గృహహింస నిరోధక చట్టం 2005

భారతీయ సమాజంలో కుటుంబానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాల స్థానే వ్యష్టి కుటుంబాలు లేదా న్యూక్లియర్‌ కుటుంబాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలలో మహిళలు ఎన్నో ఆంక్షలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వ్యక్తి స్వేచ్ఛకి అవకాశం వుండేది కాదు. స్త్రీల ఆకాంక్షలకు, ఆలోచనలకు విలువ ఉండకపోగా వారి మీద వివిధ స్థాయిల్లో హింస అమలవుతుండేది. పెళ్ళయి, పుట్టి పెరిగిన ఇంటిని వదిలిపెట్టి, అత్తింట అడుగుపెట్టిన కోడలికి ఆరళ్ళు స్వాగతం చెప్పేవి. ఇంటి గుట్టు బయట పెట్టకూడదంటూ అత్తింట, ఎన్ని బాధలు పడ్డా మౌనంగా భరించాలి తప్ప ఎవరికీ చెప్పుకోకూడదని, ఇంటి నాలుగు గోడల మధ్య జరిగేవన్నీ వ్యక్తిగతమైనవని, భార్యని దండించే హక్కు భర్తకున్నదని ప్రచారం చెయ్యడం సర్వసామాన్యం. ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేముందు ఇలాంటి నీతుల్ని బోధించి పంపడం సంప్రదాయమైంది. అందుకే భర్త తిట్టినా, కొట్టినా, సంసారం పట్టించుకోకపోయినా భార్య మౌనంగా భరిస్తుంది. కుటుంబంలో ఎంత భయంకరమైన హింస జరిగినా, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా సరే స్త్రీలు బయటకు రాకుండా హింసను అనుభవిస్తుంటారు.

కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఎప్పటినుండో కోరుతున్నాయి. దానికోసం ఉద్యమాలు చేసారు. వీటి ఫలితంగానే మొట్టమొదటిసారి ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహ హింస నిరోధక చట్టం 2005 ని తీసుకొచ్చింది. జమ్ము కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్త్రీలకు) ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది.

తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబం లోని మగవారు (భర్త/బావ/మరిది/అన్నదమ్ములు/మామ/కొడుకు/అల్లుడు/తండ్రి) జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ చట్టం మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, తను ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడినుంచే చట్టం సహాయంతో పోరాటం సాగించే హక్కు కల్పించింది. అంటే స్త్రీకి స్థానబలం కల్పించింది. ఇది గొప్ప వెసులుబాటు.

ఇది ఒక సివిల్‌ చట్టం అయినప్పటికీ పకడ్బందీ అమలుకోసం నేరన్యాయవ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరచడమైంది. వైవాహిక జీవితంలో అంటే సున్నితమైన బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్‌ కుటుంబ పెద్దగా ఆ భర్తకు / మగవారికి సంబంధించి జరిగిన తప్పును ఎత్తిచూపి సరిదిద్దుకోమని సూచించి, భార్యా పిల్లల్ని, తల్లిని / స్త్రీని సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించి – అట్టి ఉత్తర్వులు అమలు పరచని పక్షంలో రక్షణ ఉత్తర్వుల ధిక్కారాన్ని మాత్రం నేరంగా పరిగణించి – శిక్షించే అధికారం కల్పించింది ఈ చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు మరియు పిల్లలు (18 సం||లలోపు) లబ్ధిదారులు.

కుటుంబ హింస అంటే…

ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురవడం కుటుంబ హింస కిందికి వస్తుంది.

ఈ హింస చాలా రకాలుగా ఉంటుంది. మహిళలు రోజువారీ జీవితంలో అనేక హింసల్ని ఎదుర్కొంటూ వుంటారు. అవేమిటంటే-

శారీరక హింస – అంటే శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం. అనగా శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి.

లైంగిక హింస – అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు అన్నీ లైంగిక హింస కిందకి వస్తాయి.

మాటల, భావోద్రేక హింస లేదా మానసిక హింస – అంటే అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్న బుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసి స్తానని అదేపనిగా బెదిరించడం ఇవన్నీ మానసిక హింక కిందకు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనసును నొప్పిస్తూ, క్షోభకు గురి చెయ్యడం.

ఆర్థిక హింస – ఆర్థికమంటే డబ్బు లేదా వనరులు – కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకివ్వకపోవడం, చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం, అంటే సాంప్రదాయంకానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా గానీ ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం, స్త్రీ ధనం దక్కకుండా చెయ్యడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటి నుంచి గెంటివేయడం ఆమె ఆదాయాన్ని గుంజుకోవడమేకాక అదనపు కట్నం తెమ్మంటూ వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస లేదా వేధింపుల కిందకు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు/పిల్లలకు సంబంధించి ఆ కుటుంబంలో మగవారి ద్వారా జరిగే ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా కూడా గృహహింస అవుతుంది. భర్తే కాకుండా ఇతర సంబంధీకుల ద్వారా కూడా.

గృహహింస నిరోధక చట్టం కింద మహిళలకు రక్షణ చేకూర్చే సంస్థలు

కుటుంబంలో శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ లేక ఆర్థిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ చేకూర్చడానికి ఈ చట్టం చక్కని ఏర్పాట్లు చేస్తూ తత్‌సంబంధిత అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. బాధిత మహిళలకి అవసరమైన సంస్థలు, సహాయం చేసే సంస్థలూ, వ్యక్తులూ వున్నారు. వీరు రక్షణాధికారులు, సర్వీస్‌ ప్రొవైడర్లు, షెల్టర్‌ హోమ్స్‌, కౌన్సిలర్‌లు, పోలీసులు. గృహహింసను అనుభవిస్తున్న స్త్రీలు ఈ సంస్థలూ, వ్యక్తుల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

రక్షణాధికారులు (పి.ఒ) : గృహహింస నిరోధక చట్టం సక్రమంగా అమలవ్వడంలో ముఖ్య పాత్ర పోషించేది రక్షణాధికారులే. బాధితులను రక్షించాల్సిన వాళ్ళు కాబట్టి రక్షణాధికారులని వీరిని పిలుస్తున్నారు.

బాధితురాలికి తప్పనిసరిగా చట్టపరమైన సహాయం గురించి ఉచిత న్యాయసేవలు, ఆర్థిక సహాయం గురించి, పిల్లల కస్టడి గురించి, ఆశ్రయం అందించే సంస్థల గురించి, వైద్యసహాయం గురించి, ఇతర సేవలను గురించి సమాచారం పొందే హక్కు ఉంది. పై సమాచారాలను బాధితురాలికి అందజేయడం పి.ఓ. ప్రధాన బాధ్యత.

రక్షణాధికారుల విధులు : ఏదైనా ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతున్నట్లు లేదా జరిగే ప్రమాదం ఉన్నట్లు బాధితురాలి నుండి గానీ మరే ఇతర వ్యక్తి నుండి గానీ నిర్దిష్టమైన సమాచారాన్ని రాత పూర్వకంగా కానీ, మాట ద్వారా కానీ అందినపుడు దానిని రక్షణాధికారి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

రాతపూర్వకంగా కాక నోటి మాటగా ఇచ్చిన సమాచారాన్ని రక్షణాధికారి తానే పేపర్‌పై రాసి సమాచారాన్ని ఇచ్చినవారి సంతకం తీసుకోవాలి. వారి వివరాలు తీసుకుని జాగ్రత్త చేయాలి.

ఒకవేళ కుటుంబ హింస జరుగుతున్నట్లు, లేదా జరగబోతున్నట్లు టెలిఫోన్‌ ద్వారా గానీ, యిమెయిల్‌ ద్వారా గానీ సమాచారం రక్షణాధికారికి అందినట్లయితే, వెంటనే పోలీసుల సహాయం తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి కుటుంబ సంఘటన నివేదిక తయారు చేసి, తగిన ఆదేశాల కోసం వెంటనే మెజిస్ట్రేటు ముందు దాఖలు చేయాలి.

ఈ సమాచార పత్రం కాపీని సమాచారం అందించిన వ్యక్తికి ఉచితంగా ఇవ్వాలి. కుటుంబ హింసకు గురైన బాధితురాలికి ఆమెకు గల హక్కుల గురించి, గృహహింస నిరోధక చట్టంలోని వెసులుబాట్ల గురించి వివరించాలి.

బాధితురాలి శరీరంపై గాయాలు, దెబ్బలు వుంటే వెంటనే ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి, ఆ పరీక్షల నివేదిక కాపీలను కుటుంబ హింస జరిగిన ప్రాంతపు పోలీసు స్టేషనుకు, మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఈ చట్టం క్రింద గుర్తించిన ఆసుపత్రుల వైద్యాధికారులతో మాట్లాడి బాధితురాలికి, ఆమె పిల్లలకు అవసరమైతే వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులకు వెళ్ళేందుయ్యే రవాణా ఖర్చులను రక్షణాధికారులే భరించాలి.

బాధితురాలికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా రాష్ట్ర న్యాయసేవల సహాయ సంస్థ ద్వారా రక్షణాధికారి ఇప్పించాలి.   బాధితురాలు ఆశ్రయం కోరితే ఆమెను, ఆమె పిల్లలను ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్‌ హోమ్‌లో ఉంచి, ఆ సమాచారాన్ని ఆ ప్రాంత పోలీసు స్టేషన్‌కు, మేజిస్ట్రేట్‌కి రక్షణాధికారి తెలియచెయ్యాలి. షెల్టర్‌ హోమ్‌కు వెళ్ళేందుకు రవాణా సదుపాయాన్ని కల్పించాలి.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే కుటుంబ హింస సంఘటన జరిగినట్లు సమాచారం అందిన తక్షణం రక్షణాధికారి, చట్టంలో నిర్దేశించిన విధంగా ఫారమ్‌ 1 లో కుటుంబ హింస సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్‌) ను తయారు చేసి మేజిస్ట్రేటుకు అందజెయ్యాలి. ఈ నివేదిక కాపీలను ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్‌కి, సర్వీస్‌ ప్రొవైడర్‌కి అందజెయ్యాలి.

ఈ చట్టం క్రింద బాధితురాలు రక్షణ ఉత్తర్వులు కోరితే, నిర్ణీత నమూనా దరఖాస్తును రక్షణాధికారి మేజిస్ట్రేట్‌ ముందు దాఖలు చెయ్యాలి. అంతేకాదు విధులు నిర్వర్తించడంలో మేజిస్ట్రేటుకు రక్షణాధికారి సహాయంగా వుండాలి. రక్షణాధికారి మేజిస్ట్రేటు నియంత్రణలో, పర్యవేక్షణలో వుండాలి.

మేజిస్ట్రేటు కేసు విచారణకు నిర్దేశించిన తేదీని తెలియచేస్తూ వాది, ప్రతివాదులకు మూడు రోజులు లేదా మేజిస్ట్రేటు చెప్పిన వ్యవధిలో నోటీసులు అందేలా చూడాల్సిన బాధ్యత రక్షణాధికారిదే. ఈ నోటీసులు అందచేసినట్లు ధృవీకరిస్తూ కోర్టుకు ఆధారం పంపించాలి.

కోర్టు ఎక్స్‌పార్టీ ఆదేశాలు చెయ్యదలచి, ఆదేశిస్తే, బాధితురాలు, ప్రతివాది కలిసివుండే ఇంటిని రక్షణాధికారి సందర్శించి అవసరమైన విచారణ జరపాలి. బాధితురాలికి చెందిన వస్తువులను, నగలను, కలిసివున్న ఇల్లును ఆమెకు ఇప్పించాల్సిన బాధ్యత రక్షణాధికారిదే.

మేజిస్ట్రేటు ఆదేశించిన విధంగా, బాధితురాలు తన పిల్లల కస్టడీని పొందేందుకు లేదా ప్రతివాది కస్టడిలో వున్న తన పిల్లలను కలిసేందుకు రక్షణాధికారి సహాయం చెయ్యాలి.

మేజిస్ట్రేటు జారీ చేసే అన్ని ఉత్తర్వులను నివాస హక్కు ఉత్తర్వులు, పిల్లల కస్టడీ ఉత్తర్వులు, ఆర్థిక ఉపశమనం ఉత్తర్వులు, ఎక్స్‌పార్టీ ఆదేశాలను రక్షణాధికారి అమలు చెయ్యాలి. ఈ విధంగా కుటుంబ హింస నిరోధక చట్టం అమలులో రక్షణాధికారులు ముఖ్యమైన పాత్రను కలిగివున్నారు.

జి.ఓ.ఆర్‌.టి. నెం. 220, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమశాఖ, తేది. 21.08.2007 ప్రకారం జిల్లా రక్షణ అధికారులకు సహాయ నిమిత్తం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇద్దరు కౌన్సిలర్లు (సోషల్‌ వర్కరు, న్యాయవాది) ఇద్దరు మెసెంజర్లను, ప్రతి జిల్లాయందు నియమించటం జరిగింది. అలాగే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఒక జూనియర్‌ అసిస్టెంటును డైరక్టర్‌ ఆఫీసునందు నియమించడం జరిగింది.

సర్వీసు ప్రొవైడర్లు

కుటుంబ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 అమలులో రక్షణాధికారులకు ఎంత కీలక పాత్ర వుందో ఈ సర్వీస్‌ ప్రొవైడర్లకు అంతే ముఖ్య భూమిక ఉంది. ఆయా ప్రాంతాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు సర్వీస్‌ ప్రొవైడర్లుగా ప్రభుత్వంలో రిజిష్టర్‌ చేయించుకోవాలి. మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం చట్టబద్ధంగా పనిచేసే సంస్థలు ఈ సర్వీస్‌ ప్రొవైడర్లుగా వుండొచ్చు.

మహిళా సమస్యలపై పనిచేయు 72 స్వచ్ఛంద సేవా సంస్థలను జి.ఓ.యం.ఎస్‌.నెం.18, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమశాఖ, తేది. 6.8.2007 సర్వీసు ప్రొవైడర్లుగా ఉచిత సేవలు అందించుటకుగాను రిజిస్టరు చేయటం జరిగింది.

ఆయా ప్రాంతాలలో వుండే సర్వీస్‌ ప్రొవైడర్లు, బాధితురాలు ఫిర్యాదు చేసినా, వేరెవరైనా సమాచారం అందించినా, లేదా కుటుంబ హింస సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వున్నా, బాధితురాలికి గృహహింస చట్టం ద్వారా ఏ ఏ ఉపశమనాలు పొందవచ్చో వివరించాలి. రక్షణ ఉత్తర్వులు, నివాసపు హక్కు ఉత్తర్వులు, పిల్లల కస్టడి, ఆర్థిక ఉపశమనాలు మొదలగు వాటి గురించి బాధితురాలికి చెప్పి, వీటిల్లో ఏదైనా ఉపశమనం లేదా అన్నీ కూడా కోరవచ్చని వివరించాలి.

కుటుంబ హింసకు గురైన బాధిత మహిళ కోరితే కుటుంబ హింస సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్‌.) ను తయారు చేసి సంబంధిత ప్రాంత మేజిస్ట్రేట్‌కి, రక్షణాధికారికి అందించవచ్చు.

బాధితురాలికి గాయాలు తగిలిన పక్షంలో ఆమెకు వైద్య పరీక్షలు జరిపించి, ఆ నివేదిక కాపీలను రక్షణాధికారికి, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కి అందచేయాలి.

బాధితురాలు కోరితే ఆమెకు షెల్టర్‌ హోమ్‌లో ఆశ్రయం కల్పించి, ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు తెలియచేయాలి. బాధితుల తాత్కాలిక వసతికి, ప్రభుత్వ సహాయంతో 50 వసతి గృహాలు నడుపబడుచున్నవి.

కుటుంబ హింస జరిగిన ప్రదేశాన్ని, జరిగే ప్రమాదం ఉందన్న ప్రాంతాన్ని, జరుగుతున్న ప్రదేశాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించి వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి డి.ఐ.ఆర్‌. ను తయారు చేసి, తక్షణమే తగిన ఆదేశాల కోసం మేజిస్ట్రేట్‌కి అందజేయాలి. ఆ ప్రదేశాన్ని సందర్శించడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలి.

గృహహింసను నిరోధించడానికి, బాధితులకు అండగా నిలబడడానికి సర్వీస్‌ ప్రొవైడర్లు కృషి చెయ్యాలి. ఈ చట్టం కింద వీరు చేసే పనులకు తీసుకొనే చర్యలకు చట్టపరమైన రక్షణ ఉంది. (సె. 100 (హెచ్‌) ప్రకారం).

రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సహాయంతో నడుపుతున్న 51 కుటుంబ సలహా కేంద్రాలను గుర్తించి వారి ద్వారా బాధితులకు కుటుంబ సమస్యల పరిష్కారానికి సహాయం అందిస్తున్నాయి.

”ఈ చట్టానికి అనుగుణంగా కుటుంబ హింసను అరికట్టేందుకు సహాయక సంస్థలు, వాటిలోని సభ్యులు సదుద్దేశంతో ఏ పని చేసినా, చేయబోయినా ఆ సంస్థపై, ఆ సంస్థలోని సభ్యులపై ఏవిధమైన దావాలు ప్రాసిక్యూషన్‌ మరే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే వీలు లేదు.”

మేజిస్ట్రేటు బాధ్యత

కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమె తరపున రక్షణాధికారి కానీ సర్వీస్‌ ప్రొవైడర్లు కానీ దరఖాస్తు చెయ్యొచ్చు. బాధిత మహిళ ఈ చట్టం కింద ఒకటి లేదా అంతకంటె ఎక్కువ ఉపశమనాలు కోరుతూ మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ చట్టం అమలు ప్రారంభమౌతుంది. (సెక్షన్‌ 12)

గృహహింస నిరోధక చట్టం 2005 కింద మేజిస్ట్రేటు ఈ క్రింద పేర్కొన్న ఉపశమనాలను ఉత్తర్వుల రూపంలో ఇవ్వవచ్చు.

సెక్షన్‌ 17 కింద ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు

సెక్షన్‌ 18 కింద రక్షణ ఉత్తర్వులు

సెక్షన్‌ 19 కింద నివాసపు ఉత్తర్వులు (వేరుగా ఉండేందుకు)

సెక్షన్‌ 20 కింద ఆర్థిక ఉపశమన ఉత్తర్వులు

సెక్షన్‌ 21 కింద ఆధీనపు ఉత్తర్వులు అంటే పిల్లల సంరక్షణ ఉత్తర్వులు

సెక్షన్‌ 22 కింద నష్ట పరిహారం ఉత్తర్వులు

సెక్షన్‌ 23 కింద బాధితురాలి పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో మెజిస్ట్రేట్‌ సెక్షన్‌ 18 & 22 ప్రకారం ఇచ్చే ఉత్తర్వులు ఏకపక్షంగా కూడా ఇవ్వవచ్చును.

మేజిస్ట్రేటు ముందు దాఖలు పరిచే దరఖాస్తుతో పాటు కుటుంబ సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్‌.) ను తప్పనిసరిగా జత చేయాలి. ఈ డి.ఐ.ఆర్‌. రక్షణాధికారి లేదా సర్వీస్‌ ప్రొవైడర్ల నుండి వచ్చి వుండాలి.

ఈ దరఖాస్తు అందిన వెంటనే బాధితురాలి పరిస్థితి బట్టి ఆమెకు ఏఏ ఉపశమనాలు అందుతాయో వివరించాల్సిన బాధ్యత మేజిస్ట్రేటుదే. కేసు విచారణ తేదీని నిర్ణయిస్తూ మేజిస్ట్రేటు నోటీసులు జారీచేసి, ప్రతివాదికి రెండు రోజుల్లో అందించ వలసిందిగా ఆదేశిస్తూ రక్షణాధికారికి ఇస్తారు. నోటీసులు ప్రతివాదికి అందాయని రక్షణాధికారి ధృవీకరించాలి. అందుకవసరమైన ఆధారాన్ని కోర్టుకు సమర్పించాలి.

కోర్టులో కేసు విచారణ జరుగుతున్న ఏ దశలోనైనా బాధితురాలిని, ప్రతివాదిని లేదా ఇద్దరిని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు. ఇందుకోసం సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద వుండే అర్హులైన కౌన్సిలర్‌లను కోరవచ్చు. ఈ కౌన్సిలింగ్‌ చేసే వ్యక్తికి ఇరుపక్షాలతో ఎలాంటి సంబంధమూ ఉండరాదు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ తుది తీర్పు వెలువడే లోపు జరగాలి. (60 రోజులలోపు తుదితీర్పు వెలువడాలి) కౌన్సిలింగ్‌ ప్రక్రియ కోసం రెండు నెలల వరకు గడువును మేజిస్ట్రేట్‌ ఇవ్వొచ్చు.

గృహహింస నిరోధక చట్టం సక్రమ అమలు మేజిస్ట్రేటు మీదనే ఆధారపడి వుంది. కుటుంబంలో జరుగుతున్న హింసని ఆపుచేసే ఆదేశం వెంటనే యివ్వగలిగితే బాధిత మహిళ కొంత ఉపశమనం పొందగలుగుతుంది.

ఈ చట్టం కింద చాలా రకాల సంఘటనలని/వేధింపులను కోర్టు నిలుపుదల చేసే అవకాశం ఉంది.

ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, మానసిక వేదనకు గురిచేయడం లాంటి సంఘటనలను కోర్టు నిలుపుదల చేసే అవకాశం వుంది. అంతే కాదు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 125 ప్రకారం కానీ, ఇతర చట్టాల ప్రకారం కానీ మనోవర్తి మంజూరు అయినప్పటికీ కూడా ఈ చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం మనోవర్తిని మంజూరు చేయవచ్చు.

ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన తరువాత బాధితులు వేరే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోరాదని చాలామంది అనుకుంటూ వుంటారు. కానీ అది సరైన ఆలోచన కాదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలకి అదనంగా మేలు చేసేది ఈ చట్టం. అందువల్ల బాధిత మహిళలు ఇతర చట్టాలను కూడా

ఉపయోగించుకుని చర్యలు తీసుకుంటూ ఉపశమనాలు పొందవచ్చు. అవి సివిల్‌ చర్యలు కావచ్చు, క్రిమినల్‌ చర్యలు కావచ్చు. ముఖ్యంగా బాధితులు గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసినప్పటికీ ఐపిసి సెక్షన్‌ 498 (ఏ) ప్రకారం కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది.

అంతే కాకుండా గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలని ఈ చట్టం ప్రకారం దాఖలైన దరఖాస్తుల్లోనే కాకుండా ఇతర లీగల్‌ ప్రొసీడింగ్‌లలో కూడా అడగవచ్చు. (సెక్షన్‌ 26)

ఉదా : విడాకుల కేసుల్లో, మనోవర్తి కేసుల్లో, సెక్షన్‌ 498 (ఏ) ఐ.పి.సి. ప్రకారం వున్న కేసుల్లో కూడా ఈ చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలను కోరే అవకాశముందని మర్చిపోకూడదు.

గృహహింసకు సంబంధించిన కేసులను మేజిస్ట్రేట్‌ 60 రోజులలో తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వాది/ప్రతివాదులకు సంఘటన జరిగిన పరిధిలోని పోలీసులకి, రక్షణాధికారికి, గృహహింస సంఘటన నివేదిక సమర్పించిన సర్వీస్‌ ప్రొవైడర్‌కి ఉచితంగా అందచేయాలి.

కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష గాని, రూ. 20000 (ఇరవై వేలు) జరిమానా గాని, రెండింటిని గాని విధించవచ్చు. మరియు రిజిస్ట్రారు (విజిలెన్సు), హైకోర్టు వారు రాష్ట్రంలోని ప్రధాన మరియు జిల్లా సెషన్సు న్యాయమూర్తులను కేవలం గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం క్రింద నమోదు అయిన కేసులను మరియు అత్యవసర కేసులను విచారించుటకు గాను, వారం/పక్షం రోజులలో ప్రత్యేకంగా ఒక రోజు మొత్తం కేటాయించవలసిందిగా సర్కులర్‌ ఆర్‌.ఒ.సి.నెం. 1246/ఇ1/2009 తేది. 27.08.2009 ను జారీ చేయడమైనది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి గృహహింస సంబంధిత కేసులను విచారించుటకు ప్రత్యేకంగా 3 కోర్టులు, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు-1, మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు-3, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు-4 కేటాయించినారు.

సెషన్స్‌ కోర్టులో అప్పీలు

గృహహింస చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం మేజిస్ట్రేట్‌ కోర్టులో వెలువడిన ఉత్తర్వులపై, ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా సెషన్స్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అయితే కొంతమంది ప్రతివాదులు సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకోకుండా నేరుగా హైకోర్టులో రిట్‌ దరఖాస్తును దాఖలు చేసి, మేజిస్ట్రేటు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు లోనై, హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు.

సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకునే వీలున్నప్పటికీ హైకోర్టుకు వెళ్ళడం గురించి ఢిల్లీ హైకోర్టు మాయాదేవి అనే మహిళ కేసులో ఒక మంచి పద్ధతిని ప్రవేశపెట్టింది.

ఈ కేసులో ఏం జరిగిందంటే – మాయాదేవి అనే ఆమె నివాస ఉత్తర్వుల కోసం మేజిస్ట్రేటు కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ప్రధాన దరఖాస్తు పరిష్కారం అయ్యేవరకు ఆమెను భర్తతో కలిసివుండే భాగస్వామ్య గృహం నుండి తొలగించకూడదని మేజిస్ట్రేట్‌ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసాడు. ప్రతివాది ఈ ఉత్తర్వులని సంబంధిత మేజిస్ట్రేట్‌ కోర్టులోనే సవాలు చెయ్యొచ్చు. లేదా సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ దాఖలు చేయవచ్చు. ఈ రెండు చెయ్యకుండా ప్రతివాది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 227 ప్రకారం హైకోర్టులో రిట్‌ వేసాడు. ఈ దరఖాస్తును విచారించిన ఢిల్లీ హైకోర్టు, అప్పీలు దాఖలు చేసే విషయంలో అవలంబించాల్సిన పద్ధతులను నిర్ధారించింది.

ప్రతివాది వేసిన రిట్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

”మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వులకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఉపశమనాలని కోరాలంటే 30 రోజుల్లోగా సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేసుకోవాలని సె. 29 ప్రకారం వుంది. దాన్ని పూర్తి చేసుకోకుండా ప్రతివాది నేరుగా హైకోర్టులో సవాల్‌ చేసాడు. చట్టం ద్వారా ప్రత్యామ్నాయాలు వున్నప్పుడు వాటిని పూర్తిచేసుకున్న తర్వాతనే హైకోర్టుకి రావాలి తప్ప అవి పూర్తి చేసుకోకుండా హైకోర్టుకు రాకూడదు. అది సరైంది కాదు. (మాయాదేవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎన్‌.సి.టి. ఢిల్లీ మను / చ.ఈ. / 8716 / 2007)”

బాధిత మహిళల్ని మరింత బాధించడానికి ప్రతివాదులు హైకోర్టుకి వెళతారు. ఈ తీర్పు ద్వారా ఢిల్లీ హైకోర్టు ఒక మంచి పద్ధతిని అమలులో పెట్టింది. ప్రతివాది క్రింది కోర్టులో ప్రత్యామ్నాయ ఉపశమనాలని పూర్తి చేయముందే హైకోర్టుకు వెళ్ళకుండా ఈ తీర్పు ఉపకరిస్తుంది.

గృహహింస నిరోధక చట్టం 2005 లో పోలీసుల పాత్ర ఏమిటి?

ఈ చట్టం సివిల్‌ చట్టం కాబట్టి దీని అమలులో పోలీసుల పాత్ర నామమాత్రమే. అయితే బాధిత మహిళ ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్‌ స్టేషన్‌కి వస్తే, సెక్షన్‌ 5 ప్రకారం డి.వి. చట్టం ద్వారా ఆమెకు దొరికే ఉపశమనాల గురించి పోలీసులు ఆమెకు వివరించాలి.

సర్వీస్‌ ప్రొవైడర్లు ఆమెకు సేవలందిస్తారని, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందుతుందని, అది ఆమె హక్కని వివరించాలి. గృహహింస చట్టం క్రింద దొరికే ఉపశమనాలే కాక 498 (ఏ) కింద కూడా కేసుపెట్టొచ్చని బాధితురాలికి వివరించాలి. కుటుంబ హింస సంఘటన జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళే రక్షణాధికారి కోరితే వారితోపాటు పోలీసులూ వెళ్ళాలి. నిందితులు ఏవైనా ఆయుధాలు ఉపయోగిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలి.

ముఖ్యంగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులని ప్రతివాది అమలు పరచకపోయినా, ఉల్లంఘించినా అది నేరమవుతుంది. ఈ అంశాన్ని బాధితురాలు కోర్టు దృష్టికి గానీ, పోలీసుల దృష్టికి గానీ తేవాల్సి వుంటుంది.

మేజిస్ట్రేట్‌ జారీచేసే అన్ని ఆదేశాలను ముఖ్యంగా నివాసపు హక్కు రక్షణ హక్కులను అమలు చేయడంలో బాధితురాలికి సహాయం చేయాలని కోర్టు ఆదేశిస్తే పోలీసులు తప్పకుండా సహకరించాలి.

ఈ చట్టంలోని సెక్షన్‌ 19 (5), 19 (7) ప్రకారం బాధితురాలి ఇంటి నుండి ప్రతివాదిని ఖాళీ చేయించడంలోనూ, బాధితురాలి ఇంటి వాటాకి ప్రతివాదిగాని, అతని తరపునవారు గాని ప్రవేశించకుండా కోర్టు ఆదేశించినా, కలిసివున్న ఇంటిని (షేర్డ్‌హౌస్‌) ను అమ్మివేయకుండా ఆదేశాలు జారీ అయినా, వీటిని అమలు చేయడంలో పోలీసులు సహకరించాలి.

నేరము – శిక్ష : సెక్షన్‌ 31 కింద విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ ఇచ్చిన రక్షణ ఉత్తర్వును గాని, ఇతర ఉత్తర్వులను గాని ప్రతివాది అమలు పరచనట్లయితే అట్టి ప్రతివాదికి నేరం చేసినట్లుగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 20,000/- జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చును. ఇట్టి విచారణ నిమిత్తం బాధితురాలు (పిటిషనర్‌) ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. రిజిస్టర్‌ చేసి చార్జ్‌షీట్‌ చేయాలి. లేదా బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్‌కు రక్షణ ఉత్తర్వులు అమలు కాలేదని ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి బాధితురాలి (పిటిషనర్‌) సాక్ష్యం ఒక్కటి మాత్రమే చాలు అని చట్టం చెబుతుంది. (సెక్షన్‌ 32 (2))

జి.ఓ. యం.యస్‌. నెం. 28, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, తేది. 4.7.03 ద్వారా వరకట్న మరణం పొందిన బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయ సంబంధిత పోరాట ఖర్చుల కొరకు రూ.25,000లు మంజూరు చేయుటకు అవకాశం కల్పించబడినది. ఒకవేళ వరకట్న చావు బాధితురాలికి ఆడపిల్ల ఉన్నచో రూ. 25000/-లు ఆ బాలిక పేరు మీద బ్యాంకులో జమ చేసి, ఆ బాలికకు 20 సం||ల వయస్సు వచ్చిన తరువాత, తీసుకొనుటకు అవకాశం కల్పించబడినది.

ముగింపు : మన దేశ న్యాయ చరిత్రలోనే మొట్టమొదటి సారి కుటుంబ హింసంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా, ఎంత తీవ్రంగా వుంటుందో నిర్వచిస్తూ, అలాంటి నిత్యహింసల కొలుముల్లో కాలుతున్న మహిళల రక్షణ కోసం తయారుచేయబడిన చట్టం, గృహహింస నిరోధక చట్టం 2005, బాధిత మహిళలను రక్షించడానికి చక్కటి ఏర్పాటును కల్పించిన చట్టం. రక్షణాధికారి, సర్వీస్‌ ప్రొవైడర్‌లు, వసతి గృహాలు, కోర్టులు, పోలీసులు – ఈ వ్యవస్థలన్నీ బాధిత మహిళకి అండగా, ఆదుకునే విధంగా వుండాలన్నది చట్టం ముఖ్యోద్దేశ్యం. జండర్‌ స్పృహతో పనిచేసే సంస్థలు ముఖ్య భూమిక పోషించడం వల్ల జండర్‌ సెన్సిటివిటీతో తయారైన అద్భుతమైన చట్టం.

అయితే ఇంత మంచి చట్టం అమలులోకి వచ్చి పదేళ్ళు దాటిపోతున్నా దీని అమలు తీరు అనుకున్నంత ఆశాజనకంగా లేదని ప్రతి సంవత్సరం విడుదలయ్యే స్త్రీల మీద నేరాల చిట్టా, నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రక్షణాధికారుల నియామకం కూడా జరగలేదు.

కొన్ని రాష్ట్రాల్లో సర్వీస్‌ ప్రొవైడర్లు లేరు. కోర్టులు 60 రోజుల్లో తీర్పులివ్వడం లేదు. ఇచ్చిన కాసిన్ని తీర్పుల్లో హైకోర్టులు స్టేలు ఇవ్వడమో, కొట్టి వేయడమో జరుగుతోంది. రక్షణాధికారుల చుట్టూ లాయర్లు చేరి బాధిత మహిళల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు.

”జండర్‌ స్పృహ” తో తయారైన ఓ అపురూప చట్టాన్ని ”జండర్‌ సెన్సిటివిటీ” లేని వ్యవస్థలు, సంస్థలు హింసలో మగ్గుతున్న మహిళలకు అక్కరకు రాకుండా చేస్తున్నారని చెప్పడానికి ఇటీవల విడుదలైన జాతీయ నేరాల నివేదిక ఒక నిదర్శనం.

రాజకీయ నాయకులకు, పరిపాలనా వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు, మీడియాకు, పోలీసులకు, జండర్‌ సెన్సిటివిటి లోపించడం వల్లే కుటుంబ హింస బాధిత స్త్రీల కష్టాలు, కడగండ్లు వారికి అర్థమవ్వని పరిస్థితి వుంది.

ఈ పరిస్థితి మారాలి. కుటుంబ హింస ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభుత్వ నిర్వచనాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ అంశం వారి వారి ప్రధాన అజెండాలోకి రావాలి. అందరూ ఈ విషయమై మాట్లాడాలి. అప్పుడే ఈ చట్టం పకడ్బందీగా అమలవుతుంది. మహిళలపై కుటుంబ హింస నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశిద్దాం.

 

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.