సూర్యచందుల్న్రి మమేకం చేసిన కాంతిగోళం

ఆమె మార్గంలో నడుద్దాం- సావితిబ్రాయి ఫూలే

– కత్తి పద్మారావు

ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు పోరాట వీరులకు బాసటగా నిలచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలేది అద్వితీయ చరిత్ర. మార్క్స్కు జన్నీ ఎంతో సహకారాన్ని అందించింది. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రిబాయి ఫూలే మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచింది. తన వ్యక్తిత్వాన్ని చాటి అనేకమైన అంశాల్ని చరిత్రముందుకు తీసుకొచ్చింది. భారతదేశ చరిత్రలో దళితులకు పాఠశాల పెట్టిన ఘనత సావిత్రిబాయి ఫూలే, మహాత్మాఫూలే అట్టడుగు వర్గాలకు విద్య చెప్పడమనే ఒక పోరాటాన్ని వాళ్ళు అప్పుడే స్వీకరించారు. స్త్రీని బానిసగా చూసే ఈ సమాజంలో తన భార్యను విద్యావంతురాలిని చేయడమే గాక పోరాట స్పూర్తిని ఆమెలో తీసుకురావడంలో మహాత్మాఫూలే కూడా ఒక చారిత్రాత్మకమైన బాధ్యతని నిర్వహించారు.

మరాఠీలోని సంస్కర్తల్లో బాల్శాస్త్రీ, జింజేకర్, బాన్ మహాజన్, దాదోబ పాండురంగలౌర్కాడ్కర్ (1814-1882) నానాశాంకర్సేట్ (1803-1805), గోపాలరావ్ హరిదేశ్ముఖ్ (1823-1892) పేర్కొనదగినవారు. వీరందరి ప్రేరణ ఫూలేకి ఉపకరించాయి. విద్య మానవుణ్ణి వికాసవంతుణ్ణి చేస్తుంది. మానవుణ్ణి వెలిగిస్తుంది. అని జ్యోతిబా ఫూలే భావించారు. అందునా స్త్రీవిద్య నభ్యసించకపోవడం వల్లనే మూఢాచారాల్లో చిక్కుకుపోయింది అని భావించి 1848 ప్రాంతంలో పూషేట్వారి పేర్లలో బేడెగారి ఇంటిదగ్గర ఒక పాఠశాల ప్రారంభించాడు. అది భారతదేశంలోనే స్త్రీ విముక్తోద్యమానికి అ,ఆలు దిద్దిన పాఠశాల.

విడదీయరాని బంధం
జ్యోతిరావ్ఫూలే జీవితం, సావిత్రిబాయి ఫూలే జీవితం విడదీయరానివిగా సాగాయి. భారతదేశ చరిత్రలోనే భార్యాభర్తలు సామాజిక సేవలో ఇంత మమేకమై చేసినవారు లేరు. గాంధీకి తన భార్యకి, నెహ్రూకి తన భార్యకి ఇంకా జాతీయ నాయకుల కుటుంబాల్లో ఎన్నో కలహాలు వుండేవి. ఒకరి జీవితాలకు ఒకరికి పొంతన వుండేది కాదు. అయితే సావిత్రిబాయి ఫూలే తన భర్తలోని జ్యోతికి నూనె పోసి వెలిగించే దానిగానే కాకుండా తన క్రియాశీలకమైన కృషిలో భాగస్వామిగా వుండేది. వీరిద్దరు కలిసి రాత్రి స్కూలుని తమ ఇంట్లో నడిపించారు. ఈ విషయాన్ని గురించి ధనుంజయ్ కీర్ విశ్లేషణాత్మకంగా తన గ్రంథంలో చెప్పారు.

దళిత స్త్రీల విముక్తికి విద్య
దళిత స్త్రీల విముక్తికి విద్య మూల హేతువని సావిత్రిబాయి ఫూలే, ఫూలే అప్పుడే గుర్తించారు. వీరి మార్గంలోనే అంబేడ్కర్ విద్యను ప్రధాన నినాదంగాను, ఆయుధంగాను స్వీకరించాడు. నిజానికి బుద్ధుని దగ్గర బోధనను అందుకున్న అంబేడ్కర్ సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలేల దగ్గర నుండి విద్య అనే ఆయుధాన్ని స్వీకరించారు. 1830 వరకు శూద్ర స్త్రీలకు, దళితులకు విద్య అనేది ఊహించే పరిస్థితులలో భారతదేశం లేదు. ముఖ్యంగా అగ్రవర్ణ ఆధిపత్యానికి, హిందూ నియంతృత్వానికి, బ్రాహ్మణ సంస్కృతి జటిలత్వానికి కంచుకోట అయిన మరాఠా రాజ్యం స్త్రీలను అతి దారుణంగా అణిచింది. నలభైవేలమంది బ్రాహ్మణులకు షడ్రషోపేతాన్నాలు పెట్టి, మరాఠ పీష్వాలు శూద్రుల్ని, దళితుల్ని, స్త్రీలను అణచివేశారు. ఆ పరిస్థితి నుండి వీరిని లేవనెత్తడానికి మొదట్లో నడుముకట్టిన భార్యాభర్తలు సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలే.

వివాహబంధం- విద్యాబంధం
జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే వివాహం అతి పిన్నవయస్సులో జరిగింది. ఈ పెండ్లి విషయాన్ని ధనుంజయ్ కీర్ ఇలా విశ్లేషించారు.

“Govindrao now thought of settling Joti’s marriage in accordance with the prevailing customs. So his marriage was celebrated when he was about thirteen. The girl-wife was about eight years old and came of a family called Zagade Patil from the village Kavadi near Poona. Joti did not have to bother about the maintenance of his girl -wife. the husband and the girl-wife did not know what marriage was meant for. so young were the children when they married in those days that one of Joti’s would-be colleagues, Keshav Bhawalkar, asked his mother in his boyhood, when he was told that his marriage ceremony was to be celebrated, whether she would take him to it” (Mahatma Jotirao phooley, Dhananjay Keer, page;12)

సామాన్యంగా బాల్యవివాహం అయిన దంపతుల్లో పితృస్వామిక ఆధిపత్యం వుంటుంది. కానీ వీరిద్దరు ఆరోజుల్లోనే సమతుల్యంగా జీవించారు. ఎక్కువమంది మనుస్మృతిని అనుసరిస్తున్న కాలమది. మనుస్మృతిలో స్త్రీలకు నిర్ధిష్టమైన సూత్రాలను ఇలా నిర్దేశించారు.
శ్లో|| “స్వాం ప్రసూతిం చరిత్రంచ కుల మాత్మాన మేవచ
స్వం చ ధర్మం ప్రయతేన జాయం రక్షన్ హి రక్షతి” (మను 9-7)
శ్లో|| “న కశ్చిద్యోషితశ్వక్తహః ప్రసహ్య పరిరక్షితుం
ఏతై రూపాయ మోగైస్తు శక్త్యాస్తాః పరిరక్షితుమ్” (మను 9-10)
శ్లో|| “అర్థస్య సంగ్రహే చైనాం వ్యయేచైవ నియోజియేత్
శౌచేధర్మేన్న ఏక్తాంచ్యం పరిణాహ్యస్య చేక్షణే” (మను 9-11) (భారతీయ సంస్కృతిలో స్త్రీ, పేజిః 97)

ఈ శ్లోకాలకు అర్థమేమిటంటే భార్యను కట్టుదిట్టాల్లో వుంచడం వల్ల వ్యభిచార దోషాల నుంచి రక్షించిన వాడివి అవుతావు. అందుకు ఆమెను బయటకు పోనివ్వవద్దు. కానీ స్త్రీ బుద్ధిలోని స్వేచ్ఛను ఎవరూ ఆపలేరు. అందుకు నీవు ఇంట్లో భర్తకి సేవ చేయడం, వంట వార్పులు చేయడం, డబ్బులు లెక్కించడం వంటి పనుల్లో నిమగ్నం చేయుము. ఆమె నిరంతర సేవ వల్ల బయటకు పోకుండా వుంటుందని అర్థం.

భార్యను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావ్ వ్యక్తిత్వం
అందుకే స్త్రీలపై అనేక ఆంక్షలు పెట్టారు. ఇది పూర్తిగా హేతువాదానికి వ్యతిరిక్తమైన విషయం. అందుకే జ్యోతిరావు ఫూలే తన భార్యని ఒక బానిసగా కాకుండా, ఒక వ్యక్తిత్వం వున్న ఉపాధ్యాయురాలిగా, నాయకురాలిగా తీర్చిదిద్దాడు. సావిత్రిబాయి ఫూలే తన భర్త అనే జ్యోతికి ఒక నూనెలా వ్యవహరించింది. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగు లేదు అన్నంతగా మమేకం అయింది. ఆమె సహచర్యం వల్ల మహాత్మాఫూలే ఆలోచనలు స్త్రీలపైపు మళ్ళాయి. మహాత్మాఫూలే అందరి స్త్రీలను శూద్రులుగానే భావించాడు. ఆయన బ్రాహ్మణ స్త్రీలను వేరుచేయలేదు. బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ పురుషులచేత ఎలా అణగద్రొక్కబడుతున్నారో చాలా శాస్త్రీయమైన విశ్లేషణ చేశారు. వారిమీద బలవంతపు వైధవ్యాన్ని రుద్దుతున్నారని శ్రీ బి. ఎం. మలబారి సమర్పించిన నివేదికకు సమాధానంగా ఇలా చెప్పారు.

“నేనిప్పుడు బ్రాహ్మణ స్త్రీలమీద మోపబడ్డ బలవంతపు వైధవ్యమనే సున్నితమైన వేదన కల్గించే అంశాన్ని స్పర్శిస్తాను. పక్షపాతంతో కూడిన ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ ఎటువంటి పట్టింపు లేకుండా తమ మగవాళ్ళకు ఎంతమంది ఆడవాళ్ళనైనా పెళ్ళి చేసుకునేందుకు అనుమతిస్తున్నది. ఇది మగవాళ్ళ దుష్ప్రవర్తనకు దారి తీసేందుకు వీలు కలిగిస్తుంది. ఈ పురుషులు చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్న మొదటి భార్యమీద మోజు తీరిపోగానే, కొత్త రుచుల కోసం సానివాడల్లో దూరుతున్నారు. దీనితో సుఖవ్యాధుల పాలై తమ భార్యలనూ రోగాల పాలు చేస్తున్నారు. ఆ రుగ్మతల నుండి బయటపడేందుకు విపరీతంగా ఖరీదైన వైద్యం చేసుకోవాల్సి వస్తుంది. రోగం వైద్యానికి లొంగనపుడు ఈ మగవాళ్ళు పిల్లలు పుడతారన్న నమ్మకం కోల్పోతున్నారు. ఈ దీనస్థితిలో తన భార్య రాత్రిళ్ళు బయటికి పోతే చాలు అనుమాన పిశాచిలా మారి ఆమె తప్పుడు నడతగలదైపోయిందని తీవ్రంగా శిక్షిస్తారు. ఇంటినుంచి వెళ్ళగొడతారు.

వయసులో ఉన్నప్పుడు కామంతో కళ్ళు కప్పుకుపోయి దుర్మార్గంగా, శీలరహితంగా ప్రవర్తించి ముదిమి మీద పడేసరికి తనకున్న చెడ్డపేరు తొలగించుకునేందుకు ఈ సిగ్గులేని వెధవలు ధర్మ ప్రవర్తకుల్లా మారిపోతారు. ఎటువంటి లజ్జ లేకుండా నాట్యగత్తెలకు డబ్బిచ్చి వారితో దేవాలయాల్లో రాతి విగ్రహాల ముందు పాటలు పాడించి, నాట్యం చేయించి దైవ సేవ పేరిట తమ కోరికనూ తీర్చుకుంటారు (మహాత్మా జ్యోతిరావ్ ఫూలే సంక్షిప్త రచనలు, పేజి.56)

సంస్థల నిర్మాతగా సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఫూలే కూడా ఇదే అవగాహనతో ముందుకు నడిచింది. వీరిద్దరు కలసి 1842 లో అన్ని వర్ణాల బాలికలకు విద్యాలయం ప్రారంభించారు. 1863 లో సావిత్రిబాయి ఫూలే విధవరాండ్ర రక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇదే కాలంలో వీరొక బ్రాహ్మణ విధవరాలియొక్క కుమారుణ్ణి దత్తత చేసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలకు భర్త చనిపోతే శిరోముండనం చేసే ఆచారాన్ని సావిత్రిబాయి ఫూలే వ్యతిరేకించింది. దీనికోసం మంగళ్ళులను సమీకరించి ఈ దురాచారానికి వ్యతిరేకంగా మేము కత్తి పట్టమని శపథం చేయించారు. బ్రాహ్మణ, శూద్ర, అతిశూద్ర స్త్రీలందరిని విముక్తి చేయాలని సావిత్రిబాయి ఫూలే, ఫూలే భావించారు. ఫూలే మీద పరిశోధన చేసిన జి.పి దేశ్పాండే సావిత్రి బాయి ఫూలే తన భర్తతో కలసి ఎన్ని సంస్థల్ని నిర్మించిందో ఇలా వివరించారు.

”Phule established the first school any where in India for shudratishudra girls in 1848. His father Govindrao was shocked, and feared, not unreasonably, high-caste backlash. Jotirao and Savitribai, whom he had married in 1840 and who taught in this school, had to leave Govindrao’s house. Jotirao, however, was not one to cave in tamely. In 1851, he established another school, this time for girls of all castes. This was followed by an evening school for working people in 1855. By now, Jotirao’s activities were causing a furore. An attempt was made on his life in 1856. Phule’s activities extended beyond the field of education. The drinking water tank in his house was thrown open to untouchables. This would be considered a brave act even today. In 1868, it was revolution ary. No high caste or bhadralok reformer had ever done such a thing. Phule was not one for empty rhetoric.” (Selected Writings of Jotirao Phule, G.P.Deshpande Page: 3)

జి.పి. దేశ్పాండే జవహర్లాల్ విశ్వవిద్యాలయం ఆచార్యులు. ఈయన చైనీస్ స్టడీస్ శాఖకు అధిపతిగా వుండి రిటైర్డ్ అయ్యారు. దేశ్పాండే ఆధ్వర్యంలో మహాత్మాఫూలే రచనలు మరాఠీలోనివి ఇంగ్లీషులోకి అనువాదం చేయబడ్డాయి. ఇంగ్లీషు నుండి అనేక భాషల్లోకి మహాత్మాఫూలే సావిత్రిబాయి ఫూలే భావాలు ప్రచారం అవుతున్నాయి.

ఈనాటి దళిత ఉద్యోగినులకు సావిత్రిబాయి ఫూలే ఆదర్శం
సావిత్రిబాయి ఫూలే వంటి గొప్ప వ్యక్తికి స్త్రీలలో భారతరత్న ఇవ్వవచ్చు. ఇన్ని సంస్థల్ని భర్తతో కలసి ఆమె నిర్వహించింది. ఈనాడు దళిత బహుజనుల్లో కొద్దో గొప్పో సమాజసేవ చేద్దామనుకున్న కార్యకర్తలకు ఇండ్లలో సహకారం పెద్దగా లేదు. స్త్రీలు ఉద్యోగస్తులుగా వున్నవారు, టీచర్స్గా వున్నవారు, ఇంకా దళితవాడల్లో చదువురానివారికి చదువు చెపుదామనే ఆలోచన తక్కువ. ఎక్కువగా ఉద్యోగులైన దళిత స్త్రీలు తమ ఆహార్యానికి, ముఖ్యంగా వస్త్రాలకు, కాస్మెటిక్స్కు, వస్తువ్యామోహానికి గురి అవుతున్నారు. ఇల్లుని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దే సంస్కృతిని సావిత్రిబాయి ఫూలే నుండి దళిత ఉద్యోగ స్త్రీలు నేర్చుకోవాల్సి వుంది. ముఖ్యంగా ఇండ్లలో టి.విలు, డివిడిలు, సి.డి ప్లేయర్లు పక్కఇండ్లవాళ్ళతో కబుర్లు ఎక్కువయ్యాయి. పిల్లల చదువు సాగకపోగా ఒక ఉద్యమ గృహంగా, ఆశ్రమంగా, ఇతరులకు ఆశ్రయమిచ్చేదిగా ఇల్లు మారడం లేదు. అందుకే సావిత్రిబా ఫూలే భర్తతో చేసిన కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారం చేయవలసి వుంది.

సావిత్రిబాయి ఫూలే ఒక నిర్మాణకర్త. త్యాగపూరితమైన వ్యక్తి. పురుషులు స్త్రీలను ఎంత వేధిస్తున్నారో స్త్రీలు తమ కోరికల కోసం పురుషుల్ని అంత వేధిస్తున్న కాలమిది. ఈ సందర్భంగా పురుషులకు ఆదర్శప్రాయులైన అంబేడ్కర్ని, మహాత్మాఫూలేని, మనం ఎలా ప్రచారం చేస్తున్నామో, అలాగే సావిత్రిబాయి ఫూలే ఆమె ఆశయాలని కరపత్రాల ద్వారా, వ్యాసాల ద్వారా , క్యాలండర్ల ద్వారా, నిర్మాణాత్మకంగా ప్రచారం చేయవలసిన చారిత్రక సందర్భం మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా సావిత్రిబాయి ఫూలే దళితుల విద్య గురించి ఆరోజుల్లోనే ప్రభుత్వానికి ఇలా నివేదించారు.

ప్రభుత్వానికి దళిత విద్యార్థుల గురించి ఆనాడే విన్నవించిన సావిత్రిబాయి ఫూలే
“మహర్లు, మాంగులు అంటరానివాళ్ళుగా భావింపబడటం వల్ల, వాళ్ళ పిల్లలు ఎలాంటి ప్రాథమిక విద్య అందుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి గమనించి ప్రభుత్వం వారికోసం ప్రత్యేక పాఠశాలలు తెరిచింది. కానీ అవి కేవలం పట్టణాలలో మాత్రమే వున్నాయి. పూనా నగరంలో మహర్, మాంగ్ల జనాభా 5000 లను మించి వుంది. అక్కడ వారి పిల్లలకోసం కేవలం ఒక్కటే పాఠశాల వుంది. దానిలో చదివే పిల్లల సంఖ్య 30 మంది మగపిల్లల కంటే తక్కువే. ఈ స్థితి విద్యా శాఖ అధికారులకు ఏ తీరుగాను మంచి పేరు తెచ్చేది కాదు. అందువల్ల ఈ స్థితి నించి బయటపడాలంటే మహారాణిగారి ప్రకటనలో వాగ్దానం చేసినట్టు, మహార్, మాంగ్ కులస్తులకు, ఇతర నిమ్నజాతులకు ఎక్కడైతే వారి జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో వుందో అక్కడ వారికోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుల వివక్షవల్ల అగ్ర వర్ణాలవారు వీరిని సాధారణ పాఠశాలలోకి రానివ్వరు కనుక ఈ ఏర్పాటు అవసరం. (మహాత్మా జ్యోతిరావ్ ఫూలే సంక్షిప్త రచనలు, పేజిః 23)

అంబేడ్కర్కు కూడా ఆమె మార్గదర్శి
ఎన్నో పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు స్వాతంత్రం వచ్చాక ఎన్నో హాస్టల్స్ దళిత విద్యార్థులకు ఏర్పడ్డాయి. అయితే ఆ హాస్టల్స్లో వారు దయనీయమైన పరిస్థితుల్లో వున్నారు. సావిత్రిబాయి ఫూలే ఆదర్శంగా ఈనాడు ఈ విద్యార్థులకు దళిత ధనవంతులు, ఉద్యోగులు ఎంతో సహకారాన్ని అందించవలసి వుంది. లక్షలు ఖర్చుపెట్టి పెండ్లిళ్ళు చేసుకుంటున్నారు. పుట్టిన తేదీలకు పెద్ద పెద్ద కేకులు కోస్తున్నారు. పిల్లల్ని ఫైవ్స్టార్ చాక్లెట్లతో పెంచుతున్నారు. అయితే తమ పక్కనే తమ జాతుల విద్యార్థులే ఒక కిలో కూర ముప్ఫై మంది వడ్డించుకొని జీవిస్తున్నారు. కొన్ని వేల హాస్టళ్ళలో మగ్గుతున్న ఈ పిల్లలకు ఒక దళిత ఉద్యోగి యాపిల్ పండ్లు పంచిన సంఘటన మనకు కరువైంది. ఈ పరిస్థితుల్లో సావిత్రిబాయి ఫూలే లాగా దళిత ఉద్యోగ స్త్రీలు ప్రతి ఆదివారం హాస్టల్కు వెళ్ళి అక్కడ పిల్లల్ని పరామర్శించవలసిన బాధ్యతను తీసుకోవాలి. మరి ముఖ్యంగా డా|| బి.ఆర్ అంబేడ్కర్ ‘విద్యావంతులు కండి’ అని పిలుపునిచ్చింది. కేవలం ఉద్యోగులుగా జీవించడం కోసం కాదు. ఇతరులకు సహకారం చేసే గుణాన్ని పెంచుకోవాలని, ఈ స్ఫూర్తిని అంబేడ్కర్ కూడా సావిత్రిబాయి ఫూలే నుండి అందుకున్నారు.

ఆమె క్రాంతిగోళం – ఆమె మార్గంలో నడుద్దాం
నాడు సావిత్రిబాయి ఫూలే జీవితం మనకు ఆదర్శం కావాలంటే దళిత ఉద్యోగులైన స్త్రీలు వందలకు వందలు వస్త్రాలకు ఖర్చుపెట్టడం మాని, పుస్తకాలు కొనాలి. ప్రతి ఇంట్లో ఒక గృహ గ్రంథాలయాన్ని రూపొందించుకోవాలి. ఇండ్లలో పుస్తకాలు లేనట్లైతే మస్తకాలు బూజు పడతాయి. ఇండ్లను చిన్న చిన్న ఆశ్రమాలుగా రూపొందించుకోవాల్సిన అవసరం వుంది. ఉధ్యమకారులైన భర్తలను వేధించకుండా వారికి సహకారాన్ని అందించడంలో సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాలి. సావిత్రిబాయి ఫూలే ఒక సజీవమైన జీవన స్రవంతి. మానవతా పరిమళాన్ని వెదజల్లిన కార్యకర్త. ఆమె కరుణ శీలి. భర్తని కాపాడటంలో వీరమాత. భారతదేశంలో ఇంత వ్యక్తిత్వం కలిగిన స్త్రీ మరొకరు లేరు అనడంలో అత్యుక్తి లేదు. తన భర్త మహాత్ముడిగా వెలుగొందడానికి ఆమే కారణమైంది. ‘మహాత్మా’ అనే బిరుదుని ఫూలే నుండి గాంధీ తస్కరించి ప్రచారం చేసుకున్నాడు. నిజానికి మహాత్మాఫూలే సావిత్రిబాయి ఫూలే లేకుండా లేడు. ఆమె ఆయన జీవితానికి ఊపిరి. ఆమె నడక గంభీరమైంది. పిరికితనాన్ని పారద్రోలింది. తన భర్తను తనను చంపడానికి వచ్చినవారిని ఎదిరించింది. స్త్రీలకు విద్యను అందించడానికి ఆమె టీచరుగా మారడమే గాక భారతదేశంలో ఉన్న టీచర్లకు ఆమె మార్గదర్శకమైంది. ఆమెను చూసే చాలామంది టీచర్లు కాండక్డ్ను నిర్ణయించుకున్నారు. ఆమె కార్యశీలి. ఆమె వాచకం మృదువైంది. ఆమె పలుకులు సూత్రబద్ధమైనవి. ఆమె కోరికల్ని నిరాకరించింది. ఆమె పరిసరాల్ని సేవామయం చేసింది. ఆడంబరాల్ని తృణీకరించింది. భర్తకు దారిచూపించే కాగడాగా వెలిగింది. ఈనాడు దళిత ఉద్యోగినులు సావిత్రిబాయి ఫూలే దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నిరాడంబరమైన వస్త్రధారణ, చేతిలో పుస్తకం, ముఖంలో నవ్వు, ఆమె వ్యక్తిత్వం. ఇప్పటి స్త్రీలు ఆందోళనతో కనిపిస్తున్నారు. అప్పులతో మునిగిపోయి వుంటున్నారు. కోరికలు వారిని ముసురుతున్నాయి. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకొని మన దళిత స్త్రీలు నూత్న ఉత్తేజాన్ని పొందవలసిన చారిత్రక సందర్భం ఇది.
ఆమె మార్గదర్శి,
ఆమె నాయకురాలు,
ఆమె ఉపాధ్యాయిని,
ఆమె బోధకురాలు,
సంస్థల నిర్మాత,
ఆమె వెన్నెల,
ఆమె వెలుగు,
సూర్యచంద్రుల్ని మమేకం చేసిన క్రాంతిగోళం,
ఆమె మార్గంలో నడుద్దాం…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.