్నాడు. అటువంటి వాళ్ళు బలవంతంగా పిల్లల్ని ఎందుకు కనాలని సంఘాన్ని నిలదీసిన వాళ్ళు (ఇప్పుడు ఫెమినిస్టులే కాని) ఇంకొకరెవరూ కనిపించరు. గర్భ నిరోధక మార్గాల్ని గురించి వివరంగా రాశాడు చలం (గర్భ నివృత్తి మార్గాలు). ఇప్పుడు ఫెమినిస్టులు మంచి పద్ధతిగా చెప్పే డయాఫ్రమ్‌ స్పాంజిల గురించి, కాండోమ్‌ల గురించి (స్త్రీ పేజి 177-79) రాశాడు. ఇన్ని విషయాల గురించి ఇంత వివరంగా స్త్రీని సంభోదిస్తూ రాశాడు గనకనే చలాన్ని అంతగా అసహ్యించుకుంది ఈ సంఘం. ఆయన పుస్తకాలు చదివితే చెడిపోతారని నెత్తీ నోరూ బాదుకుంది. స్త్రీలకు విశృంఖలత్వం నేర్పిస్తున్నాడని దూషించింది. ఈ పెద్ద మనుషులంతా స్త్రీ స్వేచ్ఛ అంటేనే అశ్లీలం అనుకునే రకాలు. అందుకే ఫెమినిస్టు ఉద్యమంపైన కూడా అదే విమర్శ ఉంటే ఆశ్చర్యమేముంది?

స్త్రీ స్థానానికి సంబంధించి మతాన్ని, కులాన్ని, సంప్రదాయాన్ని, సంఘాన్ని అన్నింటినీ తప్పుపట్టాడు చలం. ఆమెని తన స్వంతం చేసుకోవడానికి పురుషుడు ఎట్లా ప్రయత్నిస్తాడో ఎద్దేవా చేశాడు.

ఒక గార్డియన్‌గా రక్షకుడు అనే పేరుతో, నిజానికి సిఐడి ఆఫీసరుగా, పోలీసువాడిగా, మేజిస్ట్రేట్‌గా చివరికి హయ్యస్ట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్‌గా, జైలరుగా, ఉరి తీసేవాడిగా అన్ని రూపాల్నీ భర్త ఎట్లా ధరిస్తాడని చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఆమె మీద తాను చెలాయించే పెత్తనాలన్నింటినీ వదిలేయాలని (మాన్‌ అండ్‌ ఉమెన్‌) ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం ఇప్పటికి మాత్రం ఎంత మందిలో ఉంది? కాలక్రమంలో మారిన పురుషులకి అనుగుణంగా మాత్రమే స్త్రీ కూడా మారుతూ వచ్చిందని చలం చెప్పింది ఈనాటికీ నిజమే. పూర్వం పురుషుడికి ”పొట్టి చేతుల రవిక, కొప్పూ, అందెలూ, రాగిడీ ఇష్టమైతే ఆ వేషమే వేసింది స్త్రీ. ఇంగ్లీషు విద్య నేర్చిన పురుషుడికి జాకెట్టు, నాగరం, గాజులు, చిన్న బొట్టూ, కొంచెం సంగీతం, ఇంగ్లీషు ముక్కలు ఇష్టమైతే ఆ స్వరూపమే దాల్చింది” (స్త్రీ పేజి-43) అంటూ పెళ్ళయిన మరుక్షణం నుంచే భర్త తన భార్యను తన ఇష్టానుసారంగా ఎట్లా మలచుకుంటాడో చక్కగా రాశాడు. ”ఆమె ఊహలకి తను ఆకారమిస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో… అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎట్లా కూచోవాలో, ఎన్ని గంటలకి లేవాలో, పడుకోవాలో ఆజ్ఞాపిస్తాడు. ఆమెకిదివరకే ఉన్న పాత అభిప్రాయాలలో తనకి నచ్చనివి ఉంటే వాటిని వెక్కిరించి, ఏడిపించి వదిలేస్తాడు…” చివరికి అతని మాటలు పలికే చిలుకగా, గ్రామ్‌ఫోన్‌ ప్లేటుగా మారుతుంది. చీర కొనేటప్పుడు కూడా ఆ రంగు అతనికిష్టమేనా, పచ్చడి చేసేటప్పుడు ఆ రుచి అతనికి సయిస్తుందా, ఈ కొత్త ఊహ అతనికి నచ్చుతుందా అని ఆలోచిస్తుంది…”. ఈ విధంగా మలచిన స్త్రీ ఆత్మ ఎలా ఉంటుంది? ”హత్య చేసేవాడు శరీరాన్ని చంపుతాడు. ఈ భర్త ఆత్మని నాశనం చేస్తాడు” అన్నాడు చలం ఆనాడు. ఇప్పటికీ ఈ స్థితే కొనసాగుతోంది. పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన పద్ధతీ, వాతావరణం, పొందిన జ్ఞానం, మన పైన సమాజపు పోలీసింగ్‌ పెళ్ళి కాగానే మారిపోతాయి. ఇంటి పేరుతో సహా ఎగిరిపోతాయి. మనకున్న వ్యక్తిత్వాన్ని, ఉనికినీ, గతాన్ని భార్యలుగా, తల్లులుగా కావటానికి ప్రోత్సహించే పరిస్థితులు ఊపిరాడనివ్వవు.

మామూలు మానవ సంబంధాల్లో నెలకొని ఉన్న ఆధిపత్యాన్ని నిరసించాడు చలం. అన్ని రకాల డామినేషన్‌, సబ్మిషన్‌లను ఆయన విమర్శించాడు. చివరికి తల్లి ప్రేమలో కూడా బలవంతం కూడదు, అది అక్రమం అంటాడు. ప్రేమ బంధాలే కానీ అధికార బంధాలుండకూడదని ఆయన అభిప్రాయం. సంఘ సంస్కర్తలు కూడా స్త్రీ స్వేచ్ఛ సంస్కరణల గురించి వితంతు వివాహాలు కావాలనీ, బాల్య వివాహాలు కూడదనీ స్త్రీ బాగుపడాలనీ కృషి చేశారు. వాళ్ళందర్నీ ఎత్తి పొడవనట్టుగా చలాన్ని సమాజం ఎందుకు ఎత్తి పొడిచింది? వెలివేసింది? ఆయన సంఘానికి దూరమైపోయి ఎందుకంత ఒంటరి జీవితాన్ని భరించాల్సి వచ్చింది? ఆయన మూలంగా ఆయన కుటుంబం అంతా కూడా ఎందుకు బాధలను భరించింది? చలం ఎందుకంత వివాదాస్పద వ్యక్తి అయ్యాడు? అనే ప్రశ్నలు తలెత్తక మానవు.

ఈ ప్రశ్నలకి సమాధానం వెతకాలంటే, తాను నమ్మినదాన్ని నిర్మొహమాటంగా, గంట కొట్టినట్లుగా, సూటిగా, తీక్షణంగా చెప్పడం మూలంగానే అనుకుంటే సరిపోదు. నిజమే అలాగే చెప్పాడు. అట్లా చెప్పిన వాళ్ళెంత మంది? కానీ చెప్పిన విషయం ఏమిటనేది కూడా ముఖ్యం. ఒకటి ‘ఆయన మాట్లాడిన దాంట్లో ప్రతిచోటా వైరుధ్యాలు కనబడతాయి. దేన్నీ ఒక సిస్టమాటిక్‌ పద్ధతిలో పరిశీలించలేదు’ అనే విమర్శ. కానీ ఈ విమర్శ ఎక్కువ ఇప్పటి కాలానికి సంబంధించినది. ఆయన రచనలు అప్పటికీ, ఇప్పటికీ ఇంత సంచలనాన్ని కలిగించడానికి కారణం ప్రధానంగా వివాహమనే వ్యవస్థను దెబ్బతీయటం. స్త్రీ పురుష సంబంధాల్ని, సెక్స్‌, సెక్స్‌వాలిటీల గురించి ఆయన ఎక్కువ రాయటం. ఇవే చాలామందిని తల్లకిందులు చేశాయనటంలో అతిశయోక్తి లేదు. స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండే ఆకర్షణ గురించి ప్రతిసారీ ప్రస్తావించాడు చలం. ఈ సమాజం తన స్వార్థం కోసం స్త్రీని సెక్సువల్‌గా ఎట్లా అణచిపెట్టిందో అర్థం చేసుకోవాలనీ, స్త్రీ ఎదురు తిరగాలని వాదించాడు. ఆయన నవలల్లో మనకు ప్రధానంగా కనిపించేదీ, తానే స్వయంగా చెప్పినదీ స్త్రీ శారీరక స్వేచ్ఛనే. ఇది సెక్స్‌కీ, వ్యక్తి స్వాతంత్య్రానికీ సంబంధించినది.

1940లో ‘స్త్రీ’కి రాసిన ముందు మాటలో ”సెక్స్‌ అంటే జీవితపు సూత్రం. పిల్లల దగ్గరి నుంచి ముసలి వాళ్ళయిందాకా, అందర్నీ, వాళ్ళకి తెలిసినా, తెలియకపోయినా, ప్రోత్సహించి పాలిస్తోంది. తమలో ఆ ప్రోద్బలం లేదనీ, అక్కర్లేదనీ ఎంత వంచన చేసుకునీ లాభం లేదు” (స్త్రీ పేజి-10) అని రాశాడు. స్త్రీ కుండే సెక్సు వాంఛల గురించి, స్త్రీ పురుషుల సెక్స్‌ సంబంధాలలో ఆమెకు అవసరమైన తృప్తి ఆనందాల గురించి రాసిన మొదటివాడు చలం. తనకు కోర్కె ఉందని చెప్పుకోవడమే స్త్రీకి పెద్ద సమస్య అని స్త్రీ మీద సంఘ ప్రభావాన్ని ఎత్తి చూపాడు. చిన్నప్పటి నుండీ సెక్స్‌ అంటే దుర్నీతి అని, అసహ్యమనీ, రహస్యమనీ, నీచమని నేర్చుకున్న స్త్రీలు ఒక్కసారి పెళ్ళవగానే ఆనందం పొందనూ లేరు, ఒకరికి అందివ్వనూ లేరు అని ఖచ్చితంగా చెప్పాడు (స్త్రీ పేజి-159). అందుకే ఈ రోజుకీ చలాన్ని అభిమానిస్తామని ఎవరైనా అంటే వెంటనే వారిని సెక్స్‌ విశృంఖలత వాంఛించే వాళ్ళుగా ముద్ర వేస్తారు. అంత ప్రమాదకరం చలం. అందుకే ఇతర సంఘ సంస్కర్తల మీద జరగని దాడి ఈయన మీద జరిగింది. ఏ సమాజంలోనైనా సరే స్త్రీకున్న స్థానం, హోదా అర్థం చేసుకోవాలంటే దానికి గీటురాయి ఆమె సెక్సువాలిటీ పట్ల ఆ సమాజం అవలంబించే వైఖరే. సెక్సువాలిటీతో పాటు స్త్రీ శ్రమ, ఆమె పిల్లల్ని కనడం కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ మూడింటినీ విశేషంగా ప్రస్తావించాడు గనుకనే అతని మీద విరుచుకుపడింది లోకం. అందులోను 1920లలో ఇట్లాంటి మాటలు ఎవరూ విని కూడా ఉండని సందర్భంలో చలం ఇవన్నీ రాశాడు. కనుక ఆయన మీద దుమ్మెత్తి పోయడంలో ఆశ్చర్యం లేదు.

ఆయనకొక సిద్ధాంతం లేదన్న ఇప్పటి విమర్శను పరిశీలిద్దాం. చలం వేటి గురించయితే నమ్మినట్లు రాశాడో వాటిని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని సందర్భాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అయితే అట్లా రాయడానికి ఒక సమయమూ, సందర్బమూ లేవని కాదు. ఆయనలో ఎప్పుడూ ఉన్న గందరగోళం అదే అని మనం కొట్టి పారేయటం సరైనది కాదు. ఉన్న గొప్పతనం తను ఏ క్షణంలో ఎలా ఫీలయ్యాడో దాన్ని కాగితం మీద పెట్టడం. అది తను ఇంతకు ముందు చెప్పిన దానికి అనుకూలంగా ఉందా లేదా అని ఆయన దాన్ని జాగ్రత్తగా ఎడిట్‌ చేయలేదు, నిజాయితీగా రాశాడు. మొదటి నుంచి చివరి వరకూ ఆయన్ని కలవరపెట్టిన సమస్యలు ఈశ్వరుడున్నాడా లేడా అని, స్త్రీ స్వేచ్ఛ గురించి, బ్రహ్మ సమాజంలో చేరినప్పుడు ఈశ్వరుడు లేడు అనే నిర్ణయానికొచ్చినా, అనుక్షణం నిత్య జీవితంలో దాన్ని గురించిన ఆలోచనల్తో సతమతమయ్యాడు. ఒకచోట ”గాంధీగారి సిద్ధాంతాలూ, కమ్యూనిస్టు సిద్ధాంతాలూ, నా పుస్తకాల మీద విమర్శిస్తూ నన్ను కలవరపెడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఈశ్వరుడు, స్త్రీ అనే రెండు సమస్యలు నన్ను ఎడతెరిపి లేకుండా తలక్రిందులు చేస్తూనే ఉన్నాయి” అని రాశాడు. అలాగే కమ్యూనిజం గురించి ”కమ్యూనిజం వంటి గొప్ప మార్పు వచ్చి వరదమల్లే ఈ చెత్తనంతా ఊడ్చేసిందాకా ఈ మనుషులు ఎట్లానూ కదలరు. ఎన్ని ఇట్లాంటి వ్యాసాలు వ్రాసినా, ఏ యుద్ధాలో, ఉద్యమాలో, కమ్యూనిజాలో కదిలించవలసిందే గడ్డకట్టిన ఈ సంఘాల్ని. ఇట్లాంటి వ్రాతలన్నీ అట్లాంటి గొప్ప మార్పులు రావడానికి సోపానాలు” (స్త్రీ పేజి-13) అని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి చచ్చు విలువల గురించి వ్రాస్తూ వాటిని ఎదిరించి తిరుగుబాటు చెయ్యాలనీ అయితే ఒక్కసారి తిరుగుబాటు చేస్తే సరిపోదనీ రాశాడు. ”ప్రత్యేకమైన హక్కుల కోసం తిరుగుబాటు చెయ్యడం వల్ల హక్కులు రావచ్చు కానీ, ఆ హక్కులు పొందడం వల్ల సౌఖ్యం రాదు. అధికారం వల్ల కలుగుతున్న ఇరుకులోంచి ఆత్మ వికాసం కోసం, అభివృద్ధి కోసం, తిరుగుబాటు చెయ్యడం ఒక్కటే హర్షణీయం” (పేజి-16). కాని అదే తిరుగుబాటుతో సాధించిన స్వాతంత్య్రాన్ని ఇతరులు స్వాతంత్య్రానికి అడ్డుపడి అధికారాన్ని చలాయించడానికి వినియోగించటం నచ్చదు చలానికి. తిరుగుబాటు అవసరం గురించి మాట్లాడుతూ, తన తిరుగుబాటు వల్ల తనకి గాని, ఇతరులకు గాని మేలు జరగాలంటే తను కోరే స్వేచ్ఛని అందరికీ అంగీకరించాలి. ”తన స్వంత వారి మీద తన అధికారాన్ని వదులుకోవాలి. తన తిరుగుబాటు వల్ల వచ్చే కష్టాల్ని గర్వంతో ఎదుర్కోవాలి” (స్త్రీ పేజి-11).

”స్వతంత్ర దేవత కలకత్తా కాళికన్నా భయంకరమైనది. నిరంతరమూ సుఖ నైవేద్యాన్ని అశ్రు అభిషేకాన్ని కోరుతుంది. ఆమెని చివరిదాకా ఆరాధించగల జవసత్వాలున్న వాళ్ళు అరుదు. చాలా మంది తమ ప్రత్యేక కష్టంలోంచి తప్పించుకునే స్వాతంత్య్రాన్నే గాని, జీవితంలో ఆ దేవతను భరించలేరు” (స్త్రీ పేజి-7).

”ఈ కొత్త స్వతంత్రం ఎంత భారమైనా పురుషుడి అధికారానికి లొంగి ఉండే పాతరకపు సంసారంలోకి స్త్రీ తిరిగి వెళ్ళడమనేది ఉత్తమాట…” అని ఆశ వెలిబుచ్చాడు చలం. స్వేచ్ఛ నిరంతరంగా తిరుగుబాటులతో సాధించవలసిందే కాని ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడేది కాదని ఖచ్చితంగా చెప్పాడు చలం. ”సహాయం చేయదలచినా స్త్రీకి సహాయం చెయ్యలేడు పురుషుడు – ఆమె ఆత్మలోంచి స్వాతంత్య్రాభిలాష రానిది…” (స్త్రీ పేజి-75), ”ఎవరైనా అధికారమంతులు తమంతట తాము అధికారాన్ని వదులుకోవడమెరుగుదుమా?” (స్త్రీ పేజి-76) అని నిలదీశాడు. ఇలా ప్రశ్నించిన తీరులో సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమాలను కూడా విమర్శించిన ధోరణి కనిపిస్తుంది. అప్పటి సంఘ సంస్కరణోద్యమం స్త్రీలను బాగు చెయ్యాలనీ, నూతన స్త్రీగా భారత నారిని తీర్చిదిద్దాలంటే స్త్రీకి విద్య అవసరం అనీ నొక్కి చెప్పింది. అయితే ఆ విద్య గురించి చలం ఏమన్నాడో చూద్దాం. ”పురుషుడి విద్య స్త్రీకి పనికిరాదనీ, ఆమెకి నేర్పే విద్యాప్రణాళిక ఆమె పిల్లల్ని పెంచడానికి, వంటకీ, పాతివ్రత్యానికీ తయారు చేసేదిగా ఉండాలనీ; పురుషాధిక్యతా, స్త్రీ నైచ్యతా బోధించే పాత పురాణాలు, నీతి శతకాలు, స్త్రీకి ముఖ్యమని అరుస్తూ ఉంటాడు పురుషుడు. స్త్రీ దేనికీ లోబడకూడదు. పురుషుడి వలెనే తానూ సమానంగా నూతన శాస్త్ర జ్ఞానాన్ని, ఈ నవయుగ సాంప్రదాయాల్ని గ్రహించాలి” (స్త్రీ పేజి-77) అని మరీ ఖచ్చితంగా ఎందుకు చెప్పాడు చలం అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక విషయం బోధపడుతుంది. సంఘ సంస్కరణోద్యమం స్త్రీకే నిర్దేశించిన విద్యలో పుక్కిటి పురాణాలు, నీతి శతకాలు, కుట్లెలా కుట్టాలి, వంటలెలా చేయాలనే హోం సైన్సులు కనిపిస్తాయే కాని స్త్రీ పురుషుడితో సమానంగా అన్ని విద్యలు నేర్వాలని ఎక్కడా కనిపించదు. అప్పుడు కానీ, ఆ తర్వాత జాతీయోద్యమం సాధించిన స్వతంత్రతలో కానీ, ఇప్పటికీ కానీ సమాజంలో స్త్రీల స్థానాన్ని మార్చగల విద్యావిధానం మనకు కనిపించదు. విద్యావిధానంలో లింగ వివక్ష గురించి పరిశోధనలు ఫెమినిస్టు ఉద్యమం మూలంగా ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి.

పదిహేడో శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో మొదటిసారిగా సెక్సువాలిటీ గురించి, సెక్సు సంబంధాల గురించీ బాహాటంగా మాట్లాడటం, చర్చించడం మొదలైంది. ఇక్కడ అది 20వ శతాబ్దంలో మొదలైందనుకుందాం. ఆ విషయాల పట్ల అప్పటి అవగాహనలెలా ఉన్నా చారిత్రక దశల దృష్ట్యా అప్పటికవి చాలా రాడికల్‌ ఆలోచనలనవచ్చు. అట్లా మాట్లాడటం అవసరం కూడా. కానీ ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడిన పద్ధతీ, అప్రోచ్‌ అయిన తీరులో విషయం పట్ల వాళ్ళ అవగాహన రూపం మనకర్ధమవుతుంది. చలం ఆలోచనల్లో చాలావరకు స్త్రీ పురుష సంబంధాలే ఉన్నట్లు మిగతా విషయాలెన్నింటిని ప్రస్తావించినా ఆయన ఆలోచనల కేంద్రం ప్రధానంగా ఇదే ఉండటం మనకు కనిపిస్తుంది. ఎవరో డి.హెచ్‌.లారెన్స్‌తో చలాన్ని పోల్చారు. లారెన్స్‌ రచనల్లో స్త్రీ పురుష సంబంధాల్ని చాలా బాహాటంగా రాశాడు. చలం నవలల్లో మనకది ఎక్కడా కనిపించదు. చలం రాసిన దానిలో సెక్స్‌ శారీరకం కంటే ఎక్కువ ఆధ్యాత్మికం. ఆయన వర్ణనలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అట్లాగే తన జీవితంలో కూడా ఒక ఆదర్శ స్త్రీ గురించి ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉన్నానని చలమే చెప్పుకున్నాడు. ఆ ఆదర్శ స్త్రీ ఎవరు? ఆమెలో ఆయన కోరుకున్న లక్షణాలేంటి? సెక్స్‌ సంబంధాలూ, ఆకర్షణా అనే విషయాల పట్ల ‘సహజ స్వభావం’ కలిగిన వ్యక్తా? ‘సహజ’ స్వభావం అంటే ఏమిటి, స్త్రీలో ఎటువంటి భావాలు సహజంగా ఉంటాయి? అని సమాజ పరిస్థితులనెంత వరకు ప్రతిబింబిస్తాయి అన్న ప్రశ్నలన్నీ చలం సమాధానం చెప్పలేకపోయిన చిక్కు ప్రశ్నలు. సెక్స్‌ ఆకర్షణ, కోర్కె, పిల్లల మీద ప్రేమ, ”ఇవన్నీ భూమిలోంచి చెట్లకి కాయనిచ్చే భూమి సారానికి చాలా దగ్గర అవి” అంటూ వాటిని ప్రకృతి సామీప్యానికి దగ్గరగా తీసుకెళ్తాడు. సహజమైన ఆకర్షణను బలవంతంగా అణచుకోవడం వ్యక్తిత్వాన్ని అణిచేసుకోవడమే అని ఆయన అభిప్రాయం. కానీ ఈ ఆకర్షణే ఆయన దృష్టిలో శరీర వాంఛకా, అంటే మళ్ళీ అందులోనూ సందేహం. శరీర ఆకర్షణ, శృంగారం లాంటి పదాల్ని వాడడంలో ఆయన మనసులోనే ఉన్న ఎన్నో కన్‌ఫ్యూజన్‌లు బయటపడతాయి. ఆయన తన అనుభవాల గురించి వ్యక్తం చేసిన భావాల్ని పరిశీలిస్తే ఇది మనకు బోధపడుతుంది. బ్రహ్మ సమాజంలో ఉన్నప్పుడు రత్నమ్మతో పరిచయం సంబంధంగా మారి ఆమె కోసం బ్రహ్మ సమాజాన్ని వదిలేశాడు చలం. తన ఆత్మకథలో (ఆత్మకథ పేజి-40) దీని గురించి రాశాడు. ”పరస్త్రీతో సంగమమే కాదు, ఆ విధమైన మనో వాంఛ సహితం పాపం (గీతలు నావి) నా రొమాన్స్‌ అన్నది నా రక్తంలోనే పుట్టింది. ఎంత ప్రయత్నించీ శృంగార వాంఛని ఈ రోజు వరకు జయించలేకపోయాను…” కొద్ది రోజుల్లో ”ఆ శృంగార భావం పాతబడి కొత్త సంబంధం కోసం కొట్టుకునే వాణ్ణి. ఇది గొప్ప ప్రేమ కాదు. ఉత్త కామమూ కాదు” అట్లా లోకాతీతమైన స్వప్నచారిణి కోసం ఆశపడే వాడు కాని ఆమె ఎన్నడూ తటస్థ పడలేదు. కాని ”ఈ శృంగారమంతా కామంతో ముడిపడి ఉండడం వల్ల పాపం అనిపించేది… ఈ శృంగార వాంఛ నుంచి తప్పించుకోవాలి, జయించాలి అని ఎంత గట్టిగా ప్రయత్నించినా అది లేనిది నేను బతకలేనని” తన స్ట్రగుల్‌ గురించి చాలా ఓపెన్‌గా రాశాడు. ప్రతిసారీ రత్నమ్మని కలిసిన తరువాత ఇంటికి వెళ్ళేముందు తామిద్దరూ కలిసి ఎట్లానైనా తమ సంబంధాన్ని పవిత్రం చెయ్యమని ఈశ్వరుణ్ణి ప్రార్థించే వాళ్ళు. (ఆత్మకథ పేజి-78) ”తాను నిర్వీర్యుణ్ణి దైవద్రోహినీ అవుతున్నాననే పాప భారం తనలో హెచ్చుతోంద”ని బాధపడ్డాడు. ”నా బుద్ధి చంచలం” (ఆత్మకథ పేజి-87) అని ఇంకోచోట రాశాడు. ఈ పరస్పర విరుద్ధ భావాలతో చివరివరకూ అవస్థ పడటమే కాని ఎన్నడూ రాజీకి రాలేదు. అందువల్లే ఆదర్శ స్త్రీ దొరకలేదనే తపన, ఉన్న సంబంధాలన్నింటి పట్లా అసంతృప్తి ఆయనలో కనబడతాయి. ఆయన శృంగార దృష్టి కూడా ఒక ఆదర్శానికి సంబంధించినదే కానీ వాస్తవానికి సంబంధించినది కాదు. శృంగారం, వాంఛ, కోర్కె వీటన్నింటినీ భావకల్పనలుగా ఒక మిథాలజీగా తయారుచేశాడు చలం. ఆయన దృష్టిలో స్త్రీ సౌందర్యానికీ, ప్రకృతి సౌందర్యానికీ తేడా లేదు. ఆయనకు కాలం గడిచేకొద్దీ అవి రెండూ ఒకటిగానే కనపడ్డాయి. అదంతా తన దృష్టి కల్పించుకుంటున్న ఇంద్రజాలమని అన్నాడాయన. ఆయన మాటల్లో అది ”చాలా సుకుమారమైన వాంఛీయమైన ఇంద్రజాలం…”. స్త్రీ నుంచి పొందే ఆనందాన్ని ”ఆకాశపు నీలత్వంలోంచి, నీళ్ళ చల్లదనంలోంచీ, గడ్డి మెత్తదనంలోంచీ, పువ్వుల మెరుగులోంచీ పొందాలి… ఈ సౌందర్యానికంతా వెనుకబడే శిక్త అంతా ఒక్కటే. అది మన పెదిమలకు అందదు. అధికారానికీ లోబడదు…” దీన్ని బట్టి ఆయన వాంఛించే అనుభూతి ఎంత అందుకోవాలని ప్రయత్నిస్తే అంత దూరం పోయి కవ్వించే ఎండమావుల లాంటి ‘మిత్‌’ అని అర్థమవుతుంది. చలం శరీర సౌందర్యం చూస్తే బాధపడ్డాడు. ప్రకృతి సౌందర్యం చూస్తే దిగులుపడ్డాడు. ‘చాలా తృప్తితో ప్రేమించే స్త్రీ హస్తాల్లో కూడా చెప్పలేని దిగులు కలుగుతుంది’ అని రాశాడు. అంటే వట్టి శరీర వాంఛ ఆనిమల్‌ ఇన్‌స్టింక్ట్స్‌కి దగ్గరగా

ఉంటుంది, దాన్ని మించి ఉన్నతాలకి వెళ్ళడమే ఆయనకి ఆదర్శం అని అర్థమవుతుంది. ఇందులో ఆయన ఎప్పటికీ సమాధానం చెప్పలేకపోయిన పెద్ద వైరుధ్యం ఒకటి ఉంది. తనలో ఉన్న బుద్ధి చాంచల్యం వల్ల తన ఆదర్శ ప్రేమకెన్నడూ భంగం కలగలేదని చెప్పాడు. తనకెంతో రోత పుట్టించే ఈ చాపల్యంతో జీవితమంతా యుద్ధం చేశాడు. అయినా అది ఆయన్ని వదలలేదు. ”దాని మూలంగా ఎన్ని చిక్కుల్లోకి దిగానో? అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నానని” రాశాడు. తన రచనల మూలంగా, తన జీవితం మూలంగా, వేరే స్త్రీలతో తన సంబంధాల మూలంగా రంగనాయకమ్మ (భార్య) ఎన్ని బాధలు పడిందీ, ఆమెని తనెట్లా నమ్మకద్రోహం చేసిందీ బాధపడుతూ రాశాడు ఆత్మకథలో (ఆత్మకథ పేజీ-242). ఆమెకి మతిస్థిమితం తప్పిన తర్వాత రమణాశ్రమం వెళ్ళిపోయి అక్కడ నుంచి కట్టలు కట్టలుగా ఉత్తరాలు రాసేది. అవన్నీ చూసి ఉత్త నాన్సెన్స్‌ అని కొట్టిపారేశానని చెప్పాడు ఆత్మకథలో. కానీ మళ్ళీ తర్వాత అప్పట్లో అవి అతనికి అర్థం కాలేదని కూడా చెప్పాడు. అంటే అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదన్న మాట. అట్లాగే చనిపోకముందు నాలుగేళ్ళు ఎంత అథమంగా ప్రవర్తించిందీ తలచుకుంటే చాలా దుర్భరంగా సిగ్గుగా ఉంటుందని రాశాడు. అంతేకాదు అంత సన్నిహితంగా ఉండే వ్యక్తితో మనసు విప్పి ఎన్నడూ మాట్లాడలేదు, ఆమె బాధపడడం చూసిన తర్వాతైనా, ఆమైనా అతనిని దగ్గరకు తీసుకుని మాట్లాడడానికి తను అవకాశం కల్పించలేదేమోనని అనుమానం వెలిబుచ్చాడు. అంటే చలం తన స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి అవే సాంప్రదాయక ధోరణులు (కన్వెన్షనల్‌ రెస్పాన్సెస్‌) చూపించాడా అనిపిస్తుంది. ‘వాస్తవాల్లోకంటే కలల్లో ఎక్కువ బతికేవాణ్ణి’ అని తనే స్వయంగా చెప్పాడు. సంతోషాలు తన దగ్గరికి రావాలే కానీ తాను వాటిని వెతుక్కుంటూ పోడు. ‘నా ప్రియురాళ్ళూ అంతే’. వాళ్ళు వచ్చి తనతో ఉండిపోవాలి. దీనికీ, ఆయన చెప్పిన వ్యక్తి స్వాతంత్య్రానికీ పొత్తు కుదరదనిపిస్తుంది. ‘ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి విలువలు వాళ్ళవి’ అని నమ్మిన చలమే ఇది కూడా అన్నాడు. అంటే తను ఏర్పరచుకున్న సంబంధాలు, స్నేహితులూ అన్నీ తనకనుకూలంగానే, ఆ స్త్రీలవి కావు. ఇవే వైరుధ్యాలు, చలం తన భావాల్ని చాలా సహజంగా వ్యక్తం చేసిన నవలల్లోనూ మనకు కనిపిస్తాయి. నా ఉద్దేశ్యంలో చలం నవలల్లో స్త్రీలంతా స్త్రీలు కారు. స్త్రీల ఆకారంలో ఉన్న చలం ప్రతిబింబాలే. ‘మైదానం’లోని రాజేశ్వరిని తీసుకున్నా ‘అరుణ’లోని అరుణను తీసుకున్నా, ‘బ్రాహ్మణికం’లో సుందరమ్మను తీసుకున్నా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయం. ఈ నవలల్లో స్త్రీల వర్ణనలు కూడా మొత్తం ప్రపంచాన్నే ఒక శృంగార దృష్టితో చేసిన చలం వర్ణనే కానీ మరొకటి కాదు. సుందరమ్మ గురించి రాసిన ప్రతిసారీ తనలో ఉన్న గిల్టీ ఫీలింగ్స్‌ని వ్యక్తం చేశాడు చలం. మనసు ‘వాంఛ’ తప్పు. పాపం అంటుంటే శరీరం తిరగబడడం అనే విషయాన్ని పదే పదే చెప్పాడు. ‘అరుణ’ నవల మొత్తంలో మగవాళ్ళందరూ అరుణని వర్ణించడమే ఉంది కానీ, అసలు ఆమె ఏమిటి, ఆమె ఆలోచనలు ఏమిటి అనేది మనకు అంతుబట్టదు. స్త్రీ అంటే ఒక మిస్టరీ అని అనాదిగా ఉన్న అభిప్రాయం ఇందులోనూ కనిపిస్తుంది. ఎవరికీ అర్థం కాకుండా అందర్నీ కవ్విస్తూ రెచ్చగొడుతూ ఎవరికీ అందకుండా పోతుంది అరుణ… (దైవమిచ్చిన భార్య పేజీ-33).

చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరక శక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి. ఒకళ్ళు ఆరాధించతగిన వ్యక్తే కానీ, కామించదగ్గది కాదు. (అంటే కామం తప్పా అనే ప్రశ్న వస్తుంది. ఏమో ఈ విషయం చలం రచనల్లో ఎక్కడా అంతుబట్టదు) ఆయన స్త్రీలందరూ, జీవితంలో ఏ ఆదర్శం కోసం తను వేదన చెంది, తపించి విసిగి వేసారి, ఒంటరితనం, బాధ అనుభవించాడో, ఆ ఆదర్శం కోసం అంతే బాధపడి ఆఖరవుతాడు. చలం ఒకసారి తనకొక కథ రాయాలనుందని మనకు ప్లాటు చెబుతాడు. ”నా వంటి సౌందర్యోన్మత్తుడొకడు తపస్సు చేస్తాడు. వరాన్ని పొందుతాడు. తను కోరిన స్త్రీ, ప్రతి ఆవిడా తన్ను మోహించాలని, నా వలెనే ప్రతి స్త్రీలో ఏదో ఒక విధమైన అందాన్ని చేస్తాడు, వాంఛిస్తాడు, ప్రతివారూ గోపికల్లాగే అతన్ని అనుసరించి వెంటబడతారు. ఏమౌతాడతను (మ్యూజింగ్స్‌ పే-109). ఇది చదివితే మనకర్థమవుతుంది. చలం నవలల్లో స్త్రీలందరూ ఈ లక్షణాన్ని కలిగి ఉండేవాళ్ళు. నవలల్లో పురుషులు మాత్రం చాలావారకూ స్త్రీని తన స్వంతం చేసుకోవాలని (‘దైవమిచ్చిన భార్య’లో రాధాకృష్ణ) ఉపయోగించుకోవాలని (‘బ్రాహ్మణికం’లో చంద్రశేఖర్‌, ‘అనసూయ’లో ప్రకాశరావు) చూస్తారు. అంటే చలం ఏవగించుకుంటున్న లక్షణాలు మగవాళ్ళలోను, ఆదర్శమనుకున్న లక్షణాలు ఆడవాళ్ళలోను కనబడతాయన్న మాట. అంటే చలం స్త్రీ మీదెంత బాధ్యత, బరువు పెట్టాడో అనిపిస్తుంది. స్త్రీ ఒక ప్రేరకశక్తిగా, మానసిక శక్తిగా (సైకిక్‌ ఫోర్స్‌), శృంగార దేవతగా ఉండలేకపోతే అది తనలో ఉన్న లోపం అనుకుంటానని చలం చాలాసార్లు చెప్పాడు. ”నేను ఆదర్శ పురుషుణ్ణయితే తప్ప నాకు ఆదర్శ స్త్రీ ఎక్కడ నుంచి వస్తుంది” అని చెప్పడంలో కూడా లాజిక్‌ తిరిగి, ‘నన్న ఆదర్శ పురుషుణ్ణి చెయ్యలేక పోయిన లోపం నీదే’ అనే వరకు వెళ్తుంది. ఇది ఆ స్త్రీ మీదెంత బాధ్యతను పెడుతుందీ అనిపిస్తుంది ఆలోచిస్తే. తను ఇదేనా కాదా అని చెప్పగలిగే పరిస్థితులు, అవకాశం, చైతన్యం చలం స్త్రీలకూ లేవు. నవలల్లో నాయికలక లేవు. ”మీ ఆలోచనల స్వరూపం ఇది. మీ అనుభవాల స్వరూపం ఇది. మీ వ్యక్తిత్వం ఇలాంటిది. మీ శరీరం ఇలాంటిది” అని చలం స్త్రీలకు చెప్పడం కనిపిస్తుందే కానీ ఆ స్వరూపాన్నుంచి తప్పించుకోవడానికి కానీ, మేం ఇట్లా లేం అని చెప్పడానికి కానీ, అట్లా ఉన్నదీ లేనిదీ నిర్ణయించుకోవడానికి కానీ స్త్రీలకు ఆనాడు అవకాశం లేదు. నిజానికి అప్పటి కాలంలో స్త్రీలు సెక్స్‌ విషయాల పట్ల ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నారు? చలాన్ని ఏ విధంగా రిసీవ్‌ చేసుకున్నారు? ఆయన మీద ఆరాధనా భావమేనా, విమర్శ కూడా ఉందా? అనే ప్రశ్నలకి జవాబులు దొరకడం కష్టం. ఆయన మ్యూజింగ్స్‌లో కానీ, ఆత్మకథలో కానీ ఎక్కడా వాళ్ళతో జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించడు. ఒక్క లీలగారి గురించి, ఆమె అభిప్రాయాల గురించి కొన్ని వివరాలున్నాయి. ఆమె మొదటి నుంచీ, చివరి వరకూ చలాన్ని తన స్వంతం కావాలనుకున్నదనీ, ఎన్నో విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయనీ, ఆమె తన స్వభావాన్ని ఏ మాత్రం మార్చలేకపోయిందని చలం రాశాడు. అంతేకాని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మనకు సరిగా ఎక్కడా దొరకదు. నా కనిపిస్తుంది చలం స్త్రీలంతా (లీల గారికి కూడా ఏదో మానసిక వ్యాధన్నారు డాక్టర్లు) ఆయన్ని ఆరాధించి దేవుడిలా చూడడమే కానీ ఎదురుపడి వాళ్ళ అభిప్రాయాల్ని, ఆయనతో వాళ్ళు పడ్డ ఇబ్బందుల్ని, తిరస్కారాన్ని ఆయనకి బహిరంగంగా చెప్పలేకపోయారేమోనని. అట్లా చెప్పే ఆడవాళ్ళుండి ఉంటే ఆయనలో ఇంత అసంతృప్తి, బాధా ఉండేది కాదేమో. మనకి కూడా పాఠకులుగా మగవాళ్ళ దృష్టితో స్త్రీని అర్థం చేసుకోవడం, గుర్తించడం తెలుసు కానీ దాన్ని ప్రశ్నించే సాంప్రదాయం లేదు. తనలో వైరుధ్యాల్ని అర్థం చేసుకోగలిగే సాధనాలు చలానికి ఎట్లా లేకుండా పోయినయ్యో వాళ్ళ అభిప్రాయాల్ని కచ్చితంగా చెప్పగలిగే శక్తినిచ్చే సాధనాలు చలం స్త్రీలకి అప్పటికీ లేవేమో. మరి చలాన్ని అర్థం చేసుకోవడానికి సాధనాలు ఇప్పుడున్నాయా అన్న ప్రశ్న వస్తుంది. నా ఉద్దేశ్యంలో ఒక కొత్త దృక్పథంతో చలాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రశ్నలు వేయాలనే దానికి సాధనాలు ఈ రోజు ఫెమినిస్టులుగా మనకున్నాయి. వాటిని రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నాం.

అందులో కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావించదలచుకున్నాను.

మొదటిది స్త్రీల ఉద్యమం, స్త్రీ వాద దృక్పథంతో చేసిన సాహిత్య విమర్శ. అంటే సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ ఎలా ఉందనేదే కాకుండా, అది స్త్రీల అనుభవాలకు ఎంత దగ్గరగా ఉందని, ఆ అనుభవాలను రాజకీయ సాధ్యాలుగా మలచడానికి ఎంతవరకు దోహదం చేస్తుందని కూడా పరిశీలించడం. అదేవిధంగా ఆ సాహిత్యాన్ని సమాజం, ముఖ్యంగా స్త్రీలు ఏ విధంగా అందుకున్నారనేది మరొక ముఖ్య అంశం. చలం రచనలను ఎక్కువగా చదివింది, వాటిపట్ల ఆకర్షితులయింది పురుషులా, స్త్రీలా? ఎవరిమీద ఎటువంటి ప్రభావాన్ని రచయిత కలిగించాడనే విషయాల గురించి ఇంతవరకు ఎవరూ రాయలేదనే చెప్పాలి. దీని గురించి కృషి జరగాల్సిన అవసరముంది.

రెండవది – స్త్రీల ఉద్యమం రూపొందించిన అవగాహనలో ఒకటి సిద్ధాంతానికున్న ‘విశ్వజనీనత’ను ప్రశ్నించడం. విశ్వజనీన విలువలూ, సిద్ధాంతాలూ రూపొందించే క్రమంలో ఎన్నో ఇతర అంశాలు మరుగున పడిపోయే ప్రమాదం

ఉంటుంది. ఉదాహరణకి ”ప్రజా సాహిత్యం”లో స్త్రీల1డు కనిపించరనే స్పృహ మొదటిసారి స్త్రీ ఉద్యమం కలిగించింది. అదే విధంగా దళితులు, మైనారిటీల గురించిన చర్చలకు కూడా స్త్రీ ఉద్యమం దోహదం చేసింది. ఈ అవగాహనతో చలాన్ని అర్థం చేసుకుంటే ఒక (సరైన) విశ్వజనీన సిద్ధాంతం, దృక్పథంతో కాకపోయినా, ఆయన రాసిన ఎన్నో విషయాలు స్త్రీలు-సాంఘిక వ్యవస్థ పట్ల కొత్త ఆలోచనల్ని రేకెత్తించేవిగా ఉంటాయని అర్థమవుతుంది.

మూడవది – సాంఘిక వ్యవస్థ. దీని ప్రాముఖ్యత గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, మార్క్సిస్టు అవగాహన ప్రకారం ప్రభుత్వ అధికారం ఏ విధంగానైనా (ఎన్నికల ద్వారా, సాయుధ విప్లవం ద్వారా) చేజిక్కించుకుంటే, సమాజంలో విప్లవాత్మక మార్పును సాధించవచ్చు. కానీ, ఆ విధంగా ప్రభుత్వాధికారం చేజిక్కించుకున్నంత మాత్రాన సోషలిస్టు సమాజం స్థాపన జరగదనీ, కుటుంబం, మత సంస్థలు, విద్యా విధానం, ప్రచార సాధనాలు, సాహిత్యం వంటి సాంఘిక వ్యవస్థలన్నింటిలోనూ అధికారం అనే అంశాన్ని వ్యతిరేకించకపోతే, అధికార రాజకీయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయనే అవగాహన సాంఘిక వ్యవస్థ (సివిల్‌ సొసైటీ) అనే సిద్ధాంతం మన ముందుకు తీసుకువచ్చింది. దైనందిన జీవితాల్లో అనుక్షణం స్త్రీ ఎదుర్కొనే అధికార రాజకీయాల్ని ప్రశ్నిస్తూ ఎదిగిన ఉద్యమంగా స్త్రీ

ఉద్యమం – కుటుంబ వ్యవస్థ సాంఘిక వ్యవస్థలన్నింటికీ ఒక ఇరుసుగా ఎట్లా పనిచేస్తుందో విశ్లేషించగలిగింది. అదే అంశాలను తన రచనలలో ప్రధానంగా తీసుకున్న చలాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషణ చాలా అవసరమని తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు.

చలం వంటి రచయితల గురించీ, సాహిత్య చరిత్రలో మలుపులు సృష్టించిన ఇతర స్త్రీ, పురుష రచయితలందరి గురించీ నిశితమైన స్త్రీ వాద విమర్శ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లోటు తీర్చే ప్రయత్నాలు ప్రారంభమవుతాయని ఆశిద్దాం.

సంప్రదించిన పుస్తకాలు

1. చలం రచనలు

మ్యూజింగ్స్‌ – అరుణ పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ-1983

బిడ్డల శిక్షణ – స్వీట్‌హోమ్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ-1976

స్త్రీ – స్వీట్‌హోమ్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ-1979

మాన్‌ అండ్‌ ఉమెన్‌ – వేక్‌ ఆఫ్‌ మదనపల్లి-1986

2. రంగనాయకమ్మ – చలం సాహిత్యం – స్వీట్‌హోమ్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ-1982

3. పురాణం సుబ్రహ్మణ్య శర్మ – ఆంధ్రలో చలం

4. జూడిత్‌ పెట్టర్లీ-ది రెసిస్టింగ్‌ రీడర్‌-ఫెమినిస్ట్‌ అప్రోచ్‌ టు అమెరికన్‌ ఫిక్షన్‌

(పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ ‘మన చలం’ సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.