మహిళా రైతుల అంశాలు ప్రధాన ఎజెండాలో ప్రతిఫలించాలి -కొండవీటి సత్యవతి 

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే

ఉండేవాడు. నారుమళ్ళు వేయడం, దుక్కిదున్నడం, నాట్లేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం ఈ పనులన్నింట్లోను మా కుటుంబంలోని ఆడవాళ్ళు పాల్గొనే వారు కాదు కానీ… మాలపల్లెలోని మహిళలందరూ తప్పనిసరిగా వెళ్ళేవారు. స్కూల్‌కి వెళ్ళే సమయంలో గుంపులు గుంపులుగా దళిత మహిళలు పొలాలవైపు కదలడం చూస్తుండేదాన్ని. నడుం ఒంచి నాట్లేయడం గమనించేదాన్ని. గమ్మత్తు ఏమిటంటే పొలాలు మా కుటుంబానివి… ఆ పొలాల్లో చాకిరీ మాత్రం దళిత కుటుంబాలది. నాట్లేసే ఆడవాళ్ళకి కట్టలందించే పని పురుషులు చేస్తారు. ఒంచిన నడుం ఎత్తకుండా చకచకా నాట్లేసే స్త్రీల శ్రమైక జీవన సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. పల్లెల్లో పుట్టిన వాళ్ళెవరూ ఈ దృశ్యాలను మిస్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. వ్యవసాయంలో మహిళలు చేసే పని అనంతమైనది, విలువలేనిది. వాళ్ళకో ఉనికివ్వనిది. వ్యవసాయం గురించి ఎవరు మాట్లాడినా, ఏ చట్టం చేసినా, ఏ విధాన నిర్ణయం చేసినా అందరి కళ్ళకు రూపు కట్టేది ఒకే రూపం. తలకి తువాలు చుట్టుకుని, పంచె కట్టుకుని, భుజాన నాగలితో కనిపించే రైతు బొమ్మే మన కళ్ళకు కనపడుతుంది. నాట్లేసే మహిళలు కానీ, కోతలు కోసే మహిళ కానీ మన ఊహల్లో కూడా రాదు. ఇన్విసిబుల్‌. కనబడదు.

మన కడుపుకింత అన్నం పెట్టే రైతన్న అంటాం కానీ, మన కడుపు నింపుతున్న రైతక్క అనం. స్త్రీలు ఇంట్లో చేసే పనికి ఎలా గుర్తింపు లేదో, మగ్గం నేసే చోట రైతన్నని గుర్తించినట్లు నేతక్కని ఎలా గుర్తించమో, వ్యవసాయంలో కూడా రైతక్క ఉనికిని చాలా సహజంగా అందరం మర్చిపోతాం. ఇది చాలా అన్యాయమైన విషయం. అసమానతల ప్రపంచంలో రైతక్కలకు జరుగుతున్న దారుణమైన అన్యాయం. నిజానికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక శాతం మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారు. సాగుదారులుగా, వ్యవసాయ కూలీలుగా లక్షలాదిమంది మహిళలు పనిచేస్తున్నారనేది అక్షర సత్యం. ఈ విషయాన్ని అనేక జాతీయ క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలుపుతున్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 65 శాతం మంది మహిళలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలుస్తోంది.

వ్యవసాయ రంగంలో ఇంత ఎక్కువ శాతం మహిళలు పనిచేస్తున్నప్పటికీ వారిలో చాలా తక్కువ శాతం మందికి మాత్రమే భూమి హక్కులున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని పంటల సాగులోను మహిళలే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది స్త్రీలు వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారతదేశం తీసుకుంటే, దాదాపు అరవై శాతం మంది స్త్రీలు వ్యవసాయ రంగంలో ఉన్నారు. అంతేకాదు పొలం పనుల్లో ముఖ్యమైన పనుల్ని మహిళలే చేస్తుంటారు. విత్తులు చల్లడం, నాట్లు వేయడం, కలుపు తియ్యడం, పంటను కోయడం లాంటి నడుం ఒంచి చేయాల్సిన పనుల్ని మహిళలే చేస్తున్నారు. నడుం ఒంచక్కర లేనివి, నిలబడి చెయ్యగలిగిన పనుల్ని పురుషులు చేస్తుంటారు. అయినప్పటికీ వ్యవసాయంలో స్త్రీల ఉనికి ప్రస్తావనకు రాకపోవడం వెనక ఉన్నది పితృస్వామ్యం తప్ప మరొకటి కాదు.

స్త్రీలు లేనిదే వ్యవసాయం లేదనేది నగ్న సత్యం. అయిష్టంగానైనా సర్వులూ ఒప్పుకోవాల్సిన నిష్ఠుర సత్యం. నేతక్క లేనిదే బట్ట నెయ్యలేనట్లే, రైతక్క లేనిదే వ్యవసాయం జరగదు. స్త్రీలు వ్యవసాయంలో ఇంత ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లేదు. స్త్రీల చేతిలో భూమి లేదు. వ్యవసాయానికి సంబంధించి నిర్ణయాధికారం లేదు. ఆదాయాల మీద ఎలాంటి అధికారమూ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో, గ్రామాల్లో పురుషులు దూర ప్రాంతాలకు పనుల కోసం వలసలు పోతున్న సందర్భంలో ఆ కుటుంబానికి చెందిన వ్యవసాయం స్త్రీల చేతుల్లోకి వస్తోంది. మన రాష్ట్రంలో, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 26 శాతం భూ కమతాలు స్త్రీల చేతుల్లో ఉన్నాయి. అయినప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లేదు.

తొంభైలలో వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, కొత్త వ్యవసాయ విధానాలు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలొచ్చాయి. వ్యాపార పంటల ఊబిలోకి దిగిన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ఆత్మహత్యల వల్ల ఆయా కుటుంబాలలోని స్త్రీలు తమ కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితుల్లోకి, అప్పు తీర్చాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. చాలాసార్లు భర్తల మరణం ద్వారా ఒదిలేసిన వ్యవసాయాన్ని తమ భుజాల మీద వేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు.

వ్యవసాయంలో ఇంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న మహిళలను రైతులుగా గుర్తించకపోవడం ఒక సమస్య అయితే వారి సమస్యలను అస్సలు పట్టించుకోకుండా మౌనం వహించడం మరో దుర్మార్గం.

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ప్రమాదకరంగా పెరిగిపోయిన నేపథ్యంలో, వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ కూడా ఉనికి లేని మహిళా రైతులు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు. భర్తల హఠాన్మరణాలతో దిక్కు తోచకపోయినా, రెక్కాడితే కానీ డొక్కాడని రైతక్కల గురించి అందరం ఆలోచించాలి. అస్తిత్వం లేని రైతక్కల రూపురేఖలు వ్యవసాయ రంగంలో ప్రస్ఫుటంగా కనబడేలా కృషి చేయాల్సిన బాధ్యత, వాళ్ళు పండించిన ధాన్యాలను అన్నం రూపంలో సుష్ఠుగా తిని తేన్చుతున్న మనందరి మీద ఖచ్చితంగా ఉంది.

ఇటీవల తెలంగాణ ప్రజా అసెంబ్లీలో మహిళా రైతుల అంశం మీద తయారు చేసిన పత్రంలో ఈ క్రింది డిమాండ్లను పొందుపరిచారు.

మహిళా రైతులకు గుర్తింపు కార్డులివ్వడం,

మహిళా సాగుదారులను గుర్తించడం,

భూమి అభివృద్ధికి మద్దతుతో సహా మహిళలకి స్పష్టమైన భూమి హక్కులు కల్పించడం

అసైన్మెంట్‌ లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక వ్యవసాయ మద్దతు ఇవ్వాలి

ఒంటరి మహిళా రైతులకు, రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలకు ప్రత్యేక మద్దతునివ్వాలి

ఆదివాసీ ప్రాంతాల్లో మహిళలకు భూమి హక్కులు

ప్రైవేటు యాజమాన్యంలోని భూములపై మహిళల హక్కులను నమోదు చేయాలి

వర్షాధారిత వ్యవసాయానికి ప్రభుత్వ విధానం, పెట్టుబడుల గురించి స్పష్టమైన ప్రకటన

సామాజిక భద్రత చర్యలు

మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు ఏర్పరచి బలోపేతం చేయాలి

జెండర్‌ బడ్జెట్లు, జెండర్‌ బడ్జెట్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

వ్యవసాయంలో మహిళా రైతుల శ్రమను తగ్గించే పరికరాలపై పరిశోధన చెయ్యాలి.

– (మహిళా రైతుల హక్కుల వేదిక, తెలంగాణ రాష్ట్ర కమిటీ)

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.