బ్రిటిష్ పాలనా కాలం నాటి ఆంధ్రలో బాల్య వివాహ దురాచారం విలయతాండవం చేసేది. దీని ప్రధాన బాధితులు బాలికలు / స్త్రీలు. బాల్య వివాహాలు అనేక అనుషంగిక సమస్యలకు దారి తీసేవి. బాలికల బాల్యానుభవాన్ని హరించి, వారి విద్యావకాశాలకు తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ఈ వివాహాలు, చాలా వరకు అసమ వివాహాలు కూడా.
అంటే భార్యాభర్తల వయసుల్లో చాలా ఎక్కువ తేడా వుండేది. ఒక ఉదాహరణ చూద్దాం. (బహుశా) జులై 1887లో తిరుపతిలో ఒక పెళ్ళి జరిగింది. 80 సంవత్సరాలు పైబడ్డ వరుడు 13 సంవత్సరాల బాలికను పదివేల రూపాయల కన్యాశుల్కంతో కొనుక్కొని, పెళ్ళి చేసుకున్నాడు. ఈ తాతగారి పెళ్ళిని ఆగష్టు 1887 నాటి హిందూజన సంస్కారిణి (పు.18) రిపోర్టు చేస్తూ, యిలాంటి పెళ్ళిళ్లు జరక్కుండా చట్టం చేయమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. అన్ని సందర్భాల్లోనూ వధూవరుల మధ్య యింత పెద్ద ఎత్తున కాకపోయినా, వయసు పరంగా చాలా తేడానే వుండేది ఆ కాలంలో: తండ్రులంత వయస్సున్న వాళ్ళూ, పెదతండ్రులంత వయస్సున్న వాళ్ళూ ‘పసికూన’ల్ని పెండ్లాడేవాళ్ళని చెప్పడానికి చాలా గణాంకాధారాలున్నాయి. అసమ వివాహాల కారణంగా 25 సంవత్సరాల మామ, 50 సంవత్సరాల అల్లుడు యేర్పడే ‘వింత పరిస్థితి’ పట్ల ఎం. శంకర శాస్త్రి అనే అతను ఆశ్చర్యపోవడమే కాకుండా, ముసలివాళ్ళ బారిన పడుతున్న బాల భార్యల దురదృష్టానికి చింతించారు (‘బ్రాహ్మణ వధువు’, వివేకవతి, మే 1921, పు. 172`176). ‘బాల భార్యల’ పరిస్థితి ఘోరాతిఘోరంగా వుండేది. వయసు తేడా కారణంగా భార్యాభర్తలకు మానసికంగా పొత్తు కుదరకపోవడం వల్ల సంసారాలు అల్లకల్లోలంగా తయారై ‘గృహకల్లోలా’లకూ, ‘నిర్బంధ దాంపత్యా’లకూ దారితీసేది. దుఃఖభాజనమైన సంసార సాగరాన్ని ఈదలేక ‘బాల భార్యలు’ కూలబడిపోయేవారు.
పెళ్ళి అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో తెలియని వయస్సులో పెళ్ళిళ్లైన బాలికల్లో ఎంతోమంది దురదృష్టవశాత్తూ భర్త చనిపోతే వితంతువులుగా మిగిలిపోయేవాళ్ళు. ప్రధానంగా బ్రాహ్మణ, వైశ్య మొదలైన కులాల్లో వితంతు పునర్వివాహం నిషేధం కాబట్టి, జీవితాంతం ‘నిర్భంధ వైధవ్యా’న్ని అనుభవించాల్సి వచ్చేది. భర్త పోయిన దుఃఖంలో వున్న స్త్రీలకు గోరుచుట్టుపై రోకటిపోటులా ‘అమాంగల్యము, ముండనము, ఏకభుక్తము’లు తోడై, వితంతువుగా బతకడం కన్నా సహగమనం చేసి చావడమే మేలుకదా అనిపించేది. ఉదాహరణకు, ఆదుర్తి భాస్కరమ్మ కథ ‘ప్రభావతి’లో బాల వితంతువైన ప్రభావతి, వితంతువుగా బ్రతికి ‘‘జీవితాంతం’’ దుర్భరమైన ‘‘అవమానాలు’’ భరించడం కన్నా సహగమనం ద్వారా ‘‘వెంటనే చావడం’’ మేలని భావిస్తుంది (భారతి, ఆగష్టు 1926). సాంస్కృతిక విప్లవకారుడైన వేమన చెప్పినట్లు తలలు బోడులైనంత మాత్రాన తలపులు బోడులు కాలేవు కదా! చాలా సందర్భాల్లో నిర్భంధ వైధవ్యం ‘రండా గర్భా’లకూ, భ్రూణ హత్యలకూ, శిశు హత్యలకూ దారి తీసేది. ఉదాహరణకు, చీరాలకు చెందిన ఒక బ్రాహ్మణ వితంతువు కన్న శిశువును చంపి, కుండలో దాచిపెట్టింది. విషయం బయటపడిరది. ఆమెకు ఆ పరిస్థితిని కల్పించిన సమాజాన్ని కాకుండా, ‘నేరం’ చేసినందుకుగాను పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు (‘వృత్తాంతములు: కుల పవిత్రత కొరకు శిశుహత్య’, ఆంధ్ర పత్రిక, 16.8.1914, పు.9).
మానవ సహజమైన లైంగిక వాంఛలు తీరే ‘సహజ’ పరిస్థితులు లేకపోవడం వల్ల, చాలా మంది వితంతువులు ‘‘అక్రమ’’ సంబంధాల్లోకి నెట్టివేయబడేవారు. 20వ శతాబ్ది ప్రథమార్ధంలోని సామాజిక జీవితాల్ని చిత్రించిన చాలా ఆత్మకథల్లో యిలాంటి వితంతువులు ఎంతో మంది మనకు కనబడతారు. తెలుగునాట వితంతు పునర్వివాహోద్యమ ధృవతార అయిన కందుకూరి వీరేశలింగం తన స్వీయ చరిత్రము లో యిలాంటి వితంతువుల గూర్చి వివరంగా రాశారు (మొదటి భాగము, పు. 177`179). పునర్వివాహేచ్ఛ కలిగిన వితంతువులెంతోమంది తమ ఇళ్ల నుండి పారిపోయి రాజమండ్రి చేరిన ఉదంతాలెన్నో వీరేశలింగం ఆత్మకథలో వున్నాయి. అలాంటి వాళ్ళలో ప్రస్తుతం ఒడిశాలోని గంజాం జిల్లా అస్కా నుంచి కొన్ని వందల మైళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసి రాజమండ్రి చేరి, 1893 జూన్ 28 న ఆదిపూడి సోమనాథరావును పెళ్ళాడి, తన బలమైన కోర్కెను నెరవేర్చుకున్న సీతమ్మది ఒక పెద్ద సాహసోపేత గాథ. అలా ఇళ్ళ నుండి పారిపోయిన బాలవితంతువుల పట్ల సొంత తల్లిదండ్రులూ, యితర కుటుంబ సభ్యులూ చాలా కర్కషంగా వ్యవహరించేవారు. వాళ్ళపై నగలూ, డబ్బూ చోరి చేసి పారిపోయారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేసేవారు. మరికొంతమందైతే సంస్కర్తలు ‘‘మైనర్ బాలికల్ని’’ ‘‘కిడ్నాప్ చేసి’’ తీసుకెళ్ళారని పోలీస్ కేసులు పెట్టేవారు. ఒళ్ళు గగుర్పొడిచే ఇలాంటి వార్తల్ని హిందూ సుందరి (‘వర్తమానములు’, ఆగష్టు 1909, పు. 30), వివేకవతి (నవంబర్ 1909, పు. 34`35) మొదలైన స్త్రీల పత్రికలు ప్రముఖంగా ప్రచురించి, సమాజాన్ని సెన్సిటైజ్ చేయడానికి ప్రయత్నించేవి. 19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్దం ప్రథమార్ధంలోనూ వితంతువుల కష్టాలు యింత దారుణంగా వుండడం వల్లనే ‘ఒక ఆంధ్ర స్త్రీ’ ‘‘హిందూ వితంతువుగా నుండుట కన్న ప్రపంచములో వేరే గొప్ప కష్టముండదు’’ అనీ, ‘‘విధవరాండ్రను పెట్టు కష్టములను గురించి వ్రాయబూనిన యెడల ఎన్ని కాగితములైనను నిండు’’తాయనీ, ‘‘వారి కష్టములు వినిన యెడల ఎంత కఠిన హృదయమైన వెన్నవలె కరిగి దుఃఖము రాక మానద’’నీ, ‘‘హిందూ వితంతువుగా నుండుటకన్న భర్తగారితో చనిపోవుట (సతీ సహగమనము ద్వారా) చాలా మంచిదని గట్టిగా జెప్పవచ్చు’’ననీ తీవ్రమైన ఆవేదనతో ప్రకటించారు. బాల్యవివాహ దురాచారమే ఈ దౌర్భాగ్య స్థితికి కారణమని వివరించిన ఆమె, ఈ మూర్ఖాచారము పోయి ‘‘యుక్త వయస్సు వచ్చి (పిల్లలు) స్వంత యిష్ట ప్రకారము’’ పెళ్లి చేసుకొనే పద్ధతి వస్తే తర్వలో ‘‘దేశము బాగుపడు’’తుందని ఆశించారు (‘హిందూ వితంతువు’, వివేకవతి, జనవరి 1914, పు. 108`109).
బాల్య వివాహాలు బాల వితంతు సమస్యకే కాకుండా, బాలింత మరణాలకూ కారణమయ్యేవి. శరీరం సరిగా వికసించని బాలికల ప్రసవవేదనాక్రందనలు పురిటిళ్ళలో భయంకరంగా వినిపించేవి. అదృష్టవంతులు బతికి బట్టకట్టి జీవచ్ఛవాలుగా మిగిలితే, దురదృష్టవంతులు మృత్యువాత పడేవారు. ఈ ఘోరకలిని చూసి ఒళ్ళు మండిన వాళ్ళు బాల్య వివాహాల్ని తీవ్రంగా విమర్శిస్తూ సమకాలీన పత్రికల్లో రాసేవారు. రాజమండ్రికి చెందిన వేములూరి అమ్మిరాజు అనే ఆమె, 20 సంవత్సరాల తన సోదరి అయిన వేములూరి భ్రమరాంబ బాలింత మరణాన్ని గూర్చి ఒక ప్రముఖ స్త్రీల పత్రికకు ఉత్తరం రాశారు. దాని ప్రకారం 14.3.1903న శిశువును కన్న ఆమె సోదరి 27.3.1903న చనిపోయింది. బాల్య వివాహ దురాచారమే తన సోదరి ‘‘అకాల’’ మరణానికి కారణమని విమర్శిస్తూ, దాన్ని నిర్మూలించడానికి పెద్దలు పూనుకోవాలని అమ్మిరాజు ప్రార్థించారు (‘ఒక ఉత్తరము’, తెలుగు జనానా, మే 1903, పు.348). 1929వ సంవత్సరంలో ఒక్క మద్రాసు పట్టణంలోనే 3,000 మంది స్త్రీలు బాలింత మరణాలకు గురయ్యారు (కనుపర్తి వరలక్ష్మమ్మ, శారద లేఖలు, రెండవ భాగం, పు.31). మద్రాసు ప్రెసిడెన్సీలో 1921`29 సంవత్సరాల మధ్య ప్రసవించిన ప్రతి వెయ్యిమంది స్త్రీలలో 17.5 మంది చనిపోయారు (గృహలక్ష్మి, ఏప్రిల్ 1936, పు. 99`106). బాల్య వివాహాల కారణంగా బాలింతల మరణాలే కాకుండా, శిశు మరణాలూ సంభవించేవి. ‘పిల్లలకు పుట్టిన పసిపిల్లలు’ అంటే ‘బాల మాత’లకు జన్మించిన శిశువులు చాలా వరకు అర్భకులుగా వుండేవారు. నాలగవ ‘ఆంధ్ర మహిళా మహాసభ’లో కాశీనాథుని రమాబాయమ్మ చేసిన ప్రసంగం ప్రకారం, 1910వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక సంవత్సరం వయస్సున్న బాలురు 1,26,088 మంది చనిపోగా, 1,09,097 మంది బాలికలు చనిపోయారు. 15`30 సంవత్సరాల మధ్య చనిపోయిన స్త్రీలవి బాలింత మరణాలుగానే భావించాలని ఆమె నొక్కి చెప్పారు (హిందూ సుందరి, మార్చి 1913, పు.35).
బాల్య వివాహ దురాచారం ఏదో ఒక ప్రత్యేక మతానికో, లేదా ప్రత్యేక కులాలకో సంబంధించిన సమస్యనా? బాల్య వివాహాలు కేవలం లేదా ప్రధానంగా హిందూ ‘అగ్ర’ వర్ణాలకు సంబంధించిన సమస్య అని చాలా మంది తప్పుడు అవగాహనలో వున్నారు. కానీ వాస్తవమేమిటంటే ‘అగ్ర వర్ణాలు’గా విర్రవీగే బ్రాహ్మణ, వైశ్య కులస్థుల్లోనే కాకుండా, శూద్రులుగా వర్ణధర్మ ముద్రలు వేయబడ్డ కులాల వారిలోనూ, ‘దళిత’ కులస్థుల్లోనూ, ఖురాను సూత్రాలను గాల్లో వదిలేసిన ముస్లింలలోనూ, దేశీయ క్రైస్తవుల్లోనూ ఈ సమస్య వుండిరదన్న విషయం బ్రిటిష్ జనాభా లెక్కల ద్వారా స్పష్టమౌతుంది. ఉన్న తేడా అంతా సమస్య ‘‘తీవ్రత’’ లోనే! కాబట్టి మనలో చాలా మందికి ఈ విషయానికి సంబంధించి వున్న కామన్సెన్స్, సోషల్ సైన్స్ చూపిస్తున్న సాక్ష్యాధారాల ముందు నిలబడలేదు! ఒక ఉదాహరణ తీసుకుంటే : జగమెరిగిన కొండపల్లి కోటేశ్వరమ్మది బాల్య వివాహమే. ఆమె కొండపల్లి సీతారామయ్యను పునర్వివాహం చేసుకున్నారు. వేర్వేరు శాఖలకు చెందినవారైనా వాళ్ళు రెడ్లు. ‘‘అప్పటిదాకా తెలియదు నాకు ` నాకు పెళ్ళయిందని, భర్త చిన్నప్పుడే చనిపోయాడని. . . . నాకు నాలుగేళ్ళప్పుడో, ఐదేళ్ళప్పుడో మేనమామ వీరారెడ్డికిచ్చి పెళ్ళి జరిపించారట. పెళ్ళైన రెండేళ్ళకే ఆయన క్షయవ్యాధితో మరణించాడట. అదీ, నేను బాలవితంతువునని నాకు ఎదురైన తొలి సందర్భం.’’ కోటేశ్వరమ్మ ఆత్మకథ నిర్జన వారధి ప్రారంభమవడమే యిలా ప్రారంభమౌతుంది రెండో పారాగ్రాఫ్లో! (హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2012, పు. 2). అలాగే కమ్మ కులస్థుల్లోని బాల వితంతు సమస్యనీ, వాళ్ళల్లో అంత సులభంగా పునర్వివాహాలు జరగకపోవడాన్నీ దరిశి చెంచయ్య తన ఆత్మకథ నేనూ`నాదేశం లో వివరించారు (పు. 217`224). విశ్వబ్రాహ్మణ సంఘంలో పరిస్థితి యింకా దారుణంగా వుండేదని చెంచయ్య రాశారు (పు. 224`228).
19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్దం ప్రథమార్ధంలోనూ హిందూ వితంతువులు అనుభవించాల్సి వచ్చిన దుర్భర పరిస్థితుల గూర్చి ఎంతో మంది పురుష సంస్కర్తలూ, మహిళా సంస్కర్తలూ చాలా రాశారు. తద్వారా వితంతువులకు సంబంధించిన విస్తారమైన చారిత్రక, సృజనాత్మక సాహిత్యం మనకు అందుబాటులోకొచ్చింది. ఇంగ్లీషు, బాంగ్లా, హిందీల్లో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. ఇటీవల అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకత్వంలో భారతదేశంలో వితంతు వ్యవస్థ (రుద్రమ పబ్లికేషన్స్, వరంగల్, 2023) అనే మంచి పుస్తకం వచ్చింది. అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే వితంతువులపై రాసిన వారిలో చాలామంది తమ ఇళ్ళ బయట, సమాజంలోని ‘‘యితరుల’’ గూర్చి రాశారే కాని తమ ఇళ్ళలోని ‘‘తమవాళ్ళ’’ గూర్చి రాసింది తక్కువే. అందుకే, ‘‘తమ’’ గూర్చీ, ‘‘తమవాళ్ళ’’ గూర్చీ రాసినవాళ్ళ రచనలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో, తన సొంత ఇంటిలోని బాల వితంతువు దుస్థితిని గూర్చి రాసిన ప్రొఫెసర్ మామిడిపూడి వెంకట రంగయ్య రచనను ప్రత్యేకమైనదిగా పేర్కొనవచ్చు. బాల్య వివాహ దురాచారం కారణంగా బాల వితంతువై, ‘‘అవినీతి’’ మార్గం పట్టి, సొంత కుటుంబ సభ్యుల ద్వారానూ, హిందూ సమాజం ద్వారానూ ఛీత్కరించబడ్డ తన సొంత అక్క అనుభవించాల్సి వచ్చిన దుర్భరమైన కష్టాల్ని తన స్వీయ చరిత్ర మారుతున్న సమాజం` నా జ్ఞాపకాలు (తెలుగు విద్యార్థి ప్రచురణలు, మచిలీపట్నం, 1981) లో చాలా స్పష్టంగా, నిస్సంకోచంగా బయటపెట్టారు మామిడిపూడి వెంకట రంగయ్య. బాల వితంతువుగా ఆయన మూడవ అక్క వెంకటమ్మ అనుభవించిన అష్ట కష్టాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం.
అయితే, ప్రధాన విషయంలోకి వెళ్ళే ముందు బ్రిటిష్ భారతదేశంలోనూ, ఆంధ్రలోనూ బాల్య వివాహ దురాచారమూ, బాల వితంతు సమస్యా ఎంత తీవ్రంగా వుండేవో మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి గణాంకాధారాలను చూద్దాం. 1933వ సంవత్సరం నవంబరు 4న ఏలూరులో జరిగిన ఏడవ ‘ఆంధ్రరాష్ట్ర మహిళా మహాసభ’లో అధ్యక్షోపన్యాసం చేసిన డా॥ ముత్తులక్ష్మి రెడ్డి పొందుపరిచిన లెక్కలు ఈ క్రింది విధంగా వున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే ఈ లెక్కలు కూడా మొత్తం దేశానికంతటికీ సంబంధించినవి కావు: కొన్ని ప్రాంతాలకు మాత్రమే సంబంధించినవి!
1931 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాల్య వివాహితలు, బాల వితంతువులు
(0`15 సం. వయస్సుల వరకు)
వయస్సు బాల్య వివాహితలు బాల వితంతువులు
1921 1931 1921 1931
00`01 2,144 21,330 197 594
01`05 82,860 3,77,983 6,536 13,196
05`10 8,26,483 20,19,675 46,275 54,475
10`15 27,69,585 33,33,957 1,36,509 98,326
00`15 36,81,072 57,52,945 1,89,517 1,66,591
ఆధారం: గృహలక్ష్మి, డిసెంబరు 1933, పు.833.
ఇక మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాల్లో బాల్య వివాహ దురాచార దుష్ఫలితమైన వితంతు సమస్య ఎంత తీవ్రంగా వుండేదో ఈ క్రింది పట్టిక తెలియజేస్తుంది.
0`20 సంవత్సరాల మధ్య వయస్సుగల వితంతువుల సంఖ్య
జిల్లా 1891 సం॥ 1901సం॥ 1911సం॥ 1921 సం॥ 1931సం॥
గంజాం 6960 6429 10638 9130 7979
విశాఖపట్టణం 7618 10137 11207 10794 12985
గోదావరి 8271 8677 6158 5428 11050
కృష్ణా 5766 5613 7026 6270 3623
నెల్లూరు 3042 3382 2689 2908 3791
కడప 2921 125 2103 2485 2420
కర్నూలు 1759 1780 1986 2284 2749
అనంతపురం 1396 1739 2238 2759 2614
చిత్తూరు “ “ 2118 2334 3196
గుంటూరు “ “ 4394 4445 6040
బళ్ళారి 1613 2078 2516 2774 2521
మద్రాసు పట్టణం “ 657 763 562 837
ఆధారం: దీ. ఖవంaఙa చీaతీaవaఅa, ాఔఱసశీష వీaతీతీఱaస్త్రవ వీశీఙవఎవఅ్ ఱఅ Aఅసష్ట్రతీa్ణ, I్ఱష్ట్రaం, పశీశ్రీ. II, చీశీ.1, జీaఅబaతీవ-జీబఅవ 1974, జూ.161.
ఆంధ్ర ప్రాంతంలో వితంతు సమస్య యింత తీవ్రంగా వున్న చారిత్రక సందర్భంలో, బాల్య వివాహ దురాచారానికి ‘‘పూర్తిగా’’ బలైపోయిన తన సోదరి దుస్థితిని గూర్చి వెంకట రంగయ్య ఈ విధంగా వర్ణించారు:
‘‘నా మూడవ అక్క వెంకటమ్మ, ఆమె నాకంటె రెండు సంవత్సరములు పెద్ద. ఆమె జీవితం తక్కిన ఇద్దరి జీవితాలకంటె విషాదకరంగా పరిణమించింది. ఆనాటి సాంఘిక దురాచారాల ఫలితాన్ని ఆమె పూర్తిగా అనుభవించింది.
ఆమెకు కూడా పది సంవత్సరముల వయస్సులోనే మా పొరుగు గ్రామం దండిగుంట వాస్తవ్యులు ఉడాలి వెంకట నరసయ్యకు ఇచ్చి వివాహం చేశారు. నా ఉపనయనంతోనే ఈ వివాహం జరిగింది. ఆ రోజులలో పెండ్లిండ్లు అయిదు రోజులు జరిగేవి. బ్రాహ్మణ ఇండ్లలో ఆ రోజులలో మధ్యాహ్నం, సాయంకాలం మంత్రసహితంగా వధూవరులు హోమం చేసేవారు. ముహూర్త కాలంలో హోమం చేసిన అగ్నిని హోమకుండంలో పదిలపరచి, హోమకాలంలో దానినే ప్రజ్వలింపజేసి హోమం చేసేవారు. కాని మా అక్కగారి పెండ్లిలో ముహూర్తం ముగిసిన వెంటనే హోమకుండంలో పెట్టిన అగ్ని తగినన్ని ఎండు పిడకలు, సమిధలు పౌరోహితుని అజాగ్రత్త వలన చేర్చని కారణంగా సాయంకాలానికి ఆ అగ్ని చల్లారిపోయింది. సాయంకాల హోమం నిమిత్తం కుండంలోని అగ్నిని పైకి తెచ్చినప్పుడు అది వెలగలేదు. ఇది అశుభ సూచకమని మా తండ్రిగారు దుఃఖించినారు. ప్రాయశ్చిత్తపూర్వకంగా కొత్త అగ్నిని వెలిగించి అయిదు రోజులు హోమం జరిపినారు గాని మా తండ్రిగారికి ఏలాటి తృప్తి కలుగలేదు.
వారు భయపడినట్లే వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపలనే మా బావగారు వ్యాధిగ్రస్తులై మరణించారు. పదకొండవ ఏటనే మా అక్క వెంకటమ్మ వితంతువైనది. యావజ్జీవం వితంతువుగా కాలం గడపవలసి వచ్చింది.
మానవునికి ఆహార నిద్రలు ఎంత అవసరమో దాంపత్య సుఖం కూడ అంత అవసరం. ఐచ్ఛికంగా కొందరు వివాహం చేసుకొనక సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి జీవితాన్ని సాగిస్తున్నారు. ఈలాటి జీవితం అందరికీ సాధ్యం కాదు. ఇది వాంఛనీయం కూడా కాదు. ఈలాగు అందరూ జీవిస్తే మానవకోటి నిర్మూలమై పోతుంది. నిర్బంధ వైధవ్యం దాంపత్య సుఖానికి అవరోధం కల్పిస్తుంది. మన సమాజంలో అలాటివారు ఏవిధమైన సుఖాన్ని అనుభవించ జాలరు.
వారిలో కొందరు సమాజం ఏర్పరచిన నీతి నియమాలకు కట్టుబడి ఉండలేక అవినీతి మార్గంలో ప్రవేశిస్తారు. ఆకలిగొన్నవాడు ఆకలిని భరించలేక ఒక్కొక్కప్పుడు చౌర్యానికి సిద్ధపడతాడు. బాల్యంలోనే వితంతువులై నిర్బంధ వైధవ్యం అనుభవించవలసిన వారు ఇదేవిధంగా అవినీతికి సిద్ధపడతారు. నా అక్క వెంకటమ్మ ఈలాటి ప్రవర్తనకు సిద్ధపడినదని నేను భావిస్తున్నాను. నేను అప్పటికి చాలా చిన్నవాడిని. ఈలాటి విషయాలను గురించి ఏమీ తెలియని వాడిని. అందుచేత ఏమి జరిగిందో స్వానుభవాన్ని ఆధారం చేసుకొని చెప్పగల స్థితిలో లేను. కాని జరగకూడనిది ఏదో జరిగినట్లు ఇతరుల గుసగుసల వలన ఊహించాను.
ఇదే సమయంలో గ్రామ జీవితాన్ని పూర్తిగా కలుషితం చేయ సిద్ధపడ్డవారు మా గ్రామానికి వచ్చారు. వారు భూములను కొలతలను వేయుటకు ప్రభుత్వం నియమించిన సర్వే పార్టీకి చెందినవారు. ఆనాటి భూమిశిస్తు పద్ధతికి 20 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో ఒక పర్యాయం గ్రామంలోని భూములను సర్వే చేయడం ఒక భాగం. అందుకుగాను ఎక్కడ నుంచో 7, 8 మంది మా గ్రామం చేరారు. వారు భార్యలతో రాలేదు. వారు అవివాహితులుగా ఉండవచ్చును. వారందరు యువకులు. తలా తోకా లేక విశృంఖలంగా సంచరించేవారు. గ్రామస్థులలో ఒకరిద్దరు వారితో కలిసిపొయ్యారు. వారు నాటకాలాడి ప్రజలను ఆకర్షించగలిగారు. అనేక స్త్రీలను చెరిచారు. ఒక సంవత్సరంపాటు గ్రామ జీవితం కలుషితమై పోయింది. వారికి బుద్ధి చెప్పగల పెద్ద మనుష్యులు గ్రామంలో లేకపోయినారు. పెద్ద మనుష్యులుగా వ్యవహరిస్తున్న వారిలో అనేకులు బహిరంగంగా అవినీతి మార్గంలో నడుస్తున్న వారు. ఈలాటి వారు ఆ యువకులకు ఏలాగు బుద్ధి చెప్పగలరు?
వారి వలలో చిక్కుకొన్న స్త్రీలలో నా అక్క వెంకటమ్మ ఒకత్తె. దాని ఫలితంగా ఆమె ఒక రోజు ఇంటి నుండి పారిపోయింది. ఆమెను వెదికి తెచ్చి, ఇంటి బయట వసారాలో పెట్టారు. కాని ఆమె తిరిగి పారిపోయింది. శ్రమపడి, వెదకి, ఆమెను ఇంటికి తీసుకొని రావడం వ్యర్థమని, మా నాయనగారు భావించి, ఆలాటి ప్రయత్నం చేయలేదు. కాని గ్రామంలో ఆయన తల ఎత్తుకొని తిరగడం సాధ్యం కాలేదు. దుఃఖంతో అవమానాన్ని కూడా భరించవలసిన వారయ్యారు. ఆయన పట్ల ఎవరూ సానుభూతి చూపినవారు లేరు.
ఈలాగు కాలం గడిచిపోయింది. ఆడ సంతానం మూలంగా నా తల్లిదండ్రులు దుఃఖాలకు లోనైనారే గాని సుఖపడలేదని చెప్పాను. 15 సంవత్సరాలకే వెంకటమ్మ జీవితం దీనిని ఋజువు చేసింది. నెలలు, ఏండ్లు గడచిపోయినవి. మేము ఆమెను గురించి ఏవిధంగాను పట్టించుకొనలేదు. మాపట్ల ఆమె వైఖరి ఏవిధంగా పరిణమించిందో మాకు తెలియదు.
ఇంటినుండి పారిపోయి ఆమె అల్లూరిలోని క్రైస్తవ మిషనరీలకు వశపడిపోయింది. వారు ఆమెను క్రైస్తవమతంలోకి చేర్చి, కొంత చదువు చెప్పించి, కాలక్రమాన ఒక క్రైస్తవునికి ఇచ్చి వివాహం చేశారు. అతడు హైదరాబాదు నివాసి. ఆమె కూడ హైదరాబాదుకు వెళ్లి అతనితో అక్కడ కాపురం పెట్టింది.
ఈలాగు కొంత కాలం గడచిపోయిన తర్వాత నేను విజయనగరంలోని మహారాజావారి కళాశాలలో అధ్యాపకుడుగా ఉన్నప్పుడు (1915 సంవత్సరంలో అని జ్ఞాపకం), ఆమె అకస్మాత్తుగా మా యింటికి వచ్చింది. అప్పుడు నేను, నా తల్లి, నా భార్య, ముగ్గురు పిల్లలతో ఉన్నాను. ఆమె రాగానే, ఆమెను ఒక ప్రత్యేక గదిలో నివసించవలసినదిగా ఏర్పాటు చేశాము. మా పంక్తిలో కూర్చుండబెట్టుకొని ఆమెకు భోజనం పెట్టదగినంతగా నా హృదయం పరిపక్వం కాలేదు. ఆమె ఇంటి నుంచి పారిపోవడం గాని, క్రైస్తవ మతంలో చేరడం గాని ఖండిరచ తగినది కాదని నేను గ్రహించాను. ఆమె పతితురాలైనదని నేను భావించలేదు.
‘‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అనే పాతకాలపు సూక్తికి కలిగిన ప్రాబల్యం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం ఆమె ప్రవర్తనకు కారణాలని, నేను అప్పటికి దృఢనమ్మకం కలవాడనైనాను. కాని హృదయ దౌర్బల్యము వల్ల ఆమెను ఆదరించ సిద్ధపడక పోయినాను. దీనికి ఈనాడు నేను ఎంతగానో విచారిస్తున్నాను. మా తల్లి కంటతడి పెట్టుకొని ఆమెతో కొంచెం మాటలాడిరది. ఈ విధంగా, నాలుగైదు రోజులు గడచిన తర్వాత, నేను ఆమెకు రైలు ఖర్చులు, మరి కొంత సొమ్ము ఇచ్చి హైదరాబాదుకు పంపివేశాను. అటు తర్వాత ఆమె నాకు రెండు మూడు ఉత్తరాలు వ్రాసింది. కాని ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడానికి నేను ఇష్టపడలేదు. దాని మూలంగా కలిగే ప్రయోజనం ఏలాటిదీ లేదు. అంతటితో మా సంబంధం విడిపోయినట్లు భావించాను.
ఆమె వివాహమాడినా సంతానవతి కాలేదు. ఒక ఆడపిల్లను దత్తు తీసుకొన్నది. ఆమెకు ఒక కుమార్తె కలిగింది. కుమార్తె పెద్దది కాకపూర్వమే ఆమె చనిపోయింది. ఆ మనుమరాలిని మా అక్కగారే సంరక్షించి, పెద్దదానిని చేసి, ఒక క్రైస్తవ యువకునకు ఇచ్చి, వివాహం చేసింది. అతడు టెలిగ్రాఫ్ బంట్రోతు. సౌమ్యుడు. సంతానవంతుడైనాడు. హైదరాబాదు మలక్పేటలో స్వంత ఇల్లు కట్టుకొన్నాడు. వారివద్దనే నా అక్కగారు జీవితం సాగిస్తూ వచ్చింది. నేను 1957లో హైదరాబాదు నివాసి అయ్యాను. అప్పటి నుంచి తరుచుగా ఆకాశవాణిలో మాట్లాడుతుండే వాడిని. నా అక్కగారు ఆకాశవాణిలో నా పేరు విని, నా ప్రసారాలన్నిటిని బహుశ్రద్ధతో వింటూ ఉండేది.
ఈలాగు కొన్ని సంవత్సరములు గడచిన తర్వాత ఆమె ఇంటికి పొరుగున ఉన్న ఒక ఉద్యోగి చేత నాకు ఒక
ఉత్తరం వ్రాయించింది. నన్ను చూడవలెననే ఆసక్తితో ఆమె ఉన్నట్లు, వీలైతే మలక్పేటకు వచ్చి ఆమెను చూడవలసినట్లు ఆయన తెలియపరచాడు. ఉత్తరం రాగానే నేను, నా భార్య, నా పెద్ద కుమార్తె అన్నపూర్ణ ఆమెను చూచుటకు వెళ్లాము. అప్పటికి ఆమె 80 సంవత్సరాల వృద్ధురాలుగా ఉండినది. ఒక అరగంటసేపు పరస్పర యోగక్షేమాలను గురించి మాట్లాడుకొని, ఆమె వద్ద సెలవు పుచ్చుకొని మా ఇల్లు చేరాము. అప్పటి నుండి ఆమెను మా ఇంటికి పిలిపించి, ఆమె మా అందరితో కలిసి భోజనం చేస్తూ, ఏదో కబుర్లు చెప్పుకుంటూ రెండు మూడు రోజులు గడిపి వెళ్లిపోవడం జరుగుతూ వచ్చింది. మా ఇంట్లో పెండ్లిండ్లు మొదలైన శుభకార్యాలు జరిగినప్పుడు ఆమెను ఆహ్వానించి, ఇతరులతో పాటు ఆమెకు కూడ చీరెలిచ్చి పంపించేవారం. ఇదిగాక ఆమెకు ప్రతినెల కొంత డబ్బు సహాయం చేస్తూ వచ్చాను. నా మూడవ కుమార్తె వైదేహి ఇల్లు మలక్పేటకు సమీపంలో ఉండేది. అందుచేత ఆమె వైదేహి ఇంటికి తరుచుగా వచ్చి నాలుగైదు రోజులు ఉంటూ ఉండేది. ఈవిధంగా ఎప్పుడో విడిపోయిన సంబంధం తిరిగి ఏర్పడిరది. ఇది అంతకుపూర్వం ఏనాడో ఏర్పడవలసింది. కాని నా హృదయం పరిపక్వత గాంచని కారణంగా చాలాకాలం గడచిన తర్వాతనే ఏర్పడిరది.
క్రైస్తవులలో ఆమెకు గౌరవస్థానముండేది. ఆమె బైబిలు గ్రంధాన్ని చదివి, దానికి చక్కగా అర్థం చెప్పేది. దానిని వినుటకు చుట్టుప్రక్కల నుండి క్రైస్తవులు తరుచుగా సమావేశమయ్యేవారు. హిందూ సమాజం ఆమెను పతితురాలుగా భావించినా, క్రైస్తవుల గౌరవాన్ని ఆమె సంపాదించగలిగింది. దీని ఫలితంగా, ఆమె జన్మ సార్థకమైనదని నా దృఢ విశ్వాసం.
వార్ధక్యం వల్ల ఆమె 5, 6 సంవత్సరాల క్రింద వ్యాధిగ్రస్తురాలైనది. ఆమెను చూచుటకు నేను, నా భార్య, వైదేహి వెళ్లినాము. కుటుంబములోని వారు, ఇరుగుపొరుగు వారు ఆమె చుట్టూ మూగి ఉండినారు. ఆమె చాల బలహీన స్థితిలో ఉండినది. ఎక్కువగా మాటలాడలేక పోయింది. తర్వాత అయిదారు రోజులకు కాలం చేసింది. మా ఇంటిలో ఆమె ఉన్న రోజులలో ఆమె మూలంగా నా తల్లిదండ్రులు కష్టాలు అనుభవించారు. ఆడ సంతానం మూలంగా వారికి కష్టాలే గాని, సుఖం కలగలేదని స్పష్టపరచుటకు, సమాజంలోని కొన్ని ఆచారాలు దానికి ప్రధాన కారణాలని నిరూపించుటకును నేను నా అక్కగార్ల గురించి ఇంత దీర్ఘంగా వ్రాయవలసి వచ్చింది.
ఈనాడు ఆలాటి ఆచారాలు లేవు. కొంతవరకు ప్రభుత్వం చేసిన చట్టము మూలంగాను, చాలావరకు స్త్రీలు కూడ పురుషులతో పాటు ఇంగ్లీషు విద్యను అభ్యసించుట చేతను 20, 22 సంవత్సరాలకు గాని ఈ విద్య పూర్తికాక పోవడం చేతను, వివాహం చేసుకొన్న పక్షంలో విద్య పూర్తి కావడం సాధ్యపడక పోవుట చేతను, బాల్య వివాహాలు అంతరించినవి. స్త్రీ పునర్వివాహాల పట్ల ఈనాడు ఏలాటి విముఖత్వం లేదు. సమాజంలో ఇటీవల జరిగిన మార్పులలో ఇవి చాలా ప్రాధాన్యం వహిస్తున్నవి.
కాని దాంపత్య సుఖానికి అవరోధం కలిగించే ఇంకొక క్లిష్ట పరిస్థితిని స్త్రీలు ఎదుర్కొనుచున్నారు. నిర్బంధ వైధవ్యానికి బదులు నిర్బంధంగా వారు వయస్సు మీరిపోయే వరకు అవివాహితులుగా వుండవలసిన పరిస్థితులు ఏర్పడుచున్నవి. దీనికి వరదక్షిణలు ఇయ్యవలసి రావడం ప్రధాన కారణం. పురుషులు ఎంత చదువుకొన్న వారైనా, వరదక్షిణలు పుచ్చుకొనక వివాహమాడడం లేదు. వారి విద్యా స్థాయి, ఉద్యోగ స్థాయి పెరిగేకొద్దీ వరదక్షిణల మొత్తం కూడా పెరుగుతూ ఉంది. ఇంతటి దక్షిణలిచ్చి కుమార్తెలకు పెండ్లి చేయగలవారు లక్షాధికారులు మాత్రమే. సామాన్య మధ్య తరగతి వారికి ఇది సాధ్యం కావడం లేదు. ఇద్దరు ముగ్గురు కుమార్తెలు ఉన్న వారికి ఇది మరీ సాధ్యం కావడం లేదు. వరదక్షిణలను తీసుకోరాదని ప్రభుత్వం చట్టం చేసినా దానిని అమలుపరచడం సాధ్యం కాలేదు. చట్టం నిరర్థకమై పోయింది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో ఇది ఒకటి’’ (మారుతున్న సమాజం ` నా జ్ఞాపకాలు, పు. 45`51).
ఈ వ్యాసం ప్రధాన విషయానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ, ఇరవయ్యవ శతాబ్దం ప్రథమార్ధంలో భర్తలు భార్యలపట్ల ఎంత దారుణంగా ప్రవర్తించేవారో వెంకటరంగయ్య చాలా సూటిగా, నిర్మొహమాటంగా చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆయన మాటల్లోనే చూద్దాం: ‘‘కాని వారు (భర్తలు) కఠిన హృదయులు. ఆ రోజులలో భర్తలకు భార్యల పట్ల ఏలాటి గౌరవం ఉండేది కాదు. అనేకులు భార్య అంటే తమకు చాకిరి చేసే బానిస అని భావించేవారు. మా బావగారు (అంటే పెద్ద బావ) ఆలాటి వర్గానికి చెందినవారు. నిష్కారణంగా మా అక్కగారిని తిట్టడమే కాకుండా, కొట్టేవారు. ఆమె ఏమీ ఎదురు చెప్పలేక భర్త పెట్టే బాధలన్నిటిని ఓర్పుతో భరించేది. వారికి సంతానం కలగని కారణంగా, ఈ బాధలు కాలక్రమాన పెరిగిపోయినవి. ఎప్పుడైనా మా నాయనగారు గాని, తల్లిగారు గాని, మా అక్క గారిని చూడడానికి వచ్చేవారు. వారు వచ్చినప్పుడు వారి సమక్షంలో కూడ ఆయన మా అక్కగారిని మరింత బాధపెట్టేవాడు. వారు కండ్ల నీళ్లు పెట్టుకొని నిస్సహాయులై ఉండిపోయేవారు. నేను ఇంగ్లీషు చదువు నిమిత్తం మద్రాసుకు వెళ్లినప్పుడు కొంత కాలం మా అక్కగారి ఇంట్లోనే ఉండినాను. ఆ రోజులలో ఆమె భరించిన బాధలను స్వయంగా చూచినాను. ఇదీ ఆనాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలనేకంలో దాంపత్య జీవితం. . . . అంతటితో వారు మద్రాసు కాపురం ఎత్తివేసి స్వగ్రామమైన అగ్రహారంలో కాపురం పెట్టారు. అటు తర్వాత, ఒకటి రెండు సంవత్సరాలకు మా అక్క గర్భవతి అయినది. మా బావగారి మనస్సు మెత్తబడినది. మా అక్కగారి జీవితం అంతవరకు కష్టమయంగా ఉండేది. ఇప్పటినుంచి ఆమె సుఖపడగలదనే విశ్వాసం మా తల్లిదండ్రులకు కలిగింది. కాని, త్వరలోనే అన్యధాగా జరిగింది.
ఆమెను ప్రసవం నిమిత్తం పురిణిలో మా ఇంటికి తీసుకొని వచ్చారు. ప్రసవం సుఖంగా జరిగి, ఒక ఆడపిల్ల కలిగింది. కాని మా దురదృష్టవశాత్తున మూడవరోజు ఆమెకు విషజ్వరము సోకి, తగిన వైద్య సహాయం లేని కారణంగా, అయిదవ రోజున ఆమె కుటుంబంలోని వారందరిని దుఃఖసాగరంలో ముంచి, కాలగర్భంలో కలిసిపోయింది. ఆ రోజులలో ప్రసవం స్త్రీలకు ఒక గండంగా పరిణమించేది అని ఇదివరలోనే చెప్పినాను. మా అక్కగారి మరణం అది అక్షరాలా సత్యమని ఋజువు చేసింది.
పుట్టిన ఆడపిల్లను మా తల్లిగారు బహు జాగ్రత్తతో సంరక్షించారు. కాని, మూడు నెలలకే దానికి కూడ మరణం సంభవించినది. నా తల్లిదండ్రులకు ఆడ సంతానం మూలంగా ఏలాటి సుఖము కలుగలేదని పైన చెప్పినాను. మా అక్కగారి జీవితం దానికి దృష్టాంతం’’ (మారుతున్న సమాజం ` నా జ్ఞాపకాలు, పు. 42`43). వెంకట రంగయ్య అక్క వెంకటమ్మ ఆయనకంటే రెండు సంవత్సరాలు పెద్దది. అంటే, ఆమె 1887లో పుట్టి వుండాలి. 1897 ప్రాంతంలో ఆమెకు బాల్యవివాహమై, ఒక సంవత్సరంలోపే వితంతువయ్యారు. అంటే, ఒక రకంగా ఆమె జీవితం 19వ శతాబ్దం చివర్లోనూ, 20వ శతాబ్దం ప్రథమార్ధంలోనూ జీవించిన వితంతువుల దుస్థితికి అద్దంపడ్తుంది. వెంకటమ్మ వితంతువు అయ్యేనాటికి ఆంధ్రలో వితంతు పునర్వివాహోద్యమం ముమ్మరంగా సాగుతూ, ‘‘అగ్ర’’ కులాల్లో సుమారు 30 వితంతు పునర్వివాహాలు జరిగాయి. అయినప్పటికీ, సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఛాందసత్వం కారణంగా చాలా మంది వితంతు పునర్వివాహాలకు విముఖంగా వుండేవారు. ఫలితంగా వెంకటమ్మ లాంటివారు బలైపోయేవారు.
బాల్య వివాహాలూ, నిర్బంధ వైధవ్యం మొదలైన ‘‘సాంఘిక దురాచారాల ఫలితాన్ని . . . పూర్తిగా అనుభవించి’’న తన అక్క దయనీయ పరిస్థితిని గూర్చి నిస్సంకోచంగా రాయడంతోపాటు, స్త్రీల జీవితాల్లో చీకట్లు నింపిన ఆనాటి సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలపై నిక్కచ్చిjైున అభిప్రాయాన్ని ప్రకటించి, ఒకానొక దశలో ‘‘హృదయ దౌర్బల్యము వల్ల’’ తన అక్కను సరిగా ఆదరించలేకపోయానని నిర్మొహమాటమైన స్వీయ విమర్శకు సయితం వెనుకాడని వెంకట రంగయ్య ఎవరు? ఉన్నదున్నట్టు చెప్పుకోవాలంటే ప్రొఫెసర్ మామిడిపూడి వెంకట రంగయ్యది ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అయినప్పటికీ, ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ` స్థూలంగానే అయినా ` మళ్ళీ ఒకసారి తెలుసుకోవడం అసంగతమేమీ కాదు. వెంకట రంగయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిణి గ్రామంలో బ్రాహ్మణుల్లో పుదూరు ద్రావిడ శాఖకు చెందిన వెంకటేశాచార్యులు (వెంకటేశమయ్య / వెంకటేశయ్య), నరసమ్మ దంపతులకు 1889 జనవరి 8న ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలగవ సంతానంగా జన్మించారు. ప్రాథమిక విద్య తన గ్రామంలోని వీధి బడిలోనూ, ఉన్నత విద్యను (బి.ఏ., యం.ఏ.,) మద్రాసులోనూ పూర్తి చేసిన వెంకట రంగయ్య, 1910 జనవరి ఆఖర్లో, సుమారు 22 సంవత్సరాల వయసులో, కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో చరిత్ర అధ్యాపకుడుగా చేరి మూడున్నర సంవత్సరాలు పని చేశారు. తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో 1913 జులై నుండి 1928 ఏప్రిల్ దాకా అధ్యాపకులుగా పని చేశారు. ఈ మధ్య కాలంలోనే సుమారు 3 ` 4 సంవత్సరాలు విజయనగరం యువరాజావారికి ట్యూటరు గానూ, 1927 జులై నుంచి 29`30 మార్చి 1928 దాకా వియజనగరం సంస్థానానికి దివాన్ గానూ పని చేశారు. ఆ తర్వాత 1928 జులైలో నెల్లూరు లోని వెంకటగిరి రాజా కళాశాలకు ప్రిన్సిపల్గా చేరి 1931 వరకు పని చేశారు. ఆపైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1931 జులై నుంచి 1944 జనవరి 8 వరకు మొదట రీడర్ గానూ, తర్వాత ప్రొఫెసర్ గానూ 13 సంవత్సరాలు తన సేవలందించారు. అకడమిక్ రంగంలో వెంకట రంగయ్య సాధించిన విశిష్ట విజయాల్ని గుర్తించిన బొంబాయి విశ్వవిద్యాలయం అక్కడ కొత్తగా ప్రారంభించిన రాజనీతి శాఖలో ప్రధానాచార్యుడి పదవికి ఆహ్వానించడంతో ఆయన 1949 జూన్ 1 నుండి మూడు సంవత్సరాలు బొంబాయిలో పని చేసి, జ్ఞాన సృజన రంగంలో తీవ్ర ప్రభావం కలుగజేశారు.
జీవితాంతం బోధన, పరిశోధన, జ్ఞానవ్యాపనలకు అంకితమైన ప్రొఫెసర్ మామిడిపూడి వెంకట రంగయ్య అనేక అమూల్యమైన రచనలు చేశారు: అవన్నీ ఆయన పరిశోధనా పటిమకూ, వాస్తవం పట్ల ఆయన నిబద్ధతకూ, అంతులేని ఓపికకూ, చక్కగా అద్దం పడ్తాయి. ‘‘బిగినింగ్స్ ఆఫ్ లోకల్ టాక్సేషన్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ’’ అనేది ఆయన ప్రారంభ పరిశోధక విజయాల్లో ప్రత్యేకమైనది. భారత రాజనీతి వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సహకార రంగం మొదలైన విషయాల్లో విశేషమైన పరిశోధనలు చేసిన వెంకట రంగయ్య, అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో తన పరిశోధనా ఫలితాన్ని పుంఖానుపుంఖాలుగా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా విద్వాంసుల ప్రశంసలందుకున్నారు. ‘ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే నాలుగు సంపుటాలుగా ఇంగ్లీషులో వెలువడిన ఉద్గ్రంథాలకు సంపాదకత్వం వహించడమే కాకుండా, స్వాతంత్రోద్యమంపై తెలుగులోనూ పుస్తకాలు ప్రచురించారు. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కూడా తెలుగులోకి తర్జుమా చేశారు. జ్ఞాన, గ్రామ పునర్నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు గౌరవ డి. లిట్., తో సత్కరించాయి. బొంబాయి విశ్వవిద్యాలయంలో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎస్సేస్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం అనే పుస్తకాన్ని ఆయన గౌరవార్థం ప్రచురించడం ఒక అధ్యాపకుడిగా ఆయనెంత ప్రభావశాలో చెప్పకనే చెబుతుంది.
బహుసంతానవంతుడై, భర్తగా, తండ్రిగా, ఉపాధ్యాయుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా సఫలవంతమైన జీవితాన్ని గడిపిన ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య 92 వసంతాలు పూర్తిచేసుకున్న నిండు వయస్సులో 1981 జనవరి 9న చనిపోయారు. ఉపాధ్యాయ వృత్తిలో వున్నవారు ఆత్మకథలు రాయడమనేది చాలా అరుదైన విషయం కాబట్టి, వైవిధ్యభరితమై, 448 పేజీల్లో విస్తరించిన వెంకట రంగయ్య గారి ఆత్మకథ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన పేరు మీద యేర్పడ్డ యం.వి. ఫౌండేషన్ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించడం మొదలైన విలువైన సామాజిక కార్యకలాపాలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ప్రతియేటా రెండు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాల్లో మొదటి రోజు సాయంత్రం ‘మామిడిపూడి వెంకట రంగయ్య మెమోరియల్ లెక్చర్’ యేర్పాటు చేయబడుతోంది.