మనిషి లోపలి విధ్వంసం – అల్లం రాజయ్య

అదొక చిన్న రైల్వే స్టేషన్‌. ఆ స్టేషన్‌ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలవల్ల స్టేషన్‌ భవనం గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి పడిన నీటిధారల కారణంగా గోడలమీద చారికలు ఏర్పడ్డాయి. రైల్వే స్టేషన్‌ కుడి ఎడమల పాతిన సిమెంట్‌ పోల్స్‌, కట్టిన ఫెన్సింగు అక్కడక్కడ విరిగిపోయాయి. ఆ స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు, పోయే ప్రయాణికులు సాధారణంగా స్టేషన్‌ ద్వారం నుంచి కాక విరిగిన సిమెంట్‌ పోల్స్‌, ఫెన్సింగ్‌ నుంచే నడుస్తారు.

రైల్వేస్టేషన్‌ వెనుకవైపు, స్టేషన్‌ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వే గ్యాంగు వాళ్ళు తప్ప బుకింగ్‌ క్లర్కు గానీ, స్టేషన్‌ మాస్టర్‌ గానీ ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోగల ఓ మాదిరి పట్నం నుంచి రోజూ వస్తారు.

రైల్వే స్టేషన్‌కు దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులు పడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తోంది. స్టేషన్‌కు ఎదురుగా పసిరిక చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు పెరిగి

ఉన్నాయి. ఆ చెట్ల కింద రైలు పట్టాలకు ఆవలివైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలుపడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపు పచ్చ ప్లాస్టిక్‌ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్రం కూర్చున్నాడు.

పొద్దున తయారు చేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్‌ దావూద్‌ గిరాకీ లేక గొణుగుతున్నాడు.

వేప చెట్టుకింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకుని ముగ్గురు పల్లెటూరు ఆడవాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.

పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.

ఆ చెట్లకింద దుమ్ములో కూర్చండలేక, అలాగని ఎంతోసేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.

”అట్లపోయి రైలెప్పుడు కాలపడ్తదో తెలుసక రాపోరాదు!” భార్య భర్తమీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబీరంగు పాలిస్టర్‌ చీర కట్టుకుంది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి.

భర్త రాయేశం తన అంగీ జేబులో చెయ్యిపెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు. రాయేశం తెల్లటి పాలిస్టర్‌ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గు గని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్‌, ఎడమచేతికి గడియారమున్నది.

”అమ్మా పరికి పండ్లే”! వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు.

”మీ బాపునడుగు ఫో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది.

రాయేశం వంకర నవ్వుకి గంగమ్మ ఎలాంటి జవాబు చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి ”ఎంతకోబత్త (సారాప్యాకెట్టు) పిల్లడా?” అడిగాడు.

”మీ కాలేరు (కాలరీ)లెంత?” ఉపేంద్రం.

”మా బొగ్గు బాయిలకాడ అమ్మినట్టే అమ్ముతానవా?”

”ఈడ అంత రేటుకమ్ముతే బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు.

”ఎవలు?” రాయేశం.

”ఇంకెవలు పాము కోరలిరిసినోలే” ఇంకో గౌండ్లాయన.

పాము కోరలిరిసినోరెవరో రాయేశం అడగలేదు, వాళ్ళు చెప్పలేదు.

”రెండున్నర” ఉపేంద్రం.

”లావు సస్తనే ఉన్నది. మా ఊల్లో సారమావులా పడిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదే ధర.”

”మీ ఊల్లేంది ఈ సుట్టుపక్క అన్ని ఊళ్ళల గిదే ధర – ఈ సారి మావుల (కంట్రాక్టు) పట్టినోడు మన్నై పోయిండనుకో”.

”మా కాలేరు మీద దోసుకుంటండ్రు. ఆడ బత్తకు ఐదు రూపాయలు” రాయేశం రెండు సారా పాకెట్లు తీసుకుని ఒకటి కటుక్కున కొరికి నోట్లో పోసుకుని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.

ఆ వాసన తనకే వచ్చినట్టుగా ఒక బాల్‌వాడి టీచరమ్మ అటేటు జరిగింది.

ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా ”రైలెప్పుడత్తది పిలడా! సిటక్కున సీకటైనంకనా?” అన్నది.

ఆ ముసలమ్మ మనవడు ”ప్యాసెంజర్‌ రైలు గంటకొట్టే దనుక తెలవదే” బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు. అతను ప్యాంటు వేసుకొని ఉన్నాడు.

కొంచెం దూరంలో ఇదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూపొంతూ లేకుండా తిడుతున్నాడు.

రైలు కింద పడి కాలు ఎప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన…

”నిన్ను సిలువకు గట్టిరి బిడ్డా నా యేశయ్యా!

కీలు కీలున మొలలు గొట్టిరి తండ్రీ యేశయ్యా!” అంటూ యేసుక్రీస్తు మరణ ఘట్టాన్ని తను ‘నిజంగా’ చూసినట్లుగా వర్ణించి పాడుతున్నాడు. ఆ గొంతులో విచిత్రమైన ‘వణుకు’ అక్కడివాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో

ఉన్నట్టే ఉంది. అందరికీ చేయిచాపుతూ కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు.

రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం ఇరవై అయిదు పైసల బిళ్ళ తీసి కుంటాయన చిప్పలో వేసి ”ఏసయ్యను కాదు గరీబోన్ని” అని పాటకు అర్థం చెప్పి కదలబోయాడు.

ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకుపోయింది.

రైలు వెళ్ళేదాకా ఆగి పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరుగెత్తాడు.

రాయేశం స్టేషన్లోకి అడుగుపెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్‌ మాస్టర్‌ గదిలోకి తొంగి చూశాడు.

ఒక పాత టేబుల్‌ ముందు అంతకన్నా పాతగీలిన స్టేషన్‌ మాస్టర్‌ విచారంగా కూర్చున్నాడు.

ఇంతలోనే స్టేషన్‌ ద్వారం నుంచీ ఆదరబాదరగా వచ్చిన రైల్వేపోలీసు స్టేషన్‌ మాస్టర్‌ రూంలోకి నడిచాడు. టోపి తీసి

ఉఫ్‌మనుకున్నాడు. ”వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండ్లు సార్‌” ఆ కష్టమంతా ముఖంలో తొంగి చూస్తుండగా మాట్లాడసాగాడు.

”సార్‌ వాన్ని వారం రోజుల క్రితం మన స్టేషన్‌లో రాత్రి చలికి వణుకుతుంటే పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు పట్టుకుపోయిండ్లట. అసలే ఆ ఏరియాల డేంజర్‌గున్నది కదా! మల్ల వీడు పడుసు పోరడాయె. ఏదడిగిన నోరు తెరవకపాయె. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎంత తన్నినా ఏం మాట్లాడలేదట. ఆఖరికి వాని తల్లి గురించి చెప్పిండట. ఎంక్వయిరీల వీళ్ళది కుద్దు రాముల పల్లెనట. తండ్రి బేవార్సుగాడట. భూములమ్ముకొని పెద్దపెల్లిల ఆవారా తిరుగుతున్నడట. వాడు పాతకాపేనట. ఏడాది కరీంనగర్‌ సబ్‌జైల్ల ఉండచ్చిండట. తల్లి కూలినాలి చేసి వీన్ని పెంచి పెద్దజేసిందట. ఆఖరుకు ఆవారా కేసని విడిచిపెట్టిండ్లట” రైల్వే పోలీసు గుక్క తిప్పుకున్నాడు.

”వాడు ఏదైతే మనకేమిటి గాని – మన నెత్తిమీదికి తెచ్చాడు. ప్యాసింజర్‌ వెళ్ళిపోతే ఈ చలిలో రాత్రంతా చావాల్సిందే” స్టేషన్‌ మాస్టర్‌. ”సార్‌ మనము గూడా ఆవారా కేసు కింద పంచనామా చేస్తే” రైల్వే పోలీసు.

”అసలే రోజులు బాగాలేవు. వెధవ పెంట మనమీదికొస్తే! అచ్ఛా నువ్వు పోయి శవం దగ్గర కావలి ఉండు. రంగయ్య టీకి పోయి వస్తాడు. ఈలోగా నేను వాడి తల్లి, తండ్రి కోసం ట్రై చేస్త” స్టేషన్‌ మాస్టర్‌. రైల్వే పోలీసు గది బయటకు వచ్చాడు.

”ఏందేంది?” రాయేశం.

”ఏమున్నదివయ్యా. మర్డర్లు, కూనీలు, చావడాలు, చంపడాలు – ఆజ్‌కల్‌కా దునియా ఖుద్‌ మర్‌ నా కిసీకో మార్‌ డాల్‌నా (ఇయ్యల్ల రేపు ప్రపంచంల తను చావడం ఇంకోన్ని చంపడం)”.

”దాసుకోవయ్యా! అమ్మమ్మ నీ ఉచ్చ మందులకు గావాలంటే చింతకొమ్మ లెక్కి చిమ్మిచ్చి పోసిందట” రాయేశం.

”పొద్దటి నుంచి అడిగినోడికల్ల చెప్పలేక నోరు పోతంది. అగో క్యాబిన్‌ దగ్గర ఓ మాదెర్‌చోదు గాడు రైలుకింద తలకాయ బెట్టిండు. పంచనామా చేసి పారేత్తమంటే మా స్టేషన్‌ మాస్టర్‌ ఉచ్చబోసుకుంటుండు. వాని తండ్రి వీనికన్నా ఆవారా తీరుగ ఉన్నడు” చెమట పట్టిన ఖాకీ బట్టలు మాటిమాటికీ లూజు చేసుకుంటూ ఉత్తరం వేపు క్యాబిన్‌ కేసి నడిచాడు.

స్టేషన్‌ మాస్టర్‌ పెద్దపల్లికి ఫోన్‌ చేశాడు.

”ఇంతకుముందు వైర్‌లెస్‌ల ఇక్కడి పోలీస్‌స్టేషన్‌కు కబురు వచ్చింది. వాణ్ణి పోలీసు వాళ్ళు వెతికి పట్టుకున్నారు. సింగరేణి రైలులో తీసుకువస్తున్నారు” ఆవలి కంఠం.

మళ్ళీ తల్లి ఉండే ఊరు ఓదెలకు ఫోన్‌ చేశాడు. అదృష్టవశాత్తు ఆ ఊరులో రైల్వేస్టేషనున్నది… ”వాని తల్లి, బంధువులు ఎడ్లబండిలో వస్తున్నారు అక్కడి నుంచి”.

స్టేషన్‌ మాస్టర్‌ ఈ కబురు శవం దగ్గర కాపలున్న రైల్వే పోలీసులకు తెలుపాలనే ఉద్దేశంతో గది బయటకొచ్చాడు.

”సార్‌ ప్యాసెంజర్‌ టైమెంత?” రాయేశం.

”ఉండవయ్యా మగడా!” స్టేషన్‌ మాస్టర్‌ దిక్కులు చూస్తూ చిరాకుగా అని గ్యాంగ్‌మెన్‌ కోసం వెతకసాగిండు.

”నేను శవాన్ని సూసత్త సార్‌! ఏం చెప్పమంటారు?” రాయేశం.

”వాని తండ్రి సింగరేణి రైలులో వస్తున్నడని చెప్పు” స్టేషన్‌ మాస్టర్‌.

రాయేశం చేతులూపుకుంటూ ప్లాట్‌ఫారం మీదనుంచి ఉత్తరం వేపు పోవడం చూసి ”రైలచ్చే యేలయ్యింది మల్లేడ కాలవడ్తన్నవ్‌?” పట్టాల ఆవలినుంచీ రాయేశం భార్య గంగమ్మ కేకేసింది.

ఆ కేకను పట్టించుకోకుండానే రాయేశం చరచరా నడుస్తున్నాడు. రాయేశం బూట్లకింద ఇసుక కరకరలాడుతోంది.

ప్లాట్‌ఫారంకు వంద గజాల దూరంలో క్యాబిన్‌కు ప్లాట్‌ఫారంకు మధ్యన పదిమంది మనుషులు కన్పించారు.

అక్కడ నలుగురు చేతి సంచీలు పట్టుకొని విచార వదనాలతో నిలబడి ఉన్నారు.

రైల్వే పోలీసులిద్దరు అక్కడ శవం ఉన్నదన్నమాట మర్చిపోయి బీడీలు పీలుస్తూ లోక రివాజు గురించి మాట్లాడుకుంటున్నారు.

ఢిల్లీ వెళ్ళే రైల్వేలైను పక్క కంకర రాళ్ళమీద ఒక మొండెం పడుకోబెట్టి ఉన్నది. శవం మీద చాలీచాలని తెల్లని గుడ్డ కప్పి ఉంది. పట్టాల మధ్య కండ్లు భయంకరంగా తెరుచుకున్న తల ఉంది. తలకు, మొండానికి మధ్య రక్తం మడుగుకట్టి జొబ్బజొబ్బ పెద్ద ఈగలు ముసురుతున్నాయి.

ఇంకా మీసం సరీగ మొలవని లేత ముఖం. ఎత్తు దవడలు, ఎంత అందమైన ముఖం. నెత్తిమీద రక్తంతో తడిసి పిడుచగట్టిన వెంట్రుకలు. మొండెంమీద కప్పిన గుడ్డ సరిపోక పిక్కలు పాదాలు కన్పిస్తున్నాయి. మడిమెలు గిలగిల తన్నుకోవడం వల్ల పగిలున్నాయి. ప్యాంటు చిరిగి ఉంది.రాయేశం నిషా దిగిపోయింది. కడుపులో చెయ్యేసి ఎవరో దేవేసినట్టనిపించింది. ”ఛీ మనిషి జల్మంత పాపకారి జల్మ మరోటి లేదు” అన్నాడు.

రాయేశంకు తమ బొగ్గుగనిలో పైకప్పు కూలి చనిపోయిన కార్మికుల శవాలు కండ్లముందు మెదిలాయి.

రాయేశం కాళ్ళమీద కూలబడి ”అయ్యో బిడ్డా! కట్టం సుకం సూడాల్సినోడివి ఎంత కర్మానికెత్తుకున్నవ్‌?” అని బొటబొట

కన్నీళ్ళు కార్చాడు.

”ఖర్మ మేమున్నది బై – ముచ్చుదొబ్బుకత్తె ఎవడైన గంతే” రంగయ్య అనే రైల్వే పోలీసు.

”ఛల్‌…” చుట్టూ మూగుతున్న మందిని ఇంకో పోలీసు దూరం కొట్టాడు. ”ఏ తల్లి గన్న బిడ్డో!” ఊళ్ళో బతుకు గడవక సింగరేణి గనుల్లో పరుగు పందెంలో నౌఖరి కోసం పోతున్నవాడన్నాడు.

”కట్టాలలో జెనుకక (భయపడక) సీతమ్మ తీర్గ అగ్గిల నుంచి బయటికచ్చినోడే మనిషి” ఒక ముసలయ్య.

”అరె! కష్టాలుంటయి. సుఖాలుంటయి. మనిషి పుటకే అసొంటిది. ఈ కాలపు పోరగాండ్లకు అన్ని ముంగటికి రావాలె” రంగయ్య.

”ఔ బాంచెన్‌ – నీ తీర్గ అందరికి కొలువు దొరకద్దా” ఒక ముసలమ్మ.

”ఔ బై కొలువు దొరకలే, సచ్చుడేనా?” రంగయ్య వాదంలోకి దిగుతూ.

”సావకుంటె ఏం జేసుదువయ్యా! అడుక్కు తినమంటావా? ఊళ్ళమీద బడి దోసుకు తినమంటావా?” ఎవరో మందిలో నుంచి.

”అయి రెండూ బమ్మకట్టాలే” యువకుడు.

ఇంకో రైల్వే పోలీసు బీడీ విసిరి కొడుతూ ”ఔ”నంటూ ఒప్పుకున్నాడు.

”ఆ దమ్మున్నోడు సావడు. అడ్డమచ్చినోన్ని సంపుతడు” రంగయ్య తన అనుభవం నుంచి నిగ్గుతీసిన సత్యాన్ని చెప్పి రైల్వేస్టేషషన్‌లోకి నడిచాడు. ”ఏ రైలుకు పడ్డడు బిడ్డా” ముసలవ్వ.

రాయేశం కండ్లకు చీకట్లు కమ్ముతున్నాయి. తోటి కార్మికులు గనిలో చనిపోయినప్పుడు మిగతా కార్మికుల్లో చెలరేగిన కోపం అతని ముఖంలో చిమ్ముకొచ్చింది.

”వారం రోజుల క్రితం ఆవారా కేసు క్రింద పోలీసులు పట్టుకుపోయినారట” ఇందాక రైల్వే పోలీసు స్టేషన్‌ మాస్టర్‌కు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. కంఠంలో కోపం దుఃఖం మిళితం కాగా ”మనిషి జల్మంత ఈసం జెల్మ లేదు. బంచత్‌- గీడ నియ్యతి గల్లోన్ని నోట్లో నాలుక లేనోన్ని బతుకనియ్యరు. అరే కోమలి పోరడు ఇంట్లనుంచి ఎట్లచ్చిండో? కొట్లాడే అచ్చెనో? మనసు చెంచాల్లమైతేనో? బుద్దులు గ్యానాలు చెప్పే నాయిన్నే తనకే దోసక దేశాలు బట్టకపోయిండట. ఆడది ఏం చెలాయించుకత్తది? ఇటు సూత్తే తల్లి కొట్టిపోసుకునుడు. అటు తండ్రి ఏమయ్యిండో సమఝ కాక ఎంత కొట్టిపోసుకున్నడో? అరరె! ఎవలన్న మనిషి దగ్గరికి తీసి కడుపుల ఆయత్తం అడుగుతె బతికిపోవు. ఎంతపని జర్గిపాయె. పోలీసోల్లన్న దగ్గరికి దియ్యకపోయిరి. ఆళ్ళు దొరికిందే బరికినట్టు మనసు పుండైపోయినోన్ని మళ్ళీ కొట్టిరి. ఇదేమన్న నాయెమా?” రాయేశం కోపంగా.

”నీకెందుకయ్యా తీస్‌మార్‌ఖాన్‌ (ముప్ఫయి మందిని కొట్టేవాడు). ఊ అంటే తీసుకుపోయి పోలీసు స్టేషన్ల అప్పజెప్పి వస్త” రైల్వే పోలీసు.

”ఏది అప్పజెప్పు సూద్దాం” జేబులో సారా ప్యాకెట్టు తీసి కటుక్కున కొరికి గటగటా తాగి రాయేశం అన్నాడు కోపంగా.

”ఏం జేస్తవ్‌ బే. అందరి తీర్గ నువ్వ చూడక, లావులావు మాట్లాడ్తన్నవ్‌. సచ్చినోని బావవా? అన్నవా?” రైల్వే పోలీసు.

”అంతకన్న ఎక్కువ” రాయేశం పోలీసుమీదికి ఉరికాడు.

అక్కడ గుమిగూడిన వాళ్ళంతా వాళ్ళిద్దరినీ విడదీశారు. దూరం నుంచి ఈ గొడవంతాత చూస్తుత్న రాయేశం భార్య గంగమ్మ పట్టాల మీదుగా పరిగెత్తుకొచ్చింది. శవాన్ని చూసి ఆమె నోట మాట రాలేదు.

తిట్టుకుంటూ వచ్చిన గంగమ్మ భర్త చెయ్యి పట్టుకొని తీసుకుపోయింది.

రాయేశం బియ్యం బస్తామీద కాసేపు తలపట్టుకొని కూర్చున్నాడు. గనిలో చనిపోయిన శవాల దగ్గర కార్మికులు కోపంగా అరుస్తున్న దృశ్యం. చివ్వున లేచి వెళ్ళి మరో రెండు సారా ప్యాకెట్లు తెచ్చుకున్నాడు.

గంగమ్మ తను చూసిన దృశ్యాన్ని అక్కడివాళ్ళకు వర్ణించి చెప్పడంలో భర్తను మర్చిపోయింది.

అదివరకే చూసి వచ్చినవాళ్ళు వివరాలు చెప్పారు. కొత్తగా వచ్చినవాళ్ళు శవాన్ని చూడడానికి కదిలారు.

అప్పుడు సాయంత్రం అయిదు గంటలయ్యింది. చలికాలపు పొద్దు క్రుంకడానికి సిద్ధంగా ఉన్నది. పడమటి ఆకాశం ఎలుగడిపడిన అడివిలాగా ఉన్నది. ఏడ్చేడ్చి సొమ్మసిల్లిన పసిపిల్ల జేవురించిన ముఖంలా సూర్యుడు. స్టేషన్‌ ఆవలి ప్రక్కనగల ముసలి పచ్చిరిక, వేప, తుమ్మచెట్ల నీడలు ఆ చోటంతా కప్పేశాయి. చలి విషాదంలా కమ్ముకుంటోంది.

ఆ చిన్న స్టేషన్‌లో జన సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ స్టేషన్లో చేరుతున్న జనమంతా చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్ళు. పైగా సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ తాలూకా బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఆ స్టేషన్‌ నుంచి ఖాజీపేటకు పోయేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా ఈ మధ్య కొత్తగా రైల్వేలైను విద్యుద్దీకరణ, రైల్వే కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు.

స్టేషన్‌లోకి వచ్చిన వాళ్ళందరూ శవాన్ని చూసి వచ్చారు. అక్కడ చాలామంది ముఖాలలో నిర్లిప్తత చోటుచేసుకుంది. అటు తెల్లకల్లు (నాటుసారా), సారా అమ్మకం జోరుగా సాగుతోంది. అందరి మనసుల్లో ఆ శవం ఒక పెను కల్లోలం లేపుతోంది. మంటను ఎగదోస్తోంది. ఆ మంటమీద ఏదో ఒకటి పోసే ప్రయత్నం. షేక్‌ దావూద్‌్‌ మిరపకాయ బజ్జీలు అయిపోయాయి.

చావు-బతుకుల మధ్య తచ్చాడే మాటలు, సుళ్ళు తిరిగే మాటలు.

ఒక ముసలి రైల్వే మొఖద్దమ్‌ అక్కడే పాత క్వార్టర్లో ఉండేవాడు. డ్యూటీ దిగి స్నానం చేసి ధోవతి కట్టుకొని వచ్చి స్టేషన్లో తిరుగుతూ, ”ఆ పొల్లగాడు పది దినాల కింద గీ స్టేషన్లనే తిరుగుతున్నడు. ఎవలతోని మాట్లాడడు, సకులం దోసుకపోబడ్డోని తీర్గ కూకుండెటోడు. అప్పుడప్పుడు పిచ్చోని తీర్గ ఒర్రుకుంట అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు ఉరికెటోడు. సొమ్మసిల్లి పడిపోతే మేం మొన్న బువ్వబెట్టినం. ఆనాడు పొల్లగాని తల్లి, ఎవలో సెప్పుతే అచ్చి తీసుకపోయింది. మల్ల గిదే సూసుడు” తనకు తెలిసిన వివరాలు చెప్పసాగాడు.

ఆ వివరాలు అందరికీ తెలిసినట్టుగానే ఉన్నవి. అందరూ ఆ పిల్లగానిలాగే దగ్ధమైన మనసులతో ఎక్కడెక్కడో దిక్కుతోచక పరుగెత్తిన వాళ్ళలాగే ఉన్నారు. అందరి లోలోపల ఏదో తొలుచుకుపోతోంది. అదేమిటో కొద్దికొద్దిగా తెలిసినట్టే తెలిసి మళ్ళీ చిక్కుపడుతోంది. పల్లెల కడుపుల్లో ఏదో కల్లోలం మరిగి మరిగి బుసబుస పొంగుతోంది. ఇల్లు, పిల్లలు, భూమి, పంటలు, పెండ్లిల్లు, ఎండావానా అన్ని రకాల మానవ బంధాలు, సెంటిమెంట్లు తెగిపోతున్నాయి. అన్నిటికన్నా బలీయమైన భూమి సంబంధం తెగిపోయి పల్లెలను విడిచి బతుకు తెరువు కోసం చెల్లాచెదురుగ చెదిరిపోయిన వాళ్ళు, పిల్ల పేగు సంబంధాలు తెగినవాళ్ళు అస్తుబిస్తుగా తచ్చాడుతున్నారు.

గొణుగుడు, విచిత్రమైన కొత్త మాటలు చితి మంటల చిటపటల్లా… కూలిపోయిన వేదాంతాలు స్టేషనంతా గగ్గోలుగా అర్దం కాకుండా ఉంది.

మోకాళ్ళదాకా నిక్కరేసుకున్న రైల్వే కార్మికుడు వచ్చి ‘ఠనాఠన్‌’ మంటూ గంటకొట్టాడు.

రైల్వే బుకింగ్‌ కిటికీ దగ్గరికి జనం పరుగెట్టారు.

బుకింగ్‌ క్లర్కు అప్పుడే నిదురలేచిన వానిలాగా టికెట్లకెగబడుతున్న ముఖాలకేసి చూడకుండా టికెట్టు నింపాదిగా ఇస్తున్నాడు.

రాయేశం ”పాసెంజరు ఎంత లేటు మారాజా” అన్నాడు పరాచికమాడే ధోరణిలో.

బుక్కింగు క్లర్కు ఈ పరాచికాలతీతుడిలా కన్పిస్తున్నాడు. అతను జవాబు చెప్పలేదు.

”రామగుండం రెండు పెద్దయి, రెండు సిన్నయియ్యి” అన్నాడు రాయేశం.

రాయేశం టిక్కెట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి సింగరేణి రైలు వస్తున్ననదని స్టేషన్‌లోని వాళ్ళు వేగిరపడుతున్నారు.

మరికొద్ది సేపట్లోనే ధనధనలాడుతూ సింగరేణి రైలు వచ్చింది. దిగేవాళ్ళు తక్కువ, ఎక్కేవాళ్ళు అంతకన్నా తక్కువే. రైలు వెళ్ళిపోయింది.

సింగరేణి రైలులో నుంచి ఒక పొడుగాటి నడీడు మనిషి దిగాడు. అతని ముఖం కోలగా ఉన్నది. పండ్లు కందుపండ్లు (గారపట్టిన), కమీజు భుజాలమీద చిరిగి ఉన్నది. ధోవతి సన్నపుదే కానీ చాలా పాతది. కాళ్ళకు చెప్పులు లేక మోకాళ్ళదాకా దుమ్ము పేరుకున్నది. మడిమెలు ఎండిన వరిమళ్ళలా పగిలున్నాయి. ఎముకలు తేలి ఆరడుగుల అస్థిపంజరం లాగున్నాడు. అతని ముఖం బండబారి ఉంది. కండ్లు… ఆ కండ్లు అక్కడున్నవాళ్ళకు తెలియకుండా ఉన్నాయి. మొత్తానికి అతను విధ్వంసమైన సేనా నాయకునిలాగా ఉన్నాడు. అతని చేతిలో మూలలు చిరిగిన పాత క్యాష్‌బాగ్‌ ఉంది. కుడిచేతిలో బాగా నలిగిపోయిన రెండు తెలుగు వార్తా పత్రికలున్నాయి. అవి ఏనాటివో, తెలియకుండా మాసి ఉన్నాయి.

అతని వెంటే నల్లగా, బలిష్టంగా ఉన్న రైల్వే పోలీసు దిగాడు. అతను బాగా వంగిపోయి

ఉన్నాడు. అతని ముఖం భూమి పొరల్లో నలిగిన నేలబొగ్గులా ఉంది.

రైల్వే పోలీసు ఆ పొడుగాటి వ్యక్తిని స్టేషన్‌ మాస్టర్‌ రూంలోనికి తీసుకుపోయాడు.

”బండి కింద పడ్డ పొల్లగాని తండ్రి వచ్చిండనే వార్త” అతి తొందరలోనే అందరికీ తెలిసిపోయింది. అతన్ని చూడడం కోసం స్టేషన్‌ మాస్టర్‌ రూంకేసి చాలామంది నడిచారు.

”వచ్చావా నాయనా?” స్టేషన్‌ మాస్టర్‌ పాత నల్లకోటు తొడుక్కొని బయలుదేరాడు.

పొడుగాటి వ్యక్తి కొడుకును కోల్పోయిన తండ్రిలా లబోదిబోమని రోదించడం లేదు. శవంగా మారిన తన రక్తాన్ని చూసుకోవడానికి పరుగెత్తలేదు. ఆ మొత్తం వ్యవహారం అదివరకే అనుభవించిన వాడిలాగా ”అంత తొందరేం లేదన్నట్లు”గా స్టేషన్‌ మాస్టర్‌ టేబుల్‌కు ఎదురుగా గల కుర్చీమీద కూర్చున్నాడు.

కిటికీల్లోంచీ, దర్వాజాల్లో నుంచీ చూస్తున్న జనం మొదట విస్తుపోయారు. ఆ తరువాత ”బండ తీరుగున్నడు”,”మనిషికి గింత సెమటలేదు”, ”నెనరు లేదు”. తలోరకంగా గుసగుసలాడారు.

పొడుగాటి వ్యక్తి తలతిప్పి వెనక్కి చూశాడు. అనేక ముఖాలు సగం సగం కాలిపోయినట్టుగా అతనికి కనిపించాయి. మొత్తం ఆ ప్రాంతమంతా మనుషులు కాలిన కమురు వాసన వ్యాపించినట్టుగా అతనికి తోచింది.

”అరె నడువయ్యా రాజారాం” రైల్వే పోలీసు యాతనగా…

”ఎక్కడికీ?” పొడుగాటి వ్యక్తి రాజారాం.

”ఎక్కడికంట వేందయ్యా! నా కొడుకు పెండ్లికచ్చినవా? నిన్ను పెద్ద పెల్లంత తిరిగి దొరుకబట్టేటాల్లకు తాతలు దిగచ్చిరి”. ”అయితేం జెయ్యమంటవు?”

”చనిపోయిన నీ కొడుకును చూసుకోవా?” స్టేషన్‌ మాస్టర్‌.

రాజారాం తన కొడుకు ముఖం స్టేషన్‌ మాస్టర్‌దే అన్నట్టుగా అతని ముఖంలోకి చూసి ”చూసేదేమున్నది” అన్నాడు.

”కాలంతకపు ముండ కొడుకున్నట్టున్నది” స్టేషన్‌ మాస్టర్‌కి మతి పోతోంది. తన సర్వీసులో చావులు చాలా చూశాడు. జంతువులు, మనుషులు… చనిపోయింది మనిషైతే స్టేషనంతా ఏడుపులు, పెడబొబ్బలతో నిండిపోయేది. శవాలకేసి పరిగెత్తే వాళ్ళు… ఆ ఏడుపులు తగ్గి పంచనామా చేసేసరికి తాతలు దిగొచ్చేవాళ్ళు. కానీ ఈ మనిషికి ఆ ధ్యాసే లేదు. వీడు మనిషేనా? జంతువా? రాయి కాదుకదా? ఇంతకూ వీడు చనిపోయిన పిల్లవాడి తండ్రేనా?

స్టేషన్‌ మాస్టర్‌ మీమాంసలో ఉండగానే రాజారాం ముఖం రుద్దుకున్నాడు.

”అదికాదయ్యా! ఎంతసేపు శవాన్ని ఉంచుతాం. పొద్దున్న నాలుగున్నరకు చనిపోయాడు. ఇప్పటికే ఖరాబయింది. పంచనామా చెయ్యాలి”. స్టేషన్‌ మాస్టర్‌ నచ్చచెప్పే ధోరణిలో. ”చెయ్యిండ్లి” రాజారాం.

”అక్కడికే పోదాం” స్టేషన్‌ మాస్టర్‌. ”పోయి?”

”అక్కడ నువ్వు నీ కొడుకును చూసుకొని నవ్వేవు. మేం ఏడుస్తం” రైల్వే పోలీసు కోపంగా.

రాజారాం లేచి నిలబడి రైల్వే పోలీసు ముఖంలోకి చూశాడు. అక్కడ అతనికి కాలిపోయిన తునికి చెట్టు మొదలు కనిపించింది.

ఈ వాదనలు ఇష్టంలేని వానిలాగా రాజారాం లేచి నిలుచున్నాడు. నిజానికి కొడుకు శవం అతని మనసులో ఎప్పుడో చూసుకున్నాడు. కొడుకు చనిపోవడం ఎప్పటి నుంచి ప్రారంభమయింది అన్న చిత్రమైన ఆలోచన కలిగింది. మనుషుల చావు ఒక ఘడియలో జరగగలదన్న దానికన్నా, సంవత్సరాల తరబడి జరుగుతుందనేది అతని నమ్మకం.

స్టేసన్‌ మాస్టర్‌, రైల్వే పోలీస్‌ రూంలో నుంచి బయటికి నడిచినా కూడా రాజారాం కొడుకు చావు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనదనేది తెలియక అక్కడే నిలుచున్నాడు.

”ఏమయ్యా రాజారాం” రైల్వే పోలీసు పిలిచాడు.

రాజారాం కలలో నడుస్తున్నట్లుగా రూం బయటికి వచ్చాడు. అక్కడివాళ్ళంతా రాజారాంను చుట్టుముట్టారు. ”పాప కర్ముడున్నట్టున్నది” ఎవరో ముసలమ్మ గొణిగింది.

”ఏమయ్యా ముఖం సూత్తే సదువు సాత్రం వచ్చినోని తీర్గున్నవ్‌. ఇయ్యల్లటి రేపటి కోమలి పోరగండ్లు మాటంటెబడ్తలేరు. కొడుకును కొట్టినవా? తిట్టినవా?” ”నీకు అఖల్‌ (బుద్ధి)లేదా?”

ఇలాంటి తిట్లు దీవెనలెన్నెన్నో… పిల్లలను ఎట్ల పెంచుకోవాలో సలహాలు… ఆ తిట్లమీద రాజారాంకు ధ్యాస లేదు. మనుషులందరికీ చావడం ఎప్పుడు మొదలయ్యిందో నన్నట్టుగా, చావును జయించిన వాళ్ళున్నారా అన్నట్టు చూశాడు.

రాయేశం తలవంచుకుని నడుస్తున్న రాజారాం పక్కకు వచ్చి ”నీకెందరు కొడుకులే?” అన్నాడు తడి గొంతుతో ఆప్యాయంగా.

”ఒక్కడే” రాజారాం. జనంలో కొందరికి మరీ కోపం పెరిగింది. ”ఓరి జెష్టమ్మా! ఒక్క కొడుకును సాది సవరచ్చెన చేసుకోలేంది నువ్వేం మనిషివిరా?” ఒక ముసలమ్మ.

”ఛత్తెరి ఏ పాపకర్ముడన్నా గీదునియల కొడుకుల, బిడ్ల సాదుకోని వాడుంటడా?” ఒక నడీడువాడు.

”ఇగో ఈడున్నడు గదా?”

”ఇయ్యల్ల రేపు ఎవలరచ్చెన ఆళ్ళ సేతుల్లున్నదా? అంత మంచిగనే బతుకుదామనుకుంటరు. కని నొన్ట రాసిన రాత… ఆ పిల్లగానికి గీకొరత రాసిండు బమ్మదేవుడు” మరొక నడీడు మనిషి.

”మన గీతలన్నీ రాసేది మనుషులే” రాయేశం అన్నాడు.

రాజారాం ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు.

అతని వెంట మంది నడిచారు. రైల్వే పోలీసు, స్టేసన్‌ మాస్టర్‌ ముందు నడుస్తున్నారు.

పొద్దుగూకింది, పడమటి దిక్కు కాలి కూలిన గ్రామం దూరంగా కనిపించినట్ల్టుగా నలుపు ఎరుపుల సంగమం.

రాజారాం బోరింగు నీటి పంపు దగ్గర ఆగాడు. ఎవరో బోరింగు కొట్టారు. రాజారాం ముఖం కడుక్కున్నాడు. కొన్ని నీళ్ళు తాగాడు. జేబులు వెతుక్కున్నాడు. ఎవరో బీడీ కట్ట, అగ్గిపెట్టె ఇచ్చారు. ఎవరో సిగరెట్టివ్వబోతే తీసుకోలేదు. బీడీకట్ట తిరిగి ఇవ్వబోతే ఇచ్చినాయన వాపసు తీసుకోలేదు.

బీడీ బస్సబస్స పీలుస్తూ రాజారాం నడుస్తున్నాడు.

అప్పటికే శవం దగ్గర మంది జమైపోయారు.

రాజారాం రైలు పట్టాల దగ్గర పడున్న తన మాంసాన్ని, నెత్తురును చూశాడు.

జనం రాజారాం ముఖాన్ని అక్కడ పడున్న తలకాయను మార్చి మార్చి చూశారు. దాదాపు రెండింటిలో ఒకే పోలికలు, విచిత్రంగా రెండింటిలో ఒకే భావం.

రాజారాం ఒక రాతిబొమ్మలాగా నిలుచున్నాడు.

స్టేషన్‌ మాస్టర్‌ కనుసైగతో రైల్వే పోలీసు మొండెంమీది గుడ్డ తొలిగించాడు.

రాజారాం సత్తువ లేనివానిలాగా కాళ్ళవేపు కూలబడ్డాడు.

”అబ్బ ఎంత నెనరు లేని గుండెనయ్యా నీది?” అన్నారెవరో.

రాయి, పాపకర్ముడు లాంటి మాటలు ఒకవేపు… ”అయ్యో కాసేపూసే చెట్టు” అని ఇంకొక వేపు.

రాజారాంకు ఈ మాటలేవీ చేరడం లేదు. తన మనసులో అనేక దృశ్యాలు రూపుకట్టసాగినయ్‌. పోలీసుల దాడిలో కూలిపోయిన గుడిసెలు, పెంకులు కిందికి తోడిన పెంకుటిండ్లు, చెల్లాచెదురుగా పడిన ధాన్యం, తొక్కబడిన కుండా, గుర్గి, ధ్వంసమైన గ్రామం అతని మనసులో రూపుకట్టింది.

ఇప్పుడు రాజారాం ఒక ధ్వంసమైన పల్లెలా ఉన్నాడు. ఎలుగడిబడి సాంతం కాలిపోయి చల్లారిన అడివిలా

ఉన్నాడు. ఇంకిపోయిన నదిలా, నెర్రలిచ్చిన ఎండిన చెరువులా ఉన్నాడు. మాటలు తెగిపోయిన మనిషిలా కూర్చున్నాడు.

ధ్వంసమైన పల్లెలో ఇల్లిల్లు తిరిగి చూసిన ఆకలేసిన దుక్కిటెద్దులా రాజారాం ఎప్పుడో మరచిపోయిన తన బతుకు తాలూకా శకటాల చుట్టూ తచ్చాడుతున్నాడు. చిత్ర విచిత్రంగా ఈ శకలాలు అతని మనసులో మెదలసాగినయి. తన కొడుకు చావు తనకు పుట్టక ముందెప్పుడో ప్రారంభమైనట్టుగా అతనికి తోచింది.

ఒక అంగీ తప్ప లాగు లేని పిల్లవాడు తన తండ్రివెంట ఉరుకుతున్నాడు. ఒక చేతిలో పార, ఇంకో భుజం మీద మోటబొక్కెన గల రైతు నడుస్తున్నాడు. ఎండకు పిల్లవాడి పాదాలు మాడిపొయ్యాయి. తండ్రి తిడుతూ కుడి చంక కెక్కించుకున్నాడు. పిల్లవాడు మక్క కంకులకు వచ్చిన పీసును చూపి ”నాయనా వీటికి మీసాలెక్కడ నుంచి వత్తయే?” అంటున్నాడు.

ధ్వంసమైన పల్లెలో ఎవరో ఏడుస్తున్నట్టుగా అన్పించింది. ముడతలు బడ్డ ఎర్రతోలు, నీలం రాయి కొనుకపోగుగల తండ్రిని వాకిట్లో పడుకోబెట్టారు. తల్లి మీదపడి ఏడుస్తోంది… కడుపుల నరాలు బయటపడేలాగు దగ్గుతూ, ఏడు కొయ్యల్లా తల వెంట్రుకలు కలిగిన అన్న… పోలీసు పటేల్‌ కింద గుమస్తా బొనుగూపినట్టుగా మాట్లాడే అంతెత్తు వదిన… అన్న తాగి తాగి చనిపోయాడు. కుటుంబం కకావికలు. తను చదువు బడిలో నుంచి నాగలికి మార్పు. తండ్రి చావు మళ్ళీ కన్పించింది. తండ్రి, అన్న ఇద్దర్లో ఎవరు ముందు చనిపోయారో జ్ఞాపకం రావడం లేదు.

తను నాగలిని పట్టేనాటికి పదెకరాల భూమి. నుయ్యికోసం అంజుమాన్‌ (సహకార సంఘం) అప్పు. అప్పు తీరలేదు. తను వేసిన మిర్చి పంట… ఇంజను (పంపు సెట్టు) కోసం మళ్ళీ కొత్తగా వెలిసిన భూమి తనఖా బ్యాంకు అప్పు… మిర్చికి కొరుకుడు రోగం. హల్లికి హల్లీ సున్నకు సున్న. బేంకువాళ్ళు పెద్ద ఎడ్ల బండి తీసుకుపోవడం, వేలం వేయడం… ఎరుపెక్కిన చెక్కిళ్ళతో ఈ గజిబిజి మధ్య ఒక స్త్రీ రూపం కన్పించింది.

తన్నులు, గుద్దులు, తాగుడు. బిసతప్పిన యంత్రంలా తను తిరిగేనాటికి తన భార్య కలుపులకు, నాట్లకు కూలికి పోతున్నది. బీదతనపు చావులో నుంచి పిల్లవాన్ని తీసుకొని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాజారాం మళ్ళీ భార్య దగ్గరకు పోలేదు. తాగడం, దొరగారి దగ్గర చేత (వ్యవసాయం) చేయించడం, నెల పనిచేస్తే మరో రెన్నెల్లు తిరగడం, ఎక్కడ బడితే అక్కడ… ఊళ్ళెకు పాటలచ్చినయ్‌… ఊళ్ళో గొడవలు ప్రారంభమయ్యేనాటికి తను ”తునికి ఆకు కల్లం (బీడీ ఆకుల కాంట్రాక్టు)” పట్టాడు. గొడవ లేకుండా వాళ్ళు ఇయ్యమన్న రేటు (అన్నలు-నక్సలైట్లు ఇయ్యమన్న రేటు) ఇచ్చినందుకు పోలీసులు పట్టుకపోయారు. మరింకేమీ జ్ఞాపకం రాలేదు. ఊళ్ళో ఒక యువకుడికి జమానతుగ పాత ఇంటిని రాయించాడు. తట్టుకోలేక కేసుల సుట్టు తిరగలేక బేలు జంపుచేసి ఆ పిల్లవాడు పార్టీలో కలిసిపోయిండు. జమానతు డబ్బు కట్టమని ఆర్నెల్లు జైలు, ఆఖరికి ఇల్లు జప్తు చేశారు. ఆ తరువాత తనెక్కడ తిర్గింది, ఏమి చేసింది, జ్ఞాపకం లేదు.

రైల్వే పోలీసులు మొండాన్ని, తలను ఒక దగ్గర చేర్చారు. రైల్వే పోలీసొకాయన పంచనామా రాస్తున్నారు. ఇంకొకాయన మందిని దూరం కొడుతున్నాడు.

”ఇంటినుంచి ఎప్పుడెల్లిపోయిండు?” స్టేషన్‌ మాస్టర్‌.

”ఎవలింటి నుంచి?” రాజారాం తేరుకుని.

”నీ ఇంటినుంచి”.

రాజారాం మాట్లాడలేదు. తల, మొండెం కలిపిన తన కొడుకును, అక్కడ నిల్చున్న మందిని మార్చి మార్చి చూశాడు. వీడు తన కొడుకేనా? నాలుగేండ్ల పిల్లవాడి ముఖం ఎంత ముద్దొచ్చేది! వాడి కడుపులో ఎన్ని ప్రశ్నలుండేవి? వాడి చిన్న కండ్లు ఎంత ఆత్రంగా పిట్టను, జంతువును, చెట్టును చూసేవి? ఇక్కడి వీడి ముఖంలో ఏ ప్రశ్న లేదు. విధ్వంసమై పోయిందెప్పుడో!

”నీకు ఇల్లు లేదా?” స్టేషన్‌ మాస్టర్‌కి కోపం వస్తోంది.

”లేదు” రాజారాం జ్ఞాపకాలు కొద్దికొద్దిగా అతుక్కునే సమయంలో ఈ ప్రశ్నలేమిటి అన్నట్టుగా.

”ఎప్పుడు వెళ్ళిపోయిండు?”

”ఎవలు?”

”నీ కొడుకేనయ్యా!”

రాజారాం మాట్లాడలేదు. అతనికి ఇంతకు ముందడిగిన ప్రశ్న జ్ఞాపకమే లేదు.

”నీ కొడుకు ఇంటినుంచి ఎప్పుడు పోయినాడయ్యా?” స్టేషన్‌ మాస్టర్‌.

జనానికి విసుగొచ్చింది. ”మెదడు పని జేత్తలేనట్టున్నది పాపం” ఎవరో మందిలో నుంచి…

”ఓ బత్త సారా ఏత్తే పని చేస్తది” రాజారాం పక్కనున్నతను.

రాయేశం ఉరికి రెండు సారాబత్తాలు తీసుకొచ్చాడు. అవి ఏమిటన్నట్టు కొత్తగా చూసి వద్దన్నాడు. సారా నిషాకన్నా ఏదో మత్తు అతన్ని ఆవహిస్తోంది. మొదట స్టేషన్లోకొచ్చినప్పుడు అతనికి ఏ మత్తు లేదు. ఏ జ్ఞాపకము, ఏ ఆలోచనలు లేవు. కానీ ఇప్పుడేవేవో తిరుగుతున్నాయి.

”నీ కొడుక్కు ఎన్నేండ్లు?” స్టేషన్‌ మాస్టర్‌.

సరిగ్గా రాజారాంకు అప్పుడే శవాన్ని తడిమి చూడాలని కోరిక కల్గింది. అదే సమయంలో స్టేషన్‌ మాస్టర్‌ ప్రశ్న.

”నా కెర్కలే” రాజారాం గొంతులో కాఠిన్యం.

అప్పుడు స్టేషన్లో నుంచీ ఒక స్త్రీ ఏడుపు వినిపించింది.

ఒక బక్కపలచటి స్త్రీ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవంకేసి పరుగెత్తుకొచ్చింది. ఆమె వెనకే కర్ర ఊతంతో ఒక ముసలివాడు. బక్క దుక్కిటెద్దుల్లాంటి ఇద్దరు రైతులు వచ్చారు.

ఆ స్త్రీ రాజారాం కన్నా పేదగా, అధ్వాన్నంగా ఉంది. నడి వయస్సులోనే ముసలిదైపోయినట్టుగా ఉంది. రెండు పాత చీరెలు కలిపి కుట్టిన రెండు రంగుల చీర కట్టుకుంది. అదైనా అక్కడక్కడ చిరిగి ఉంది. వెలిసిపోయిన పాత రయికె తొడుక్కున్నది. ఆ స్త్రీ వెంట్రుకలు విచ్చిపోయి ఉన్నాయి. ముఖంలో ఎముకలు తప్ప గోరెడు మాంసం లేదు.

”ఓరి కొడుకా! ఎంత పనికెత్తుకున్నవ్‌రా కొడుకా! మొన్న మునిమాపు నాబట్టు చేతలతోని బువ్వ బెడ్తిగాదు కొడుకా! మీ అవ్వచ్చింది గాదు కొడుకా! ఓరి మల్లయ్య మీ తాతచ్చిండుగాదు కొడుకా! మీ మామలు వచ్చిండ్లు గాదు కొడుకా! గీదిక్కు మల్లె అవ్వకేం జెప్పిపోతివి కొడుకా! నిన్ను గంటిగని నీ రాత కనకపోతిని కొడుకా! దేవుడా నీ గుల్లె రాయి పడ దేవుడా! నా బతుకు కుక్కలు సింపిన ఇత్తరి జేత్తివి దేవుడా! కన్నోడు సుకపెట్టకపాయె కొడుకా! పాపకారి జల్మనాది కొడుకా! కట్టుకున్నోడు సుకపెట్టకపాయె దేవుడా! అడవిల పొద్దు గూకింది గదర కొడుకా! ఇక నేను ఏ ఆశ జూసుకొని బతకాలె కొడుకా! నన్ను కొంటబోక పోతివి కొడుకా!” ఆ స్త్రీ ఆ శవాన్ని తడుముతూ, మధ్య మధ్య దుమ్ము నెత్తిమీద పోసుకుంటూ పిచ్చిదానిలా ఏడుస్తోంది.

అంతవరకూ గడ్డ కట్టుకుపోయిన మనుషుల బండబారిన గుండెలు జాలువారాయి. అక్కడ నిలుచున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్ళూరాయి.

”ఎంతైనా కన్న కడుపు కన్న కడుపే… పేగు చింపుకుని పుట్టిన కన్నకొడుకు తన కండ్ల ముంగటి మన్నైపోతే ఆడదాని మనసు అవిసిపోతది” ఒక ముసలమ్మ బొల బొల ఏడుస్తూ చెప్పింది.

ఏడుపు అక్కడ తెరలు తెరలుగా చలిలా, చీకటిలా అందరినీ చుట్టేసింది. పంచనామా రాసిన రైల్వే పోలీసు ఆ సంగతే మరచిపోయాడు.స్టేషన్‌ మాస్టర్‌ కళ్ళద్దాలు తుడుచుకున్నాడు.

రాజారాంకు ఆ ఏడుపు ఎక్కడో వినిపిస్తోంది. ఆ ఏడుస్తున్న స్త్రీ తన భార్యేనా? తను, ఆ స్త్రీ బతుకులో ఒకప్పుడు సగం సగం పంచుకున్నారా? ఆమె, తను కలిసి మిరప చెట్లల్లో, మొక్కజొన్న పెరడి మంచెమీద సద్దిమూట విప్పుకొని చెరిసగం తిన్నది వాస్తవమేనా? కాదు, ఈ స్త్రీ ఆమె కానేకాదు. రాజారాం మనసులో పచ్చటి ముఖం, ఎర్రటి చెక్కిల్లు, ఎప్పుడూ నవ్వే ముఖం కలిగిన స్త్రీ మాత్రమే ఉన్నది. ఈ స్త్రీ ఒక దయ్యం లాగున్నది.

కర్ర ఊతంగా నిలుచున్న ముసలయ్య కూలబడి ‘ఊకోయే ఎల్లవ్వా! ఏడ్చేడ్చి నీ కనుపాపలు కారిపోతయి. ఎవని కొర్త ఆడనుబగించాలె. అందరం బతుకచ్చినమా?” అన్నాడు.

”ఓ నాయినా నీ మనుమనికి ధైర్నం జెప్పునాయిన, లేపు నాయిన”’ తండ్రిమీద పడి ఏడ్చింది. ఆ ముసలయ్య తన నరాలు దేలిన చేతుల మధ్య బిడ్డను అదుముకున్నాడు. బలహీనమైన ఆ చేతులు వణుకుతున్నాయి. ఎల్లమ్మ మరో పది నిమిషాల పరిపరి విధాల వర్ణిస్తూ ఏడ్చి ఏడ్చి ఏడుపు ఆపింది. అప్పుడు చూసింది కాళ్ళవేపున కూర్చున్న మనిషిని. దయ్యాన్ని చూసినట్టుగా జడుసుకున్నది.

”ఫో! నా కొడుకును ముట్టకు. నీ పాపకారి చెయ్యి తాకుతే నా కొడుకు ఇషమెక్కుతడు. నా బతుకు గంగల గల్పినవ్‌. నా కొడుకును నువ్వే చంపినవ్‌” అరిచింది. కొడుకు కాళ్ళను తనకేసి జరుపుకున్నది.

రాజారాంను ఎవరో లేపి అటెటో తీసుపోయారు. ఎల్లమ్మ మళ్ళీ కొడుకు మీదపడి ”మీ నాయిన నీ కట్టం సుకం సూడరాలే కొడుకా! నీ సావు సూడచ్చిండు కొడుకా! మల్లయ్య నన్నడిగిన సంగతులన్ని మీ నాయిన నడుగుదువు రారా కొడుకా, నా కొడుకా!”

రైల్వే పోలీసు తేరుకున్నాడు. అతనేదో వేదాంతం చెప్పబోయాడు కానీ, నోరు పెకలలేదు.

రాజారాంకు ఈ ప్రశ్నలన్నీ సలుపుతున్నాయి. తన కొడుకును తన దగ్గరే ఉంచుకుంటే చావక పోయేటోడా? తనే ఎప్పుడో చచ్చిపోయినంక వాళ్ళనెట్లా ఉంచుకుంటాడు? తన చావు ఎప్పుడు ఆరంభమయ్యింది. తన కలల ప్రపంచాన్ని ఎవలు విధ్వంసం చేశారు. ఎప్పుడు చేశారు? తన ఏడుపు ఎక్కడ, ఎప్పుడు తెగిపోయింది. తను బండరాయా? తన నరాలు ఒక్కటొక్కటే పుటుక్కు పుటుక్కున తెంపిందెవ్వరు? చనిపోయిన అన్నా? చదువు ఆపి పెద్ద కుటుంబాన్ని సాదుక వచ్చినప్పుడా? మిరప తోటకు కొరుకుడు రోగం తాకి మాడిపోయినప్పుడా? అప్పు కింద షావుకారి భూమి గుంజుకున్నప్పుడా? అంజుమన్‌ అప్పులు, తనఖా బ్యాంకు వాళ్ళు వేలం పాడినప్పుడా? సర్వం ఒక్కక్కటే ఊడ్చుకపోయి రైతు, కూలీగా మారినప్పుడా? కాదు, ఈ అన్నీ జాగల్ల తన జీవనాడులు ఒక్కొక్కటే తెగిపోయినయ్‌.

అన్న చనిపోయినప్పుడు చదువుతున్న ఎనిమిదో తరగతి ఆపి, ముసలి తండ్రితో గుంటుకు కొట్టి ఎర్రటెండలో నెత్తురు పేరిన అరిచేతులు చూసుకొని; నాయిన్న చనిపోయి మొత్తం కుటుంబభారం మీద పడ్డప్పుడు చెరువు కట్టకింది మర్రిచెట్టు కింద కూలబడి వెక్కివెక్కి తను ఇట్లాగే ఏడ్చాడు. ఒక్కొక్క ఎకరం అమ్మి ఒక్కొక్క అంగం కోసుకుపోతున్నట్టుగా విలవిలలాడాడు. గిజగిజ తన్నుకున్నాడు. మొత్తం భూమి అమ్మకంతో వేళ్ళు పూర్తిగా తెగిపోయిన చెట్టులా ఎండిపోయాడు. తన ఏడుపు ఆగిపోయింది. నరాలన్నీ తెగిపోయినయ్‌.

ఈ విధ్వంసం ప్రతి పల్లెలో ప్రతి రైతు లోలోపల జరిగింది. రైతులంతా తమ గాయాలు దాచుకొని విధ్వంసాన్ని మింగుకొని తిరుగుతున్నారు. తుఫాను గాలిలో ఎండుటాకుల్లా ఎగురుతున్నారు. అంతటా ఇలాంటి మనుషులే.

రైల్వే పోలీసు ‘పంచనామా కాయిదం’ తీసుకువచ్చాడు. రాజారాం దానిమీద ఇంగ్లీషులో సంతకం చేశాడు. శవాన్ని కదిలించారు. జనం కదిలారు. మాటలు, ఓదార్పులు… శవాన్ని గుడ్డలో చుట్టుకొని రైల్వే స్టేషన్‌ బయటకు తీసుకుపోతున్నారు. ముసలి తండ్రి ఆసరాగా ఎల్లమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవం వెనకే వెళ్ళిపోయింది. రాజారాం ఆ జనంతోపాటే స్టేషన్‌ బయటకు వచ్చాడు.

బండిలో వరిగడ్డి మెత్తగా పరిచి శవాన్ని పడుకోబెట్టారు. బండిలో కూర్చున్న ఎల్లమ్మ శవం తలను ఒళ్ళో పెట్టుకుని పిచ్చిదానిలా ముద్దులాడుతోంది.

స్టేషన్‌ ముందుగల కరెంటు బుగ్గ వెలుతురులో అక్కడ నిలుచున్న మనుషుల నీడలు దయ్యాల గుంపులాగా ఉన్నాయి.

”తను మనుషులను, భూమిని, పంటలను ప్రేమించలేదా? తన భార్యను, కొడుకుని, తండ్రిని, కుటుంబాన్ని…” రాజారాం లోపల ఏదో మత్తులా పాకుతోంది. ఎక్కడో సన్నగా వణుకు ప్రారంభమైంది.

ఒక్కసారి; ఒకే ఒక్కసారి, కడసారి తన కొడుకును ఒళ్ళోకి తీసుకుని ముద్దాడితే! నాలుగేండ్ల పిల్లవాడు భుజం మీద కూర్చుండి ఏదో అడుగుతున్నాడు.

కానీ, బండి కదిలింది.

”బావా నువ్వు బండెక్కు” బండి నడిపే రాజారాం బావమరిది అడిగిండు.

”అన్నీ కాలి కూలి బూడిదైపోయినంక బావెవ్వడే అన్న! మీ బావెన్నడో సచ్చిపోయిండు. నేను ముండబొడ్డిని” అన్నది ఎల్లమ్మ.

బండి కదిలింది. స్టేషన్లో గంట మోగింది. ప్యాసెంజరు రైలు గంట అది. జనమంతా తేరుకొని బిలబిలమంటూ ఎవరి జాగాలలోకి వాళ్ళు సర్దుకున్నారు.

ఆ స్టేషన్‌ ముందు ఎటుపోవాలో తెలియక రాజారాం ఒంటరిగా నిలబడిపోయాడు. అతన్ని పిలిచే వాళ్ళెవరూ లేరు.

రాజారాం అడుగులు ఎడ్ల బండి వెళ్ళిన దిశలోనే పడ్డాయి.

రాజారాం నడుస్తున్నాడు. స్టేషన్‌ దూరమయ్యింది. బండి గీరెల చప్పుడు చీకట్లో విన్పిస్తోంది. పలుగురాళ్ళు కమ్ముల కింద నలుగుతున్న శబ్దం. చుట్టూ ఆవరించిన చీకటి. చిమ్మెట్ల రొద పేరు తెలియని రొద ఏదో మోగుతోంది. ఈత చెట్ల కమ్మలమీద మిణుగురులు ఎగురుతున్నాయి. పైన చుక్కల ఆకాశం. దూరంగా చుట్టుపక్కన గల ఊళ్ళలో వీథి దీపాలు కొరివి దెయ్యాల్లాగా. బండి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు గీరెల శబ్దం కూడా విన్పించడంలేదు. రాజారాం వెనకబడిపోయాడు.

రాజారాం కాళ్ళు ఆగిపోయాయి. దారిలోనే కూలబడ్డాడు.

”ఓ బావో వత్తన్నవా?” బావమరిది కేక.

రాజారాం జవాబుగా కేక వేయలేదు. అతనికంత శక్తి లేదు.

తను తప్పక వస్తాడని బావమరిది అనుకున్నాడా? కొడుకు అంత్యక్రియలకు తను పోతున్నట్టా? నిజంగా ఈ రోజు పొద్దున్న రైలు కింద తలపెట్టి చనిపోయిన ఆ పిల్లగాడికి తను తండ్రేనా? కాలి కూలి బూడిదైన పల్లెల్లో కొడుకెవరు? తండ్రెవరు?

చలి అంతకంతకూ ఎక్కువైంది. దానికితోడు కడుపులో ఆకలి మంట. చలికి దవడలు వణుకుతున్నాయి. ఇప్పుడు అతనికి సారా ప్యాకెట్లు జ్ఞాపకం వచ్చాయి. మెదడు పొరల్లో ఈ తర్కానికి లొంగనిదేదో మెల్లిమెల్లిగా కరుగుతోంది. అది ఆకలికన్నా, చలికన్నా ఎక్కువ సలుపుతోంది. తల పగిలిపోతోంది.

తను ఈ భూమి పుట్టినకాడికి విన్పించేలాగున ఏడిస్తే ఎంత బాగుండును! కానీ ఏడుపు రాదు. ఆ లెక్కన బండిమీద పోయిన తల్లే తనకన్నా అదృష్టవంతురాలు.

లేచి నిలుచున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. తూలుతూ అటు వెనుకకు స్టేషన్‌కేసి కాకుండా ముందు బండి పోయిన దారిలో కాకుండా తూర్పుకేసి నడవసాగిండు… తొవ్వదారి లేదు. కొంతసేపు చిక్కురు బొక్కురుగా నడిచిన తర్వాత ఒక బండ్ల బాట కన్పించింది. మరికొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మర్రిచెట్టు వచ్చింది. అది ”పోశమ్మ దేవత” మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టు నుండి ఒక దారి రాజారాం పల్లెకు పోతుంది. మరొకదారి పెద్దపల్లి టౌనుకి పోతుంది. మూడోది పంట పొలాల మీదుగా ‘రామగిరి’ అడవికి పోతుంది. నాలుగోది చెరువు కట్టమీదుగా పొరుగూరుకి పోతుంది.

ఆలోచనలు ఇంకిపోయి మర్రిచెట్టు కింద కూలబడిపోయి రెండు చేతులతో ముఖం, తల రుద్దుకుంటూ లోలోపల పూర్తిగా ధ్వంసమైపోయిన రైతు బిడ్డడు రాజారాం ఏడుస్తున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పూర్తిగా బొట్టుబొట్టుగా కరిగిపోతూ, భూమిలోకి ఇంకిపోతూ ఏడుస్తున్నాడు.

రాజారాం నాలుగు రోడ్ల కూడలిలో చిక్కటి చీకటిలో, గడ్డకట్టిన చలిలో, ఆకలితో కొడుకును, సర్వస్వాన్ని పోగొట్టుకున్న దుఃఖంతో ఏడుస్తున్నాడు.

రాజారాం లోలోపల జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అతన్ని లేపి, గుండెకదుముకోగలిగిన ‘బాటసారులు’ నాలుగు బాటల్లో ఏ బాటనుంచి వస్తారో మరి!

(కథా స్రవంతి అల్లం రాజయ్య కథలు)

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.