నక్షత్రాల చుట్టూ నిశ్శబ్దాన్ని మీటుతూ…రౌద్రి
భూమిక November 2008
డా.శిలాలోలిత
రౌద్రి కలం పేరు. అసలు పేరు లలిత. ఒకటి శరీరానికిచ్చిన పేరైతే, ఒకటి మనసుకు పెట్టుకున్న పేరు. ఈ రోజు రౌద్రి మన మధ్యన లేదు. లేదు అన్నది భౌతిక ప్రపంచానికి మాత్రమే. అక్షర శరీరాన్ని తొడుక్కున్న రౌద్రి మన మధ్యనే వుంది. మనలోనే వుంది. కాకపోతే చూడడానికి మనసు కళ్ళు తొడుక్కోవాలంతే.
లలిత అమ్మ, రచయిత్రి కె. రామలక్ష్మి. నాన్న కవీ విమర్శకులైన ఆరుద్ర. ఆ సాహిత్యపు తోటలో పూచిన పువ్వు లలిత. 1987లో ‘నిద్రపోని పాట’ కవిత్వ సంకలనాన్ని రౌద్రి తీసుకుని వచ్చింది. సఖూడూ, సహచరుడైన ‘కళ్యాణ్’కి అంకితమిచ్చింది. దీంట్లో 25 కవితలు న్నాయి. తొలి కవితా సంకలనం ‘నిశీథి సంగీతం’. నవలలు ‘పారిపోయిన వసంతం’ .’అగ్ని పంజరం’ (ఇతర రచనలు, వాటి వివరాలు నాకు లభ్యం కాలేదు. అందుకని వాటి గురించి ప్రస్తావించలేదు) వ్యాపకాలు సంగీత శ్రవణం సైన్స్ ఫిక్షన్. ఇష్టమైన పనులు - చదవడం, టైమ్స్ గళ్ళ నుడి కట్టు పూరించడం.
‘ఆలోచనల్లో జీవించడం కొంత మాని సహ జీవనమూ స్వయంపాకమూ సరళీ స్వరాల్లాగా సాధన చేస్తున్నప్పుడు, కాగితం పైన పెట్టేదాకా ఊరుకోకుండా వెంటబడి వేధించిన కొన్ని ఊహల కిచిడి ఈ నిద్ర పోని పాట. కవిత్వానికి ఈ రోజుల్లో చెలామణి అవుతున్న ఇజాలలో నది కేవలం రౌద్రిజం మాత్రమే. ఇందులో కొన్ని కేవలం ఎక్స్పరిమెంట్స్ మాటల కోసం కాని, నడక కోసం కాని ఓవరాల్ ఇమేజ్ కోసం కాని రాసినవి. కొన్ని బైరాగి మొజులో రాసినవి. కొన్ని జపనీస్ కవితా ప్రభావంతో రాసినవి. కొన్ని నెలల తరబడి నలిగి, విరామ చిహ్నాలు కూడా జస్ట్ 10గా వుండాలని సానపెట్ట బడ్డవి. కొన్ని సప్రయత్నంగా డెడ్లైన్స్ కోసం రాసినవి. కొన్ని నిముషాల్లో వెలువడి అలాగే హమేషాగా వుండ పోయినవి. అనుభవాలని కాగితంపైన అనువదించేటపుడు కలిగే అనందం కన్న చదివి ఒక్క మనసైనా స్పందించితే కలిగే తృప్తి చాలా గొప్పది. ఆ ప్రయొజన సిద్ధి కోసమే ఈ సాధన’ అంటూ కవయిత్రి తన మనసులోని మాటల్ని మన ముందుంచింది.
‘వాతావరణ సూచన’ కవిత వ్యంగ్యాస్త్రం. స్త్రీల స్థితి చాలా బాగున్నదనే వార్తను విమర్శిస్తుందీ కవిత. ‘నా నోరు తెరిస్తే / విశ్వాన్నంతా కమ్ముకొన్న/ విషాదం తాలుకు ఆర్తనాదమేగాని/ జ్యోత్స్న గీతికలు రావు/ నా కనులు మూసుకుంటే ఏ కాకి తనపు నైరాశ్యం/ ఎడబాటు భయం బరువు తప్ప/.. నా హృది కోరిన చిరు కోర్కెల / కాష్టపు వాసనలే గాని/ ఎవరెవరివో మూలుగుల/ ఏడుపులు కేకలు తప్ప/ సంతోషపు సవ్వడులు/ నా చెవుల పడవు/.. అంతా వసంతమని వార్తల్లో వింటే/ కాబోలనుకుంటాను. ‘ఈ నిశీథిని కృష్ణ’ అంటూ ఒక నిర్వచన కవితను రాసింది. రాత్రికీ, నీలిమకీ ‘నలుపుకీ’ ఉన్న సారప్యం కాలమంత పాతది. దాన్ని రెండు ముక్కల్లో కుదించి చెప్పడం అభివ్యక్తి పరిణతికి నిదర్శ్న౦. ‘ఇప్పుడు అస్థిత్వం ఒక తృష్ణ’ అనడం పొంగులా వెలువడిన భావానికి లోతును పొదగడం. అస్థిత్వం ‘అస్తిత్వం అని సరిపెట్టుకోవాలి’. తృష్ణ అనడంలో పాతకొత్త తత్వ జిజ్ఞాసల మేలుకలయిక వుంది.
’నిద్రపోని పాట’ అనే శీర్షికలోనే ఒక విస్ఫోటన గుణానికి ప్రతీక వుంది. స్త్రీల దైనందిన జీవితాల్లో అనుక్షణం కోల్పోతూ, కుమిలి పోతూ ఘర్షిస్తూ, సంఘర్షస్తూ, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పొదిగున్న కలలు, కన్నీళ్ళు, ఆశలు, ఆశయాలను జ్ఞాపకాల జల్లులు కురిపించిన ఉద్యమ గీతమీ కవిత.
‘మీ కలలోకి లయించి/ మీ కనులలో వర్షించి/మీ వెక్కిళ్ళలో స్ఫురించిమీ ఆలోచనల్లోకి ఉల్లసితమై/ఎప్పుడో హఠాత్తుగా/ చర్యలోకి హుంఫిితమౌతుంది నా గీతం/.. అర్ధరాత్రి గడియారపు ముళ్ళు . రెండు ఒక అంకెని ముద్దు పెట్టుకొనే సమయంలో/ ఆర్త హృదయల తపనాక్రోశం ప్రతిధ్వనిలో ఆమ్రేడితమవుతుంది నా గీతం.
ఒక వేదనార్తిని ప్రతిఫలించి, ఉద్వేగ తరంగమై నిలిచి, స్త్రీల జీవితాలపట్ల ఒక సహానుభూతిని ప్రకటిస్తూ, అద్భుతమైన పద చిత్రాల చిత్రికతో కవిత్వంలా జీవించిన భావోన్ముఖురాలు ఈ కవయిత్రి. తడి హృదయపు పాద ముద్రలు ప్రతి మలుపులోనూ వున్నాయి. మజిలీ మజిలీకి మధ్య వేదాంత తత్వ, జిజ్ఞాస తరంగాలు గబుక్కున పరిగెత్తుకుంటూ వచ్చి పెనవేసుకు పోతాయి. ‘రౌద్రి’ రాసిన అక్షరాలే ఆమె జీవించి వుండేందుకు చేసిన నిదర్శనాలని భావిస్తూ,