బాలికా దినోత్సవం… భూమిక టీమ్‌

జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం జరుపుకునే రోజు. గత నాలుగైదు సంవత్సరాలుగా నవంబరు 14 పిల్లల దినోత్సవానికి తోడు ప్రత్యేకంగా బాలికల కోసం ఒక దినాన్ని కేటాయించి ఏవో కొన్ని కార్యక్రమాలను జాతీయ స్థాయిలో జరుపుతున్నారు. దేశంలో ప్రమాదకరంగా దిగజారుతున్న బాలికల సంఖ్యను (1000 మంది బాలురకు 914 మంది బాలికలు) బాలురతో సరిసమానం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన ”బేటీ బచావో-బేటీ పడావో” ప్రచారం అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా ప్రతి క్షణం దేశంలో ఎక్కడో ఒకచోట స్కానింగ్‌ ద్వారా ఆడపిల్ల అని నిర్థారించుకుని నిర్దాక్షిణ్యంగా అబార్షన్‌లు చేసి ఆడపిండాలను హత్యలు చేస్తున్నారు. ఈ అంశం మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షల్ని నిషేధిస్తూ చేసిన పి.సి.పి.ఎన్‌.డి.టి. చట్టం అమలులో ఘోరంగా విఫలమైంది. ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా వేలాదిమంది బాలబాలికల్ని బాలకార్మిక కూపాలనుంచి రక్షిస్తూనే ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిరాటంకంగా సాగిపోతోందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ”ఆపరేషన్‌ స్మైల్‌”లో దొరుకుతున్న వేలాదిమంది పిల్లలు.

ఇంక బాల్య వివాహాల సంగతి చెప్పనక్కర్లేదు. నూట ఏభై ఏళ్ళ కింద గురజాడ మహాకవి రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మలు – ఇంకా ఇంకా కన్నీళ్ళ పర్యంతమై నవవధువులై సంసార సాగరంలోకి తోసివేయబడుతున్నారు. ముక్కుపచ్చలారని పసిమొగ్గలు పెళ్ళిపీటలనే బలిపీఠాలనెక్కుతూనే ఉన్నారు. 12, 13 ఏళ్ళ పసిప్రాయంలో, బాల్యం వీడకుండానే భార్యలై, తల్లులై బతుకు బండిని భారంగా లాగుతున్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం చాలాసార్లు ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల రొంపిలో చిక్కడిపోతున్నారు.

‘అష్టవర్షాత్‌ భవేత్‌ కన్య’ అని మనువు రాసిన వికృత రాతని బుర్రల్లోకి చొప్పించుకుని పితృస్వామ్య భావజాలంతో బాల్యవివాహాలని సీరియస్‌గా పట్టించుకోకుండా చూసీ చూడనట్లు నటించడం వల్ల ఆధునిక సమాజంలో కూడా బాల్య వివాహాలు యధేచ్చగా, చట్ట భయం లేకుండా సాగిపోతున్నాయి. పాలనా యంత్రాంగం పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పనిచేసినట్లయితే, ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను కఠినంగా అమలు చేసినట్లయితే భారతదేశం నుంచి ఎన్నో సమస్యలు కనుమరుగై ఉండేవి. ముఖ్యంగా బాలికల హక్కులను పణంగా పెడుతున్న బాల్య వివాహాలు ఆగిపోయేవి. చట్టాలున్నాయనే అవగాహనను, బాల్య వివాహాల దుష్ప్రభావాల గురించి చేయాల్సిన స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల యధేచ్చగా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి.

పై నేపథ్యంలోంచి ఆలోచించి భూమిక తెలంగాణలో అన్ని విధాలుగాను అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద్ద మండలాల్లోని 110 గ్రామాల్లో బాల్య వివాహ నిరోధంపై విస్తృత స్థాయిలో పనిచేయాలని నిర్ణయించాం. 2015లో మద్దూరులో భూమిక క్షేత్రస్థాయి కార్యాలయం నెలకొల్పి సిబ్బందిని కూడా నియమించాం. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలిన్నింటిలోను పెద్ద ఎత్తున బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్గించాలని, బాల్య వివాహాలను ఆపాల్సిన ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనిచేస్తూ వారికీ అవగాహన కల్గించాలని నిర్ణయించుకున్నాం. పాఠశాలలకు వెళ్ళి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించాలని సంకల్పించుకున్నాం. ‘బాలదండు’నేర్పరిచి గ్రామాల్లో వారి ద్వారా అవగాహన కల్పించాలని భావించాం.

గత సంవత్సర కాలంగా ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతున్నాయి. తొమ్మిదో తరగతి సోషల్‌ పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ప్రచురించిన భూమిక హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఇప్పటికే చాలామంది పిల్లలకు తెలుసు. పిల్లలే చాలాసార్లు బాల్య వివాహాల ఆచూకీని హెల్ప్‌లైన్‌ ద్వారా మాకు తెలియచేశారు. ఇప్పటికి దాదాపు 125 బాల్య వివాహాలను జరగకుండా అడ్డుకోవడం, వాయిదా వేయించడం చేయించగలిగాం. మద్దూరు, దామరగిద్ద మండలాల్లోనే కాక సమీప మండలాల్లో కూడా హెల్ప్‌లైన్‌ విస్తరించింది.

ఈ స్ఫూర్తితో జనవరి 24 బాలికల దినోత్సవం సందర్భంగా మొత్తం భూమిక టీమ్‌ అంతా మద్దూరుకు తరలివెళ్ళి బాలికల దినోత్సవాన్ని జరపాలనుకున్నాం. 23 రాత్రి రెండు వాహనాల్లో ఇరవై మందిమి సర్దుకుని మద్దూరు బయలుదేరాం. మద్దూరులో ఉన్నది చిన్నపాటి కార్యాలయం. భోజనాలు చేసి రెండు రూముల్లో అందరం కలిసి పడుకున్నాం. టీమ్‌ అందరికీ అదొక అద్భుత అనుభవం. రాత్రంతా నవ్వులతో, కబుర్లతో ఆఫీసు మారుమోగింది. ఉన్న రెండు బాత్‌రూమ్‌లలో ఇరవై మంది స్నానాలు చెయ్యాలి. 7 గంటలకల్లా దామరగిద్ద వెళ్ళిపోవాలి. అందరూ పోటీలు పడి తెల్లవారి 4 గంటల్నుండే లేచి తయారై ఏడింటికల్లా వాహనాల్లో ఎక్కేసారు.

దామరగిద్ద మండలంలోని ‘బాపనపల్లి’ గ్రామంలో మా పాదయాత్ర మొదలైంది. మా కోసం ఎదురుచూస్తున్న బాపనపల్లి సర్పంచ్‌, గ్రామ పెద్దలు మాతో కలిసి నడిచారు. పిల్లల్ని తీసుకుని టీచర్సొచ్చారు. అందరం కలిసి నినాదాల హోరుతో, ప్లకార్డుల ప్రదర్శనతో గ్రామమంతా తిరిగాం. గ్రామస్తులు మాతో నడిచారు. పిల్లలు నాయకత్వంలోకి వచ్చి అద్భుతంగా నినాదాలిచ్చారు. ‘పెళ్ళికెందుకు తొందర… చదువుకో ముందర’, ‘పెద్దలు పనికి పిల్లలు బడికి’ లాంటి నినాదాలను బిగ్గరగా ఇస్తూ గ్రామంలో నడిచారు. ఆ ఊరి సర్పంచ్‌, గ్రామాధికారులు చాలా సహకరించారు. మా గ్రామంలో బాల్యవివాహాలు చేయించం, జరగనీయం, బాల్య వివాహానికి వెళ్ళం అంటూ వాగ్దానాలు చేశారు. బాలికల్ని రక్షిస్తాం, గౌరవిస్తాం అని మాటిచ్చారు.

ఆ తర్వాత మద్దూరు మండలంలోని మొమినాపూర్‌ గ్రామానికి మా దండు తరలింది. ఆ గ్రామంలో కూడా అదే స్థాయిలో ప్రచారం చేసి, పిల్లల నాయకత్వంలో నినాదాల హోరులో గ్రామమంతా తిరిగాం. పిల్లలతో మాట్లాడించాం. పెద్దలతో వాగ్దానాలు చేయించాం. బాలికల్ని గౌరవిస్తాం, వారికి విలువిస్తాం అంటూ అందరూ మాటిచ్చారు. ఊరి గోడల మీద రాయించిన హెల్ప్‌లైన్‌ నంబర్‌కి కాల్‌ చేసి బాల్య వివాహాల సమాచారం ఇవ్వాలని అందరినీ కోరాం. పిల్లల్ని తీసుకుని వచ్చిన

ఉపాధ్యాయులను తమ తమ విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లల బాల్యవివాహాల వివరాలు/ఫిర్యాదులు సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరాం.

బాలికా దినోత్సవాన్ని ఘనంగా పిల్లలతో సెలబ్రేట్‌ చేసుకుని, బాలికల రక్షణ పట్ల, బాల్యవివాహాల పట్ల అవగాహన కలిగించి మరిన్ని గ్రామాల్లో ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా చెయ్యాలని నిర్ణయించుకుని నగరానికి తిరుగు ప్రయాణమయ్యాం. అర్థరాత్రి అయిపోయినా, అలసిపోయినా సరే అందరం గొప్ప తృప్తితో… ఒక సామూహిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఇళ్ళకు చేరాం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.