ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మూడవ భాగం

‘ఆలంకృతి’ అన్న నామధేయంతో వున్న ఆ విశాలమైన కర్మాగారాన్ని చూడ్డం ఒక ప్రత్యేకమయిన అనుభూతి.
ఆదివారం కావడంతో ఎక్కువమంది లేకపోయినప్పటికీ కొంతమంది టీనేజి అమ్మాయిలు లేసులల్లుతూ కన్పించారు. అత్యంత వొడుపుగా కదులుతోన్న వారి వేలి కొసల్లోని సృజనాత్మకత మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది.

ఎక్కువ సమయం లేకపోవడంతో హడావిడిగా ఎవరిక్కావల్సినవి వాళ్ళం కొనుక్కుని బయటపడ్డాం… అందర్నీ బాగా ఆకర్షించినవి ‘సెల్ బ్యాగ్స్’.

పద్దెనిమిది వందల డెబ్బయిలో ఒక డెన్మార్క్‌ లేడి నర్సాపురం వచ్చిందట. ఆవిడ చాలాబాగా లేసులల్లేదట… ఆమె తన చుట్టుపక్కలున్న స్త్రీలందరికీ లేసులల్లడం నేర్పి… నాలుగు రాళ్ళు సంపాదించుకునే మార్గం చూపిందట. నర్సాపురం చుట్టుపక్కల పది, పన్నెండు గ్రామాల స్త్రీలు ఈ కళలో ఆరితేరినవారనీ… ఎక్కడో చదివిన విషయం పదే పదే జ్ఞప్తికొచ్చింది…
మేము నర్సాపురం వై.ఎన్ కాలేజికి చేరుకునేటప్పటికి సరిగ్గా పదకొండయింది.. అది మేమా ప్రిన్సిపాల్ గారికిచ్చిన టైము… ఎక్కడా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు ప్రాంప్ట్ గా ఒక మిలిటరీ మేన్‌లా మమ్మల్ని నడిపించిన సత్యవతికీ.. ఆమెతో సహకరించిన మా బృందానికీ కూడా నిజంగా అభినందనలు చెప్పుకోవాలి…

మేము వై.ఎన్ కాలేజికి చేరుకునేటప్పటికి అక్కడి ప్రిన్సిపల్, డైరెక్టరు, ఉమెన్స్ సెల్వాళ్ళు మాకోసం ఎదురుచూస్తున్నారు…

‘స్త్రీవాద సాహితీమూర్తులకు స్వాగతం’ అన్న బ్యానర్తో వాళ్ళు స్వాగతం పలకడమే కాకుండా… ఆదివారమైనా కూడా అనేకమంది విద్యార్థినుల్ని అక్కడ చేర్చడం మరింత బావుంది…
మా బృందమంతా కూడా వేదికమీద ఆశీనులమయ్యాం… విజయవాడ నుండొచ్చిన శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రమీల, అనూరాధ… యింకా గిరిజ, గీత, భూమిక స్టాఫ్ ప్రసన్న, లక్ష్మి, మంజుల, సుమలత వంటి వాళ్ళంతా మేము రచయిత్రులం కాదుగదా అంటూ వెళ్ళి ఆడియన్స్ లో కూర్చున్నప్పటికీ అనంతరం వారిని కూడా వేదికమీదికి పిలవడం జరిగింది…

ఆ కాలేజీలోనే పనిచేస్తోన్న మహేశ్వరి (లెక్చరర్) చాలా సహజమయిన కవితా ధోరణితో మమ్మల్నంతా స్వాగతించింది… ఆమె నోటినుండి జాలువారిన కవితా ఝరికి అందరం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. ఈ సాహిత్య సభకి కొండవీటి సత్యవతి అధ్యక్షత వహించి తుదివరకు అత్యంత ఉత్సాహంగా నడిపించింది.

ఆ తర్వాత తెలుగు అధ్యాపకులు నారాయణరావుగారు మాట్లాడుతూ మళ్ళీ మా అందరికీ స్వాగతం పలికి సావిత్రి వ్రాసిన ‘పాఠం ఒప్పచెప్పకపోతే…’ అంటూ ‘బందిపోట్లు’ కవితని తొలి… తొలి స్త్రీవాద కవితగా గుర్తుచేస్తూ అంతకు ముందు 60ల్లో స్త్రీలు నవలలు వ్రాసినప్పటికీ అవన్నీ కూడా పేలవమయినవనీ అవన్నీ పొట్లాలు కట్టుకోవడానికుపయోగ పడ్డవేనన్నట్టుగా అన్నారు…

అందుకు పి. సత్యవతి స్పందించి
“అరవయిల్లో అంటే ఒకానొక స్టేజ్లో వ్యవసాయం మీదొచ్చిన సర్ప్లష్ని పత్రికా వ్యాపారంలో పెట్టి వాటికోసం ప్రత్యేకంగా స్త్రీలతో రచనలు చేయించి… వాళ్ళు వ్రాసినవన్నీ కూడా ప్రింట్ చేసేసి పాఠకులకీ, స్త్రీలకీ చదివే గుణాన్ని నేర్పారు. దానివల్ల నష్టంలేదుగానీ మొదట్నుండీ కూడా పురుషమయమైపోయిన సాహిత్యం ఇలా వ్యాపారంకోసం వ్రాస్తూ వచ్చిన స్త్రీలని ఎద్దేవా చేయడమే బాధాకరమైన విషయం” అని అన్నారు.

స్త్రీవాదమంటే పురుషద్వేషమేమీ కాదనీ.. కుటుంబం తమకి చేస్తోన్న కీడుని గుర్తించి తమ గౌరవాన్ని తాము నిలుపుకుంటూ తాము చేయాలనుకున్నది చేయడం… చేయగలగడం.. అంటూ యివ్వాళ చురుగ్గా వ్రాస్తోన్న స్త్రీవాద రచయిత్రులందరినీ పేరుపేరునా… వారి వారి కథలనూ కవిత్వాన్నీ, నవలలనూ కూడా కోట్ చేస్తూ చెప్పారు.. ఆవిధంగా స్త్రీవాద రచయిత్రులందరినీ ఒక మేరకు పరిచయం చేసినట్టయింది…

అనంతరం అనిశెట్టి రజిత కథా సంపుటి ‘మట్టిబంధం’ను డా|| సత్యనారాయణరావు గారు ఆవిష్కరించారు… శారదా శ్రీనివాసన్గారు మాట్లాడారు… కథా సంపుటి కంటే కూడా రజిత వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చెప్పి ఆమె జీవితంలో నుండి తాను స్వయంగా చూసినవే వ్రాస్తుంది కాబట్టి అత్యంత సహజంగా వచ్చాయి ఈ కథలు అంటూ ఒకటి రెండు కథలని గురించి కొంత వివరంగా మాట్లాడారు.

సభలోని వారంతా శారదా శ్రీనివాసన్‌ని రేడియో నాటకాల్లోని కొన్ని డైలాగుల్ని చెప్పమని కోరితే ఆమె నవ్వుతూ ‘ చేతిలో పేపరుంటే తప్ప మాట్లాడ్డం రాదండీ’ అంటూ.. కొన్ని కొన్ని గుర్తున్న డైలాగుల్ని, విషయాలనీ చెప్పి సభికుల్ని అలరించారు.. శారదా శ్రీనివాసన్ వాగ్ధాటి మరోసారి అందర్నీ ముగ్ధుల్ని చేసింది…

ఆరోజుల్లో కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు, పాలగుమ్మి, రజనీకాంతారావు వంటి వార్లతో కలిసి గడిపే అవకాశం దొరకడం నిజంగా అదృష్టమనీ, భువన విజయంలా వుండేదనీ ఆమె ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

రజిత పుస్తకం మీద కొండేపూడి నిర్మల మాట్లాడుతూ సజీవమైన భాషలో వ్రాసే రజిత మంచి సామాజిక కార్యకర్త… రజిత పాటలు పాడుతుంది… కవిత్వం వ్రాస్తుంది.. రజిత కవిత్వంలో తను వ్రాసిన వస్తువులు చూస్తే చాలా బావుంటాయి.

స్త్రీవాదం అంటే?… ప్రపంచం మొత్తం పురుషులమయం. మరి స్త్రీలేమిటి?… నేను ఒక కవిత వ్రాస్తున్నపుడు నాకు నచ్చివుండాలి… అంతేకానీ నా యింట్లో మగవాడికి నచ్చాలి అనికాదు… లేబర్ రూం వంటి కవితలు వ్రాసినపుడు మామీద చాలా దాడులు జరిగాయి. మా రచనలతోనే.. మా కవిత్వంతోనే తిరిగి వారికి జవాబు చెప్పగలిగాం. స్త్రీవాదం గురించీ, స్త్రీల పరిస్థితి గురించీ విద్యార్థినులకు తప్పకుండా తెలియాలి. వీలయితే సిలబష్లో పెడితే బావుంటుంది. అంటూ రజిత కథలు ‘గాజులు’ ‘బ్యూటీ పార్లర్’ గురించి వివరించారు… చెత్తకుండీలో బిడ్డ దొరికితే ‘కసాయితల్లి’ అనే అంటారు కానీ దానిక్కారణమైన తండ్రిని అనరు… మగాళ్ళు గొడవల్లో ‘మా చేతికి గాజులు తొడుక్కుని కూచోలేదు’ అంటారు… భాష కూడా ఒక్కొక్కసారి మనల్ని ఎంతో అవమానిస్తుంది… అపుడు మన ఆభరణాల్ని ద్వేషించాలా? లేక పురుషుల్ని ద్వేషించాలా కన్‌ఫ్యూజన్…’ అంటూ నిర్మల స్త్రీవాదంతో రజిత కథలను కలుపుకుంటూ చాలా చక్కగా మాట్లాడారు.

ఆ తర్వాత రామలక్ష్మి మాట్లాడుతూ ‘ మట్టిబంధం’ ముఖచిత్రాన్ని వివరించింది… ఈ సంపుటిలోని రెండు మూడు కథలు స్వీయానుభవాలని సూచిస్తున్నాయని అన్నారు. పిమ్మట రజిత తన స్పందనని తెలియజేస్తూ మంచి పాటపాడింది స్నేహంమీద…

ఆ తర్వాత ఇంతకు ముందే ఆవిష్క్పుతమైన శిలాలోలిత పుస్తకం ‘కవయిత్రుల కవిత్వంలో మనోభావాలు’ కూడా మరోసారి ఆవిష్కరించబడింది… జి.వి.కె రమణారావుగారు ఆవిష్కరించారు…
ఆడియన్స్ నుండి చాలామంది స్త్రీవాదం మీద, స్త్రీల రచనలమీద తమ తమ అభిప్రాయాలనూ, సూచనలనూ, ప్రశ్నలనూ కూడా సంధించారు…

కాలేజీలో చదువుతోన్న విద్యార్థినులు కూడా తెలుసుకోవాలన్న కోరికతో రకరకాల ప్రశ్నలడగడం మమ్మల్నెంతో ఆనందపరిచింది…

రచయిత్రులంతా కూడా విడివిడిగా మాట్లాడుతూ సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సూచించారు…
కె.బి.లక్ష్మి మాట్లాడుతూ ‘ఇలా స్త్రీవాద రచయితలతో విద్యార్థినులకు ఇంటరాక్షన్ కల్పించడం చాలామంచి పద్దతి అనీ… పుస్తకం మంచి స్నేహితుడు, మార్గదర్శి అనీ… చదువుల ఒత్తిడి ఎక్కువయిన ఈ రోజుల్లో పుస్తకాలు చదవడానికి విద్యార్థులకు తీరిక దొరకడం లేదనీ, అయినా టైమ్ మేనేజ్మెంట్ చేసుకుని చదవాలనీ అధ్యయనం మూలంగా అనేక సమాజ పరిస్థితులని తెలుసుకునే అవకాశం వుంటుందనీ’ అన్నారు.

విష్ణుప్రియ ‘కదలిరండి వనితలారా’ అన్న పాట పాడి సభకి ఒక ఊపుని తెచ్చింది…

ఎస్. జయ మాట్లాడుతూ ‘ఇక్కడి వాతావరణాన్నంతా చూస్తుంటే నాకు గొప్ప ఈర్ష్యగా వుంది. నేను రాయలసీమనుండి వచ్చాను.. అక్కడ నీళ్ళు లేవు. అన్ని రకాలుగా చాలా వెనుకబడి వుంది రాయలసీమ… అంటూ రాయలసీమలోని వెనుకబాటుతనాన్ని ఆ వెనుకబాటుతనానికి కారణమైన కరువుగురించీ… ఫ్యాక్షనిజం పూర్వాపరాలు.. సినిమాలలో ఫ్యాక్షనిజాన్ని ఘోరంగా చిత్రీకరిస్తోన్న తీరు గురించీ చాలా బాధగా మాట్లాడారు…

సుజాతా పట్వారీ ‘మాయింటికి అమ్మ వచ్చిందంటే పండగ వచ్చినట్లే’ అన్న కవిత చదివి విన్పించారు.

మందరపు హైమవతి మాట్లాడుతూ స్త్రీవాదం అంటే పురుషద్వేషం కాదనీ… స్త్రీలు కూడా పురుషులతో సమానమేనని చెప్పడమే.. విజయవాడలో శ్రీలక్ష్మి హత్య… మరో 10 వ క్లాసమ్మాయిని హత్యచేసి పంటపొలాల్లో పడేయడం వంటి దారుణమైన చర్యలు చేస్తూ ఏం చేసినా ఫర్వాలేదనే నిబ్బరంతో మగవాళ్ళు వున్నారని అన్నారు.

డా|| సమతారోష్ని మాట్లాడుతూ ‘మగవాళ్ళ ఆటిట్యూడ్ మారాలి చెయ్యి చెయ్యి కలపండి యుద్ధం చేయండి… అంటూ చిన్నపిల్లలు కూడా రేప్‌కి గురవుతోన్న తీరుని విమర్శించారు.. చాలాసార్లు ఎన్నెన్నో విషయాలు వ్రాయాలన్పిస్తుంది… కానీ వ్రాయలేకపోతున్నానన్నారు…’
(కానీ ఈ ట్రిప్ అయిన వెంటనే వచ్చిన ‘భూమిక’లో డా|| సమతారోష్ని అతిధి సంపాదకీయం అద్భుతంగా వుంది…మీరంతా చూసే వుంటారు.)

కల్పన ‘నేనొక వరూధిని’ అన్న కవిత చదివి విన్పించారు…

నాగలక్ష్మి ‘నేనొక విధిని… సాగిపోయిన నదిని’ అన్న కవిత చదివి విన్పించారు…
చంద్రలత మాట్లాడుతూ ‘నాకు నదులంటే చాలా యిష్టం… నదుల గూర్చి స్టడీ చేస్తున్నాను…

ప్రపంచంలోని నదులన్నీ నాలోనే వున్నాయి.. హరిత విప్లవ పితామహుడు ‘నార్మన్ బొర్లాగ్’ మా యింటికి వచ్చారు. అలాంటి వాతావరణంలో పుట్టాను నేను. మా ముందువాళ్ళు దుక్కి దున్ని చదును చేస్తే మేము విత్తనాలు చల్లాము… రేపు మీరు పంటలు పండించాలి అంటూ విద్యార్థినులను కోరారు.

 

<<  రెండవభాగం  ( 1 2 3 4 5నాలుగవ భాగం  >>

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.