‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు

– డా. సుహాసిని

M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది.

1937లో ఈ క్లబ్ని P.V.G. రాజుగారి తల్లిగారు (అశోక గజపతిరాజ్గారి నాయనమ్మ గారు) స్థాపించారు. అప్పటి ఎస్టేట్ కలెక్టర్ సత్యనాధన్ గారి తల్లిగారు సెక్రటరీగా ఉండేవారట.

ఈ క్లబ్ ప్రారంభించేనాటికి లోపాముద్ర గారు బాగా చిన్న పిల్ల. పైగా అక్కడలేరు – కర్ణాకర్ణీ తెలిసిన చరిత్ర అది ఈమె 1932 అక్టోబర్ 14న జన్మించారు. M.R. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా (1976-86 మధ్య) పనిచేసిన దామరాజులక్ష్మి సత్యనారాయణ గారి సతీమణి. ఆయన చనిపోయినా-పిల్లలు పిలిచినా వెళ్ళక ఒంటరిగా ఇప్పుడు 72 సం||ల వయసులో కూడా మూర్తీభవించిన చైతన్యంతో నిరాఘాటంగా క్లబ్ నిర్వహణ చేస్తున్నారు. మంచి మంచి పదవులలోనూ విదేశాలలోనూ ఉన్న కొడుకులు కోడళ్ళు, కూతుళ్ళు, మనవలూ ఉండి కూడా ఎవరిమీద ఆధారపడకుండా-పూర్తికాలం సామాజిక కార్యక్రమాల నిర్వహణలోనేగడుపుతున్నారు. వాళ్ళకు ఆమె చెప్పేసమాధానం ”నామెదడు పనిచేస్తున్నంతకాలం నాపనులు నన్ను చేసుకోనివ్వండి – తర్వాత మీఇష్టం. ఎందుకంటే అప్పుడు నాకెటూ తెలీదు కనుక” అంటూ గలగలా నవ్వే ఆమెరూపం స్పూర్తిదాయకమైనది.

తొలినాళ్ళలో ఈ క్లబ్ కేవలం ధనవంతులచేతుల్లోనే ఉండేదట. ఉన్నత వర్గాల మహిళలు టెన్నిస్ అదీ ఆడడం, డిన్నర్లు, పిక్నిక్లు, పార్టీలతో కాలక్షేపం కోసం నడిపేవారు. రానురాను 1960ల నాటికి శిధిలప్రాయంగా ఉన్నదాన్ని లోపాముద్రగారు చేపట్టి కొత్త చేవతో చిగురింపజేశారు. తన వయసు వాళ్ళందరినీ చేరబిలిచి మధ్యతరగతి స్త్రీల మనోవికాసానికి, సామాజిక కార్యక్రమానికి వేదికగా మలచారు. 1970లో సెక్రటరీగా బాధ్యత తీసుకున్న నాటినుంచి నేటిదాక ఎంతో భగీరథ ప్రయత్నం చేసి ఇప్పటిస్థితికి తెచ్చారు. గృహిణులుగా వంటగదికి పరిమితమైన స్త్రీలని రంగస్థలం ఎక్కించి మంచి సాంఘిక నాటకాలెన్నో వేయించారు. ఆటస్థలంలోకి తెచ్చి ఎన్నో ఆటలపోటీలు పెట్టి, వ్యాయామం, యోగా కేంద్రాలు పెట్టివారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించారు.

ప్రస్థుతం క్లబ్ ఆవరణలో ఒక కళ్యాణ మండపాన్ని కట్టించి దానిమీద వచ్చే ఆదాయంతో ఏటా మూడుకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకటి పిల్లలకోసం: నవంబర్ 14న ఎల్.కె.జి. నుంచి డిగ్రీదాకా పిల్లలకి (బాల, బాలికలలకు) వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, పోటీలు అన్ని కేంద్రాలనుంచి నిర్వహించి తిరిగి వారికి జిల్లా స్థాయిలో ఫైనల్గా పెట్టి విజేతలకి ప్రతిభా పురస్కారాలుగా నగదు బహుమతులు ఏర్పాటు చేసి వారికి కలెక్టర్ చేత ఇప్పిస్తారు.

రెండోది మహిళల కోసం: ఇది ఏటా మార్చి 8 సందర్భంగా నిర్వహిస్తారు. స్త్రీలకు వక్తృత్వ, వ్యాసరచనలు, ఆటల పోటీలు, నిర్వహించి లబ్దిప్రతిష్టులైన మహిళ ఒకరికి సన్మానం చేస్తారు.

దాదాపు 100 మంది లైఫ్మెంబర్స్ ఒక 50 మంది ఫాట్రన్స్ & డోనార్స్ ఉన్నారు. మాగజైన్ క్లబ్ రన్చేస్తూ అన్ని రకాల మాగజైన్స్ తానుకొని సభ్యుల ఇళ్లకు పంపి వాళ్ళదగ్గర చదివిస్తానని లోపాముద్రగారు చెప్పినప్పుడెంతో ఆశ్చర్యమేసింది. మనం ఎక్కడ వెనక పడుతున్నామో చెప్పినట్లైంది. సభ్యులకోసం కూడా పోటీలు వాళ్ళకీ బహుమతులు వాటి ఎంపికలు సహితం వారివారి అభిరుచులెరిగి తగ్గవాటిని ఇవ్వడం లాంటి వాటిని ఎంతో రొటీన్గా క్రమశిక్షణతో నడిపిస్తున్న తీరు. స్ఫుర్తిదాయకం.

మూడోది”అభినందన చందనం” అనే కార్యక్రమం ప్రతిఏటా నిర్వహిస్తూ ఊర్లోనూ, రాష్ట్రంలోకూడా సాధించిన విజయాలకి అభినందనలు అందించడం. ఎ.కళ్యాణి స్టాటిస్టిక్స్లో సన్మానిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సభ్యులు చురుకుగా నాటకాలు వెయ్యడం ఈ సాంఘిక నాటకాలలో మహిళల సమస్యలు ఇతివృత్తాలుగా ప్రదర్శించి మెప్పించడం జరిగేదట. వాటిమీద మరొక ప్రత్యేక వ్యాసం రాసుకోవాల్సిన అవసరం వారినుంచి మనం అందుకోవాల్సిన అనుభవం చాలానే ఉంది.

కల్లుతాగే అలవాటు కుటుంబాలనెలా కూలుస్తుందో వివరించే నాటకం మధ్యపాన పోరాటానికి ప్రతిస్పందనగా ప్రదర్శించి ఎందరో ప్రశంసలు పొందారు. ఎన్నో ఏకపాత్రాభినయాలు, ఏకాంకిలు ప్రదర్శించామని చెప్పారు.

ప్రస్తుతం- దామరాజు లోపాముద్రగారు సెక్రటరీ వై.ఎన్. రాధాలక్ష్మిగారు అధ్యక్షులుగా శ్రీమతి రమణమ్మ జాయింట్ సెక్రటరీగా, వి.. కామేశ్వరి ట్రెజరర్గా ఉమెన్స్ కాలేజీ రిటైర్ట్ ప్రిన్సిపాల్ లలితా శంకరి, రచయిత్రి చాగంటి తులసి తదితరులు కార్యవర్గ సభ్యులుగా చురుకుగా సాగుతున్నా సంక్షేమ సంఘమిది. లోపాముద్రగారి మాటలలో చెప్పాలంటే ”రిక్రియేషన్ క్లబ్”ని ‘ఉమెన్ వెల్ఫేర్ క్లబ్’గా మార్చి నేటి స్థితి చేకూర్చడం వెనుక ముప్పై ఏళ్ళ శ్రమవుంది”. దాదాపు ఈ 30 సంవత్స రాలలో 50మంది మహిళలని సన్మానించి వారిప్రతిభాపాటవాలని విజయనగరం మహిళలకుస్ఫూర్తిదాయకంగా మలచిన తీరుకి వినమ్రంగా శతాధిక వందనాలు సమర్పిస్తున్నాను.

గతసంవత్సరం మార్చి మొదటివారంలో నాకొక ఫోన్వచ్చింది. అది కాలంమీద జ్ఞాపకం చేసిన సంతకం. నన్ను ఆనంద ఆశ్చర్యాలలో ముంచెత్తిన క్షణం….

”సుహాసినిగారు… నేనండి-నన్ను ‘లోపాముద్ర’ అంటారు. ఎమ్.ఆర్. లేడిస్ క్లబ్ (విజయనగరం) సెక్రటరీనండీ… ప్రతిఏటా అద్వితీయమైనప్రతిభను ప్రదర్శించిన మహిళకు మేం సన్మానం చేస్తాం… మెదట మా మనవరాలి ద్వారా మీగురించి, మీచిత్రాల గురించి విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నవ్యలో మీ మీద వ్యాసం చదివిన నాటి నుంచి ఎంతో ప్రయత్నంమీద మా ఆంధ్రజ్యోతి విలేఖరి సాహిల్ద్వారా మీ ఫోన్ నెంబర్ సాధించి ఇలా మాట్లాడుతున్నాను. మాకోసం మీ అరుదైన కళాప్రదర్శన ఏర్పాటుచేసి, మిమ్మల్ని సన్మానించే అవకాశం ఇస్తారా” అన్నప్పుడు నిజంగా నమ్మలేకపోయాను.

మాది 70 సం|| చరిత్ర ఉన్న మహిళా సంఘం అని ఆవిడ 70 ఏళ్ళపైబడిన మహిళ అని తెలియగానే తక్షణం ఆమోదించాను. తమ కార్యవర్గంలో అధిక శాతం 60కి పైబడిన వాళ్ళమే అనీ, ఏటా మూడు ఫంక్షన్స్ చేస్తామనీ చెప్పారు. ఇలాంటి ఇంత చరిత్రవున్న సంస్థ నుంచి నాకు సన్మానం చేస్తానని ఆహ్వానం రావటం, ‘పత్రచిత్ర కారిణి’గా నాకు సన్మానం చేయడం నాకెంతో ఉద్వేగాన్ని, సంతోషాన్ని కలిగించింది. గురజాడవారి ఊరు… ఇల్లూ… కోటా… బొంకులదిబ్బా చూడచ్చొనీ, ఆ మహిళల ఉత్సాహాన్ని కొంతైనా అంది పుచ్చుకోవాలనే ఉబలాటం, చాగంటి తులసిని కలవచ్చనీ వెంటనే ఒప్పుకున్నాను… మాపాపతో కలిసి విజయగరం ప్రయాణం కట్టాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.