బతకడమో, గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది- కొండవీటి సత్యవతి

‘అడుగడుగునా తిరుగుబాటు’ గీతా రామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవడం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనసులో కదిలాయి. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.

తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె ఇబ్రహీంపట్నం మాదిగ వాడల్లో మాదిగ కుటుంబాలతో కలిసి బతికిన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. తిరుగుబాటు ఆమె రక్తంలోనే ఉన్నట్లుగా ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తల్లిదండ్రులతో పోరాటం, చివరికి తనకి మానసిక సమస్య ఉన్నట్లుగా భ్రమించి ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చేంత భయంకరమైన అనుభవం నుంచి తను కోలుకున్న విధానం ఒళ్ళు జలదరించేలా తను వివరించింది. సాధారణంగా ఆత్మకథల్లో కొన్ని అర్ధసత్యాలు, మరికొన్ని అబద్ధాలు ఉండడం సాధారణంగా చూస్తాం. కానీ, గీత తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని విశ్లేషించుకుంటూ ఎక్కడా వాటిపైన తెరలు వేయకుండా కుండబద్ధలు కొట్టినట్లు వివరించింది. అది తల్లిదండ్రుల గురించి అయినా, తన సొంత అక్క భర్త గురించైనా ఏమీ దాపరికం లేకుండా వివరించడం, ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి తీసుకురావడం చాలా ఆశ్చర్యకరం. చదువుకునే రోజుల్లోనే ఎంతో ధైర్యంతో ఆలోచించిన గీత తన తల్లి గురించి ఒకచోట చెప్తుంది. ‘‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, స్త్రీగా బ్రతకడం అంటే కష్టాల కొలుముల్లో ఉండటమేనని, ఆ కష్టాలను కొంతైనా తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని మా మనసుల్లో బాగా నాటుకుపోయేలా చేసిందామె. ఒక విధంగా అమ్మ నాకు మొట్టమొదటి ఫెమినిస్ట్‌’’ అని గీత ఒక సందర్భంలో అంటారు.
యుక్త వయసులో ఉన్నప్పుడే బహిష్టు గురించి సైన్స్‌ చెప్పే అంశాలను అర్థం చేసుకుంటూ ‘బహిష్టు అనేది బిడ్డ పుట్టుకతో ముడిపడిన ప్రకృతి సిద్ధమైన, సహజమైన జీవ ప్రక్రియ అని నేను పాఠ్యపుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. ఆహార పదార్థాలు కుళ్ళి పాడైపోతున్నాయి అంటే అది వాటిలో ఉండే సూక్ష్మక్రిముల వల్ల తప్ప బహిష్టు అయిన స్త్రీ ముట్టుకున్నందువల్ల కాదని అర్థం చేసుకున్నాను’ అంటూ బహిష్టు గురించి చాలా సైంటిఫిక్‌గా వివరించింది. 1971లో పాఠశాల చదువు ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు ‘ఇక నేను సాంప్రదాయక బ్రాహ్మణ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్ళడం తప్పదని, ఆ భారం మోయడం స్త్రీలకి మరీ కష్టమని అర్థమయిపోయింది. దాన్నుంచి బయట పడాలంటే స్వతంత్రంగా నేనొక వృత్తిని ఎంచుకోవటమే మార్గమనే నిర్ణయానికి వచ్చేశాను. ఇలాంటి ఆలోచనలతో హైస్కూల్‌ చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు నేను రెండు వాగ్దానాలు చేసుకున్నాను. ఒకటి జీవితంలో ఏ పురుషుడి ముందు సాగిల పడకూడదు. రెండు నాలోని సామర్ధ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు సకల శక్తులు ఒడ్డాలి. నాకు ఇక ఆకాశమే హద్దు’. ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆమె విశాల ప్రపంచంలోకి, యూనివర్సిటీ చదువులోకి అడుగు పెట్టింది. యూనివర్సిటీలో చదువుకున్నప్పటి అనుభవాలు, జార్జి రెడ్డి హత్య, 1974లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పాటు, వివిధ అంశాలపై చేసిన ఉద్యమాల గురించి ఎన్నో వివరాలున్నాయి. పీడీఎస్‌యూలో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాస్తూ, ‘‘మేం ప్రజా ఉద్యమాలలో భాగమయ్యాం. జనంతో మమేకమై, విస్తృత ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎవరికైనా అది గొప్ప విముక్తి భావననిస్తుంది. మన వైఖరులు మారతాయి. అభిప్రాయాల్లో స్పష్టత వస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఐక్యత చిగురిస్తుంది. ఇక ధైర్యం, స్థైర్యం అనూహ్యంగా పెరుగుతాయి. ఒక్కసారిగా మన సత్తా ఎంతటిదో, మన శక్తి సామర్ధ్యాలు ఏమిటో మనకు తెలిసి వస్తాయి’’ అంటారు.
ఆ తర్వాత పార్టీలో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాశారు. ఒకచోట పార్టీ ధోరణి గురించి రాస్తూ, ‘‘పార్టీ ధోరణి చూస్తే మనం కులాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు, కుల సమస్య పోయినట్లే అన్నట్లుగా ఉండేది. నాకూ, నాలాంటి మరెంతో మందికి 1985లో కారంచేడు ఊచకోత సంఘటన జరిగేవరకూ కూడా కులం అనేది పెద్ద సమస్యగా కనిపించలేదు. మా మనసుల నిండా వర్గం గురించిన ఆలోచనలే ఉండేవి. కారంచేడు ఘటన ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది.’’ తను పనిచేసిన పార్టీ మీద అనేక విమర్శలు చేయడం కనిపిస్తుంది, ‘‘పార్టీలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల గురించి ఆలోచన ఉండదు. వారి జీవితాల్లో విషాదాల గురించి పట్టించుకోరు’’.
1975 ఎమర్జెన్సీ అనుభవాలు, పార్టీని విడిచిపెట్టడం గురించిన వివరాలు రాస్తారు. అదే సంవత్సరం సిరిల్‌, తానూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, తల్లిదండ్రులు ఆమెని బలవంతంగా మద్రాస్‌ తీసుకెళ్ళిపోవడం, ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి తనకి దారుణంగా ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇప్పించడం గురించి రాసిన అనుభవం హృదయవిదారకంగా ఉంది. ఆ తర్వాత మోటార్‌ బైక్‌ మీద మద్రాస్‌ నుండి బెంగుళూరుకి, అక్కడి నుండి హైదరాబాద్‌కు తప్పించుకుని పారిపోయిన వైనం హమ్మో! గీతా అనిపించక మానదు.
ఎలక్ట్రిక్‌ షాక్‌ సంఘటన చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. గీత ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించలేకపోయాను. ఈ పుస్తకంలో ఆ సంఘటన చదివే వాళ్ళందరూ తప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటారని నేను అనుకున్నాను.
ఆ తర్వాత గీత పార్టీలో పనిచేసిన అనుభవాల గురించి చాలా క్రిటికల్‌గా రాయడం కనిపించింది. అడవుల్లో అజ్ఞాతంలో ఉండే మహిళల పట్ల, మహిళా కామ్రేడ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారో రాస్తూ ‘‘నిస్సందేహంగా విప్లవం అంటే విందు పార్టీ కాదు’’ అని తేల్చేసింది. తాను పార్టీకి ఎలా దూరమైందో రాస్తూ నాయకుల వ్యక్తిగత ప్రవర్తన పట్ల తనకు చాలా ఏవగింపు కలిగిందని రాసింది. ఒకచోట పార్టీ గురించి రాస్తూ ‘‘మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ ఎంఎల్‌ వర్గాల అవగాహన అంతా కూడా ప్రధానంగా మూడు సైద్ధాంతిక భావనల చుట్టూనే తిరుగుతుంటుంది… అర్థ భూస్వామ్యం (సెమీ ఫ్యూడలిజం), అర్థ వలసవాదం (సెమీ కలోనియలిజం) దళారి బూర్జువా వర్గం… దేశంలో నెలకొన్న అణచివేత పరిస్థితులను వివరించేందుకు తరచూ మహా పర్వతాలు వంటి ఈ మూడు భావనలనే ముందు పెడుతుంటారు. దశాబ్దాలుగా వల్లె వేస్తోన్న ఈ మూడు పడికట్టు పదాలను వినీ వినీ నాకు మహా చికాకు వచ్చేసింది.’’
ఆ తర్వాత 1976లో హైదరాబాద్‌ వదిలిపెట్టి చండీగఢ్‌ వెళ్ళిపోయిన అనుభవాల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా రాసింది. ఘజియాబాద్‌లో బాల్మీకి అనే కమ్యూనిటీతో పనిచేసిన అనుభవాలను, వారి ప్రేమానుభావాల గురించి రాస్తూ ‘‘ఆ రోజుల్లో ఒకటి, రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లో
ఉన్న రైలు పట్టాల వరకు వెళ్ళాను కూడా. ఆత్మహత్య చేసుకుంటావా, అయితే చేసుకో అన్న సిరిల్‌ మాటలే నన్ను వెనక్కి లాగాయి. ఆ మాటలు వింటుంటే ఉక్రోషం పొంగుకొచ్చేది. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించనందుకు తనమీద విపరీతమైన కోపం వచ్చేది. కనీసం సానుభూతిగా ఒక్క మాటయినా అనొచ్చుగా అని ఉడికిపోతూ వెంటనే తిరిగి వచ్చేసేదాన్ని. ‘‘నచ్చినా, నచ్చకపోయినా ఇది జీవితం. ఎదుర్కో…’’ అన్నట్లు
ఉండేవి తన మాటలు’’. తాను పనిచేసిన బాల్మీకీలే తనను కాపాడారని, తాను పూర్తిగా కుప్పకూలిపోకుండా వారే కాపాడారని ఎంతో ఆర్తితో చెబుతుంది ఒకచోట.
ఎప్పుడెప్పుడు హైదరాబాద్‌ వెళ్ళిపోదామా అని తనకు అనిపిస్తూ ఉండేదని, ఎట్టకేలకు 1980లో హైదరాబాద్‌కు తిరిగి రాగలిగామని, అలా రావడం వెనుక తనని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్‌ సిన్హా అని, ఆయన సిరిల్‌కి, జార్జిరెడ్డికి సన్నిహిత మిత్రుడని రాస్తుంది ఒకచోట.
1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం తనలో పేరుకుంటున్న డిప్రెషన్‌కు మంచి ఔషధంగా పనిచేసిందని, ఎంతో ఉత్సాహంతో ఆ పనుల్లో మునిగిపోయానని చెబుతుంది. మెల్లగా హెచ్‌బిటి పనుల్లో మునిగిపోయి తను రాష్ట్రమంతా తిరిగిన అనుభవాల గురించి కూడా రాస్తుంది. హెచ్‌బిటి క్రమంగా ప్రాచుర్యం పొంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రచురించిందని, 1982 తనకి గొప్ప అనుభూతులను ఇచ్చిన సంవత్సరమని అంటుంది. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌లో పనిచేయడం మొదలుపెట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్న తన చిరకాల వాంఛ తిరిగి తలెత్తింది.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పనుల మీద ఆంధ్ర రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు కత్తి పద్మారావు లాంటి వ్యక్తులను కలుసుకున్నానని, అలాగే బొజ్జా తారకం గారిని కలుసుకున్నానని రాస్తూ హక్కుల యోధుడు, అంబేద్కరిస్ట్‌, ప్రముఖ కవి, రచయిత, సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం గారి రచనలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రతి గ్రామానికి చేరాయని, ఆయన మాటలు రెండు రాష్ట్రాల్లోని దళిత కుటుంబాలను తాకాయని, చిక్కడపల్లిలో ఉండే తన ఇంటికి బొజ్జా తారకం ఇల్లు చాలా దగ్గరని, తరచూ వారి ఇంటికి వెళ్ళేదాన్నని చెబుతూ ఆ సమయంలో విజయభారతి తనను అక్కున చేర్చుకున్నారని, తనకు మరొక కుటుంబంలా మారిపోయారని వారిరువురి గురించి చాలా ఆత్మీయంగా రాస్తుంది.
ఆ తర్వాత ‘సవాలక్ష సందేహాలు’ పుస్తకం పనిమీద ఇబ్రహీంపట్నం వెళ్ళడంతో తన జీవితంలో అత్యంత కీలకమైన మార్పు చోటుచేసుకుందని రాస్తూ, ఇక అక్కడి నుండి పుస్తకం మొత్తం ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించిన భూ పోరాటాల చరిత్రను చాలా వివరంగా, సుదీర్ఘంగా రికార్డు చేసింది. మొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు తన వయస్సు 30 సంవత్సరాలు.
ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా జబ్బార్గూడెం, పులిమామిడి లాంటి గ్రామాల్లో జరిగిన భూ పోరాటాల గురించి, ఇబ్రహీంపట్నం భూ పోరాటాలు, ఉద్యమాలు, రెడ్డి భూస్వాముల ఆగడాలు, వారి క్రూరత్వం, గ్రామీణ ప్రజల పట్ల వారి దౌర్జన్యాలు చదువుతున్నప్పుడు గుండె మండిపోతుంది. ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమాలు, అందులో గీతా రామస్వామి పోషించిన ముఖ్యమైన పాత్ర నిజానికి అందరూ చదవాల్సి ఉంది. సైకిల్‌ మీద తిరుగుతూ ఎంతో ధైర్యంగా గ్రామాల్లోకి వెళుతూ గ్రామస్తులకు, వారు చేస్తోన్న భూ పోరాటాలకు అండగా నిలిచిన గీత అనుభవాలను చదివి తీరాల్సిందే. ఈ పోరాటాల సమయంలో తనమీద జరిగిన హత్యా ప్రయత్నాలు, దాన్నుండి తాను ఎట్లా బయటపడిరది… ఇవన్నీ కూడా ఎవరికి వారు చదివి అర్ధం చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీత ఇబ్రహీంపట్నంలో అత్యంత వెనుకబడిన గ్రామాల్లో మాదిగ వాడల్లో వారితో పాటే బతుకుతూ ఆ తిండే తింటూ సాగించిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఈనాటి తరానికి దారి దీపాలుగా అనిపించక మానవు. కోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటాలు, ఆయా సందర్భాల్లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, భౌతిక దాడులు… వీటన్నింటినీ చదువుతున్నప్పుడు గుండెలవిసిపోయాయి.
గీత ఒకచోట ఇలా రాస్తుంది, ‘‘అట్టడుగు కులాల వారు మనమీద ఎందుకంత ఆగ్రహంతో ఉంటారని, మనలోని ఆధిపత్య కులాల వాళ్ళు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ, మన పూర్వీకులు అట్టడుగు కులాల వారి పట్ల ఎలా ప్రవర్తించేవారో, అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారిచేత ఎంత దారుణంగా పనిచేయించుకునేవారో, ఎలా వెట్టిచాకిరీ చేయించుకునేవారో, వాళ్ళ పొలాలను ఎలా ఆక్రమించుకునేవారో, వారి పంటలను ఎలా దోచుకునేవారో, వారి స్త్రీలపై ఎలా అత్యాచారాలకు పాల్పడేవారో, వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురిచేసేవారో, వారి పిల్లల్ని పశువుల కాపరులుగా ఎలా మార్చేసేవాళ్ళో, ఐక్యం కాకుండా ఎలాంటి రాజకీయాలు ప్రయోగించేవారో అట్టడుగు కులాల వారు ఎలా మర్చిపోగలుగుతారు’’ అంటుంది.
ఇంకొక చోట ‘‘ఈనాటి తెలంగాణ ప్రాంత రెడ్లు, వెలమల సిరిసంపదలకు, ఆనాటి వారి పూర్వీకులు చేసిన దోపిడీకి మధ్య చాలావరకు అవినాభావ సంబంధం ఉంది. అయితే, తాత ముత్తాతలు ఎప్పుడో చేసిన పాపాలకు ఈనాడు వారి పిల్లలను నిందించడం సబబేనా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు.’’ ఇక్కడ నేనొక అంశం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య దళిత స్త్రీ శక్తి అనే సంస్థ ఒక పబ్లిక్‌ హియరింగ్‌ని ఆర్గనైజ్‌ చేసింది. అందులో బాధితులంతా రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోని దళిత స్త్రీలు, పురుషులు. ఆయా గ్రామాల్లోని రెడ్లు వారిపట్ల చేసిన దారుణాల గురించి, అత్యాచారాల గురించి, వారి భూములను ఆక్రమించుకోవడం గురించి ఆనాటి పబ్లిక్‌ హియరింగ్‌లో చాలా వివరంగా చెప్పారు. తెలంగాణ ప్రాంత భూస్వాముల రక్తచరిత్ర ఇంకా కొనసాగుతూ ఉండడం ఈ పబ్లిక్‌ హియరింగ్‌లో స్పష్టంగా కనబడిరది. దోపిడీ రూపం మారి ఉండొచ్చు కానీ ఇప్పటికీ గ్రామాల్లో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గ్రామాల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండడం వాస్తవం. ‘‘అడుగడుగునా తిరుగుబాటు’’ పుస్తకంలో గీత దాదాపు 200 పైన పేజీలు ఇబ్రహీంపట్నం భూ పోరాటాల గురించి, ఒక్కొక్క పోరాటం గురించి, ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల గురించి, ముఖ్యంగా మహిళల గురించి రాసిన విషయాలన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మాదిగ మహిళల జీవన విధానాలు, వారి పోరాటాలు కచ్చితంగా అందరం చదవాల్సిందే. ఇబ్రహీంపట్నం భూపోరాటాల సమయంలో గీత మీద జరిగిన రెండు హత్యా ప్రయత్నాలు చదువుతున్నప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించడంతో పాటు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఏమి ఆ పోరాట స్ఫూర్తి, ఏమి ఆ ధైర్యం అనిపించక మానదు. పుస్తకంలో మనసు చివుక్కుమనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుల దండ వేయడం, గాజులు తొడగడం ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే కొంతమంది తెలిసిన మిత్రులు గీత ఇంటిమీద దాడి చేసిన సంఘటన కూడా చదవడానికి చాలా కష్టంగా అనిపించింది.
చాలా ధైర్యంగా, ఎలాంటి దాపరికం లేకుండా తన కుటుంబ విషయాలతో పాటు తన మిత్రులు చేసిన అవమానకర చర్యలను రాయగలగడం నిజానికి చాలా కష్టమైన పని. అయినప్పటికీ గీత దేనినీ దాచుకోకుండా అన్నింటినీ రాయగలిగింది. ఈ పుస్తకంలో ఎంతోమంది పరిచయమున్న వ్యక్తులు తారసపడతారు. కొన్నిచోట్ల వాళ్ళ వ్యక్తిత్వాల గురించి చదివి చాలా ఆశ్చర్యపడ్డాను. పుస్తకం చదివి చివరి పేజీల్లోకి వచ్చినప్పుడు పోరాటాల్లోనూ, ఉద్యమాల్లోనూ జీవితాన్ని గడిపిన గీత తనకంటూ ఓ పాప కావాలి అనుకోవడం, ఆ సంఘటన గురించి రాయడం చాలా హృద్యంగా అనిపించింది. తనకంటూ ఓ బిడ్డ కావాలనుకుని బిడ్డను కన్నది. బిడ్డను పెంచుకోవడంలో మునిగిపోయి ఇబ్రహీంపట్నం పోరాటాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది. అయితే తన బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేస్తారనే భయం వల్ల కూడా ఆ తర్వాత తను ఇబ్రహీంపట్నం వెళ్ళలేకపోయింది.
ఈ పుస్తకం చదివి దీనిమీద చాలా వివరమైన సమీక్ష రాయాలనుకున్నాను. నా సన్నిహిత మిత్రురాలు చేసిన గొప్ప పోరాటాలు, ఒక్కొక్క పోరాటం గురించి చదువుతున్నప్పుడు గొప్ప విభ్రమకు గురయ్యాను. మనతోనే ఉన్న గీతా రామస్వామి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న విషయం ఈ పుస్తకం చదవకపోతే సూచనప్రాయంగా కూడా తెలిసేది కాదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. తన జీవితంలోని ఒక్కొక్క దశ, ఆ దశలో ఎదుర్కొన్న ఘర్షణలు, పోరాటాలు అన్నీ చదువుతున్నప్పుడు ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమవుతుందని, స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను.
నాకు గీతంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే, తెలుగు తప్ప వేరే భాషలేమీ తెలియకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చిన నాలాంటి వాళ్ళకు గొప్ప గొప్ప పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌. ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేయించి, అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, దాన్ని నిర్వహిస్తున్న గీత రామస్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఇంగ్లీషులో ఉన్న గొప్ప పుస్తకాలను చదవలేని నాలాంటివాళ్ళం ఈ బుక్స్‌ చదువుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, జీవితాన్ని ఎంతో విస్తరించుకున్నాం. అందుకే గీత మీద నాకు ప్రత్యేకమైన ఆత్మీయత. ఈ పుస్తకం పూర్తి చేసిన వెంటనే ఇబ్రహీంపట్నం వెళ్ళాలని, తను పేర్కొన్న ఆయా గ్రామాలను కొన్నింటినైనా చూసి రావాలని చాలా బలంగా అనిపించింది. నేనెప్పుడూ రాచకొండ గుట్టలకు ఇబ్రహీంపట్నం మీదుగానే వెళ్తూ ఉంటాను. గీత పేర్కొన్న గ్రామాల్లో చాలా గ్రామాలు ఆ దారిలో ఉన్నాయి. తను పోరాటాలు చేసిన ఆ గ్రామాలను ఒకసారి చూడాలని, ఆ పోరాటాల్లో మిగిలిన, జీవించి ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని అనిపించింది. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే, చాలా తరచుగా నేను రాచకొండ గుట్టలవైపు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎన్నో సంవత్సరాల పాటు ఆయా గ్రామాల్లో గీత నిర్వహించిన భూ పోరాటాలు, వాటికి వేదికలైన ఆ గ్రామాలు చూడడం ఒక గొప్ప అనుభవమవుతుందని నాకనిపిస్తోంది.
ఇంకా ఎంతో రాయాలని, చెప్పాలని అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే వ్యాసం చాలా చాలా పెరిగిపోయింది. అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను రికమెండ్‌ చేస్తున్నా. ఇంగ్లీష్‌ నుండి తెలుగులోకి అనువాదం చేసిన ప్రభాకర్‌ మందార గారి అనువాదం చాలా తేటగా, ఒరిజినల్‌ లాగా ఉంది. అభినందనలు ప్రభాకర్‌ గారూ. గీత లవ్‌ యూ… ఇంత మంచి పుస్తకాన్ని మనసు విప్పి రాసిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు నా స్నేహితురాలు అయినందుకు గర్వంగా కూడా ఉంది. థాంక్యూ సో మచ్‌.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.