కొత్తపల్లి అనేది ఓ మారుమూల గ్రామం. ఈ పల్లెకి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఇక్కడ చిన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా స్థాయిలో ప్రధములుగా నిలుస్తుంటారు.
ఈ ఏడాది పదో తరగతిలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతిలో 20 మందిలో ప్రవళిక అనే అమ్మాయి చదువుతోపాటు పాఠశాలలో ఏ పోటీలు జరిగిన ముందు వరసలోనే ఉండేది. పెద్దలపై ఎంతో గౌరవంగా, తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండేది.
తరగతిలో కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తల్లిదండ్రులని ఒత్తిడి చేసి పాకెట్ మనీ తెచ్చుకునేవారు. ఆ డబ్బులతో పాఠశాల సమీపంలో అమ్మే తినుబండారాలు కొనుక్కునేవారు. అలాంటివి తినకూడదని ఉపాధ్యాయులు రోజు చెబుతున్న వినకుండా చాటుగా తరగతి గదిలోకి తెచ్చుకుని తినేవారు. దీంతో తరచూ అనారోగ్యానికి గురైయ్యేవారు. పైగా అలాంటి అలవాట్లు లేని ప్రవళికని పిసినారి అని గేలి చేసేవారు.
ఒకరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరగతులకు నోటీసు పంపించారు. పక్క ఊరిలో అనారోగ్యంతో ఒక అమ్మాయి బాధపడుతోంది. పేద వృద్ధులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను రేపు పాఠశాలకు తీసుకొస్తున్నారు. విద్యార్థులంతా తమకు తోచిన సాయం అందించాలి అనేది ఆ నోటీసు సారాంశం. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన అనారోగ్యంతో ఉన్న బాలిక ఆమె తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒకరు ఒకరిగా వేదిక పైకి వెళ్లి ఇంటి నుంచి తెచ్చిన ఐదు, పది రూపాయలు ఇచ్చి వస్తున్నారు. మౌనంగా కూర్చున్న ప్రవళికని ‘ఏంటి? నువ్వేం సాయం చేయడం లేదా?’ అని టీచర్ భాగ్యలక్ష్మి అడిగింది. ‘ఆమె దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి మేడం’ అంటూ కొంతమంది పిల్లలు ఎద్దేవా చేశారు. ‘తెచ్చాను మేడం’ అంటూ లేచి వెళ్లి తన చేతిలోని కవర్ ప్రధానోపాధ్యాయుడికి అందించింది. తన ప్రధానోపాధ్యాయుడు రాజప్పగారు కవర్లో 1500 రూపాయలు ఉండటం చూసి ‘ఇంత డబ్బు ఎక్కడిది’? మీ అమ్మ నాన్నకు తెలిసే తెచ్చావా? అని అడిగారా ఆయన. ‘ఇది నేను దాచుకున్న డబ్బు సర్. మా అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చారు,’ అంటూ అప్పటికే బడి గేటు దగ్గర వేచి ఉన్న తన తల్లిదండ్రులను రమ్మంటూ సరిగా చేసింది. వీరేశం వాళ్ళ భార్య రంగమ్మ వచ్చారు. వారి చేతులు మీదుగా ఆ అమ్మాయికి డబ్బులు అందజేసింది. ఉపాధ్యాయులని, విద్యార్థులని ఉద్దేశించి ‘నన్ను పిసినారిగా గేలిచేసిన బాధపడలేదు. అనవసరమైన ఖర్చు చేయకుండా ఇంట్లో ప్యాకేట్ మనిగా ఇచ్చిన డబ్బులు పొదుపుగా ఖర్చు చేసి మిగిలినవి దాచుకున్న టీచర్ల మాటలు విని బయటి తినుబండారాలు కొనుక్కోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. ప్రార్థించే పెదవులు కన్నా, సాయం చేసే చేతులు మిన్న అంటూ టీచర్ చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆపదలో ఉన్న బాలికకు నా వంతుగా సాయం చేయడానికి నేను పొదుపు చేసుకున్న డబ్బు ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది అని చెప్పి ముగించింది. వ్యక్తిత్వాన్ని చూసి సంతోషించిన ప్రధానోపాధ్యాయుడు తన జేబులో ఉన్న పెన్నుని ఆమెకు బహుకరించాడు. ఆమె తల్లిదండ్రులని అభినందించాడు. ప్రవళికను గేలి చేసిన పిల్లలంతా మనసులో పశ్చాత్తాపపడ్డారు.
(జహీరాబాద్ పిల్లల కథలు పుస్తకము నుండి…)
