మహాప్రస్థానం – శ్రీశ్రీ – ఉమా నూతక్కి

తనకు రావలసిన వేజ్‌ రివిజన్‌ బకాయి పడిందని ప్రభుత్వం మీదా..
మేడ మీద మరో రెండు గదులు వేయడానికి ప్లాన్‌ కోసం వెళ్తే వెయ్యి నూట పదహార్లు లంచం అడిగాడని ఒక క్లర్కు మీదా..
పది నిమిషాలు లేటుగా వెళ్ళి, సమయ పాలన లేనితనమనే జాతీయ రుగ్మతతో బాధ పడుతున్న దేశం మీదా ..
అప్పుడప్పుడు అగ్రహించడం తప్ప జీవితంలో వేరే ఏ కంప్లైంట్సూ లేని మనకి ..
రాబందుల రెక్కల చప్పుడూ .. పయోధన ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానాలు .. వినిపిస్తాయా!
కానీ అతడికి వినిపించాయి. విన్నాక మనకి చెప్పించాయి. అదే మహా ప్రస్థానం.
శ్రీశ్రీ రాయడం కోసమే పుట్టినవాడు, రాయడం కోసమే బ్రతికినవాడు. రాయడం కోసమే జరారుజులను జయించినవాడు. అక్షరాలనే ఆస్థిగా నమ్ముకుని, అక్షరాల కోసమే వాటిని అమ్ముకున్నవాడు.. ఆయన వ్రాసిన ”మహాప్రస్థానం” ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయనక్కరలేదు. అయినా మరోసారి పరిచయం చేసే సాహసం చేస్తున్నాం.

ఒక తరపు యువకులను మహోత్తేజంతో ఊపేసిన రచన మహా ప్రస్థానం. ఏ క్షణాన అది సాహిత్య ప్రపంచంలోకి వచ్చిందో తెలియదు గానీ, ఆ తర్వాత ఆ పుస్తకం చేరిన మహోన్నత స్థానం ఎప్పటికీ మారలేదు. ఒక తరంలో చాలా మంది యువకుల చైతన్యంలో అది ఇంకిపోయింది. వాళ్ళ ప్రపంచంలో ఒక్కటైంది. ఒక ఆప్తుడైన నేస్తమయింది. దుఃఖమొచ్చినప్పుడు ఓదార్చింది. దిగులు కలిగినపుడు భరోసానిచ్చింది. ఒక్కటేమిటి సర్వకాల సర్వావస్థలందూ వెన్నంటే ఉంది. మహాప్రస్థానంతో పాటు చలం ముందు మాటగా రాసిన ”యోగ్యతా పత్రం” కూడా.

ఎవరికయినా ప్రపంచం మరింత అర్థమవుతున్న కొద్దీ, జీవితానుభవం పెరుగుతున్నకొద్దీ మహాప్రస్థానం మరింత దగ్గరవుతుంది. ఒక్క ”గర్జించు రష్యా” పద్యం తప్ప మహా ప్రస్థానంలో అన్ని పద్యాలూ ఇప్పటికీ, ఈ కాలానికీ అన్వయించుకోదగ్గవే! ప్రాసంగికమే!! ఆధునికత నుండి మునుముందుకు ప్రయాణిస్తున్న మనం వాటిని ఇప్పటికీ అన్వయించుకోగలం. అందుకే అవి నవనవోన్మేషం. అలాగే చలం ముందు మాటలో అనేక వ్యాక్యాలు – మహాప్రస్థాన పద్యాలతో కలసి మనకు జీవిత సారాన్ని కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాయి.

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న, విభిన్న దిశా నిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ. 1930-1940 మధ్య కాలంలో వ్రాసిన ”మహా ప్రస్థానం”లోని కవితలు ఒక బలీయమైన నిరసనలోంచి వచ్చినవి. ఈ నిరసన ఒక సాంద్రమైన.. ఇది ఒక తాత్విక చింతనననుసరించి వచ్చిన నిరసన కాదు. అంతక్రితం వరకూ వచ్చిన, వస్తున్న కవిత్వం సమాజంలో తాడితుల, పీడితుల వేదనలకు స్పందించకుండా ఉండడంపై వచ్చిన నిరసన. అందుకే మహాశక్తి వంతంగా వెల్లువలా జ్వాలలా వచ్చింది. అందుచేతనే యోగ్యతా పత్రంలో చలం అన్నట్లు ఈ సంకలనం లోని కవితలు కత్తులుగా, ఈటెలుగా, మంటలుగా, బాధలుగా, తిరుగుబాట్లుగా, యుద్ధాలుగా బహిర్గతమయ్యాయి. శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని కలగన్నాడు. మరోప్రపంచం అంటే ఏదో స్వర్గం కాదు. మనం చచ్చిపోయాక చేరుకొనే లోకం కాదు. మనం బ్రతికున్నప్పుడు సాధించుకోవాల్సిన కొత్త ప్రపంచం. పేదరికం, దోపిడి, ఆకలిచావులు, అనాధలు, పతితులు, భ్రష్ఠులు, బాధా సర్పద్రష్టులు లేని, అసమానతలు లేని ప్రపంచం.

”మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది..
పదండి ముందుకు పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి..
… దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు..
బాటలు నడచి పేటలు కడచీ కోటలన్నిటిని దాటండి..
నదీ నదాలూ.. అడువులు కొండలు.. ఎడారులా మనకడ్డంకి?” అంటాడు శ్రీశ్రీ.

ఎడారులా మనకడ్డంకి అనడంతోనే అడ్డంకులేవీ నిజానికి ఒక విప్లవకారుని ఆపలేవని స్ఫురింపజేయడం ధ్వని ప్రాయంగా జరుగుతుంది. ఇంకా అదే కవితలో ”త్రాచుల వలేనూ రేచులవలెనూ ధనుంజయినిలా సాగండి” లాంటి పద చిత్రాలతో ఈ సంకలనానికి ధ్యేయ, దిశా నిర్దేశం చేస్తుంది..

అలాగే జయభేరిలో చక్కని, చిక్కని ఉర్రూతలూగించే కవితా ప్రస్థానం సాగుతుంది.

”నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి
ఆహుతిచ్చాను.
నేను సైతం ప్రపంచాబ్జపు
తెల్లరేకై
పల్లవిస్తాను.
నేను సైతం
భువన భవనపు
బావుటానై
పైకిలేస్తాను” అంటాడు శ్రీశ్రీ.

ఒకానొక సందర్భంలో శ్రీశ్రీ మహాప్రస్థానానికి నామాట వ్రాస్తూ అంటారు. ”ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను ”సామాజిక వాస్తవికత” అంటారనీ, దీనికి వెనుక దన్నుగా ”మార్క్సిజం” అనే దార్శనికత ఒకటి ఉంటుందని అప్పటికి నాకు తెలియదు”. నామాట ముగిస్తూ శ్రీశ్రీ ఇలా అంటారు. ”మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వం విప్లవ బీజాలు ఉన్నాయి. విప్లవ సాహిత్యం లేదు”. అని.. అప్పటికి మార్క్సిజం గురించి శ్రీశ్రీకి తెలియదంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ తెలిసినా .. తెలియకపోయినా తనచుట్టూ ఉన్న సమాజపు స్థితిగతులకు చిత్తశుద్ధితో, ఆర్ద్రమయిన హృదయంతో స్పందించి వ్రాయబట్టే తన భావుకతకు తోడుగా గొప్ప శబ్ద శక్తి, అనుభూతి, నిజతత్వ నిరూపణ, వ్యక్తీకరణ మాధ్యమాలుగా శక్తివంతమైన పదచిత్రాలను వాడబట్టే మహాప్రస్థానం ఎన్నటికీ మరువలేని కవిత్వం అయింది.

మహాప్రస్థానంలో ఎప్పుడు చదివినా కొత్తగా మనల్ని ఆవిష్కరించుకోనే కవిత ”వ్యత్యాసం”.

అదృష్టవంతులు మీరు
వెలుగుని ప్రేమిస్తారు
ఇరులను ద్వేషిస్తారు
మంచికీ చెడ్డకీ నడుమ
కంచుగోడలున్నాయి మీకు
మంచిగదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు
ఇదివరకే ఏర్పడిందా గది..
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం..”
అంటూ..
”అభాగ్యులం మేము,
సరిహద్దులు దొరకని
సంధ్యలలో మా సంచారం
అన్నీ సమస్యలే సందేహాలే మాకు..
వెలుగులోని చీకట్లే,
ఇరులలోని మిణుగురులే చూస్తాం.

వ్యత్యాసాలు, వ్యాఘాతాలే మాకు” అని ఇంకా ఇలా అంటాడు.
”అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి,
తిరుగుబాటు మావేదాంతం.
ముళ్ళూ రాళ్ళూ అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది ..
అందుకే
ముందుకు పోతాం మేము
ప్రపంచం మా వెంట వస్తుంది.
తృప్తిగా చచ్చిపోతారు మీరు
ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది.”

ఈ కవిత ఒకసారి కాదు వంద సార్లు చదవాలి. చదివిన ప్రతీసారి మనసుని ఉద్వేగంగా చుట్టేసే భావాలున్నాయి ఇందులో.

ప్రశ్నలు ప్రశ్నలు సమాధానాలు సంతృప్తి పరచని, జీవితాలలో సరిహద్దులు దొరకని సంధ్యలలో సంచరించే మనుషులకూ మధ్య తేడాను చాలా మామూలుగా అనిపించే పదాలతో తాను ఎంచుకొన్న వస్తువులోని ఉద్వేగాన్ని భాషలో ప్రవేశపెట్టకుండా వచనంలా అనిపించేటట్లు రాసి ఒక విశ్వజనీన తాత్విక కవితాత్మకతను సాధించారు శ్రీశ్రీ. ముఖ్యంగా ముందే ఏర్పరుచుకున్న సరళరేఖా కొలమానాలతో బేరీజు వేసి తీర్పులిచ్చేసి అధికారాన్ని చలాయించే అన్ని రకాల వ్యవస్థీకృత అధికార ఆలోచనల మీద వాటి పొరల ఆధిపత్య యంత్రాంగాల మీద చావుదెబ్బ కొట్టాడు, గోడలు లేని జీవితాలని గోడలు పగలగొట్టటమే మాపని అని స్పష్టంగా నీళ్ళు నమలకుండా చెప్పి, వ్యవస్థలో మార్జినలైజ్‌ అయినవాళ్ళ మేనిఫెస్టోని ప్రకటించాడు.

భావానికి అనుగుణంగా పదాలని కదం తొక్కించే కవాతు విద్య మనం మహాకవి శ్రీశ్రీలో చూస్తాం. మహాప్రస్థానం నిండా ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. కదంత్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ మరోప్రపంచపు జలపాతాలను, దారిపొడుగునా తర్పణ చేసే గుండె నెత్తురులను, బాటలు పేటలు కోటలు, నదీ నదాలు, అడవులు కొండ దారులు తోసి రాజనుకుంటూ ముందుకు ముందుకు పైకి పైకి దూసుకుపోవాలంటే ఎముకలు కుళ్ళిన .. వయస్సు మళ్ళిన సోమరుల వల్ల కాని పని కనుక.. నెత్తురుమండే శక్తులు నిండే సైనికుల్లాంటి యువత మాత్రమే ”హరో హరోం హర!! హరహర హరహరో” అంటూ ప్రభంజనంలా ముందుకురకాలని కోరుకున్నారు శ్రీశ్రీ.

అందుకే ఆయన మహాప్రస్థానం జయభేరితో బయలుదేరి ప్రతిజ్ఞలెన్నో చేసింది. హలాలతో పొలాలు దున్నింది! అవిశ్రాంతంగా అలుపెరుగని కార్మికుడి కోసం కర్షకుడి కోసం పరుగులు తీసింది. యంత్రాల కోరల్లో భూస్వాముల పాదాల క్రింద పడి నలిగిపోయిన పేదరికాన్ని చూసి మండిపడింది.

అచేతనులను చేతనులుగా మార్చింది. పనివాడి కన్నీటి భారాన్ని పంచుకుంది. దారి వెంబడి సాగిపోయే జగన్నాధ రధచక్రాలతో సవాలు చేసింది. భీకర గర్జనలతో దిక్కులన్నీ బెదిరిపోయేలా చేసింది.

కార్మికుడి కన్నీటిని పన్నీరుగా మార్చటానికి మౌన పోరాటాలు చేసింది, విప్లవగీతాలు ఆలపించింది.

ఎన్నో ఆశలతో పల్లె వదిలి వచ్చి నిలువునా కూలిపోయిన బాటసారిని చూసిన తల్లి పేగులా తల్లడిల్లింది. ఉడుతలతోటి బుడుతలతోటి శైశవగీతాలు పాడుకుంది.

మనమూ మనుషులమేనా! మనదీ ఒక బతుకేనా కుక్కలవలె నక్కలవలె.. సందులలో పందులవలె అంటూ నశించిపోతున్న మానవతా విలువల్ని గురించి మౌనంగా రోదించింది. భూస్వాముల రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న బలహీనుడి గుండెకు కొత్త ఊపిరి పోసానని మహాప్రస్థానం బహుశా ఎంత సంతసించి ఉంటుంది!!!!

అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పేమీ లేదని తెలిస్తే .. తాను రాసినవన్నీ నీటి మీద రాతల్లా తేలిపోతున్నాయని తెలిస్తే శ్రీశ్రీ ఆత్మ నిస్సహాయంగా రోదిస్తుందేమో ఇప్పుడు.

గళమెత్తి, కలమెత్తి గర్జించే మేధావుల్లారా! బీటలు వారిన మహాప్రస్థానపు హృదయాన్ని నిమరండి. నీ వెంటే మేమంటూ ఓదార్చండి. అదే ఆ అమరజీవికి అర్థవంతమయిన నివాళి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.