బాల్య వివాహాల్ని తలపిస్తున్న మన పెళ్ళితంతు

కొండేపూడి నిర్మల

మీ అమ్మమ్మనో, బామ్మనో వాళ్ళ పెళ్ళి సంబరాల్ని గురించి చెప్పమనండి! అర్థరాత్రి భాజాలు వాయించి నిద్ర లేపి, బెల్లం ముక్క తినిపిస్తూ తాళి కట్టించారనో, పల్లకీలో వూరేగడం తప్ప ఇంకేమీ గుర్తు లేదనో…చెబుతారు.

ఎందుకంటే అష్టవర్షా కన్యా…అనుకుంటూ చేసిన ఆనాటి వివాహాల్లో అంతకు మించి ఆశించేందుకేమీ లేదు.
కానీ జీవితంలో స్థిరపడి శారీరకంగా, మానసికంగా పరిణతి చెందిన యువతీ యువకులు చేసుకుంటున్న పెళ్ళిలోను అదే తతంగం వుంటే దానికి మరమ్మత్తు అవసరం లేదా?
ఎప్పటినుంచో నాలో వున్న ఈ ఆలోచన మా సబిత పెళ్ళితో ఇంకా గట్టి పడింది. సబిత వామపక్ష భావాలున్న నా మిత్రుడి కూతురు. తనతో పని చేస్తున్న సాప్టువేరు ఇంజనీరుని ఈ మధ్యనే చేసుకుంది. ప్రేమ సంగతి ఒప్పుకుంటాం గాని పెళ్ళి మాత్రం పీటల మీదనే జరగాలని మగ పెళ్ళివారు పట్టు పట్టారు. వాగ్వివాదాలు తెగని ఒక దశలో నా మిత్రుడు ఇది రద్దు చేసుకోవాలనుకుని కూడా – కూతురి మొహం చూసి కాదనలేక పోయాడు.

సబితకు పూలజడ వేసి గౌరీ పూజకు కూచోపెట్టారు. పూలజడ సంబరం కనిపిస్తోంది కాని పూజ చేయించడం కష్టమయింది. విగ్రహారాధన వ్యతిరేకించే కుటుంబంలో ఆమె పుట్టింది.
”ఇస్సు…మొహం అలా పెట్టకు. ఆ డబ్బాలో వున్న ఎర్రపొడి, ఈ డబ్బాలో వున్న పచ్చపొడి అక్కడున్న పసుపు ముద్ద మీద తడవకు చొప్పున చల్లుతూ వుండు. అదే పసుపు కుంకాల పూజ…ఇక ముందు ఏ విషయం తెలీదని చెప్పకు.” వివరం తెలిసిన ఆమె పెద్దమ్మ కూతురు సబిత చెవిలో గొణిగింది.
ఇంకో వైపు వెళ్ళదలచుకొని కాశీ యాత్రకు, వెడుతున్నట్టే ముస్తాబు చేసి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి వెనక్కి తీసుకొచ్చారు. చెప్పులకు బదులు పాంకోల్లు తొడుక్కుని కసరత్తు చేస్తూ అతడు నడిచాడు.
కొన్ని పిడికిళ్ళ పూజ తరువాత సబితను బుట్టలో కూచోమన్నారు. నా వల్ల కాదంది. ముగ్గురు ఆడవాళ్ళు ఆమెను బలవంతాన బుట్టలోకి దించారు. బక్కగా వున్న ఒక మేనమామ బలంగా వున్న మరో నలుగురుతో కలిసి చెమటలు కక్కుకుంటూ పీటల మీద దించారు.

అసలే బొద్దుగా వున్న సబిత బుట్టలోంచి లేచి నుంచుని పడకుండా పీట మీద కూచునే దశలో పడిన యాతన ఆ కళ్ళలో స్పష్టంగా కనిపించింది. వెంటనే ఇద్దరి మధ్యా తెరలు కట్టారు. ఈ లోగా సెలుఫోను మోగింది. తెర పైకెత్తి పట్టుకుని ఇద్దరు తమ మిత్రుడితో కాస్పేసు మాట్లాడారు. పురోహితుడు వాళ్ళను అప్పుడే పరిచయం అయినట్టు తడి కళ్ళతో చూసుకోమన్నాడు(?) ఆ మాటకి అందరూ నవ్వారు. ఆ తర్వాత ఒక చెక్క లాంటి దాన్ని తెచ్చి వధువు తలపై పట్టుకుని వరుడితో మంత్ర జలం చల్లించారు. ఆ తంతుకి అర్ధమేమిటని ఎవరో అడిగారు.
”కన్యగా వున్న ప్రతీ వధువునూ ఒక భూతం ఆవహించి వుంటూందట. మంత్ర జలం ద్వారా ఆమెను పవిత్రం చేస్తూ సాక్షాత్తూ విష్టుమూర్తి లాంటి వరుడు అర్ధాంగిగా స్వీకరించుతాడట.”పురోహితుడు అర్ధం వివరించాడు. (కొన్ని అర్ధాలు తెలుసుకోక పోతేనే నయమని నాకు అనిపించింది)
ఆ వివరణ విని పెళ్ళి కొడుకు స్నేహితులు బాగా గోల చేశారు. పెళ్ళి కూతురి స్నేహితులు కొరకొరా చూశారు.
జీలకర్రా బెల్లం సీను అయిన తర్వాత, పూలదండలు వేసుకోమన్నారు. ఇద్దరికీ ఇది నచ్చింది. అయితే అమ్మాయి లేచి నుంచుని అబ్బాయి మెడలో వేసిందిగాని అబ్బాయి లేవడానికి సిద్ధం అయ్యేలోగా పురోహితుడు వారించాడు.
”అయ్యా…మీరు నుంచోనవసం లేదు కూచునే వెయ్యండి.” సబిత మొహం చూడాలంటే నాకు భయం వేసింది.. వెంటనే అబ్బాయి పాదాలకు నమస్కారం చెయ్యమని అమ్మాయితో చెప్పారు. చచ్చినా చెయ్యనంది సబిత. అందరూ ఖంగారు పడ్డారు.
నేను ముందే చెప్పాను .
నాకిలాంటివి నచ్చవని..అబ్బాయి వంక చూస్తూ ఆటంబాంబులా అరిచింది. ఆ అబ్బాయి ఏదో నచ్చజెప్పబోయాడు. గొడవ వినిపించకుండా బాజాలు వాయించమన్నారు.
అగ్ని చుట్టూ ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యమన్నారు. అమ్మాయి అనుకోకుండా ఒక అడుగు ముందుకు నడిచింది. ”అమ్మా మీరు వరుడి వెనకాలే నడవాలి ముందుకాదు..” సబిత ఏదీ అనకుండానే ఇంకోసారి బాజాలు మోగాయి.
స్తాళీపాకం పేరుతో అక్కడ వెలిగించిన అగ్ని హోత్రం వేడికి ఇద్దరు కళ్ళద్దాలు తీసి ముక్కు చీదుకుంటూనే వున్నారు. పైగా ఆ మంట మీద చిట్టి గిన్నెడు అన్నాన్ని తమ్ముడి సాయంతో వధువు వొండి వరుడికి తిని పించాలిట. ఉడక్కుండానే మంటల్లో మాడిన ఆ మెతుకుల్ని తిని తీరాలని సబిత గొడవ చేసింది కాని తినకుండానే బాజాలు మోగాయి.
భోరున కురిసే వానలో అరుంధతీ నక్షత్రం కనిపించిదనే చెప్పాలని ముందుగానే నూరి పొయ్యడంవల్ల , ఇద్దరు తలలూపారు.

కన్యాదానం, అప్పగింతలు లాంటివి మానెయ్యమని పురోహితుడికి ఎంతగా చెప్పినా అందుకు ప్రత్యామ్నాయంగా ఇంకే తతంగం లేక అతను ముక్తసరిగా జరిపించాడు.
ఎన్నోసార్లు పెళ్ళిళ్ళకు అలవాటుగా హాజరవుతూ, నిట్టూర్చుతూ వుండే నేను ఆ పెళ్ళిని సబిత కళ్ళతో, ప్రశ్నలతో చూశాను. ఎవరికీ అర్ధం కాని వినాలనుకోని మంత్రాల మధ్య, జరిగే ఈ ఆటలో సమానత్వం గాని, సమాచారం గాని ఏమయినా వుందా? అసలు ఈ తతంగంతో సంబంధం లేకుండానే అనేక జీవితాలకు నిర్వచనం చెప్పుకుని వున్నారే?
బాల్యవివాహాల నాటి పద్ధతులతో మన జీవితాలకు మనల్నే ప్రేక్షకులను చేస్తున్న ఈ బొమ్మలాటలు ఇంకా కొనసాగాల్సిందేనా?
సంప్రదాయ శాస్త్రీయ రీతుల్లో వున్న కూచిపూడి, భరతనాట్యం, కథాకళీ లాంటి వాటిలో ఆధునిక సామాజిక అంశాల్ని జోడించగలిగినపుడు ప్రతి ఒక్కరి జీవితం లోనూ వెన్నెల వెలిగించే వివాహం కాలాను గుణంగా తీర్చిదిద్దుకోలేమా? వేద మంత్రాల్ని గాని, వాటిని నమ్ముతున్న అనేక మంది భావావేశాల్ని గాని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. పీటల మీద కూచున్న ఈ తరం సబితల ఆత్మగౌరవం మీద బాజాలు వాయించడం ఎలా సబబు అవుతుంది? అని మాత్రమే అడగదలుచుకున్నాను.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.