ప్రతిస్పందన

జూన్‌ సంచికలో కల్పనా శర్మ మీద రాసిన సంపాదకీయం చాలా బావుంది. హిందూ పేపర్‌లో ఆమె కాలమ్‌ నేను రెగ్యులర్‌గా చదువుతాను. ఇక ముందు ఆ కాలమ్‌ వుండదంటే (తను రిటైర్‌ అవుతోంది కాబట్టి) బాధగా వుంది. ఆమె గురించి సంపాదకీయం రాసినందుకు అభినందనలు. ‘’ప్రకృతి వైపరీత్యాలు-జండర్‌ అంతరాలు’’ అనే అనువాద వ్యాసం చదివి చాలా ఆశ్చర్యపోయాను. స్త్రీల మీద అమలయ్యే వివక్ష, కట్టుబాట్లు స్త్రీల ప్రాణాలను ఏ విధంగా హరిస్తాయో, అందుకు ప్రకృతి వైపరీత్యాలు కూడా మినహాయింపు కాదని ఈ అధ్యయనం నిరూపించింది. ‘భూమిక’ ఒక విశిష్టతని సాధించిన పత్రిక. మీరిచ్చే సమాచారం ఉన్నత ప్రమాణాలను కలిగివుంటుందనడం అతిశయోక్తి కాదు. అభినందనలు.

– భారతి, హైదరాబాద్‌

***

సమాజానికి హితం చేపేది సాహిత్యం అన్నారు. ‘యాక్సిడెంట్‌’ కథలో అత్తలూరు విజయలక్ష్మిగారు ఏం చెప్పదలుచుకున్నారు…? మగవాడు చెడిపోతున్నాడు కాబట్టి. ఆడది కూడా చెడితే తప్పులేదనా…? తల్లిదండ్రులే అలా ఉంటే ఇక పిల్లలు ఏ విధంగా తయారవుతారు…? భవిష్యత్తు సమాజం ఏమిటి…? ‘కంచె’ కథలోని నాగమణి తల్లి వంటి వారి ఆవేదనకు అంతు ఎక్కడ…? నేటి సమాజానికి అద్దం పట్టిన ‘కంచె’ కథ రాసిన శీలా సుభద్రాదేవిగారికీ, మీకు కూడా కృతజ్ఞతలు..

– కోపూరి పుష్పాదేవి, విజయవాడ

***

జూన్‌ సంచికలో ప్రచురించిన అత్తలూరి విజయలక్ష్మిగారి కథ ‘యాక్సిడెంట్‌’ పెళ్ళి అయిన కొంతకాలం తర్వాత ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళయి వెళ్ళిపోయి, భర్త తన వ్యాపకాలలో తీరిక లేకుండా ఉన్నప్పుడు ఇంట్లో ఉండే స్త్రీని వేధించే వంటరితనం, శూన్యత లాంటి సమస్యనో, భార్యాభర్తల సంబంధాల్లో నెలకొనే నీరసం, చప్పదనం, చద్దిదనంలాంటి సమస్యనో, లేక ‘’ప్రేమతో గానీ, మోహంతోగానీ ఒకరినొకరు తాకకుండా’’ ఏండ్లు గడిపేట్లు చేసే యాంత్రికతనో చిత్రిస్తున్నట్లు తోచి, కొంత కొత్తదనం ఉందనిపించి మొదట ఆసక్తి కల్గించింది. కాని, చివరకు పురుషుని అక్రమాల చిత్రణతో ముగిసే అనేక సాధారణ స్త్రీవాద కథల్లాగే రెడిమెడ్‌ ఫార్మూలాలో ఒదిగి పోయింది. కొసమెరుపును కూడా ఆశ్రయించింది.

పురుషుని అక్రమాలను చిత్రించకూడదని కాదు, నేను చెప్పదలచుకున్నది. స్త్రీ పురుష సంబంధాలను అతిగా సరళీకరించి చిత్రించే సులభ పద్ధతిని ఆశ్రయించే ఈ దశ నుండి స్త్రీవాద కథలు ఎదగాలనీ, పురుషుని దౌష్ట్యం అనే ఊతకర్రనే ఆధారం చేసుకోకుండా అతి సంక్ల్లిష్టమైన స్త్రీ పురుష సంబంధాలను అనేక ఇతర కోణాల నుండి కూడా చిత్రించే ప్రయత్నం ఇంకా ఎక్కువగా జరగాలనీ, ‘నూరేళ్ళపంట’గా చెప్పబడే వివాహాన్నీ స్త్రీ పురుషులు పరస్పర నేరారోపణలకు కాక, పరస్పర ఆదరణ, అనురాగాలకు ఆలవాలంగా చేసుకోవడానికి మార్గాలు వెదికే ప్రయత్నం సాహిత్యం ద్వారా మరింత ఎక్కువ జరగాలనే నేను కోరుకునేది.

జయప్రకాశ్‌గారి ప్రతిస్పందన ఆలోచింపచేస్తుంది. ‘’నేను రోజుకు రెండు సార్లు మరణిస్తాను. ఒకసారి ఒంటింట్లో మరోసారి పడకటింట్లో’’లాంటి అతిశయించిన ఆత్మదయ స్త్రీ ఆవేదనను అపహాస్యం పాలు చేస్తుంది. సాహిత్యం ఇంతకంటే మెరుగైన అభివ్యక్తిని కోరుకుంటుంది. అందరు స్త్రీలు ఇలా మరణిస్తున్నారని కూడా అందరూ అనుకోరు. ఇలా అన్నందుకు పురుషులకేమి తెలుసు స్త్రీల బాధలు అని తిట్టరు కదా! శాంతసుందరి గారు అనువదించిన కవి పవన్‌కిరణ్‌ కవితలు స్త్రీలే స్త్రీవాద రచనలు చేయగలరని గట్టిగా నమ్మేవారిని ఆలోచింపచేస్తాయనుకుంటాను.

– జె.ఎల్‌.రెడ్డి, న్యూఢిల్లీ

***

జూన్‌ 2007 భూమికలో డా. సమతరోష్నిగారు రవాణా శాఖామాత్యులు గారికి రాసిన లేఖ చదివాను. స్పందించమని కోరారు కాబట్టి స్పందిస్తున్నాను. సీట్ల రిజర్వేషన్‌ విషయంలో కొన్ని నియమాలు నింబంధనలు ఉంటాయి. రైలులో సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణీకుడు రాకపోతే, తరువాత స్టాపు వచ్చే వరకూ చూసి, మరొకరికి కేటాయిస్తారు. అంటే ఆ సీట్‌/ బెర్తు మీద ప్రయాణీకుడికి హక్కు పోతుంది. లేదా ఫలానా స్టాపులో ఎక్కుతాడని ముందే నిర్ణయించుకుంటే, ఆ విషయం ముందుగానే తెలియజేయాలి. టికెట్‌లోనే ఆ విషయం రాస్తారు. యిది ముందే డబ్బుకట్టి రిజర్వేషన్‌ తీసుకునే రైల్వేల విషయం.

ఇక సమతా రోష్నిిగారెక్కిన ఆదిలాబాద్‌ బస్‌ గురించి ఆదిలాబాద్‌లో బయలుదేరిన సమయానికి ఆ బస్‌లో స్త్రీ ప్రయాణీకులకు కేటాయించిన స్టీట్ల్లకు స్త్రీ ప్రయాణీకులెవరూ లేరని అర్ధమవుతోంది. నెం. 1 సీటును ఒక పురుషుడికి కేటాయించడం ఆదిలాబాద్‌లోనైనా జరిగి వుండవచ్చు. మార్గమధ్యలో కూడా జరిగి వుండవచ్చు. డా. రోష్నిగారి ఉద్దేశం చూస్త్తే, స్త్రీ ప్రయాణీకులు ఎవరూ ఎక్కకపోతే ఆ సీట్లను అలాగే వొదిలి, హైదరాబాద్‌లోపుల ఎవరెక్కినా వారికి (స్త్రీలకు) మాత్రమే కేటాయించాలిలా వుంది. యిది కాని పని యిలాంటి నిబంధన వుండే అవకాశం లేదు. అలా వుండటం సమంజసం కూడా కాదు. చట్టం ప్రకారం పరిమితిని మించి, ఎక్కువమంది ప్రయాణీకులను అనుమతించకూడదు. సీట్లసంఖ్యాను బట్టే వారు రవాణాశాఖ వారికి కట్టవలసిన టారిఫ్‌ నిర్ణయించబడుతుంది. అయితే మన రవాణాశాఖాధికారులు, ఎపియస్‌ఆర్‌టిసిని వొదిలి ప్రైవేటు వాహనాల విూద ఎక్కువ తనిఖీలు జరుపుతారు, అందులో స్వలాభముంటుంది గనుక.

డా.రోష్ని గారి ప్రకారం చేస్తే ఆ మూడు సీట్లను అలాగే వుంచైనా బస్‌ ప్రయాణించాలి లేదా ఎవరినైనా కూర్చోటానికి అనుమతించినా స్త్రీ ప్రయాణీకులెక్కితే కూర్చున్న వారిని లేపి స్త్రీలకు కేటాయించాలి. అంటే ఆ లేచిన ముగ్గురూ నిల్చునే ప్రయాణం చేయాలి. అంటే బస్‌ను ఓవర్‌లోడ్‌ చేయాలి ( చేస్తూనే వుంటారనుకరోండి) కాని కండక్టరు ఆ విషయం ముందే చెపితే ఆ ముగ్గురు ప్రయాణీకులు ఎవరూ బస్‌ ఎక్కరు. ఆదిలాబాద్‌ నుండి హైదారాబాద్‌కు నిల్చుని ప్రయాణించటం ఎవరికైనా కష్టమే. ఏ రకంగా చూసినా డా. సమతా రోష్నిగారి కోపానికి అర్ధం లేదు. అటువంటి నియమనిబంధన ఉండే అవకాశమూ లేదు. ఉన్నా ఆ నిబంధనకు అర్ధం లేదు. అయితే యిక్కడ నిర్మల్‌ వరకూ ఆ రెండు సీట్లు ఖాళీగా వున్నాయి. కండక్టరుగారు రిజర్వేషన్‌కు ప్రిఫరెన్సు యివ్వటం సమంజసం, నిబంధనలున్నా లేకున్నా. అది అతని తప్పు. అలాంటి నిబంధనుంటే ఆ కండక్టరుగారి విూద చర్య తీసుకోవచ్చు.

– సిహెచ్‌. శ్రీనివాస మూర్తి, వరంగల్‌

***

సత్యవతిగారికి,

నేను దాదాపు మూడేళ్ళుగ ‘భూమిక’ చదువుతున్నాను. ఆలోచింపచేసే అంశాలతో నెల నెలకు భూమిక స్థాయి పెరుగుతోంది. ఒక్కొక్కసారి ఉత్తరాలు కూడ ప్రత్యేకతను సంతరించుకొంటున్నాయి. జె. ఎల్‌. రెడ్డి, న్యూడిల్లీ రాసిన ఉత్తరం జూన్‌ సంచికకే హైలైటు. ఆయన స్పందించిన తీరు గొప్పగా వుంది. ఆయన ఉత్తరం వ్యంగ్య బాణమే అయినప్పటికీ ఎన్నో చారిత్రిక వివరాలందులో పొందుపరచుకొని హుందాగా వుంది. దానికి నేను రెండు మాటలు జత పరుస్తున్నాను.’తస్కరించడం’ అంటే మనకు అనుభవించడానికి హక్కుగాని, అర్హతలేని దానిని ఇతరుల నుండి సంగ్రహించడం. అంటే గాంధీజీ కి ‘మహాత్మా’ అనిపించుకొనే అర్హత లేదని అర్ధమొస్తుంది. ఇంకొక అబ్జెక్షనబుల్‌ పదం ‘ప్రచారం చేసుకోవడం’ తస్కరించింది గప్‌చిప్‌గా, దొంగతనంగా అనుభవించకుండ దానిని ప్రచారం కూడా చేసుకొన్నారన్నమాట.

గాంధీజీ తనకు తోచిన మార్గంలో పనిచేసుకుంటూ పోవడమే తప్ప బిరుదుల కోసం, సన్మానాలకోసమూ అర్రులు చాచినట్లుగాని వాటిని ప్రదర్శించినట్లుగాని నేనెక్కడా చదవలేదు.

గాంధీ అంటే కిట్టనివాళ్ళు నాడూ వున్నారు. నేడూ వున్నారు. కాకపోతే నేను చెప్పేదేమంటే మనం ఎవరినైనా అభిమానించి పొగడదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. కాని ఒకరిని పొగడడానికి యితరులను తెగడనవసరం లేదు. కించ పరచనవసరం లేదు. అది సద్విమర్శ అనిపించుకోదు. కాని ఇటీవల అటువంటి ధోరణులెక్కువయిపోతున్నాయోమోననిపిస్తోంది.

ఇప్పుడే వార్తల్లో చెప్పారు. ఇక నుండి గాంధీ జన్మదినాన్ని (అక్టోబరు 2) ప్రపంచ అహింసాదినంగా సెలబ్రేట్‌ చేయాలని ఐక్యరాజ్యసమితి వారు నిశ్శయించారట. నాకైతే ఎంతో సంతోషంగా వుంది.

‘కల్పనాశర్మ’ గురించి రాసినందుకు ధ్యాంక్స్‌. ఆవిడ వ్యాసాల్లో చాలా ఇన్ఫర్మేషనుతో పాటు , ఎంతో ఉత్తేజితంగా వుంటాయి.

– డా. కె. సునంద, హైద్రాబాద్‌

Share
This entry was posted in ఎడిటర్‌కి లేఖలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.