చేతి రాత పొందిగ్గా, కుదురుగా, అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలంటే ఇంకు పెన్ను వాడాలని స్కూల్లో టీచర్లు చెప్తారు. దానితో జాగ్రత్తగా, ఓపిగ్గా రాయాలి. పెన్నుని మరీ అదిమిపెట్టి రాస్తే పేపరు చిరుగుతుంది. పెన్నుతో పాటు ఇంకు సీసా పక్కన పెట్టుకోవటం తప్పనిసరి.
ఇంకు పొయ్యకపోతే పెన్ను ఆగిపోతుంది. నా రచన ఇంకు పెన్ను లాంటిది. పరిశోధన, వినటం, చదవటం, విషయాల గురించి ఆలోచించటం కలిపిన ఇంకు పొయ్యకపోతే అది ముందుకెళ్లదు. అవి అచ్చంగా నా మెదడులో నుండి, మనసులో నుండి రావు కూడా. వేరే వాళ్ళు ఇప్పటికే చేసిన మేధో శ్రమని నా రచనకి ఇంకు రూపంలో తీసుకుంటాను. పరిశోధకురాలిగా పొందిన ట్రైనింగ్ తో నావంటూ కొన్ని ఇంకు ఫిల్లర్లు తయారు చేసుకున్నాను. అలా నేను గ్రహించిన విషయాలని స్పష్టంగా, ఇతరులకి అర్ధమయ్యేలా రాయటానికి ఇష్ట పడతాను. నీలం, నలుపంటే ఇష్టమయినా రంగు రంగుల ఇంకు, పాఠకులెవరయినా పంపించినా సరే, ఉపయోగించటానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.
బెంగళూరులో సాఫ్ట్ వెర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే ముందు తనని తన భార్య ‘అబద్ధపు’ కేసుల్లో ఇరికించి వేధించిందని చేసిన వీడియో అనేక మందిని కదిలించింది. ఆయా కేసులు స్త్రీలకి కుటుంబ హింస నుండి రక్షణ కల్పించే చట్టాల క్రింద వేధింపుల నుండి రక్షణ కల్పించమని అతడి భార్య, వేసినవి. లక్షల కట్నం ఇచ్చిన తర్వాత ఇంకా డబ్బు కోసం వేధిస్తున్నాడని, తనతో పశువులా ప్రవర్తిస్తున్నాడని, అతడి కుటుంబం పెట్టిన బాధల వల్ల తన తండ్రి చనిపోయాడని 498ఏ చట్టం కింద వేసిన కేసులు. ఇవి అబద్ధపు కేసులని, తన తప్పేమీ లేకున్నా, కట్నం అడగకున్నా, పిల్లలని దూరం పెట్టి కేవలం డబ్బు కోసం తనని, తన కుటుంబాన్ని పెడుతున్న వేధింపులని భరించలేక పోతున్నానంటూ మగవాళ్ల హక్కుల సంఘంలో సభ్యుడైన 36 ఏళ్ల సుభాష్ తన ప్రాణం తీసుకున్నాడు. ఇలా భార్యలు తమ పైన అబద్ధపు కేసులు వేశారంటూ ఇతర మగవాళ్ళు, వారి కుటుంబ సభ్యులు కూడా పెట్టిన వీడియోలు ఇంటర్నెట్లో చాలా ప్రచారంలోకి వచ్చాయి. అనేక మంది ఆడవాళ్లు, మగవాళ్ళు కూడా పెళ్లయిన ఆడవాళ్ళకి అత్తవారింట్లో జరిగే హింస, వేధింపులు, కట్నం గురించిన డిమాండ్ల నుండి రక్షణ కల్పించే చట్టాలన్నీ ‘మగవాళ్ళకి’ వ్యతిరేకమనే నిర్ధారణకు వచ్చారు. కొంతమంది ఈ చట్టాలన్నీ ‘ఎవరు ఎవరిని హింసించినా అందరికీ’ వర్తించేవిగా చెయ్యాలని సూచిస్తే, మరి కొంతమంది వీటిని పూర్తిగా ఎత్తేయాలని కూడా పిలుపునిచ్చారు. కొందరు ఇంకా ముందు కెళ్ళి స్త్రీ-పురుష సమానత్వం వచ్చేసిందని, ‘మగస్వామ్యం అంతమయి పోయిందని ప్రకటించి, ‘అప్పటి’ మగవాళ్లు చేసిన పాపాలకి ‘ఇప్పటి’ మగవాళ్ళని బలి చెయ్యొద్దని గంభీరమయిన కామెంట్లు చేశారు. https://www.thenewsminute.com/news/news-channels-turn-atul-subhash-suicide-into-men-vs-women-battleground
అన్ని కుటుంబాల్లో అన్ని జెండర్ల వాళ్ళు కలిసి వుంటారని, భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాల గురించిన ఈ చట్టాలు అందరినీ ప్రభావితం చేస్తాయనే సామాన్య సత్యం పక్కన పెడితే, ఆడవాళ్లు ఎదుర్కునే హింస గురించి ఏ కొంచెం పని చేసిన వాళ్ళకయినా ఈ నిర్ధారణలు, ప్రకటనలు, కామెంట్లు చాలా ఆశ్చర్యం కలుగచేస్తాయి. వ్యవస్తీకృతంగా కుటుంబాల్లో తమకి లభించే అధికారాన్ని భర్తలు దుర్వినియోగం చెయ్యకుండా నియంత్రించటానికి తెచ్చిన చట్టాలివి, భర్తల అధికారాన్ని నిర్మూలించవు, కొంచెం బాధ్యతతో అధికారాన్ని చెలాయించామని చెప్తాయి, అంతే. ఈ చట్టాల క్రింద నమోదు అయ్యే కేసుల్లో ఎవరికీ అన్యాయం జరుగుతోందనే విషయం లోని సత్యాసత్యాల గురించి తెలుసుకోవాలంటే ముందు కుటుంబ హింస గురించి మౌలిక సమాచారం చూద్దాం. ప్రతి సంవత్సరం జరిగే నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2022 లో 30 % మంది ఆడవాళ్లు తాము పెళ్లి అయిన తర్వాత భౌతిక, మానసిక, లైంగిక హింసకి గురవుతున్నామని చెప్పారు. వారిలో కేవలం 6 % మందే తాము పోలీసు స్టేషన్ కి వెళ్లామని చెప్పారు. అలా పోలీసుల దగ్గరికి వచ్చే కేసుల వివరాలు చూసినా, కుటుంబాల్లో ఆడవాళ్లపై హింస గురించి నమోదయిన కేసులు ఏడాదికేడాది పెరుగుతూనే వున్నాయి.
https://www.isdm.org.in/blog/its-womens-day-but-on-ground-little-has-changed#:~:text=The%20latest%20data %20from% 20the% 20National%20Crime, 2022%2C%20in%20comparison%20with%2058.8%20in% 202018.
పెళ్లి వయసులో వున్న (15-40) ఆడవాళ్ళ అసహజ మరణాలు బయటి కంటే ఇళ్లల్లో మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయని మన దేశంలో ఏ గణాంకాలని చూసినా తెలుస్తుంది. అవి ఆస్పత్రుల్లో బర్న్స్ వార్డులకి వచ్చే వాళ్ళు కాలిన మనుషులు కావొచ్చు, అనుమానాస్పద మరణాలు కావచ్చు, ఆత్మ హత్యలు కావచ్చు, బలవన్మరణాలు కావచ్చు. మగవాళ్ల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువున్నా వ్యవసాయ సమస్య నుండి ప్రేమ వైఫల్యం, నిరుద్యోగం వరకూ వాటికి కారణాలు అనేకం. (https://www.jstor.org/stable/pdf/26495895.pdf). ఆడవాళ్ళ అసహజ మరణాలు కుటుంబాల్లోనే ఎక్కువ జరుగుతాయి. ఇల్లే ఆడవాళ్ళకి అత్యంత ప్రమాదకరమయిన చోటు.
దీన్నుండి తప్పించుకోవటానికి పోలీసు స్టేషన్లకి వెళ్లే ఆడవాళ్ళ పరిస్థితి చూద్దాం. 1961లో కట్నం తీసుకోవటాన్ని నేరం చేస్తూ చట్ట సవరణ వచ్చింది. దాని తర్వాత 1984లో 498 చట్టంలో సవరణలు తెచ్చి అత్తవారింట్లో కోడళ్ళ పట్ల చూపించే మానసిక, శారీరక క్రూరత్వాన్ని నేరంగా చేశారు. అత్తవారింట్లో ఆరళ్ళు భరించి మాత్రమే కొత్త పెళ్లి కూతుర్లు కోడళ్ళుగా పరివర్తనం చెందుతారని, అదొక జరగాల్సిన ప్రక్రియ అని సమాజం, అది రూపొందించే పోలీసులు బలంగా నమ్మటంతో ఈ చట్ట సవరణని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా పోలీసు స్టేషన్కి వెళ్లే ఆడవాళ్ళని నాలుగ్గోడల మధ్య జరిగే హింసకి రుజువులు తెమ్మని, ఇది మామూలే కదా అని, ఈ మాత్రం తట్టుకోకపోతే సంసారం ఎలా చేస్తావని, నువ్వేదో చెయ్యకపోతే ఎందుకు కొడతాడు అనీ పోలీసులు కూడా తమదయిన రీతిలో వేధిస్తారు. రక్తం కారుకుంటూ వెళ్లిన ఆడవాళ్ళ ఫిర్యాదు తీసుకోవటానికి కూడా పోలీసులు సిద్ధపడకపోవటం నేను ప్రత్యక్షంగా చూసాను. ఈ మధ్యే ఒక స్నేహితురాలి చెల్లెలు నగరంలో మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చెయ్యటానికి వెళ్లిన తన చెల్లెల్ని ఎన్నో రకాల ఆధారాలు తెమ్మని ఎలా వేధిస్తున్నారో చెప్పింది.
స్త్రీల సంఘాల వాళ్ళు ఈ చట్టం గురించి కాలికి బలపం కట్టుకుని తిరిగి పోలీసు వారికి ఈ చట్టం గురించి చైతన్యం పెంచారు. కట్నం కోసం ఆడవాళ్ళని చంపటాన్ని 1986లో ప్రత్యేక నేరంగా పరిగణిస్తూ చట్ట మార్పు తెచ్చిన తర్వాత, దీనికి కొంత ప్రాధాన్యం పెరిగింది. పోలీసులు, లాయర్లు అన్ని రకాల కుటుంబ వేధింపులు, హింసలని కట్నంకి సంబంధించిన హింసగా చూడటం మొదలుపెట్టారు. అసలు కుటుంబ హింస ఫిర్యాదుని సీరియస్గా తీసుకోవాలంటే ‘కట్నం డిమాండు’ ను తమ ఫిర్యాదుల్లో తప్పనిసరిగా చేర్చాలని బలంగా చెప్పటం 20 ఏళ్ల క్రితమే ఆచరణలోకి వచ్చింది.
అయితే 498 ఏ కేసు వల్ల భర్తలని కొన్ని రోజులు జైల్లో పెట్టటం, పేదవాళ్ళయితే కొట్టటం తప్ప ఆయా భార్యలకు కావాల్సిన ఉపశమనాలు ఏవీ లభించవు. సాధారణంగా వేధింపులు తీవ్రంగా వున్నప్పుడే అవి ఆపటానికి ఆడవాళ్లు పోలీసు స్టేషన్కి వెళ్తారు. ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్లగొట్టబడి, జీవనోపాధి వెతుక్కుంటూ, పిల్లలని చూసుకుంటూ, తల్లి తండ్రులో, అన్నాతమ్ముళ్ల పంచన పడి కేసు గురించి పోలీసు స్టేషన్కి తిరిగటం చాలా మందికి అసాధ్యం. భర్తలని జైల్లో పెట్టటం వల్ల కంటే ఆడవాళ్ళకి ఇంట్లో వుండే హక్కు, పిల్లలని పోషించుకోవటానికి డబ్బు, మొగుడు ఇంటికి రాకుండా రక్షణ ఇవన్నీ అవసరం. దాని కోసం వివిధ రకాల స్త్రీల సంఘాలు పని చేసి, ఐక్య రాజ్య సమితి తయారు చేసిన కుటుంబ హింస చట్ట నమూనాని మనం కూడా అమలు చెయ్యాలని డిమాండు చెయ్యటంతో 2006లో ఒక సమగ్ర కుటుంబ హింస చట్టం తెచ్చారు. దానిలో నేర స్మ్రితి కింద కాకుండా పౌర స్మ్రుతి కింద పొందగలిగే ఉపశమనాలని కూడా చేర్చారు. భార్యలకు అత్తవారింటి నుండి తరిమేయ్యకుండా వుండే హక్కు, ఇల్లు గడపటం కోసం ఆర్ధిక జరుగుబాటు భర్తలు కల్పించాలనే వెసులుబాటు వున్నాయి (దీని కోసం ఇందిరా జైసింగ్ రచనలు చూడండి).
అయితే, ఇవన్నీ సాధించుకోవటానికి వివిధ కోర్టులలో వివిధ కేసులు వెయ్యాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కోర్టులు అందుబాటులో వుండవు. కోర్టుకెళ్తే రోజు కూలీ పోతుంది. కోర్టులు ఆర్దర్లు ఇచ్చినా వాటిని అమలు చేసే సమర్ధవంతమైన యంత్రాంగం కొంత మేరకు నగరాల్లో తప్ప వేరే చోట అందుబాటులో లేదు. పైగా, గత ఇరవయి ఏళ్ళల్లో 498ఏ కింద కేసులు వెయ్యటాన్ని మరింత కష్టతరం చేశారు. 498ఏ దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారం 1990ల నుండే జరగటంతో అనేక చోట్ల పై ఆఫీసర్ల ఆమోదం లేకుండా కేసుని నమోదు చెయ్యకుండా మార్పులు తెచ్చారు .
అయితే 40 ఏళ్ళల్లో జరిగిన ఇతర మార్పులు చాలా జరిగాయి. ఆర్థికంలో వచ్చిన ఇతర మార్పుల వల్ల, కుటుంబం పైకి ఎదగటానికి, మధ్య తరగతిలో అమ్మాయిలని చదివించటం తప్పని సరైంది. ప్రపంచ మార్కెట్లో భారతీయ ఇంజనీర్లపై పెరిగిన డిమాండు కారణంగా వాళ్ళు ఉద్యోగాలు చెయ్యటం పెరిగింది. అమ్మాయిల పెంపకంలో సడలింపులు అవసరమయ్యాయి. అమ్మాయిల జీవితం కేవలం పెళ్లి కోసమే కాకుండా, పెళ్లి వారి జీవితంలో ఒక భాగమైంది. కానీ ఇంకో పక్క పెళ్లి చేసుకోవటం మాత్రం తప్పట్లేదు (మేరీ జాన్ 2021లో రాసిన ఎర్లీ మ్యారేజ్ ఇన్ యాన్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్ పుస్తకం చూడండి).
ఈ మార్పులకి ‘అత్తవారిళ్లు’ ఒక పట్టాన అలవాటు పడట్లేదు. ఎంత సంపాదించినా సరే, కట్నం లేకుండా పెళ్లిళ్లు అరుదు. చట్ట ప్రకారం నేరమయినా సరే, కట్నం తీసుకోవటం పెరిగిందే కానీ, తగ్గలేదు. పైగా అన్ని కులాల్లో, మతాల్లో అమ్మాయిలు ఆస్తితో వెళ్తే అత్తగారింట్లో మంచిగా చూసుకుంటారనే భావన వ్యాపించింది. విలువలు మారకుండా సమాజం మారితే వచ్చే అవస్థలో వున్నాయి మన కుటుంబాలు. ఒక పక్క చదువున్న అమ్మాయిలు కోడళ్ళుగా రావాలని కోరుకుంటూ ఇంకో పక్క ఇదివరకట్లాగా కోడళ్ళు అణిగి మణిగి ఉండట్లేదని, అత్తవారింట్లో ‘ఇష్టమొచ్చినట్లు’ వుంటున్నారని, తాము కూడా మామగారి పక్కన ‘సిగ్గు లేకుండా’ కూర్చుంటున్నారని తమని తాము ‘మంచి’ వారిగా భావించుకునే కుటుంబాలు అనుకోవటం సాధారణం. మంచి భర్తలంటే పెళ్లాలని కొట్టకుండా వారికి వుద్యోగం చేసే ‘స్వేచ్ఛ’ ప్రసాదించి, ఆ సంపాదనని కుటుంబం పేరుతో తీసేసుకుని వారికి పాకెట్ మని ఇచ్చే ఉదారులు.
మారుతున్న ప్రపంచం, మారని కుటుంబం మధ్య వచ్చే వైరుధ్యం మనకి కుటుంబ కోర్టుల నిండా కనిపిస్తుంది. తమపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో పెరిగిన ఆడవాళ్ళకి హింస అంటే వంటి నిండా దెబ్బలు కాదు, బలవంతపు శృంగారం, పైసా కోసం భర్త దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం, తమ ఆర్ధిక స్వాతంత్య్రాన్ని కోల్పోవటం, ఉద్యోగ స్థలంలో ఎవరితో మాట్లాడద్దు అనటం హింసే. చట్ట ప్రకారం కూడా ఇవి నేరాలే. అయితే ఇవన్నీ 498ఏ ఫిర్యాదు రాసే పోలీసులకి, లాయర్లకు, అవి వినే న్యాయమూర్తులకీ ఎంత మేరకు అర్ధం అవుతాయి? వాళ్ళు అర్ధం చేసుకునే నేరాలు మహా అయితే, తీవ్రంగా కొట్టటం, భయంకరంగా తిట్టటం మాత్రమే. మిగిలినవన్నీ వాళ్ళ దృష్టిలో కాపురంలో ‘మామూలుగా’ జరిగే విషయాలు.
సమానమైన చదువుతో వచ్చిన భార్యతో, సమానత్వ విలువలకి అలవాటు పడని కుటుంబాల్లో భర్తలు కాపురం చేస్తున్నప్పుడు, పెంపకంలో లభించిన ఏ చిన్న విశేషాధికారం పోయినా బాధ కలుగుతుంది. గౌరవం ఇవ్వనట్లు అనిపిస్తుంది. మగతనానికి దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది. భార్య ఏమడిగినా ధిక్కారంగా కనిపిస్తుంది. తనంత మంచి వాడి పైన భార్య తన మీద కేసు పెట్టిందంటే తల కొట్టేసినంత బాధ కలుగుతుంది. మేమేమన్నా పాత కాలం మగవాళ్లలాగా ప్రవర్తిస్తున్నామా, మా భార్యకు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, బయట స్వతంత్రంగా తిరుగుతున్నారు కదా అనిపిస్తుంది. కరోల్ పెట్మోన్ మాటల్లో చెప్పాలంటే భూస్వామ్య పితృస్వామ్యం నుండి ఉదార పితృస్వామ్యానికి ప్రయాణిస్తున్న మగవాళ్ల బాధలివి.
ఆడవాళ్లు పెట్టే కేసు ఫిర్యాదులు, తీరు, ఫిర్యాదులు వారి చేతుల్లో ఉండవు. ఫిర్యాదులు రాసేది పోలీసులు, లాయర్లు. కేసులు చాలా కష్టంతో నమోదవుతాయి. వాటికి నిరూపించటానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించే బాధ్యత పోలీసులది. చాలీ చాలని సాక్ష్యాలతో కోర్టుల్లో కేసుల్ని పోగొట్టేది పోలీసులు. పైగా ఈ లోపల కుటుంబ సభ్యులు ఆయా స్త్రీలని కేసు వెనక్కి తీసుకొమ్మని, కాంప్రమైజ్ కమ్మని వత్తిడి చేస్తారు. భర్త కుటుంబ సభ్యులు కూడా వత్తిడి పెడుతుంటారు. పిల్లల కోసం, వివిధ కారణాల కోసం అనేక మంది రాజీ పడిపోతారు కూడా. అలా రాజీ పడిన, ‘నిరూపించబడని’ కేసులని తీసుకుని ‘చట్టం దుర్వినియోగం’ జరుగుతోందనే వాదన చెయ్యటం చాలా సులువు (498ఏ కేసుల్లో జరిగే పరిణామాల గురించి ప్రశాంత్ త్రివేది, స్మ్రితి సింగ్ 2014లో ఎకనామిక్ మరియు పొలిటికల్ వీక్లీలో రాసిన వ్యాసం చదవండి).
చట్టాలు మనం అనుకున్నట్లు పని చెయ్యవు కాబట్టి అవి దుర్వినియోగం అవుతున్నాయని నిర్ధారణకు రావటం కష్టం. వర కట్నం నిషేధిస్తూ చేసిన చట్టాన్ని మన సమాజం పనికి రాకుండా చేసింది. సమస్యలొచ్చినప్పుడు ఆధారంగా పనికొస్తాయని పెళ్లి సమయంలో వరకట్నం ఇస్తూ తీసుకున్న ఫోటోలు మనలో చాలామందే చూసి ఉంటాం. అంత కోరలు లేని చట్టం అది. ఆడబడుచు కట్నం, లాంఛనాలు, మొదటి కాన్పు ఖర్చులు, అంటూ ఇచ్చినంత మేరకు తీసుకుని అందరూ కలిసి చంపేసిన వర కట్న వ్యతిరేక చట్టాన్ని గురించి పెద్దగా మాట్లాడని మన సమాజం, తమకి నచ్చని మార్పుని తప్పనిసరి చేసినందుకేమో, 498 ఏ చట్టం విషయంలో మాత్రం 1990లలోనే దుర్వినియోగం అనే ప్రచారం ప్రారంభించింది (1995 నుండి దీని గురించి ఫ్లేవియా ఆగ్నెస్ రాస్తున్నారు) ఈ ప్రచారం గత దశబ్దంలో సోషల్ మీడియా పెరుగుదల కల్పించిన వెసులుబాటుతో ఊపందుకుంది. వ్యక్తిగత అనుభవం నుండి సామాజిక సత్యాలని నిర్ధారిస్తూ ఎవరూ ఆధారాలు అడగలేని వీడియోలు దీని మార్గం.
ముందే చెప్పినట్లు చట్టాలు వాస్తవంలో మనం అనుకున్నట్లు పని చెయ్యవు. కేసు విచారణలు వాయిదాలపై వాయిదాలతో సాగుతాయి. లాయర్ల ఖర్చులు భర్తల కుటుంబాలకి కూడా బరువే. కుటుంబ న్యాయస్థానాల్లో ఇటువంటి కేసులెదుర్కుంటున్న భర్తలకు సమాజ పరిస్థితులని, కోర్టు పద్ధతులని, కేసుల పని తీరుని వివరించే కౌన్సిలింగ్ జరగట్లేదు. మగవాళ్ల హక్కుల సంఘాలు ఈ పని ఎందుకు చెయ్యట్లేదు? కోర్టులకి రావటం మగతనంపై, వ్యక్తిత్వంపై సవాలు కాదని భర్తలకు చెప్పటం అవసరం కదా. కట్నాలు తీసుకోకూడదని, ప్రతి అవసరానికి భార్యల తల్లి తండ్రుల నుండి డబ్బులు డిమాండు చెయ్యకూడదని, భార్యలతో సరిగ్గా ప్రవర్తించాలని, ప్రపంచం ఇదివరకులా లేదని, వాళ్ళు కూడా మారాలని మగవాళ్ళకి ఎవరు చెప్పాలి? మగవాళ్ళు మారలేదని ఎవరూ అనట్లేదు. అది వాస్తవ విరుద్ధం కూడా. కుటుంబంలో వచ్చే సమస్యలకి ఆడవాళ్ళ లాగే మగవాళ్ళు కూడా భావోద్వేగాలకు గురవుతారు. వాటిలో తమ పాత్రని ఒప్పుకుని, పరిస్థితులతో రాజీపడి, న్యాయంగా వ్యవహరించే మగ వాళ్ళు చాలా మందే వున్నారు. పరిస్థితులతో రాజీపడలేని వాళ్ళు అంత కంటే ఎక్కువ. బాధాకరం అనిపించినా అతుల్ సుభాష్ వంటి వారు ఈ రెండో కేటగిరిలో భాగం. వారి విషాద మరణానికి బాధ్యత అతడి భార్య, ఆడవాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలది కాదు, మారుతున్న పరిస్థితులకి అతణ్ణి సిద్ధపడేలా చెయ్యని ఈ సమాజానిది!