‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌’

గౌరీ లంకేష్‌ని భౌతికంగా నిర్మూలించిన పిరికివాళ్ళకి ఆమె భావాల వ్యాప్తిని నిర్మూలించలేమని అర్థమవ్వాలి. ”నేను గౌరీని” అని నినదించిన లక్షలాది ప్రజల మనసుల్లో అమె మమేకమైపోయింది. అదే గౌరి సాధించిన విజయం. గౌరి లంకేష్‌ తన పత్రికలో రాసిన చిట్టచివరి సంపాదకీయం భూమిక పాఠకుల కోసం – ఎడిటర్‌

ఈ వారం సంచికలో భారత్‌లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఒక వ్యాసం రాశారు. గోబెల్స్‌ దారిలో వెళ్తున్న ఆ అబద్ధాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటివల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను – గౌరీ లంకేష్‌.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా సంఘ్‌ పరివార్‌ ఒక పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేశ్‌ విగ్రహాలను ఎక్కడెక్కడ ప్రతిష్టించాలో కర్నాటక (కాంగ్రెస్‌) ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రూ.10 లక్షలు చెల్లించాలి, ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, ఇతర మతస్థుల నివాసాలు లేని ప్రాంతాల దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి, టపాసులు కాల్చేందుకు అనుమతించరు… ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌). కర్నాటక పోలీస్‌ చీఫ్‌ ఆర్‌.కె.దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని ఆయన స్పష్టం చేశారు. దాంతో, అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వవాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌’ వెబ్‌సైట్‌ ‘కర్నాటకలో తాలిబన్‌ పాలన’ అంటూ ఒక అబద్ధపు వార్తను సృష్టించింది. గణేశ్‌ చతుర్ధి సందర్భంగా కర్నాటక ప్రభుత్వం అనుచిత నియమాలను ఏర్పాటు చేసిందన్నది సారాంశం. ఈ అబద్ధాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయడంలో సంఘీయులు విజయం సాధించారు. మరే కారణంగానో సిద్ధరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో ఉన్న వారు ఈ అబద్ధపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయమేమిటంటే… ప్రజలు తమ

కళ్ళు-చెవులు మూసుకుని, బుర్రకు ఏ మాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండా ఇదే వాస్తవమని భావించారు.

లైంగిక దాడి కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ గత వారం కోర్టు తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా ఆయనతో చాలా మంది బీజేపీ నేతలు కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రధాని మోడీతో సహా, హర్యానాకు చెందిన బీజేపీ మంత్రుల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. దాంతో… బీజేపీ, సంఘ్‌ పరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. అందుకు కౌంటర్‌గా సీపీఐ (ఎం) నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గుర్మీత్‌తో కలిపి ఓ ఫోటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికితీయగా అది గుర్మీత్‌తో కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ దిగిన ఫోటో అని తేలింది. ఫోటోషాప్‌ ద్వారా చాందీ తల స్థానంలో విజయన్‌ తల వుంచి సృష్టించిన నకిలీ ఫోటో అని స్పష్టమైంది. హిందూత్వ వాదులకు చెందిన సోషల్‌ మీడియా నిపుణులు చాందీ ఫోటో స్థానంలో విజయన్‌ ఫోటోను చేర్చి ప్రచారంలో పెట్టారు. దానికి బదులుగా అసలు ఫోటోను కొందరు వెంటనే వెలుగులోకి తేవడంతో సంఘ్‌ పరివారం బండారం బయటపడింది.

హిందూత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకూ సరైన కౌంటర్‌ ఇచ్చినవాళ్ళు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుం బిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా, ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

ఉదాహరణకు ఆగస్టు 17వ తేదీన ధృవ్‌ రాధీ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్ధాలను ఎత్తిచూపే వీడియో ఇది. మోడీ చెప్తున్న అబద్ధాలను రాధీ గత కొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు.

ప్రారంభంలో కొద్దిమంది మాత్రమే రాధీ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. ‘యూ ట్యూబ్‌’లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల క్రిందట ‘బుజి బుజియా’ (అబద్ధాల కోరు అని అర్థం. మోడీకి లంకేశ్‌ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే, నోట్ల రద్దు అనంతరం 91 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దీనికి ముందు పేర్కొన్నారు. ఆర్థిక సర్వే ప్రకారం కేవలం 5.4 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడు అంకెల్లో ఏవి సరైనవని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

నేడు బీజేపీ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్రశ్నించేవారు, సవాలు విసిరేవారు లేకపోవడమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ళ విషయానికొస్తే ఇందులో పది దశలున్నాయి. ఉదాహరణకు, రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనేక ఆంగ్ల వార్తా ఛానళ్ళు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటలలోపే ట్విటర్‌లో 30 లక్షల మందికి పైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది కథనం సారాంశం. కోవింద్‌ ప్రజాదరణ ఏ విధంగా పెరిగిందన్న అంశాన్ని ఛానళ్ళు రోజంతా నొక్కి చెప్తూనే ఉన్నాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జత కట్టినట్లు కనిపిస్తోంది. కథనం వెనక వాస్తవమేమిటంటే… పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ను కొత్తగా అధ్యక్ష పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన ఫాలోవర్లంతా కోవింద్‌కు బదిలీ అయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు ట్విటర్‌లో 30 లక్షల మందికి పైగా ఫాలోవర్లు వున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్ధపు ప్రచారాలకు కౌంటర్‌గా సత్యాన్వేషకులు అనేకమంది వాస్తవమేంటో చెప్తున్నారు. ధృవ్‌ రాధే తన వీడియోలతో ఈ పని చేస్తుంటే, ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌ (ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌)ను ప్రారంభించారు. ఇలాంటివే మరికొన్ని వెబ్‌సైట్లు… ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రీ, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ వార్తా పత్రికలు ఉన్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు వార్తా కథనాల గుట్టు విప్పి చెప్తున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌, కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వాళ్ళంతా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలనూ ఆశించకపోవడం గమనార్హం. వాళ్ళ లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చేయడం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టడం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగుళూరు నీట మునిగిపోయినపుడు… కర్నాటక బీజేపి ఐటి విభాగం ఒక ఫోటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది. ఆ తర్వాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దాన్ని బెంగళూరు రోడ్డుగా ధృవీకరించింది’ అంటూ ఫోటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది. భారీ వర్షాలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే ప్రయత్నమిదని స్పష్టమవుతోంది.

వాస్తవానికి ఆ ఫోటో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడడంతో పథకం బెడిసికొట్టింది.

అదేవిధంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు మతతత్వ శక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో ఉంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ళ ఫోటో. దానికింద ‘బెంగాల్‌ తగలబడుతోంది’ అని రాసి ఉంది. రెండవ ఫోటోలో అనేకమంది చూస్తుండగా ఓ పురుషుడు మహిళ చీర లాగుతున్నాడు. ఆ ఫోటో కింద ‘బదూరియాలో హిందూ మహిళలపై దాడి’ అని రాసి ఉంది. అయితే కొద్ది రోజుల్లోనే ఫోటోల వెనక దాగిన వాస్తవం బహిర్గతమైంది.

మొదటి ఫోటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 2002లో అల్లర్లు చెలరేగినప్పుడు తీసింది. రెండవ ఫోటో ఒక భోజ్‌పురి సినిమాలోనిది. ఇప్పటికీ ఉంది. ఈ ఫోటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ కూడా షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు, బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలను, కథనాలను ప్రచారం చేస్తున్నారు.

ఉదాహరణకు, ముస్లింలు త్రివర్ణపతాకాన్ని తగులబెడుతున్న ఫోటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫోటో కింద ‘గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాద్‌లో త్రివర్ణపతాకాన్ని దగ్ధం చేస్తున్నారు’ అని రాసి ఉంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫోటోను ఎప్పుడు ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా ఈ యాప్‌ను ఉపయోగించే ఆ ఫోటో ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్‌లో నిషేధిక సంస్థలు నిరసన తెలుపుతున్నప్పుడు తీసింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు, బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు కూడా సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ఆరితేరారు. ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఒక ఫోటోను షేర్‌ చేశారు. భారత్‌లోని 50,000 కి.మీ. రహదారులపై 30 లక్షల ఎల్‌ఈడీ లైట్లు కాంతులు చిమ్ముతున్నాయన్నది ఆ ఫోటో, శీర్షిక సారాంశం. అయితే, అది బోగస్‌ అని తేలిపోయింది. 2009లో జపాన్‌లోని ఓ వీథిలో తీసిన ఫోటో అది. ‘ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన’ అంటూ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి రాజేశ్‌ మునాత్‌ ఓ ఫోటోను ప్రచారంలో పెట్టారు. దానికి 2000 లైకులు వచ్చిన తర్వాత అది నకిలీదని తేలిపోయింది. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన బ్రిడ్జి. దాంతో, దానిని సోషల్‌ మీడియా నుంచి తొలగించక తప్పలేదు.

మా సొంత రాష్ట్రమైన కర్నాటకలో పుకార్లను ప్రచారం చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు ఏ మాత్రం వెనుకబడి లేరు. కర్నాటక ఎం.పి. ప్రతాప్‌ సిన్హా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రికలో ప్రచురితమైనదంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ‘ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు’ అన్నది శీర్షిక. ఆ వార్తలో వాస్తవమెంత అనేది పరిశీలించకుండానే సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు. వాస్తవానికి శీర్షికను ఫోటోషాప్‌లో మార్చి పెట్టారు. వార్తను కూడా మతపరమైన కోణంలో మలిచారు. అయితే ఆ విషయంపై కలవరం రేగడంతో ఆ ఎం.పి. ఆ అబద్ధపు వార్తను తొలగించారు. అంతకు మించి… మత విద్వేషాన్ని రెచ్చగొట్టే అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలూ చెప్పలేదు, విచారాన్నీ వ్యక్తం చేయలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఓ నకిలీ ఫోటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసిన ఫోటో. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడీ అది నకిలీదని గుర్తు చేశారు. దాంతో, గ్రహించుకుని వాస్తవ ఫోటోలను జత చేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష. చివరి మాటగా, తప్పుడు వార్తల్ని వెలికి తీసే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. అటువంటివారు చాలామందే ఉన్నారని అనుకుంటున్నా…

 

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.