– జూపాక సుభద్ర

 తెలంగాణ ప్రకటన (30-07-13) తర్వాత మూడు రోజులు సీమాంద్ర ఉద్యోగుల నిరసన సెక్రెటేరియట్‌ లో ‘మేము తెలంగాణకు అనుకూలమే కాని మా పిల్లల భవిష్యతేంటి తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్‌లో మా హక్కుల రక్షణ కోసం రేపటి తెలంగాణలో ఎలా వుండాలి అనేది మా డిమాండ్‌’ అని చెప్పారు.

తెలంగాణ ప్రకటన తర్వాత నాలుగో రోజు నుంచి సెక్రెటేరియట్‌లో సీమాంధ్రుల గొంతు మారింది. ‘వాళ్ళిష్ట మున్నట్లు యిచ్చేయడమేంటి ఎవుర్నడిగి యిచ్చారు? తెలంగాణ ఇస్తే మా బతుకు బస్టాండే, ఉద్యోగాలు, వుపాధులు, సర్వ నాశనమే మేము, తాగనీకి నీటి చుక్కండదు మాకు, ఫ్యూచర్‌లేదు, కంటిమీద కునుకులేదు, మేము కట్టుకున్న యిండ్లు వాకిళ్ళేంగావాలి, అందరు కల్సివుందా మంటున్నము తప్పా! రాష్ట్రాన్ని, తెలుగును ముక్కలు కానివ్వం, సమైక్యక్యాంధ్ర కావాలి, హైద్రాబాద్‌ అందరిది. అందరిదీ అని కొన్ని సార్లు మాదే అని యింకొన్ని సార్లు సెక్రెటేరియట్‌ మాదే’ అనే అప్రజాస్వామిక పోటీ నిరసనలు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్నారు. రోజు సంతకాలు పెట్టి డూటి చేయక సెక్రెటేరియట్‌లో నిరసనలు, నినాదాలు, బైటాయింపులు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తే సీమాంధ్ర మీడియా వారిని యింకా పూనకం వచ్చేట్టుగా ఉసిగొలిపి వారి ప్రయోజనాల కోసం అదే సీమాంధ్రంతా వున్నదని సీమాంధ్ర జిల్లాల్ని కూడా కలుషితం చేస్తుంది.

తెలంగాణ ఉద్యోగులు ఒకే ప్రాంగణంలో తమ సాటి సీమాంధ్ర ఉద్యోగులు ఎంతరెచ్చ గొట్టినా, నేరస్థులుగా చూసినా తుడుచుకు పోతూ ‘ మీ హక్కులకు భంగం కలిగితే మేము అండగా వుంటామని, భరోసా యిచ్చే మద్ధతు తెలుపుతున్నా సీమాంధ్ర ఉద్యోగులు దురుసుగా ఉరిముతుండడం చూస్తున్నాము. రాష్ట్రాలు యిదివరకు పంజాబ్‌, మహారాష్ట్ర. ఈ మధ్య చత్తిస్‌ఘడ్‌, జార్ఘండ్‌, ఉత్తరాఖండ్‌ ర్ఱాష్టాలు విడిపోయినపుడు ఉద్యోగులకు నష్టం జరిగిన దాఖలాల్వేవు. రాష్ట్రాలు రాజ్యాంగ బద్దంగానే విడిపోయే ప్రాసెస్‌ వుంటది. నీళ్ళు రావనేది సీమాంద్ర రాజకీయ నాయకులాడే ఆట నీళ్లకోసం జలమండలి, బచావత్‌ కమిటీలున్నాయి.యీవన్ని వైట్‌కాలర్‌ వాయిస్‌లకు తెలవకనా! సీమాంధ్ర నాయకులు ముందునుంచీ సీమాంధ్ర ప్రజల్ని అట్లా బెదిరింపు ప్రలోబాలకు గురిచేసిండ్రు. మానసికంగా వారిని సిద్దం చేయని తప్పిదము వారిదే. యిప్పుడు వారిని అనేక భయాలకులోను చేసి (నీళ్లు, ఉద్యోగాలుండవు) వారిని పోటీ ఉద్యమంగా రోడ్లెక్కిస్తుండ్రు సీమాంధ్ర జిల్లాల్లో, హైద్రాబాద్‌లో ఒకటి, అరాతో మొదలు బెట్టి వాటిని మీడియాతో రెట్టించే ప్రయత్నం సాగుతుంది.

1952 నుంచి సీమాంధ్రులు మూడు జనరేషండ్లుగా హైద్రాబాద్‌లో ఉద్యోగాలు పొంది జీవితాల్ని చక్కబర్చుకొని యిప్పుడు తెలంగాణ ప్రకటనని క్రూరంగా అవహేళన చేస్తూ, అపహస్యం చేస్తూ సమైక్యంధ్ర అని పోటీ ఉద్యమాలు లేవదీయడం దౌర్జన్యం, దుర్మార్గం.

నిజానికి 60 సం||ల నుంచి సీమాంధ్రులు మాతో కల్పివుండి, మా అస్తిత్వ పోరాటాలు, మా రాష్ట్రం మాగ్గావాలనే పోరాటాలు బలిదానాలు చూసి కూడా కనీసం మానవీయ సంబంధాల విలువల్ని కనబరచకపోగా తెలంగాణ ప్రకటనని గౌరవించకపోగా, ఆహ్వానించక పోగా మా ఆకాంక్ష సాకారమయ్యే దానిని అడ్డుపడే ఆందోళనను చేస్తున్నారంటే ఏమనాలి? కలిసున్నందుకు ఏర్పాటైన బంధాలు, అనుబంధాలు ప్రజల మధ్య ఏమి మిగులున్నాయనుకోవాలి? అంతా పరాయీకరణే, పాయిదేర్లతనమే.

మాతో కలిసిమెలిసి యీ 60 ఏండ్లున్నా పరాయి మనుషులుగా మమ్మల్ని చూసి మా భూములు, ఉద్యోగాలు, వనరులు, భాష చరిత్ర నాగరికతల మీద పెత్తనాలు ఆక్రమణలు చేసీ మమ్మల్ని తొక్కేసినందు వల్లనే మేము నిత్య సమస్యగా 60 ఏండ్ల నుంచి పోరాడుతూనే వున్నాము. యీ అరవై ఏండ్లు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి మద్ధతు పోరాటాలు నడిపింది సీమాంధ్రలో కొన్ని దళిత సంఘాలే. ఏ సీమాంధ్ర అగ్రకుల సమూహాలు తెలంగాణ పోరాటాలకు బాసట కాలే. చిన్నరాష్ట్రాలైతే అధికార వికేంద్రికరణ జరుగుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి.

సీమాంధ్రులుగా హైద్రాబాద్‌ నీడన బతుకుతున్న బహుజన ప్రజలు తెలంగాణ ప్రకటనని స్వాగతించి గౌరవించి తెలంగాణ ప్రజలకు అండగా వుండాలనీ, సీమాంధ్ర అగ్రకుల నాయకుల ఆధిపత్య అజెండా మోయొద్దని ఆశిస్తూ….. సీమాంధ్రలో గానీ, తెలంగాణలో గానీ బహుజనులంతా బహుజన మహిళలంతా బాగుండాలె.

 

 

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.