‘‘ఊలు దారాలతో గొంతు కురిబిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా! దయలేని వారు మీ ఆడవారు’’
కరుణశ్రీ గారు తమ పుష్పవిలాపంలో ఒకరోజు పూసి తెల్లవారి వాడిపోయే పువ్వుల సున్నితత్వాన్ని ఆడవాళ్లు గుర్తించక సూదులతో గుచ్చి దండలు కట్టారని, తమ సిగలలో ముడుచుకున్నారని వాపోయారు. పై గేయం చదివితే మనకు కూడా గుండె తడి అవుతుంది. మరి తల్లిదండ్రుల వద్ద ఏడు మల్లెల ఎత్తున, పువ్వు కన్నా సుకుమారంగా పెరిగిన, అందమైన మనసున్న ఆడవాళ్లను దుఃఖింపజేసి వారి హృదయాల్లో తడి ఆరిపోయిన చేసి ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎరుగని ఒక బండ రాయి, రాక్షసి గయ్యాళి లాగా ఎందుకు తయారు
అయ్యారు, అవుతున్నారు…? ఏ పరిస్థితులు అలా తయారు చేస్తున్నాయి… మన సమాజంలో మహిళల జీవితంలో అడుగడుగునా ఆంక్షలు, అవరోధాలు… వివిధ దశల్లో ఎదురయ్యే కఠిన పరీక్షల్లో వైధవ్యం లేదా వితంతువు కావడం అనేది దుర్భరమైన స్థితి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సామెతను సృష్టించి తమ చేతులకు ఏ మట్టీ అంటకుండా ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు అంటూ ఘోరమైన నిబంధనలను రూపొందించిన మనువుది కాదా ఈ పాపం. ఆయన వారసులుగా పురుషాధిక్య భావజాలంతో మన చుట్టూ ఉన్న, మన ఇంట్లో ఉన్న మనుషులది కాదా ఈ పాపం…
21వ శతాబ్దంలో పావు భావం పూర్తిగా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి ఒక డాక్టర్ శస్త్రచికిత్స చేశారట. ఇది చైనాలో జరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిత్యం నూతన ఆవిష్కరణలు జరుగుతున్నా మన దేశంలో మాత్రం సనాతనం పేర జనాన్ని వాస్తవాలకు దూరంగా భ్రమల్లో ముంచెత్తుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ఆగ్రహం కన్నా సనాతనం పైన ఆచారాల పైన మతం పైన చర్చలు ప్రచారాలు జరుగుతూ ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు. ధరలపై ఆందోళన వెలిబుచ్చిన వారి గొంతుకలకు ఎక్కడా గుర్తింపు ఉండదు. ఈ ఉపోద్ఘాతం, ఆవేదన ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా మనసును కలచివేసిన ఒక సంఘటనను అలాంటి కొన్ని సంఘటనలు నన్ను వెంటాడుతున్నాయి. ఆ అమానవీయ ప్రక్రియను ఎట్లా
ఆపగలం, ఎట్లా ఎదిరించగలం అనేది ప్రశ్న అయితే అసాధ్యం ఏమీ కాదు. ఆ అమానవీయ ప్రక్రియ భర్తను కోల్పోయిన స్త్రీ వితంతువుగా మారే ప్రక్రియ. వైధవ్యం అంటే ధవుడు లేకపోవడం. పెనిమిటి మరణించిన భార్యకు విధవ లేదా వితంతువు అని పేర్లు. భర్త మరణించి
భార్య ఉండడం, భార్య మరణించిన భర్త ఉండడం సహజం. ఆ ఇరువురు ఒకసారి పుట్టలేదు, ఒకసారి మరణించరు. కానీ భర్త చనిపోయిన భార్య పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మధ్యయుగంలో విన్నాము. ఆధునిక యుగంలో కళ్ళారా చూశాం సతీసహగమనం. రాజస్థాన్లో జరిగిన రూప్ కన్వర్ సతీసహగమనం. ఉద్యమాల పుణ్యమా అని సతీసహగమనం బాధ తప్పినా బతికున్న భార్యను జీవచ్ఛవంగా మార్చే వితంతు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది.
భర్త చనిపోయిన భార్యను నిరలంకార చేయడంలో ఒకరేమిటి అందరూ పెద్దలు. ఈ పద్ధతి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు భర్త అంత్యక్రియల సందర్భంగా భార్య పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి శవం పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికీ కలిపి స్నానం చేయించడంతో ఆమె నిమిత్తము లేకుండా మొదలవుతుంది. అది మొదలు పదో రోజు వరకూ ఇదే చివరి అలంకారం అంటూ రోజూ హింసిస్తూనే ఉంటారు. ఇక పదవ రోజున గాజులు పగలగొట్టడం, పసుపు కుంకుమలు తుడిచేయడం, పుస్తే మట్టెలు తీసేయడం. ఈ పని ఒక చాకలి లేదా మంగలి వృత్తికి చెందిన మహిళే చేయాలి. కన్నతల్లి, తోబుట్టువులు, ఆత్మీయులు ఎవరూ చేయకూడదట. భూమి బద్దలై సీత వలె అందులో కూరుకు పోతే బాగుండు అనిపించినా సానుభూతి మాత్రం అవకాశం ఉండదు. స్నానం చేశాక తెల్ల చీర కట్టించి వెలుతురు ఎక్కువగా లేని ఒక గదిలో కూర్చోబెట్టి అమ్మలక్కలంతా ఒక్కొ క్కరు వరుస కట్టి ఆ గదిలోనికి వెళ్ళా లి. ఆమె తల వంచుకుని దుఃఖిస్తూనే ఉండాలి. చేతిలో బెల్లం ముక్క పెట్టి ఓదార్చి వస్తారు. ఆరోజు తప్ప, అప్పుడు తప్ప మరో రోజు ఆమెను కలవాలన్నా ఆమె ముఖాన్ని చూడాలన్నా తిధి వార నక్షత్రాలు చూసుకుని చూడాలట. చివరకు కన్న తల్లి అయినా, పెళ్లయిన కూతురు అయినా సరే, ఎంత అమానుషం. ఇక ఆ రోజు నుండే ఆమె కుంకుమ ధరించడానికి వీల్లేదు. శుభకార్యాల్లో ముందు ఉండటానికి వీల్లేదు, రంగు చీరలు కట్టకూడదు, ఏ విధమైన అలంకరణ ఉండకూడదు. అయితే తన బాధ్యతలతో పాటు ఇకపై భర్త భాధ్యతలను తను మోయాల్సిందే ఆ కష్టనష్టాలన్నీ తనవే కానీ తన ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనూ తాను సంతోషంగా భాగస్వామి కాలేదు. దూరంగా, పరాయి వ్యక్తిలా ఉండాల్సిందే… ఎప్పుడూ దిగులుగా, దుఃఖం గూడు కట్టుకున్న ముఖంతో ఉండాల్సిందే. విచిత్రం ఏమిటంటే అది భార్య పోయిన భర్తకు ఈ నిబంధనలు లేవు కదా కుంకుమ బొట్టు కూడా దర్జాగా పెట్టుకోవచ్చు. శుభకార్యాల్లో అందరి మగవాళ్ళతో పాటు ఆయనకు పెడతారు. చూడండి ఎంత వివక్షో… జీవిత భాగస్వామిని కోల్పోయిన ఒంటరై భవిష్యత్తు ఏమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ఈ కుటుంబ భారాన్ని ఎలా మోయాలి అని గుండె పగిలేలా రోదిస్తున్న ఆమెకు ఈ వితంతు ప్రక్రియ మరొక దుఃఖ కారకమైనది. ఈ ఆచారాలు ఎందుకు? ఆమె పరిస్థితి ఏమిటి? ఆలోచనలు ఏమిటి? అని కనీసం ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఆవేదన కలిగించే అంశం. ఈ విషయంలో పిల్లలు కొంత చొరవ చూపినా ఆచారం, ఆరిష్ణం పేరుతో వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. తాను ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో నిర్ణయించుకునే అవకాశం అధికారం ఆమెకి ఉండాలి. ఆమె అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంలో ఆమె నిర్ణయాన్ని సమర్థించే కన్న పిల్లలు, తోబుట్టువులు, ఆత్మీ యులు అండగా నిలవాలి.
ఆడవాళ్లు భర్త కోసమే అందంగా అలంకరించుకోవాలి, భర్త లేని స్త్రీలు అలంకరణకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అందంగా అలంకరించుకున్న వితంతు స్త్రీలకు మగవాళ్ళు ఆకర్షితులు అవుతారని, వాళ్ళ సంసారాలు పాడైపోతాయని ఇలాంటి ఆచారం పెట్టారట. పరాయి మగవాడి కోసం, తమను తాము నియంత్రించుకోలేని అసమర్థుల కోసం మహిళలు వైధవ్యాన్ని స్వీకరించాలన్నమాట. మరి అలంకరణ లేని మహిళల వైపు బాల వితంతువుల వైపు మగవాడి దృష్టి వెళ్లదు అని చెప్పిన పండితులు అమాయక మహిళలను, బాలికలను లోబరచుకుని గర్భం చేస్తే జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ముందు పడి యువతులను ఎట్లా ప్రసవాలు చేశారు. ఆ పిల్లలు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా రక్షించారో మనం చదువుకున్నాం. అంటే అలంకరణ ఉన్నదా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా బాలికలు స్త్రీలు మగవాళ్ళు అనుభవించడానికి పుట్టారు అనేటువంటి అహంకారం, ఆధిపత్య ధోరణి తప్ప మరేం కాదు. నిబంధనలు, నియమాలు అన్ని ఆడవాళ్లకు అపరిమితమైన స్వేచ్ఛ తప్పు చేసినా తప్పించుకునే వెసులుబాటు మగవాళ్ళకు. ఇదీ మన భారతీయ సమాజంలో మనుధర్మం పేర ఏర్పాటు చేసిన సదాచారం అని చెప్తున్న దురాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఒకే రకమైన వస్త్రధారణ ఒకే విధమైన ఆచార వ్యవహారాలు ఉండవు. అదే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం కదా. భారతీయ సమాజంలో అనేక కుటుంబాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియ ఏ మాత్రం మంచిది కాదు. అసలు ఆడపిల్లలకి కుంకుమ, పసుపు, పూలు, గాజులు ఎప్పటినుంచి ప్రారంభిస్తారు. ఎప్పుడు మొదలవుతుంది పాప పుట్టగానే పురిటినాడు బారసాల నాడు బొట్టు పెట్టడం ప్రారంభిస్తారు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు పాదాలకు గజ్జెలు పెడతారు. పాదాలకు పసుపు పెట్టి జుట్టు కట్టి పూలు పెడతారు రంగురంగుల గాజులతో పిల్లలను అలంకరించి ఆనందిస్తారు. ఆ పద్ధతి పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న మార్పులతో కొనసాగుతూనే ఉంటాయి. పెళ్లి సందర్భంగా మగవాళ్ళు లేని ఆడవాళ్లకు మాత్రం మంగళసూత్రం పేరుతో మెడలో పసుపు తాడు, పాదాలకు మెట్టెలు పెట్టి ఒక నిబంధన, ఇక అనేక కారణాలు చెబుతుంటారు మొగలాయిలు లేదా ఇక్కడ నిజాం పరిపాలన కాలంలో ఆడవాళ్ళ మీద దాడులు చేస్తూ అత్యాచారాలకు పాల్పడే వారు కాబట్టి పెళ్ళైనట్లు గుర్తులు ఉంటే వాళ్ళ జోలికి ఎవరూ రారు, అందుకే పెళ్లి గుర్తులు అని చెప్తుంటారు. చరిత్రలో ఎక్కడైనా చూసినప్పుడు అత్యాచారాలు, ఆగడాలు మహిళల మీద జరుగుతున్నటు వంటి సందర్భాలలో కులం కాని, మతం కానీ, దేశం కానీ, జాతి గాని ఏమైనా అడ్డొచ్చాయా ఏవీ రాలేదు కదా, ఈ సందర్భంగా పెళ్లితో వచ్చినటువంటి భర్త చనిపోయిన స్త్రీకి పెళ్లితో వచ్చినటువంటి పుస్తె మట్టెలు తీయడంలో అర్థం ఉందనుకుందాం, కానీ బొట్టు పసుపు కుంకుమలను తీయాల్సిన అవసరం ఏమి వచ్చింది. పూర్వకాలంలో ఉన్నత కుటుంబంలో లేదా అగ్రవర్ణాల్లో ఉండే ఆచారాలను ప్రస్తావించుకుంటే మరింత బాధగా ఉంటుంది, కానీ వాళ్లు కుటుంబాలు నడిపిన తీరు గానీ ఆ తర్వాత కుటుంబ బాధ్యతను మోసిన తీరుగానే ఆ పిల్లలను కుటుంబాన్ని వృద్ధులను చూసిన తీరుగాని అద్భుతం. ఒంటిచేత్తో కుటుంబాన్ని నడిపించినటువంటి మహిళలు మనకు కొల్లలుగా కనిపిస్తారు. కానీ ముఖ్యమైన కార్యక్రమాలు అన్నింటికీ వాళ్ళని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని బలవంతంగా దూరం చేసి ఏం సాధించింది సమాజం. ఇప్పటికైనా కుటుంబాలు మన చుట్టూ ఉన్న సమాజం శాస్త్రీయమైనటువంటి ఆలోచన పద్ధతులలో స్త్రీ పురుషుల సంబంధాలను గురించి గానీ స్త్రీ పురుషుల యొక్క వ్యక్తిగత మైనటువంటి విషయంలో కానీ ఆచార వ్యవహారాల పేరుతో జోక్యం చేసుకొని వారి అభిప్రాయాలకు విలువ నివ్వకుండా వాళ్ల మీద రుద్దడం అనేది మానుకోవాలి. సమాజం అభివృద్ధి చెందుతూ ఎక్కడికో ఆకాశపు అంచుల్ని తాకుతున్న సందర్భంలో కూడా ఈ మూఢాచారాన్ని, ఆచారాన్ని పాటిస్తూ మహిళలను ఇంకా రెండవ శ్రేణి పౌరులుగా భర్త చాటున ఉండే భార్యలుగా తండ్రి చాటున ఉండే బిడ్డలుగానూ చూడకుండా స్త్రీ పురుషులు, బాలబాలికలు సమానం అనే స్పృహ పెంచుకుంటూ వాళ్ల సామర్థ్యాన్ని దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా సమాజం కుటుంబం వ్యక్తులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే శాస్త్రీయ దృష్టి అనేది చాలా అవసరం శాస్త్రీయ దృష్టి లేకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ ప్రతిక్షణం ప్రతినిత్యం ఉపయోగించుకుంటూనే మన ఆచార వ్యవహారాల్లో మాత్రం దాన్ని పాటించకపోవడం అనేది మన ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది.. ఇది వాంఛనీయం కాదు.