కిరస్తానీ స్త్రీ – సాహిత్యం – తాత్వికత

నక్కా హేమా వెంకట్రావ
భారతదేశంలో ‘కిరస్తానీ స్త్రీ’ అంటే ఎవరు? ఒక మదర్‌, మదర్‌ థెరిస్సా – తన మొత్తం జీవితాన్ని పేద ప్రజల సేవ కోసమే అంకితం చేసిన మాతృమూర్తి. ఆమె భారత రత్న! నోబుల్‌ శాంతి బహుమతి విజేత!! ‘సిస్టర్‌’- ఒక అక్కలా, చెల్లిలా  రోగులికి సేవ చేసే ప్రేమ మూర్తి. ఒక టీచర్‌- చదువుల్ని సరళంగా మలిచి బోధించే గురువు. స్టెనో, పి.ఏ.-క్రైస్తవ విద్యాసంస్థల ద్వారా నేర్చుకున్న చదువుతో కంపెనీల్లో తనదే పై చేయి. ఒక సన్యాసిని- తను నమ్మిన మతాన్ని మనసా-వాచా ప్రచారం చేస్తూ, సేవలో పునీతురాలయ్యే నిస్వార్థ జీవి. ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమానికి ఊపిరిపోసిన ఓ ఆలిశామ్మ. ఇలా క్రైస్తవ స్త్రీకి ఈ సమాజంలో రూపాలు ఎన్నెన్నో! ఐతే ఆమె తప్పిపోయిన కుమార్తె కూడా! హిందూ కుల సమాజంలో అణచివేతకు గురై దళితులు క్రైస్తవంలో చేరి తిరిగి కొంత చదువు నేర్వగానే అంతరాలు సమసి పోయాయి అనుకునే భ్రమలో బ్రాహ్మణ భావజాలంతో అగ్రకులాల వారితో జతకట్టాలని కొందరు ఇష్టపడినా, అగ్రవర్ణ సమాజం దళితుల్ని, వారి మూలాల్ని ఎప్పుడూ అవహేళన చేస్తూనే వుంటుంది. ఈ విధంగా పరాయీకరణకు గురై తప్పిపోయిన కుమారుడి కథ వుంటుంది. తప్పిపోయిన కుమారుడి పట్ల ఎక్కువ ప్రేమను చూపించాల్సిన అవసరాన్ని ఆ కథ నొక్కి చెపుతుంది.
‘మదర్‌ థెరిస్సా లాంటి వారినేమో గొప్ప మనిషి’ అని పొగుడుతారు. కానీ కిరస్తానీ స్త్రీల పట్ల ఈ సమాజంలో ఒక చిన్న ‘చూపు’ అలానే కొనసాగుతుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల్ని విశ్లేషిస్తే గానీ ఈ స్త్రీని సమగ్రంగా అర్థం చేసుకోలేము. మొదటగా సామాజిక కారణాల్ని చూద్దాం. దేశంలోకి మొట్టమొదటిగా 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు శిష్యుడైన థామస్‌ ద్వారా కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవం ప్రవేశించింది. అది అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణలో భాగంగా మరింతగా విస్తరించింది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో చర్చీలు, క్రిస్టియన్‌ ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించబడ్డాయి. క్రైస్తవ మతం ఫ్యూడల్‌ అయినప్పటికీ, భారతదేశంలో కొన్ని మూఢాచారాలకి వ్యతిరేకంగా లిబరల్‌ భావాలకి వెన్నుదన్నుగా నిలబడింది. స్త్రీ విద్య, సంస్కరణలకు, పెద్దపీట వేసింది.
జాషువా చెప్పిన నాలుగు పడగల హైందవ రాజు భారత సమాజాన్ని కులంపేరులో కాటేసి, వర్గాలుగా చీల్చివేసాడు. ఈ సామాజిక సమీకరణలో సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దోపిడికి గురైన వారే దళితులు. కుల నిచ్చెన మెట్ల సమాజంలో ఊరికి దూరంగా విసిరివేయబడిన వారు. వేదాలు చదివితే నాలుక కోసివేయమని, వింటే వేడి సీసం కరిగించి పోయాలని, చూస్తే కనుగుడ్లు పీకి వేయాలని సూత్రీకరించింది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజం. తాము పూజించే గోవును తింటారు కాబట్టి దళితుల్ని బహిష్కరించారు. దళితుల అడుగులు నేలమీద కనపడకుండా నిర్భందాన్ని విధించారు. అందుకే దళితులు మొలకు తాటాకు కట్టుకొని, తమ అడుగు జాడలు కనపడకుండా, తుడిచి వేసే విధంగా నడిచేవారు. అగ్రవర్ణ స్త్రీలతో వీరికి సంపర్కం నిషేధం. ఆలయ ప్రవేశాన్ని కూడా నిరాకరించారు. దళితుల్ని దళితులుగా వుంచడానికి వేదాలు పనికి వచ్చాయే తప్ప వారి విముక్తి కోసం కాదు.
ఇలాంటి సమాజంలో హిందూ మతంలోని అగ్రకుల దురహంకారుల వల్ల వెలివేయబడ్డ దళితులు, శూద్రుల్ని క్రైస్తవం గుండెలకు హత్తుకుంది. వారిని జంతువుల కంటే హీనంగా చూస్తూ దేవాలయాలకు, విద్యాలయాలకు దూరంగా వుంచిన హిందూ బ్రాహ్మణ భావజాలానికి భిన్నంగా క్రైస్తవ మిషనరీలు ”మీరు కూడా దేవుని బిడ్డలే” అని ప్రార్థనా మందిరాలలో ప్రవేశం కల్పించారు. హిందూ మతంలో వెలివేయబడ్డ కులాలకు చెందిన వారే ఎక్కువగా క్రైస్తవ మతంలో చేరి, అగ్రకులాల వారి ఎదురుగా తల యెత్తుకొని తిరగటం, వారి స్త్రీల కంటే స్వేచ్ఛగా ఉండగలగటం వారికి కంటగింపవుతుంది. దాంతో వారిని తక్కువ చేసి మాట్లాడటం, బరితెగించిన వారని అనటం మామూలు అయింది. ఎక్కడ తమ స్త్రీలు వారి ప్రభావంలోకి వెళ్ళిపోతారేమోనని భయంతో ‘చైతన్యాన్ని’ అవహేళన చెయ్యటం కూడా వారికి అలవాటుగా మారింది. ‘స్త్రీ’ అంటే వారికున్న అభిప్రాయాలకు వారి వ్యాఖ్యలే దర్పణం.
అగ్రకులాల్లో క్రైస్తవులు లేరా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ దళితులతో పోలిస్తే వీరు చాలా తక్కువ సంఖ్యలో వున్నారు. వీరికి రాజకీయ ఆర్థిక పునాదులు సమాజంలో బలంగా వున్నాయి. ఒకవేళ రాజకీయ ఆర్థిక దోపిడికి గురైన దళితుల్లాగా సాంఘిక దోపిడికి గురైన వారు కాదు. వీరు సాధారణంగా హిందూ సమాజంలోని తమ తోటి కులాల సహవాసంతోనే బతుకుతారు. మతం మారిననూ, చర్చిలలో తమ కుల ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు క్రైస్తవం పుచ్చుకున్న, కులం యొక్క తోకలను కత్తిరించడానికి చాలా మంది ఇష్టపడరు కూడా. అలా తమ ”సోషల్‌ స్టేటస్‌”ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అగ్రకుల క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవులుగా అవమానాలకి గురికారా అంటే వీరు దళిత క్రైస్తవ స్త్రీలు అవమానాలకు గురి అయినంతగా కారు, అందుకు కారణం కులం యొక్క రొచ్చులో క్రైస్తవం కూడా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టే కారంచేడు, చుండూరు లాంటి దుర్ఘటనలన్నీ దళిత క్రైస్తవ వాడలపైనే జరిగాయి కానీ, ఏ రెడ్డి, కమ్మ క్రైస్తవుల పైన జరిగినట్లు ఆంధ్ర చరిత్రలో లేదు. సాధారణంగా క్రైస్తవాన్ని దళితులే ఎక్కువగా తీసుకోవడం వలన కులం తెలియనంత వరకు క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించడం జరుగుతుంది ఆంధ్ర సమాజంలో. ఇప్పటి క్రైస్తవం కులం కబంధ హస్తాల్లోనే వుంది. క్రైస్తవంలో వున్న శాఖలన్నీ ఏదో ఒక కులాధిపత్యంతోనే నడుస్తున్నాయి. అగ్రకులం వారు దళిత క్రైస్తవులతో బంధుత్వాల్ని కలుపుకోరు. కాబట్టి దళిత క్రైస్తవ స్త్రీలు ఇటు కులపరంగాను, మత పరంగాను దోపిడికి గురవుతున్నారు.
క్రైస్తవ స్త్రీలు ఉద్యోగాలు చెయ్యటం, ఈ సమాజంలో ప్రధాన స్రవంతికి సుతారాము ఇష్టం వుండదు. ఐతే వారు ఆ విధంగానే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఇంక చర్చి నుంచి అందే ఆర్థిక సహాయం కూడా కొందరి స్త్రీల జీవితాల్లో మార్పును తీసుకువచ్చింది. హిందూ మతం ఆచారాలు పండుగలకు చేసే అనవసర వ్యయాలు తగ్గిపోయాయి. ఆర్థికంగా క్రైస్తవ కుటుంబాలు ఓ మేర స్థిరపడ్డాయి. క్రైస్తవ విద్యాలయాల్లో ఉన్నత విద్య చదివిన స్త్రీలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్లి, ఆర్థిక సాధికరతను పొందారు. అది కూడా కుళ్ళుకునే విషయమైపోయింది. దానికి వారికి ”విలువలు లేవు” అని చెవులు కొరుక్కొంటూ మొత్తానికి క్రిస్టియన్‌ స్త్రీలు అంటే ‘నైతికత ఉండదు’ అనే ముద్ర వేస్తున్నారు.
ఇక రాజకీయ కారణాల్ని చూస్తే, క్రైస్తవ మతం మొదటి దశాబ్దంలో వచ్చిన సామ్రాజ్య వలస వాద కారణంగా మన దేశంలోని వెనుకబాటు తనాన్ని, కుల వర్గ వివక్షను ఆసరా చేసుకొని వేళ్లూనుకొంది. బ్రిటిష్‌ పాలకులున్నంత కాలం క్రైస్తవ మతం అప్రకటిత అధికార మతంగానే విరాజిల్లింది. అప్పుడు హిందూ అగ్ర కుల మత వాదులు అధికారం కోసం పాలక వర్గాలతో మిలాఖతై, క్రైస్తవ మతం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేకపోయారు. ఎప్పుడైతే వారికి స్వాతంత్య్రం ప్రకటించబడిందో అప్పటి నుండి తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటూ మైనార్టీలపై దాడులకు పూనుకున్నారు.
దళిత బహుజన వర్గానికి చెందిన క్రైస్తవ స్త్రీలు ఈ నేలా నింగికి వారసులైనప్పటికీ ఆత్మాభిమానం చంపుకొని జై శ్రీరాం అంటే గానీ మనలేని స్థితిలో అభద్రతతో ప్రాణభయంతో బ్రతికే పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. నిజమైన హిందువులంటే మైనార్టీ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. ఈ ఫాసిస్టు శక్తులకు అండగా రాజ్యం భరోసా ఇస్తుంది. వీరు వివిధ జాతుల మధ్య ఉన్న శత్రురహిత ప్రజా వైరుధ్యాలను, శత్రు పూరిత వైరుధ్యాలుగా మారుస్తున్నారు. హిందూ మతం నుండి స్వయంగా బయటపడే పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని ఇతర మతాలపైకి నెట్టి పక్కదారి పట్టించి వారిపై దాడులు చేస్తున్నారు. హిందూ జాతీయ వాదాన్ని ఎక్కుబెట్టి క్రైస్తవులను దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. క్రైస్తవుల తిండి కట్టు బొట్టు మీద నిషేధం విదించడానికి పూనుకొంటున్నారు. దీనికి ఒరిస్సా కంధమాల్‌లో జరిగిన సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సెక్యులర్‌ ప్రజాస్వామ్యం ప్రకటించిన మత స్వేచ్ఛను అణచివేయడానికి తమ మనుగడ కోసం మతాన్ని జాతిగా మన ధర్మ సంస్కృతిని భారత సంస్కృతిగా చేసి క్రైస్తవ స్త్రీల మీద దాడి చేస్తున్నారు. మత మార్పిడిల వలనే క్రైస్తవుల మీద దాడులని నిర్లజ్జగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. దాని అనుబంధ సంఘాలు ప్రకటిస్తున్నాయి. నిజానికి ఏ మతానికి చెందని దళిత, ఆదీవాసీలు క్రైస్తవాన్ని నిరసనగా స్వీకరించారు. ఇది మత మార్పిడి కాదు. వారిని తిరిగి హిందూమతంలోకి మార్చడమే మత మార్పిడి అవుతుంది.
దాడుల్ని తిప్పి కొట్టేందుకు మిగిలిన మతాల వారికి ఉన్న ప్రత్యేక రాజకీయ పార్టీల వెనుదన్ను కూడా ఈ మతానికి లేదు. జనాభా లెక్కల్లో 3 శాతం మించకపోయినా దళితులలో 90 శాతం మైనార్టీలు వుండగా వీరి మద్దతును తీసుకొని ఒక రాజకీయ శక్తిగా ఎదగలేకపోయారు. అధికార పార్టీలతో లాబీయింగు ద్వారా గట్టెక్కాలనే దృక్పథమే తప్ప ‘తిరగబడు’ తత్వం లేకపోవటం వలన దాడులకు బలైపోవటం జరుగుతుంది. గ్రాహం స్టీన్‌ హంతకులను క్షమించే గ్రాహంస్కీన్‌ భార్యని మనం అభినందించాలో, ఆక్షేపించాలో అర్థం గాదు. రాజకీయంగా తన పునాదుల్ని నిర్మించుకోలేకపోతే క్రైస్తవ స్త్రీల ఎప్పుడూ ప్రశ్నార్థకమే.
దళితులు క్రైస్తవాన్ని స్వీకరించిన తరువాత అప్పటి వరకు సామాజిక బహిష్కరణకు గురైన దళితులు మతం తెచ్చిన కొత్త సమస్యను ఎత్తుకోవలసి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 సమానత్వపు హక్కును ప్రతిపాదించినా, ఆర్టికల్‌ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో ఏదైనా కారణాల చేత ప్రభుత్వం ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపరాదని పేర్కొన్నా, 25వ అధికరణ ఈ దేశంలో ప్రతిపౌరునికి మత విశ్వాసాలను కల్గివుండి ప్రచారం చేసుకొనే హక్కు యిచ్చినా 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా క్రైస్తవ మతంలో చేరిన దళితులకు అన్ని రకాల రిజర్వేషన్లు రద్దు చేసింది. యిది ఒక విధంగా రాజ్యం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కబడిన అంటరాని వారిపై హిందూ మతాన్ని రుద్దడమే ధ్యేయంగా పెట్టుకోవడమే. కానీ హిందూ ఆచార వ్యవహారాలు, నివాసాల నుండి వెలివేయబడ్డ దళితులు హిందూ మతాన్ని ఎప్పుడో వెలివేశారు. భారతదేశంలోని 7 లక్షల గ్రామాల్లో దళితుల చర్చిలు కనపడతాయి. అంటే క్రైస్తవం వారిని ఎంతగా గుండెలకు హత్తుకుందో తెలుస్తుంది. అసలే కడుపేదరికంలో మగ్గుతున్న దళిత మహిళలు ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి లెక్కల్లో హిందువులుగా మిగిలిపోయిన వారెందరో!
చర్చి – భావజాలం
ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే చర్చి భావజాలం క్రైస్తవుల్ని కర్తవ్య విముఖుల్ని చేస్తుంది. దానివల్ల క్రైస్తవ స్త్రీల భద్రతకి మరింత ముప్పు ఏర్పడింది. విద్యా వైద్య, సేవా రంగాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళలు క్రైస్తవులు కావడం, వారి పట్ల సమాజం చిన్న చూపు, మొత్తంగా స్త్రీలందరిపై ఆ ప్రభావం వుంటుంది. స్త్రీలపై నానాటికీ జరుగుతున్న దాడులు, అత్యాచారాల్ని దీనిలో భాగంగానే చూడాలి. కాబట్టి క్రైస్తవ స్త్రీల పట్ల వివిక్షతను మొత్తంగా చైతన్యవంతమయిన స్త్రీ సమూహాలు, సమాజాలు ఎప్పటికప్పుడూ ఖండిస్తూ, ఆరోగ్యవంతమయిన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో కలిసి నడవాలి.
క్రైస్తవం ప్రకారం దైనందిన ప్రార్థనలలో ఉపవాసాలు మొదలగు అంశాలలో స్త్రీ పురుషులకు ఒకే రకమైన నిబంధనలు లేవు. ఎక్కువగా స్త్రీలే మతాచారాలను మోసే వారుగా తయారు చేయబడుతున్నారు. క్రైస్తవ స్త్రీల మీద పురుషులకు సర్వహక్కులు ఆధిపత్యం ఉన్నట్టు బైబిల్‌ చెబుతుంది. స్త్రీ పురుషుని ప్రక్కటెముకల నుంచి సృష్టించబడింది. క్రీస్తు అనంతరం వచ్చిన శిష్యుల అధికారిక పితృస్వామ్య భావజాలం చర్చిలో అడుగడుగునా ప్రతిఫలిస్తాయి. ఉదా|| పౌలు అనే క్రీస్తు అనుచరుడు కొరంతీయులకు లేఖ వ్రాస్తు, జారులైనను విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలవారైనను, పురుష సంయోగులైనను లోభులైనను త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసుల కానేరరు. : (కొరంధియుల 6 : 9-10) ఇక్కడ ఆడంగితనం అంటే అర్థం చేసుకోగలం. ”నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?! (1 కొరంధియులు 6:16).
స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. (1 కొరంథేయులు 7:1) ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. పురుషుడైతే దేవుని పోలికలు మహిమకై యున్నాడు కనుక తల మీద ముసుగు వేసికొనగూడదు కాని స్త్రీ పురుషుని మహిమై యున్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి గలిగెనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. (1 కొరంధియులు 11:7-10) పురుషునికి స్త్రీకి మధ్య ఆపాదించబడిన విభిన్న విలువలను మనం యిక్కడ గుర్తిస్తాం. స్త్రీలు సంఘములలో మౌనంగా వుండవలెను. వారు లోబడియుండవలసిందే గాని మాట్లాడానికి వారికి సెలవు లేదు. ఇలా ధర్మశాస్త్రం చెపుతుంది. వారు ఏమైనా నేర్చుకోవలసి వస్తే, ఇంట తమ భర్తల్ని అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానం. (1 కొరంధియులు 14:34-36) స్త్రీలారా! ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి వుండండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడి వుండవలెను. ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. (ఎఫెసెయులు 5 అధ్యాయం 23:33)
స్త్రీలు అణుకువయు, స్వస్థ బుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనా గాని, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను, అలంకరించుకొనక, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా వుండవలసినదేకానీ, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారం చేయుటకైనను ఆమెకు వీలు లేదు. మొదట ఆదాము తర్వాత అవ్వ సృష్టించబడ్డారు కదా! ఆదాము మోసగించబడలేదు కాని స్త్రీ మోసగింపబడి అపరాధములో పడెను. అయినను వారు సుబుద్ధి కలిగి, విశ్వాస ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా వుండిన యెడల శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుదురు. (1తిమోతు 2:9-15) యివి అప్పటి క్రీస్తు శిష్యగణం యొక్క పితృస్వామ్య విలువలకు అద్దం పడుతుంది. క్రమేణా క్రైస్తవమతం అంతర్గత సంక్షోభానికి గురై కాథలిక్కులుగాను, ప్రొటెస్టెంటులుగాను విడిపోయారు. అప్పటి సనాతన వ్యవస్థీకృత చర్చిను ప్రశ్నించిన ప్రొటెస్టెంటులు కూడా క్రమేణా స్త్రీల విషయంలో పితృస్వామ్య ధోరణులను వదిలిపెట్టలేదు. అక్కడకూడా దేవుని ఆరాధనలో పురుషునికి సమానంగా స్త్రీలు ప్రొటెస్టెంటు చర్చిలో కనిపించినా వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. యిక పితృస్వామిక భావజాలం యింకా వారి జీవితాలలోని అన్ని కోణాలను అత్యంత ప్రభావితం చేస్తూ స్త్రీలను రెండవ తరగతి పౌరురాలిగా గణించబడుతుంది. దళిత క్రైస్తవులలో స్త్రీలు సమాజంలోనే కాక చర్చిలలో కూడా వివక్షకు గురౌతున్నారు. ఇతర వర్గానికి చెందినవారిపై కూడా హిందూ బ్రాహ్మణ పితృస్వామ్య ధోరణీ వీడలేదు. ఈ ధోరణులు సాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో చూద్దాం.
సాహిత్యం
సమాజంలో అంతర్గతంగాను, బహిర్గతంగాను మతం యొక్క పితృస్వామిక విలువలతో క్రైస్తవ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించే రచనలే క్రైస్తవ సాహిత్యం. క్రైస్తవ స్త్రీల ఆలోచనలను, భావోద్వేగాలను, సంస్కృతిని వివిధ సాహిత్య ప్రక్రియలలో వెలికి తీసుకురావలసిన ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది. ఐతే ఇప్పటివరకు క్రైస్తవ సాహిత్యం ఒక అస్థిత్వాన్ని, గొంతుకను సాహిత్య రంగంలో పదిలపరచలేకపోయింది. మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక చేపట్టిన వివిధ అస్థిత్వాల సాహిత్య చర్చా సందర్భము ఆ లక్ష్య సాధనను మరొకసారి గుర్తు చేసింది. అసలు క్రైస్తవ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే క్రైస్తవ స్త్రీల జీవితాలను వాటి మూలాలను స్పృశించాల్సిందే!
అన్ని మతాల మాదిరిగానే క్రైస్తవ మతం స్త్రీని రెండో తరగతి పౌరురాలిగానే చూస్తుంది. కాకపోతే మతంలోని కొన్ని వెసులుబాట్ల వలన స్త్రీ సామాజికంగా ఆర్థికంగా ఓ మేరకు నిలదొక్కుకోగలిగింది. కానీ వ్యక్తిగతంగా చూస్తే పితృస్వామ్య భావజాలం వల్ల ఎన్నో అవమానాలను భరిస్తూనే వుంది. ఐతే వాటిని విశ్లేషిస్తూ సాహిత్యం పెద్దగా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్త్రీ జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో వెనకబడిపోయింది. ఆస్పత్రులు, విద్యాలయాలు మెజార్టీ వర్గానికి సేవలందించడానికి పనికి వచ్చాయి కాని మతాన్ని, సంస్కృతిని గౌరవించలేకపోయారు. ఈ సేవలు అందించటానికి వాటి పదచక్రాల క్రింద నలుగుతున్న స్త్రీల ఆవేదనలు ఆకాంక్షలు ఎవరికి పట్టలేదు. అందరి స్త్రీలలాగానే క్రైస్తవ స్త్రీలకు సమస్యలు, అణచివేత, పురుషాధిపత్య ధోరణులు, ఆర్థిక అసమానతలు, సామాజిక కట్టుబాట్లు, మనసు, శరీరం, ఒంటరితనం వుంటాయన్న వాస్తవాన్ని యితర సాహితీవేత్తలు గుర్తించలేకపోయారు. వంటగది, పడగ్గది రాజకీయాలు స్త్రీల జీవితాలను ఎలా నిర్భందించాయో వారి కలల్ని, స్వేచ్ఛని ఎలా ఛిద్రం చేసాయో వాటి గురించి వ్యక్తీకరణ జరుగలేదు.
దానికి కారణం మత సంకెళ్ళ గట్టిదనమే అని చెప్పుకోవాలి. హిందూ స్త్రీలు, ముస్లిం స్త్రీలు వారి జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఎంతో సాహిత్యాన్ని సృష్టించారు. క్రైస్తవ స్త్రీల నుండి అలాంటి సృజన కావలసినంత ఉదృతంగా రాలేదు. దానికి కారణం ఇక్కడి భావజాల స్రవంతిలో భాగం కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ సాహిత్యానికి ఆదరణ లేకపోవడం కూడా మరొక కారణం. ప్రధానంగా రచయితలు/రచయిత్రులు జనకర సాహిత్యాన్ని రాశారు తప్ప ప్రత్యేక అస్థిత్వ సాహిత్యాన్ని రాయలేదు. క్రైస్తవ మతాధికారులు టీవిలు, ఇతర సాహిత్యాన్ని వీరికి దూరంగా ఉంచడం వల్ల జరిగిన పరిణామం లేదా హిందూ మత గ్రంథాలకి ఇక్కడి ఆచారాలకు అవినాభావ సంబంధముండటం, బైబిలులో చెప్పిన గాథలకు, ఇక్కడ సంస్కృతికి ఎలాంటి సంబంధం లేకపోవటం వల్ల కూడా కావచ్చు.
మత ప్రాతిపదికగా సాహిత్య సృజన ఎలా జరుగుతుంది? మతాన్ని సమాజానికి వ్యక్తులకు మధ్య తలెత్తే వైరుధ్యాల వలన సాహిత్యం పుట్టొచ్చు.
ఒక ఉద్యమంలా వస్తున్న ముస్లిం సాహిత్యాన్ని పరిశీలించి నట్లయితే క్రైస్తవ సాహిత్యం ఎలా రావాలో ఒక అవగాహనకు రావచ్చు. ముస్లిం రచయిత్రి షాజహానా స్త్రీలను చీకటి గదిలో వుంచే వరదా పద్దతి, దానిలో ఊపిరి ఆడని జీవితాల గురించి, స్వేచ్ఛ కోసం, చదువుల కోసం తన్లాడే మనస్తత్వాన్ని, అధిక సంతానవంతులుగా అవహేళనకు గురవుతున్న వారి మనోభావాల గురించి ప్రస్తావించారు. మైనార్టీకి చెందిన ఖదీరు, యాకూబ్‌, స్కైబాబా, ఖాజా మొహియిద్దీన్‌ లాంటి రచయితలు తమ రచనలలో ముస్లిం సమాజంలోని అట్టడుగు వర్గంగా చూడబడిన దూదేకుల వారి జీవితం ఎలా అవహేళనకు గురవుతున్నారో రాస్తూ కుల ప్రాతిపదికన కాకుండా సాటి మనిషిగా గుర్తించాలని కోరుతారు. ముస్లిములు అయినంత మాత్రాన వారిని దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని గర్హిస్తూ గళాన్ని విప్పారు. స్త్రీల జీవితాలను చీకటి మయం చేస్తున్న మతంలోని ప్రతికూలాంశాల్ని సంస్కరించాలని పిలుపునిచ్చారు.
ఏమతమైనా మానవీయ విలువలకు పట్టం కట్టి సమానత ప్రాతిపదికగా ఉండాలి. ఆ విలువలే సాహిత్యంలో ప్రతిఫలించాలి. ఖాదీర మొహియుద్దీన్‌  రాసిన ‘పుట్టుమచ్చ’, షాజహానా’నఖాబ్‌’ వివిధ రచయిత్రుల సంకలనమైన గుజరాత్‌ గాయం లాంటి ముస్లిం వర్గ స్త్రీని వర్ణించటాన్ని ఉదహరించవచ్చు. ప్రేమను వ్యక్తీకరించటానికి గజల్‌, ఖవ్వాలి లాంటి  ప్రత్యేక సాహిత్య ప్రక్రియలను సృష్టించారు. కాని క్రైస్తవ మతం పునాది కలిగినప్పటికీ వారి భావావేశాలకు అలాంటి ప్రక్రియలను సాహిత్యంలో పెంపొందించలేకపోయారు.
క్రైస్తవ మహిళా రచయిత్రుల కథలలో, నవలలో క్రైస్తవ మహిళలు మతంతోపాటు కులపరమైన అణిచివేతను ఎలా ఎదుర్కొంటున్నారో చెప్పిన కథలు లెక్కకు తక్కువైనా ఎన్నదగినవే. మతం మారినా అంటరానితనం వెంటాడడాన్ని కథారూపంగా మార్చిన వైనం, పేదరికాన్ని విశ్లేషించిన రచయిత్రులు తమ కొన్ని ప్రశ్నలను సూటిగానే సమాజానికి సంధించారు. క్రైస్తవ మహిళలు సమాజం నుంచి వివక్షను, అసమానతను ఎలా ఎదుర్కొంటున్నారో దానికి కారణమైన పితృస్వామిక ధోరణులను ఎత్తిపట్టారు. అలాగే ఆధిపత్య కులాలే కాకుండా తమ తోటి దళిత మహిళలు సైతం అదే హిందూ మత భావజాలాన్ని క్రైస్తవ స్త్రీల పట్ల కలిగివుండటం బాధిస్తుందని శ్రీమతి పుట్ల హేమలత వాపోయారు. హిందూమతం నుంచి దాడిని, వేధింపులను చీత్కారాలను ఎదుర్కొంటూనే అంతర్గతంగా చర్చి ధోరణులను నిరసించారు. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవమహిళల జీవితానికి సంబంధించిన కథలు, నవలలు విస్తృతంగా రాలేదన్నది వాస్తవం. రాకపోవడం విషాదం!
క్రైస్తవ కీర్తనలు, పాటలు కవితలు, ఈ సాహిత్యమంతా కూడా భక్తి సాహిత్యమే. వీటిలో స్త్రీల జీవితాల్ని ప్రభావితం చేస్తున్న అనుకూల ప్రతికూల అంశాల్ని విశ్లేషించలేకపోవడం దురదృష్టకరం. ఈ సాహిత్యం కూడా ఆ మత సంబంధిత పత్రికలలో వచ్చాయే తప్ప యితర పత్రికల్లో కాదు. మెజార్టీవర్గ భక్తి స్రవంతి గీతాల్లోకి చేరలేకపోయాయి. ఎక్కడో ఒక్కరిద్దరు రచయిత్రులు తప్ప క్రైస్తవ మహిళల సామాజిక, ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలు అంతగా వెలికిరాలేదు. క్రైస్తవుల మీద జరుగుతున్న ధాష్టికాల గాయం గేయంగా మారలేదు. మతం యొక్క పరిధులు దాటి విముక్తి గీతంగా మారి సామాజిక ఉద్యమ గొంతుకలో భాగం కాలేకపోయింది.
వ్యాసరచనలో యిపుడిపుడే సామాజిక అంశాల మీద దృష్టిని పెడుతున్న రచయిత్రులు క్రీస్తు సమభావనను, స్త్రీ అభ్యుదయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని కాంక్షించారు. వాస్తవానికి ఈ ప్రక్రియలలో విస్తరిస్తున్న ఫాసిస్టు దాడుల చర్యలు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో ఉపాధి భూమిని పోగొట్టుకున్న వారి సామాజిక, రాజకీయార్ధిక కోణాలు, సంస్కృతి సంప్రదాయాలపై దాడి గురించి కొన్ని వ్యాసాలు మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కాని పరిశోధనాత్మక వ్యాసాలు రాలేకపోయాయి. వినోదిని, జల్లి ఇందిర, ఝాన్సీ కె.వి. కుమారి, పుట్ల హేమలత,  స్వరూప రాణి, హేమా వెంకట్రావ్‌, విల్సన్‌, కళ్యాణ్‌ రావ్‌, లాంటి కొంతమంది తప్ప క్రైస్తవ సాహిత్య కథలు-వెతలు హిందూ సంస్కృతిలో ఆచార వ్యవహారాల్లోనే రచింపబడ్డాయి. వీరి జీవిత వాస్తవికతను దుఃఖం హిందూ భావజాలంలో భాగంగానే కొట్టుకుపోయాయి. ఒక క్రైస్తవరాలుగా కాక తమను తాము భారతీయులుగా ఐడెంటిఫై చేసుకుంటూ కదిలారు. సాహిత్యాన్ని ఉపరితలం నుంచి కాక మతం మూలాల్లోకి వెళ్లి, వాటి సామాజిక సాంస్కృతిక అంశాలను శోధించి వ్రాసినది అతి తక్కువ.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 2009 నవంబరు 15, 16 తేదీలలో మహిళా అధ్యయన కేంద్రం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కోస్తాంధ్ర క్రైస్తవ మైనార్టీ సాహిత్యంపై సదస్సు జరిగింది. సాహిత్యాన్ని ఒక సముద్రంగా భావిస్తే వివిధ అస్థిత్వాల కలయికే దాని ఉనికి. ఈ  చారిత్రక సదస్సుకు  నక్కా హేమా వెంకట్రావ్‌ అధ్యక్షత వహించారు.  నక్కా హేమా వెంకట్రావు క్రైస్తవ తాత్వికత-క్రైస్తవ స్త్రీల సాహిత్యంపై,  పుట్ల హేమలత కథలు, నవలలపై, డాక్టరు బండారు జ్యోతి, స్వరూప రాణి కవిత్వం, కీర్తనలపై  కొలుకలూరి స్వరూపరాణి వ్యాసంపై కుమారి లావణ్య సామెతలపై పత్ర సమర్పణ చేయగా  ఝాన్సీ కె.వి. కుమారి క్రైస్తవ సాహిత్య విహంగ వీక్షణం చేయగా  విజయభాను వందన సమర్పణ చేశారు. విరామ సమయంలో రచయిత్రుల మధ్య క్రైస్తవం సాహిత్యంలోని వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. చర్చిలలోని అనుకూల ప్రగతిశీలక అంశాలను క్రైస్తవ తాత్వికతలోని భాగంగా చూడటం జరిగింది. ఈ సదస్సులో తొలిసారిగా క్రైస్తవ రచయిత్రులు బయటకు వచ్చి తమ సాహిత్యాన్ని పరిచయం చేయడమే కాకుండా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు.
ధిక్కార స్వరాలు
”ఆమెన్‌” ఆత్మకథా రచయిత్రి సిస్టర్‌ జెస్మె (కేరళ) అభిప్రాయంలో జెరూసలెం నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించిన క్రైస్తవం పాశ్చాత్యుల భావాలకు, ఆలోచనా దృక్పథాలకు ఆలవాలమైపోయిందని వాపోతుంది. క్రీస్తు అనుచరుడయిన సెయింట్‌పాల్‌ స్త్రీల అస్తిత్వానికే ముప్పు వాటిల్లే విధంగా బోధించాడని ఈ ధోరణి యిప్పటికీ చర్చిలో కొనసాగుతుందని అంటుంది. కేథలిక్‌ చర్చిలో ఫాదర్‌ జాయ్‌ కల్లియత సి.ఎమ్‌.ఐ. దృష్టిలో 25% సన్యాసినులు అసంతృప్తులతో ఉన్నారని అంటాడు. కార్డినల్‌ వర్కీ వైతాయుత సన్యాసినులను జాలికొలిపే పరిస్థితుల నుండి స్వేచ్ఛగా వదిలిపెట్టవలసిన అవసరాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఈ స్త్రీలకు సాధికారిత లభించలేదని, ఫాదర్ల భావోద్వేగాలకు బలైపోతున్నారని, వీరు బానిసలుగా చూడబడుతున్నారని చెప్పాడు. క్రీస్తు సమానతకు ఆలవాలం కావలసిన కాన్వెంటులలో అసమానతలు, వర్గం, కులం బట్టి స్థాయిలు నిర్ణయింపబడతాయంటుంది సిస్టర్‌ జెస్మె. ఈ అంతర్గత జీవన పోరాటాలు ఏవి సాహిత్యంలో చోటుచేసుకోలేకపోయాయి. ఒకవేళ సిస్టర్‌ జెస్మె లాంటి వారు ప్రయత్నించినా అది అధికార చర్చికు వ్యతిరేకం కాబట్టి ఆమెను జీసస్‌ను అప్పగించిన ‘జుదా’ తో పోల్చడం, ఫాదర్లలాగ మఠజీవితంలో స్వేచ్ఛా సమానత్వ నిబంధనలు కోరినందుకు గాను ఆమె ఒక ‘వేశ్యగా’ ఒక చర్చి వర్గం చేత ముద్ర వేయబడుతుంది. అందుకే చాలా మంది మఠానికి చెందిన స్త్రీలు తమ వ్యక్తిగత భావాలను అణగద్రొక్కి పురుషాధిపత్య చర్చి భావజాలాన్ని కాపాడే కాపరులుగా, పావులుగా మిగిలిపోయారే తప్ప వాటికి అక్షర రూపాన్ని యివ్వలేకపోయారు.
శ్రామిక వర్గానికి చెందిన దళిత బహుజనులు క్రైస్తవ మహిళల ఆవేదనల గురించి చరిత్రలో గాని సాహిత్యంలోగానీ చెప్పింది చాలా తక్కువ. కారంచేడు అలిశమ్మ లాంటి దళిత క్రైస్తవ స్త్రీల పోరాటాలు ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి.
హిందూ మతోన్మాద దాడులు – మీడియా పాత్ర
”మత పీడన అంతా నిజ జీవితంలోని పీడనే. అదే సమయంలో నిజ జీవితంలోని పీడనకు మతం ఒక నిరసన. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది!” – మార్క్‌ ్స. యివేవీ పట్టని హిందూత్వ శక్తుల తల్వార్లకు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించే క్రైస్తవ మతస్థుల తలలు తెగిపడుతున్నాయి. 1990 దశకంలో ఉత్తరప్రదేశ్‌లో క్రైస్తవ సన్యాసినులపై సామూహిక అత్యాచారం దగ్గరనుంచి కంథమాల్‌లో సిస్టర్‌ లలిత బారువ సామూహిక అత్యాచారం వరకు ఎన్ని కన్నీటిగాథలో! పెట్రోలు, యాసిడ్‌, కత్తి, త్రిశూలం లాంటి ఆయుధాలతోపాటు స్త్రీలపై రేప్‌ కూడా ఒక ప్రధాన ఆయుధమైంది. క్రైస్తవ స్త్రీల దుఃఖపు చారికలు, క్షమించే హృదయం, లౌకిక స్వప్నం, ప్రేమ ఇవన్నీ కవితా వస్తువులు కాలేకపోతున్నాయి. దేశజనాభాలో మూడు శాతంగా వున్న క్రైస్తవులపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, మారణకాండలు, మత కట్టడాల కూల్చివేతలపై మీడియా స్పందించింది తక్కువే. హిందూ మతతత్వాన్ని ప్రచారం చేయడంలో, ఒక సిద్ధాంతంగా వ్యాప్తి చేయడంలో చూపించిన అత్యుత్సాహం, క్రైస్తవులపై జరిగిన దాడులకు రాలేదు. అందుకే కంథమాల్‌లో సన్యాసినిపై జరిగిన అత్యాచారం, దాడులను స్థానిక పత్రికలు ప్రచురించకపోగా, వక్రీకరించాయి. యిక సాహిత్యంలో మైనార్టీలపైన జరిగిన దారుణాలపై, గాయాలపై క్రైస్తవ, క్రైస్తవేతర రచయిత్రులు మౌనం వహించకపోయినా, విస్తృతంగా స్పందించకలేక పోయారు. దళితగోవిందం, కళ్యాణమస్తులు లాంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించి క్రైస్తవుల్ని ప్రలోభపెట్టి క్రైస్తవ ఆచారాలను, వివాహ పద్ధతులను, సంస్కృతి కట్టుబాట్లను పెకిలించి, హైందవ సంస్కృతిని రుద్దటం పట్ల లౌకికవాద సాహిత్యం స్పందించలేదు. ప్రత్యేక చట్టాల పేరిట స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల జీవిత పార్శ్వాలను స్పృశించలేదు.
దిశానిర్దేశం
పోరాటాల నేపథ్యంలో క్రైస్తవ స్త్రీ అస్థిత్వ మూలాలను వెదుక్కొంటూ సాహిత్యాన్ని ఆవిష్కరించాల్సిన సందర్భాన్ని, దాని బాధ్యతలను గుర్తించవలసిన అవసరాన్ని మా భుజాలపై ఎత్తుకొంటూ ఇటు కథ, నవలా, కవిత, సాహిత్య ప్రక్రియలలో మా ముద్ర వేసుకొంటూ వచ్చే తరాలకు మా అడుగు జాడలను వదిలి వెల్లవలసిన అవసరం వుంది. సమకాలీన సాహిత్యంలో మా జీవన సంఘర్షణలకు సాహిత్యం వేదిక కాగలగాలి. నిబద్దతతో విభిన్ని అస్థిత్వాలను గౌరవించగల తోటి రచయిత్రులు మా సాహిత్య పోరాటాన్ని గుర్తించాలి. మాకు సాహిత్య స్పేస్‌ వున్నప్పుడే మా సామాజిక సంఘర్షణకు ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతి రూపం కాగలిగినపుడు విభిన్న భావజాల వైరుధ్యాలలోని దొంతరలను తొలగించుకుంటూ ముందుకు పోగలం. ఏ ఒక్క అస్థిత్వాన్ని మర్చిపోయినా, ఆ మేరకు వారి ఆదర్శాలను విస్మరించినట్టే. ఆ ఖాళీ ఎపుడు సాహిత్యశాలలో నిశ్శబ్ద గీతికగా మిగిలిపోదు. ఉవ్వెత్తున ఎగసిపడే అలలా తన రూపాన్ని తీసుకుంటుంది. వర్తమానపు వారధిలా తన ప్రపంచాన్ని తాను నిర్మించుకుంటుంది.
అందుకే క్రైస్తవ అంతర్గత అసమానతలకు బలైపోతున్న క్రైస్తవ మహిళల జీవిత పార్శ్వాలను స్పృశించి విస్తృతంగా సాహిత్యాన్ని తీసుకురావాలి. హిందూ జాతీయవాదాన్ని, ఉమ్మడి సంస్కృతిని రుద్దబడే భావజాలానికి నిరసనగా సాహిత్య కెరటాలు ఎగిసిపడాలి. విస్తరిస్తున్న హిందూ మతోన్మాద చర్యలకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా అక్షర సాయుధలమై నేటి రాజ్య నిరంకుశ వాదానికి వ్యతిరేకంగా పోటెత్తిన గళంగా మారి మన మైనారిటీ ఉద్యమాల సాధనకు ఆయుధాలమై సాహిత్య సాయుధలమవుదాం. భిన్న మైనారిటీ శక్తులతో స్థానిక హిందూత్వ ఫాసిస్టు దాడులను ఎదుర్కొనే క్రమంలో మరెన్నో కవితాగీతాల్ని ఐక్యతారాగంతో ఆలపించి సుసంపన్నం చేయాలి. లౌకిక భావజాలంలో సహనంతో సాహితీవనంలో విహరించగలగాలి. ఆఫ్రికన్‌, లాటిన్‌ అమెరికాలలోని క్రైస్తవ సమూహాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంంగా తన ధిక్కార స్వరాన్ని అన్ని సాహిత్య ప్రక్రియలలో ఎలుగెత్తి చాటినట్టుగా మన రచయితలు కూడా మన దేశ సందర్భానికి తగినట్టుగా సాహిత్యరూపాన్ని యివ్వవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అంబేద్కర్‌, పూలే సిద్ధాంత ఆధారిత దళిత బహుజనుల ఉద్యమాలలోని స్ఫూర్తిని క్రైస్తవ సాహిత్యానికి అందించగలగాలి. అస్థిత్వ ఉద్యమాల చరిత్రలో క్రైస్తవ స్త్రీ ఆవిష్కరించబడాలి.
మనం మనంగా గుర్తింపబడ్డానికి మన బ్రతుకులలోని అసమానతలను సమాజం ముందు ఆవిష్కరించడానికి సాహిత్యం తొలిమెట్టు అవుతుంది. క్రైస్తవ సమాజంలో వున్న కుల వర్గ సాంస్కృతిక వైరుధ్యాలను ముందుకు తేగలగాలి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో గుత్తపెట్టుబడిదారుల చేతుల్లోకి శ్రామిక వర్గానికి చెందిన వనరులు, భూమి, ఉపాధి పోయిన నేపథ్యంలో మన కథలు వెతలు కావ్యాలుగా మలుద్దాం. క్రైస్తవేతర రచయిత్రుల సహకారంతో క్రైస్తవ స్త్రీల పై జరుగుతున్న అమానుషత్వానికి అక్షరాన్ని మరింత పదునెక్కిద్దాం. దళిత క్రైస్తవ మహిళల ఆత్మగౌరవ పోరాటాన్ని, శ్రమని, వృత్తుల్ని సాహిత్యంలో ప్రతిబింబించేలా కృషి చేద్దాం. ఎలక్రానిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఎక్కువగా క్రైస్తవులను రౌడీలుగాను, గుండాలుగాను, స్త్రీలను వ్యాంపులుగాను అశ్లీలంగాను చూపిస్తున్నారు. ఈ సంస్కృతికి త్యతిరేకంగా రచయిత్రల మద్దతు కూడగడదాం. సాహిత్య భాషకున్న కులీన పితృస్వామ్య భావజాలాన్ని దాని స్వభావాన్ని ప్రశ్నిస్తూ పరిధిని విశాలం చేస్తూ, క్రైస్తవ మహిళలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తూ సమకాలీకులకు అందిద్దాం. భిన్నత్వాలను అంగీకరిస్తూనే మన ఆత్మ గౌరవ పోరాటంలో మనదైన వాదంతో ప్రత్యేకమైన మనదైన శైలితో మన స్థానాన్ని భద్రపరచుకుందాము. చరిత్ర గతిలో భాగస్వాములమవుదాం. సాహిత్య అధ్యయనంలో మాత్రమే కాకుండా సాహిత్య ప్రక్రియలో కూడా మన హృదయవాదం వినిపిద్దాం. ఏమైనప్పటికీ ఛాయాచిత్రంగా ప్రారంభమవుతున్న సాహిత్యం వస్తు నిర్ధేశికత కలిగి భావపరిపుష్టి పెంచుకొని సమగ్ర రూపాన్ని సంతరించుకుని, ప్రధాన స్రవంతిలో భాగం కావాలి. దీనికి అనువైన తాత్వికతను రూపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
తాత్వికత
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకొనే ప్రక్రియనే తాత్వికతగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని అనేక మంది తత్వవేత్తలు అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఎన్నో తాత్వికతలు పుట్టాయి. భారతదేశానికి వస్తే ఎన్నో మతాలకు, తాత్వికతలకు పుట్టినిల్లుగా వుంది. జైన బౌద్ధ మతాలు ఇక్కడ పుట్టి, అణచివేయ బడి అనేక దేశాలలో విస్తరించాయి. వాటికి ధీటుగా క్రైస్తవం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తరువాత ఇక్కడ సమాజంలో వివక్షతల వలన అనేక అస్తిత్వాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీ వాదం దళిత వాదం ఇలాంటివే. హిందూ మతోన్మాదం, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇస్తాం కూడా ముస్లిం సమాజాన్ని మిలిటెంటుగా ప్రభావితం చేస్తుంది. ఆ క్రమంలో ముస్లింవాద సాహిత్యం, ముస్లిం తాత్వికత వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది దళితులను అక్కున చేర్చుకున్న క్రైస్తవ మత తాత్వికత నేటి అవసరంగా రూపుదిద్దుకోవాలి.
క్రైస్తవం అన్నది ఒక ప్రత్యేక అస్తిత్వం. హిందూ మతోన్మాదం అక్రమ దాడులు, చర్చిలోని అంతర్గత పితృస్వామ్య భావజాలం, అగ్రవర్ణాల వివక్షత లాంటి తిరోగమన భావాల్ని తిప్పికొట్టి దళిత బహుజన స్త్రీ విముక్తికై నూతన క్రైస్తవ తాత్వికత రూపుదిద్దుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో చర్చిలు, సంపద భూమిని కోల్పోతున్న క్రైస్తవులు నేరుగా తమ సమూహాల్ని సరైన దిశలో తీసుకుపోవలసిన సందర్భం ఇది. భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడీదారి వ్యవస్థగా మారుతున్న క్రమంలో దానిని ప్రతిఘటించే ఏ శక్తినైనా పాలక వర్గాలు అడ్డుకుంటాయి. సహజంగానే రాజ్యహింస, క్రైస్తవుల మీద కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో యువతలో హింస పెరుగుట వలన స్త్రీలపై హింస నానాటికి పెరుగుతుంది. మతం కూడా మన ప్రతిఘటనని ప్రశ్నించే తత్వాన్ని నీరు కారుస్తుంది. ఈ నేపథ్యంలో క్రైస్తవ తాత్వికత రూపుదిద్దుకోవాలి. ఐతే ఇక్కడ వివిధ వైరుద్యాలను అర్థం చేసుకొంటూ ప్రధాన వైరుధ్యంతో పోరాడుతూ మత వైరుధ్యాలను కూడా అవగాహనతో సరిదిద్దుకొని ముందుకు సాగాలి. తాత్వికతను ఆధారం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఆచరణలో సామాజిక కార్యకర్తలు, సోకాల్డ్‌ మత పరిధికి కట్టుబడి వుండవలసిన అవసరం లేదు. తాత్వికత క్రైస్తవ వ్యక్తులు, సమూహాల విముక్తికి ప్రాతిపదికత మాత్రమే కానీ, వ్యవస్థీకృత మత బోధనలను నమ్మే వాదం కాదు.
క్రీస్తు బోధనలు – తాత్వికత
యేసుక్రీస్తు అప్పటి సమాజంలో ప్రగతి శీల సైద్ధాంతిక అవగాహన కలిగిన విలక్షణమైన వ్యక్తి. అప్పటి పాత నిబంధనలను కాలరాసి, ఆనాటి సమాజానికి కావలసిన స్వేచ్ఛ, సమానత్వం ప్రాతిపదికన కొత్త నిబంధనలను బోధించి ఆచరించి, ఆంక్షలతో కూడిన రాజ్యం చేతిలో అమరుడైన వాడు. నేను మనుష్య కుమారుడినే అని స్పష్టీకరించిన వాడు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.