మారుమూల తమిళనాడులో, మానసిక ఆరోగ్య సంరక్షణకు కాపలాకాస్తున్న మహిళలు – ఎస్‌.సెందళిర్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

– అనువాదం: వై. క్రిష్ణజ్యోతి
మానసిక వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు, 30 ఏళ్ళుగా కాంచీపురం జిల్లాలోని గ్రామాల్లో పర్యటించారు శాంతి శేష. కానీ ఆమెలాంటి గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు వ్యక్తిగత ఇబ్బందులతో పాటు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు.

‘‘వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు…’’ పక్కనే ఆడుకుంటున్న తన ఆరేళ్ళ కూతుర్ని చూస్తున్న అరుణ (28) ముఖంలో ఏదో తెలియని అయోమయం కనబడిరది. ఆ ‘‘వాళ్ళు’’ ఆమె కుటుంబ సభ్యులే. అరుణ ఎందుకలా ప్రవర్తించేదో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ‘‘నేను వస్తువులను విసిరి కొట్టేదాన్ని. ఇంట్లో ఉండేదాన్ని కాదు. మా ఇంటి దగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు…’’
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తన ఇంటి దగ్గరున్న కొండల్లో తిరుగుతూ ఆమె తరచూ తప్పిపోయేవారు. తమను కొడుతుందేమోనన్న భయంతో ఆమెకు దూరంగా కొందరు పారిపోతే, మరికొందరు ఆమెపై రాళ్ళు విసిరేవారు. అరుణ తండ్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చి, ఆమె మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఒక్కోసారి కుర్చీకి కట్టేసేవారు.
అరుణ (ఆమె అసలు పేరు కాదు) స్కిజోఫ్రెనియా (Schizophrenia) తో బాధపడుతున్నప్పుడు, ఆమెకు 18 ఏళ్ళు. ఆ మానసిక రుగ్మత ఆమె ఆలోచనా తీరుపై, అనుభూతి చెందే విధానంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
కాంచీపురంలోని చెంగల్పట్టు తాలూకా, కొండంగి గ్రామంలో ఉన్న దళిత కాలనీలో తన ఇంటి బయట కూర్చున్న అరుణ ఒకప్పుడు తను పడ్డ కష్టాలను నెమరు వేసుకున్నారు. ఉన్నట్టుండి ఆమె అక్కడినుంచి లేచి వెళ్ళిపోయారు. గులాబీరంగు నైటీలో, చిన్నగా కత్తిరించిన జుట్టుతో, పొడవుగా, నలుపు రంగులో ఉన్న ఆమె వంగిపోయి నడుస్తున్నారు. తన ఒంటి గది పూరిగుడిసెలోకి వెళ్ళి, డాక్టర్‌ రాసిన మందుల చీటీ, రెండు టాబ్లెట్‌ స్ట్రిప్‌లతో తిరిగి వచ్చారు. ‘‘వీటివల్ల నేను నిద్రపోగలుగుతున్నాను. ఇవి నరాల సంబంధిత సమస్యలను నివారించడానికి. నేనిప్పుడు బాగా నిద్రపోతున్నాను. ఈ మందులు తీసుకోవడానికి ప్రతినెలా సెంబాక్కమ్‌ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి వెళ్తాను’’ ఆ టాబ్లెట్లను చూపిస్తూ వివరించారామె.
శాంతి శేష లేకపోయుంటే అరుణకు వచ్చిన జబ్బు గుర్తించబడి ఉండేదే కాదు.
అక్కడేం జరుగుతోందో శాంతి (61) పసిగట్టగలిగారు. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న అరుణ లాంటి వందలాది మందికి ఆమె సహాయం చేశారు. 2017`2022 మధ్యలో, చెంగల్పట్టులో 98 మంది రోగులను గుర్తించి, వారికి వైద్యసేవలు అందించడంలో సహాయం చేశారు శాంతి. స్కిజోఫ్రెనియా రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ూజARఖీ – ఎస్‌సిఎఆర్‌ఎఫ్‌) తరపున, మానసిక రుగ్మతల వల్ల సమాజానికి దూరమవుతున్న వ్యక్తుల కోసం కాంట్రాక్టుపై పనిచేసే సామాజిక ఆరోగ్య కార్యకర్తగా, ఆవిడ కొండంగి గ్రామంలో సుప్రసిద్ధులు.
‘‘అప్పుడామె యుక్తవయసులో ఉందిÑ సన్నగా ఉండేది. ఇంకా పెళ్ళి కాలేదు’’ ఒక దశాబ్దం క్రితం మొదటిసారి కలిసినప్పుడు అరుణ ఎలా ఉందో గుర్తు చేసుకున్నారు శాంతి. ‘‘ఆమె ఊరికే అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. అస్సలు తినేది కాదు. తిరుక్కళుకుండ్రమ్‌లోని వైద్య శిబిరానికి ఆమెను తీసుకెళ్ళమని ఆమె కుటుంబానికి చెప్పాను’’. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తుల సమస్యను నిర్ధారించి, చికిత్స అందించడానికి ఎస్‌సిఆర్‌ఎఫ్‌ ప్రతి నెలా ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించేది.
కొండంగికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కళుకుండ్రమ్‌కు అరుణను తీసుకెళ్ళేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించగా, ఆమె హింసాత్మకంగా మారి తన దగ్గరికి ఎవ్వరినీ రానివ్వలేదు. దాంతో, ఆమె కాళ్ళు, చేతులు కట్టేసి క్యాంపునకు తీసుకెళ్ళారు వాళ్ళు. ‘‘ఆమెకు 15 రోజులకోసారి ఇంజక్షన్‌ ఇవ్వమని (మానసిక వైద్యుడు) నాకు చెప్పారు’’ శాంతి అన్నారు. ఆ పిహెచ్‌సిలో మరో ఎన్జీఓ (Banyan) మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక క్లినిక్‌ను నడుపుతోంది. ‘‘అరుణ ఆరోగ్యం (ఇప్పుడు) మెరుగుపడిరది. ఆమె బాగా మాట్లాడుతోంది.’’
అరుణ ఇంటికి కొన్ని గజాల దూరంలో కొండంగి గ్రామ కేంద్ర బిందువు ఉంది. ఆధిపత్య కులాలకు చెందిన నాయుడు`నాయకర్‌ కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అలాగే శాంతి కూడా నాయుడు. ‘‘అరుణ వారి కులానికి (షెడ్యూల్డ్‌ కులం) చెందినది కాబట్టి, వాళ్ళు ఆమెను (దళిత కాలనీలో) సహించరని’’ శాంతి నమ్ముతున్నారు. కాలనీ వాసులు నాయుడు`నాయకర్‌ పరిసర ప్రాంతాలకు రారు. ‘‘అరుణ ఇక్కడకు వచ్చి ఉంటే, అది గొడవలకు దారితీసేది.’’
నాలుగు సంవత్సరాల చికిత్స తరువాత అరుణకు వివాహం జరిగింది. ఆమె గర్భవతి కాగానే ఆ వ్యక్తి ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చి తన తండ్రి, అన్నయ్యలతో కలిసి నివసిస్తున్నారు. చెన్నైలో ఉంటున్న ఆమె వివాహిత అక్క, ఇప్పుడు ఆమె బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తున్నారు. అరుణ తన అనారోగ్యం కోసం మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం బాగుపడేందుకు సహాయపడిన శాంతి అక్కకు తాను ఋణపడి ఉంటానని ఆమె అన్నారు.
… … …
ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చెంగల్పట్టు తాలూకాలో సర్వే చేయాల్సిన గ్రామాలు, కుగ్రామాల జాబితాను తీసుకుని, లంచ్‌ బాక్స్‌ తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరతారు శాంతి. మధురాంతకంలోని బస్టాండ్‌కి చేరుకోవడానికి దాదాపు గంటసేపు, 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆవిడ. ‘‘వేరే గ్రామాలకు వెళ్ళడానికి ఇక్కడి నుండే రవాణా దొరుకుతుంది మరి’’ తెలిపారామె.
తాలూకా అంతటా ప్రయాణించి, మానసిక అనారోగ్యం ఉన్నవారిని గుర్తించి, వారికి వైద్య సంరక్షణ పొందడంలో సహాయం చేయడమే ఆమె పని. ‘‘మేం ముందుగా సులభంగా చేరుకోగలిగే గ్రామాలకే వెళ్తుంటాం. ఆ తరువాత, మారుమూల ప్రాంతాలకు వెళ్తాం. ఆయా ప్రాంతాలకు బస్సులు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు మేం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు, లేదా మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా బస్టాండ్‌లో వేచి ఉండాల్సి వచ్చేది’’ శాంతి గుర్తుచేసుకున్నారు.
శాంతి నెలంతా పని చేసేవారు. ఆదివారాలు మాత్రమే సెలవు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తగా ఆమె దినచర్య మూడు దశాబ్దాలలో ఒకేలా కొనసాగింది. అంతగా కనిపించనప్పటికీ, ఆమె చేసే పని చాలా ప్రాముఖ్యం కలిగినది. భారతదేశంలోని వయోజన జనాభాలో, 10.6 శాతం మందిని మానసిక రుగ్మతలు ప్రభావితం చేస్తున్నాయి. అయితే, 13.7 శాతం మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక అనారోగ్యాన్ని అనుభవిస్తారు. కానీ చికిత్స అంతరం మాత్రం ఎక్కువగా ఉంది: 83 శాతం. స్కిజోఫ్రెనియాతో జీవిస్తున్న వారిలో, కనీసం 60 శాతం మందికి అవసరమైన సంరక్షణ అందడం లేదు.
సామాజిక ఆరోగ్య కార్యకర్తగా శాంతి ప్రయాణం 1986లో ప్రారంభమైంది. ఆ సమయంలో, అనేక రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం తగినంతమంది నిపుణులు లేరు. శిక్షణ పొందిన కొద్దిమంది కూడా నగరాల్లో ఉండేవారు. దాదాపు ఎవ్వరూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు కారు. ఈ సమస్యను పరిష్కరించి, అందరికీ… ముఖ్యంగా అత్యంత బలహీన, వెనుకబడిన వర్గాల కోసం ‘‘కనీస మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో ఉండేలా’’ నిర్దారించే లక్ష్యంతో, 1982లో నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను (ఎన్‌ఎమ్‌హెచ్‌పి) ఏర్పాటు చేశారు.
1986లో, రెడ్‌క్రాస్‌లో సామాజిక కార్యకర్తగా చేరారు శాంతి. ఆమె చెంగల్పట్టులోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, వికలాంగులను గుర్తించి, వారి తక్షణ అవసరాలను సంస్థకు నివేదించేవారు.
1987లో SCARF శాంతిని సంప్రదించినప్పుడు, కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్‌ బ్లాక్‌లో మానసిక రోగులకు పునరావాసం కల్పించేందుకు, ఎన్‌ఎమ్‌హెచ్‌పి కింద కార్యక్రమాలను అమలు చేసేది ఆ సంస్థ. అలాగే, కమ్యూనిటీ ఆధారిత వాలంటీర్ల కేడర్‌ను తయారుచేయడానికి గ్రామీణ తమిళనాడులో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేది. ‘‘పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసిన సముదాయానికి చెందిన వ్యక్తులను నియమించి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి, వారిని ఆసుపత్రులకు పంపేలా చేయడంలో శిక్షణనిచ్చారు’’ అని SCARF డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.పద్మావతి తెలిపారు. ఆవిడ 1987లో ఆ సంస్థలో చేరారు.
ఈ శిబిరాల ద్వారా వివిధ మానసిక రుగ్మతల గురించి, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు శాంతి. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను వైద్య చికిత్స తీసుకోవడానికి ప్రోత్సహించే నైపుణ్యాలను కూడా నేర్చుకున్నారామె. మొదట్లో తన జీతం నెలకు రూ.25 ఉండేదని శాంతి చెప్పారు. మానసిక రోగులను గుర్తించి, వాళ్ళని వైద్య శిబిరాలకు తీసుకురావాలి. ‘‘నాకు, మరొక వ్యక్తికి కలిపి మూడు పంచాయతీలను కేటాయించారు. ఒక్కో పంచాయతీలో 2`4 గ్రామాలుంటాయి’’ అని ఆమె వివరించారు. ఏళ్ళు గడిచేకొద్దీ ఆమె ఆదాయం పెరిగింది. 2022లో, ఆమె SCARFలో తన విధుల నుండి పదవీ విరమణ చేసినప్పటికీ నెలకు నికరంగా రూ.10,000 (ప్రావిడెంట్‌ ఫండ్‌, బీమా మినహాయింపుల తర్వాత) సంపాదించేవారు.
ఆమె చేసిన పని ఆమెకు స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చి, తన జీవితంలో ఎదురైన సవాళ్ళను ఎదుర్కొనే మనోధైర్యాన్ని అందించింది. తాగుడుకు బానిసైన ఆమె భర్త, కుటుంబ పోషణకు పెద్దగా చేసేదేమీ ఉండదు. వాళ్ళ 37 ఏళ్ళ కుమారుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ, రోజుకు సుమారు రూ.700 సంపాదిస్తారు. కానీ అస్థిరమైన ఆదాయంÑ అతనికి నెలలో 10 రోజులు మాత్రమే పని ఉంటుంది. అతని భార్య, కూతురిని పోషించడానికి కూడా ఆ మొత్తం సరిపోదు. శాంతి తల్లి కూడా వారితోనే ఉంటున్నారు.SCARF చేపట్టిన స్కిజోఫ్రెనియా అవగాహనా కార్యక్రమం 2022లో ముగిసిన తర్వాత, శాంతి తంజావూరు బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారు. యాభై బొమ్మలకు గాను ఆమెకు సుమారు రూ.3,000 వస్తుంది.
దాదాపు 30 సంవత్సరాల పాటు జనంలో పనిచేసినా, శాంతి అలసిపోలేదు. ఎన్జీఓలో పనిచేస్తున్న చివరి ఐదేళ్ళ కాలంలో, ఆమె చెంగల్పట్టులోని కనీసం 180 గ్రామాలను, కుగ్రామాలను సందర్శించారు. ‘‘నాకు వయసైపోతున్నా ఈ పనిని కొనసాగించాను. నాకు పెద్దగా డబ్బు రానప్పటికీ, నేను సంపాదించిన దానితోనే జీవితం నెట్టుకొచ్చాను. నాకు మానసికంగా సంతృప్తికరంగా ఉంది. ఇందులో గౌరవం ఉంది’’ అన్నారు ఆవిడ.
… … …
శాంతితో కలిసి చెంగల్పట్టు అంతటా ప్రయాణిస్తూ, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వారిని గుర్తించారు 49 ఏళ్ళ సెల్వి. 2017`2022 మధ్యలో మూడు బ్లాక్‌ పంచాయతీల్లోని ఉత్తిరమేరూర్‌, కాట్టాంగొళత్తూర్‌, మదురాంతకం`117 గ్రామాలకు వెళ్ళి, 500 మందికి పైగా వైద్య సహాయం అందించారు సెల్వి. ఆమె 25 సంవత్సరాలకు పైగా SCARF లో పనిచేశారు. ఇప్పుడామె మరో ప్రాజెక్టులో నిమగ్నమై, చిత్తవైకల్యం (dementia) ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు.
సెల్వి చెంగల్పట్టులోని సెంబాక్కమ్‌ గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేయడం మొదలుపెట్టారు. ఆమె చేనేత ప్రధాన వృత్తి అయిన సెంగుందర్‌ సముదాయానికి చెందినవారు. ఇది తమిళనాడులో ఇతర వెనుకబడిన తరగతిగా వర్గీకరించబడిరది. ‘‘నేను 10వ తరగతి తర్వాత చదువుకోలేదు. కాలేజీకి వెళ్ళాలంటే మా ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుప్పోరూర్‌కి వెళ్ళాలి. నేను చదువుకోవాలనుకున్నాను కానీ దూరం కారణంగా నా తల్లిదండ్రులు నన్ను పంపించలేదు’’ అన్నారామె.
ఇరవయ్యారేళ్ళ వయసులో సెల్వికి పెళ్ళయింది. అయితే తన కుటుంబానికి ఆవిడే ఏకైక జీవనాధారం అయ్యారు. ఎలక్ట్రీషియన్‌ అయిన ఆమె భర్త ఆదాయం సరిపోయేది కాదు. దాంతో, తనకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే ఇంటి ఖర్చులు, ఇద్దరు కొడుకుల చదువులు నెట్టుకొచ్చారావిడ. పెద్ద కొడుకు (22) ఆరు నెలల క్రితమే కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. చిన్న కొడుకు (20) చెంగల్పట్టులోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాడు.
గ్రామాలకు వెళ్ళి స్కిజోఫ్రెనియా రోగులను చికిత్స తీసుకోమని ప్రోత్సహించే ముందు, సెల్వి వాళ్ళకి కౌన్సిలింగ్‌ నిర్వహించేవారు. ఆమె పది మంది రోగులకు మూడేళ్ళపాటు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ‘‘నేను వారానికోసారి వారి దగ్గరకు వెళ్ళేదాన్ని. ఇలా వెళ్ళినప్పుడు చికిత్స, ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహారం, పరిశుభ్రత… వీటి ప్రాముఖ్యం గురించి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించేదాన్ని.’’ మొదట్లో సెల్వికి ఈ సముదాయం నుండి చాలా ప్రతిఘటన ఎదురైంది. ‘‘అసలు సమస్య ఉందనే విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. ఇదొక అనారోగ్య సమస్య అని, చికిత్స చేయవచ్చని వారికి నచ్చచెప్పేవాళ్ళం. కానీ రోగుల కుటుంబీకులకు కోపం వచ్చేది. రోగులను ఆసుపత్రులకు కాకుండా మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు. రోగులను వైద్య శిబిరానికి తీసుకువచ్చేలా ఒప్పించడానికి చాలాసార్లు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, చాలా ప్రయత్నాలు చేయవలసి వచ్చేది. రోగికి ప్రయాణం చేయడం కష్టంగా అనిపించినప్పుడు, వైద్యులే వారి ఇళ్ళకు వెళ్ళేవారు.’’
దాన్ని అధిగమించడానికి సెల్వి తన సొంత వ్యూహాన్ని రచించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించేవారామె. ప్రజలు ఎక్కువగా గుమిగూడే టీ కొట్టుకి కూడా వెళ్ళేవారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులతో, పంచాయతీ సభ్యులతో మాట్లాడేవారు. వాళ్ళే ఆమెకు ప్రధాన పరిచయ వ్యక్తులుగా మారారు. వాళ్ళకి స్కిజోఫ్రెనియా లక్షణాలను, వైద్య సంరక్షణ ఎలా సహాయపడుతుందో వివరించి, వారి గ్రామంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గురించి సమాచారం అడిగేవారు. ‘‘కొంతమంది సంకోచించేవారుÑ కొంతమంది మాత్రం వివరాలు చెప్పేవారు, లేదా రోగి ఇంటికి దారి చూపించేవారు. చాలామందికి నిర్దిష్ట సమస్య తెలియదు. ఒక వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నదనో, లేదా కొందరు చాలాకాలంగా నిద్రపట్టకపోవడం గురించి మాట్లాడుతున్నారని వాళ్ళు మాకు చెప్పేవారు’’ అని సెల్వి వివరించారు. సజాతి వివాహాలు, మేనరికపు వివాహాలు సర్వసాధారణమైన సమాజంలో పెరిగిన సెల్వి, మేధో వైకల్యాలతో (cognitive disabilities) జన్మించిన అనేకమంది పిల్లలను చూశారు. మానసిక ఆరోగ్యం, మేధో వైకల్యాల లక్షణాల మధ్య ఉండే తేడాను గుర్తించడానికి… ఇది ఆమె పనికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలలో ఒకటి… ఇది తనను సిద్ధం చేసిందని ఆవిడ తెలిపారు. మందులు రోగి ఇంటివద్దకే చేరేలా చూడటం సెల్వి ముఖ్యమైన పని. భారతదేశంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువ మంది ఆరోగ్య సేవలు, ఔషధాల ఖర్చులను దాదాపుగా వారే చెల్లిస్తున్నారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద అందించే సేవలను పొందేందుకు, దాదాపు 40 శాతం మంది రోగులు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. మారుమూల గ్రామాలలో ప్రజలు తరచూ చికిత్స తీసుకోవడం చాలా కష్టం. అనారోగ్య లక్షణాలతో పోరాడుతూ, సామాజిక అంచనాలను అందుకోలేని రోగులకు ఎదురయ్యే మరో పెద్ద సమస్య… ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఆపాదించే కళంకం. ‘‘టీవీ చూడడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మెరుగుదల కనబడుతోంది. ప్రజలు అంతగా భయపడడం లేదు. బి.పి., షుగర్‌ (రక్తపోటు సమస్యలు, మధుమేహం) సమస్యలకు చికిత్స అందించడం సులభమైంది. కానీ, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను సంప్రదించినప్పుడు, ఇప్పటికీ వాళ్ళు కోపంగా మాట్లాడుతూ, మాతో గొడవకు వస్తారు. ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ పిచ్చోళ్ళున్నారని ఎవరు చెప్పారు మీకు?’ అంటూ అరుస్తారు’’ అని ఆవిడ చెప్పారు.
… … …
చెంగల్పట్టు తాలూకాలోని మణమది గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోన్న 44 ఏళ్ళ డి.లిల్లీ పుష్పం గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఉన్న అపోహల విషయంలో సెల్వితో ఏకీభవించారు. ‘‘చాలా అనుమానాలు ఉంటాయి. పేషెంట్లను సైక్రియాట్రిస్ట్‌ కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురిచేస్తాడని కొందరు నమ్ముతారు. ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చినా భయపడుతుంటారు. మేం మా గుర్తింపు కార్డు (ఐ.డి.)ను వారికి చూపించి, ఆస్పత్రి నుంచి వచ్చామని వివరిస్తాం, కానీ వాళ్ళు మమ్మల్ని అనుమానంగానే చూస్తుంటారు. మేము చాలా కష్టపడాల్సి వస్తుంది’’ లిల్లీ వివరించారు. మణమదిలోని దళిత కాలనీలో పెరిగారు లిల్లీ. అలా పెరగడం వలన, పనిలో తాను ఎదుర్కొనే వివక్షత పట్ల ఆమెకు అవగాహన ఉంది. కొన్నిసార్లు ఆమె కులం ఆమెను ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే ఎవరైనా అడిగినా తను ఎక్కడ నివసిస్తారో చెప్పరు. ‘‘నేను నిజం చెబితే వాళ్ళకి నా కులమేంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నన్ను వేరేగా చూస్తారని భయపడుతుంటాను’’ అన్నారామె. లిల్లీ దళిత క్రిస్టియన్‌ అయినప్పటికీ, తనను తాను క్రిస్టియన్‌గా మాత్రమే గుర్తిస్తారామె. ఆరోగ్య కార్యకర్తలతో ఒక్కో గ్రామంలో ప్రజలు ఒక్కోలా వ్యవహరిస్తారని లిల్లీ అన్నారు. ‘‘ధనవంతులు, అగ్రవర్ణాలు నివసించే కొన్ని ప్రదేశాలలో, మాకు తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వరు. కొన్నిసార్లు ఎంతగా అలసిపోతామంటే, వెంటనే ఎక్కడో అక్కడ కూర్చుని తినాలనిపిస్తుంది. కానీ వాళ్ళు మమ్మల్ని అనుమతించరు. ఆప్పుడు మాకు చాలా బాధగా అనిపిస్తుంది. దాని వలన ఎక్కడైనా కూర్చుని తినడానికి మేము కనీసం 1`4 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కొన్నిచోట్ల మాత్రం మాకు తాగడానికి నీళ్ళు ఇస్తారు. మేం భోజనానికి కూర్చున్నప్పుడు మాకేదైనా అవసరమా అని కూడా అడుగుతారు’’ అని ఆమె వివరించారు.
లిల్లీకి 12 ఏళ్ళు ఉన్నప్పుడే తన మేనబావతో వివాహం జరిగింది. అతను ఆమెకంటే 16 సంవత్సరాలు పెద్ద. ‘‘మేం నలుగురు ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని’’ అని ఆమె చెప్పింది. వాళ్ళ కుటుంబానికున్న మూడు సెంట్ల భూమిలో ఒక మట్టి ఇల్లు నిర్మించుకున్నారు. ‘‘తన ఆస్తిని చూసుకోవడానికి, భూమిని సాగు చేయడానికి ఒక వ్యక్తి సహాయంగా ఉండాలని మా నాన్న కోరుకున్నాడు. అందుకే నన్ను తన అక్క కొడుకుకిచ్చి పెళ్ళి చేశాడు’’. కానీ ఆమె వైవాహిక జీవితం సంతోషంగా లేదు. ఆమె భర్త విశ్వాసపాత్రుడు కాదు. అతను నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. వచ్చినప్పుడు మాత్రం ఆమెను కొట్టేవాడు. అతను 2014లో కిడ్నీ క్యాన్సర్‌తో మరణించాడు. అప్పటికి ఆమెకు వరుసగా 18, 14 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు.
2006లో,SCARF లో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా ఉద్యోగం దొరికే వరకూ లిల్లీ కుట్టుపని చేసేవారు. ఆమె వారానికి రూ.450`550 వరకు సంపాదించేవారు. కానీ అది కుట్టించుకోవడానికి వచ్చేవాళ్ళ సంఖ్యపై ఆధారపడి ఉండేది. అంతకన్నా మెరుగైన జీతం ఇవ్వడం వల్లనే తాను ఆరోగ్య కార్యకర్తనయ్యానని అన్నారావిడ. కోవిడ్‌`19 ఆమె నెలవారీ ఆదాయానికి (రూ.10,000) గండి కొట్టింది. కోవిడ్‌`19కి ముందు, ఆమె తన బస్‌, ఫోన్‌ ఛార్జీలను సంస్థ నుండి పొందేవారు. ‘‘కానీ కరోనా కారణంగా రెండేళ్ళపాటు నా ఫోన్‌ బిల్లు, రవాణా ఛార్జీలు కూడా ఆ రూ.10,000లోపే నెట్టుకు రావలసి వచ్చింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను’’ అంటూ ఆ గడ్డు రోజులను నెమరు వేసుకున్నారామె.
ప్రస్తుతం ఎన్‌ఎమ్‌హెచ్‌పి కింద ఎన్‌సిఎఆర్‌ఎఫ్‌ చేపట్టిన కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ ముగియడంతో, చిత్తవైకల్యం ఉన్న వ్యక్తుల సంరక్షణ కోసం ఆ సంస్థ ప్రారంభించిన ప్రాజెక్టులో లిల్లీ పనిచేస్తున్నారు. మార్చిలో పని ప్రారంభమైంది. ఆమె వారానికొకసారి వెళ్తారు. కానీ స్కిజోఫ్రెనియా రోగులను ఇప్పటికీ చికిత్స కోసం చెంగల్పట్టు, కోవళం, సెంబాక్కమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారావిడ.
సామాజిక ఆరోగ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న శాంతి, సెల్వి, లిల్లీ లాంటి మహిళలు 4`5 సంవత్సరాల కాంట్రాక్టులపై పనిచేయవలసి వస్తుంది. SCARF లాంటి ఎన్జీఓలు నిర్ణీత కాలంలో (term based) పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల కోసం విడుదల చేసిన నిధుల ఆధారంగా వారిలాంటి కార్మికులను తీసుకుంటాయి. ‘‘రాష్ట్ర స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం’’ అని SCARFకు చెందిన పద్మావతి తెలిపారు. ఇది సామాజిక ఆరోగ్య కార్యకర్తల పనిని క్రమబద్దీకరించడంలో సహాయపడుతుందని ఆ సంస్థ నమ్ముతోంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌ కేటాయింపులు ఇంత నాసిగా లేకుంటే పరిస్థితులు వేరేగా ఉండి ఉండవచ్చు. 2023`24లో మానసిక ఆరోగ్యం కోసం ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ అంచనా రూ.919 కోట్లు. కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంది. అందులో ప్రధాన భాగం రూ.721 కోట్లు బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (NIMHANS) కోసం కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని లోక్‌ప్రియ గోపీనాథ్‌ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, తేజ్‌పూర్‌ (రూ.64 కోట్లు), నేషనల్‌ టెలీ`మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం (రూ.134 కోట్లు)లకు కేటాయించారు. మౌలిక సదుపాయాలు సిబ్బంది అభివృద్ధిని పరిశీలించే (సదరు మంత్రిత్వ శాఖ చేపట్టిన) జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జాతీయ ఆరోగ్య మిషన్‌లో ‘‘తృతీయ కార్యకలాపాల’’ కింద చేర్చారు. కాబట్టి, తృతీయ స్థాయి కిందకు వచ్చే మానసిక సంరక్షణ కోసం కేటాయింపులు ఉండవు.
ఇదిలా ఉంటే, మణమదిలో తనకు అందాల్సిన సామాజిక భద్రతా ప్రయోజనాన్ని పొందేందుకు ఇప్పటికీ లిల్లీ పుష్పం కష్టపడుతున్నారు. ‘‘నేను వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలంటే లంచమివ్వాలి. వారికి ఇవ్వడానికి నా దగ్గర రూ.500`1,000 కూడా లేవు. నేను ఇంజెక్షన్‌, టాబ్లెట్లు ఇవ్వగలనుÑ కౌన్సిలింగ్‌ అందించగలనుÑ రోగుల ఆరోగ్యం గురించి ఫాలోఅప్‌ చేయగలను. కానీ ఈ అనుభవం SCARF లో తప్ప ఎక్కడా (ఉపయోగకరంగా) పరిగణించబడదు. నా జీవితంలో ప్రతిరోజూ కన్నీళ్ళతో నిండి ఉంటుంది. నాకు సహాయం చేసేవారెవరూ లేకపోవడంతో బాధగా ఉంది’’ అంటూ లిల్లీ విచారంగా చెప్పారు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/in-remote-tn-women-ushering-mental-care/) ఏప్రిల్‌ 7, 2023 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.