నిర్బంధ వైద్య మందిరం -అబ్బూరి ఛాయాదేవి

 

సత్యసాయిబాబా నుంచి సామాన్య పౌరుడి వరకు అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు…

1991లో మా ఆత్మీయ బంధువు 54 ఏళ్ళ ఇంజనీర్‌కి జరిగిన ఆఖరి అనుభవాన్ని కళ్ళారా చూసి ఆఖరికి అయిదు నక్షత్రాలు అనే కథ రాశాను. అందులోని ఆఖరి వాక్యాలు; నిజానికి మరణాన్ని కొనుక్కోవడానికి అంత దూరం ఇంత ప్రయాసపడి ఎవరూ వెళ్ళనక్కర్లేదు. మనం పిలిచినా పిలవకపోయినా రావాల్సిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది.

ఆ విషయమై ఇంకా ఎవరికీ జ్ఞానోదయం కాకపోగా అనవసరపు ఆశలూ, అజ్ఞానం పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక వైద్య పరికరాలు రోగులకు ‘రిలీఫ్‌’నిస్తాయని, రక్షిస్తాయని, ఆశించడం మానడం లేదు. ‘అణుబాంబులు’ ప్రపంచ శాంతికి ఎంత ప్రయోజనకరం అవుతాయో ఆధునిక వైద్య పరికరాలు కూడా ప్రజారోగ్యానికి అంతే ప్రయోజనకరం అన్న సత్యాన్ని ఇంకా ఎవరూ గ్రహించలేరు.

ఆ రోజుల్లో నేను రాసిన కథ కొంత సంచలనాన్ని సృష్టించింది. సమాజంలోని వివిధ వర్గాల్లో, కొన్నాళ్ళ తర్వాత టి.వి. దూరదర్శన్‌లో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ యజమానులను ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక ఉపసంపాదకుడు ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం. అందులో ఒక ప్రముఖ ఆసుపత్రి యజమాని స్పష్టంగా చెప్పాడు. మేము కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఆ పరికరాలను ఏర్పాటు చేశాక, వాటివల్ల ప్రయోజనం పొందవద్దా? ఇన్ని సదుపాయాల్ని మేము ఇక్కడ ఏర్పాటుచేసినా, రాజకీయ నేతలు, ప్రభుత్వాధిపతులూ అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకుంటారెందుకు? అన్నారు. కాస్త మానవతా దృక్పథం ఉన్న డా||కాకర్ల సుబ్బారావుగారు మాత్రమే వాస్తవికంగా మాట్లాడారు. అన్ని జబ్బులకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు పరుగు పెట్టనక్కర్లేదని మా డ్రైవరు, పనివాళ్ళ లాంటి వాళ్ళకి చెబుతుంటాను, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి సమస్యల కోసం వాటిని ఉపయోగించుకోవాలి అన్నారు.

1993లో మా వారు వరద రాజేశ్వరరావు గారు శ్వాసకోశ వ్యాధితో విపరీతంగా బాధపడుతుంటే (భరించే సహనం లేక కొంత) తెలిసిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చెయ్యబోతుంటే, ”నన్ను అక్కడికి తీసుకువెళ్ళి చంపకండే” అన్నారు ఆయన కణతలు నొక్కుకుంటూ. ఆయన్ని ఆరోగ్యవంతుణ్ణి చేయాలనే ఆశతో, బలవంతంగా బంధుమిత్రులం దగ్గరుండి తీసుకువెళ్ళి ఆయన అనుకున్నంత పని చేశాం. 28 రోజులు పట్టింది ఆ పనికి! ఆసుపత్రికి తీసుకువెళ్ళగానే ముందు స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి జనరల్‌ వార్డువైపుకి పోనిచ్చి, అక్కడ పరీక్షలు చేశాక, మళ్ళీ స్ట్రెచర్‌ మీద పడుకోబెడితే ఇంటికి పంపించేస్తున్నారనుకుని ఆయన చిరునవ్వు నవ్వారు. కానీ ఆయన్ని పై ఫ్లోర్‌లో ఉన్న ‘రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’కి తీసుకువెళ్తుంటే గాభరాగా చూశారు మా వారు.

అక్కడికి తీసుకువెళ్ళాక ఏవో ఏర్పాట్లు చేస్తూ వరండాలో కూర్చున్న నన్ను లోపలకి పిలిచారు. నేను భయపడుతూ వెళ్ళాను. ఆయన నోట్లోంచి డెంటర్స్‌ పట్టుకువెళ్ళమన్నారు. తెల్లబోయాను. మొదటిసారి అటువంటి పనిచేశాను. తరువాత వాళ్ళు కొన్ని నిమిషాలపాటు శ్రమపడి, వెంటిలేటర్‌ గొట్టం అమర్చారు. దాన్ని మా వారు పట్టుకొని అరనిమిషంలో పీకిపారేశారు. డాక్టర్లు నిర్ఘాంతపోయి ”మీరు అలా చెయ్యకూడదండి” అంటూ మళ్ళీ పెట్టడానికి ప్రయత్నిస్తూ (ఈలోగా ముక్కు, గొంతూ ఎంత రప్చర్‌ అయ్యాయో ఊహించుకోవచ్చు) ”ఒక్క గంటసేపు ఓర్చుకోండి, అంతా సర్దుకుంటుంది” అన్నారు. అనునయంగా, ”నన్ను ఒక గంటపాటు ఇంటికి పంపించండి. మళ్ళీ వస్తాను” అన్నారు మా వారు తన సహజధోరణిలో. కానీ జానపద కథలో ఆవుని దూడ దగ్గరికి పులి అయినా పంపించింది గాని ఆసుపత్రిలో డాక్టర్లు మాత్రం మా వారిని వదల్లేదు.

వెంటిలేటర్‌ ఏదో ఉద్దరిస్తుందని, శ్వాస తీసుకోవడంలోను, కఫాన్ని క్లియర్‌ చేయడంలోనూ సహకరిస్తుందని అనుకున్నాం. కానీ అది ‘పద్మవ్యూహం’ లాంటిదని ఒక డాక్టరే అన్నాడు. దానితో రోగి మంచానికి కట్టుబడిపోతాడు. తనంతట తాను పక్కకు కూడా కదల్లేడు. మలమూత్ర విసర్జనలో స్వయంకృషికి ఆస్కారం లేదు. అటెండెంట్స్‌ మీద ఆధారపడడం, వాళ్ళు అనుసరించే పద్దతికి రెండు పూటలు గడవకుండానే బెడ్‌సోర్‌ ఏర్పడడం, వాటికి మళ్ళీ మందులూ ‘ఎయిర్‌బెడ్‌’ ఏర్పాటూ! రోగి ముక్కులోంచి గొంతు ద్వారా గొట్టాలు ఏర్పాటు చేయడం వల్ల నోరు విప్పి తన బాధ చెప్పుకునే అవకాశం పోతుంది. చిన్న నోట్‌బుక్‌ మీద పెన్‌తో రాశారు మా వారు ”హౌ లాంగ్‌ దిస్‌ టార్చర్‌?” అని.

అధికార భాషా సంఘం అధ్యక్ష హోదా ఆయన్ని ఆదుకోలేదు. అందరిలానే ఆయనా అయిదు నక్షత్రాల ఆసుపత్రిలోనే అంతమయ్యారు. ఆ వార్డుల్లో ఒక్కొక్క రోగి పోయి, బెడ్‌ ఖాళీ అయినప్పుడల్లా ఆయనకి జ్వరం వచ్చేది. ఒకసారి ఒక న్యూట్రిషన్‌ స్పెషలిస్ట్‌ వార్డులోకి వచ్చి నాలుగు బెడ్లు ఖాళీగా ఉండడం చూచి, నవ్వుతూ తోటి డాక్టర్‌తో ”నలుగుర్ని ఒక్కసారి లేపేశారే!” అన్నాడు. ”పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణసంకటం” అన్న సామెత గుర్తుకొచ్చింది. నన్ను ఒకసారి మా వారు నోట్‌బుక్‌ ద్వారా అడిగారు. ”నేను క్రైసిస్‌లో ఉన్నప్పుడు ఎక్కడున్నావ్‌?” అని. నన్ను లోపల ఉండనిచ్చేవారు కాదు. కొన్ని సమయాల్లో వరండాలోకి వెళ్ళి కూర్చోమనేవారు. ఆయన ఎవరితోనూ చెప్పుకోలేక నిస్సహాయంగా దిక్కూ మొక్కూ లేనట్లు మంచం మీద పడి ఉండేవారు. పక్కన ఉండి భర్తకి ఏదైనా సేవ చేసే అవకాశం ఉండేది కాదు. అన్నింటికీ మెషిన్లే కదా! ఒకసారి ఆయనకి కాఫీ తాగాలని ఉందన్నారు. వెంటనే ఆ ఆసుపత్రికి దగ్గరలోనే

ఉన్న మిత్రుడి ఇంటి నుంచి మంచి కాఫీ ఫ్లాస్క్‌లో తెప్పించి డాక్టర్‌కీ, నర్సుకీ చెప్పి ఇచ్చాం. వాళ్ళు గొట్టంలోకి పోశారు. కొంత సేపయ్యాక మావారు కాఫీ ఏది అని రాశారు నోట్‌బుక్‌లో. ”ఇచ్చారు కదా గొట్టం ద్వారా” అన్నాను. ఆయన నాలుక బయట పెట్టారు. ”రుచి ఏదీ!” అన్నట్లు. చివరికి ఆయన నిస్పృహ చెందుతుంటే, ”మీకు విల్‌పవర్‌” ఉండాలండి అన్నాను. నోట్‌బుక్‌ తీసుకుని ”బిల్‌పవర్‌ కూడా

ఉండాలి” అని రాశారు. అదే ఆయన ఆఖరి హాస్యోక్తి!

మరొక కేసు

తండ్రి శతజయంతి ఉత్సవానికి వచ్చిన వదర రాజేశ్వరరావుగారి అన్నగారు చెన్నై తిరిగివెళ్ళాక జబ్బుపడి ఒక అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరారు. కొడుకులు చేర్పించారు. నేనూ, ఆయన కూతుళ్ళు చూడడానికి వెళ్ళాం. ఇలాగే వెంటిలేటర్‌తోనూ, హార్ట్‌ లంగ్‌ మెషీన్‌తోనూ, సెలైన్‌ బాటిల్‌ కనెక్షన్‌తోనూ ఉన్నారు. స్పృహలో లేకుండా 7 % క్రమంగా 70 శాతానికి పెరగవచ్చు కదా అన్నారు. ఆ డాక్టరే (చిన్నవాడూ, మంచివాడూ) మమ్మల్ని పక్కకి పిలిచి, ”నా తండ్రి ఈ పరిస్థితుల్లో ఉన్నా నేను వీటిని తొలగించమనే చెబుతాను” అన్నాడు. దాంతో కొడుకులు ధైర్యం తెచ్చుకుని ”సరే మీ ఇష్టం” అన్నారు. అంతే ఆ మెషీన్లని తొలగించిన ఇరవైనాలుగు గంటలలోపే రోగి మరణించినట్లు నిర్ధారించారు. ఆ మెషీన్లని వాడడం అవసరానికి మించి వాడడం డబ్బు గుంజడానికేనని మరోసారి రుజువైంది.

ఇంకో కేసు

మా దగ్గరి బంధువయితే రిటైరైన కొత్తలో ”సి.జి.హెచ్‌” ద్వారానే ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. చేరినపుడు పరిస్థితి అంత తీవ్రంగా లేదు. కానీ త్వరలోనే విషమించింది. కూతురు (డాక్టర్‌) అమెరికా నుంచి వచ్చి వారం రోజులుండి, వైద్యం బాగానే జరుగుతోందని గమనించి తిరిగి వెళ్ళిపోయింది. పరిస్థితి మరింతగా విషమించిందని తెలిసి కొడుకు వచ్చాడు (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌) అమెరికా నుంచి. తండ్రి మెషీన్‌ కనెక్షన్స్‌తో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అద్దాల వెనకాల ఉన్నాడు. ఎన్నాళ్ళుండాలో, రోగి పరిస్థితి ఎప్పుడు ఎలా

ఉంటుందో, వెళ్ళాలో, వెళ్ళకూడదో తెలియని సందిగ్ధ స్థితిలో నన్ను సంప్రదించారు. ఆ హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక వైద్య నిపుణుడికి పరిస్థితి తెలియజేసి, సలహా అడిగాను. రోగి పరిస్థితి గురించి హాస్పిటల్‌ అధికారులతో మాట్లాడారు. రోగికి అమర్చిన సాంకేతిక వైద్య పరికరాలను తొలగించారు. 24 గంటలలోగా మరణించినట్లు ధృవీకరించారు.

అయిదేళ్ళ క్రితం నాకు ఆస్త్మా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆయాసపడుతూ బాధపడుతున్నాను. మా ఫ్యామిలీ డాక్టర్‌ ఊళ్ళో లేడు. సమయానికి నా శ్రేయోభిలాషి అయిన ఒక పెద్దావిడ ద్వారా ఆవిడకి సంబంధించిన హాస్పిటల్‌కి వెళ్ళాను. ఒక లేడీ డాక్టర్‌ నన్ను పరీక్షించి ”పరిస్థితి సీరియస్‌గా ఉంది. మీరు వెంటనే హాస్పిటల్‌లో ఎడ్మిట్‌ అవ్వాలి” అంది.

”సారీ నాకు కుదరదండీ, ఏవైనా మందులు ప్రిస్క్రైబ్‌ చెయ్యండి” అన్నాను. ఆవిడ మందులు రాసిన కాగితం మీదే మార్జిన్‌లో ”ఈవిడ ఎడ్మిట్‌ అవ్వడానికి అంగీకరించలేదు” అని రాసింది. అంటే, నాకేదైనా అయితే, తన బాధ్యతలేదని సూచిస్తున్నట్లు. నేను పట్టించుకోలేదు. ఒక కార్డిజోన్‌, ఇంకా ఇతర మందులు రాసింది. వాటిని వాడాను. పదిహేను రోజుల్లో కోలుకున్నాను. ఆవిడ సూచన ప్రకారం ఎడ్మిట్‌ అయి ఉంటే పరిణామం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.

అయితే ఆసుపత్రి నుంచి ఎవరూ బతికి బయటపడరని కాదు. ఈ మధ్య మల్లాది సుబ్బమ్మ గారు మృత్యుద్వారం వరకూ వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ రోజో రేపో అన్నట్లుగా ఉంది పరిస్థితి అని తెలిసి, నేను ఒక మిత్రురాలితో కలిసి ఆవిడని ఉంచిన ఆసుపత్రికి వెళ్ళాను. పరిస్థితి విషమంగానే ఉంది. సరే ఏం చేస్తాం అనుకుని అంతిమ వార్త కోసం ఎదురుచూశాం. కానీ ఏ కబురూ తెలియకపోతే కొద్ది రోజులు పోయాక ”ఆవిడ ఎలా ఉన్నారండీ?” అని ఆమె కొడుకుని ఫోన్‌లో అడిగాను. ”ఇంటికి తీసుకొచ్చామండీ ఫరవాలేదు” అన్నాడు. ”ఆవిడ కోలుకోవడం చాలా అద్భుతం కదా! మీరు బాగా చూసుకున్నారు” అన్నాను ప్రశంసిస్తూ. ”ఆవిడ ఎవరనుకున్నారు మేడమ్‌ మల్లాది సుబ్బమ్మగారు కదా!” అన్నాడు కొడుకు నవ్వుతూ. అయిదేళ్ళ క్రితం నాకు ఆస్త్మా ఎటాక్‌ నుంచి కోలుకున్నాక నాకు రెండో కంటి ఆపరేషన్‌ కూడా జరిగింది. మళ్ళీ ఈ మధ్య ఆస్త్మా ఎక్కువైంది. రెండుసార్లు స్టెరాయిడ్స్‌ వాడినా తగ్గలేదు. మూడోసారి మళ్ళీ మందులు మార్చారు మా ఫ్యామిలీ డాక్టరు. నాకు హాస్పిటల్లో చేరడం ఇష్టం లేదని ఆయనకి తెలుసు. మధ్యలో సివియర్‌ డయేరియా పట్టుకుని మరింత నీరసించిపోయాను. అయినా నాకు కావాల్సిన, నాకు పడే ఆహారం చేసుకుని పరిమితంగా తింటూ, వేడి పాలు, టీ, ఎలెక్ట్రాల్‌ వంటివి కావల్సినవి తాగుతూ నా పనులు ఇంట్లోవీ, బయటవీ ఆయాసపడుతూనే చేసుకుంటున్నాను. కఫం బయటికి రాక చాలా అవస్థ పడుతున్నా ఓపిగ్గా దగ్గుతున్నాను. రాత్రిళ్ళు పక్క వాటావాళ్ళకి తెలిసినా నా బాధ నేను పడుతున్నాను.

మా చుట్టుపక్కల భవన నిర్మాణం చేసేవాళ్ళు లారీల్లో కంకర తీసుకొచ్చి తెల్లవారు ఝామున పెద్ద చప్పుడు చేయడం, గుండె బరువెక్కేటట్లు మోటారు నడిపి శబ్దాలు చేస్తుంటే అందరం భరించడం లేదా? క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచినా అర్థరాత్రి టపాకాయలు పేల్చినా, నా దగ్గు వల్ల కలిగే ఇబ్బంది అంతకంటే ఎక్కువదా అనుకుని నా బాధ నేను పడుతున్నాను. ఆయాసపడుతున్నా నా పనులు చేసుకోవడం మానడం లేదు. మా ఇంటికి దగ్గర్లో పెద్ద చెత్తకుండీల సెంటర్‌ ఉంది. దానిపక్కనే జిరాక్స్‌ మెషిన్‌ నడిపే చిన్న షాప్‌ ఉంది. అక్కడికి అవసరమైనప్పుడు వెళ్తున్నాను. ఏ బ్యాక్టీరియా నన్ను పట్టుకుని బాధించడం లేదు. హాస్పిటల్లో ‘ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’లో బాక్టీరియా సోకకుండా రోగిని అద్దాల వెనుక అట్టిపెట్టినా ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడి కిడ్నీ ఫెయిల్యూర్‌, లివర్‌ ఫెయిల్యూర్‌ ఏర్పడుతూనే ఉన్నాయి. మలమూత్రాల విసర్జన సహజంగా శరీరం కదలికల సహాయంతో జరగకుండా రోగిని మంచానికి కట్టిపడేసినట్లు చేసి కెథటర్‌ వంటివి పెట్టి, ఎక్కువసేపు దాన్ని వాడితే మళ్ళీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని డాక్టర్లు చెబుతూనే రోగిని అవస్థ పెడుతూ ఉంటారు. మలమూత్ర ద్వారం వద్ద ఇరిటేషన్‌ ఏర్పడితే ఇంట్లో అయితే సోఫ్రామైసిన్‌ వంటి ఆయింట్‌మెంట్‌ వాడి నయం చేసుకోవచ్చు. కోతి పుండు బ్రహ్మరాక్షసిని చెయ్యకుండా.

నేను ఆస్త్మాతో ఎంత తీవ్రంగా బాధపడుతున్నా ప్రస్తుతం నేను ఎటువంటి ‘నిర్బంధ వైద్య మందిరం’లోనూ నిస్సహాయంగా చావు బతుకుల మధ్య కొట్టుకోకుండా మా ఇంట్లోనే ఉండి, బాధపడుతున్నా, స్వేచ్ఛగా ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటూ శారీరకంగా శ్రమ పడుతున్నా, మానసికంగా ఒత్తిడి లేదు. కనుక బి.పి. కంట్రోల్‌లోనే ఉంది. కొత్తగా వచ్చే మందులు వాడుతున్నాను. డాక్టర్‌ సూచించినట్లుగా, ‘పోనీ హోమియో వాడరాదు?’ అని కొందరు, ‘ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి. త్రిఫల చూర్ణం వాడి చూశారా?’ అని కొందరు సలహాలిస్తూ ఉంటారు. ఎవరికీ ఏ మందుల్లోను సంపూర్ణ విశ్వాసం లేదు. విష్ణువు కాకపోతే శివుడు, శివుడు కాకపోతే మరో స్వామీజీ అని భక్తులు ప్రయత్నిస్తున్నట్లు రోగులకు కూడా సలహాలిస్తూ ఉంటారు బంధుమిత్రులు.

ఇంకా బతకాలన్న కోరిక నాకు లేకపోయినా ఆస్త్మా ఉధృతం తగ్గి, ఆ బాధ నుంచి బయటపడతానన్న నమ్మకం నాకుంది. ఒకవేళ ఆయాసం భరించలేక గుండె ఆగిపోయినా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ‘నిర్బంధ మందిరం’లో నిస్సహాయంగా, రహస్యంగా చావుబతుకుల మధ్య ఊగిసలాడకుండా నా పరిస్థితి నలుగురికీ తెలిసేటట్లు స్వేచ్ఛగా ఉన్నానన్న తృప్తి ఉంది.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.