అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

5. అత్యవసర పరిస్థితి తర్వాత: మరోచోట మా జీవితాలు
అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత జీవితం మెరుగ్గా ఉండాల్సింది, కానీ మా విషయంలో అలా జరగలేదు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మేం చండీగఢ్‌ నుంచి దిల్లీకి మారాం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీసుల నుంచి మాకు పలాంటి ముప్పు పొంచి వుందో తెలీదు కాబట్టి 1980 వరకూ కూడా మేం ఉత్తరాదిలోనే ఉండిపోయాం.

ప్రజలతో కలిసి పనిచేయాలన్నది మా ఆకాంక్ష. కానీ అటు పోలీసుల నుంచీ, ఇటు పార్టీ నుంచీ అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం వుండటంతో మేం వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు తిరిగి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. అప్పటికే చాలామంది మిత్రులు హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయి, ఎన్నో కష్టాలు పడి, ఎలాగోలా తమ జీవితాలను పునరుద్ధరించుకున్నారుగానీ.. వాళ్లలా వెంటనే మారిపోటానికి మాకు అక్కడ కుటుంబమనేదేదీ లేదు.
దిల్లీలో ఉండాలంటే మాకు అక్కడ ఉపాధి కావాలి కదా. నేను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)లో చిన్న పని వెతుక్కున్నాను. అక్కడ విజయ మూలేతో కలసి ఆర్నెల్ల పాటు పిల్లలకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్‌ మీద పని చేశాను. విజయ మూలే చాలా మంచి మనిషి, ఆమెను అంతా ‘అక్కా’ అని పిలిచేవారు. నన్ను తను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంది, నాకు జీవితకాలపు ఆత్మీయ స్నేహితురాలిగా మారింది. అత్యవసర పరిస్థితిలో మాకు ఎదురైన అనుభవాల వల్లా, అలాగే పార్టీతో సంబంధాలను బలంగా తెంచుకోవటం వల్లా నాలో తలెత్తిన కొన్ని కాఠిన్యాలను ఆమె చాలావరకూ చక్కదిద్దింది. సిరిల్‌, నేనూ తరచూ వాళ్లింటికి వెళుతుండేవాళ్లం. మమ్మల్ని తనెంతో సాదరంగా ఆహ్వానించేది. రుచికరమైన వంటలు చేసిపెట్టేది. చక్కని సంగీతం వినిపించేది. జీవితంలో తనకు తారసపడిన రకరకాల వ్యక్తుల గురించి విడమరిచి చెప్పేది. తను ఎదుర్కొన్న కష్టాలనూ పంచుకునేది. సిరిల్‌, నేనూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమే మమ్మల్ని ఒత్తిడి చేసింది. ఆమె సలహా మీదే మేం దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు పక్కనున్న రిజిస్ట్రార్‌ ఆఫీసులో మా పెళ్లిని రిజిస్టర్‌ చేసుకున్నాం. జార్జి రెడ్డికి చాలా సన్నిహిత మిత్రుడైన డాక్టర్‌ ప్రతాప్‌ పోతులూరి, ఆయన భార్య మన్మోహినీ కౌర్‌ ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టారు. ప్రతాప్‌ వాళ్ల నాన్న పి.ఆర్‌. వెంకటస్వామి తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమ ప్రముఖులు, 1900`1950ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో దళిత ఉద్యమ చరిత్రను ఆయన ఎంతో ప్రతిభావంతంగా రికార్డు చేశారు.
సిరిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ కావటంతో తను ఆ రంగంలోనే ఓ ఉద్యోగం వెతుక్కుని, కొన్ని నెలల పాటు పని చేశాడు. విజయా మూలేతో కలిసి నేను చేసిన ఎన్‌సీఈఆర్‌టీ ప్రాజెక్టు పూర్తైన తర్వాత నేనూ, సిరిల్‌ దిల్లీ శివారు ప్రాంతంలోని ఘాజియాబాద్‌కు వెళ్లాం. ఆ చిన్న పట్టణమంతా కలియతిరిగాం. అక్కడ అందరికంటే నిరుపేదలు బాల్మీకీ కులస్తులని గుర్తించాం. వాళ్లు మానవ మలాన్ని చేత్తో ఎత్తిపోసే పారిశుధ్య పని చేస్తుంటారు. మేం వాళ్లతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఆ బాల్మీకీ కాలనీలో వుండేందుకు మాకు వసతి దొరకలేదు. దాంతో పక్కనే ఘాజియాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర్లో ఒక గది అద్దెకు తీసుకుని అక్కడికి మారిపోయాం. బాల్మీకీల్లో మగవాళ్లు రైల్వేలోనూ, ఇతర సంస్థల్లోనూ పారిశుధ్య పని చేస్తుంటారు. ఆడవాళ్లు చుట్టుపక్కల ఇళ్లలో మలాన్ని ఎత్తి, మరుగుదొడ్లని శుభ్రం చేస్తుంటారు. ఒక సాయంత్రం ఆ బస్తీకి వెళ్లి ‘మేం మీకు పనికొచ్చే పనేదైనా చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఏం చెయ్యమంటారు?’ అని అడిగాం. కాస్త చదువుకున్నట్టుగా కనబడుతున్న, దక్షిణాది నుంచి వచ్చిన మా జంటను ఎగాదిగా చూసి.. చివరికి వాళ్లు ‘మా పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పించండి’ అన్నారు. వాళ్లు ఇంకేదో అడుగుతారని ఆశిస్తున్న నాకు ఆ మాట వింటూనే నిరాశగా అనిపిచింది. అయినా వాళ్లేం అడిగారో అదే చేద్దామనుకుని, పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పించటం మొదలుపెట్టాం. నేను ఆడవాళ్లకి కుట్టుపని కూడా నేర్పించాను. మెల్లగా హిందీలో చదవటం, రాయటం నేర్పించమంటూ చాలామంది పెద్దవాళ్లు కూడా మా దగ్గరకు రావటం మొదలు పెట్టారు. మేం శ్రద్ధగా చదువు చెబుతుండటం చూసి వాళ్లు ఎంతో సంతోషపడే వాళ్లు. చదువుతో పాటు క్రమేపీ మేం ఆరోగ్యాన్ని కాపాడుకునేదెలా, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ఎలా ఉపయోగించుకోవాలి వంటి విషయాలను కూడా వాళ్లకు వివరించి చెప్పటం మొదలుపెట్టాం. అయితే రాజకీయపరంగా పనిచేయాలన్న మా ఆకాంక్ష మాత్రం అలాగే వుండిపోయింది.
అక్కడున్నప్పుడు మేం రాజకీయ కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోలేదు. అలా చేసి పోలీసుల దృష్టిలో పడటం మాకు ఇష్టం లేదు. బాల్మీకీ మిత్రులు మమ్మల్ని పెళ్లిళ్లకూ పేరంటాలకూ తీసుకెళ్లేవారు. అక్కడ మమ్మల్ని అందరికీ గౌరవంగా, గొప్పగా పరిచయం చేసుకునేవాళ్లు. చూస్తూ చూస్తుండగానే మా వద్దకు వచ్చేవారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఎక్కడెక్కడో మీరట్‌, హాపూర్‌ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా చదువు చెప్పమంటూ మా దగ్గరకు రావటం మొదలుపెట్టారు. దీంతో నేను విజయ మూలే సాయంతో వాళ్ల కోసమని ప్రత్యేకంగా ఒక హిందీ ప్రాథమిక పాఠ్య పుస్తకాన్ని తయారు చేశాను. దాన్లో కొన్ని బొమ్మలు కూడా వేయించాను. అందులో పాఠాలన్నీ కూడా వాళ్లు నిత్యం చూస్తున్న, ఎదుర్కొంటున్న దైనందిన జీవిత అనుభవాల చుట్టూతానే తిరుగుతుంటాయి. ఆ పుస్తకంలో కథానాయిక పేరు ఆశ. చేతిలో చీపురు కట్టతో నిలబడి కనిపించే ఒక స్వీపర్‌ ఆమె. ప్రతి పేజీలో ఆమె రోజూ చేసే పనులకు సంబంధించిన వివరాలు, బొమ్మలు ఉంటాయి. అందులో ప్రతి పేజీ వాళ్లకు ఐదేసి కొత్త హిందీ అక్షరాలను, వాటితో తయారైన పదాలను పరిచయం చేస్తుంది, ఆ పదాలతోనే ఆశా రోజువారీ జీవితాన్నీ వివరిస్తుంది. వాళ్ల చేతుల్లో ఆ చిన్న పుస్తకాన్ని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా, కాస్త గర్వంగా కూడా అనిపించేది. వాళ్లకు హిందీ నేర్పించేందుకు ఆ పుస్తకం నాకు ఎంతగానో ఉపయోగపడిరది.
బాల్మీకీలు మా గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. తరచూ మేం రాత్రి భోజనం వాళ్లతోనే చేసేవాళ్లం. ఆ భోజనంలో బాగా కాల్చిన మందపాటి రొట్టెలు, పంది మాంసం తప్పనిసరిగా వుండేవి. ఆ పందులు అక్కడి కాలనీలోనే మానవ మలాన్ని తింటూ తిరుగుతూ వుండేవి. వాటి మాంసం తినడం వల్ల ఎక్కడ బద్దెపురుగుల (టేప్‌వర్మ్‌) సమస్య వస్తుందో అని నాకు కొద్దిగా ఆందోళనగా కూడా ఉండేది. ఎవరైనా బాల్మీకీలు తీపి వంటకాలు చేసుకుంటే మమ్మల్ని తప్పకుండా వాళ్లింటికి తీసుకెళ్లి పెట్టేవారు. ఆ బస్తీలో ఉన్నప్పుడు జోగీందర్‌, చరణ్‌ సింగ్‌ అనే ఇద్దరు పిల్లలు ‘ఎస్కార్ట్‌ల’ మాదిరిగా ఎప్పుడూ నాతోనే ఉండేవాళ్లు. అప్పటికి వాళ్లకి సుమారు పన్నెండేళ్లుంటాయేమో. జోగీందర్‌ అదే బస్తీలో వుండే బాల్మీకీ కాగా చరణ్‌ సింగ్‌ కొద్ది దూరంలో ఉన్న చమార్‌ బస్తీ నుంచి వచ్చేవాడు. వాళ్లిద్దరికీ మేమన్నా, మా జీవితాలన్నా చాలా ఆసక్తి. తరచూ మా గదికి వస్తుండేవారు. చేతికందిన పుస్తకాన్ని తిరగేస్తూ నా మీద ప్రశ్నల వర్షం కురిపించేవాళ్లు. నేను పట్నం వెళ్లే రోజున వాళ్లకు సెలవు ఉంటే వాళ్లూ నాతో వచ్చే వాళ్లు. మేం ఘాజియాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాక వాళ్లతో సంబంధం తెగిపోయింది. వాళ్లకి దూరమయ్యానే అని చాలాకాలం బాధగా వుండేది. వాళ్లు ఇప్పుడెలా వున్నారో అని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత 2021లో నేను పని మీద దిల్లీ వెళ్లినప్పుడు ఘాజియాబాద్‌కు కూడా వెళ్లి ఆనాటి బాల్మీకీ బస్తీ కోసం చాలా వెతికాను. ఆ ప్రాంతమంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఆనాటి మిత్రులందరూ ఏమైపోయివుంటారో తెలియలేదు. దాదాపు నలభై ఒక్క ఏళ్లు గడచిపోయాయి. మొదట్లో కొన్నాళ్ల పాటు వాళ్లూ నేనూ పరస్పరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. కానీ హైదరాబాద్‌లో మా చిరునామా తరచూ మారిపోతుండంతో అది కొన్నాళ్లకే ఆగిపోయింది. నేను వాళ్లకి ఉత్తరం రాయాల్సిందే తప్ప వాళ్లు నన్ను సంప్రదించేందుకు వీలు లేకుండా పోయింది. నాకేమో గతాన్ని పక్కన పెట్టి వర్తమానంలో మునిగిపోవడం అలవాటు.
ఎలాగైతేనేం ఘాజియాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక బాల్మీకీ బస్తీని కనుగొన్నాను. అక్కడ కొందరు యుక్తవయసు పిల్లలు కనిపిస్తే వాళ్లకి నా కథ చెప్పాను. నలభై ఏళ్ల కిందట బాల్మీకీ పిల్లలకూ, స్త్రీలకూ చదువు చెప్పిన వైనాన్ని వివరించి వాళ్లని చూడాలని వుంది అన్నాను. ఆ కుర్రాళ్లు నేను చెప్పిందంతా ఆసక్తిగా విన్నారు. కానీ ‘మీరు వెతుకుతున్న బస్తీ ఇప్పుడు లేదు. ఈ బాల్మీకీ బస్తీ కేవలం ఇరవై ఏళ్ల కిందట ఏర్పడ్డది’ అన్నారు. ‘ఒకవేళ మీకు ఆ పాత బాల్మీకీ బస్తీ కనిపించినా, అప్పటి వాళ్లు ఇంకా బతికి వుంటారా! మా బాల్మీకీలు చాలామంది తాగీ తాగీ నలభై ఏళ్లలోపే చచ్చిపోతుంటారు’ అన్నారు. అయినా నేను పట్టువదలక పోవడంతో చివరికి కొంచెం దూరంలో వున్న పాత బాల్మీకీ బస్తీని చూపించారు. పందులు తిరుగుతున్న బురద గుంటల్ని దాటుకుంటూ మేం అక్కడికి వెళ్లాం. ముందుగా శిథిలమైన ఇళ్లు కొన్ని కనిపించాయి. వాటిని ఎప్పుడూ చూసినట్టు గుర్తుకు రాలేదు. ఆ భవనాల ముందు భాగంలో దుకాణాలున్నాయి. అయితే వాటిని నడిపేది బాల్మీకీలు కాదు, ఎక్కడి నుంచో అక్కడికి వలస వచ్చిన ఇతరులు. నేను ఆనాటి వృద్ధ బాల్మీకీల గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఒక్కో షాపులో కనుక్కుంటూ వెళ్లాను. వాళ్ల పేర్లేమిటని అడిగారు. నాకు గుర్తున్న ఒకే ఒక్క పేరు జోగీందర్‌. అదే చెప్పాను. ఒక మహిళ.. ‘ఓ జోగీందరా!’ అంది. ‘వాళ్ల ఇల్లు ఈ పక్కనే వుంటుంది. కానీ జోగీందర్‌ ఇప్పుడు ఇక్కడ వుండటం లేదు. వేరే ఎక్కడికో మారిపోయాడు. ఆ ఇంట్లో వాళ్ల అన్నా, వదినా మాత్రం వుంటున్నారు. అయినా వాళ్లేం సాయం చేస్తారు? ఆ వదిన అసలే జబ్బు మనిషి. వాళ్ల అన్నకేమో సరిగా కళ్లు కనిపించవు’ అంది.
నేను ఆ ఇంటికి వెళ్లాను. ‘కోయీ హై’ … (ఎవరైనా వున్నారా) అని కేకవేశాను. ఒకతను బయటికి వచ్చాడు. నేను నా కథంతా వినిపించాను. అతను వెంటనే ‘మీరు గీతా రామస్వామా?’ అని అడిగాడు. అవునన్నాను. లోపలికి రమ్మన్నాడు. అతని పేరు గ్యాని. జోగీందర్‌ అన్నయ్య. నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. చాలా ఉద్వేగానికి గురయ్యాడు. ‘మా తమ్ముడి జీవితాన్నీ, ఇంకా చాలామంది జీవితాలను మీరు మార్చేశారు. మీ వల్లనే మా వాడు చదువుకున్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు’ అన్నాడు. ‘చాలామంది ఈ బస్తీలోంచి వెళ్లిపోయారు. కొందరైతే తమ ఇళ్లను అమ్మేసుకున్నారు. అప్పటివాళ్లు ఒక్కరిద్దరు తప్ప ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు’ అని చెప్పాడు. ఆనాటి చిన్న చిన్న సంఘటనలను ఎన్నింటినో గుర్తుచేసుకున్నాడు. భోజనం చేయమనీ, ఆ రోజు తమ ఇంట్లోనే వుండమని పట్టుపట్టాడు. కానీ నాకు అంత సమయం లేదని చెప్పాను. చివరికి ఆ ఇంట్లోంచి వచ్చేస్తుంటే చప్పున నా చేతిలో ఐదొందల రూపాయల నోటు పెట్టాడు. నేను వద్దన్నాను. ‘మా చెల్లెలు ఎప్పుడు వచ్చినా నేను ఇలాగే ఎంతో కొంత చేతిలో పెట్టి పంపిస్తుంటాను. ఇప్పుడు మీరు నన్ను కాదంటారా?’ అన్నాడు. ఆ నోటును తీసుకుంటుంటే నా కళ్లలో నీళ్లు ఆగలేదు.
ఇది జరిగిన కొద్ది సేపటికే నాకు జోగిందర్‌ నుంచీ, చరణ్‌ సింగ్‌ నుంచీ ఫోన్లు వచ్చాయి. 1978లో నేను ఘాజియాబాద్‌లో వున్నప్పుడు మాతో తిరిగిన పన్నెండేళ్ల జోగిందర్‌.. ఇప్పుడు అమృత్‌సర్‌ ఎయిర్‌ పోర్ట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడట. చమర్‌ బస్తీకి చెందిన చరణ్‌ సింగ్‌ నోయిడాలో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడట. పది నిమిషాల వ్యవధిలోనే వాళ్లిద్దరి నుంచీ వెంటవెంటనే ఫోన్లు వచ్చాయి. ఒకప్పటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఉద్వేగానికి గురయ్యారు. మా జీవితాలు మీ వల్లనే మారిపోయాయి అన్నారు. ఆ తర్వాత ఘాజియాబాద్‌లో నన్ను చరణ్‌ సింగ్‌ కలుసుకున్నాడు. నా కాళ్లకు నమస్కరించబోయాడు. నాతో అరగంట సేపు మాట్లాడాడు. వెళ్లిపోబోతుంటే ‘దిల్‌ నహీ భరా` (నా మనసు నిండలేదు)’ అన్నాడు. ‘దయచేసి ఈ రోజు వుండిపోండి. మీకు చాలా సంగతులు చెప్పాలి’ అన్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరితో పాటు` ఆ రోజుల్లో నేనూ, సిరిల్‌ చదువు చెప్పిన ఎంతో మంది పిల్లలు నాతో టచ్‌లో వున్నారు. చాలామంది బెంగళూరు, గౌహతి వంటి చోట్ల మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఘాజియాబాద్‌లో మేం రెండు సంవత్సరాలకు పైనే వున్నాం. సిరిల్‌ కొత్త దిల్లీ లోని ‘పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెంటర్‌ ఫర్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌’లో సర్వేలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవాడు. అది కార్మికుల విద్యకు సంబంధించిన సంస్థ. తను ఘాజియాబాద్‌ నుంచి రోజూ కొత్త దిల్లీకి ట్రైన్‌లో వెళ్లివచ్చేవాడు. ఆ సంస్థ డైరెక్టర్‌ నితీశ్‌ డేకి యుగంధర్‌ ఒక మాట చెప్పడం వల్ల సిరిల్‌కి ఆ ఉద్యోగం లభించింది.
అయితే, నాలోని రాజకీయ స్వప్నాలు అలాగే వుండిపోవడంతో జీవితం చాలా నిరాశాజనకంగా వుండేది. మేం ఇక ఎప్పటికీ స్వచ్ఛంద సేవకులుగానే మిగిలిపోతామేమో అనిపిస్తుండేది. 1970లలో స్వచ్ఛంద సేవా సంస్థల (ఎన్‌జీఓ) పనిని ఏదో ధర్మానికి చేసే పనిగా, కాస్త హేళనగా కూడా చూసేవాళ్లు. నక్సల్బరీ కల ఇంకా చెరిగిపోలేదు. మా తరం వాళ్లలో చాలామంది రాజకీయ కార్యాచరణ ఒక్కటే గౌరవప్రదమైన పనిగా భావించేవాళ్లు. ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి పని చేస్తూ, వారిని తమ సమస్యలపై రాజ్యానికి వ్యతిరేకంగా సంఘటితపరిచి, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకునేందుకు కృషి చెయ్యటమే మన ఏకైక లక్ష్యం కావాలన్న స్పృహలో ఉండేవాళ్లం. మేం అప్పటికి ఇవాన్‌ ఇల్యిచ్‌ని గానీ, ఆంటోనియో గ్రామ్‌ షీని గానీ లేదా ఇవాళ అంతా చదువుతున్న వివిధ సిద్ధాంతకర్తల పుస్తకాలని గానీ ఇంకా చదవలేదు. నేను దిల్లీ నుంచి మీరట్‌ వరకూ వున్న బాల్మీకీ పిల్లలందరికీ ఇంగ్లీష్‌ని బోధించగలనేమోగానీ దాని ద్వారా విప్లవం దరిదాపులకు కూడా వెళ్లలేము. అలాగే మేం వారికి అత్యంత ప్రియతమ వ్యక్తులం కావొచ్చునేమోగానీ అది దోపిడీ రాజ్యాన్ని కూల్చి, నూతన వ్యవస్థను నిర్మించేలా వాళ్లను ముందుకు నడిపించదు. బహుశా మానసికంగా ఆగ్రహం, అసంతృప్తుల్లో కూరుకుపోయి.. నాపట్ల నేనే కాదు, ఆ బాల్మీకీల పట్ల కూడా నిర్దయగా వుంటున్నానేమో! అప్పటికే, అంటే ఆ 1978ల నాటికే బాల్మీకీలకు ఇంగ్లీష్‌ చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలుసు. చదువు తమకు ఆధునిక ప్రపంచానికి సింహద్వారమనీ, తమ పిల్లలకు మలం ఎత్తిపోయాల్సిన పనిలేని మంచి భవిష్యత్తును ఇస్తుందనీ వాళ్లు గుర్తించారు. అప్పట్లో మాకు తెలియలేదుగానీ.. ఆ రోజుల్లో ఘజియాబాద్‌లో మేం నిర్వహించిన ఆ కార్యక్రమాలు భవిష్యత్తు కోసం మమ్మల్ని ఎన్నో విధాలుగా సన్నద్ధుల్ని చేశాయి. ముఖ్యంగా అవి మమ్మల్ని పార్టీ పనులకు దూరంగా తీసుకువెళుతూ… విప్లవానికి ఒకే ఒక్క సూటి మార్గమనేది వుండదనీ, అలాగే విప్లవం అనేది ఒకే ఒక్క లక్ష్యం కూడా కాదనీ, నిత్య జీవితంలోని ఎన్నో రంగాల్లో సాధించగల లక్షలాది లక్ష్యాల సమాహారమనీ గ్రహించేట్టు చేశాయి.
1975లో నన్ను ఇంట్లో బంధించి, షాక్‌ ట్రీట్‌మెంట్‌ (ఈసీటీ) ఇప్పించిన తర్వాత కొన్నేళ్ల వరకూ నేను మళ్లీ నా తల్లిదండ్రులను కలవలేదు. 1979లో ఓ రోజు మా మిత్రుడు గోపాల్‌ వచ్చి` అమ్మానాన్నా నన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నారనీ, గతంలో జరిగిన దానికి వాళ్లు చాలా బాధపడుతున్నారనీ చెప్పాడు. ముందు నాకు నమ్మబుద్ధి కాలేదు. నన్ను ఇంటికి రప్పించేందుకు ఇది మరో కొత్త పన్నాగమేమో అనుకున్నాను. అయితే జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా వాళ్లు కేదార్‌నాథ్‌ తీర్థయాత్రకు వెళ్లొచ్చారని, చాలా పశ్చాత్తాపంలో ఉన్నారని చెప్పాడు. అదీ ఎత్తుగడేనేమో అనుకున్నాను. ఆ తర్వాత ఒకసారి నేను దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నప్పుడు హఠాత్తుగా వాళ్లను చూసొద్దాం అనిపించింది. ట్రైన్‌ వరంగల్లుకు రాగానే దిగేసి, మరో రైలెక్కి మద్రాసు వెళ్లాను. సీఐటీ కాలనీలో మా తల్లిదండ్రులుండే ఆ పాత ఇంటికి చేరుకున్నప్పుడు నాన్నే తలుపులు తెరిచారు. ఆయన నాతో అన్న మొట్టమొదటి మాట ‘‘జరిగిన దానికి చాలా సారీ అమ్మా!’’… అంతే. ఆ ఒక్క మాటతో నా గుండె కరిగి నీరైపోయింది. హోరాహోరీగా జరిగిన మా పోట్లాటలు, ఆవేశంలో పరస్పరం అనుకున్న మాటలన్నీ అరక్షణంలో ఆవిరైపోయాయి. ఇక అప్పటి నుంచీ నేను అమ్మానాన్నలను గతంలో కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఇన్నాళ్లూ నేనూ, వాళ్లూ అందరం బాధలుపడ్డాం. తమ ఇంట్లో అందరికంటే తెలివైనదనీ, తమకు మగపిల్లలు లేని కొరత తీరుస్తుందనీ ఆశించిన కూతురు.. వాళ్ల దృష్టిలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోకి జారిపోతోందన్న ఆందోళనతో వాళ్లు అప్పుడు అతిగా స్పందించారు.
ఇక ఆ రోజు నుంచీ వాళ్లు నన్ను ఏ రకంగానూ నొప్పించకూడదని తహతహలాడుతుండేవాళ్లు. నా కోసం ఏదైనా కొనాలనిపించినప్పుడు కూడా ముందు నన్ను సంప్రదించేవాళ్లు. నాకు అది ఇష్టమో కాదో, నచ్చుతుందో లేదో ముందే కనుక్కునేవాళ్లు. ఆ తర్వాత మళ్లీ మా మధ్య ఎప్పుడూ, ఎలాంటి గొడవలూ రాలేదు. 1981 జనవరిలో నాన్న, 1998లో అమ్మ చనిపోయారు. వాళ్లున్నంత కాలం తరచూ నేను మద్రాస్‌ వెళ్లొస్తుండే దాన్ని. ఎప్పుడైనా పని మీద విజయవాడ, చిత్తూరు వంటి ప్రాంతాలకు వెళ్తే తప్పనిసరిగా మద్రాస్‌ కూడా వెళ్లి, వాళ్లతో ఓ పూట గడిపివచ్చేదాన్ని. వాళ్లు అడిగినవి చేసి పెడుతుండేదాన్ని. అలాగే ‘అక్కయ్యలకీ, చెల్లెలికీ కాన్పు సమయాల్లో కాస్త తోడుగా వుండమని’ అమ్మ అడిగితే సరేనన్నాను. అప్పటికి నాకు పిల్లలు లేకపోవడం, ఇంట్లో భర్తకు ప్రత్యేకంగా చేసిపెట్టాల్సిన అవసరం లేకపోవటంతో ‘ఖాళీగా’ ఉన్నానని అమ్మ ఆ పని నాకే పురమాయించింది. అలా నేను ఒక అక్క కాన్పుకీ, చెల్లెలి రెండు కాన్పులకీ దగ్గరుండి సాయం చేశాను. అయినా మా అక్కచెల్లెళ్లకూ, నాకూ మధ్య దూరం మాత్రం తగ్గలేదు. ఈ పుస్తకం రెండో చిత్తు ప్రతి పూర్తయ్యే వరకూ కూడా మేం.. 1975 నాటి ఆ ఘటనల గురించి ఎన్నడూ మాట్లాడుకున్నది లేదు. దానిపైన చర్చ లేదు, దానికి ముగింపు కూడా లేదు. ఆ భయానక పరిస్థితుల్లో నాకు అండగా నిలబడకుండా వాళ్లు నన్ను వంచించారని నేను అనుకునేదాన్ని. వాళ్లనూ, మా తల్లిదండ్రులనూ నేనే అనవసరంగా క్షోభ పెట్టానని వాళ్లు భావిస్తుంటారు. నిజానికి, మా అమ్మానాన్నలు కరడుగట్టిన సనాతన, సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు. బయటి ప్రపంచాన్నిగానీ, ఇతర కులాలు, మతాల వారిని అంతగా చూసింది లేదు. అమ్మయితే మరీనూ. అలాంటిది జరిగినదానికి వాళ్లే పశ్చాత్తాపపడ్డారు. కానీ మా అక్కలంతా బాగా చదువుకున్నవాళ్లు. వాళ్లకు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో స్నేహితులున్నారు. పైగా ఉద్యోగాలు చేస్తూ, నిత్యం రకరకాల మనుషులను కలుస్తూనే ఉన్నారు కదా, మరి వాళ్లకేమైంది? 1992లో నేను ఒక బిడ్డను కనాలని ఆలోచిస్తున్నప్పుడు అమ్మ ‘‘నా పిల్లలందరిలో ఎక్కువ సంతోషంగా వున్నదానివి నువ్వే. ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావో దాన్నే కొనసాగించు. కానీ మిగతా వాళ్ల మాదిరిగా బిడ్డను కనాలనుకోకు. దానివల్ల వచ్చే చిక్కులేమిటో నీకు తెలీదు’’ అంది. నేను నవ్వుకున్నాను. నాకూ మా తల్లిదండ్రులకూ మధ్య సయోధ్య కుదిరింది. కానీ మా అక్కలకూ, నాకూ మధ్యనున్న దూరం మాత్రం అలాగే వుండిపోయింది. ఒక అక్క అయితే నేను అమ్మానాన్నలను ‘తీవ్ర మానసిక క్షోభకు’ గురిచేసినందుకు శిక్షగానే సిరిల్‌కి పెద్ద జబ్బు చేసిందనీ, నాకు శాస్తి జరిగిందని నమ్ముతోంది, అందరితో చెబుతోంది కూడా!
బహుశా, నేను ఏదో రోజు మా అక్కయ్యల్లో కొందరినైనా అర్థం చేసుకుని, ఆమోదించొచ్చు. వాళ్లన్న మాటలే ఇవి. నేనీ పుస్తకం రాస్తున్న సంగతి చెప్పి, ఆనాటి షాక్‌ ట్రీట్‌మెంట్‌ (ఈసీటీ) గురించి నలభై ఐదేళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా వాళ్ల దగ్గర ప్రస్తావించినప్పుడు ‘‘అనవసరంగా అమ్మానాన్నల్ని బద్నాం చేయకు’’ అన్నారు. ‘‘మమ్మల్ని కూడా బద్నాం చేయకు. అమ్మానాన్నా నిన్ను కొడుకులా భావించుకున్నారు. వాళ్లకు కొడుకుల్లేని కొరత తీరుస్తావనుకున్నారు. నువ్వు ఏ కలెక్టర్‌వో, పెద్ద సైంటిస్టువో, ఇంకా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రివో అవుతావని ఆశపడ్డారు. వాళ్ల కలలన్నింటినీ కాలరాశావు. పోయిపోయి.. సభ్యులంతా పేదరికంలో కొట్టుమిట్టాడుతూ, ప్రతిరోజూ చావులను చవిచూసే
ఉద్యమంలో చేరిపోయావు. నిన్ను ఎలాగైనా కాపాడాలని అమ్మ అనుక్షణం తపించిపోయేది. మేం ఆమె చెప్పింది చేశాం, అంతే’’ అన్నారు.
పుట్టింటి వాళ్లతో ఎంతో సన్నిహితంగా వుండే స్నేహితులను చూసినప్పుడు నాకు ఏదో కోల్పోయినట్టుగా, వెలితిగా అనిపిస్తుంటుంది. నాలోని ఈ శూన్యం ఎన్నటికీ పోదు. సిరిల్‌ కుటుంబమే సదా నా కుటుంబంలా అనిపిస్తుంది, వాళ్లూ నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. అయినా విలువైనది ఏదో నా జీవితం నుంచి శాశ్వతంగా జారిపోయిందన్న భావన మనసులో గూడుకట్టుకుంది. ఎందుకోగానీ, ఎంత వయసొచ్చినప్పటికీ బాల్యం మనల్ని వీడదు. ఇప్పటికీ ‘నేను’ అంటే నాకు పదమూడేళ్ల పిల్లగా వున్నప్పటి, ఇరవై ఏళ్ల యుక్తవయస్కురాలిగా వున్నప్పటి రోజులే గుర్తుకొస్తాయి, నాటి అనుభూతులే ఇప్పటికీ నాలో గాఢంగా వుండిపోయాయి. వాటిని తల్చుకున్నప్పుడల్లా కళ్లు చెమ్మగిల్లుతుంటాయి. నేనిప్పటికీ ఆ చిన్నవయసు పిల్లగానే వుండిపోయినట్టు, ఆ బంధాల్నీ, ఆ ప్రపంచాన్నీ.. మళ్లీ ఎన్నడూ పొందలేనంతగా.. ఎక్కడో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది. కుటుంబాలు నిన్ను నిన్నుగా ఆమోదించాలి. కొన్ని కుటుంబాలైతే తమ కొడుకులు హంతకులైనా, రేపిస్టులైనా సరే అక్కున చేర్చుకుని ఆదరిస్తాయి. కానీ నావాళ్లు నన్ను పరాయిగా చూస్తున్నారు. ఇదంతా ఆడపిల్లలుగా మనం తలవంచుకుని, నలుగురు నడిచే దారిలో నడవనందుకేనా? అందుకు మనమీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?
మేం ఘాజియాబాద్‌లో వున్నప్పుడు ఇంగువ మల్లికార్జున శర్మ నడిపే ‘విప్లవ సందేశం’ అనే పత్రికకు మద్దతివ్వడం మొదలుపెట్టాం. శర్మ కూడా పీపుల్స్‌ వార్‌ గ్రూపు నుంచి బయటికి వచ్చి మాలాగే ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతుండే వాడు. అప్పట్లో సిరిల్‌ నెల జీతం ఆరు వందలు. అందులో నుంచి ప్రతి నెలా మేం ఆ పత్రికకు మూడు వందల రూపాయలు పంపించే వాళ్లం, ఆ పత్రికకు వ్యాసాలూ రాసేవాళ్లం. నాకు ఎప్పుడన్నా కాస్త ఖాళీ సమయం దొరికితే ఘజియాబాద్‌ పట్టణంలో అటూఇటూ తిరిగేదాన్ని. మార్కెట్లకు వెళ్లేదాన్ని. టీ కొట్ల దగ్గర కూచుని అక్కడికి వచ్చిపోయే జనాల మాటల్నీ, వాళ్ల యాసనీ శ్రద్ధగా వింటుండేదాన్ని. నేనక్కడ దాదాపు పూర్తిగా స్థానిక వంటకాలకు మారిపోయాను. స్థానిక సంస్కృతిని వంటబట్టించుకునేందుకు గట్టి కృషి చేశాను. ఇరుగుపొరుగు వాళ్లలాగే బొగ్గుల పొయ్యి మీద వండటం అలవాటు చేసుకున్నాను, వాళ్ల నుంచి స్థానిక వంటలు నేర్చుకున్నాను. ఘాజియాబాద్‌ రైల్వే స్టేషన్‌ పక్కనే ఉన్న రైల్వే కాలనీలో మేం ఉన్నది చిన్న క్వార్టర్‌. కావటానికి ఒక్క గదే గానీ.. వున్నంతలో శుభ్రంగా వుండేది. ఆ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. సాయంత్రం అయ్యిందంటే చాలు, అన్ని ఇళ్లల్లో బొగ్గుల పొయ్యిల మీద రొట్టెలు చేస్తుండేవారు. కాలుతున్న గోధుమ రొట్టెల వాసనతో ఆ ప్రాంతమంతా ఘుమఘుమలాడి పోతుండేది. చుట్టుపక్కల వాళ్లంతా నాతో ఎంతో స్నేహంగా వుండే వాళ్లు. అయినప్పటికీ నా మనసంతా హైదరాబాద్‌ చుట్టే తిరుగుతుండేది. నా రాజకీయాలకూ, నా భావోద్వేగాలకూ పుట్టినిల్లు అయిన హైదరాబాద్‌కి ఎప్పుడెప్పుడు తిరిగివెళ్తామా అని పరితపిస్తుండేది. లోలోపల ఎంతో బాధగా వుండేది. నేను ఏదో చేయాలని ఆశించి, ప్రయత్నించి విఫలమయ్యాను. నా కుటుంబాన్ని వదిలేశాను. పార్టీయే నా కుటుంబమని భావించాను. కానీ నాకు ఇప్పుడా రెండూ లేవు, పైగా పరిచయస్తులెవ్వరూ లేనిచోట పొద్దుపుచ్చటంలా వుందీ జీవితం.
నేను అంతగా పరిచయం లేని పరాయి సంస్కృతిలో వుంటున్నాను. జరిగింది ఏదైనాగానీ నా జీవితానికి ఓ అర్థమే లేదనిపించేది. ఘాజియాబాద్‌ పని కంటే ముందు నేను బ్యాంక్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. పరీక్ష రాసి సెలక్ట్‌ కూడా అయ్యాను. తీరా బ్యాంక్‌లో చేరే సమయానికి ఎందుకో నాకా ఉద్యోగం చేయాలనిపించలేదు. దగ్గర్లో ఉన్న మీరట్‌ యూనివర్సిటీలో పీజీ అయినా చేద్దామని దరఖాస్తు చేశాను. కానీ ఆ పరీక్షకూ హాజరుకాలేదు. చివరికి నా ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెనక్కి తెచ్చుకోడానికి కూడా వెళ్లలేదు. తెచ్చుకుని వాటితో ఏం చేసుకోవాలి అనిపించింది. పీజీ పూర్తి చేసి, మామూలు సంప్రదాయ ఉద్యోగాలు చెయ్యాలని నాకు లేదు.
నేను తీవ్రమైన మానసిక నిర్వేదంలోకి జారిపోయిన సమయం అది. ప్రతీదీ నిరుత్సాహంగా, రోజంతా స్తబ్దుగా అనిపించేది. సిరిల్‌ ఉదయమే ఆఫీసుకు వెళ్లిపోయేవాడు. నేను మధ్యాహ్నం లేచి నెమ్మదిగా బాల్మీకీ బస్తీకి వెళ్లొచ్చేదాన్ని. శక్తీ, ఆసక్తీ రెండూ వుండేవి కావు. పుస్తకాలు చదవబుద్ధి అయ్యేది కాదు. ఇరుగుపొరుగుతో మాట్లాడాలన్నా కూడా ఉత్సాహంగా అనిపించేది కాదు. ఆ సమయంలో నేను పూర్తిగా కుప్పకూలిపోకుండా ఆ బాల్మీకీలే కాపాడారని చెప్పుకోవచ్చు. ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తూ, రకరకాల విషయాలు అడుగుతూ, రోజంతా నా నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ.. వాళ్లే నన్ను నిలబెట్టారు.
ఆ రోజుల్లో ఒకటి రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లో ఉన్న రైలు పట్టాల వరకూ వెళ్లాను కూడా. ‘ఆత్మహత్య చేసుకుంటావా.. అయితే చేసుకో’ అన్న సిరిల్‌ మాటలే నన్ను వెనక్కి లాగాయి. ఆ మాటలు వింటూనే ఉక్రోషం పొంగుకొచ్చేది. నన్ను అడ్డుకోడానికి ప్రయత్నించనందుకు తన మీద విపరీతమైన కోపం వచ్చేది. కనీసం సానుభూతిగా ఒక్కమాటైనా అనొచ్చుగా అని ఉడికిపోతూ వెంటనే తిరిగి వచ్చేసేదాన్ని. ‘నచ్చినా, నచ్చకున్నా.. ఇదీ జీవితం. ఎదుర్కో’.. అన్నట్టుండేవి తన మాటలు. మేమిద్దరం విభిన్నంగా తయారైన వ్యక్తులం. తను అత్యంత క్లిష్ట సమయాలను కూడా తేలిగ్గా తీసుకునేవాడు. పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయేవాడు. నేనేమో రోజుల తరబడి ఆవేదన పడుతూ అందులోనే కూరుకుపోతుండేదాన్ని. ఇది డిప్రెషన్‌కు తొలి లక్షణమని తెలియటానికి నాకు ఆ తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది. వైద్యపరంగా దానికోపేరుందన్న సంగతి కూడా నాకు అప్పటికి తెలీదు. తెలిసిందల్లా మనసులో నేనెంతో విచారాన్ని అనుభవిస్తూ.. పుట్టెడు విషాదపు బరువును మోస్తున్నాననే. ప్రతిదీ చికాకుగా, జీవితమే నిరర్థకంగా అనిపించేది. పార్టీని వదిలిపెట్టిన తర్వాత చాలామంది మహిళలు సరిగ్గా ఇలాంటి మానసిక సంక్షోభాన్నే ఎదుర్కొన్నారని అప్పుడే తెలిసింది నాకు. మహిళలకే ఎందుకిలా? సాధారణంగా వాళ్లు ఉద్యమంలో చేరడానికీ, అందులో కొనసాగడానికీ పురుషులకంటే జీవితంలో ఎన్నో రెట్లు ఎక్కువ త్యాగాలు చేయాల్సి వుంటుంది కాబట్టి వాళ్ల విషయంలో ఇలా జరుగుతుండొచ్చు. పార్టీలో చేరిన తర్వాత నేను దాదాపు నా పాత స్నేహితులు అందర్నీ పోగొట్టుకున్నాను, ఎంఎల్‌ ఉద్యమం అంటేనే వాళ్లు బెదిరిపోయేవాళ్లు. ఇంత చేసి మేం సాధించిందేమిటి? నేనూ, నాతో పాటు పని చేస్తున్న చాలామంది స్నేహితులం మేం విప్లవానికి దరిదాపుల్లో కూడా లేమని గ్రహించాం. సంస్థాపరంగా ఎంఎల్‌ ఎంతో సంకుచితంగా, నిరంకుశంగా ఉందని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. వాస్తవానికి పార్టీ ఉనికిలోకి వచ్చింది అసమానతల వ్యవస్థను నిర్మూలించడం కోసం. కానీ ఏ లక్ష్యం కోసం అది ఉనికిలోకి వచ్చిందో… పార్టీ నాయకత్వానికి దానికంటే కూడా తమ గ్రూపును మనుగడలో ఉంచుకోవటమే ముఖ్యంగా మారిపోవటం చూసిన తర్వాత` మేం కలగన్న ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది.
మెల్లగా మళ్లీ మేం మా పాత ప్రపంచంలోకి, పాత సమాజంలోకి జారిపోవాల్సి వచ్చింది. ఈ విషయంలో పురుషులు చాలా అదృష్టవంతులు, వాళ్లు చాలా తేలికగా మారిపోగలిగారు. వాళ్లలో చాలామంది ఎక్కడైతే వదిలిపెట్టారో మళ్లీ అక్కడ్నించే ఆరంభించారు కూడా. కొందరు మళ్లీ చదువులు మొదలుపెట్టారు, ఉద్యోగాల వేటలో పడ్డారు, మరికొందరు మద్యంతో సహా రకరకాల సొంత వ్యాపారాలు ప్రారంభించారు, చివరికి కొందరు సాధారణ రాజకీయాల్లో కూడా చేరిపోయారు. మొత్తానికి ఈ మార్పు, ఈ పరిణామం వాళ్లలో చాలా తేలికగా జరిగిపోయింది. మహిళల్లో ఇలా ప్రధాన స్రవంతిలోకి మారిన వాళ్లు లేరని కాదుగానీ వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువమంది మహిళలు తమ జీవితాల్లో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చిన ఆ రాజకీయాల్లోనే ఇరుక్కుపోయారు. తిరిగి మేం మళ్లీ పాత కుటుంబ సంప్రదాయ పద్ధతుల్లోకి వెళ్లలేం కాబట్టి ఈ రాజకీయాల్లోనే ఉంటూ, వాటిని కాపాడుకోవాలని చూస్తున్నామా? లేక మార్పు కోసం ఉద్దేశించిన ఈ రాజకీయాలను మేం లోతుగా ఒంటబట్టించుకుని, పురుషులు వదిలిపెట్టినంత సులభంగా (కనీసం, వాళ్లు పైకి అలా కనిపించారు) మేం వదిలిపెట్టలేకపోతున్నామా? పాత సంప్రదాయ పద్ధతులలో జీవించటం వ్యర్థమనిపిస్తోంది. మా కొత్త ఉనికికి ఒక అర్థాన్ని వెతుక్కోవాల్సి ఉంది. కానీ అదంత తేలికేం కాదు, పార్టీని వదిలిపెట్టేశాం కాబట్టి కొత్త జీవన విధానాన్ని, కొత్త జీవనోపాధిని, కొత్త స్నేహాలని, కొత్త కుటుంబ సంబంధాలని వెతుక్కోవాల్సి వచ్చింది.
షీలా రెడ్డి అని, నా హైదరాబాద్‌ స్నేహితురాలు దిల్లీలో అప్పుడు రిపోర్టరుగా పని చేస్తుండేది. ఈ సమయంలో తను చాలా సహాయం చేసింది. నేను తరచూ దిల్లీలో తనతోనే ఉండేదాన్ని, తనతో తిరుగుతూ నా ఆందోళనలన్నింటినీ ఆమెతో పంచుకునేదాన్ని. ఆమె లేకపోతే నేనీ రోజు ఇలా వుండే దాన్ని కాదు. దిల్లీలో ఆ సమయంలో నన్ను ఆదుకున్న మరో వ్యక్తి డా.సరోజినీ రెడ్డి. వయసులో నాకంటే చాలా పెద్దవారైనా ఆమెతో నాకు మంచి స్నేహం ఏర్పడిరది. ఆమె హైదరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పని చేసేవారు. ఆమె భర్త కె.వి.రఘునాథ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యులు కావటంతో వాళ్లు అప్పుడు దిల్లీలో షాజహాన్‌ రోడ్డులోని క్వార్టర్స్‌లో వుండేవారు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ తరఫున చందా కోసం డా. సరోజినీ రెడ్డిని తరచూ కలుస్తుండేదాన్ని. ప్రతి నెలా ఆమె నాకు రూ.25 విరాళం ఇచ్చేవారు. వాళ్లబ్బాయి శ్రీనాథ్‌ మాకు మంచి మిత్రుడు. హైదరాబాద్‌లో ఆమెను కలవాలంటే నాకు చాలా బెరుకుగా ఉండేది. ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రసూతి వైద్యురాలు, మనిషి చాలా అందంగా, దయార్ద్రంగా ఉండేది, నీలోఫర్‌ ఆసుపత్రికి సూపరింటెండ్‌ కూడా. కానీ దిల్లీకి వచ్చేసరికి ఆమె ఒంటరి గృహిణి అయ్యింది. ఆమెతో మాట్లాడటం, కలసి ఆంధ్రా భోజనం చేయడం` నాకు హైదరాబాద్‌ వెళ్లొచ్చినంత ఆనందాన్నిచ్చేది. హైదరాబాద్‌తో పోలిస్తే ఆమె దిల్లీలో కొంత తీరికగా వుండేవారు. ఆమె భర్త రఘునాథరెడ్డి పనుల మీద ఎక్కువగా బయటే వుండేవారు. ఇంక నేనూ, ఆమె ఎన్నో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లం. నా జీవితం కొంతమేరకు తిరిగి గాడిలో పడిరదంటే అందుకు ఆమె చేసిన సహాయం ఎంత కీలకమైనదో ఆమెకు తెలియదు. 2015 ఆగస్ట్‌లో ఆమె చనిపోయినప్పుడు గానీ మన జీవితానికి మహోపకారం చేసిన వాళ్లకి వారు బతికి వున్నప్పుడే కృతజ్ఞతలు తెలియజేయకపోవడం ఎంత పెద్ద పొరపాటో నాకు తెలిసి రాలేదు.
ఎప్పుడు హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోదామా అని నా మనసు తహతహలాడుతుండేది. సరిగ్గా ఇదే సమయంలో రకరరకాల వ్యాధులు నన్ను చుట్టుముట్టాయి. శ్వాసకోశాలకు సంబంధించిన దీర్ఘకాలిక రుగ్మత ‘క్రానిక్‌ బ్రాంకైటిస్‌’, వదలకుండా వేధించే మూత్రనాళ సమస్య ‘క్రానిక్‌ యూరినరీ ఇన్‌ఫెక్షన్‌’, మలేరియా` ఇవన్నీ నన్ను కుంగదీశాయి. ఆరోగ్య సంబంధ వ్యవహారాలతో నా జీవితకాల సాంగత్యం ఇక్కడి నుంచే మొదలైంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ బాగా ముదిరిపోయి కిడ్నీల వరకూ వెళ్లిందని, ఆపరేషన్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ సోకిన కిడ్నీలో కొంత భాగాన్ని తీసెయ్యాలని డాక్టర్లు చెప్పారు. అప్పుడు రాజేష్‌ టండన్‌, ఆయన భార్య కల్పనా మెహతా నాకు డేవిడ్‌ వెర్నర్‌ రాసిన ‘వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌: ఎ విలేజ్‌ హెల్త్‌ కేర్‌ హ్యాండ్‌బుక్‌’ (వైద్యుడు లేని చోట) అనే పుస్తకాన్ని నాకిచ్చారు. వాళ్లిద్దరూ నాకు మంచి మిత్రులు. రాజేష్‌ టండన్‌ 1992లో ‘పార్టిసిపేటరీ రీసెర్చ్‌ ఇన్‌ ఆసియా’ అనే పౌర అధ్యయన బృందాన్ని స్థాపించారు. అలాగే కల్పనా మెహతా ‘సహేలీ’ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు. వాళ్లిద్దరూ ఇచ్చిన ఆ పుస్తకం నాకెంత సాంత్వన ఇచ్చిందో మాటల్లో చెప్పలేను. డేవిడ్‌ వెర్నర్‌ ఆ పుస్తకంలో యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ అనేది మూత్ర కోశంలో వైరస్‌ కణాలు ఎక్కువగా చేరిపోవటం వల్ల తలెత్తుతుందనీ, నీళ్లు ఎక్కువగా తాగుతూ ఆ పేరుకుపోయిన వైరస్‌ బయటకు కొట్టుకుపోయేలా చెయ్యటం ఉత్తమమని సలహా ఇచ్చాడు. ఇక అంతే! నేను ఒక నెల రోజుల పాటు ఇతరత్రా పనులన్నీ పక్కనబెట్టేసి.. జగ్గుల కొద్దీ మంచినీళ్లు తాగడం, బకెట్ల కొద్దీ మూత్ర విసర్జన చేయడం మొదలుపెట్టాను. మళ్లీ మూత్ర పరీక్షలు చేస్తే నెలరోజుల్లోపే.. అన్నీ సాధారణంగా వున్నట్టు తేలింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ సమస్య తలెత్తలేదు. దీంతో మన శరీరం గురించి మనం సమగ్రంగా తెలుసుకోవటం, వ్యాధులు నయమయ్యేందుకు మనం శరీరంతో కలిసి పని చేయటం ఎంత అవసరమో అర్థం చేసుకోవటం ఆరంభించాను.
ఎమర్జెన్సీ తర్వాత అనేక సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్లినా భయం నన్ను వెంటాడుతుండేది. స్నేహితులతో కలసి కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి, కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి కూడా జంకేదాన్ని. ప్రతిదాన్నీ అనుమానించేదాన్ని. అనుకోనిది ఏం జరిగినా దాని వెనక పోలీసులున్నారేమోనని అనుమానించేదాన్ని. అత్యవసర పరిస్థితి ప్రభావాలు మాలో చాలామందిపై చాలాకాలం అలాగే
ఉండిపోయాయి. అదేదో పోలీసులంటే భయమో, లేక కొత్త వాళ్లతో స్నేహం చేయటానికి మొహమాటపడటమో మాత్రమే కాదు. అయినవాళ్లను, సన్నిహితులను ఎలా చూస్తున్నామన్నదీ సంక్లిష్టంగానే మారిపోయింది. అజ్ఞాతంలో వున్నప్పుడు సిరిల్‌ పేరు విజయ్‌. నేను ఆ తర్వాత కూడా సిరిల్‌ని కొన్ని సంవత్సరాల పాటు విజయ్‌ అనే పిలిచేదాన్ని. అలాగే అప్పటి నా మారుపేర్లు జ్యోతి లేదా నళిని. కొన్ని దశాబ్దాల పాటు చాలామంది నన్ను ఆ పేర్లతోనే పిలిచేవారు. మా పేర్లు మారిపోయాయి, మా గుర్తింపులు మారిపోయాయి, మా సంబంధాలు మారిపోయాయి, ప్రతీదీ మారిపోయింది.
అయినప్పటికీ కొద్ది సంవత్సరాలపాటు ఎంఎల్‌ ఉద్యమంలో కొనసాగినందుకు నేనెప్పుడూ పశ్చాత్తాపపడ లేదు, పడను కూడా! ఆదర్శవాదంలో ఉన్న అంతస్సంక్షోభం, వ్యక్తిగతంగా మేం అనుభవించిన కష్టాలూ.. మా విలువలను పరీక్షకు పెట్టాయి, మా వెన్నెముకను మరింత దృఢతరం చేశాయి. నాటి రాడికల్‌ ఉద్యమం, ఎమర్జెన్సీ` ఆ తర్వాత ప్రజల తరఫున ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం జరిగిన పోరాటాలకు తావిచ్చి` మా జీవితాల్లో గొప్ప మలుపుగా నిలిచాయి!

పత్రులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ఫోన్‌ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.