గౌరవనీయురాలైన స్త్రీవాద పత్రిక భూమిక ఎడిటర్ గారికి అభినందనలు
మేడం..
స్త్రీవాద పత్రిక భూమికను కొన్ని దశాబ్దాలుగా ఎంతో అంకిత భావంతో పరిశోధనాత్మకంగా స్త్రీవాద భావన చైతన్యంతో ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా పత్రికను నడుపుతున్నందుకు అభినందనలు.
2025 మే సంచికలో నా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే సుదీర్ఘమైన కవితను ప్రచురించి అంబేద్కర్కు ఘనమైన నివాళి అర్పించినందుకు అభినందనలు. ఈ సంచికలోని మీ సంపాదకీయంతో మీరు మహిళల శ్రమ అదృశ్యీకరణ అని వ్యాసంలో ఇంటి పని కార్మికులు, రైతు కూలీ కార్మికులు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకార పారిశుద్ధ్య లాంటి అనేకానేక రంగాల్లో, వృత్తుల్లో లక్షలాదిగా పనిచేస్తున్న వారి శ్రమకి ఎలాంటి గుర్తింపు లేకపోవడం గురించి వక్తలందరూ చాలా ఆర్తిగా, ఆర్ద్రంగా మాట్లాడారు. ఒక్కొక్క రంగంలో మహిళల భాగస్వామ్యం ఎంత ఉంటుందో, వారు పాల్గొనకపోతే ఏమవుతుందో వివరంగా ఒక్కో రంగం గురించి చెప్పారు. ఈ విశ్లేషణలో వచ్చిన శీర్షిక అంతా కూడా హృదయాన్ని తట్టి లేపేదిగా ఉంది. నిజానికి ఈ సంచికలోనే గీత గారి జీవిత చరిత్ర ఆమె ఉద్యమ నేపథ్యాన్ని కళ్ళకు కట్టి చూపిస్తుంది. చల్లా సరోజినీదేవి ఈనాటి బంధం ఏనాటిదోనని కథ కదిలించింది ముఖ్యంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా బ్రిటిష్ ఆంధ్రలో వితంతువుల దుస్థితి ప్రొఫెసర్ మామిడిపూడి వెంకటరంగయ్య మాటల్లో వ్యాసం చాలా మేధోపరంగా ఉంది. నిజానికి నేను వ్రాసిన సావిత్రిబాయి పూలే మహాగ్రంధం అని పేరుతో దళిత శ్రీ శ్రీ గడ్డం విజయ రావు గారు ఇలా పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే భారత దేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన స్త్రీ మూర్తి. ఎవరైతే చరిత్రను మలుపు తిప్పుతారో వారికే యుగకర్తృత్వ ఉంటుంది. చరిత్రలో నడిచే వాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేవరు. చరిత్రను మార్చాలి అంటే త్యాగాలు కావాలి. త్యాగం అనేది ఒక ఆరిపోని దీపం. ఈ రోజుకి సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో వెలుగొందుతుంది అంటే త్యాగం, కృషి, పట్టుదల నిజాయితీ, నీతి, విజ్ఞానం, విలువలు సావిత్రిబాయి ఫూలేకే సొంతం అని గట్టిగా ఉద్ధాటించారు అనడం ఉత్తేజాన్ని కలిగించింది. నిజానికి మీ సంపాదకీయంలో విజ్ఞాన సర్వస్వ దృష్టి ఉంది.
భూమిక ఒక మేలుకొలుపు..
భూమిక ఒక సజీవ స్రవంతి..
భూమిక వాద ఆత్మ గౌరవ ప్రతీక..
అభినందనలతో… ` డాక్టర్ కత్తి పద్మారావు