యూనియన్‌ స్థాపన – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

రాహీం బజార్‌లో గొడవ జరిగిన రోజున కేదలా కార్మికులు నన్ను చూసారు. నా ఉపన్యాసం కూడా విన్నారు. కేదలా కార్మికులు ఘాట్‌ బజారుకు వచ్చినప్పుడు తమ తమ సర్‌దార్ల, పహిల్‌వాన్‌ల కళ్ళల్లో దుమ్ముకొట్టి రహస్యంగా నన్ను కలవడానికి మగన్‌సింహ్‌ దగ్గరికి వచ్చేవారు. ఘాటో (టాటా కంపెనీ) కార్మికులు కూడా యూనియన్‌ని పెట్టాలని అన్నారు. రైలీగఢా, గిద్దీ (ఎన్‌.సి.డి.సి) కార్మికులు కూడా యూనియన్‌ని పెట్టాలని ఒత్తిడి చేయసాగారు. ధన్‌బాద్‌లో నా భర్త (ప్రాంతీయ లేబర్‌ ఆఫీసులో కేంద్రీయ పదవిలో పనిచేసేవారు) కార్మికుల నేతల గురించి చెబుతుంటే ఎన్నోసార్లు విన్నాను. నాకు యూనియన్‌ అంటేనే అసహ్యం అనిపించింది. ఎన్నో తర్జన భర్జనల తరువాత చివరికి మరో యూనియన్‌ని పెట్టాలన్న నిర్ణయం జరిగింది. తమ తమ స్వార్థాల కోసం యూనియన్‌ని

ఉపయోగించుకోకూడదు. కేవలం తిండి తిప్పలకోసమే పోరాటం సలపకుండా, రాజకీయ పోరాటాలలో కార్మికులతోపాటు, రైతులు, యువకులు, మహిళలు కూడా పాల్గొనే విధానాన్ని ఏర్పరచాలి. జార్జ్‌-ఫర్నాండిస్‌ ఇటువంటి ఆదర్శాల గురించి మీటింగులలో చెబుతూ ఉండేవారు.

యూనియన్‌ని స్థాపించడం నా జీవితంలో ఒక విలువైన, సంఘటన. నేను మెల్లి మెల్లిగా ఆ క్షేత్రంలో పూర్తిగా పాతుకుపోయాను. ఒకదాని తరువాత ఒకటి ఎన్నో ఉద్యమాలను నడపడం మొదలు పెట్టాను. ఇక్కడనుండే వ్యక్తి స్వార్థంకోసం కాకుండా సంఘంకోసం, సమిష్టి-వ్యవస్థలో పరివర్తన తీసుకు రావడం కోసం నేను పెద్ద ఎత్తున పోరాటం మొదలు పెట్టాను. దీంట్లో కేవలం నేను లేను ఉన్నదంతా సంఘమే. ఈ సంఘానికి ప్రతీక నేను. ఒక విశాల దృక్పథానికి బీజం వేసాను. నేను సమాజంలో పూర్తిగా మమేకం అయ్యాను. మేం అందరం ఒకేరకంగా ఆలోచించేవాళ్ళం. అందరి దృక్పథం ఒకటే. అసలు ట్రేడ్‌ యూనియన్‌ అంటేనే అంతులేని పోరాటం. ఇందులో మనం చేసేపనికి ఎంతో సంతోషం కలుగుతుంది. మనం కొంత పొందాం అన్న తృప్తి కలుగుతుంది. ఏదో ఒక కొత్త పని చేసి చూపించాలన్న కోరికకూడా తీవ్రతరం అవుతుంది. దానికోసం అనునిత్యం సంఘర్షణ చేస్తాం. ఇక నిరాశ అనేది దగ్గరికి రాదు. పోరాటం తీవ్రతరం అవుతున్నకొద్దీ మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశలకి బలం వస్తుంది. నమ్మకం ఏమాత్రం తగ్గదు పైగా బిల్డ్‌ అప్‌ అవుతుంది.

పోరాటాలలో విజయం మమ్మల్ని ఎటువంటి ఆటుపోట్లనైనా సరే భరించగల శక్తి నిచ్చింది. అపజయం నిలబడే బలాన్నిచ్చింది. కేదలా, ఝార్‌ఖండ్‌, కుజు, రైలీగఢా మొదలైన బొగ్గుగనులలో ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు జరిపాను. నామీద హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. నేను ఎన్నోసార్లు గాయపడ్డాను. ఎన్నోసార్లు నన్ను అరెస్టు చేసారు. కాని నేను ఎప్పుడు భయపడలేదు. ధైర్యంగా నిల్చున్నాను. నేను ఎన్నిసార్లు ప్రతిఘటించినా హింస ఏమాత్రం జరగకుండా చూసేదాన్ని. కాని నేను లేనిచోట కొంత రక్తపాతం జరిగింది. కేసులు కూడా నడిచాయి. నేను ఎక్కడైతే పోరాటంలో పాలుపంచుకున్నానో అక్కడ యజమానులైనా తలవంచారు. లేకపోతే నన్ను చంపడానికి ప్రయత్నించారు. మేం అందరం నిర్భయంగా ప్రవాహానికి ఎదురీది నిల్చున్నాము. ప్రలోభాలు చూపించారు. భయపెట్టారు. చంపడానికి ప్రయత్నించారు. అంటే అన్నివిధాలా నేను తలవంచుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. అయినా మేం ఎవరం వెనుకంజ వేయలేదు. పైగా పదడుగుల ముందే నడిచాము. యూనియన్లు స్థాపించాలని వెళ్ళిన నేతలకు ఎన్నో బెదిరింపులు వచ్చేవి- ‘అమ్ముడు పొండి లేకపోతే చావండి’. కొంతమంది అమ్ముడు పోయారు. కొంతమంది వెనుకంజ వేసారు. కాని నేను చెప్పి పంపించాను – ”మేం అమ్ముడు పోం, అంత శులభంగా చావం. అవసరం అయితే తంతాం, సిద్ధంగా ఉండండి”. మేం ఎప్పుడు ఎవరిమీద దాడి చేయలేదు. కాని నామీద దాడిచేసిన వాళ్ళను వదలనూ లేదు”. మేం ఎప్పుడు ఏ హింస చేయలేదు. కాని అవసరం అయినప్పుడు చేతులు ముడుచుకుని కూచోలేదు. ప్రభుత్వ సంస్థల ఎదురుకుండా సత్యాగ్రహం, దీక్షలు చేయగలుగుతాం. పని జరుగుతుంది కాని రక్తపిపాసగల ఆ దుండగులు అద్దెకు తెచ్చుకున్న పహిల్‌వాన్ల దగ్గర అహింస అంటే పిరికితనంగా మారుతుంది. అక్కడ సమ ఉజ్జీలుగా ఉండాలి. తప్పదు.

మేం బొగ్గుగనులలోకి వెళ్ళకూడదు. అది రూల్‌. కార్మికులపై దాష్టీకం పెరగసాగింది. మాకు కార్మికుల సపోర్టు ఎంతో ఉంది. పోయిన ఎలక్షన్లలో నేను అక్కడికి వెళ్ళకపోయినా కేదాల నుండి 500లో 340 ఓట్లు లభించాయి. ఘాటోలో 2200లో 2100 ఓట్లు లభించాయి. రాజుసాహెబ్‌ ఎంతో చింతించసాగారు. ఆ రోజుల్లో ప్రతిచోట ఓట్లను ప్రకటించేవారు.

రిసీవర్‌ నియుక్తం అయ్యాక పరేజ్‌ బంగళాలో రాజు దగ్గర పనిచేసే సిబ్బంది ఆయన ఆజ్ఞ ప్రకారం రిసీవర్‌ ఏజెంట్‌ నమో నారాయణ్‌ ఝాలని అవమాన పరచాలని వ్యూహం పన్నసాగారు. ముఖ్యంగా ఈ వ్యూహాన్ని బాబూ లలిత్‌ సింహ్‌, ఛబీలా సింహ్‌లు పన్నారు. చిన్న కంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కంపెనీల పట్ల విముఖత ఉంది. ఇప్పుడు రాజు సాహెబ్‌ కంట్రోలు కూడా లేదు. బీహారు ప్రభుత్వం రాయల్టీ రేటుని పెంచింది. పెద్ద కాంట్రాక్టర్లు రిసీవర్‌ల

ద్వారా నడిపే చెక్‌పోస్టుల దగ్గర జమ చేయించాలి. పెరిగిన రాయల్టీ భారాన్ని రేజింగ్‌ ఠేకేదార్లు, పైటీ ఠేకేదార్ల మీద పడేసారు. కాని తమకు వచ్చే భాగంలో ఏమాత్రం తగ్గించుకోలేదు. పి.డి.అగ్రవాల్‌ దగ్గర పనిచేసే పైటీఠేకేదార్లు అందరు కలిసి ఒక కో ఆప్‌రేటివ్‌ని తయారుచేసి రిసీవర్‌తో విడిపోయి వేరే బ్లాక్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లకు గుణపాఠం నేర్పించాలని వ్యూహం పన్నారు. చిన్న కాంట్రాక్టర్లు స్ట్రైక్‌ చేసేటప్పుడు నిరుద్యోగులలోంచి కొత్త కాంట్రాక్టర్లని భర్తీ చేయాలని వారు నిర్ణయించారు. తాము స్ట్రైక్‌ చేస్తే తమ దగ్గరి ముంషీలు, తక్కిన స్టాఫు, పి.డి. అగ్రవాల్‌ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు మీద వేరే బ్లాక్‌లో చిన్న కాంట్రాక్టులను తీసుకుంటారని చిన్న కాంట్రాక్టర్లకు తెలుసు.

కేదలా కార్మికులని శోషణ నుండి విముక్తులను చేయాలంటే యూనియన్‌ని తయారు చేయాలి, తప్పదు. కాని యూనియన్‌ని తయారు చేయటమంటే కాంట్రాక్టర్లు, ప్రభుత్వం కలిసి సాగించే హింసకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆహ్వానించడమే. పెద్ద చిన్న కాంట్రాక్టర్లు అందరు కొంతవరకు ప్రభుత్వాన్ని తను గుప్పిట్లో ఉంచుకునేవారు. వాళ్ళలో వాళ్ళకి దెబ్బలాట వచ్చినప్పుడు పని ఇంకా సులువు అవుతుంది. గ్రామాలలోని కాంట్రాక్టర్లు, ఊరు-ఇల్లు అంటూ వాళ్ళని మభ్యపెట్టి తమ తమ లేబర్‌ని యూనియన్‌ లోకి రాకుండా చూసేవారు. పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కాని మావైపు నుండి రాజుసాహెబ్‌తో కాని కాంట్రాక్టర్లతో కాని మాట్లాడటం మాకు ఇష్టం లేదు. ముందు వాళ్ళే మా దగ్గరకి వస్తారని మేము ఎదురు చూస్తూ కూర్చున్నాము. వాళ్ళు కార్మికుల ద్వారా ఫీలర్‌ని పంపించేవాళ్ళు. చిన్న కాంట్రాక్టర్లు సహాయం చేస్తే రాయల్టీ తక్కువ చేసి రేజింగ్‌ రేట్‌ ఎక్కువ చేసే విషయంలో యూనియన్‌ సహాయ పడుతుందా? ఇంతలో మేము కేదలాలో మా కార్యకర్తలను పంపించడం మొదలు పెట్టాము. వాళ్ళు వేజ్‌బోర్డు లెక్క ప్రకారం కూలీ ఇవ్వడానికి రిజిస్టర్లలో హాజరీ వెయ్యాలని డిమాండు చేసారు. కేదలా చెక్‌లో కీరత్‌రామ్‌ ఇంట్లో జెండా ఎగరేసాము. కాని ఆ రాత్రికి రాత్రే కాంట్రాక్టర్లు దానిని తీసేసారు. ఎవరు పీకి పడేసారో కార్మికులు మా దగ్గరికి వచ్చి చెప్పారు. మేము పోలీసు స్టేషన్లో కేసు పెట్టాము. మేం ఇదంతా చేయడం చూసాక లలిత్‌బాబుకి చింత ఎక్కువ కాసాగింది. ఆయన కులం పేరు మీద మా రాజ్‌పుత్‌ కాడర్‌తో కలిసి తనకు కావలిసినట్లుగా నేను నిర్ణయించాలని అనుకున్నారు. కాని ఆయన స్వయంగా నాతో వచ్చి కలవలేదు. నేను కూడా ఎదురుపడి మాట్లాడే వరకు సంబంధం తెంచుకోవద్దని మా కాడర్‌ వాళ్ళకి నా అభిప్రాయం చెప్పాను. జెండా పెరికి వేసాక ఆయన మా దగ్గరికి వచ్చారు – ”మా ద్వారా మీరు పని చేయండి. జెండా పీకి పడేయడానికి ఎవరికి దమ్ముందో చూద్దాం” అని ఆయన అన్నారు.

నేను కఠోరంగా అన్నాను – ”మేం కార్మికుల ద్వారానే వెళ్ళడానికి ఇష్టపడతాము. మీరు మమ్మల్ని ఒక కార్మికుడిగా ఎంచుకుని మా దగ్గరికి వస్తే మేం స్వాగతం పలుకుతాం. కాంట్రాక్టర్లకు మా యూనియన్‌లో స్థానం లేదు”.

ఆయన కొంత ఆలోచించి అన్నారు – ”ఒకవేళ కాంట్రాక్టర్లలో విబేధాలు వస్తే మీ కార్మికులు చిన్న కాంట్రాక్టర్లవైపు వస్తారా? లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లవైపా?”

మేము స్పష్టంగా చెప్పాము- ”మేం కార్మికుల మేలుకోసం పోరాడుతాం? ఇందులో వాళ్ళ వైపా వీళ్ళ వైపా అన్న ప్రశ్నే లేదు.

ఆయన కొంత జాగ్రత్త పడుతూ అన్నారు- ”చిన్న కాంట్రాక్టర్ల దగ్గర ఇంత ధనం ఎక్కడ ఉంటుంది? కూలీని పెంచడానికి?”

నేను – ”అసలు ఈ చిన్న కాంట్రాక్టర్లు చట్టంలో లేనే లేరు. వీళ్ళు సూపర్‌వైజర్లు కారు. కార్మికుల బాగోగులు చూసే ఇంఛార్జ్‌ స్టాఫ్‌. అంతే కాని వీళ్ళు తమని తాము యాజమాన్యానికి యజమాని అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కార్మికులను తమవారిగా అనుకున్నప్పుడు మేము మాట్లాడడానికి వీలు ఉంటుంది. కూలీల రేటు గురించి కూడా మాట్లాడగలుగుతాం. రేటు పెరిగితే మేము ఎటువంటి అడ్డంకులు పెట్టము. కాకపోతే గనుల విభజన చేయాలని డిమాండు చేస్తాము.” అని అన్నాను.

ఆయన గాభరా పడుతూ అన్నారు- ”మీరు కూలీ రేటుని పెంచమని డిమాండ్‌ చేయండి. మేము మీకు సహాయ పడతాము. కార్మికులను హజారీబాగ్‌ తీసుకుని వెళ్లాలంటే ట్రక్కులను కూడా ఏర్పాటు చేస్తాము అంతేకాని గనుల విభజన మాట ఎత్తకండి”.

మాకు వాళ్ళెందుకు గాభరా పడుతున్నారో అర్థం అయింది. రాత్రి మేం అందరి అభిప్రాయాలని కూడకట్టుకుని కేదలాలో పెద్ద మీటింగ్‌ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మొదట ఇంత గడ్డి పడేసి ఆయనని పెద్ద కాంట్రాక్టర్లకు వ్యతిరేకం అయ్యేలా చేసి, ఇద్దరిని బలహీనులని చేయాలి. మొదట ఒకళ్ళని ఓడించి, రెండో వాళ్ళని లేకుండానే చేయాలి, అని ప్రణాళికను వేసుకున్నాం. విభాగీయం చేయాలి అన్న డిమాండ్‌ని మానేసాం. కార్మికులకి వేజ్‌బోర్డు ప్రకారం కూలీ ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి. దీనికోసం పోరాటం సాగించాలి. వాళ్ళు మాకు 100 ట్రక్కులు ఇస్తాం అని మాట ఇచ్చారు. మేము మరుసటి రోజు కేదలాచౌక్‌లో జెండా ఎగురవేయాలని అనుకున్నాము. ఈ యూనియన్‌ పేరు ‘కోయలా శ్రమిక్‌ సంఘఠన్‌’. దీనికి అధ్యక్షుడిగా శ్రీకృష్ణ సింహ్‌ని, సెక్రెటరీగా నిత్యానంద్‌ని ఎన్నిక చేసారు. పటేల్‌ సింహ్‌, నిత్యానంద్‌ సింహ్‌, మగన్‌ సింహ్‌, అఖిలేశ్వర్‌ సింహ్‌, నిజామ్‌భాయి మొదలగువారు బాహటంగా కేదలాకి రాకపోకలు ప్రారంభించారు. లలిత్‌బాబు, ఛబీలా సింహ్‌లు కూడా ఇప్పుడు బాహటంగా రాకపోకలు సాగించారు. రెండోసారి జెండాను పీకి పారేయడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. (ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.