గమనమే గమ్యం -ఓల్గా

ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్ర జాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు.

పరిశోధన, పుస్తకాలు రాయటం, రాయించటం వీటితో క్రమంగా భార్యాపిల్లలతో కూడా గడిపే సమయం తగ్గిపోయింది. పరిశోధన కోసం అనేక ప్రాంతాలకు తిరుగుతుండేవాడు. శారద తన ప్రశ్నలకు తనే సమాధానాలు వెతుక్కోవలసిన పరిస్థితిలో పడిరది. శారదకు చదువు, ఆటలు, సంగీతం వీటితో సరిపోయేది గానీ సుబ్బమ్మకు బాగా విసుగనిపించేది. భర్త కోసం వచ్చే అతిథులకు వండి వార్చటం తప్ప భర్త విశ్రాంతిగా తన చేతి వంట తిని ఎన్ని రోజులయిందా అని విచారించేది.
‘‘ఊళ్ళో ఉన్నప్పుడే నయం. ఉన్న నాలుగు రోజులైనా ఇంటిపట్టున, కంటికెదురుగా ఉండేవారు. ఇప్పుడు మద్రాసులో అందరం ఉంటున్నామన్న పేరే గానీ మీరు ఇంటిపట్టున ఉండే రోజులు తగ్గిపోతున్నాయి. ఉన్నరోజుల్లో అతిథులతో పాటే భోజనం, మాటలు. రాత్రి నేను నిద్రపోయేవరకూ మీ వాదనలు తెగవు. రాత్రి రెండు గంటల వరకూ చదువుతూనే ఉంటారు. మీ ఆరోగ్యం ఏం కాను?’’ అని సమయం దొరికినప్పుడల్లా మొత్తుకునేది.
‘‘చేయవలసిన పనులు చాలా ఉన్నాయి సుబ్బూ. ఒక జీవితకాలం సరిపోయేలా లేదు’’.
‘‘మీరు పదిమంది పెట్టుగా పని చేస్తున్నారు. పది జీవితకాలాల పని ఒక జీవితకాలంలో చేస్తే ఏమవుతుంది? నా సంగతి సరే… శారద చదువు సంగతన్నా పట్టించుకోరా?’’
‘‘శారద బంగారు తల్లి. దాని చదువు అది చదువుకుంటుంది. పైగా మేం మాట్లాడుకునే మాటలన్నీ విని అర్థం చేసుకుంటుంది. శారద గురించి బెంగపడకు’’.
‘‘సూర్యం సంగతేంటి? వాడినొక దారిలో పెట్టరా?’’
‘‘వాడికొక దారి ఏర్పడిరది సుబ్బూ. అక్కంటే వాడికి ప్రాణం. సూర్యం అంటే శారదకు ప్రాణం. అక్క అడుగు జాడల్లో నడుస్తాడు. శారదలాగే చదువుకుంటాడు. నాకు సూర్యం గురించి బెంగే లేదు. వాడికి శారద అండగా ఉంటుంది’’.
‘‘అత్తయ్యగారు పొలం గురించి రాసిన ఉత్తరం చదివారా?’’
‘‘చదివాను. అమ్మకు ఆ మమకారం ఇంకా పోలేదు. కాశీ వెళ్ళినా పొలం సంగతులే’’. తల్లి గుర్తొచ్చి రామారావు ముఖం దిగులుగా మారింది.
‘‘ఆవిడ ఒక్కత్తి అక్కడ నెగ్గుకు వస్తోంది. అక్కడందరికీ తల్లో నాలుకలా ఉంటున్నదని సర్వేశ్వర శర్మ చెప్పాడు. ఆవిడ సమర్ధతే వేరు’’ సుబ్బమ్మకు కూడా అత్తగారు గుర్తొచ్చి చాలా బెంగ అనిపించింది.
‘‘నా సామర్ధ్యం వేరు. నా ఆసక్తులు వేరు. నన్ను అర్థం చేసుకొని వదిలెయ్‌ సుబ్బూ. పనులు ఎన్నో ఉన్నాయి. సమయం చాలకుండా ఉంది.’’
నిజంగానే సమయం ఎలా గడిచిందో తెలియకుండా సంవత్సరాలు గడిచాయి. ఇన్నేళ్ళలో ఆ కుటుంబం మళ్ళీ స్వంత ఊరు వెళ్ళలేదు. శారద అన్నపూర్ణకు అప్పుడప్పుడూ ఉత్తరాలు రాస్తోంది. విశాలాక్షి కబుర్లు అన్నపూర్ణ వల్ల కొన్ని తెలుస్తున్నాయి. విశాలాక్షి కూడా హైస్కూలు చదువు పూర్తి చేసిందని తెలిసింది. ఊళ్ళో హైస్కూలు లేకపోవడం వల్ల అన్నపూర్ణ చదువు ఆగిపోయిందని శారదకు ఎంతో బాధ. భార్యను తన దగ్గరుంచుకుని చదివించవచ్చు గదా అని అబ్బయ్య మీద కోపం తెచ్చుకునేది. ఐతే అన్నపూర్ణ విడిగా చదివే పుస్తకాల వల్ల శారదతో తరతమ బేధం లేకుండా స్నేహం చేయగలుగుతోంది.
శారద హైస్కూలు చదువు పూర్తయ్యేలోపల ఆ అమ్మాయిని బాగా కలతపెట్టింది వీరేశలింగం గారి మరణం. రామారావు గారింట్లోనే తరచూ వీరేశలింగం గారు బస చేయడంతో శారదకు మద్రాసు వచ్చినప్పటి నుంచీ ఆయనతో అనుబంధం పెరిగింది. ఆయన దగ్గర కూర్చుని ఎన్నో ప్రశ్నలు వేసేది. ఆయన చెప్పేవి శ్రద్ధగా విని తనకు నచ్చని విషయాలు ధైర్యంగా ఆయనతో చర్చించేది. సాహిత్యం, సంస్కరణ ఈ రెండు విషయాల పట్లా శారదకు ఆసక్తి కలిగించేందుకు వీరేశలింగం గారూ పనిగట్టుకుని ప్రయత్నించేవారు. రాజమండ్రిలో ఏవేవో చిక్కు సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు మద్రాసులోనే ప్రశాంతంగా ఉండేది. తన పనులు చూసుకుంటూ శారదతో కొంత సమయం గడిపేవాడు. ఆయన అనారోగ్యంతో ఉంటే శారద పక్కన కూర్చుని సేవ చేసేది. సంఘాన్ని గురించి తప్ప తన కుటుంబాన్ని గురించి ఆలోచించని ఆయన చివరి రోజుల్లో శారద మీద పుత్రికా వాత్సల్యం పెంచుకున్నాడు. రాజ్యలక్ష్మికీ, శారద మేనత్తకూ ఉన్న స్నేహం తలచుకున్నప్పుడు ఆ వాత్సల్యం మరింత పెరిగేది. శారద తాతయ్యా తాతయ్యా అని పిలుస్తూ ఆయన బాధను తగ్గించే ప్రయత్నం ఏదో ఒకటి చేసేది. ‘‘నువ్వు డాక్టరైతే ఎంత మందిని తల్లిలా కాపాడతావో, మీ రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ సరిగ్గానే చెప్పింది. నువ్వు తప్పకుండా డాక్టర్‌వి కా. ఇంగ్లాండ్‌ వెళ్ళి చదువు’’ అని చెప్పాడాయన. ఇంక రెండు రోజులకు ఆయన మరణిస్తాడనగా కూడా ఆ మాటలే చెప్పి వాగ్దానం తీసుకున్నాడు. శారదకు ఆ వాగ్దానంతో బాధ లేదు. కానీ వీరేశలింగం పంతులు గారి మరణం బాగా బాధించింది. శారదేమిటి? ఆంధ్రదేశమే అల్లాడిపోయింది. ఒక మేరు పర్వతం లాంటి మనిషి, చరిత్ర నిర్మించిన మనిషి, ఆంధ్రదేశాన్ని అంధ విశ్వాసాల నుండి హేతువు వైపు, విజ్ఞానం వైపు తిప్పిన మనిషి. అలాంటి మనిషి మరణం జాతి విపత్తులాంటిది. కానీ తప్పదు. సంతోషించాల్సిన విషయమేమిటంటే దేశంలో అన్ని రంగాలలో ఆయన తన వారసులను ఏర్పరచుకోగలిగాడు. ఆయనతో చిన్నవో, పెద్దవో విభేదాలున్నా ఆయనమీద అందరికీ గౌరవముంది. ఎందరో ఆయన దోవలో నడిచారు. ఆ దోవను మరింత విశాలం చేయడానికి తమ వంతు కృషి చేశారు. వీరేశలింగం గారి అసలైన విజయం అక్కడే ఉంది. ఆయన మొదలుపెట్టి జీవితమంతా చేస్తూ వచ్చిన పని ఆయన మరణంతో ఆగలేదు. అది మరింత విస్తృతమయింది. మరింత చురుగ్గా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు ఆ పనుల్లో నిమగ్నులయ్యారు.
శారద బాధను మరిపించింది చదువే. మూడేళ్ళపాటు చదువే లోకంగా గడిపి హైస్కూలు చదువు ముగించింది. సూర్యం స్కూల్లో చేరాడు. కళాశాల శారద కోసం ఎదురు చూస్తోంది. హైస్కూల్లో చివరి సంవత్సరంలోనే శారదకు ఆంధ్రపత్రికతో అనుబంధం ఎక్కువైంది. దేశంలో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది. అందుకే అహ్మదాబాద్‌లో ఆ సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్‌ సభల గురించి వస్తున్న వార్తలను అక్షరం వదలకుండా చదివి ఒంటబట్టించుకుంది. గాంధీ భారత ప్రజలందరి లాగానే శారద మనసులో క్రమంగా తిష్ట వేసుకుంటున్నాడు. అహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణ స్వదేశీ నినాదాలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. దీంతో 1922 సంవత్సరం ఆరంభం నుంచీ కలకలం రేగుతూ వచ్చింది. శారద ఒకవైపు పరీక్షలు మరొకవైపు ఈ స్వదేశీ ఉద్యమం వార్తలతో సతమతమయింది. ప్రకాశం పంతులుగారు న్యాయవాద వృత్తి వదిలిపెట్టిన రోజున రామారావు మద్రాసులోనే ఉన్నాడు. ఆయనతో ఈ విషయం మాట్లాడడానికి చాలామంది వచ్చారు. కొందరు ‘‘అదేమిటండీ అంత ఆవేశం. అంత సంపాదన హఠాత్తుగా ఎలా వదలిపెడతాడు’’ అన్నారు. కొందరు ఆయన త్యాగాన్ని పొగిడారు. కొందరు ‘‘ఇప్పటికి ఆయన సంపాదించింది చాలు. రెండు తరాలు గడిచిపోతాయి. ఇంక ఇప్పుడు దేశసేవ చేసుకుని పేరు సంపాదించుకుంటాడు’’ అన్నారు. రామారావు ఆ మాటకి ఒప్పుకోలేదు. ‘‘కొద్దిరోజుల్లోనే ఆయన సంపాదించినదంతా దేశానికి ఇచ్చేస్తాడు. ఆయన పత్రిక పెట్టబోతున్నాడు. చాలా పనులు చేయబోతున్నాడు. ఆయనను తేలికగా అంచనా వేయకండి’’ అన్నాడు. మొత్తానికి విద్యార్థి లోకంలో పెద్ద అలజడి రేగింది. శారద పరీక్షలు మొదలయ్యే రోజున గాంధీ గారిని అరెస్టు చేశారు. ఆ ఆందోళనతోనే పరీక్ష రాసింది శారద. నాలుగు పేపర్లు రాయటం పూర్తయ్యేసరికి గాంధీ గారిని విచారించటం, శిక్ష వేయటం కూడా జరిగిపోయాయి. ఆ రోజు గాంధీ కోర్టులో చేసిన ఉపన్యాసం ఆంధ్రపత్రికలో చదివి శారద శరీరమంతా పులకించిపోయింది.
ఎంత ధైర్యం! ఎంత సాహసం. బతికితే ఇలాంటి సాహసంతో బతకాలి. ఎదిరించాలి ఎంతటి అధికారాన్నయినా. ఒక్క చూపుతో, నవ్వుతో, ఒక తిరస్కారపు మాటతో, అనంగీకారంతో అధికార పీఠాన్ని గడగడలాడిరచాలి. శారద మర్నాడు పరీక్షకు చదవలేక పోయింది.
‘‘భారతదేశంలో జరిగే ఆందోళనలకూ, మరణాలకూ, హత్యలకూ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సహాయ నిరాకరణ
ఉద్యమాన్నీ, శాసనధిక్కార ప్రణాళికనూ నడుపుతున్నది నేనే. నా ఉద్యమం వల్ల జరిగే సర్వ అనర్థాలకూ నేనే కారకుడిని. నన్న మీరు శిక్షించండి. ఏ శిక్ష అయినా, ఆఖరికి మరణ శిక్ష అయినా సరే ఆనందంగా అనుభవిస్తాను’’.
గాంధీ శాంతంగా పలికాడని పత్రికలో వచ్చిన ఆ మాటలు శారద మనసులో శిలాక్షరాల్లా నిలిచిపోయాయి. బాధ్యత తీసుకోవడమంటే ఏమిటో చెప్పాడాయన. అది శారదకు అర్థమైంది. గాంధీ కోసం దేశంలోని లక్షలమంది లాగే శారద మనసూ ఆక్రోశించింది. ఆయనను జైలులో పెట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తెలియని పగ, కోపంతో శారద మనసు నిండిపోయింది.
పరీక్షలు రాసింది కానీ శారదకు ముందేం చేయాలో పాలుపోలేదు. దేశంలో వేలాదిమంది విద్యార్థులు కళాశాలలు బహిష్కరిస్తుంటే తాను వెళ్ళి చేరాలా? ఛీ! ఎట్లా చేస్తుందా పని. ఎంత అవమానం. కానీ చదువు. చదువుకోవాలనే తన జీవితాశయం, డాక్టర్‌ కావాలనే ఆశ… కాలేజీలో చేరకుండా ఎట్లా సాధ్యం? ఏం చెయ్యాలి? రాన్రానూ ఈ సంఘర్షణ తీవ్రమై శారద తిండికి, నిద్రకు కూడా దూరమైంది. చిక్కిపోతోంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రావలసిన అవసరం కూడా లేదు. శారద ఫస్టున పాసవుతుందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.
సైన్సు గ్రూపుతో మంచి కళాశాలలో చేరేందుకు అప్లికేషన్‌ తెచ్చాడు రామారావు.
‘‘శారదా. ఇది పూర్తి చేసి ఇవ్వమ్మా. రేపు మనిద్దరం కాలేజీకి వెళ్ళి ఇచ్చి వద్దాం’’ అంటూ శారద చేతికి ఇచ్చాడు.
నిప్పుని తాకినట్లు, పాముని పట్టుకున్నట్లు అనిపించింది శారదకు.
తండ్రితో ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కాగితాలు అక్కడే బల్లమీద పెట్టి ఏ మాటా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
మర్నాడు ఉదయం ఆ కాగితాలు ఎట్లా ఉన్నవి అట్లాగే ఆ బల్లమీద పడి ఉండటం చూసి రామారావుకేం అర్థం కాలేదు. అప్లికేషన్‌ నింపకుండా శారద ఏం చేస్తున్నట్లు?
‘‘శారదా! శారదా!’’
తండ్రి పిలుపు కోసం శారద ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా శారద నిద్రపోలేదు. చిన్నతనం నుంచీ తన చదువు కోసం తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలు, వీరేశలింగం గారికిచ్చిన వాగ్దానం, నాయనమ్మ కాశీవాసం ఇవన్నీ శారదను ఒకవైపు అశాంతిలోకి, అలజడిలోకి నెట్టాయి. ఇంకోవైపు గాంధీగారి మాటలు, ఆయన వెనక నడుస్తున్న విద్యార్థులు, ప్లీడర్లు, స్వయంగా ఎరిగిన ప్రకాశం గారు, వీళ్ళంతా ఒకవైపు. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ చిన్న మనసులో. చివరకు నిశ్చయించుకుంది. కళాశాలలో చేరే ప్రశ్నే లేదు. ఈ నిర్ణయానికి తిరుగు లేదు. ఎవరేమన్నా సరే. ఎవరేమంటారు? తండ్రిని ఒప్పిస్తే చాలు. తండ్రి తన కోరికను కాదనడు. తను ఉద్యమంలో చేరుతుంది. ప్రకాశం గారి దగ్గర, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దగ్గర శిష్యరికం చేస్తుంది. ఖద్దరు తయారు చేస్తుంది. రాట్నం తిప్పుతుంది. శారద మనసు ఈ ఆలోచనలతో ప్రశాంతమయింది. తెల్లవారురaామునెప్పుడో నిద్రపోయి ఆలస్యంగా నిద్ర లేచింది.
తన పనులు చేసుకుంటూ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తోంది.
రామారావు శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఈ అప్లికేషన్‌ ఇలానే ఉంచావేం. పూర్తి చేయలేదేం. ఇవాళ ఇచ్చి రావాలి కదా’’ అన్నాడు.
‘‘నేను కాలేజీలో చదవాలనుకోవటం లేదు నాన్నా’’ అంది శారద. రామారావు నిర్ఘాంతపోయాడు.
‘‘ఏంటమ్మా’’ అన్నాడు అయోమయంగా.
‘‘దేశంలో అందరూ కళాశాలలు బహిష్కరిస్తుంటే నేను ఇప్పుడు చేరి చదవనా? ఎట్లా చదువుతాను నాన్నా?’’
రామారావుకి అర్థమైంది. భయం వేసింది. శారద ఒక నిర్ణయం తీసుకుంటే మార్చటం కష్టమని ఆయనకు తెలుసు. దేశంలో జరుగుతున్న అలజడీ, దాని ప్రాముఖ్యమూ ఆయనకు తెలియనిది కాదు. ఆయన మిత్రులు, సహచరులు ఎందరో ఆ ఉద్యమంలో ఉన్నారు. ఆయనకు అతి సన్నిహిత మిత్రుడు హరి సర్వోత్తమరావు ఈ స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టక ముందే, 1908లోనే బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రి వచ్చినప్పుడు విద్యార్థిగా పరీక్షలు బహిష్కరించి కళాశాల నుంచి బైటికొచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాసి, ఆంధ్ర దేశంలో స్వతంత్రం కోసం మొట్టమొదట జైలుకెళ్ళిన యోధుడయ్యాడు. ఆ జైలు జీవితం గురించి ఆయన చెప్తుంటే రామారావు ఒళ్ళు గగుర్పొడిచింది. అంత క్రూరం. అంత కఠినం. అదంతా వేరు. దానిలో ఆసక్తి, అభినివేశం ఉన్నవారు అటు వెళ్తారు.
శారద ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని, చదువు పాడుచేసుకుని, జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటుందా?
‘‘ఎందుకమ్మా! అనవసరంగా ఆవేశపడుతున్నావు’’ కూతురిని కొంచెం మార్చాలనుకున్నాడు రామారావు. ఇంతవరకూ శారద సందేహాలకు సమాధానమివ్వటమే ఆయనకు తెలుసు. ఇప్పుడు శారదను ప్రశ్నించి మార్చే పనిచేయటం ఎలాగో ఆయనకు కాస్త కష్టంగానే ఉంది.
శారదకూ తండ్రితో ఇలా నచ్చని విషయాలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకూ వాళ్ళిద్దరిదీ ఒకటే మాట. ఈ పరిస్థితి శారదకూ తేలికగా లేదు.
‘‘ఆవేశం కాదు నాన్నా. ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను’’ అంది శాంతంగా.
‘‘ఆలోచించటానికి నీకేం తెలుసమ్మా’’
శారద ఆ మాట అర్థం కానట్లు చూసింది.
‘‘రోజూ పత్రికలు చదివి, ప్రకాశం పంతులు వంటి వారిని చూసి ఆవేశపడుతున్నావు. అంతేగాని ఈ ఉద్యమం ఏమిటి, దాని మంచి చెడ్డలేమిటి అనేది నీకు తెలుసా?’’
‘‘నాకు తెలుసు నాన్నా. అన్నింటికంటే ముఖ్యం స్వాతంత్య్రం.’’
‘‘నిజమే. కానీ కళాశాల మానేస్తే స్వాతంత్య్రం వస్తుందా? మానెయ్యమన్న కాంగ్రెస్‌ వారికి స్వాతంత్య్రం గురించి పట్టుదల
ఉందా? ఇంతవరకూ వాళ్ళు ఆ మాట అనలేదు. మాకు పూర్తిగా స్వాతంత్య్రం కావాలని వారింకా అడగలేదు. సందేహిస్తున్నారు. కాంగ్రెస్‌లో కూడా రకరకాల ధోరణులున్నాయి. నాయకులంతా ఒకే ఆలోచనతో లేరు. నీకు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు నమ్మకం లేదు. కేవలం ఆవేశంతో ఒక జీవితకాలపు నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా?’’
‘‘గాంధీ గారు జైలులో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం నడవొద్దా నాన్నా’’ శారద కొంచెం బలహీనంగా అంది.
‘‘గాంధీ ఇవాళో కార్యక్రమం ఇస్తాడు. రేపు ఇంకొకటి ఇస్తాడు. అవి రాజకీయాలు. నేను వాటిని తప్పు పట్టను. పట్టేంత పరిజ్ఞానం ఆ రాజకీయాల గురించి నాకు లేదు. కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా దాన్లోకి దూకడం మంచిది కాదు. కాలం విలువైంది. ఒకటి, రెండు సంవత్సరాలు వృధా చేసుకోవటం తప్ప జరిగేదేం ఉండదమ్మా’’.
‘‘అసలు ఈ చదువే మానేస్తా నాన్నా’’.
‘‘డాక్టరవవా అమ్మా’’ రామారావు అడిగిన తీరుకి శారద గుండె కరిగిపోయింది. తండ్రికి తనమీద ఉన్న ఆశ ఆ పిల్లకు తెలిసినట్లు మరెవరికి తెలుసు? మాట్లాడలేకపోయింది.
‘‘దేశం కోసం కొందరు విద్యార్థులు కళాశాలలు, చదువులు బహిష్కరిస్తున్నారు. అది వారి పద్ధతి. దాని మంచి చెడ్డలు ఎంచొద్దు. స్వాతంత్య్రం కోసం వారు త్యాగాలు చేస్తున్నారని అనుకుందాం. నువ్వు ఇంకో రకం త్యాగం చెయ్యమ్మా’’ శారదకు ఆ మాట అర్థం కాలేదు.
‘‘రేపు దేశం స్వతంత్రమైతే డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల చదువులు చదివిన వారు అవసరం కాదా? ఒక లేడీ డాక్టరు కూడా లేకుండా స్వతంత్ర దేశం అభివృద్ధి చెందుతుందా? అప్పుడు చదవటం మొదలుపెడితే ఆలస్యం కాదా? స్వతంత్రం వచ్చేనాటికి నువ్వు సర్వసన్నద్ధంగా ఉంటావు ప్రజలకు సేవ చేయడానికి. దానికోసం ఇప్పటికిప్పుడు ఉద్యమంలో చేరి నీ స్వతంత్ర కాంక్షను ప్రదర్శించాలనే కోరికను త్యాగం చెయ్యి. ఇవాళ ఏదో ఒక మార్గంలోనే దేశం కోసం పనిచేస్తే సరిపోదమ్మా. అన్నివైపుల నుంచీ సన్నద్దం కావాలి. నువ్వింకా చిన్నదానివి. ఉద్యమం లోతుపాతులు తెలియాలన్నా ఇంకా కొన్నేళ్ళు పోవాలి. మహా మహా వాళ్ళే ఈ కాంగ్రెస్‌లో ఇమడలేక, ఈ ఉద్యమంలో ఇమడలేక వేరే వేరే పనులు చేస్తున్నారు. ప్రకాశం అనుభవజ్ఞుడు, అపారంగా చదివాడు. అన్నీ తెలిసినవాడు. ఆయనా, నువ్వూ ఒకటి కాదు, అతను నీ ఆదర్శం కాదు. నువ్వు వేరే దారి వెయ్యాలి. నీ ఆదర్శం నీకుండాలి. అది డాక్టరువై ప్రజా సేవ చెయ్యటం. ఎన్ని ఆటంకాలొచ్చినా దాన్ని నువ్వు వదలకూడదు. అలాగని నాకు నువ్వు మాట ఇవ్వాలి.’’
శారద తండ్రి మాటలకు ఉక్కిరిబిక్కిరయింది. కళాశాలలో చేరి చదివి డాక్టరవటం త్యాగం అనుకోవటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. తనకెంతో ఇష్టమైనదాన్ని దేశం కోసం వదిలేయడం త్యాగమని ఆమె నమ్మింది. కానీ చదవటం కూడా దేశసేవకు ఒక మార్గమని తండ్రి చెప్పిన మాటను అంత తేలికగా తీసివెయ్యటం కూడా చేతకాలేదు. ఉద్యమం లోతుపాతులు తెలియవన్న మాట నిజమే! కానీ దిగకుండా లోతు ఎలా తెలుస్తుంది. శారద అంతరాత్మ పోరాటం, శాసన ధిక్కారం వైపే ఉన్నాయి. ఆలోచనలో పడిన శారదను చూస్తే రామారావు మనసులో ఆశ రేకెత్తింది.
‘‘ఆలోచించు శారదా! తొందరేం లేదు. నాలుగు రోజులు ఆగి ఆలోచించే అప్లికేషన్‌ ఇవ్వొచ్చు. నువ్వు తెలివైనదానివి. నేను చెప్పిన మాటల గురించి కూడా ఆలోచించు. అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. హరిగారితో మాట్లాడు. తొందరపడొద్దు.’’
నిదానంగా నచ్చచెప్పి బైటికి నడిచాడు రామారావు.
ఆ రోజే శారదకు అన్నపూర్ణ నుంచి ఉత్తరం వచ్చింది.
ప్రియ శారదా
క్షేమంగా ఉన్నావు కదా? దేశం ఎలా ఉందో చూస్తున్నావా? అందరూ దేశం కోసం నిలబడవలసిన సమయం వచ్చినట్లుంది కదూ. మా ఆయన కూడా చదువు మానేసి వచ్చాడు. రాట్నాలు తెచ్చాడు. నాకొకటి పంపాడు. నేనూ రాట్నం ఒడుకుతున్నాను. మన ఊళ్ళో అందరూ గాంధీని దేవుడిలా పూజిస్తున్నారు. నువ్వు కళాశాలలో ప్రవేశిస్తావా? లేదా? నాకు సందేహంగా ఉంది. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉంది గానీ చదువులు మానెయ్యటం సరికాదేమోననే అనుమానం కూడా ఒక చెంప నన్ను వేధిస్తోంది. మా ఆయన చదువు ఈ ఏడాదితో పూర్తయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం చూసుకుంటే మేమిద్దరం ఒకచోట ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సంపాదన లేకుండా కాపురం వద్దని ఇన్నాళ్ళూ చెప్పారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా వస్తుంది. మా కాపురం సంగతేమిటి? మా అమ్మానాన్నలను కూడా ఈ ఆందోళన వేధిస్తోంది. నాకు ఒక పక్క ఆయన ఉద్యమంలో ఉన్నారని గర్వం. ఇంకోపక్క మా భవిష్యత్తు తల్చుకుంటే అయోమయం, భయం. ఆయన జైలుకెళ్తారనుకుంటే పట్టలేని దుఃఖం. మళ్ళీ జైలుకెళ్ళిన వారి గురించి ఆలోచిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంది. విశాలాక్షి చదువు మానదట. గుంటూరు కాలేజీలోనే చదువుతుందట. వాళ్ళిప్పుడు అక్కడే ఉన్నారుగా. నువ్వేమనుకున్నావో రాయి. నీ చదువు మానొద్దనే నా సలహా. నువ్వు డాక్టర్‌వి కావాలి.
నీ ప్రియ నెచ్చెలి
అన్నపూర్ణ
శారదకు ఆ ఉత్తరం చదివి చాలా ఉద్వేగం కలిగింది. అబ్బయ్య చదువు మానేశాడనే విషయం ఎక్కినట్లు ఆ అమ్మాయి మనసులోకి మరేదీ ఎక్కలేదు. తన నిర్ణయానికి బలం వచ్చినట్లనిపించింది.
‘‘తమ్ముడూ.. నేనిక చదవనురా’’ అని సూర్యంతో చెప్పింది. స్వతంత్రోద్యమం గురించీ, గాంధీ గురించి రోజూ అక్క చెప్పే మాటలు వింటున్న సూర్యం చాలా గట్టిగా చెప్పాడు ‘‘చదువు మానేద్దాం అక్కా. ఇద్దరం గాంధీ దగ్గరకు వెళ్ళిపోదాం’’. తమ్ముడిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది శారద.
రామారావు శారదను కళాశాలలో చేర్పించి హైదరాబాదు వెళ్దామనుకున్నవాడు కాస్తా ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆయనకు ఇంత పెద్ద సమస్య ఎన్నడూ రాలేదనిపించింది. తల్లి కాశీ ప్రయాణం ఆయన మనసుని చాలా బాధించింది కానీ కూతురి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంటే ఆ బాధను తొందరగానే స్థిర నిర్ణయంగా మార్చుకోగలిగాడు.
కానీ కూతురు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎలా? కూతురి నిర్ణయం సరికాదని ఆయనకు బలంగా అనిపిస్తోంది. చదువు మాని దేశసేవ చెయ్యనక్కరలేదు. చదువుకుని దేశానికెంతో చెయ్యొచ్చు. అందులో అదెలాంటి చదువు? ప్రజలకు ప్రాణం పోసే చదువు. శారదను ఇంగ్లాండ్‌ పంపాలనుకున్నాడాయన. ఇక్కడే చదవనంటున్న శారద ఇంగ్లాండ్‌ వెళ్తుందా? ఇంగ్లాండ్‌ వెళ్ళి చదవటం మహాపాపమంటుంది. కానీ గాంధీ, నెహ్రు, ప్రకాశం అందరూ ఇంగ్లాండ్‌ వెళ్ళి చదివాకనే ఇట్లా దేశం కోసం పనిచేస్తున్నారని శారదకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తనమీదనే ఉందనుకున్నాడాయన. తనొక్కడే కాకుండా హరిసర్వోత్తమరావుతో, వీలైతే ప్రకాశం గారితో కూడా చెప్పించాలనుకున్నాడు. ప్రకాశం గారు చెబుతారా? ఆయన శారద నిర్ణయాన్ని బలపరుస్తాడనే భయం కూడా రామారావు మనసులో ఓ మూల ఉంది.
రెండేళ్ళుగా ఆయన తన పరిశోధనలు, చరిత్ర రచనలో పడి శారద గురించి పట్టించుకోలేదనే అపరాధ భావనకు లోనయ్యాడు. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ విషయాలు శారదతో మాట్లాడి ఆ అమ్మాయి ఆలోచనలను ఒక క్రమంలో పెట్టి ఉండాల్సిందని ఆయనకు బలంగా అనిపించింది. కానీ దేశ పరిస్థితి చూస్తే శారద వయసులోని విద్యార్థులలో చాలామంది శారదలాగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. భయం అంటే తెలియని ఆయన మనసులో మొదటిసారి భయం మొదలై శరీరాన్ని బలహీనం చేసింది. తన భయాన్ని పోగొట్టగలవాడు హరిసర్వోత్తమరావు ఒక్కడే అనిపించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు. చదువులనూ, కోర్టులనూ బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్‌ సభలలో పాల్గొన్నవాడు. కానీ ఆయన రామారావుకి ఆప్తమిత్రుడు. తన బాధను అర్థం చేసుకుని సరైన దారి చూపగల వ్యక్తి అనిపించింది. అదృష్టవశాత్తు ఆయన మద్రాసులోనే
ఉన్నాడు. రామారావుని చూసి ఆనందంగా కౌగిలించుకున్నాడు.
కుశల ప్రశ్నలయ్యాక హరిగారు సంభాషణను రాజకీయాల వైపు మళ్ళించాడు.
‘‘దేశం ఉద్యమాల బాట పట్టింది రామారావ్‌. మనం కూడా శక్తివంచన లేకుండా పనిచెయ్యాలి’’.
రామారావుకి ఆ మాటతో పట్టరాని ఆవేశం వచ్చింది.
‘‘మనం చెయ్యాలి గానీ అభం శుభం తెలియని యువతీ యువకులు చదువులు మానటం మంచిదంటారా?’’
‘‘విదేశీ చదువుల స్థానంలో స్వదేశీ చదువులు తీసుకురావాలి గదా’’ రామారావుకి ఒక్కసారి అంత ఆవేశమెందుకు వచ్చిందో హరి గారికి అర్థం కాలేదు.
‘‘మనలాంటి వాళ్ళం స్వదేశీ చదువుల గురించి ఆలోచించి ఆ చదువులు చెప్పే సంస్థలను ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచాక పిల్లలు అటు రావొచ్చు. ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా ఏం చేస్తారు?’
‘‘జాతీయ పాఠశాలలు ఏర్పాటవుతూనే ఉన్నాయిగా?’’
‘‘అవి చిన్నపిల్లలకు. కళాశాలలో ఉన్నత విద్యల సంగతేంటి? ఆ జాతీయ పాఠశాలలు కూడా నిలబడటం లేదే. వాటికే అంకితమై వాటిని మహా సంస్థలుగా రూపొందించే సమయం ఎవరి దగ్గరుంది? అందరూ ఉద్యమంలో తలమునకలుగా ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థలను ఏర్పరచి అభివృద్ధి చేయటం నిర్మాణ కార్యక్రమం. ఇప్పుడు నిర్మాణాలను ధ్యంసం చేసే కార్యక్రమం నడుస్తోంది. దాంతో పాటు జాతీయ విద్య లాంటి అతి పెద్ద బాధ్యతను అంకితభావంతో చేపట్టగల వారెవరున్నారు. ఈ జాతీయ పాఠశాలలూ, కళాశాలలూ నిలుస్తాయనే నమ్మకం నాకు లేదు’’.
రామారావులో పెరుగుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు హరి గారు.
‘‘వాటి గురించి మీరెందుకు ఇంతగా ఆవేశపడుతున్నారు. కాలక్రమేణా అన్నీ జరుగుతాయి’’.
‘‘హరీ! శారద చదువు మానేస్తానంటోంది.’’
హరికి వెంటనే రామారావు ఆవేశం అర్థమైంది. రామారావు వంక సానుభూతిగా చూశారు.
‘‘హరీ! శారద చదువు కోసం నేను పడే తపన నీకు తెలుసు. అసలు ఆడపిల్లలని చదివించే వారు ఎంతమంది? నేను మా అమ్మను ఎదిరించడానికి, ఆమెను కాదని, ఆమె ఇల్లు వదిలి కాశీ వెళ్ళి, మళ్ళీ నా ఇంటికి రానని చెబుతుంటే విని తట్టుకుని ఆమెను కాశీ పంపింది ఎందుకు? శారద డాక్టరవ్వాలనే కదా. ఇప్పుడదంతా మర్చిపోయి చదువు మానేస్తానంటే శారద ఏమవుతుంది? ఎక్కడికి చేరుతుంది? తెలియని మహా సముద్రంలో దూకుతానంటే ఏం చెయ్యను చెప్పు. ఎలాగైనా శారద మనసు మార్చాలి. కళాశాలలో చేర్చాలి.’’
రామారావులోని ఆవేశం హరి గారికి పూర్తిగా అర్థమైంది.
‘‘నేనేం చెయ్యను రామా’’
‘‘శారదతో మాట్లాడు. డాక్టరయ్యి దేశానికి సేవ చెయ్యటం ఉత్తమమని చెప్పు’’.
‘‘నాకా అర్హత ఉందా? నేను గాంధీతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి సహాయ నిరాకరణ గురించి చెప్పినవాడిని.’’
‘‘అందుకే నిన్ను చెప్పమంటోంది. శారద శక్తి, తెలివి తేటలు ఇంట్లో కూర్చుని రాట్నం ఒడకడానికీ, జైలుకు వెళ్ళి ఏ పనీ లేకుండా కూర్చోడానికి ఖర్చవ్వాలా?’’
‘‘నీకు ఆవేశంలో ఏమీ తెలియటం లేదు రామా. మన అభిప్రాయాలు కూడా ఈ విషయంలో వేరు. కానీ శారద తండ్రిగా నాకు నువ్వు అర్థమవుతున్నావు. శారదని చదువుకోమని నేను చెబితే ఆ అమ్మాయి వింటుందా?’’
‘‘వింటుంది. ఆ రాజకీయపు లోతులు శారదకు తెలియవు. అక్కడ ఇమడలేదు. డాక్టర్‌ చదివి దేశానికెంతో సేవ చేయగలుగుతుంది. స్వతంత్ర దేశానికి డాక్టర్లు అక్కర్లేదా?’’
‘‘అందరూ కావాలి. కానీ ఇప్పటి ఉద్యమ అవసరం వేరు.’’
‘‘నా కోసం నువ్వు శారదతో మాట్లాడు హరీ! ఆమెను చదువుకోమను.’’
‘‘డాక్టరవటం వల్ల దేశానికి సేవ చెయ్యొచ్చని మాత్రం చెబుతాను. అంతకు మించి నా వల్ల కాదు’’.
రామారావు ముఖంలో కనిపించిన నిరాశ, కుంగుబాటు చూసి హరి గారికి కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.
‘‘రామా! నేను నా ఆశయాలకు భంగం రాకుండా శారదను ఒప్పించటానికి ప్రయత్నిస్తాను.’’
‘‘అదే చాలు. నేనూ శారదను బతిమాలుకుంటాను.’’
రామారావు పరిస్థితి, ఆ తీవ్రత హరి గారికి అర్థమైంది. ప్రాణమిత్రునికి వీలైనంత సహాయం చెయ్యాలనే ఆయనకు అనిపించింది. రామారావు తన పనిలో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయటం లేదు. ఇప్పుడు శారద గురించిన మనోవేదన కూడా తోడైతే అది మంచిది కాదనిపించింది. రామారావు లాంటి మనుషులు దేశానికి ఎంతో అవసరం. రామారావుని కాపాడటం స్నేహితునిగా తన కనీస ధర్మం అనుకున్నాడు. కానీ రాజీపడటం ఆయనకు బొత్తిగా చేతకాదు. కళాశాలను బహిష్కరిస్తాననే నిర్ణయం తండ్రికి చెప్పిన తర్వాత శారదకు పట్టరానంత ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో అన్నపూర్ణకు ఉత్తరం రాసింది.
ప్రియమైన అన్నపూర్ణ,
నీ ఉత్తరం, అందులోని విషయాలు నాకు ఎంత సంతోషం కలిగించాయో నీకు చెప్పలేను. నీ భర్త ఉత్తముడు. అతను చదువు మానటం చాలా గొప్ప పని. మద్రాసు నుంచి అతను వెళ్ళే ముందు నన్నొక్కసారి కలిసి ఉంటే ఎంత బాగుండేది. నా నిర్ణయం ఇంకొంచెం ముందుగా ధైర్యంగా, నిస్సందేహంగా తీసుకోగలిగేదాన్ని. ఇంతకూ నా నిర్ణయం ఏమిటంటావా? మనందరిదీ ఒకటే మార్గం. నేను కూడా చదువు మానేస్తున్నాను. రాట్నం ఒడుకుతాను. ఖద్దరు ధరిస్తాను. దేశం కోసం పని చెయ్యమని నా మనసు చెబుతోంది. అంతకంటే మహత్తరమైన పని లేదని చెబుతోంది. నా మనసు మాట వింటాను. మా నాన్నకు బాధ కలిగిస్తున్నానని తెలుసు కానీ ఎంతో మంది బాధ పడందే, త్యాగం చెయ్యనిదే దేశానికి స్వతంత్రం వస్తుందా? ఇప్పుడు నా మనసంతా అదే ఆలోచన. ఇన్నాళ్ళూ ఇలా ఆలోచించలేదేమిటా అని సిగ్గుపడుతున్నాను. ఇవాళే కళ్ళు తెరిచి దేశాన్ని కొత్తగా చూస్తున్నా. ప్రజల బానిసత్వం, పరాయి పాలకుల దుర్మార్గం నాకు అర్థమవుతోంది. ఈ బానిస బతుకులు మనం బతకవద్దు. నువ్వు నీ భర్తను అనుసరించు. ఉద్యమంలోకి రా! మీ కాపురం గురించే ఆలోచించి విలువైన విషయాలను పక్కన పెట్టకు. నేనింకా నాన్నను ఒప్పించాల్సి ఉంది. ఏం పని చెయ్యాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. నేనింకా చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని అంటారు నాన్న. ఈ వయసు నుంచే పనిచేసి అనుభవం సంపాదించే అవకాశం వచ్చింది కదా అనిపిస్తుంది నాకు. నా రక్తం ఉప్పొంగుతోంది. గాంధీ గారు కోర్టులో చెప్పిన మాటలు పత్రికలో చదివావు కదూ? ఆ మాటలు చదివి నేను రోమాంచితనయ్యాను. ఆ క్షణాన వెళ్ళి బ్రిటిష్‌ అధికారుల ముందు నిలబడి నన్ను బంధించండి, నన్ను ఉరి తియ్యండి కావాలంటే… నేనూ ఉద్యమానికి చెందిన దానినే అని అరవాలనిపించింది. నా ప్రాణాలు ఇవ్వాలనిపించింది దేశం కోసం, గాంధీ గారి కోసం.
అన్నపూర్ణా! నువ్వు, నీ భర్తా, నేనూ అందరం దూకుదాం. అందరం కలిస్తే ఎంత బలం.
నా చదువు గురించి నాన్న నాలుగు రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు. నాలుగు రోజుల తర్వాత మారని నా నిర్ణయం గురించి నాన్నకు చెప్పి నా కర్తవ్యం నిర్వహిస్తాను. నేనేం చెయ్యాలో చెప్పమని నాయకులను అడుగుతాను. వాళ్ళు చెప్పిన పని ఆనందంగా, త్రికరణ శుద్ధిగా చేస్తాను.
విశాలాక్షి చదువుకుంటున్నందుకు నాకు సంతోషంగా లేదు. నాలాగా తనెందుకు ఆలోచించటం లేదు? నువ్వు గుంటూరు దగ్గర్లోనే ఉన్నావు కదా విశాలాక్షితో మాట్లాడరాదూ? చదువు మానెయ్యమని చెప్పరాదూ. విశాలాక్షికి కూడా ఉత్తరం రాస్తాను నేనే.
నీ ప్రియమైన
శారద.
ఆ ఉత్తరం రాశాక ఇక శారదకు సందేహమే లేదు. ఆనందంగా పత్రికలు చదువుతోంది. ఆ వేడిలోనే విశాలాక్షికీ ఉత్తరం రాసేసింది. మర్నాడు మధ్యాహ్నం శారద భోజనం చేసి ‘‘యంగ్‌ ఇండియా’’ పత్రిక పట్టుకుని చదువుతుండగా ఆమె స్నేహితులొచ్చారని వంటావిడ వచ్చి చెప్పింది.
శారద ఆశ్చర్యంగా వెళ్ళి వాళ్ళను కౌగిలించుకుంది. ముగ్గురూ కూర్చున్న తర్వాత వెరోనికా అంది ‘‘మేం కాలేజికి వెళ్ళి దరఖాస్తు ఫారాలు ఇచ్చి వచ్చాం. నువ్వూ ఇచ్చి ఉంటావులే’’ అని.
శారద వాళ్ళ వంక జాలిగా చూస్తూ ‘‘మీరు కళాశాలలో చేరుతున్నారా? నేను బహిష్కరిస్తున్నాను’’ అంది.
‘‘అదేమిటి? బహిష్కరించడమేమిటి? ఎందుకు? చదవవా?’’ వాళ్ళిద్దరూ కంగారుగా అడిగారు.
శారద వివరంగా ఉద్యమం గురించీ, గాంధీగారి పిలుపు గురించి ఎంతమందో చదువులు మాని ఉద్యమంలోకి దూకడం గురించీ, వాళ్ళూ చదువు మానెయ్యాల్సిన కర్తవ్యం గురించీ ఆవేశంతో చెప్పింది. వాళ్ళను మార్చి కళాశాలకు వెళ్ళకుండా చెయ్యటమే తన కర్తవ్యమన్నట్లు చెప్పింది.
అంతా విని వెరోనికా, థెరిసా లేచి నిలబడి ‘‘ఇక వెళ్ళొస్తాం’’ అన్నారు. శారద అర్థం కానట్లు చూసి, ‘‘కూర్చోండి, నా మాటలన్నీ విని మాట్లాడకుండా వెళ్ళిపోతామంటారేం. ఏదో ఒకటి చెప్పండి. నేనన్న మాటల్లో తప్పుందా?’’ అంటూ వాళ్ళను కూర్చోబెట్టింది.
‘‘తప్పు, ఒప్పు కాదు శారదా. మేం చదువు మానం. నువ్వు చదువు మానినా నీకేం నష్టం లేదు. డబ్బుంది, పెళ్ళి చేసుకుంటావు. హాయిగా బతుకుతావు. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటావు. మేం ఈ చదువు మానితే ఏముంది? మా వాడల్లో గౌరవం లేకుండా దుర్భరమైన బతుకులు బతకాలి’’ థెరిసా మాటలకు అడ్డు వచ్చింది వెరోనికా.
‘‘శారదా! ఈ చదువు లేకపోతే నీతో స్నేహం చెయ్యగలిగేవాళ్ళమా? అసలు మాతో నువ్వు మాట్లాడేదానివా? మీ ఇంటికి వచ్చి నీ పక్కన కూర్చోగలిగే వాళ్ళమా? అట్లాంటి చదువు మానమంటున్నావా? నీకు చదువు ఉన్నా లేకపోయినా ఒకటే. డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ ఉంటాయి. నిన్నెవరూ అవమానించరు. కానీ మాకు చదువు తప్ప ఇంకో ఆధారమేమీ లేదు. ఉన్న ఒక్క ఆధారం వదులుకోమంటావా? మేం చదువుకోవడానికి మా కుటుంబాల వాళ్ళు ఎంతెంత త్యాగాలు చేశారో, అవి చాలు. ఇంక మేం త్యాగం చెయ్యనవసరం లేదు.’’
శారదకు చాలా కష్టమనిపించింది. దుఃఖం వచ్చింది.
‘‘గాంధీ గారు…’’
‘‘ఆయనంటే మాకు గౌరవం ఉంది. కానీ ఆయనగానీ, మరెవరైనా గానీ మా కులం వాళ్ళ బతుకులు బాగు చెయ్యగలరని మాకు నమ్మకం లేదు. మా చదువే మమ్మల్ని ఉద్ధరిస్తుంది. మేం చదువుకుని మా వాళ్ళకు చదువు చెబుతాం, సేవ చేస్తాం. అది కూడా దేశసేవే. రాట్నం ఒడకడం, వందేమాతరం అని అరవటం మాత్రమే దేశసేవ కాదు’’ అంది థెరిసా.
‘‘మేం దీని గురించి ఆలోచించలేదనుకోకు శారదా. మేం మతం మార్చుకున్నాం కాబట్టి మమ్మల్ని కొంతవరకైనా మనుషుల్లా చూస్తున్నారు. తెల్లవాళ్ళ మీద నీకున్నంత కోపం మాకు లేదు. అసలు కోపమే లేదు. మనకు చదువు చెప్పే అమ్మగార్లు ఎంత మంచి
వాళ్ళు. వాళ్ళు వచ్చి మా మతం మార్చి మమ్మల్ని చదువుల్లో పెట్టకపోతే ఏమయ్యేవాళ్ళం. మీ వాళ్ళు మమ్మల్ని అంటుకోరే. మమ్మల్ని వెలివేశారే. మీరు మమ్మల్ని చూసినట్లు తెల్లవాళ్ళు మిమ్మల్ని చూస్తే మీరు భరించలేకపోతున్నారు. మేం ఎట్లా భరిస్తాం.’’
‘‘గాంధీ గారు హరిజనుల కోసం కూడా…’’
‘‘అది మాకు చాలదు. గాంధీ గారు వచ్చినపుడు మా ఇళ్ళకు వచ్చిన మీ వాళ్ళు ఆ తర్వాత స్నానాలు చేస్తారు. మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి ఆ ఇల్లంతా శుద్ది చేసుకుంటారు. మీ వాళ్ళు మారరు. మా బతుకులూ మారవు. చదువు మాత్రమే కొంతైనా మారుస్తుంది. ఆ చదువును మేం వదలం. అది వదిలితే ఇంక బతికున్న శవాలమే. నువ్వు కూడా మానొద్దు. మీ వాళ్ళలో మాత్రం ఎంతమంది ఆడవాళ్ళను చదవనిస్తున్నారు? నువ్వు డాక్టరువై ఎంతో సేవ చేస్తానని చెప్పేదానివి. అది మాత్రం సేవ కాదా?’’
థెరిసా, వెరోనికా మాటలకు శారద సమాధానం చెప్పలేకపోయింది.
‘‘ఊళ్ళో మా వాడల్లోకి కూడా రాట్నాలు వచ్చాయి. మా వాళ్ళు కూడా చేయగలిగింది చేస్తున్నారు. మాకు మాత్రం వాటి మీద నమ్మకం లేదు.’’
ఇంతలో సుబ్బమ్మ గారు వాళ్ళ కోసం ఫలహారాలు తెచ్చారు.
‘‘నమస్కారమండీ. ఎప్పుడొచ్చినా మంచి మంచి ఫలహారాలు పెడతారు’’ అంటూ వాటిని తినే పనిలో పడ్డారు వెరోనికా, థెరిసాలు.
శారదకు చాలా గందరగోళంగా అనిపించింది. ఫలహారం రుచించలా. అన్యమనస్కంగానే వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అన్నపూర్ణకు ఉత్తరం రాసినప్పటి ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎంత వెనక్కు నెట్టినా ఆగకుండా ప్రశ్నలు వస్తున్నాయి. చదువు మానటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చెయ్యని వాళ్ళను తక్కువగా చూడటం సరికాదు. అంటే చదువు మానేసి తను గొప్ప నాయకురాలై పోదు. అలా అవుతాననుకుంటే వెరోనికా, థెరిసాలను అవమానించినట్లే. కానీ హరిజనుల సంగతేమో కానీ వేలమంది చదువు మానుతున్నారు.
కానీ విదేశీ విద్య లేకపోతే ఆడవాళ్ళకు, హరిజనులకు ఇలా బైటికొచ్చి ఇంత మంచి చదువు చదివే అవకాశం ఉండేదా? అదంతా తర్వాత.. గాంధీగారు ఆలోచించకుండా ఈ కార్యక్రమం ఇవ్వరు కదా. దీని ప్రయోజనం తర్వాత తెలుస్తుంది. ఇంతమంది పెద్దలు కళాశాలల్ని, కోర్టుల్ని, ఉద్యోగాలను వదిలేస్తుంటే అది మంచి పని కాకుండా ఎలా ఉంటుంది?
శారదకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తండ్రిని అడగడానికి సంకోచం. చివరికి తన పరిస్థితీ, తన స్నేహితుల పరిస్థితీ ఒక్కటి కాదు గాబట్టి వాళ్ళ నిర్ణయమూ, తన నిర్ణయమూ కూడా సరైనవేననే ఆలోచనను మనసులో స్థిరపరచుకుని కొంత శాంతి పొందింది.
రెండు రోజుల తర్వాత హరి గారు వచ్చేసరికి శారద ఆయనను ఉత్సాహంగానే ఆహ్వానించింది. నిజానికి ఆయనను తానే వెళ్ళి కలిసి మాట్లాడాలనుకుంటున్నదేమో ఆయనే వచ్చేసరికి హడావుడిగా అతిథి మర్యాదలు చేసి ఆయన ముందు విద్యార్థినిలా కూర్చుంది.
హరిగారు ఏమీ తెలియనట్లుగా ‘‘ఏ కాలేజీలో చేరుతున్నావమ్మా?’’ అని అడిగారు.
‘‘ఏ కాలేజీలోనూ చేరదల్చుకోలేదండీ’’ అంది శారద ఒక రకమైన గర్వంతో.
‘‘అదేమిటి ఎందుకు?’’ హరిగారు శారదను పరిశీలనగా చూస్తూ అడిగారు.
‘‘నేనిక ఈ చదువులు చదవదల్చుకోలేదు. స్వదేశీ ఉద్యమంలో చేరి పని చేయాలను కుంటున్నాను?’’ హరిగారు నవ్వారు.
‘‘అలాగైతే సంతోషమే. ఏం పని చేస్తావమ్మా?’’
‘‘రాట్నం తిప్పుతాను. ఇంకా మీలాంటి వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను. అసలు నేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలనుకున్నాను.’’
శారద ఉత్సాహం చూస్తుంటే హరి గారికి జాలి వేసింది.
‘‘నేను చేసే పనులు రాయటమూ, ప్రజలను సమీకరించటమూ. ఆ రెండు పనులకూ నీకింకా వయసూ, అనుభవం కావాలి.’’
ఆయన మాటలు అర్థం కానట్లు చూసింది శారద.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.