హిందువంటె ఏంది బిడ్డా! – జూపాక సుభద్ర

నా ప్రమేయం లేకుండనే నా కుల సర్టిఫికట్‌ లోకి ‘హిందుమతం’ అనే పేరు ఎట్లోచ్చిందో తెలువది. మా యింట్ల మా వాడల కూడా ‘హిందూమతం’ అనే మాట వాడుకలో లేదు. మరి నా సర్టిఫికట్లోకి నేను హిందువని ఎట్లా ఎక్కింది? మా కుటుంబం, కులం ఆ హిందూ పదం’ తో ఐడెంటిఫై కాలే. అది అనరు, మాట్లాడరు. మరి ఎక్కడిది ఈ పదం!

నాకు తెలువనిది మా పర్యావరణంలో, మా భాషలో లేని యీ పదము ఎక్కడిది? అని నేను కొత్తలో చాలా కొట్టుకు లాడేది. తర్వాత తెల్సింది ఇది నాలుగు తలలతో వేయి పడగలుగా విచ్చుకొని మా కులాలకు జాతులకు తెలువకుంటనే మమ్మల్ని దురాక్రమించుకున్నదని. సరే! కానీ మాకు హిందూ మతాన్ని కట్టబెట్టితే మాకు ఫాయిదా ఏముంది? మమ్మల్ని అంటరానివారుగా, కుక్కలు, నక్కలు పశువుల కన్నా నీచంగా దూరంగా చూసే అమానవీయతలు అంటరాని తనాలు పేదరికం,గుడిలోకి రానీయని నిషేధాలు. అట్లాంటి దుర్మార్గపు కులవిలువలు, నిషేధ విలువలు అమానుషత్వ విలువలున్న ‘హిందూ మతాన్ని’ ఎట్లా మోయాలి, ఎందుకు మోయా లనేదే నేడు దళితులూ ఆదివాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సంకటము.
చారిత్రకంగా చుస్తే దళిత కులాలు హిందూ మతమ్మీద తిరుగుబాటు చేసి ఓడి%శీ%ప బడిన కమ్యూనిటీలు. హిందూ మత హింసా దుర్మార్గాలపై ఆ భావజాలంపై ఎదురు తిరిగి తిరస్కరించిన హేతువాద ప్రకృతి వాదులు దళితులు. తరతరాల్నించి హిందూ మతం దళితుల్ని శత్రువులుగానే చూసింది, చూస్తుంది. అనుమానాస్పదులుగా, అపనమ్మకస్తులుగానే చూస్తుంది. చరిత్రలో దళితుల్నించి ఎన్ని తిరుగుబాట్లు, ఎంత పోరాటా న్ని చవిచూసి భంగపడిరదో హిందూ మతం. అందుకే నేమో దళితుల%శీ%టె హిందూ మతానికి భయము.అయినా దానికి ఆధిపత్యం దొరికినప్పుడల్లా దాని హింసను, నిషేదాల్ని ప్రదర్శించుతూ నిలబెట్టుకుంటుంది.
హిందూ మతం మనుషుల్ని నిలువునా చీల్చేది. నిచ్చనమెట్ల సమాజానికి తాత్విక భూమికను ఇచ్చింది. మనిషిని మనిషి కులంపేరుతో సాగించే దోపిడీ హింసలకు సామాజిక దన్ను కల్పించేది, వ్యవస్తీకరించేది హిందూ మతం. దళితులూ దాని కోరలు చీల్చే కొడవండ్లే. దళితులూ భూములనించి మానవ హుందాతనాల్నించి, విద్య నించి సోషల్‌ ఖైదీలుగా, బానిసలుగా నెట్టేసింది హిందూ మతం. ఇది చాలా తెలివిగా పగడ్బందిగా రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 341 లో 3వ పేరాలో చదువుకున్న దళితుల సర్టిఫికెట్‌ లోకి చొరబడి వారి ఆమోదం లేకుండానే తన కంట్రోల్‌ లోనికి తెచ్చుకుంది. బహిరంగంగా ‘దళితులు హిందువులు’ అనే దమ్ము లేక హిందూ ఆధిపత్యము ఈ ఆర్టికల్లో ఇరికించిండ్రు.
ఆర్టికల్‌ 341 లోని 3 వ పేరా ఏంటంటే దళితులూ వేరే మతంలో ఉంటె దళితులుగా పొందే ప్రభుత్వ, రాయితీలు వర్తించబడవట.దానివల్ల నా కుల సర్టిఫికెట్టులో నేను హిందువుగాకున్నా నేను హిందువునైన. నాకు నా కుటుంబానికి జాతికి తెలువకుండనే నా పేరును బట్టి హిందువును జేసిండ్రు హిందూ మతవ్యవస్థ. మా ఇంట్లనే మా చిన్నాయిన పేరు యాకోబు అతని కుల సర్టిఫికెట్టు ‘బిసి’ సీ కులం అని సర్టిఫికెట్‌ యిచ్చిండ్రు. మా బంధువుల్లోని చాల మంది పేర్లు క్రిస్టియన్‌ పేర్లు వుంటే వాళ్లకు తెలువకుండనే వాల్లు యస్‌ సి ల నుంచి బి సి లయిండ్రు సర్టిఫికెట్లలో. సరే బి సి లయిండ్రని వాల్లని వూల్లె బీసీల ఓసీల ఇండ్ల పక్కన వుండనిస్తరా, గుల్లెకు పోనిస్తరా వాల్లు అంటరాని తనాల నుంచి విముక్తి అయిండ్రా అంటే,.అదీలేదు. వాల్లని మాదిగల కిందనే చూస్తరు గానీ బి సి లుగా చూడరు. బి సి లే కదాని బి సిలు వియ్యాలందుతరా అంటే అదీ లేదు. అదేగాక వాల్ల కున్న దళిత రిజర్వేషండ్లు, రాయితీలు మొత్తం కోల్పోబడినారు. దళిత రాయితీలు రిజర్వేషన్లు క్రిస్టియన్‌ మతంలోకి మారిన దళితులకు వర్తించవట. ఇదెక్కడి న్యాయం, ఇదేమి దుర్మార్గం, దళితులు హిందువుగ ఉంటేనే దళిత రాయితీలనే నిబంధన దళితులకే ఎందుకు?
అదే మా ఊల్లె కొంతమంది బి సిలు, ఎరుకలోళ్లు క్రిస్టియన్‌ మతంల జేరి పేర్లు మార్చుకున్నారు. వాల్ల కుల ధ్రువీకరణ పత్రములో వాల్ల కులం ఎటుబోలె. ఏ కులం వాల్లకు ఆ కులం సర్టిఫికెట్లే యిచ్చిండ్రు. మరి మా కులం (దళిత) వాల్లకు మా కులం సర్టిఫికెట్లిచ్చే దానికి యీ హిందూ మత తిరకాసేంది? బి సిలకు, ఆదివాసీలకు మత ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికనే కుల గుర్తింపు సర్టిఫికెట్లు తద్వారా పొందే రాయితీలకు ఎలాంటి అడ్డంకుల్లేనప్పుడు దళితులకే ఎందుకు యీ వివక్షలు? దళితులూ మతం మార్చుకునే స్వేచ్ఛ లేకుండా చేసి దళితులుగా పొందాల్సిన రాజ్యాంగ రాయితీలను చాల కుట్ర పూరితంగా, దౌర్జన్య పూరితంగా హిందూ మతం దళితుల్ని దురాక్రమించింది అప్రజాస్వామికంగా.
దళితులది ప్రకృతి మతం. మొదట్నుంచీ హిందూ మత చట్రం అదుపాజ్ఞల్లో లేదు. కనుసన్నల్లో ఇముడలేదు. బడికి దూరం.గుడిలోకి రానియ్యరు. ఊరిలో ఉండనియ్యరు. హిందువుల బంధువులం కాదు. అయినా మా కుల సర్టిఫికెట్ల మీదా,మా టీసీల మీద దౌర్జన్యంగా 341 ఆర్టికల్‌ 3 వ పేరా చూయించి పేరును బట్టి హిందువని, హిందువు కాదని దళిత రాయితీలు గుంజేయడమేంటి. హిందువునని పేరు మార్చుకొని ఒప్పుకుంటే నాకు యస్‌ సి 15% రిజర్వేషన్‌, లేకుంటే నాకు బి సి లో 1% రిజర్వేషనే.ఏందో యీ హిందూ హింస. జీవితాంతం ఎదుర్కొనే హింస యిది. హిందూ హింస దళితులకు కుల ధ్రువీకరణ పత్రాలతోనే ఆగి పోవడం కాదు. యస్‌ సి రిజర్వేషండ్లు పొంది ఉన్నత విద్య ఉద్యోగంలో చేరిన వారి మీద, స్థానిక సంస్థల్లో యస్‌ సి రిజర్వేషన్స్‌ లో సర్పంచి యం పి టి సి, జెడ్‌ పి టి సి లుగా ఎన్నికైన వారి మీద, ప్రమోషన్స్‌ లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ (ఆర్‌ ఓ ఆర్‌) మీద హిందూ రంద్రాన్వేషణ సాగుతుంటది.
మా ఆఫీసులో చేరేప్పుడు బొట్టు లేకుండా జాయినయి హిందూ హింస పడలేక ఉద్యోగానికి ఎసరొస్తదని చిన్న నల్ల బొట్టుబిళ్లలు అంటించుకున్న దళిత మహిళలు చాల మంది కనిపిస్తారు. అట్లనే స్థానిక సంస్థల్లో ఎన్నికైన దళిత నాయకుల్ని దళిత మహిళా నాయకుల్ని నువ్వు ఎస్సీ రిజర్వేషన్‌ లో సర్పంచయినవు నీ మొకాన బొట్టేది అని వేధిస్తుంటరు హిందుత్వవాదులు. వారి బొట్టు కారణం చూపి వాల్లను బ్లాక్‌ మెయిల్‌ చేయడం బలవంతంగా బొట్టు బెట్టించడం లేదా క్రిస్టియన్వి నీవు యీ ‘యస్‌ సి రిజర్వేషన్‌ కోటా కింద వచ్చినవు నిన్ను తొలగిస్తాం’ అని బెదిరించడం చేస్తున్న కేసులు స్థానిక సంస్థల్లో బోలెడు బొచ్చెడు.
ఒక ప్రభుత్వ డాక్టర్‌ యీ మధ్య ఇటువంటి కేసే ఎదురుకున్నాడు. ఒక ప్రభుత్వాసుపత్రికి మా బంధువు ఒకతను (ఎస్సి మాదిగ) డాక్టరు తర్వాత సూపెర్నెంటయి ఆ తర్వాత రీజినల్‌ డిప్యూటీ డైరెక్టరయిండు ప్రమోషన్స్‌ లో రిజెర్వేషన్స్‌ వల్ల.. ఆ డాక్టరుతో పాటే జాయినైన ఒక దళితేతర డాక్టర్‌ ఈ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హిందువు కాదు క్రిస్టియన్‌ అని హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ లో బి జె పి ‘దళితమోర్చా’ ను కూడా కలుపుకొని కేసు వేసింది. ‘ దళితమోర్చా’ పని ఏంటంటే దళితులు హిందువులుగానే వుండాలే, హిందూ పేర్లే పెట్టుకోవాలె, హిందూ పెండ్లే చేసుకోవాలె, చచ్చిపోయినా హిందూ కర్మకాండలే చేసుకోవాలె అని చెప్తారు. వీరు దళితుల్ని హిందూ కట్టడి చేయడానికి సందు దొరకకు న్నా కిరస్తానీ పేర్లు బెట్టుకొని దళిత రిజెర్వేషన్స్‌ పొందుతూన్న వారి మీద పడతారు. విద్యలో, ఉద్యోగంలో, స్థానిక సంస్థల్లో హిందూ మతం పేరు లేకున్నా, మొకాన బొట్టు లేకున్నా వారిని హింసబెట్టి వారి రిజర్వేషన్స్‌ పీకి పడెయ్యడమే ‘ఈ దళిత మోర్చా కార్యకలాపాలు హిందూ మాలమాదిగలకే రిజర్వ్‌ షండ్లు. కిరాస్తాండ్ల జేరినంక గూడ మీకు రిజర్వ్‌ షండ్లుకావాలా కుదరది. మేము నష్టపోమా’ అని మాట్లాడ్తరు.
దానికి జవాబుగా ‘హిందువులుగానే పెండ్లిల్లు జేస్కుంటం, పేర్లు బెట్టుకుంటం సావు, దినం అన్ని హిందువులెక్కనే జేస్తం. మరి మాకు అంటరాని తనాలు లేకుంట జేస్తారా, గుడిలోకి బాజాప్తుగబోయే అవకాశాలు కల్పిస్తారా మా అవకాశాల్ని, హక్కులని మనుషులుగా పొందనిస్తారా’ !’ వీటి మీద ఎందుకు మీ ‘దళితమోర్చా’ కొట్లాడది? మీసాటి కులపోల్లు రిజెర్వేషన్‌ పొంది ఏదో ఉద్యోగం, ప్రమోషన్‌, సర్పంచ్‌ అయితే వారి రాయితీలను తీసేసే దాకా నిద్రబోరు. ఎందుకు? అని వాదిస్తే ‘కులపోల్లయితే హిందువుగ ఉండి కొట్లాడు. వేరే మతంలకు బొయి మా హిందూ రాయితీలను దొబ్బుతరా’ అని అడ్డంగా వాదిస్తుంటరు ఉన్మాదంగా.
సరే యీ దళిత డాక్టర్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తల్లి పేరేంది తండ్రి పేరేంది బంధువులందరి పేర్లేంది? వాళ్లకేం సర్టిఫికెట్లున్నయి వాల్ల పరిసరాల్లో చర్చీలున్నాయా! వుంటే వీరి కార్యకలాపాలేంటి? పెండ్లి ఫోటోల్లో చాలామంది బొట్టు లేని ఆడవాళ్లు, సూట్‌ వేసుకున్న మొగవాళ్ళంజూసి ఇది క్రిస్టియన్‌ నేపథ్యాలున్న కుటుంబమే అనీ నెత్తిమీద పెళ్ళికూతురికి కొంగున్నది ఇది క్రిస్టియన్‌ సంప్రదాయమేమో అని రకరకాల అనుమానాలతో, ఎంక్వయిరీలతో వేధించడం జరిగింది. చివరికి
ఆ డాక్టరు ‘దళితమోర్చా’ల హిందూ శీల పరీక్షలలో నుంచి తప్పించుకున్నాడు. ఎంత ప్రాణ సంకటం, ఎంత హింస అనుభవించారో దళితుడైన ఆ డాక్టర్‌ తో పాటు కుటుంబమంతా. హిందూ రాజకీయ మతోన్మాదులు ‘దళితమోర్చా’ తో తమ వేళ్ళతో, తమ కళ్లనే పొడిపించే హిందూ కుట్రలు చేస్తున్నారు.
‘దళితమోర్చా’ లో ఉన్న దళితులు ఈ హిందూ దళిత వ్యతిరేక కుట్రలకు, అమానుషాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ హిందూ మతాన్ని మట్టుబెట్టి తమ జాతి పునాదుల్ని పునరుద్ధరించాల్సిన అవసరముంది. ఆర్టికల్‌ 341లో మూడవ పేరాని తొలగించడానికి, దళితుల పట్ల ఉన్న హిందూ వివక్షల్ని బలవంతపు చట్రాల్ని కూల్చడానికి లౌకిక వాదులంతా పోరాడాల్సిన అవసరముంది. మానవ విలువల్లేని హిందూ మతాన్ని తుదముట్టించదానికి ముందు పడేది అత్యధికంగా వివక్షలకు గురయ్యే దళితులు.వారు చేసే పోరాటాలకు హిందూ వ్యతిరేక శక్తులు బాసటగా నిలవాల్సి ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.