జోగినీ స్త్రీలను రంగమెక్కించే తంతు రద్దు చేయాలి
భూమిక August 2009
జూపాక సుభద్ర
ఈ వారం పది రోజుల్నించి జంటనగరాలు మొత్తం బోనాల కుండలైనయి. వందలాది పోసమ్మ మైసమ్మ గుడులు బోనాలు, పోతరాజుల డాన్సులు, వూరి పాటలు, దప్పుల మోతలు, వూరే గింపులు, రాజకీయ నేతల మీటింగులతో ఒకటే లొల్లి లొల్లి. ఆడోల్లతోని పరేషాన్ గున్నదనిమొగోల్లు పాడే కొన్ని పాటలు యీ సందర్భాంగానే వినబడ్తయి.
”ఏందిరవోరి బామ్మర్ది యెక్కడరా మీ అక్కా
యేగలేను మీ అక్కతోని నేనాడలేను తైతక్కా”
”మాయదారి మైసమ్మా మనం మైసారంబోదమేమైసమ్మా గాబరబెట్టి గయాబ్ గాకే మైసమ్మ్మ జెర పారేషాన్ జెయ్యకే మైసమ్మా” వంటి పాటలు బస్తీల్ని మోత మోగిస్తయి.
అయితే యిదివరకు యీ బోనాలకు హిందు వాసనలు గానీ రాజకీయ సందల్లు గానీ లేకుండె. ఓ పదేండ్ల కిందనైతే బస్తీల్లో ఓ అయదు పది గజాల్లో పోసమ్మ, మైసమ్మ ఉప్పలమ్మ ల పేరు మీద చెయేస్తే గుడి కప్పు అందే చిన్న చిన్న గుడులుండేయి. బస్తీల ప్రజలు కష్టాలు, సుఖాలల్ల సాకబెట్టి కోన్నికోసి మానసిక ఉప్పుసలు తీర్చుకునేటోల్లు. పూజారులు మంత్రాలు గట్రా లేకుండె. కాని తర్వాత తర్వాత చిన్న గుడి స్థలం కాస్త వంద గజాలదాకా హిందూ హంగు ఆర్భాటాలతో గోపురాలుగా విస్తరించి నయి. ఒక రెగ్యూలర్ బాపని పూజారికి గుడి పక్కనే పర్మనెంటు యిల్లిచ్చి నిత్యం హిందూ పూజాలు చేసేందుకు నియామకాలు జరిగినయి. దీంతో బాపనిపూజారులకి యిల్లు, ఉపాధి దొరికి హిందూ వ్యవస్థ యింకా పటిష్టమైంది. రోజు దీప, ధూప నైవేధ్యాలతో ప్రజల్ని ముఖ్యంగా బీసి, ఎస్టి, ఎస్సీలను హిందుత్వం వైపు మళ్లించే ప్రయత్నం జోరుగా సాగుతోంది.
ఈ నేపధ్యంలో పోషమ్మ మైసమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ గుడులన్నీ హిందూ దేవతల గుడులుగా సంస్కృతీకరించడం జరుగుతోంది. అట్లా మాతేశ్వరి గుడని, భాగ్యలక్ష్మి, జగదాంబ, సింహవాహిని గుడులని మార్చారు. ఈ మార్పుల్ని బలంగా వ్యతిరేకించే కొన్ని బస్తీల్లో దర్బార్ మైసమ్మ, నల్లపోచమ్మ, తొట్ల పోచమ్మల పేర్లు మారకుండా బతికున్నయి. అయితే గ్రామ దేవతలైన యీ పోషమ్మ మైసమ్మ ముత్యాలమ్మలు గొప్ప చరిత్రలున్న దళిత ఆదివాసీ స్త్రీలు. వీల్లు హిందూ దేవతలు కారు. హిందూ దేవతలని చెప్పే పార్వతికి శివుడు, లక్ష్మికి విష్ణువు, సరస్వతికి బ్రహ్మ లాగా యీ గ్రామ దేవతలకి భర్తలు ఎవరో అసలు వున్నారో లేరో తెలువది. వారి భర్తలు అనామకుల.ే లక్ష్యి పార్వతి సరస్వతుల్లాగ భర్త ప్రాపకంలో కష్టడీల్లో వాల్లు లేరు. లక్ష్మి విష్ణువు గుండెలో, పార్వతి శివుడి శరీరంలో సగభాగంగా, సరస్వతి బ్రహ్మ మొకంలో వున్నట్లు గ్రామ దేవతలైన పోషమ్మ మొదలగు వాల్లు ఏ మగాడిని ఆసరా చేసుకుని ఉన్నట్లు దాఖలాలు లేవు. వీల్లంతా ఒకప్పటి దళిత ఆదివాసీ స్త్రీలేనని చరిత్రలు చెప్తయి.
ఏ గ్రామ దేవతను చూసినా ఆమె వూరికి మంచి చేసిందని, సాహసకార్యాలు చేసిందని, జీవితమంతా పోరాటంగానే బతికిందని వూరి ముసలవ్వలు చెప్పే సంగతులు. యీ గ్రామ దేవతలు బలవంతులని, అనేక విద్యలు తెల్సిన వాల్లని, వారికి కష్టాలు గట్టెక్కించే శక్తులున్నయని శ్రామిక కులాలు ముఖ్యంగా ఆ కులాల ఆడవాల్లల నమ్మకం. అందులో భాగంగానే బోనాలు చేయడం. గ్రామ దేవతలు దేశమంతా వున్నా బోనాల్ని పండుగోలె జేసేది తెలంగాణ ప్రాంతంలోనే. కోమట,ి బాపనోల్లు, విశ్వ బ్రాహ్మలు బోనం ఎత్తుకోరు. బోనాల పండుగ చేయరు. ఎస్సీ,బీసీ,ఎస్టీలే బోనాలుజేస్తరు.
బోనాల పండుగకన్నా ఆ మరుసటి రోజు జరిగే రంగమెక్కే కార్యక్రమం చాలా ఉత్కంఠగా సాగుతుంది. రంగమెక్కడమనేది బోనాల ఉత్సవానికి ప్రధాన ఘట్టంగా జరుగుతుంది. పచ్చికుండ మీద ఒక జోగినిని ఎక్కించి భవిష్యవాణి చెప్పించడమే రంగమెక్కే కార్యక్రమం. జంటనగరాల్లోని వందల గుడుల్లో బోనాల సందర్భంగా రంగమెక్కేది జోగినీలని, వాల్లు మాదిగ స్త్రీలని తెల్సిందే. సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో రంగమెక్కిన స్వర్ణలత కాన్నుంచి లాల్దర్వాజ బోనాల్లో రంగమెక్కిన సుశీలమ్మదాకా అంతా జోగినులే. కాని రంగమెక్కియ్యడం అనేది చట్ట వ్యతిరేకమైన నేరం. 1988లోనే జోగినీ నిషేధ చట్టం వచ్చింది. జోగినీ సంబంధ కార్యక్రమాలకు పాలుపడ్డా, ప్రోత్సహించినా వినోదించినా, పాల్గొన్నా జైలుగోడ లే దిక్కు. కాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పబ్లిగ్గా జరిగినా పట్టనట్లుగా ప్రభుత్వాలెందుకు వ్యవహరిస్తు న్నాయి? భక్తి పేరుతో ఉత్సవాల పేరుతో జరిగినా నేరం నేరమే కాదా!
సమాజంపట్ల బాధ్యత వ్యవహరించా ల్సిన రాజకీయ నేతల సమక్షంలో, సమాజాన్ని ప్రజల్ని చైతన్యం చేయాల్సిన మీడియా సాక్షిగా భక్తి ఉత్సవాల పేరుతో చట్ట వ్యతిరేక మైన జోగినీ వ్యవస్థను బహిరంగంగా ప్రోత్సాహిస్తూ, వినోదిస్తూ రంగం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనువాద మీడియా భక్తి పేరుతో జరిగే యిట్లాంటి దురాచారాల్ని ఎండగట్టలేదు. మూఢ నమ్మకాలు, దురాచారాలు ఉత్సవాల పేరుతో, బోనాల పేరుతో జరిగిన రంగం ఎక్కించే కార్యక్రమాన్ని మీడియా చైతన్యమై ప్రజల్ని చైతన్యం చేయాల్సివుండే. కాని మీడియా బాధ్యతరహితంగా యీ దురాచారాల్ని ప్రోత్సాహిస్తూ రాజకీయ నాయకుల్ని, పూజారుల్ని ఉన్నతీకరంచి పవిత్రీకరించి మూఢనమ్మకాల్ని జోగినీలాంటి దురా చారాల్ని స్థిరీకరించే ప్రయత్నమే చేసింది.
రాబోయే బోనాల్లోనైనా ప్రభుత్వం జోగినీ స్త్రీలను రంగమెక్కించే కార్యక్రమం నిలిపే చర్యలు తీసుకోవాలి అందుకనువుగా బోనాలు జరిగే తెలంగాణ ప్రాంతంలో వేలాదిగా వున్న గుడులనాశ్రయించిన పూజార్లని, ఆలయ కమిటీలని చందాలిచ్చి ప్రోత్సాహించే రాజకీయ నాయకుల్ని చైతన్యం చేసే కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టాలి.
జోగినీ చట్టాన్ని శిక్షల్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
బోనాలప్పుడు గుడుల దగ్గర ముఖ్య అతిధులుగా హాజరవుతూ పెద్ద ఎత్తున చందాలిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బోనాల్ని, అంతిమంగా జోగినీ వ్యవస్థని ప్రోత్సాహిస్తున్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు గుడుల వద్దకు వెళ్ళకుండా నిషేదం విధించాలి. అవసరమైతే యీ సందర్భంగా పోలీసు నిర్భంధంలోకి తీసుకోవాలి. దళిత ప్రధానంగా మాదిగ స్త్రీలపై కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు ఆడవాళ్ళంతా పెద్ద ఎత్తున కదలాలి.
ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె
దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
–ఆరుద్ర
ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె
దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
–ఆరుద్ర