హక్కుల జోక్యంతో అదుపులోకి వచ్చిన పాడేరు మరణాలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ‘ప్రతీ ఏడాది వర్షాకాలంలో వేల సంఖ్యలో అనారోగ్య మరణాలు సంభవించడం గురించి ‘సీజనల్ వార్తలు’ పత్రికల్లోను, టీవీ ఛానళ్ళలోను ప్రముఖంగాను, అపుముఖంగాను చూస్తుండేదాన్ని. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో చర్చలు జరగడమే కాక కొన్ని రాజకీయపార్టీలు గత ఏడాది జాతీయ మానవహక్కుల కమీషన్కు ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో చదివాను. అయితే అనుకోకుండా విశాఖలో ఆంగ్ల పాత్రికేయుడిగా పనిచేసి బదిలీపై హైదరాబాద్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ పరిచయమైనపుడు ఏజెన్సీ ప్రాంతంలో సంభవిస్తున్న మరణాలు మానవహక్కుల ఉల్లంఘన ఫలితంగా వివరించారు. ఈ సమస్యపై మానవహక్కుల కోణం నుంచి పనిచేయాలని మా ఇద్దరికీ అనిపించింది. అక్కడితో పని ప్రారంభించి (ఏప్రిల్, 2006), అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలనుంచి అక్కడి ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిలోని ఎర్రరక్తకణాలపై ప్రభావం చూపే పి.హెచ్ శాతం లోపం వరకు వీలైనన్ని ఆధారాలు సంపాదించాం.

పాడేరు ఏజన్సీ డివిజన్లో ఉన్న 11 మండలాల్లోని ఏడు ( పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, అరకు, మాడుగుల, ముంచింగ్‌పుట్టు) మండలాల్లో నాలుగు రోజుల్లో మా ప్రతినిధులు సర్వే చేశారు. జ్వరాలు రావడం, తాగేనీరు, పారిశుధ్యం మొదలుకొని ఆస్పత్రిలో వైద్యసేవలు, రక్తపరీక్ష నివేదికలు అందించడం, పేషెంట్ల రవాణా సదుపాయాల వరకు వివిధ అంశాలమీద ( హక్కుల కోణం నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి) సర్పంచ్లకు, సాధారణ ప్రజలకు, ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలకు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్యకర్తలకు ఉద్దేశించి రూపొందించిన ప్రశ్నావళిని ‘భూమిక’ కార్యాలయంలోనే డిటిపి చేయించడం యాధృచ్చికం. అలాగే, స్థానికంగా పరిచయాలు ఉన్నవారు, అసలు ఏజన్సీ ప్రాంతం తెలియకపోయినా ఇక్కడి సమస్య గురించి విని బాధపడిన ‘దిశ’, ‘తర్జని’ స్నేహితులు ఈ సర్వేలో పాల్గొని కొండకోనలో గుట్టలు ఎక్కిదిగి, ప్రమాదకర రోడ్లపై ద్విచక్రవాహనాలపై వెళ్ళి వీలైనంతవరకు రోడ్డుకు దూరంగా వున్న గ్రామాలకు వెళ్ళి ఈ ప్రశ్నావళిని పూరించి, అక్కడివారి వేలిముద్రలను ప్రశ్నాపత్రాలపై పెట్టించి తీసుకువచ్చారు. ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలుగా మారి హైదరాబాద్ రాగానే వాటిని కేటగిరీలవారీగా విశ్లేషించి, వాటివివరాలను పొందుపరుస్తూ రాష్ట్ర మానవహక్కుల కమీషన్లో కేసు దాఖలు చేశాం. మానవ హక్కుల ఉల్లంఘనలపై మొత్తం 12 ప్రధాన అంశాలను కమీషన్కు ఆధారాలతో నివేదించాం.

కమీషన్ ద్వారా మేం కోరిన పరిష్కారాలుః
1. ఇళ్ళకు దూరంగా సామాజిక పశువులశాలలను ఏర్పాటు చేయాలి. ఊళ్ళోని అందరూ తమ పశువులను అక్కడే కట్టివేసేలా చర్యలు తీసుకోవాలి.
2. ప్రతి గ్రామానికి కనీసం ఒక సామాజిక మరుగుదొడ్డి (ఎక్కువ యూనిట్లతో), సామాజిక స్నానాలగదులు నిర్మించాలి.
3. ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు సరఫరా చేయాలి. భారీ స్థాయిలో ఇలా చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించలేకపోతే, తాత్కాలికంగా సంప్రదాయ పద్ధతులలో నీటిని శుద్ధిచేసి పంపిణీ చేయాలి.
4. ప్రతి 10-15 ఇళ్ళకి ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలి. ప్రతి రెండవరోజు దీనిని తొలగించే బాధ్యతను స్థానిక సామాజిక ఆరోగ్య కార్యకర్తకు అప్పగించాలి. పనస తొక్కలు, మామిడి పళ్ళు చెత్తనుంచి ఆదాయం పొందే మార్గాలపై ఇక్కడి ప్రజలకు శిక్షణ ఇవ్వాలి.
5. ఆరోగ్య కార్యకర్తలు సేకరించే రక్త నమూనాలను పరీక్షించేందుకు అవసరమైన (టేటా 4-5 లక్షల నమూనాలు సేకరిస్తారు) సామర్థ్యంతో లేబరేటరీలు ఏర్పాటు చేయాలి, ప్రతి రక్త నమూనాకు పరీక్ష నివేదిక ఖచ్చితంగా ఇవ్వాలి.
6. ప్రతి మూడు లేదా నాలుగు పంచాయతీలకు ఒక ఆరోగ్య ఉప-కేంద్రం ఏర్పాటు చేసి, వైద్యులు ఎప్పుడూ అందుబాటులో వుండేలా ఏర్పాటు చేయాలి.

వీటితోపాటు ఆరోగ్య పరిరక్షణకై ప్రచారం చేయాలి. పబ్లిసిటీపై వ్యయం తగ్గించి, సాంప్రదాయ పద్దతుల ద్వారా ఆరోగ్యంపై ప్రచారం చేయాలి.

సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు కనీస విద్యార్హత నిర్ణయించాలి. సామాజిక ఆరోగ్య కార్యకర్తలు విశాఖ ఏజన్సీలో ఒక భారీ శక్తి. వీరు 3,200 మంది ఉన్నారు, కానీ, అత్యధిక భాగంమందికి చదువురాదు. జ్వరం, వాంతులు, విరేచనాలు, టి.బి. మందులను తెల్లవి, పెద్దవి, ఎర్రవి, చిన్నవి అని గుర్తుపెట్టుకుని ఇక్కడి ఆదివాసీల ప్రాణాలతో వ్యవహరించమని అధికారులు వారికి శిక్షణనిచ్చి ఊళ్ళలో దింపారు.

ప్రతి ఏడాది ‘అనారోగ్యాల సీజన్’లో ప్రతి కుటుంబానికి ఆహార భద్రతపథకం కింద అప్పుపై ఆహారధాన్యాలను అందించాలి. ఇలా మరికొన్ని సూచనలతో దాఖలుచేసిన పిటిషన్పై విచారణను కమీషన్ సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ప్రస్తుత సీజన్లో మరణాలను ఆపేందుకు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని మేం కోరగా, కమిషన్వారు రెండు ప్రధానమైన అంశాలను మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. రక్షిత మంచినీటి సరఫరా, ఊళ్ళలో చెత్తకుండీల ఏర్పాటుకోసం వచ్చిన ఈ రెండు ఆదేశాలను తీసుకుని, పాడేరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ) ప్రాజెక్టు అధికారి శ్రీ శరత్ను కలిసి, వీటి అమలు కోసం విజ్ఞప్తి చేశాం. వీటితోపాటు మా సూచనలన్నిటినీ తమ ‘యాక్షన్ ప్లాన్’ లో చేర్చుకుంటామని పి.ఒ. హామీ ఇచ్చారు.

మొత్తంమీద ఈ ఏడాది పాడేరు ఏజన్సీ ప్రాంతంలో మరణాలు గరిష్టం తగ్గాయి. ఈ తగ్గడం రెండు రకాల సంతృప్తినిచ్చింది.
1. మరణాలు తగ్గి, ఆదివాసీలలో మానసిక స్తబ్దత తొలగే అవకాశం ఏర్పడింది.
2. ఇక్కడ ఏటా జరుగుతున్న మరణాలు ప్రకృతి వైపరీత్యం కాదని, ‘అదికారుల’నే మనుషుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని, ఈ మనుషులు సరిగా పనిచేస్తే చాలామంది మనుషుల జీవితాలు నిలబడతాయని తేటతెల్లమైంది.

ఇక్కడి గత పరిస్థితిని, ఈ ఏడాది వచ్చిన మార్పును ఆకళింపు చేసుకున్న రాష్ట్ర మానవహక్కుల కమిషన్, స్వయంగా పాడేరులో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని ప్రకటించి, సెప్టెంబర్ 28 న ఈ హియరింగ్ ను నిర్వహించారు. ఎవరూ ఊహించని రీతిలో ఆదివాసీలు, వారి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రతినిధులు, స్థానికంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు భారీ సంఖ్యలో తరలివచ్చి కమిషన్ ఎదుట తమ వాదనలను వినిపించగా, పాత్రికేయులు కూడా ఇక్కడి మానవ హక్కుల ఉల్లంఘనను కమిషన్కు వివరించారు. తాము ఈ ఏడాది మరణాలను ఏ విధంగా అరికట్టిందీ అధికారులు వివరించారు.

కమిషన్ తన తీర్పును త్వరలో వెలువరిస్తానని ప్రకటించింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ ద్వారా మానవహక్కుల పట్ల ఏజన్సీ ప్రజలకు అవగాహన, మనోస్థయిర్యం చేకూరే అవకాశం కలిగిందని సంతృప్తిచెందాం.

– ఎం. ఏ. వనజ (దిశ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.