వేదికపై ప్రధాన పాత్రను పోషించే ఐశ్వర్య – పూంగొడి మదియరసు / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

వేలూర్‌ జిల్లాకు చెందిన ఐశ్వర్య ఒక తిరుణంగై (ట్రాన్స్‌మహిళ). సమాజంలో ఆత్మగౌరవంతో, మర్యాదపూర్వకంగా బతకడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో సొంత డ్రామా కంపెనీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఈ కథనం చెబుతోంది.

తన దంతాలతో కోడిపుంజును కొరికి శ్మశాన దేవత అయిన సుడలై కాళి గౌరవార్థం బలియిచ్చిన తరువాత, తన దంతాల మధ్య తొరప్పు (మేక ఊపిరితిత్తులు)ను పట్టుకొని, ఎడమ చేతితో కొడవలిని తిప్పుతూ ఆమె లయబద్ధంగా నడుస్తున్నారు. దేవి పుట్రు పూంగావణత్తు అమ్మన్‌ ఆలయం నుండి తిరువళం పట్టణంలోని పొణ్ణయి నదికి దారితీసే రద్దీగా ఉన్న వీధిలో, నల్ల చీర కట్టుకొని, పంబై, పరై వాద్యాల సంగీతానికి తగ్గట్టు ఐశ్వర్య నాట్యం చేస్తున్నారు. ఆమె వెనుకే నడుస్తున్న ఊరేగింపు ఎండిపోయిన పొణ్ణయి నదీ తీరానికి చేరేసరికి, అప్పటికే అలసిపోయిన ఆ తిరుణంగై (తమిళంలో ట్రాన్స్‌మహిళ) అక్కడే కూలబడ్డారు. సొంత డ్రామా కంపెనీని నడుపుతోన్న ముప్పై ఏడేళ్ళ ఐశ్వర్యకు ఇది కేవలం ఒక ‘ప్రదర్శన’ కాదు. చీకటి పడ్డాక ఆవిడ నాటకం ప్రదర్శించాలి, అందుకు ఆమెకు కొన్ని గంటల సమయమే ఉంది.
ఆవిడ వార్షిక మయాణ కొళ్ళై (శ్మశానవాటిక దోపిడీ) పండుగలో పాల్గొంటున్నారు. తమిళనాడులోని వేలూర్‌ జిల్లాలో, ఈ గ్రామంలో నివసించే దళిత వర్గాలు తమిళ మాసమైన మాసి (మార్చి)లో వచ్చే అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఐశ్వర్య, రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులంగా జాబితా చేయబడిన చక్కిళియర్‌ సముదాయానికి చెందినవారు. ఆలయ ఉత్సవంలో నిర్వహించే ఆచారాలలో గత రెండు దశాబ్దాలుగా పాలు పంచుకుంటున్నారు.
‘‘అంత ఆవేశంతో నాట్యం చేసింది నేను కాదు. నాకసలు అది గుర్తు కూడా లేదు. నన్ను అమ్మన్‌ ఆవహించింది,’’ తరువాత అన్నారామె. అమ్మన్‌ ఒక గ్రామ దేవత. చక్కిళియర్‌ సముదాయ ప్రజలు అమ్మన్‌ను కాళీమాత స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆచార వ్యవహారాలన్నీ ముగిశాక, రాత్రి 10 గంటలకు చివరి ప్రదర్శన మొదలవుతుంది.
రాత్రిపూట దృశ్యం పగటికి పూర్తిగా భిన్నంగా ఉంది. వీధి మధ్యలోని నెలకొల్పిన 10ఞ12 అడుగుల వేదిక పైకి అడుగుపెట్టిన ఐశ్వర్య తన బలాన్ని పుంజుకున్నట్టు కనిపిస్తున్నారు. బ్యానర్‌ ఎక్కడ కట్టాలో ఉత్సవ నిర్వాహకులకు చెబుతూనే, రెండు 500వాట్ల లైట్లను అమర్చడానికి సరైన స్థలాన్ని గుర్తించారు. ‘‘ఆ రెండిటినీ వేదికకు ఎదురుగా, కొంచెం ఎక్కువ వాలుగా కట్టండి,’’ అని ఆదేశించారు. తన డ్రామా కంపెనీ పేరు ‘అశోక్‌ నాడగ మండ్రమ్‌’. దానికి ఐశ్వర్యే రంగస్థల నిర్వాహకురాలు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, లైట్‌ డిజైనర్‌, డైరెక్టర్‌, రచయిత కళాకారుల బృందానికి నాయకురాలు కూడా. ఆవిడే ఒక సైన్యం. వేదికపై కట్టిన (వస్త్రంతో చేసిన) బ్యానర్‌పై, ఆ డ్రామా కంపెనీ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చిత్రించి ఉంది. దంతాల మధ్య తొరప్పు (మేక ఊపిరితిత్తులు)ను పట్టుకొని, ఎడమ చేతితో కొడవలిని తిప్పుతూ, పంబై, పరై వాద్య సంగీతానికి తగ్గట్టు నాట్యం చేస్తున్న ఐశ్వర్య. ‘అంత ఆవేశంతో నాట్యం చేసింది నేను కాదు… నన్ను అమ్మన్‌ ఆవహించింది,’ తరువాత అన్నారామె
‘‘రజినీకాంత్‌, విజయకాంత్‌, ఖుష్బూ ఉండే ఏకైక డ్రామా కంపెనీ ఇదే,’’ బ్యానర్‌ వైపు చూపిస్తూ, ఆ సుప్రసిద్ధ తమిళ సినీ తారలను గుర్తు చేసుకుంటూ ఐశ్వర్య నవ్వారు. ఏ కారణం చేత ఆమె ఈ ప్రకటన చేశారో తరువాత అర్థమైంది. బ్యానర్‌ వెనుక, ఒక 200వాట్ల టంగ్‌స్టన్‌ బల్బ్‌ వెలుగులో, చేతిలో అద్దాలు పట్టుకొని మేకప్‌ వేసుకుంటున్న తలకాయలు ఎన్నో కనబడ్డాయి. ఈరోజు, తెర వెనుక ఉన్న రామర్‌ ఆలయమే వారి గ్రీన్‌రూమ్‌గా మారింది. కళాకారులందరూ ఒకేసారి తయారవడానికి అక్కడ తగినంత స్థలం లేదు కాబట్టి, వాళ్ళు వంతుల వారీగా మేకప్‌ వేసుకోవాలి. అయితే, ఇతర దేవాలయాల్లోలాగా ఇక్కడ ఎవరూ తమను ‘‘బయటకు పొండి!’’ అనేవాళ్ళు లేరని తెలిసిన కొందరు, కరువరై (గర్భగుడి)లో జమగూడి నాటకానికి సన్నద్ధమవుతున్నారు.
‘‘2018లో ఈ డ్రామా కంపెనీని ప్రారంభించాను. ట్రాన్స్‌మహిళలు సెక్స్‌ వర్క్‌ చేయాల్సిన, లేదా బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ డ్రామా కంపెనీ ద్వారా నటించవచ్చన్న ఆలోచనతో ఇది స్థాపించాను. నటన ద్వారా మేము తగినంత ఆదాయం సంపాదించుకోవచ్చు,’’ ఐశ్వర్య తెలిపారు. తన డ్రామా కంపెనీకి ‘అశోక్‌ నాడగ మండ్రమ్‌’ అని పేరు పెట్టారు. ‘‘నిజానికి, నా ట్రాన్స్‌జెండర్‌ తల్లులు నాకు పెట్టిన పేరు ‘ఐశ్వర్య’. కానీ అది నాకు నచ్చలేదు. నా అసలు పేరు అశోక్‌, నాకా పేరంటే ఇష్టం. అందుకే, నా డ్రామా కంపెనీకి ఆ పేరు పెట్టాను.’’
ప్రదర్శన సమయం దగ్గర పడుతున్నప్పుడు, వీధి మధ్యలో ఏర్పాటు చేసిన వేదిక ముందర దుప్పట్లు వెంట తెచ్చుకున్న ప్రేక్షకులు గుమిగూడారు. రాత్రంతా జరిగే మహోత్సవాన్ని చూసేందుకు సన్నద్ధమయ్యారు. ‘‘నేను నాటక రచయితను. నటిని కూడా,’’ ఐశ్వర్య చెప్పారు. ‘‘మేము ఎక్కువగా కల్పిత కథలను ప్రదర్శిస్తాం. వాటిని నవలలని పిలుస్తాం. పురాణాల నుంచి తీసుకున్న కథలు, హరిశ్చంద్ర, దానశూర కర్ణన్‌, నలాయిని, నల్ల తంగాల్‌ వంటి కథలను ప్రదర్శిస్తాం. అలాగే, జానపద కథల ఆధారంగా కొన్ని నాటకాలు వేస్తాం – ఉదాహరణకి, ఈ రాత్రి మేము ‘దైవం తంద తీర్పు’ (దేవుడిచ్చిన తీర్పు) ప్రదర్శిస్తున్నాం.’’ యువరాజు ఎళిళరసన్‌, కళై చెల్విల జానపద కథ ఆధారంగా దీన్ని రూపొందించాం. నేరం, శిక్ష, విమోచనం, దైవిక న్యాయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
విజయపురి అనే ఒక సుభిక్షమైన రాజ్యాన్ని రాజు విజయ వర్మన్‌, రాణి విజయ జ్ఞానం, కరుణతో చక్కగా పరిపాలిస్తుంటారు. ఆ రాజ దంపతులకు ఇద్దరు పిల్లలు: యువరాజు ఎళిళరసన్‌, యువరాణి ఎళిళరసి. దయ, దాతృత్వం మూర్తీభవించిన వ్యక్తిలా యువరాణి పెరుగుతుంది. కానీ, యువరాజు ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. అహంకారంతో అందర్నీ చులకనగా చూస్తుంటాడు. ఒక రోజు, గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న యువరాజు నదిలో స్నానం చేస్తున్న కళై చెల్వి అనే యువతిని చూస్తాడు. మదమెక్కి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడతాడు. దాంతో, ఆమె తీవ్ర వ్యధకు గురవుతుంది.
‘‘నేను ఒక ట్రాన్స్‌మహిళనని నాకు చాలా కాలం వరకూ తెలియదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు జుట్టు సవరించుకొని, బొట్టుబిళ్ళలు పెట్టుకొని, మేకప్‌ వేసుకునేదాన్ని. ఒకరోజు, అనుకోకుండా ఒక ట్రాన్స్‌మహిళను కలిశాను. అప్పుడే నేను కూడా ట్రాన్స్‌మహిళను కావొచ్చు అనిపించింది,’’ వేదికపైకి వెళ్ళేందుకు సన్నద్ధమవుతూ, ఐశ్వర్య గుర్తు చేసుకున్నారు. అందరికంటే చివర్లో మేకప్‌ వేసుకోవడం ఆవిడకి ఒక ఆనవాయితీ. ఈలోపు, హాస్యనటులు వేదిక పైకి వెళ్ళి, తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. అకస్మాత్తుగా సంగీతం మారింది, అశ్లీల సాహిత్యం ఉన్న ఒక పాట సాగుతుండగా, గుండ్రంగా తిరుగుతూ, వేదికపై నాట్యం చేస్తోన్న ఇతర ట్రాన్స్‌మహిళలతో కలిసి ఐశ్వర్య నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఇది పూర్వరంగం (కర్టెన్‌-రైజర్‌), జానపద సంగీతం. తమిళ్‌ గానాలో సహజంగా ఉండే ఆటపట్టించే లక్షణం ఇందులో మెండుగా వినబడుతోంది.
అత్యాచారం జరిగిన తరువాత, కళై చెల్వి తన సోదరుడితో కలిసి రాజ సభకు వెళ్ళి, తనకు న్యాయం చేయమని కోరుతుంది. తమ కొడుకు చేసిన అఘాయిత్యం గురించి తెలుకొని, రాజు, రాణి నిర్ఘాంతపోతారు. కానీ, హోదాతో సంబంధం లేకుండా న్యాయం పట్ల తమకి ఉన్న నిబద్ధతను నిరూపించుకుంటూ, యువరాజు చేసిన ఘోరమైన తప్పును సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో, అతన్ని కళై చెల్విని వివాహం చేసుకోమని ఆదేశిస్తారు. అయితే, సైన్యాధిపతి రూపంలో రాజభవనంలో పనిచేస్తున్న ఒక దుష్టుడికి తన సొంత ప్రణాళికలు ఉన్నాయి. రాజును పడగొట్టే ఉద్దేశ్యంతో, ఒక పన్నాగం ప్రకారం తన ప్రణాళికను అమలు చేస్తాడు. అందుకు అతని ప్రేయసి మోహన సహాయం తీసుకుంటాడు. చేతబడిలో ఆరితేరిన మరులుగొలిపే మోహన, యువరాజును తన వలలో వేసుకుంటుంది. వేశ్యాగృహ నిర్వాహకురాలిగా మారువేషంలో పరిచయం చేసుకొని, అతన్ని తన దుష్టశక్తుల అధీనంలోకి తీసుకుంటుంది.
ఆ దుష్టశక్తుల మాయలో పడ్డ యువరాజు ఎళిళరసన్‌ అంతిమ ద్రోహానికి పాల్పడతాడు. తన తండ్రిని హత్య చేసి, సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. అప్పటి నుండి, విజయపురిలో భయానక పాలన మొదలవుతుంది. కళై చెల్వి గర్భం దాల్చుతుంది. అయినప్పటికీ, ఎళిళరసన్‌ చేతిలో ఆమె గృహహింసకు గురయ్యి చిత్రవధ అనుభవిస్తుంది. తన కొడుకు చేసే పిచ్చి చేష్టలు చూసిన రాణి విజయ, ‘‘యువరాజుకు కుష్టు వ్యాధి సోకాలి!’’ అని అతన్ని శపిస్తుంది. ఆపై మోహన, సైన్యాధిపతి కలిసి సింహాసనాన్ని చేజిక్కించుకుంటారు. కుష్టు వ్యాధి వచ్చిన రాజును రాజ్యం నుండి బహిష్కరిస్తారు. అలాగే, కళై చెల్విని అంధురాలిని చేసి రాజభవనం నుండి తరిమేస్తారు. దాంతో, ఆమె వీధుల్లో బిచ్చమెత్తుతుంటుంది.
తరువాతి సన్నివేశంలో ఐశ్వర్య ప్రవేశించింది. నిండు గర్భిణి అయిన ఒక మహిళ, కళ్ళ నుండి రక్తపు ధారలు స్రవిస్తుండగా, వీధుల్లో బిచ్చమెత్తుతోంది. మాతృత్వం గురించి ఆమె ఒక విచారకరమైన పాట పాడుతున్నప్పుడు, ప్రేక్షకుల హర్షధ్వానాలు సద్దుమణిగి, వారికి సంభ్రమంతో నిండిన కన్నీళ్ళొచ్చాయి. భిక్షాటన కోసం ఆమె పట్టుకున్న చిన్న గిన్నెలో కొన్ని నాణేలు, కరెన్సీ నోట్లు వేయడానికి చాలామంది ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. ‘‘నేను ఈ దీన స్థితిలో ఎందుకున్నాను? ఎందుకు రక్తకన్నీరు కారుస్తున్నాను? ఎందుకో చెప్తా వినండి…’’
పాటలోని ఆ చివరి పంక్తులతో సన్నివేశం మారబోతోందని ఆమె సూచించారు, ఇప్పుడు గతాన్ని ప్రదర్శిస్తారు.
వేరే నటులు వేదికపైకి వెళ్ళారు. ఐశ్వర్య వేదిక దిగి, మళ్ళీ తెర వెనుకకు వచ్చారు. తన చెక్కిళ్ళపై ఉన్న రక్తపు చారలను తుడిచి, తరువాతి సన్నివేశం కోసం తన చీర, మేకప్‌ మార్చుకున్నారు. ‘‘నా సన్నివేశం రావడానికి గంట పైనే పడుతుంది,’’ తనకాళ్ళుముందుకు చాచి, కొంచెం వెనక్కి వాలి, తన గత సన్నివేశాలను మనసులో నెమరువేసుకుంటూ అన్నారు.
‘‘నేను ట్రాన్స్‌మహిళనని తెలుసుకున్నప్పుడు, మా అమ్మ దగ్గర బాగా ఏడ్చాను,’’ ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడని ఆమెను అడిగాను. అప్పుడు మా అమ్మ నాతో ఇలా అంది: ‘పసిబిడ్డ నీ తొడపై మల విసర్జన చేస్తే, దాన్ని కడుక్కుంటావా, లేక బిడ్డను చంపుతావా? నా కొడుకు ఎలాంటి వాడైనా, నేను ప్రేమిస్తాను. నా రాజా, నా బంగారు కొండా, ఎందుకు ఏడుస్తున్నావు?’ ట్రాన్స్‌మహిళల గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే మా అమ్మ నన్ను నన్నుగా అంగీకరించింది. మా అమ్మే నా దైవం. తనే నాకు గొప్ప ఓదార్పు. పెద్ద ఆసరా.’’
‘‘నేను పదవ తరగతి వరకే చదివాను. పేదరికం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోయాను. పదవ తరగతి పాసవ్వలేకపోయాను. దాంతో, చదువు మానేసి, కూలి పనికి వెళ్ళాను. కంకర రాళ్ళు కొట్టడం లాంటి కొన్ని భారీ పనులు చేశాను,’’ తెలిపారామె. రంగస్థలంపై తనకెంత మక్కువ ఉండేదో ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ‘‘ఒకసారి మా గ్రామ ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి ఒక నాటక బృందం వచ్చింది,’’ ఆమె చెప్పారు. ‘‘నా స్నేహితులు నన్ను వాళ్ళ ముందు నాట్యం చేయమన్నారు. నేను చేశాను. నేను చాలా బాగా నాట్యం చేశానని వాళ్ళు ప్రశంసించారు. నాకు వాళ్ళ విజిటింగ్‌ కార్డ్‌ ఇచ్చి, ‘ముందు చదువుకో. ఆ తరువాత కూడా నీకు నాటకంపై ఆసక్తి ఉంటే, మాతో కలిసి ప్రదర్శనలివ్వు’ అన్నారు.’’ ‘‘మొదట్లో, మా కుటుంబ పేదరికం వల్ల మాత్రమే నేను నాటక ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. తరువాత, అది బాగా నచ్చటంతో అదే నా వృత్తిగా మారింది. అప్పట్లో, రాత్రంతా ప్రదర్శన ఇస్తే మాకు రూ. 20 ఇచ్చేవారు. నేను చాలా డ్రామా కంపెనీలకు సుపరిచితురాలిని అయ్యాను,’’ అన్నారామె. కళాకారుల ప్రతిభను బట్టి, డ్రామా కంపెనీలు వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తాయి. ఒక కంపెనీ నుండి అడ్వాన్స్‌ తీసుకున్న తరువాత, ఆ డబ్బులు తిరిగి చెల్లించేవరకూ వాళ్ళతోనే పని చేయాలనే నియమం ఉంటుంది.
‘‘నాకు రూ. 7 లక్షలు అప్పు ఉండేది. మా అమ్మ చికిత్స కోసం అవసరమై ఆ డబ్బు తీసుకున్న తరువాత, నేను ఆ డ్రామా కంపెనీ యజమానితోనే కలిసి పనిచేశాను. అప్పు మొత్తం తీర్చడానికి నాకు పదేళ్ళు పట్టింది.’’ ఐశ్వర్య ఒక ప్రముఖ కళాకారిణి కాబట్టి, అది సాధ్యమైంది. ‘‘నా జీతం కంటే పెద్ద మొత్తం నాకు బహుమతి రూపంలో వస్తుండేది. నా జీతం మొత్తం అప్పు తీర్చడానికే సరిపోయింది. (తరువాత), మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది.’’ ఆ డ్రామా కంపెనీలో పనిచేసే మరో కళాకారుడు రజిని, తన సన్నివేశం పూర్తయ్యాక బట్టలు మార్చుకోవడానికి వేదిక వెనక్కి వచ్చారు. ‘‘ఇదిగో, రజినీకాంత్‌ వచ్చాడు!’’ ఐశ్వర్య అన్నారు. ‘‘ప్రస్తుతం అతను రజినీకాంత్‌. అంతకుముందు శరత్‌ కుమార్‌. పైల్వాన్‌ (మల్లయోధుడు) లాంటి శరీరం ఉంది అతనికి. నాకు 14 ఏళ్ళ వయసున్నప్పుడు అతనొక స్టార్‌ నటుడు. అతనితో కలిసి నటించడానికి జనాలు పోటీ పడేవాళ్ళు. అప్పుడు నేను అతని అసిస్టెంట్‌గా ఉండేదాన్ని,’’ ఐశ్వర్య నవ్వుతూ తెలిపారు. ఆ నటుడి అసలు పేరు వినాయగం. యాభై దాటిన వయసు. ‘‘అన్నామలై సినిమాలోని రజినీకాంత్‌కి, ప్రస్తుత రజనీకి మధ్య తేడా ఉంది. అదే నాకూ వర్తిస్తుంది,’’ అంటూ అతను నవ్వారు.
‘‘మనం తినడానికి, గౌరవంగా బతకడానికి కష్టపడి పనిచేయాలి,’’ ఐశ్వర్య అన్నారు. ‘‘ఈ పనిలో నాకు ఆనందం దొరుకుతుంది. కానీ, అదే సమయంలో, ట్రాన్స్‌మహిళలుగా మేము చాలా హింసను ఎదుర్కొంటున్నాం. కొన్ని గ్రామాల్లో, సురక్షితంగా మూత్ర విసర్జనకి కూడా వెళ్ళలేము. అందుకే, చాలా మంది ట్రాన్స్‌మహిళలు నాటక రంగాన్ని విడిచి వెళ్ళిపోయారు.’’ తన తల్లి మరణం తరువాత, ఐశ్వర్య లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, తిరిగి నాటక ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు, ఆమె కష్టాలు కొనసాగాయి.
‘‘ఆ సమయంలో, శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్‌మహిళలను డ్రామా ట్రూపుల్లో తీసుకునేవారు కారు. శస్త్రచికిత్స చేయించుకున్న మూడు సంవత్సరాలు వరకూ, డ్రామా ట్రూప్‌తోపాటు తిరుగుతున్నప్పుడు నేను లుంగీలు, చొక్కాలు వేసుకునేదాన్ని. నేను చీర కట్టుకోడానికి వాళ్ళు అంగీకరించలేదు. నేను ఎవరో (ఆడో, మగో) తెలియక, ఎన్నో డ్రామా కంపెనీలు నన్ను తిరస్కరించాయి. దాంతో, ఇకపై నేను అవమానం సహించకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పుడే నన్ను నేను ప్రశ్నించుకున్నాను: నేను నా సొంత డ్రామా కంపెనీని ఎందుకు ప్రారంభించకూడదు? ఎవరి కోసమో పనిచేయడం కన్నా, నాలాంటి ట్రాన్స్‌మహిళలతో కలిసి వ్యాపారం చేయడం ఉత్తమం అనిపించింది,’’ ఆవిడ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఐశ్వర్య తన డ్రామా కంపెనీ ప్రారంభించడానికి 2018లో గ్రామంలోని ఒక ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బును అధిక వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌లు ప్రకటించారు. ఐశ్వర్య లాంటి ట్రాన్స్‌జెండర్‌ కళాకారిణులు ఆ మహామారి బారి నుండి బయటపడడానికి చాలా కష్టపడ్డారు. ఆమె గ్రహించేలోపే, తిరిగి తీర్చలేనంత అప్పుల భారంలో కూరుకుపోయారు.
‘‘లాక్‌డౌన్‌లు ముగిశాక కూడా నాటక ప్రదర్శనల నుండి వచ్చే ఆదాయం సరిపోలేదు. నేను ఇతర ట్రాన్స్‌మహిళలతో కలిసి కడై వసూల్‌ (భిక్షాటన)కి వెళ్ళడం ప్రారంభించాను. అందరూ మమ్మల్ని ఏహ్యభావంతో, అగౌరవంగా చూడడం నాకు అస్సలు నచ్చేదికాదు. దాంతో, రంగస్థలానికి తిరిగి వచ్చేశాను,’’ అన్నారామె. భిక్షాటన చేస్తేనో, లేదా సెక్స్‌ వర్క్‌కి వెళ్ళి ఉంటే గనుక ఖచ్చితంగా బాగానే సంపాదించి ఉండేదాన్నని ఐశ్వర్య నమ్ముతారు. ‘‘కానీ, నాకది ఇష్టం లేదు. నాకు ఇదే ఇష్టం. ఇదే నా జీవితం, నా ప్రపంచం. ఇలా గౌరవప్రదంగా డబ్బు సంపాదించి, వచ్చిన దానితోనే తిని, ఆత్మగౌరవంతో బతకుతాను.’’
ఒకప్పుడు తన డ్రామా కంపెనీలో ఐదారుగురు ట్రాన్స్‌జెండర్‌ కళాకారిణులు ఉండేవాళ్ళు. కానీ, ఇప్పుడు దాదాపు పదిమంది పనిచేస్తున్నారు, అయితే, అంతకుముందు జరుగుతున్నన్ని ప్రదర్శనలు మాత్రం ఇప్పుడు జరగట్లేదు, వాటి సంఖ్య సంవత్సరానికి 250 నుండి 160-180కి పడిపోయింది. ఈ డ్రామా కంపెనీ తమిళనాడులోని అనేక జిల్లాల్లో ప్రదర్శనలు ఇస్తుంది. మంచి సీజన్‌లో నెలలో 25 రాత్రులు నాటక ప్రదర్శనలు ఉంటాయి.
‘‘పురట్టాసి నెల నుండి తయి (సెప్టెంబర్‌ నుండి ఫిబ్రవరి) వరకు, ఆరు నెలలు పాటు నాటక ప్రదర్శనలు ఉండవు. ఇవి సంవత్సరంలో అతి కష్టంగా నడిచే నెలలు,’’ అన్నారామె. ‘‘ఆఫ్‌-సీజన్‌లో, మేము (పని లేకుండా) ఇంట్లోనే ఉంటాం. మేము సంపాదించిన డబ్బును ఆదా చేసుకొని, ఆ నెలల్లో తినడానికి ఉపయోగించుకుంటాం. నాటక ప్రదర్శనలు ఉన్నప్పుడు, మేమెందుకు బిచ్చమెత్తాలి? పని లేకపోతే తప్పదేమో. కానీ, ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.’’
ఆఫ్‌-సీజన్‌లో, ప్రదర్శనల రూపంలో ప్రభుత్వం నుండి కొంత శ్రద్ధ, మద్దతు దొరికితే బాగుంటుందని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. ‘‘తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ‘ఇల్లమ్‌ తేడి కళ్వి’ (ఇంటి వద్దకే విద్య) పథకం ద్వారా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల దగ్గర నివసించే విద్యా బ్లాక్‌లు, సంఘాలను నేను సందర్శించగలుగుతున్నాను. పాటలు, నృత్య ప్రదర్శనల ద్వారా మేం ఆ పథకంపై అవగాహన పెంచాం,’’ అన్నారామె. 2023లో, తమిళనాడు ప్రభుత్వం ఆమెను ఉత్తమ ట్రాన్స్‌పర్సన్‌ అవార్డుతో సత్కరించింది. తిరుణంగైయర్‌ సమాజ సంక్షేమం కోసం పనిచేస్తూనే సొంతంగా కెరీర్‌ను నిర్మించుకున్న ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిని గుర్తించి, ఈ రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చి గౌరవిస్తారు. ఐశ్వర్య మళ్ళీ వేదికపైకి వెళ్ళాలి కాబట్టి, తన సన్నివేశం రావటానికి ముందు చిన్న కునుకు తీశారు. ఆమె లేచేసరికి దుస్తులు, అలంకరణ సిద్ధంగా ఉన్నాయి. ఆమె తవళై కరగంను ప్రదర్శించాలి. ఇందులో, తలపై సొంబు (చిన్న పాత్ర) పెట్టుకొని నాట్యం చేస్తారు, అది దాదాపు ఒకటిన్నర కిలోల బరువు ఉంటుంది. అలాగే, దాదాపు 15 కిలోల బరువుండే తవళై అనే పెద్ద ఇత్తడి పాత్రను నీటితో నింపి, దాన్ని సొంబుపైన పెడతారు.
తెల్లవారుజామున 2 గంటలయింది. ప్రేక్షకులను నిద్ర పోకుండా నాటకంలో నిమగ్నం చేయడానికి, విరామ సమయంలో ఈ కష్టమైన నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
‘‘నాకు 17 ఏళ్ళ వయసున్నప్పటి నుండి గత 20 ఏళ్ళుగా నేను ఈ నాట్యం చేస్తున్నాను. తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. నా తవళై కరగం వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను బోలెడన్ని ప్రదర్శనలు ఇచ్చే రోజుల్లో, నాటక నిర్వాహకులందరూ నా డ్రామా కంపెనీనే బుక్‌ చేసుకునేవాళ్ళు. అప్పుడు నా జీతం రూ. 20 ఉంటే, ప్రేక్షకుల నుండి రూ. 500 విలువ చేసే బహుమతులు వచ్చేవి. నా కుటుంబాన్ని అలాగే పోషించాను. డాక్టర్‌ వద్దని చెప్పడంతో, ఇప్పుడు చాలా అరుదుగా తవళై కరగం ప్రదర్శిస్తున్నాను. కొన్నేళ్ళుగా నాట్యం చేస్తుండడంతో, నా మెడ ఎముకలు దెబ్బతిన్నాయి. గతంలో 30 నిమిషాలు ఉండే ప్రదర్శన, ఇప్పుడు 10 నిమిషాలకు తగ్గిపోయింది, అది కూడా ప్రత్యేక అభ్యర్థనలు వస్తేనే.’’
తన తలపైని పాత్రలను బ్యాలెన్స్‌ చేస్తూ, కింద నీళ్ళు తుళ్ళుతున్నా వేదికపై ఐశ్వర్య నాట్యం చేస్తున్న విధానంలో ఆమె సుదీర్ఘ అనుభవం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. నాట్య ప్రదర్శన ముగిశాక, బట్టలు ఇంకా తడిగా ఉండగానే తన గంభీరమైన స్వరంతో మైకులో గాన సుధాకర్‌ పాట పాడడం మొదలుపెట్టారు.
‘‘టీ తాగడానికి ప్రత్యేక గ్లాసా?
మీరు ఎస్‌సిలో, ఎస్‌టిలో అయితే అసలు గ్లాసే ఉండదా?
అంటరానితనంలోని క్రూరత్వాన్ని
అంబేద్కర్‌ పటాపంచలు చేశారు…
ఈలలు, హర్షధ్వానాలు, చప్పట్లతో ప్రేక్షకులు ఆమెను ఆదరించారు. కొందరు తమ చేతులు పైకెత్తి మరీ నాట్యం చేస్తే, మరికొందరు ఐశ్వర్యపై కరెన్సీ నోట్లను బహుమతిగా ఎగరేశారు. ‘‘ఇది ఒక (దళితల) కాలనీ. ఇక్కడ సినిమా పాటలు, భక్తి పాటలు నడవవు,’’ వేదిక దిగాక ఐశ్వర్య నాతో అన్నారు. ‘‘ఇక్కడ అంబేద్కర్‌ పాటలు మాత్రమే స్వాగతించబడతాయి.’’
తెలతెలవారుతోంది. నాటకం ముగింపుకు చేరుకుంది. ప్రాయశ్చిత్తం, న్యాయం రూపంలో విధి ఈ కథకు ఒక చివరి మలుపును ఇస్తుంది.
నిరాశానిస్పృహలతో బతుకుతున్న రాజు ఎళిళరసన్‌, అంధురాలైన రాణి కళై చెల్వి మళ్ళీ ఒకరినొకరు కలుస్తారు. విశ్వాసం తప్ప ఏమీ మిగలని కళై చెల్వి, కాళీమాత శరణు వేడుకుంటుంది. తీవ్రమైన కష్టాలు, అన్యాయం నుండి పుట్టిన ఆమె ప్రార్థనలు ఆ దేవతను చేరతాయి. ఆమె వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది.
ఆ జంటను ఆశీర్వదించి, వాళ్ళ గాయాలను నయం చేస్తుంది. దైవిక న్యాయం వాళ్ళని హింసించిన వాళ్ళను శిక్షిస్తుంది: మోహన సముద్రగర్భంలో మునిగిపోయి, అగాధ జీవులకు బలైపోవాలని శాపం పొందుతుంది, మంత్రగత్తె ప్రేయసి లేకపోవడంతో, సేనాధిపతి కుతంత్రాలన్నీ విఫలమవుతాయి. రాజు ఎళిళరసన్‌, రాణి కళై చెల్వి వాళ్ళ యథా స్థానాలకు తిరిగి వెళ్తారు.
వేదికపై ఉన్న ఐశ్వర్య, వీధిలో కాళీమాతను ప్రార్థిస్తున్న అంధ కళై చెల్విని ప్రేక్షకుల కళ్ళ ముందుకు తెస్తారు. దేవత ప్రత్యక్షమై, న్యాయం చేస్తానని ఆమెకు హామీ ఇస్తుంది. ఈ చివరి సన్నివేశంలో, ఐదుగురు ట్రాన్స్‌జెండర్‌ కళాకారిణులు కాళీ నృత్యం చేసే కాళీమాత పాత్రను పోషిస్తారు. వేప మండలు కట్టిన మట్టి కుండలలో మంటలు వెలిగిస్తారు. వేర్వేరు రంగుల దుస్తులు ధరించిన ఐదుగురు కాళీమాతలు భయానకంగా నృత్యం చేస్తూ, ఊళపెట్టి (కుళవై) అరుస్తూ ఒకరి వెనకాల ఒకరు వరుసగా వేదికపైకి వస్తారు.
23 ఏళ్ళ ట్రాన్స్‌జెండర్‌ కళాకారిణి సెంబ, తన చేతులను తీవ్రంగా మెలితిప్పుతూ, ఒక కోడిపుంజు గొంతు కొరికి, దాని రక్తం పీలుస్తారు. ఆమెకు దారివ్వమని ఐశ్వర్య ప్రేక్షకులకు సైగ చేశారు. సెంబ తన నోటిలో ఉన్న కోడిపుంజుతో వీధి చివర వరకూ పరిగెత్తి, ఒక్క క్షణంలో మాయమవుతారు. మిగిలిన కళాకారులు సెంబ వెనుకే పరిగెత్తి ఆమెను తిరిగి వేదిక దగ్గరికి తీసుకువస్తారు. కాళీమాతలు చల్లబడి, శాంతపడతారు. ప్రేక్షకులకు విబూదిని, కుంకుమను పంపిణీ చేస్తారు. దాంతో, నాటకం ముగుస్తుంది.
తెల్లవారగానే కళాకారులందరూ తమ సామాను సర్దుకోవడం మొదలుపెడతారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం ఇచ్చిన డబ్బు పోగా, మిగిలిన మొత్తాన్ని కార్యక్రమ నిర్వాహకుడు ఐశ్వర్యకు చెల్లిస్తాడు. చిన్న బేరసారం తరువాత, ఐశ్వర్య వెయ్యి రూపాయలు అదనంగా తీసుకుంటారు.
‘‘మా రోజువారీ ఆదాయం ఇంత అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఏ రకమైన నాటకం, ఉత్సవం అన్నదాన్ని బట్టి, ఒక ప్రదర్శనకు మేము రూ.25,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తాం. అలాగే, కళాకారుల జీతం కూడా మారుతూ ఉంటుంది. బుకింగ్‌ ధరను బట్టి, అనుభవజ్ఞులైన కళాకారుల, ముఖ్యంగా సంగీతకారుల జీతం రూ. 1,500 నుండి 2,000 వరకు ఉంటుంది. యువ కళాకారులకు రూ. 1,000 నుండి 1,200 వరకు ఇస్తాం. కొన్నిసార్లు నాకు రూ. 2,000 కూడా మిగలవు. ఒక్కోసారి అసలు ఏమీ మిగలదు,’’ ఐశ్వర్య వివరించారు.
ఒక క్షణం ఆగి, ఆమె మాట్లడడం కొనసాగించారు: ‘‘ఇప్పుడు ఈ కంపెనీ నాది. కానీ నేను దీనికి నిజమైన యజమానిని కాదు. ఈ కంపెనీని ప్రారంభించడానికి నాకు అప్పు ఇచ్చిన యజమానికి నేను డబ్బు చెల్లించాలి.’’ డ్రామా కంపెనీ పెట్టినప్పుడు ఐశ్వర్య తీసుకున్న ఏడంకెల సంఖ్య, అదనపు రుణాలు, భారీ వడ్డీ కలిపి, గత ఆరు సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగింది.
‘‘నేను సంపాదించే దానిపై నేను (యజమానికి) చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది,’’ ఆమె చెప్పారు. తన ఆర్థిక విషయాల దగ్గర ఐశ్వర్య చాలా మితభాషిగా ఉంటారు. ప్రస్తుతం తన గ్రామంలో ఉన్న వడ్డీ రేట్లు, పద్ధతుల దృష్ట్యా, తను ఎదుర్కోవలసిన సవాళ్ళ గురించి ఆమెకు బాగా తెలుసు. కానీ జరగబోయే పరిణామాల గురించి భయపడి, ఆమె ఏ వివరాలనూ మాతో పంచుకోరు. ‘‘ఆ అప్పు ఎప్పటికీ తీర్చలేను. అది అలాగే ఉంటుంది. నేను అప్పు తీసుకున్న మొత్తంపై నెలవారీ వడ్డీ చెల్లిస్తుంటాను. కానీ, అసలు మొత్తాన్ని మాత్రం ఎప్పటికీ చెల్లించలేను,’’ ఐశ్వర్య వాపోయారు. తన ముందున్న సవాళ్ళను ఆమె ఎప్పుడూ తక్కువ అంచనా వేయరు. కానీ, ఆమె ధ్యాస అప్పు మీదో, డబ్బు మీదో లేదు, నాటకం మీద ఉంది, నాటకమే ఆమెను నడిపిస్తోంది.
నాటక ప్రదర్శనకు సంబంధించిన వస్తువులన్నిటినీ వాహనం పైకి ఎక్కించారు, అది బయలుదేరింది. వెనుక కిటికీకి ఐశ్వర్యది ఒక పెద్ద ఫోటో అతికించి ఉంది. అరగంట ప్రయాణం తరువాత, ఆ బృందం కళవై క్రాస్‌రోడ్‌ చేరుకుంది. నాటక ప్రదర్శనలు ఉండే రోజుల్లో కళాకారులను ఈ జంక్షన్‌ దగ్గరే వాహనంలో ఎక్కించుకొనివచ్చి, దింపుతారు. ఈ సీజన్‌ కోసం, ఐశ్వర్య 100 మీటర్ల దూరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొబ్బమండలతో కప్పిన నాలుగు గోడలున్న ఇల్లు.
‘‘ఈ కళ అంటే నాకు ఎందుకంత ఇష్టమో నాకే తెలియదు. కేవలం డబ్బు కోసం దీన్ని కొనసాగించడం లేదు. నేను నాటకంలో పోషించే పాత్రల ద్వారా నా బాధలను, సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతున్నాను,’’ అన్నారు ఐశ్వర్య. ‘‘ఎంత కష్టంలో ఉన్నా సరే, వేదికపై ఉన్నప్పుడు నాకు ఇంకేమీ పట్టదు. అందుకే, కష్టాలను నా జీవితంలో భాగంగా చూడదలచుకున్నాను.’’
తన ఉదారమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు, కవితా మురళీధరన్‌కు మా ధన్యవాదాలు.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్‌ (ఎమ్‌ఎమ్‌ఎఫ్‌) ఫెలోషిప్‌ మద్దతు ఉంది.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/article/iswaraya-takes-centre-stage-te) ఏప్రిల్‌ 8, 2025 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.