స్నేహమయి డి.సుజాతాదేవితో నేను – శీలా సుభద్రాదేవి

డి.సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి’ అంటారు. మరికొందరు ‘గేయం రాస్తుంది’ అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు ‘ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?’ అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మాట మలయా నిలయం, పాట తేనెల సోన, గేయం వెన్నెల వాక. మరి కథో సమాజం మారుమూలలోకి దృష్టి సారించి పరిశీలించి నివ్వెరపోయేలా రాసిన అపురూపకథలు. నేలమీద సాము చేయని, నిబద్ధతతో కూడిన కథలు. బాలలనేస్తం, స్నేహపూరిత రూపం ఆమే. రచయిత్రి డి.సుజాతాదేవి. స్నేహితుల దినోత్సవం రోజున అల్జీమర్స్‌తో బాధపడుతూ ఆగష్టు నాలుగో తేదీన కన్నుమూసిన ఆత్మీయ స్నేహితురాలు సుజాతాదేవి.
1970లో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి మూడు కథాసంపుటాలు, మూడు పాటల పుస్తకాలు, ఒక గేయకావ్యం, మూడు నవలలు, ఒక వ్యాసాల పుస్తకం, ప్రముఖులతో చేసిన ముఖాముఖీల సంకలనంతో పాటు రెండు పాటలు కేసెట్లు వెలువరించారని చాలా మందికి తెలియదు. రెండు సార్లు NCERT వాళ్ళ పురస్కారం, బాలల నవలకి జాతీయ పురస్కారం, ‘‘కొక్కోరోకో’’ – బాలల చలన చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి 1986లో ‘‘స్వర్ణనంది’’ పురస్కారం అందుకున్నారన్న విషయం అనేక మందికి తెలియదు. బహుశా 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారనే విషయం కొందరికైనా తెలిసే వుంటుంది అనుకుంటాను మరి. ఇటీవల 2018లో అమృతలత అపురూప అవార్డు అందుకున్న సందర్భంలో హైదరాబాదీయులకు డి.సుజాతాదేవి అనే బాల సాహితీవేత్తగా మరికొంత పరిచయం అయ్యే వుంటుంది. ఆకాశవాణిలో డి.సుజాతాదేవి రాసిన లలితగీతాలు అనేకం ప్రసారం అయ్యాయి. ఇంత కృషిచేసి కూడా ప్రచార పటాటోపం చేసుకోవటం తెలియని సుజాతాదేవి కొంతకాలంగా అంతర్ముఖీనమై, అనేక కారణాల వలన, అనారోగ్యం వలన బాహ్య సమాజానికి దూరమై పోయింది.
సుమారు యాభై ఏళ్ళక్రితం సుజాతతోటి నా పరిచయం రాను రాను స్నేహబంధంగా గాఢమైంది. అనేక సభలలో సమావేశాల్లో కలిసిన మేము తర్వాత తర్వాత మూడునాలుగేళ్ళ క్రితం వరకూ ఫోనులో సాహిత్యం గురించి చర్చలూ, ఒక్కొక్కప్పుడు ఫోనులోనే పాటలూ, కథలూ రాగరంజితంగా మాట్లాడుకునే వారం. పద్దెనిమిది ఏళ్ళక్రితం భార్గవీ రావు, ఇంద్రగంటి జానకీబాల, అత్తలూరి విజయలక్ష్మి, నేనూ పాపికొండలకు ప్రయాణం కట్టాము. రాజమండ్రిలో సుజాత కూతురు కమల ఇంట్లోనే దిగాము. పడుకోటానికి వేసుకున్న పక్కలమీద చేరి ఆరాత్రి రెండుగంటల వరకూ పోటా పోటీలుగా పాటలు పాడుకుంటూనే వున్నాము. ఏదో ఒక పాట గురించి చర్చ మొదలు పెట్టి పాట పాడుకుంటూ గడిపిన ఆరాత్రి ఈనాటికీ నా మనసులో తాజాగానే రాగాలు తీస్తుంది. తర్వాత ఏడాది నేను పదవీ విరమణ అయ్యాక వీర్రాజుగారూ, నేనూ ఒక అవార్డు మొదలు పెట్టాలనుకుని ఆ ప్రయత్నం కాకుండా ఎవరైనా ఏదైనా కారణం చేత పుస్తకాలు వేసుకోని రచయితల ఒక పుస్తకం 500 కాపీలు వేసి వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ కోవలో మొట్ట మొదటగా అంతకు ముందు ఈనాడు పత్రికలో ధారావాహికంగా వచ్చిన డి. సుజాతాదేవి’ ఆటలో అరటి పండు’ పిల్లల కథల్ని పుస్తకరూపంలో వేసి సుజాతకు ఇచ్చాము.
బందరులో గుత్తి కొండసుబ్బారావుగారు వారి స్పందన సాహితి తరపున ఆ పుస్తకానికి ఆవిష్కరణ ఏర్పాటు చేసారు. ఆ సభలో నేను ఆవిష్కర్తగా, ఇంద్రగంటి జానకీబాల వక్తగా పాల్గొనటాని కోసం ముగ్గురం కలసి ట్రైన్‌లో వెళ్ళాం. సుబ్బారావుగారి ఇంట్లోనే మాకు వసతి ఏర్పాటు చేసారు. ప్రయాణమంతానే కాక ఆ రెండు రోజులు మా ముగ్గురికీ సాహిత్య సంబరమే. ఆ ప్రయాణం మా ముగ్గురినీ మరింత దగ్గర చేసింది. సుజాత ఆంధ్రమహిళా సభ లిటరసీ హౌస్‌లో ఉద్యోగం చేరిన రోజుల్లోనూ, బ్రౌను అకాడమీలో పని చేసినపుడూ కూడా తరుచూ మేము ముగ్గురం కలిసే వాళ్లం. ఒక్కొక్కప్పుడు అత్తలూరి విజయలక్ష్మీ, భార్గవీరావూ కలిసేవారు. కొత్తగా రాసుకున్న కవితో, కథో చదువుకునే వాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం. అయితే అందరం కలిసి ఒక గొలుసు కథ రాయాలనుకున్న మా ప్రయత్నం మాత్రం కార్యరూపం దాల్చలేదు. అకస్మాత్తుగా ఒక రోజు రాంకోఠీ కిమ్స్‌ హాస్పిటల్‌లో హార్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని తెలిసి నేను హాస్పిటల్లో కలిసాను. వాళ్ళ అమ్మాయి ‘‘ఆమెను ఉద్యోగం రాజీనామా చేయించి నల్గొండ తన దగ్గరకు తీసుకు వెళ్ళిపోతున్నానని, హైదరాబాద్‌లో మరి ఉంచదలచుకోలేద’’ని చెప్పినప్పుడు నేను బాధ పడ్డాను. ‘‘ఆఫీసు దగ్గరగా ఇల్లు తీసుకొని ఇక్కడ వుంటేనే సుజాతకు బాగుంటుందేమో. నువ్వు ఎలాగూ నల్గొండలోనే వుంటావు కనుక తరుచుగా రావచ్చు‘‘ అని సలహా ఇవ్వ బోయాను. కానీ నల్గొండ తీసుకు వెళ్ళిపోయారు.
అప్పుడప్పుడు సభల కోసమో, ఏదైనా అవసరార్థమో హైదరాబాదు వచ్చినపుడు కలుస్తూనే ఉన్నాను. సుజాత పెద్దమ్మాయి కొడుకు పెళ్లిలో జానకీ బాలతో సహా మేము ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకున్నాం. మాడభూషి రంగాచార్యులు స్మారక పురస్కారం సుజాతాదేవి రాసిన ‘చేపలు’ కథల సంపుటికి వచ్చినప్పుడూ, మాడభూషి రంగాచార్యుల పురస్కారాల పదేళ్ళ వేడుక సందర్భంగా కూడా మేము కలుసుకున్నాము. అప్పుడే అనుకుంటాను వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేస్తానని వచ్చి రోజంతా మా యింట్లో గడిపింది. వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతుల ఇంటర్వ్యూలు, పరిచయాల సంకలనము ‘‘ముఖేముఖే సరస్వతి ‘‘ అనే పేరుతో సుజాత సంకలనంగా వేసింది. సుజాతాదేవి సాహిత్యం గురించి చెప్పుకుంటే బాలసాహిత్యంలో ఎంత కృషి చేసిందో, కథా రచనలోనూ అంతటి కృషి చేసింది. ఈమె రాసిన చేపలు కథగానీ, సవరాలు కట్టి జీవించే వారి కధ ‘ఎటు చూస్తే అటు’, వెట్టిచాకిరీ చేసే బాబ్జీ కథ ‘మలుపు’, షాపుల ముందు వూడ్చే పనివారి జీవితం ‘ఇంతేలే’, ఆర్థికంగా వెసులు బాటులేని జీవితాల కథ ‘వృత్తం’ చేపల బజార్లో చేపల్ని శుభ్రంచేసి ఇచ్చేందుకు కత్తిపీటల్ని ముందేసుకుని కూర్చున్న బడుగు జీవుల జీవితం చిత్రణే చేపలు కథ. అవిటిదైన కూతుర్ని కాటేసేందుకు చూస్తున్న మృగాల్లాంటి వారి బారినుండి కాపాడి ఒక ఇంటి దాన్ని చేయాలని చూసే ఒక తల్లి తపన ఏవిధంగా ఛిద్రమయ్యిందో తెలిపే కథ ఇది.
రచయిత్రి తొలికథగా చెప్పుకునే 1970లో ప్రచురితమైన ‘‘మలుపు’’ హోటల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాజ్జీ ఎల్లప్పుడూ తనకొక ఇంటినీ, పనిచేసి వచ్చే తనకోసం ఆ ఇంట్లో ఎదురుచూసే వ్యక్తినీ కల కంటుంటాడు. ఆ కల బాబ్జీ జీవితంలో ఎంతగా అందరానిదో తెలియజేస్తుంది ఈ కథ. 1970ల నాటికి తెలుగు కథానికా ప్రపంచం చాలా వరకు ప్రేమ, అపార్థాలూ, ఆటంకాలూ, పెళ్ళి – వీటి మధ్యనే గింగిరాలు తిరిగే కథలకాలం అది. అటువంటి సమయంలో సామాజిక స్పృహతో మారుమూల జీవితాలను స్పృశిస్తూ రాసిన కథలు. సుజాతాదేవి కలంనుండి రావటం గుర్తించదగిన అంశం. ఇలా ఏ కథ తీసుకున్నా సుజాత స్వీకరించిన పలు కథాంశాలు అప్పట్లో రచయిత్రులే కాక రచయితలు కూడా సాహిత్యంలోకి తీసుకురాలేదు. ఏవో గాలి కబుర్లతో రచనలు చేయటం కాకుండా, సాహిత్య విలువలు, సామాజిక బాధ్యత తెలిసినది కావటాక ఏ ప్రక్రియ చేపట్టినా నిబద్ధతతో చక్కని శైలీ విన్యాసంతో వైవిధ్యభరిత జీవన వేదనల్ని ప్రతిభావంతంగా రాస్తుంది సుజాతాదేవి. అందుకే ఎవరు గుర్తించినా, గుర్తించక పోయినా ప్రతిభ వున్నప్పుడు పురస్కారాలు వెతుక్కొంటూనే వస్తాయి అనేందుకు డి.సుజాతాదేవికి వచ్చిన పురస్కారాలే నిదర్శనం. మాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగించినది ఒకటి వుంది. అదేమిటంటే మేము ప్రచురించి ఇచ్చిన ‘ఆటలో అరటిపండు’ పుస్తకానికే సుజాతాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావటం మాకే వచ్చినంతగా సంబరపడ్డాము నేను, వీర్రాజుగారు.
రెండు మూడేళ్ళుగా సుజాత ఫోన్లు చేస్తున్నా ఆమె మాటలు కొంత అసంబద్ధంగా ఉండటం గమనించి ఆమె పిల్లలతో మాట్లాడాను. ‘‘అల్జీమర్‌’’ లక్షణాలు అప్పట్లోనే గమనించాను. కాని నేను సాహిత్యం గురించి, పాత రచయిత్రుల గురించి మాట్లాడినప్పుడు మామూలుగానే తన అభిప్రాయాలు చెప్తూనే వుంది. భగవద్గీత అంశాలను పాటలుగా రాస్తున్నానని ఫోన్‌ చేసినపుడు పాడి వినిపించేది. ఫోను చేసినపుడల్లా ఆమెతో ‘‘మొత్తం పాటలు తొందరగా రాయటం పూర్తి చేసి పుస్తకంగానో, కేసెట్‌గానో చేయమని ప్రోత్సహిస్తూ మాట్లాడేదాన్ని. అప్పటికి అదే ప్రయత్నంలో వున్నానని చెప్తుండేది. 2022 మార్చిలో వీర్రాజుగారి పెయింటింగ్స్‌ దామెర్ల కళానికేతన్‌కి వితరణ చేసిన సందర్భంలో వెళ్ళినప్పుడు కమల వాళ్లమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకువచ్చింది. సుజాత నన్ను గుర్తుపట్టి మాట్లాడిరది కాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. అదే నేను ఆమెను ఆఖరు సారి చూడటం. సుజాతకు ఫోను అందుబాటులో లేకుండా అయిపోవటం వలన అమ్మాయికి సందేశాలు పంపి ఆమెగురించి తెలుసుకునేదాన్ని. మాడభూషి లలితాదేవీ, నేనూ సుజాతను చూడటానికి రాజమండ్రి వెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాము. కానీ కార్యరూపం దాల్చలేదు. మూడు నెలల క్రితం ఏప్రిల్‌లో సుజాత పుట్టిన రోజుకి అమ్మాయి కమల నెంబరుకి శుభాకాంక్షలు పంపాను. కమల తన ఫోన్‌ నుండి నాకు ఫోను చేసి సుజాతకి అందించింది. సుజాత ఫోను చేసినప్పుడల్లా పాటతో పలకరించటం అలవాటు, ఎప్పట్లాగే ఆరోజు కూడా అలాగే పలకరించింది. సుజాత అలా పాటతో పలకరించటం, నేను నవ్వి సమాధానం చెప్పటం ఎన్నేళ్ళుగానో మామధ్య జరుగుతూనే వుండేది. ఇప్పుడు ఆ నవ్వూ తరలిపోయింది. పాటా కరిగిపోయింది. ‘‘ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఫోను చేస్తావని ఎదురుచూస్తూ వుండేదాన్ని. ఆ చిన్నినవ్వుతో ఆ చిలిపి నవ్వుతో ఇంక నన్ను అలా పలకరించేవారు ఎవరు సుజాతా’’
(స్నేహితుల దినోత్సవం రోజున అల్జీమర్స్‌తో బాధపడుతూ ఆగష్టు నాలుగో తేదీన కన్నుమూసిన ఆత్మీయ స్నేహితురాలు, రచయిత్రి డి.సుజాతాదేవికి కన్నీళ్ళతో రాసిన అక్షరాంజలి.) ` ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.