పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్న వ్యవసాయ ఉద్యమాల్లో మహిళా రైతులు! -శివలక్ష్మి

ఢల్లీి సరిహద్దులోని టిక్రీ వద్ద బలమైన ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహిస్తున్న రైతు నాయకురాలు హరీందర్‌ కౌర్‌ గురించి తెలుసుకుందాం. హరీందర్‌ కౌర్‌ మరో పేరు ‘బిందు’. ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌’ (మరో పేరు ‘సుబాఆగు’) యూనియన్‌లో

పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ఢల్లీి సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న మహిళలతో కలిసి సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు సరుకుల రవాణా, పంపిణీ పనులను చూసుకుంటున్నారు.
మంచు కురుస్తున్న ఒక శీతాకాలపు సాయంత్రం వేళ రొట్టెల కోసం పిండిని పిసుకుతున్న మహిళా నిరసనకారుల బృందం నుంచి హాస్యంతో కూడిన నవ్వుల జల్లులు కురిశాయి. అందుకు కారణం భారత అత్యున్నత న్యాయమూర్తి చేసిన ప్రకటన వారి మధ్య చర్చకు వచ్చింది.
జనవరి 11న జరిగిన విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ.బాబ్డే ‘‘వృద్ధులు, మహిళలను నిరసనకారులలో ఎందుకుంచారు?’’ అని అడిగి, వారిని వెంటనే వెనక్కి పంపమని సలహా ఇచ్చారు.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి మా ‘సుబా ఆగు’ బిందును కలిసి, మహిళలందరూ నిరసనల వద్ద ‘‘ఉంచబడ్డారా’’ లేక వారికై వారు చైతన్యంతో తరలి వచ్చారా అనే విషయం తేల్చుకోవాలి’’ అని టీ చప్పరిస్తున్న హరీందర్‌ కౌర్‌ శాంతంగా సమాధానమిస్తూ నవ్వు కొనసాగించింది. ఈసారి మహిళల నవ్వులు హోరెత్తిస్తూ మరీ బిగ్గరగా వినిపించాయి.
ఆమె తనను తాను, చుట్టూ ఉన్న కష్టజీవులైన మహిళల ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకుంది. 43 సంవత్సరాల హరీందర్‌ కౌర్‌ను అందరూ బిందు అని ప్రేమగా పిలుచుకుంటారు. పంజాబ్‌లోని ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా
ఉగ్రహన్‌’ (సుబా ఆగు) యూనియన్‌కు చెందిన రాష్ట్ర నాయకురాలు. అంతేకాదు, ఆమె యూనియన్‌ అగ్ర నాయకులలో ఒకరైన ‘రెaండా సింగ్‌ జెతుకే’ దత్తపుత్రిక కూడా.
హరీందర్‌ కౌర్‌ను తన తోటి రైతులు కొందరు సొంత బిడ్డగా, కొందరు అక్కగా, కొందరు చెల్లెలుగా భావిస్తారు, అలాగే పిలుస్తారు. ఆమె టిక్రి వద్ద ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తున్నారు. కొనసాగుతున్న ఉద్యమం గురించి ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు తగినట్లు అత్యవసర పరిస్థితులలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, మరీ ముఖ్యంగా ప్రతి మహిళకు సవ్యమైన అవగాహన కలిగించే రీతిలో దిశానిర్దేశం చేసే బాధ్యతల్లో ఉన్నారు.
హరీందర్‌ కౌర్‌ ఒక ఒంటరి తల్లి. తన టీనేజ్‌ కొడుకును తన తమ్ముడి కుటుంబ సంరక్షణలో వదిలి, నిరసన తెలియచేయడానికి టిక్రి వద్దకు వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలలో ప్రముఖ నాయకులలో ఒకరైన ఆమె, తన చుట్టూ ఉన్న మహిళలతో కలిసి తన పనిని ఎలా చేస్తోందో చూడడానికి మేము ఆమెతో ఒక రోజు గడిపామని చెప్పారు సృష్టి జైస్వాల్‌.
తమకు తీరని హాని చేస్తూ, తమ బతుకుల్ని బుగ్గిపాలు చేయడానికి, తమ నోటి దగ్గర కూడుని లాగేసుకోవడానికే దుర్మార్గమైన మూడు చట్టాలు… 1. నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం, 2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం, 3. రైతుల (సాధికారిత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం 2020, ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తుల పరం చేయడానికి రూపొందించారని ఆమెతో పాటు నిరసనల్లో పాల్గొంటున్న శ్రామిక మహిళా రైతులు బలంగా నొక్కి చెప్పారు. ఇవి తమ పాలిట మరణ శాసనాలు కాబోతున్నాయని ఆగ్రహావేశాలతో బలంగా తమ ఆవేదననూ, ఆక్రోశాన్నీ ప్రదర్శించారు.
ఉదయ వేళల్లో హరీందర్‌ కౌర్‌ సమావేశాలు ః
దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రైతుల సంస్థలలో ఒకటైన ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌’ జోరీందర్‌ సింగ్‌ నాయకత్వంలో ఒక గోశాలను తమ తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడ సమావేశమవడంతో హరీందర్‌ రోజు ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు ఆమె తన రోజువారీ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరవుతుంది. ఆ యూనియన్‌ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థలో హరీందర్‌ కౌర్‌ ఏకైక మహిళా సభ్యురాలు.
‘‘మేము మా రోజువారీ ఎజెండాను రూపొందించుకుని దాన్ని అమలు చేస్తాము. మా పోరాటం ఎక్కడ ఇనుమడిరచిన చైతన్యంతో అభివృద్ధి చెందుతుందో, ఎక్కడ లోటుపాట్లతో నిరాశాజనకంగా ఉందో మేము విశ్లేషించుకుంటాము. మా విధానాలు, రాజకీయాల గురించి చర్చించుకుంటాము. ఏ రోజుకారోజు, మేము చేయబోయే పనిని నిర్దేశించుకుంటాము. ఎందుకంటే అది ఆనాటి ముఖ్యమైన మా కార్యాచరణను నిర్ణయిస్తుంది’’ అని హరీందర్‌ తమ రోజువారీ సమావేశాల ఉద్దేశ్యాన్ని వివరించారు.
‘‘నేను ఉదయం 5 గంటలకు నిద్ర లేచి, అన్ని పేపర్లు చదివి, నోట్స్‌ రాసుకుని సమావేశానికి సిద్ధంగా ఉంటాను. సమాచార సేకరణలో ఎలాంటి లోపం ఉండడానికి వీల్లేకుండా చూసుకుంటాను’’ అని అన్నారామె.
టిక్రి వద్ద, సరుకుల సరఫరా గొలుసును నిర్వహించడం ఆమె ముఖ్య బాధ్యత. ‘‘మేము ప్రతిదానికీ కమిటీలు వేశాం. ఆహారం, శీతాకాలపు ఉన్ని దుస్తులు, పరిశుభ్రత కోసం వాడే శానిటరీ వస్తువులు వగైరా ఉత్పత్తులు, తమకు కావలసిన వస్తువులేమిటో నాకు కమిటీలు తెలియచేస్తాయి. మా యూనియన్‌ ద్వారా వాటిని సేకరించి, వివిధ సమూహాల మధ్య పంపిణీ చేస్తాం. అంతా మా సుబా ఆగు ప్రతినిధిగా నా నుండి సరఫరా వెళ్తుంది’’ అని హరీందర్‌ కౌర్‌ చెప్పారు.
1980వ దశకంలో హరీందర్‌కు జనహిత సమూహాలతో మొట్టమొదటగా పరిచయం ఏర్పడిరది. ఆమె పది సంవత్సరాల వయసులో భగత్‌సింగ్‌ స్థాపించిన వామపక్ష సంస్థ ‘‘నౌ జవాన్‌ భారత్‌ సభ’’లకి స్థానిక నాయకుడైన తన తండ్రితో కలిసి నిరసనలకు హాజరయ్యేవారు. ‘‘మా గ్రామంలో నాటకాలు, నిరసనలు, ర్యాలీలు జరిగేవి. అవి నాకు చాలా ఆసక్తిగా ఉండేవి. నేను తప్పకుండా అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్ళి గమనిస్తుండేదాన్ని’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఖలిస్తాన్‌ ఉద్యమం చెలరేగిన తర్వాత పంజాబ్‌ హింసాత్మకంగా మారిపోయింది. ఆమె తండ్రి పోలీసులను, ఖలిస్తానీలనూ కూడా తీవ్రంగా విమర్శించేవారనీ, 1991లో అతన్ని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు హత్య చేశారని గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నాకు 14 ఏళ్ళు. ఆయన పోయిన తర్వాత నేను అతని స్థానం తీసుకుని ప్రజా ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నాను’’ అని హరీందర్‌ తన గురించి చెప్పుకొచ్చారు.
మొదట్లో, అంటే 1990లలో ఆమె పంజాబ్‌ రాష్ట్రంలో జరిగిన వివిధ నిరసన ఉద్యమాలలో పాల్గొన్నారు. ‘‘నా యవ్వన కాలంలో నేను బస్సు చార్జీల తగ్గింపు కోసం, బాల, బాలికల నిర్బంధ విద్య కోసం, దళితులు, కార్మికుల సమస్యల కోసం పోరాడాను’’…‘‘2002లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌లో నేను అధికారికంగా చేరాను. అప్పటి నుండి నిరసనలలో పాల్గొనడానికి నేను మహిళలను సమీకరిస్తున్నాను’’ అని హరీందర్‌ చెప్పారు.
భారతదేశంలో గ్రామీణ మహిళల్లో 75 శాతం మంది వ్యవసాయంలో తమ పూర్తి సమయాన్ని వినియోగించి పనిచేస్తున్నారని ఆక్స్‌ ఫామ్‌ నివేదిక తెలిపింది. కానీ ఇంకా ఎక్కడ చూసినా వ్యవసాయం పురుషుల పనే అన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతూ
ఉంటుంది. ఇప్పటికీ 13 శాతం మంది మహిళలు మాత్రమే తమదైన కొంత సొంత భూమిని కలిగి ఉన్నారు.
కొనసాగుతున్న నిరసనలు ఈ దురభిప్రాయాన్ని కొంతవరకు తొలగించడానికి సహాయపడతాయి. ఒక టిక్రి నిరసనకారులలోనే 40,000 మంది మహిళలున్నారు. సింఘు, పల్వాల్‌, ఘాజీపూర్‌, నోయిడా, షాజహాన్‌పూర్‌, బురారి మైదానం, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రతిఘటించే వారితో కలిపి మొత్తంగా లెక్కలు తేలితే పాలకులకు గుండెల్లో హడలెత్తుతుంది. ‘‘మహిళా రైతుల శ్రమ పనిచేసే క్షేత్రాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. కానీ మేము నిరసనల్లో కనిపిస్తాం. ఢల్లీి నిరసనల్లో వేల సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా స్ఫూర్తినిస్తుంది. ఇది మారుతున్న కాలానికి సంకేతం’’ అని హరీందర్‌ కౌర్‌ గొప్ప ఆశావహ దృక్పథాన్ని వెలిబుచ్చారు.
హరీందర్‌ కౌర్‌, విశ్వజోత్‌ గ్రేవాల్‌, బిమలా దేవి, అలంజీత్‌ కౌర్‌, మణి గిల్‌, సహజ్‌ మీత్‌, గుర్లీన్‌, హర్ష్‌ కౌర్‌, లైలా, కవిత, కోమల్‌ప్రీత్‌, నవదీప్‌ కౌర్‌… ఇంకా పేర్లు తెలియని ఎందరెందరో మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రకరకాల విధుల్లో నాయకత్వం వహిస్తున్నారు. అసలు నాయకత్వాల ప్రమేయం లేని అతి సాధారణ మహిళలు వేలల్లో ఉన్నారు.
మహిళల్ని సమీకరించి, అవగాహన కల్పించే విధానం :
ఉదయం సమావేశం తర్వాత హరీందర్‌ ఏర్పాట్ల స్టాక్‌ తీసుకుని మహిళా నిరసనకారుల సంక్షేమం గురించి తెలుసుకుంటారు. ‘‘సమావేశం సాధారణంగా ఉదయం 10:30 గంటలకు ఉంటుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత సుబా ఆగుకు సంబంధించిన అన్ని నగర్లకూ వెళ్ళి సంక్షేమ సమాచారాలు సేకరిస్తానని’’ హరీందర్‌ చెప్పారు.
ఢల్లీి సరిహద్దుల్లో అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలోకి విస్తరించిన టిక్రీ నిరసనను సులభతరంగా నిర్వహించడం కోసం, నిర్వాహకులు దీన్ని పంజాబీ ప్రముఖ వ్యక్తుల పేర్లతో ‘‘నగర్లు’’గా విభజించారు. బాబా బందాసింగ్‌ నగర్‌, చాచా అజిత్‌ సింగ్‌ నగర్‌, బీబీ గాగ్రి`గులాబ్‌ క ఔర్‌ నగర్‌, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌, షహీద్‌ సాధు సింగ్‌ తఖ్తుపుర నగర్‌ మొదలైన నగ్లున్నాయి. టిక్రి సరిహద్దులో మహిళా నిరసనకారులు బీబీ గాగ్రి`గులాబ్‌ కౌర్‌ నగర్‌లో ఉన్నారు. ఇది హరీందర్‌ కార్యకలాపాలకు కేంద్రం.
‘‘నేను ఈ మహిళా నిరసనకారుల నగర్లను సందర్శిస్తాను, వారితో మాట్లాడతాను. వారిని దృఢంగా, శక్తివంతంగా, బలంగా ఉండాలని ఉత్తేజపరుస్తాను. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలని చైతన్యవంతం చేస్తాను. ఇది మా పోరాటంలో అత్యంత కీలకమైన ఘట్టమని, ఓర్పుతో వ్యవహరించాలని మహిళలకు అవగాహన కల్పిస్తాను. వాళ్ళు కూడా ఈ చట్టాల రద్దు సాధించాలనే గొప్ప దృఢ దీక్షతో ఉన్నారు. నిజంగా చూస్తే నాక్కూడా ఈ పరిస్థితులు కష్టమనిపిస్తున్నాయి. సరైన స్నానపు గదులు లేవు, మరుగుదొడ్లు లేవు. తీవ్రమైన చలికాలంలో గడ్డ కట్టి బిగుసుకుపోయే సమయాల్లో పీరియడ్స్‌లో ఉన్న మహిళలు పడే బాధలు చెప్పనలవి కావు. అది గొప్ప సవాలుగా ఉంటుంది. కానీ మేము స్త్రీలుగా ఒకరినొకరం స్ఫూర్తితో ప్రేరేపించుకుంటున్నాం’’ అని హరీందర్‌ చెప్పారు.
పాటియాలాలోని నియాల్‌ గ్రామానికి చెందిన 54 ఏళ్ళ హర్జింగర్‌ కౌర్‌ అనే మహిళ హరీందర్‌ (బిందు) గురించి చెప్తూ, ‘‘నేను ఒక నెల క్రితం మాత్రమే ఆమెను కలుసుకున్నాను. కానీ బిందు నాకు నా సొంత కూతురుకంటే ఎక్కువైపోయింది. నాకేది అవసరమైనా నేను ఆమెకు చెప్తాను. ఆమె ఇక్కడి మహిళల కోసం ఆహారం నుండి శానిటరీ ప్యాడ్ల వరకు అన్నింటినీ నిమిషాలమీద ఏర్పాటు చేస్తుంది. ఆమె పోరాడే మహిళలందరికీ గొప్ప నైతిక మద్దతునిచ్చే శక్తిగా మా మనసుల్లో ముద్రించుకు పోయింది. బిందు ఒక బాంబు. ఇది ఇప్పుడు సమరశీల పోరాటాల బాటలో పేలుతుంది’’ అని ఆమె చెప్పారు.
బీబీ గాగ్రి`గులాబ్‌కౌర్‌ నగర్‌ వద్ద మహిళలకు అవసరమైన పనులు చూసుకున్న తర్వాత, హరీందర్‌ కౌర్‌ ప్రధాన నిరసన వేదికకు వెళ్తారు. ‘‘నేను సాంస్కృతిక ప్రదర్శనలివ్వబోతున్న మా కళాకారుల సమూహాలను తనిఖీ చేస్తాను. వారి ప్రదర్శనలకు ఏదైనా అవసరమా అని చూస్తాను. మధ్యాహ్నం నుండి 3ః30 గంటల వరకు మేము వేదిక పనుల నిర్వహణలో ఉంటాం. ఆ తర్వాత మేము మీడియా వ్యక్తులను కలుస్తాం’’ అని నామె వారి దినచర్య గురించి వివరించారు.
ఆమెకు భోజనానికి కూడా తీరిక ఉండదు. సాయంత్రం పూట మాత్రమే ఒక రొట్టె ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటూ కనిపిస్తుంది. సాయంత్రం పాటియాలాకు చెందిన ఒక మహిళల బృందంతో కలిసి ఒక ప్లేట్‌ ఆహారాన్ని పంచుకుంటూ, ‘‘నేను ట్రాలీని నడుపుకుంటూ చూడడానికి వెళ్ళినప్పుడు మావాళ్ళు ప్రేమతో నన్ను వారితో కలిసి తినమని ఆహ్వానిస్తారు. భోజన సమయంలో ఎవరొచ్చినా ప్రేమగా పెట్టడం పంజాబీల సాంప్రదాయం. కొత్తవారైనా సరే భోజనం చెయ్యకుండా ఎవరినీ వదలరు’’ అని హరీందర్‌ కౌర్‌ చెప్పారు.
హరీందర్‌ కౌర్‌ తండ్రి, కొడుకులు :
హరీందర్‌ కౌర్‌ ‘రెaండా సింగ్‌ జెతుకె’ దత్తపుత్రిక. ఆయన భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌లో ఉపనాయకుడు. ‘‘మా నాన్నా, రెaండా సింగ్‌ జెతుకే… ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వారిద్దరూ భారత నౌ జవాన్‌ సభలో కలిసి పనిచేశారు. 2010లో నా విడాకుల తర్వాత, రెaండా సింగ్‌ జెతుకే మార్గదర్శకత్వంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌కి అంకితమైపోయి పనిచేయడం మొదలుపెట్టాను. మేము కలిసి పని చేస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రయాణిస్తున్న క్రమంలో నేను ఆయన్ని ‘పాపా’ అని పిలవడం మొదలుపెట్టాను. ఆయన కూడా నన్ను సొంత బిడ్డలా చూడడం మొదలైంది. అనుకోకుండా మేము ఎప్పుడు ఒక కుటుంబ సభ్యులం అయ్యామో కూడా మాకే తెలియకుండా జరిగిపోయింది’’ అని కిసాన్‌ యూనియన్‌ నాయకుడు ‘రెaండా సింగ్‌ జెతుకే’తో తనకేర్పడిన అనుబంధాన్ని తెలిపారు. రక్తసంబంధాల కంటే భావ సారూప్యతల అనుబంధాలు విడదీయలేనంత గాఢంగా ఉంటాయి కదా!
హరీందర్‌ కౌర్‌కి అదీబ్‌ అనే 14 సంవత్సరాల కుమారుడున్నాడు. పంజాబ్‌లోని ఫరీద్‌ కోట్‌ జిల్లాలో ఆమె సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటాడు. అదీబ్‌ తన మామ ఇంటి నుండి ఫోన్‌లో మాట్లాడుతూ, ‘‘నేను ప్రతిరోజూ అమ్మతో మాట్లాడతాను. ఆమె నాకు చాలా దూరంలో ఉందనిపించదు. అమ్మ ప్రతి క్షణం నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. ఆ సంక్షోభ కాలంలో ఏ రైతయినా తప్పకుండా చెయ్యాల్సిన పనిని మా అమ్మ కూడా చేస్తోంది. నేను ఆమె గురించి చాలా గర్వపడుతున్నాను. ఈ పోరాటం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడవలసిన సమయం వచ్చింది’’ అని చెప్పాడు.
అదీబ్‌ డిసెంబర్‌లో వచ్చి టిక్రీ నిరసనలను చూశాడు. ‘‘మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటంగా ఉంది. వేచి చూడలేకపోతున్నా’’ అన్నాడు. హరీందర్‌ కౌర్‌ తన తోటి నిరసనకారుల మీద తనదైన ముద్ర వేయడం మాత్రమే కాదు, ఆమె తన యూనియన్‌ నాయకులను కూడా స్థిరమైన మనస్తత్వంతో, అలుపు లేని పనితనంతో బాగా ఆకట్టుకుంది.
‘‘కోవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రారంభ దినాల్లో, సీనియర్‌ నాయకులందరూ వయసు రీత్యా గృహ నిర్బంధంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో బిందును యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఆమె ఛార్జ్‌ తీసుకుని యువ నాయకులకు బిల్లులు, ఇతర రైతు సమస్యల గురించి వివరించి, ఆ వ్యవసాయ బిల్లులు ఆమోదించడానికి ముందు నుంచే అవగాహన పెంచడం ప్రారంభించింది. మంచి నాయకత్వ నైపుణ్యాలతో ఎవరేమేం చెయ్యాలో నిర్దేశించేది’’ అని జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ ఆమెను బహు విధాలుగా ప్రశంసించారు. మళ్ళీ ఆయనే ‘‘బిందు తన విధులను చక్కగా నిర్వర్తించినందువల్ల ఎక్కువ మంది మహిళలు మా యూనియన్‌లో నాయకులుగా చేరాలని మేము భావించాము. ఇప్పుడు మాకు వివిధ ప్రాంతాల్లో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పది మందికి పైగా మహిళా నాయకులున్నారు’’ అని చెప్పారు.
జెతుకే ఇలా అన్నారు. ‘‘2020లో పంజాబ్‌లో మా నిరసనోద్యమాలలో పాల్గొనడానికి ఆమె గ్రామీణ మహిళలను సమీకరించడంతో ఆమె పని తిరిగి ప్రారంభమైంది. ఆమె వల్లనే చాలా మంది మహిళలు మాతో టిక్రిలో చేరారు. ఆమె చిన్నతనం నుంచీ ప్రతిఘనటలో, నిరసనల నాయకత్వ నిర్వహణలో గొప్ప సామర్ధ్యం కలది’’ అని చెప్పారు.
మా హక్కులను కాలరాసే హక్కెవరికీ లేదు!
భారత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే చేసిన వ్యాఖ్య పట్ల హరీందర్‌ కౌర్‌ ఎలా ప్రతిస్పందించారు? ‘‘భారతదేశపు ప్రధాన న్యాయమూర్తి స్త్రీ శక్తికి భయపడుతున్నారు…’’ అని ఆమె తన దృఢమైన స్వరంతో స్థిరంగా సమాధానమిచ్చింది. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలపడానికి, ప్రతిఘటించి పోరాడే మా మహిళా శక్తిని వారు ఆపలేరు. వార్తా పత్రికలూ, పుస్తకాలూ చదివి జ్ఞాన సముపార్జన చేసే పురుషుల పోరాటాలను రకరకాల కుయుక్తులతో వారు ఆపగలరేమో గానీ వారు మహిళలను అధిగమించలేరు. ఎందుకంటే మహిళలకు జీవితానుభవాల నుంచి వచ్చే ఆచరణాత్మకమైన జ్ఞాన బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బలాన్ని ఎవరూ జయించలేరు.’’
కొనసాగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న పంజాబ్‌, హర్యానా రైతుల స్త్రీ`పురుషుల సంఖ్యల నిష్పత్తులను పాలకవర్గం వారు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. 2015లో నీతి ఆయోగ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పంజాబ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 899 మంది మహిళలు, హర్యానాలో ప్రతి 1,000 మంది పురుషులకు 831 మంది మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపింది. ఇది స్త్రీల సంఖ్యలను పురుషుల కంటే తక్కువ చేసి వాస్తవ విరుద్ధంగా చూపడమే కాక దేశ ప్రజలకు ఈ రాష్ట్రాల్లో స్త్రీల నిష్పత్తి చాలా హీనంగా ఉందనే తప్పుడు సంకేతాన్ని పంపుతున్నారు.
‘‘మహిళలుగా మేము మా బిడ్డల్ని సాకడం, కుటుంబ సభ్యులను బాధ్యతగా, ప్రేమానురాగాలతో చూసుకోవడమే కాదు, ఆలోచనా శక్తి, ప్రశ్నించే స్వభావం, పోరాడే శక్తి మాకూ ఉన్నాయి. మావైన స్వంత నిర్ణయాలు తీసుకునే సాధికారం మాకు ఉందని నిరూపించి చూపిస్తాం. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మేము ప్రభుత్వం వాటిని తిరిగి ఉపసంహరించుకునేంతవరకూ ఇళ్ళకు తిరిగి వెళ్ళబోవడం లేదు’’ అని గొప్ప విశ్వాసంతో, నమ్మకంగా అక్కడి మహిళలందరి ప్రతినిధిగా అన్నారు హరీందర్‌.
‘‘మహిళలు వెనక్కి వెళ్ళాలని చెప్పడం ద్వారా, నాయకత్వ పదవుల నుండి స్త్రీలు తప్పుకోవాలని సుప్రీంకోర్టు చెబుతోంది… మేము ఈ దేశ పౌరులుగా, మనుషులుగా మాకూ అన్ని హక్కులూ ఉన్నాయి. స్వభావం, పోరాడే శక్తి ఉన్నాయి, మేము ఎందుకు వెనక్కి వెళ్ళాలి?’’ అని ధీటుగా ప్రశ్నిస్తున్నారు హరీందర్‌.
(న్యూస్‌ లాండ్రీ.కాం పత్రిక కోసం ‘సృష్టి జైస్వాల్‌ టిక్రి సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొంటున్న మహిళల గురించి, మొత్తంగా అక్కడున్న ప్రతిఘటన వాతావరణం గురించి ‘హరీందర్‌ కౌర్‌’ ని చేసిన ఇంటర్వ్యూకి నా స్వేచ్ఛానువాదం!)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.