రుద్రమదేవి భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

ఈ సతీరత్నం ఆంధ్రదేశంలోని ఓరుగల్లు రాజ్యాన్ని ఎంతో చక్కగా ఏలిన శూరవనిత. ఈమె కాకతీయ గణపతిరాజు భార్య. దేవగిరి రాజు కూతురు. రుద్రమదేవి తన భర్త మరణానంతరం క్రీ.శ.1257వ సంవత్సరం నుండి 1295వ సంవత్సరం వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లు దానశాసనాలవలన, చరిత్రకారులు వ్రాసినదాని వలన స్పష్టంగా తెలుస్తోంది. సోమదేవరాజేయములోను రుద్రమదేవి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లు ఈ క్రింది పద్యంలో చెప్పబడింది.

గీ. ఆయనకు నప్పగించు యయ్యమ్మ యట్లు

బుధజనంబులు ప్రజలును బొగడ నవని

ముప్పదియు నెన్మిదేడులు మోద మొదవ

నేవి కైలాసశిఖిరి నేగుటయును.

కాకతీయ గణపతి మరణానంతరం అతని భార్య అయిన రుద్రమదేవి దుఃఖసముద్రంలో మునిగి ఉంది. అప్పుడు మంత్రి అయిన శివదేవయ్యగారి హితవచనాల వలన దుఃఖాన్ని మరచి రాజ్యానికి వారసులెవ్వరూ లేకపోయినా కూతురైన ఉమ్మక్కకు కలిగే సంతానమే సింహాసనం ఎక్కడానికి అర్హులని కొంత మనసును సమాధానపరచుకుని రాజుయొక్క ఖడ్గాన్ని, ముద్రికను సింహాసనమందుంచి శివదేవయ్య సహాయంతో రుద్రమదేవి రాజ్యం చేయసాగింది. ఆమె రాజ్యం ఎంతో యోగ్యంగా చేసిందని చెప్తారు. అప్పుడామె ఓరుగల్లు చుట్టూ మూడు నాలుగు ప్రాకారాలు గల కోటను శత్రువులకు అభేద్యమైనట్లుగా కట్టి దానికి తగిన చోట్ల సైన్యాన్ని ఉంచింది. అందువలన ఆ రాజ్యాన్ని గెలవటం చాలా కష్టమని ఇతర రాజులు భయపడుతుండేవారు. ఇదిగాక రుద్రమదేవి చేసే న్యాయ పరిపాలన వలన ప్రజలు ఆమె రాజ్యమే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుండేవారు.

ఈమె తన రాజధానిలో అనేక చెరువులను త్రవ్వించింది. సత్రాలు కట్టించి ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యాలను చేసింది. బీద బ్రాహ్మణులకు బంగారపు కొమ్ములుగల ఆవులను అనేకం దానమిచ్చింది. అనేక దేవస్థానాలు కట్టించి వాటన్నింటికి వృత్తులను ఏర్పరచింది.

ఒకసారి రుద్రమదేవి ఉమ్మక్కతోపాటు మొగలిచెర్లకు పోయి అక్కడి వీరాశక్తిని పూజిస్తూ ఐదు రోజులు అక్కడే

ఉంది. అప్పుడామె పైకి హరహరదేవుడు, మురారి తిరగబడగా వారినప్పుడు సామంతులు తమతో చేర్చుకున్నారు. ఆ తర్వాత రుద్రమదేవి ఓరుగల్లు కోటకు వచ్చి, హరిహరుడు, మురారి చేసిన కపటాన్ని తెలుసుకుని తమ సైన్యాన్ని పంపి వారిపై గెలిచి వారందర్నీ హతమార్చింది.

తదనంతరం ఆమె కొన్ని రోజులు సుఖంగా రాజ్యం చేసిన పిదప, దేవగిరిరాజు దళాలతో వచ్చి ఓరుగల్లుని ముట్టడించాడు. అది చూసి రుద్రమదేవి ఎంత మాత్రం జంకక, పరమేశ్వరుడ్ని తలచుకుని మహా రౌద్రంతో పగవారిని ప్రతిఘటించి పోరాడి వారి బలగాలను బలహీనపరచింది. దాంతో వారు కూడా యుద్ధాన్ని విడిచి నాలుగు దిక్కుల పారిపోతుండగా రుద్రమదేవి వారిని పోనివ్వక దేవగిరి వరకు తరిమింది. వారు రుద్రమదేవి శౌర్యానికి ఆశ్యర్యపడి, కోటి రూపాయలను ఆమెకిచ్చి శరణాగతులై తమ దేశానికి పోయారు. అంతట రుద్రమదేవి జయవాద్యాలు మ్రోగుతుండగా తన నగరానికి తిరిగొచ్చి సైనికులకు తగిన బహుమతులిచ్చింది.

తర్వాత ఆమె కూతురు ఉమ్మక్క గర్భం దాల్చింది. అది తెలిచి రుద్రమదేవి అమితానందభరితురాలై పుంసవనం మొదలైన సంస్కారాలను చేసి వినోదాలతో కాలం గడుపుతుండేది. ఇలా ఉండగా ఉమ్మక్కకు పదినెలలు నిండాక శాలివాహన శకం 1166వ సంవత్సరమైన నందన సంవత్సర చైత్ర శుద్ధ గురువారంనాడు ఉదయం ఒక కొడుకు పుట్టాడు. రుద్రమదేవి ఆ బాలకునికి స్నానం చేయించి సింహాసనంనందు పడుకోబెట్టి పౌరులను, సామంతులను పిలిచి వారందరికీ ఇతడు మీ ప్రభువని తెలిపింది. వారు కూడా మిక్కిలి సంతోషించారు. తదనంతరం ఆమె పుత్రోత్సాహంతో అనేక దానధర్మాలు చేసింది. బాలునికి నామకరణం చేసే రోజున శివదేవయ్య పూజ్యురాలైన రుద్రమదేవి పేరును ఆ బాలునికి పెట్టదలచి ప్రతాపరుద్రుడని నామకరణం చేశాడు తదనంతరం ఆ బాలకుడు దినదిన ప్రవర్థమానుడై శివదేవయ్య ద్వారా సకల విద్యలను అభ్యసించసాగాడు. ఈయన తర్వాత ఉమ్మక్కకు మరొక పుత్రుడు కలిగాడు. అతనికి అన్నమదేవుడని పేరు పెట్టారు.

రుద్రమదేవునికి గర్భాష్టకాన ఉపనయనం చేసి విద్యలన్నీ నేర్పి రాజ్యం అతనికిమ్మని శివదేవయ్యకి అప్పగించి క్రీ.శ.1295వ సంవత్సరంలో రుద్రమదేవి స్వర్గస్థురాలైంది. ఈమె మన ఆంధ్రదేశానికి శిరోరత్నమని చెప్పడానికి ఎంత మాత్రమూ సంశయం లేదు. ఇటువంటి వారుంటారని ప్రత్యక్ష ప్రమాణాల వలన తెలిసి కూడా మనవారు స్త్రీలను హీనంగా చూడటం ఎంతో శోచనీయం.

 

 

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.