హిజాబ్‌ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య -ఎ. సునీత

మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్‌ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావొద్దని చెప్పేశారు. యూనిఫాం నియమాలకు హిజాబ్‌ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలని చదువు రాకుండా ఉంచే ఈ దేశంలో కాలేజీ చదువు వరకూ వచ్చే

అమ్మాయిలని, అందులోనూ అణగారిని ముస్లిం సమూహానికి చెందిన అమ్మాయిలని చదువుకు దూరం చెయ్యటానికి ఇంత విచిత్ర ఎత్తుగడ బహుశా ఎవరికీ తట్టి ఉండకపోవచ్చు. ఇలా చదువు నుండి బహిష్కారానికి గురైన ఆ అమ్మాయిలు కాలేజీ విధించిన ఈ అనైతికమైన, చట్ట విరుద్ధమైన బహిష్కారానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, విద్యార్థుల మధ్య సంఫీుభావం ఏర్పడకుండా, కొంతమంది వారిపైన దాడులకు దిగారు.
అయితే చర్చ చదువు, కాలేజీ నుండి ముస్లిం అమ్మాయిల బహిష్కరణ చుట్టూ కాక, వారు తలకి చుట్టుకున్న హిజాబ్‌ చుట్టూ ఎందుకు తిరుగుతోంది? భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా హిజాబ్‌ ముస్లిం స్త్రీల తీవ్ర పితృస్వామ్య అణచివేతకు చిహ్నమని, ముస్లిం స్త్రీలు హిజాబ్‌ వేసుకోకుండా ఉంటేనే దాన్నుండి విముక్తి పొందినట్లనీ, ముస్లిం స్త్రీలని వారి మతం నుండి రక్షించాల్సిన అవసరం ఉందనే ఒక ఉదారవాద భావజాలం గత శతాబ్దంలో బయటపడి ఈ శతాబ్దంలో కామన్‌సెన్స్‌గా మారింది. ఈ భావజాల ప్రభావం వల్లే హిజాబ్‌ని ఇస్లాం మత ఛాందసానికి ఒక చిహ్నంగా మాత్రమే చూడడం ప్రపంచంలో సామాన్య ప్రజలు కూడా అలవాటు చేసుకున్నారు. దానికి న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌ పత్రికల నుండి మన స్థానిక వార్తా పత్రికల వరకు తమ వంతు సహకారం అందిస్తూనే ఉన్నాయి.
ఈ భావజాలం ఇంత బలంగా వేళ్ళూనుకునేటట్లు చేయడానికి రాజకీయ, ఆర్థిక కారణాలు ప్రధానమైనవి. ప్రపంచ యుద్ధాల మధ్యలో పశ్చిమ ఆసియా దేశాల్లో పెట్రోల్‌ని కనుగొనడంతో ఆయా దేశాలని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటం యూరోప్‌ దేశాలకు చాలా అవసరమైంది. సాంస్కృతికంగా అవి వెనుకబడి ఉన్న దేశాలని, దానికి ఇస్లాం కారణమని, ఇస్లాం మతం ఛాందస మతమనే ప్రచారం విపరీతంగా జరిగింది. అసలు ఆయా దేశాలు ఆధునీకరణ చెందలేవని, ఎందుకంటే అవి మౌలికంగా యూరోపియన్‌ సమాజాలకు భిన్నమయినవనే పండిత ప్రచారం కూడా యూరోపియన్‌ సాంస్కృతిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చేశారని ఎడ్వర్డ్‌ సయీద్‌ (1935`2003) ఓరియెంటలిజం అనే ప్రభావశీల పుస్తకంలో ఎత్తి చూపారు. మన దగ్గర కూడా ఈ రకమయిన పోకడలు… అంటే ముస్లిం సమాజం అత్యంత పితృస్వామికమైందనీ, ఎప్పటికీ మార్పు చెందకుండా ఉందనీ, కాబట్టి బలవంతంగా వారిని మార్చాలనే వాదనలు… గత ముప్ఫై ఏళ్ళలో ఊపందుకున్నాయి. దీనిలో తప్పేముంది నిజం కాదా అని వాదించే వాళ్ళలో స్త్రీ వాదులు, ముస్లిం వాదులు, ప్రగతిశీల వాదులు కూడా ఉన్నారు. అయితే ఆధునికీకరణ ప్రతి సమాజంలో వివిధ రకాలుగా వాస్తవీకరించబడుతుంది. మనవంటి నిచ్చెన మెట్ల సమాజంలో హిజాబ్‌ ధారణ కూడా ఆధునికీకరణలో భాగమనే విషయం అర్థం చేసుకోవాలి. స్త్రీ, పురుషులలో ఎవరి వస్త్రధారణని, సాంస్కృతిక చిహ్నాలని ఎంత మేరకు, ఏ రకంగా ఆధునీకరించాలి, ఏ చిహ్నాలని మార్చొద్దు అనే విషయం, ఎంతమేరకు ఆధునీకరించాలి అన్న విషయాలను ‘చీర’ చరిత్రని గమనిస్తే అర్థమవుతుంది.
మనకు తెలిసిన చీర కట్టు.. జాకెట్టు, లోపలి లంగా వేసుకుని, కుచ్చెళ్ళతో, పమిటతో ఉండేది గట్టిగా 120 ఏళ్ళ క్రిందటే తయారయింది. అప్పటివరకూ జాకెట్టు, లోపలి లంగా లేకుండానే, గోచీ పట్టి చీర కట్టుకునేవాళ్ళు. ఎప్పుడయితే మధ్య తరగతి స్త్రీలు, పురుషులతో కలిసి బ్రిటిష్‌ వారితో ఫంక్షన్లలో పాల్గొనాల్సి వచ్చిందో అప్పుడు ఈ చీర కట్టుని ఆధునీకరించాల్సి వచ్చిందని చరిత్రకారిణి జానకి నాయర్‌ అంటారు. గత నలభై ఏళ్ళలో హిజాబ్‌ కూడా ఆధునీకరణకి, గౌరవప్రద స్త్రీత్వానికి చిహ్నంగా రూపుదిద్దుకుంది. అప్పటివరకూ ముస్లిం స్త్రీలు, మగవాళ్ళతో కలిసి బయటికి వెళ్ళాలంటే ఒక తెల్ల షాల్‌ వంటిది కప్పుకుని బయటికెళ్ళేవారు. వాళ్ళేకాదు, గౌరవప్రదమయిన కుటుంబాలకి చెందిన ఏ ఆడవాళ్ళయినా, ఏ మతానికి చెందిన వాళ్ళయినా, మగవాళ్ళు లేకుండా తమంతట తాము బయటికి వెళ్ళాల్సి వస్తే జట్కా బండికి, ఎడ్ల బండికి పరదా కట్టుకోవడం జరిగేది. తాము బయటికి వెళ్ళడానికి, పని చేసుకోవడానికి అనుకూలంగా ముస్లిం సమాజాలు ఆమోదించిన వస్త్రధారణ… హిజాబ్‌, బురఖా. ఆ తర్వాత ఆధునిక సార్వత్రిక విద్య వ్యాపించేకొద్దీ హిజాబ్‌, కొన్ని చోట్ల బుర్ఖా వ్యాపిస్తూ వచ్చింది. జావీద్‌ ఆలం (హైదరాబాద్‌కి చెందిన రాజనీతి శాస్త్రజ్ఞుడు) రాసిన ‘రిక్షా`బురఖా’ వ్యాసంలో హైదరాబాద్‌లో ఈ పరిణామం ఎలా జరిగిందో స్పష్టంగా చెప్తారు. 1970ల చివర్లో అప్పటివరకూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కనిపించే ముస్లింల ప్రధాన ఉపాధి రిక్షా, మధ్య ప్రాశ్చ్య దేశాలకి వలసలతో మారి ఆటోలకి మరలిందని, మగవాళ్ళందరూ బయటి దేశాల్లో ఉండడంతో ఆడవాళ్ళు అన్ని పనులూ చేసుకోవడానికి బయటికి రావాల్సి వచ్చిందని, అప్పుడు ఆ దేశాల్లో ధరించే బుర్ఖా గౌరవప్రదమయిన వస్త్రధారణగా పరిణమించిందని విశ్లేషించారు. నేను 1990లలో పాత బస్తీలో పెద్ద వయసున్న ముస్లిం స్త్రీలతో కుటుంబంలో వచ్చిన మార్పుల గురించి చర్చించేటప్పుడు, వాళ్ళు యువతరం ముస్లిం స్త్రీల గురించి నాతో ఫిర్యాదు చేశారు, ‘‘మేమయితే మా మగవాళ్ళు లేకుండా ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, ఈ తరం వాళ్ళు బుర్ఖా వేసుకుని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు’’ అని. బుర్ఖా హైదరాబాద్‌ ముస్లిం సమాజ ఆధునికీకరణలో భాగమై యువతరం స్త్రీల మొబిలిటీని పెంచిందని వీళ్ళ బాధ.
అంటే ముస్లిం సమాజాల్లో పితృస్వామ్య ఆధిపత్యం లేదా అని అడగొచ్చు. అందరూ స్వచ్ఛందంగానే బురఖా వేసుకుంటారా అని కూడా అడగొచ్చు. తప్పకుండా ఉంది. మిగిలిన అన్ని సమాజాల్లో స్త్రీల వస్త్రధారణపై ఎంత నియంత్రణ ఉందో, అక్కడ కూడా అంతే. స్వంత బట్టల మీద వేరే వాళ్ళ హక్కేంటి అని వాదించేవాళ్ళు ఒకసారి తమ తమ స్వంత సమాజాల్లో, కుటుంబాల్లోనే కాదు, మన ప్రజామోదిత సంస్కృతిలో స్త్రీల వస్త్రధారణపై ఏ పితృస్వామ్య నియంత్రణా లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? హిందూ యువతులు బొట్టు లేకుండా వెళ్ళినపుడు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు, బస్సులో ప్రయాణీకుల నుండీ, కూరల బండి వాళ్ళ దాకా అందరూ కామెంట్‌ చేసేవాళ్ళే. ఏ పితృస్వామ్య కట్టుబాట్లూ లేకుంటేనే, పెళ్ళయిన స్త్రీలు తూచా తప్పకుండా బొట్టు, మంగళసూత్రం, మెట్టెలు పెట్టుకెళ్తున్నారా? గురువుల దగ్గరి నుండి సినిమా పాటల వరకూ అందరికీ, అన్నింటికీ స్త్రీల వస్త్రధారణ సామూహిక సాంస్కృతిక వనరుగా ఇప్పటికీ ఎందుకున్నట్లు?
అయితే ఎవరి వస్త్రధారణ కేవలం సాంస్కృతిక చిహ్నంగా అంటే మన కళ్ళకి మామూలుగా గోచరిస్తుందనేది సామాజిక ఆధిపత్యంపై ఆధారపడుతుంది. మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భూమి పూజలు, ఆఫీసుల్లో దేవుళ్ళ ఫోటోలు, చేతికి తాయత్తులు, ముఖానికి పసుపు, కుంకుమ, మెడలో నల్లపూసలు, చేతులకి గాజులు మతపరమయిన చిహ్నాలుగా కాక, సాంస్కృతిక చిహ్నాలుగా పరిగణింపబడడానికి కారణం మరేంటో కాదు హిందూ సమూహ ఆధిపత్యమే. ప్రతి దేశంలో ఆధిపత్య మత సంస్కృతికి అనుగుణంగా అక్కడి లౌకికత, దాని చిహ్నాలు రూపుదిద్దుకుంటాయని లౌకికత, మతాల మధ్య సంబంధాలని అధ్యయనం చేసిన తలాల్‌ అసద్‌ (పాకిస్తాన్‌ నుండి సౌదీకి వలస వెళ్ళిన కుటుంబంలో పుట్టి అమెరికాలో పనిచేసే ఆంథ్రోపాలజిస్ట్‌) అంటారు. యూరోపియన్‌ దేశాల్లో క్రిస్టియన్‌ మత సంస్కృతి లౌకికతని రూపుదిద్ది, సమాజ సంస్కృతిగా ఎలా పరిణమించిందో అలాగే మన దేశంలో హిందూ మతం లౌకికతను రూపుదిద్దటం వల్ల హిందూ మత చిహ్నాలని లౌకికతకి విరుద్ధమైనవని అర్థం చేసుకోవటం లౌకికవాదులమని భావించే వారికి కూడా కష్టం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వైపరీత్యం లౌకికవాదాన్ని రాజ్యం మైనారిటీ సమూహాలపై వాడటానికి ఒక ఆయుధంగా చేసుకోవటం. ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ వంటి యూరోప్‌ దేశాల్లో హిజాబ్‌ మీద బహిష్కరణ ఈ కోవకి చెందినదే. ఒక దేశంలో విభిన్న సమాజాలు, భిన్న సమూహాలు తమ తమ లౌకికతని భిన్నంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను తోసిపుచ్చి ఒకే రకమైన ఆధునికీకరణ, లౌకికత్వం అందరిమీద బలవంతంగా రుద్దే ప్రయత్నమే ఈ హిజాబ్‌ బహిష్కరణ. ఫ్రాన్స్‌లో హిజాబ్‌ గురించిన చర్చలో విమర్శనాత్మకంగా ఆలోచించే ఫ్రెంచ్‌ స్త్రీ వాదులు, ఈ బహిష్కరణ ఫ్రాన్స్‌కి అల్జీరియాతో ఉన్న వలసవాద సంబంధం నుండి, అల్జీరియన్‌ ప్రజలు ఫ్రాన్స్‌తో చేసిన సుదీర్ఘ పోరాటం నుండి, చవిచూసిన ఓటమి నుండి, ప్రధానంగా ముస్లింలయిన ఆ వలస ప్రజలకన్నా తాము భిన్నమయిన వారమని నిరూపించుకోవాలనే ఇచ్ఛ నుండి పుట్టిందని ఎత్తి చూపారు. అన్ని పౌర, ప్రాథమిక హక్కుల్నీ పణంగా పెట్టి ఒక మూసపోసిన లౌకికతను దేశ అస్తిత్వానికి ఒకే ఒక చిహ్నంగా ఎత్తి చూపటం దీని లక్షణం. మన దేశంలో ముస్లిం అమ్మాయిల చదువుని పణంగా పెట్టటం ఇటువంటి లౌకికవాద హింసలో భాగమే. ముస్లిం లౌకికతను అర్థం చేసుకోవాలంటే ఆయా ముస్లిం సమూహాల్లో దానిపై జరిగే చర్చను గమనించాలి. ముస్లిం స్త్రీలలో బుర్ఖాపై జరిగే చర్చని అర్థం చేసుకోవాలి. నూర్జహాన్‌ బేగం వంటి కమ్యూనిటీలో పనిచేసే ముస్లిం స్త్రీలు తమకి అలవాటు లేకపోయినా బుర్ఖా, హిజాబ్‌ ధరించాల్సి వస్తుందని, అది పెద్ద విషయం కాదని నాతో అన్నారు. పదిహేనేళ్ళ క్రితమే, ఈ బుర్ఖా గురించి స్త్రీ వాదులకి, ప్రగతి శీల వాదులకి ఉండే ఆబ్సెషన్‌ని ఎత్తి చూపి చిరాకుపడ్డారు. మాకు చదువు, ఉద్యోగాలు కావాలి కదా, అవి కనపడవా మీకు అని అడిగారు.
ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా చేసిన పదేళ్ళ యుద్ధంలో నిండా ముసుగు వేసుకున్న స్త్రీలు, మూడు తలాక్‌ల నిషేధ చట్టంతో ఇక్కడ ముస్లిం స్త్రీలు పితృస్వామ్యం నుండి ‘విముక్తు’లయ్యారని అనేకమంది భావించారు. కానీ ఇదే సమయంలో ఎంతోమంది హిజాబ్‌ ధరించిన ముస్లిం స్త్రీలు వారి వారి దేశాల్లో ఎన్నో రకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా షాహీన్‌బాగ్‌ ఉద్యమంలో హిజాబ్‌ ధరించిన స్త్రీలు, పెద్ద చదువుల్లో ఉన్న వాళ్ళతో సహా… పౌరసత్వం కోసం, ఈ దేశ లౌకికత్వం కోసం, తమ అస్తిత్వం కోసం కనీ వినీ ఎరుగని పోరాటం చేశారు, కేసుల్లో ఇరికించబడ్డారు, జైళ్ళల్లో మగ్గుతున్నారు. తాము పితృస్వామ్య బాధితులం కన్నా రాజ్య హింస, మూస లౌకికవాదం, హిందూత్వ మెజారిటీ విముక్తి వాద బాధితులం అని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ, లీలా అబూ లూగోడ్‌ (పాలస్తీనాలో పుట్టి ముస్లిం సమాజాలపైన అనేక అధ్యయనాలు చేసిన ఆంథ్రోపాలజిస్ట్‌) అన్నట్లు ఇప్పటికీ ముస్లిం స్త్రీలని పితృస్వామ్యం నుండి విముక్తుల్ని చెయ్యాలనే జాడ్యం ఒక పట్టాన ఎవరినీ వదిలి పోవట్లేదు.
ఆయా యువతులని ముస్లిం సమాజ పితృస్వామ్యం నుండి విముక్తి చెయ్యటానికి వాళ్ళు కాలేజీకి హిజాబ్‌ వేసుకోకుండా రావటం ముఖ్యమని అనటం కేవలం ఒక పెత్తందారీ స్త్రీవాదం. కాలేజీలు, కోర్టులు హిజాబ్‌లు వేసుకున్న ముస్లిం బాలికలని స్కూళ్ళకి, కాలేజీలకి రాకుండా చెయ్యటం వారిని చదువు నుండి దూరం చేసి, ముస్లిం సమాజాన్ని లౌకికవాదం పేరుతో ‘వేరుచెయ్యటమే’. కోర్టులు కొత్తగా మతపరమైన చిహ్నాలని నిషేధించటం హిందూ లౌకికతని ఇతరులపైన రుద్దటమే. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవటం, విషయాన్ని మసిపూసి మారేడు కాయ చెయ్యటం తప్ప మరేమీ కాదు!
`

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.