సావిత్రిబాయి ఫూలే అనే ఈ మహా గ్రంథాన్ని ఐదు సంవత్సరాలుగా పరిశోధించి మహాకవి అభినవ అంబేడ్కర్ డా॥కత్తి పద్మారావు గారు వ్రాశారు. ఈ గ్రంథం వ్రాయడానికి సంబంధించిన దృక్పథాన్ని వారు వ్రాసిన పీఠికలో ఇలా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భారతదేశ సాంస్కృతిక విప్లవ పోరాట స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే. స్త్రీ విముక్తి ప్రధాత, మానవాభ్యుదయ వికాస జీవన వ్యవస్థల పునర్ నిర్మాణకర్త.
భారతదేశంలోని చారిత్రక మలుపులో నిలబడి జీవన జ్యోతులను వెలిగించిన మానవతా మూర్తి సావిత్రిబాయి ఫూలే అని అభివర్ణించారు. సావిత్రిబాయి ఫూలే జీవిత గాధ ఒక జీవన దృశ్యం. అందుకే ఈ పుస్తకం ప్రారంభంలోనే ఇలా విశ్లేషించారు. సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతిదీపం. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన స్త్రీమూర్తి ఆమె. ఎవరైతే చరిత్రను మలుపు తిప్పుతారో వారికే యుగ కర్తృత్వం వుంటుంది. చరిత్రతో నడిచేవాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేవరు. చరిత్రను మార్చాలి అంటే త్యాగాలు కావాలి. త్యాగం అనేది ఒక ఆరిపోని దీపం. ఆమె చరిత్రను మార్చింది. అందుకే తిరిగి లేచింది. ఈ రోజుకి సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో వెలుగొందుతుంది అంటే ఆమె త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నీతి, విజ్ఞానం, విలువలు సావిత్రిబాయి ఫూలేకే సొంతం. ఈ దృక్పధంతో ఈ బృహత్తర గ్రంథాన్ని డా॥కత్తి పద్మారావు గారు ఎంతో పరిశోధనాత్మక సామాజిక, సాంస్కృతిక స్ఫూర్తితో వ్రాశారు. డా॥కత్తి పద్మారావు గారు రాసిన 92వ గ్రంథం ఇది. ఆయన ప్రతి గ్రంథం దళితుల, స్త్రీల, బహుజనుల విముక్తి మార్గాలను నిర్దేశిస్తుంది. ఆయన ఈ గ్రంథాన్ని ఎన్నో శీర్షికలు, ఉప శీర్షికలతో వ్రాశారు. సావిత్రిబాయి ఫూలే తిరుగుబాటు, హిందూ యాగాలు ` సంపద ధ్వంసం, సావిత్రిబాయి విప్లవకారిణి, సావిత్రిబాయి ఫూలేకి నేపథ్య ఉద్యమాలు, జ్యోతిరావు ఫూలే విప్లవ మార్గం, పోరాట వీరులు ఫూలే దంపతులు, వివేకవంతులు ఆ దంపతులు, ఫూలే దంపతుల పోరాట పటిమ, ఫూలే దంపతులపై సంత్ రవిదాస్ ప్రభావం, సావిత్రిబాయి మేధో సంపత్తి, జ్యోతిరావు ఆలోచనాపరుడు, ఫూలే, సావిత్రిబాయిల ప్రభావం, ఆనాటి శూద్ర, అతిశూద్ర కార్మికోద్యమం, సావిత్రిబాయి ఫూలే పోరాట కథ, సావిత్రిబాయి ఫూలే విద్యా విప్లవం, హిందూ పునరుద్ధరణ వాదం, పుక్కిటి పురాణాలు చీల్చిన ఫూలే వాదం, మహారాష్ట్రలో శూద్ర విప్లవం, శూద్ర, అతిశూద్ర రాజ్య వ్యవస్థల వాదం, జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే పోరాట దృక్పథం, భాషలు అందరి సొత్తు, బ్రాహ్మణులు దోపిడీ దారులు, శూద్రుల శాస్త్రదాస్యం, సావిత్రిబాయి ఫూలే వెనక బుద్ధుడు, పుక్కిట పురాణ కథలను ఛేదించిన సావిత్రివాదం, సావిత్రితో ఫాతిమా షేక్, మనుస్మృతిని ఛేదించిన ఫూలే దంపతులు, ఫూలే సాహిత్య విప్లవం, సావిత్రిబాయి ఫూలే సాంస్కృతిక విప్లవం. ఈ పుస్తకాన్ని వ్రాయడం కోసం సుమారు వందకు పైగా పుస్తకాలు పరిశోధించాను. పొన్నూరు లుంబినీ వనంలోనే అంబేడ్కర్ రిసెర్చ్ సెంటర్ను డా॥కత్తి పద్మారావు గారు నెలకొల్పారు. అది ఆయన స్వీయ గ్రంథాలయం. అందులో సుమారుగా 50 వేల పుస్తకాలు పైగా వున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గృహ గ్రంథాలయాలలో అత్యంత పెద్దదైన గృహ గ్రంథాలయం ఇదేనని చెప్పవచ్చు. ఎక్కడా లభించని ఎన్నో ప్రాచీన గ్రంథాలు సైతం ఇక్కడ లభిస్తాయి. పద్మారావు గారు ఆ గ్రంథాలయంలోనే గడుపుతూ నిరంతరం అధ్యయనంలో ఉంటారు. భారతదేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగాను ఎందరో పరిశోధకులు ఈ గ్రంథాలయాన్ని తమ పరిశోధనకు ఉపయుక్తం చేసుకుంటున్నారు. వారు ఈ పరిశోధనకు ఉపయోగించిన ముఖ్యమైన గ్రంథాలు 1) Chatrapathi Shahu, 2) Jyothirao Phooley Birth and Background-Dhanujay Keer, 3) రామ మోహనరాయ్ నుండి ఎం.ఎన్.రాయ్ వరకు `ఎన్ ఇన్నయ్య, ఎం.ఏ.ఫిరోజ్ షా మెహతా, 4) Mahatma Jyothi Rao Phooley – Dhanujay Keer, 5) Mahatma Jyothi Rao Phooley Chapter III, The Banner of Revotunfurled- Dhanujay Keer, 6) Post – Hindu India, The Barbers Skill System, Kanche Ilaiah, 7) దళిత మహర్షి సంత్ రవిదాస్ భక్తి కవితోద్యమం, 8) వస్తు గుణ దీపిక, 9) Remedies against Descrimination & Inequalities Ambedkar in Retrospect Essays on Economic Politics & Society – Sukhadeo Thorat Aryama 10) ఆధునిక భారతదేశ చరిత్ర, బిపిన్ చంద్ర. ఈ పేర్కొన్న గ్రంథాలన్ని క్షుణ్ణంగా చదివి మహాత్మా ఫూలే గ్రంథాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఈ గ్రంథం డా॥కత్తి పద్మారావు గారు వ్రాశారు. నిజానికి సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మరో స్వాతంత్ర పోరాటానికి పతాకాలు ఎత్తింది అని ఈ గ్రంథంలో పేర్కొన్నారు.
సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్ధలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతిదీపం. భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన స్త్రీమూర్తి. ఎవరైతే చరిత్రను ములుపుతిప్పుతారో వారికే యుగ కర్తృత్వం వుంటుంది. చరిత్రతో నడిచే వాళ్లు మరణించిన తర్వాత తిరిగి లేవరు. చరిత్రను మార్చాలి అంటే త్యాగాలు కావాలి. త్యాగం అనేది ఒక ఆరిపోని దీపం. ఈ రోజుకి సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో వెలుగొందుతుంది అంటే త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నీతి, విజ్ఞానం, విలువలు సావిత్రిబాయి ఫూలేకే సొంతం అని గట్టిగా ఉద్ఘాటించారు.
నిజానికి భారతదేశంలో స్త్రీలు అణచివేతకు గురై విద్యాగంధం లేక బ్రాహ్మణాధిపత్య భావజాలంలో మగ్గిపోతున్నప్పుడు స్త్రీ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసి, ఆమెను వ్యభిచారిగా చిత్రించి, ఆమె మనసు ‘తోడేలు మనసు’ అని వ్యాఖ్యానించి, ఆమెకు స్వేచ్ఛ ఇస్తే పురుష సంపర్కానికి తెగబడిరదని ప్రకటనలు చేసి, స్త్రీని వంటింటి కుందేలుగా మార్చిన సందర్భంలో సావిత్రిబాయి ఫూలే సూర్య ప్రభాసమానమై స్త్రీ విముక్తి ఉద్యమానికి నడుం కట్టింది. ఈ పుస్తకానికి ప్రొఫెసర్ కె.యస్.చలం గారు పీఠికలో ఇలా విశ్లేషించారు.
డా॥కత్తి పద్మారావు గారు రచించిన సావిత్రిబాయి ఫూలే పుస్తకంకు ముందుమాట అవకాశం యిచ్చిన సోదరునికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. తెలుగు ప్రజలకు జ్యోతిబా ఫూలేని పరిచయం చేయటం కోసం వై రామయ్య గారి ద్వారా గులాంగిరిని, 1993లో అనువాదం చేయించాను. దానికి ముందు 1989లో ఫూనే విశ్వవిద్యాలయంలో సీప్ కాలేజీలో ఉపన్యాసం కోసం నన్ను ఆహ్వానించినపుడు అక్కడ పనిచేస్తున్న మిత్రుడు డా॥గోపాల్ గురుతో కలిసి కొత్తరోడ్లో వున్న మహాత్మాఫూలే గడికి వెళ్ళటం, దళితుల కోసం ఫూలే తవ్వించిన నుయ్యి ఆ పరిసరాలు చూడటం జరిగింది. అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఫూలే సమగ్ర సాహిత్యాన్ని కొని తెచ్చాను. గతంలో కీర్ రాసిన ఫూలే జీవిత చరిత్ర కంటే సమగ్ర సాహిత్యం, గులాంగిరి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే మహాత్మా ఫూలే గూర్చి తెలిసినంతగా ఆయన భార్య సావిత్రి బాయి ఫూలే గూర్చి తెలుగు వారికి ఇటీవల వరకు తెలియదు. ఈ మధ్య కొందరు సావిత్రి బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. అయితే పద్మారావు గారి ఈ పుస్తకం చాలా విశ్లేషణాత్మకంగా, సావిత్రి బాయి ఫూలే ఉద్యమ చారిత్రక నేపధ్యం సవివరంగా ఇందులో చెప్పారు. మొత్తం 29 అధ్యాయాలున్న ఈ పుస్తకంలో పద్మారావు గారు ఆ నాలుగు గ్రంథాల్లో వివరించినట్లే సంస్కృతం, ఇంగ్లీషు రచనల నుండి వివరాలు సేకరించి ఫూలే దంపతుల ఉద్యమ నేపథ్యానికి కావలసిన తాత్విక భూమిక, నాటి బ్రాహ్మణ సమాజం ఆగడాలు, పూనాలో పీష్వాల భయంకర వర్ణ పీడన గురించి వివరించారు. అందుకే ఈ పుస్తకంలో సావిత్రిబాయి ఫూలే జీవితం, ఉద్యమం కంటే నాటి చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక అంశాలకు ఎక్కువ పేజీలు కేటాయించారు. అందరూ చదవవలసిన గ్రంథం. అందరూ చదవవలసిన గ్రంథం ఇదని ప్రొఫెసర్ చలంగారు తమ పీఠికలో వ్రాసారు. ఈ గ్రంథాన్ని సావిత్రిబాయి ఫూలే మార్గంలో నడిచిన శ్రీమతి కట్టా నాగేశ్వరి గారికి, క్రీ.శే.మండే మాధవి లత గారికి, క్రీ.శే.నేతల భారతి గారికి అంకితం చేశారు. కట్టా నాగేశ్వరి అక్క గారి గురించి చెప్తూ నాకు తల్లి సమానురాలు. ప్రేమ సముద్రం మరో సావిత్రి బాయి ఫూలే, గొప్ప తల్లి, గొప్ప అక్క, గొప్ప సహచరిణి… విద్యావతి, సహాయ నిధి.. ఆత్మీయ దుర్గం, జీవన జ్యోతి.. నాకు నిరంతరం జీవం, మా అక్క (మా పెద్దమ్మ కూతురు) అని కొనియాడారు. మండే మాధవిలత గారి గురించి చెప్తూ ఆత్మీయ సోదరి, ప్రేమ మూర్తి, విద్యా నిధి, గొప్ప తల్లి, గొప్ప సహచరిణి అని విశ్లేషించారు. నేతల భారతిగారి గురించి చెప్తూ దళిత తల్లి.. గొప్ప విద్యావతి, అత్యున్నతమైన మాతృమూర్తి, గొప్ప ఉపాధ్యాయురాలు, గొప్ప క్రైస్తవురాలు అని శ్లాఘించారు. ఈ ముగ్గురికి అంకితం ఇవ్వడం ఒక చారిత్రక అంశంగా భావిస్తున్నాను.
మార్చి 8, 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పొన్నూరు లుంబినీ వనంలో ‘సావిత్రిబాయి ఫూలే గ్రంథం ఆవిష్కరించబడిరది. డాక్టర్ కత్తి పద్మారావు గారి 92వ గ్రంధం ఇది. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదివి దళితవాద
ఉద్యమం, స్త్రీవాద ఉద్యమానికి కరదీపికగా చేసుకుంటారని ఆశిస్తున్నాను.