తొలి సంతాలీ కవితా స్వరం

పసుపులేటి గీత
‘క్యా హై మే తుమ్హారే లియే ఏక్‌ టకియా, కహీ సే థకా-మారా అయ్యా ఔర్‌ సీర్‌ టికా దియా…’
‘నువ్వు అలసిపోయి ఇంటికి వచ్చీ రాగానే, గోడకేసి బాదడానికి నేనేమైనా నీ తలగడనా?!’
– నిర్మలా పుతుల్‌

మహిళల మనోవ్యథకి మొట్టమొదటి సంతాలీ కవయిత్రి అభిభాషణ ఇది.
కరువు కాలంలో తీసుకున్న అప్పు ఎన్నటికీ తీరదు, ఆరుగాలం పొలంలో నా తల్లిదండ్రులు కష్టపడి పనిచేయడాన్ని చూశాను. కానీ పంట చేతికి వచ్చీరాగానే మహాజన్‌లు గద్దల్లా వచ్చి దాన్ని ఎగరేసుకు పోవడాన్ని చూశాను’ అంటుంది నిర్మలా పుతుల్‌. జార్ఖండ్‌లోని దమ్కా అనే గిరిజన గ్రామంలో 1972లో ఒక పేద సంతాలీ కుటుంబంలో జన్మించిన నిర్మలా పుతుల్‌ తొలి సంతాలీ కవయిత్రిగా గుర్తింపు పొందింది.
నిరుపేద కుటుంబంలో పిల్లల్ని పోషించడానికి తన తల్లి పడిన ఆరాటాన్ని నిర్మల కవితా రూపంలో ఆవిష్కరించింది. ఆమె కవితలు నాగరిక, ఆదిమ సమాజాలకు మధ్య వారధిగా కనబడతాయి. మహిళలు, ఆదివాసీలు, దళితుల సమస్యల మీద ఆమె రచించిన కవితలు సమాజాన్ని నిగ్గదీస్తాయి. ఆదివాసీ జీవితంలోని లోటుపాట్లని కూడా నిర్మల అంతే తీవ్రంగా ఎండగడుతుంది.
‘అప్నే ఘర్‌ కీ తలాషే మే…’ అనే కవితా సంపుటితో నిర్మల భారతీయ సాహిత్య లోకంలో ఒక కొత్త వెలుగును ప్రసరింపజేసింది. దీనిని ‘రమ్నికా ఫౌండేషన్‌’ ప్రచురించింది. ‘నగారేకీ తరాహ్‌ బజ్‌తే హై శబ్ద్‌’ నిర్మలకు పేరు తెచ్చిన మరో కవితా సంపుటి. దీనిని ‘భారతీయ జ్ఞానపీఠ్‌’ ప్రచురించింది. ఆమె కవితలు కొన్ని జార్ఖండ్‌ ఇంటర్మీడియెట్‌ సిలబస్‌లో కూడా చోటుచేసుకున్నాయి. నిర్మల కవితలు ఒక పేద సంతాలీ మహిళగా ఆమె స్వీయానుభవాలకు అద్దం పడతాయి. ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు 2001లో నిర్మలను వరించింది. అప్పటి నుంచి ప్రపంచం ఈ సంతాలీ కవయిత్రిని గుర్తించడం మొదలుపెట్టింది. ‘మహాశ్వేతా దేవి చేతుల మీదుగా ఈ అవార్డును (సాహిత్య అకాడమీ అవార్డును) తీసుకోవడం నన్ను ఆనందసాగరంలో ముంచింది. నేను జీవితంలో మరచిపోలేని మధురక్షణం అది’ అంటుంది నిర్మల. ఆమెను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ‘భారత్‌ ఆదివాసీ సమ్మాన్‌’తో సత్కరించింది.
గిరిపుత్రుడు
గిరిపుత్రుడు
కొండ ఒడిలో ఆడుకునే
చిన్ని శకలం
పర్వత సీమలో
కొండ ఒడిలోంచి మరో పర్వతంగా ఎదగడానికి
గుట్ట మట్టిలో తన పాదాల్ని నాటుతూ
అతడు కొండనెక్కుతాడు.
కొండ కొండంతా గిరిపుత్రునిలోనే ఒదిగి పోతుంది
పర్వతాల ఒడిలో
గునగునా పరిగెడుతూ గిరిపుత్రుడు…
కొండ మీద ఎగిరే విమానాన్ని చూస్తాడు
తన తండ్రిని ‘నాన్నా, ఆ పిట్ట పేరేంటి?’ అంటూ ప్రశ్నిస్తాడు!
– నిర్మలా పుతుల్‌
(ఆంగ్లం నుంచి అనువాదం: పసుపులేటి గీత)
అతికష్టమ్మీద చదువును కొనసాగించినా డిగ్రీలో చేరడానికి వీల్లేని పరిస్థితిలో నిర్మల నర్స్‌ ట్రైనింగ్‌లో చేరింది. తరువాతి కాలంలో ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్శిటీలో డిగ్రీని పూర్తిచేసింది. ‘మహిళా సాధికారతే నా అంతిమ లక్ష్యం’ అంటున్న నిర్మల మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణా రంగంలో కృషి చేస్తోంది. మరాఠీ, హిందీ, ఒరియా భాషల్లోకి ఆమె కవితలు అనూదితమయ్యాయి. ఆంగ్లంలోకి అనువదితమైన నిర్మల కవితలు పలు అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో చోటుచేసుకున్నాయి. ఆమె జీవితగాథను కేంద్రంగా చేసుకుని ప్రముఖ డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు శ్రీ ప్రకాష్‌ ‘బురు గారా’ (కొండల్లో నది) అనే డాక్యుమెంటరీని నిర్మించారు. దీనికి సామాజిక సమస్యల మీద నిర్మించిన ఉత్తమ డాక్యుమెంటరీగా 2008 జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.