మహిళలలో చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించే నైజీరియన్‌ నవల ‘అమీనా’ -జ్యోతి

‘‘అమీనా’’ మహమ్మద్‌ ఉమర్‌ అనే ఒక నైజీరియన్‌ రచయిత రాసిన మొదటి నవల. ఇది ఇప్పటికి 36 భాషల్లోకి అనువదించబడిరది. దీన్ని రచయిత ఆంగ్ల భాషలో రాశారు. సింహాద్రి సరోజిని ఈ నవలను తెలుగులోకి అనువాదం చేస్తే, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ దీన్ని 2010లో ప్రచురించారు. ఈ మధ్య వచ్చే చాలా అనువాదాలు తెలుగులో పేలవంగా ఉంటున్నాయన్నది

నేను గమనించిన విషయం, అయితే ఈ పుస్తకం మాత్రం అనువాదకురాలు చాలా శ్రద్ధగా పెట్టి తెలుగులోకి తెచ్చారని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాత్రల మధ్య ఎంతో చర్చ నడిచే సమయంలో కూడా ఎక్కడా అది పరభాషా నవల అనే ఆలోచన రానీయకుండా అనువాదకురాలు శ్రద్ధ తీసుకున్నారు. మానవ హక్కులు, పోరాటం, సిద్ధాంతాల చర్చ జరిగే సందర్భాలలో ఆవిడ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని నాకు అనిపించింది. వీరిని తప్పకుండా అభినందించాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఎన్నుకుని ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఇందులో అమీనా అనే ఒక నైజీరియన్‌ మహిళ జీవితం ద్వారా ఆ దేశంలోని మహిళల స్థితిని, వారి దుర్భర జీవితాలను, మానవ హక్కుల ఉనికే తెలియని ఎందరో నిర్భాగ్యుల వేదనాభరిత జీవితాన్ని, మహిళా సమస్యలను, వారిలో రాజకీయ చైతన్యం తీసుకురావలసిన ఆవశ్యకతను రచయిత తెలుపుతారు. ‘‘మనం అవసరమైన విషయాలపై మౌనం వహించిన రోజున జీవితాల ముగింపు మొదలవుతుంది’’ అన్న మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూ మాటను ప్రస్తావిస్తూ రచయిత సామాజిక, రాజకీయ చైతన్యం దిశగా మహిళా ప్రపంచాన్ని నడిపించే ప్రయత్నం చేశారు.
ఇది నైజీరియన్‌ ముస్లిం మహిళల జీవితం మాత్రమే కాదు, ఇందులో ప్రపంచ మహిళ కనిపిస్తుంది. ప్రపంచంలో మహిళ స్థానం, మహిళల పట్ల పురుష సమాజ వైఖరి అన్ని దేశాలలో ఒకే రకంగా కనిపిస్తుంది. ఆర్థికంగా, విద్యాపరంగా కొన్ని సాంస్కృతిక కారణాల వలన కొన్ని దేశాలలో మహిళల జీవనం కాస్త మెరుగ్గా ఉండి ఉండవచ్చు. కానీ ఆ దేశాల పురుషులతో పోలిస్తే ఇప్పటికీ వారు వివక్ష ఎదుర్కొంటున్నారన్నది నిజం. కొన్ని దేశాలలో మహిళల పట్ల వివక్ష తక్కువయితే మరి కొన్ని దేశాలలో చాలా ఎక్కువ. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పవచ్చు. అందువల్లే ఈ నవలలో ప్రస్తావించిన సమస్యలు కేవలం నైజీరియన్‌ ముస్లిం సమాజ సమస్యలు కావు. ప్రతి దేశంలో వివక్షను ఎదుర్కొంటున్న మహిళా సమస్యలు. వీటిని అధిగమించాలంటే పోరాటం ఒక్కటే మార్గమని, స్త్రీలు సంఘటితమవ్వాలని, తమ పరిస్థితి బాగుపడడానికి వారే పూనుకోవాలని, ఉద్యమించాలని, తమ సమస్యల మూలాలను వెతికి పట్టుకోగల సామాజిక స్పృహ, అవగాహన వారికి కలగాలని రచయిత బలంగా కోరుకుంటారు.
ఈ నవలలో ముఖ్య పాత్ర అమీనా. యూనివర్శిటీలో లా చదువుతున్న యువతి. తల్లి ఆమెను చదువుకొమ్మని చాలా ప్రోత్సహిస్తుంది. తండ్రి ఒప్పుకోకపోయినా అతనితో పోట్లాడి మరీ అమీనాను యూనివర్శిటీకి పంపిస్తుంది. చదువు వలనే ఆమె మెరుగైన జీవితాన్ని పొందగలదని ఎన్నోసార్లు అమీనాకు బోధిస్తుంది. అయితే తల్లి ఆరాటం అమీనాకు అర్థం కాదు. ప్రతి కన్నెపిల్లలాగే ఆమెలో ఎన్నో కోరికలు. తల్లి చనిపోయిన తరువాత తండ్రి ఆమె వివాహం జరిపించి చేతులు దులుపుకుంటాడు. అమీనా వివాహం ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ధనవంతుడైన అల్లాజీ హారూన్‌తో జరుగుతుంది. ఆమె అతనికి నాలుగో భార్య. కొత్త భార్యను స్నేహితులకు పరిచయం చేస్తూ అతను ఇలా అంటాడు, ‘‘మన ముస్లిం మతం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను వివాహమాడేందుకు అనుమతిస్తోందని మీ అందరికీ తెలుసు. నూతన విజయం, నూతన భార్య అనేది నా సిద్ధాంతం. అల్లా దయవల్ల నాకు కొన్నేళ్ళ క్రితం స్థానిక ప్రభుత్వ స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం రాగానే మొదటి భార్యను పెళ్ళి చేసుకున్నాను. మళ్ళీ అల్లా దయవల్లనే నేను రాష్ట్ర ఆర్థిక శాఖలో అకౌంటెంట్‌ పదవిని పొందగానే నా రెండవ భార్యను వివాహమాడాను. అల్లా నాకు వ్యాపారం చేసేందుకు మార్గం చూపగానే మూడవ పెళ్ళి చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన దయవల్లనే నేను రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాను. అందుకు నాల్గవ వివాహం చేసుకున్నాను.’’ ఇక అప్పుడు అమీనా వైపు తిరిగి అతను ‘‘నువ్వు నా నాల్గవ భార్యవు. అయితే చివరిదానవు మాత్రం కాదు’’ అంటాడు. ఈ మాటలతో ఆ దేశపు పురుష ప్రపంచంలో భార్యల స్థితిని అంచనా వేయవచ్చు. అతని భార్యలందరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదులలో ఉంటారు. ఒకరి పట్ల మరొకరు అసూయతో రగిలిపోతూ ఒకరిపై మరొకరు భర్తకు పితూరీలు చెబుతూ ఉంటారు. భర్త వాటిని నిజమని నమ్మితే భార్యతో ఎలా అయినా ప్రవర్తించవచ్చు. భర్త తమని ఎక్కడ వదిలిపెడతారో అని భార్యలు నిత్యం భయంతో జీవిస్తూ ఉంటారు. అమీనా ముందు ఆ ఇంట్లో తన సౌకర్యాలకు, విలాసవంతమైన జీవితానికి ఆనందిస్తుంది. ఆమె యూనివర్శిటీలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకురాలు ఫాతిమా ఆమె సహచరి. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా ఫాతిమాతో ఆమె స్నేహం అలానే ఉంటుంది. ఫాతిమా అమీనాకు ప్రపంచం గురించి, అందులో స్త్రీల పరిస్థితులు, ఇవన్నీ చెప్పి ఆమెలో చైతన్యం తేవాలని ప్రయత్నిస్తుంది. హై సొసైటీ స్త్రీలతో కలిసి గడపాలని ముందు అమీనా అనుకుంటుంది. కానీ ఆ ప్రపంచం ఆమెకు నచ్చదు. అంతా నాటకీయంగా అనిపిస్తూ ఉంటుంది. ఫాతిమా విద్యార్థి నాయకులతో జరిపే సమావేశాలను రహస్యంగా అమీనా గదిలో జరుపుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే భర్త, తనను ద్వేషించే ఇతర భార్యలు, తనకు నచ్చని ధనిక వర్గపు స్త్రీల మధ్య ఒంటరైపోయిన అమీనా, ఫాతిమాకు, ఆమె స్నేహితులకు ఎన్నోసార్లు ఆతిథ్యం ఇస్తూ వారి మాటలు వింటూ ఉంటుంది. క్రమంగా ఫాతిమా ఆమెచేత దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై రాసిన పుస్తకాలను చదివిస్తుంది. మార్క్స్‌ కేపిటల్‌తో పాటు నైజీరియా ఉద్యమకారులు, సామాజిక శాస్త్రజ్ఞులు రాసిన పుస్తకాలను చదవడం మొదలెడుతుంది అమీనా.
అమీనాతో కొన్ని వ్యాపారాలు చేయించాలని ఆమె భర్త అనుకుంటాడు. అమీనాకు భర్త ధనవంతులైన స్నేహితులు నచ్చరు. ఫాతిమా ఆమెకు పేదరికపు స్త్రీల జీవితాలను గమనించమని చెబుతుంది. వయోజన విద్యా కేంద్రాలను స్థాపించి స్త్రీలకు చదువు నేర్పించవలసిన అవసరం గురించి చెబుతూ అమీనాలాంటి స్త్రీలు తమకున్న వనరులతో స్త్రీ సమాజానికి ఉపయోగపడాలని ప్రోత్సహిస్తుంది. అమీనా భర్త ఒకసారి ‘‘ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటారని పురుషులు చర్చిస్తారని’’ చెబుతూ స్త్రీల పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. తన భర్తతో పాటు, అతని స్నేహితుల జీవితాలనూ పరిశీలించడం మొదలుపెడుతుంది అమీనా. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమకారులతో చర్చలలో పాల్గొని తమ దేశంలో స్త్రీలను సమాజం ఎలా పెంచుతుందో, స్త్రీలలో ఆలోచనను ఎలా అణిచివేస్తుందో తెలుసుకుంటుంది. ‘‘ఆమెను గృహిణిగా, తల్లిగా తన పాత్రను పోషించేందుకు వీలుగా పెంచుతారని, ఆమె తన సోదరులను తనకంటే ఎక్కువగానూ, భర్తను యజమానిగానూ, సాధారణంగా పురుషుల్ని తమకంటే గొప్పవారిగానూ చూసే విధంగా పెంచబడుతుందని, ఆమె వ్యక్తిగతంగా ఉమ్మడిగా ఎదిగేందుకు
ఉన్న అన్ని అవకాశాలనూ సమాజం కాల రాస్తుందని’’ తెలుసుకుంటుంది. గ్లోరియా అనే మరో స్త్రీ ద్వారా దేశంలో పేదలు ఇంకా పేదవారవడం, ధనికులు ఇంకా ధనికులవ్వడం వెనుక ఉన్న ఆర్థిక అసమానతలను తెలుసుకుంటుంది.
ఆ సమయంలోనే మూడో భార్య, అమీనాపై చెప్పిన మాటలు విని భర్త ఆమెను అనుమానించి ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. ఆమీనాకు భార్యగా ఆ ఇంట్లో తన స్థానం, సమాజంలో తన గౌరవం గురించి మొదటిసారి అనుమానం ఏర్పడుతుంది. ఫాతిమా మాటల్లోని నిజం అర్థమవుతుంది. ఫాతిమా దేశంలోని రాజకీయ ధనవంతులతో చేసిన చర్చలు ఆమెలో చాలా మార్పులు తీసుకువస్తాయి. ‘‘వ్యాపారులు, సాంప్రదాయిక పాలకులు, మత నేతలు, రిటైర్డ్‌ సైనికులు, పోలీసులు, నౌకాదళ అధికారులు, రిటైరైన పౌర ఉద్యోగులు వంటి వారందరూ పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల వెంటబడి పిచ్చి కుక్కల్లా పరగులు తీస్తున్నారు’’ అన్న అవగాహన వచ్చిన తరువాత తన వంతుగా తాను కూడా ఉద్యమం కోసం ఏదో చేయాలనే తపన ఆమెలో బయల్దేరుతుంది. అప్పుడే చిన్నతనంలో వివాహమై బిడ్డను కని ఆరోగ్యం దెబ్బతిన్న ఒక పేద బాలిక స్థితిని ఆమె గమనిస్తుంది. లారై అనే ఆమెను తన సంరక్షణలోకి తీసుకుంటుంది. అటువంటి స్త్రీల కోసం తాను కొంత పని చేయాలని అర్థం చేసుకుంటుంది. ఫాతిమాలోని పట్టుదల, ధైర్యానికి కారణం ఆమె విషయ పరిజ్ఞానమే అన్నది అర్థం చేసుకున్నాక అమీనా కూడా విపరీతంగా చదవటం మొదలెడుతుంది.
అమీనా బకారో ఉమెన్స్‌ అసోసియేషన్‌ అనే సంస్థను ఏర్పాటు చేయడానికి పూనుకుంటుంది. ఫాతిమా, మరికొందరు విద్యార్థి సంఘాల నాయకుల సహాయంతో అమీనా మహిళా సంఘం నిర్వహణ కార్యప్రణాళికను అవగాహన చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. మెల్లిగా తనుకూడా సమావేశాలకు వెళ్ళడం, మాట్లాడడం చేస్తుంది. ముందుగా వయోజన విద్యతో ఆ సంస్థ తన పనులు మొదలెడుతుంది. ప్రభుత్వం తమకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం, చులకన చేయడం, సమస్యలు సృష్టించడం చూశాక ప్రభుత్వ అధికారుల నైజం పట్ల కూడా ఆమెలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం పెంచి పోషించడం చూసి ఆశ్చర్యపోతుంది. మెల్లగా కొందరు నర్సుల సహాయంతో తమ సంస్థ ద్వారా మహిళల ఆరోగ్యం కోసం కూడా పని చేయాలని, మహిళలలో తమ జీవితాల పట్ల అవగాహన తీసుకురావాలని అమీనా ప్రయత్నిస్తూ ఉంటుంది. తమ దేశం మెల్లగా విదేశీ పెట్టుబడులతో ఎలా నిర్వీర్యమ వుతోందో, తమ దేశ రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారో పూర్తిగా ఇప్పుడు ఆమెకు అవగతమవుతుంది.
అమీనా ఆరు నెలల కొడుకు ఒకరోజు జబ్బు పడతాడు. ఇంట్లో భర్త ఉండడు. బిడ్డ మందు కోసం డ్రైవర్‌ను బజారుకు పంపుతుంది అమీనా. మందు తీసుకొచ్చిన తరువాత మందు వేయడానికి డ్రైవర్‌ సహాయం కోరుతుంది. అప్పుడే ఆమె భర్త వచ్చి తన గదిలో పరాయి మగాడున్నందుకు అమీనాను విపరీతంగా కొడతాడు. ఆ రోజు మందు లేక ఆ బిడ్డ చనిపోతాడు. అప్పుడు అమీనాకు తన అస్తిత్వం పట్ల ఎన్నో ప్రశ్నలు పుడతాయి. ఈ సంఘటన తర్వాత ఆమె పూర్తిగా తన సంస్థ కోసం పనిచేయడం మొదలుపెడుతుంది. తనకున్న కొంచెం భూమితో పాటు మరికొందరి భూమిని కలుపుకొని అమీనా సంఘటిత పరచిన స్త్రీలంతా సామూహిక వ్యవసాయం ప్రారంభిస్తారు. మెల్లగా మహిళలను సంఘటితపరచి వారికి చదువుతోపాటు వృత్తివిద్యా తరగతులను కూడా ఆమె నిర్వహిస్తుంది. దేశ, అంతర్జాతీయ సమస్యలపై ఆమె అవగాహన ఎంతగా పెరుగుతుందంటే, తన భర్త పరిచయం చేసిన విదేశీ మిత్రుడితో చర్చకు కూడా ఆమె భయపడదు. తమ పెట్టుబడులు నైజీరియా ఉన్నతికి మూలం అని చెప్పే అతనితో అమీనా ఇలా అంటుంది ‘‘మీరు యంత్ర పరికరాలు ఎందుకు దిగుమతి చేసుకోరు? మీరు ఎప్పుడూ తయారైన వస్తువులనే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? పరికరాలు ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకెందుకు నేర్పరు? మా సహజ వనరులు తీసుకెళ్ళడం పట్ల మీకు ఆసక్తి ఎందుకు? ఆ వనరులను ఇక్కడే ఎందుకు ప్రాసెస్‌ చేయరు? స్థానిక పరిశ్రమను పెరిగేందుకు ఎందుకు ప్రోత్సహించరు? ఇక్కడ పరిశోధనా సంస్థలు నిర్మించడంలోనూ, వాటికి నిధులు సమకూర్చడంలోనూ మీరు ఎందుకు ఆసక్తి చూపరు? మా వనరులు దొంగిలించేందుకు సహాయం చేస్తారు కనుక దేశభక్తి రహిత ఆఫ్రికా నేతలకు మీరెప్పుడూ మద్దతునెందుకిస్తారు? అమాయక ప్రజలను చంపుతారని తెలిసి కూడా మీరు ఆయుధాలను ఎందుకు దిగుమతి చేస్తున్నారు? యుద్ధం వంటి వాటి వల్ల ప్రభావితమవుతున్న లైబీరియా వంటి ప్రాంతాల నుంచి మీరు వజ్రాలను ఎందుకు దిగుమతి చేస్తున్నారు? మరో మాటలో చెప్పాలంటే మీరు ఆఫ్రికాలో యుద్ధాలు, ఘర్షణలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?’’
అమీనా ప్రశ్నలలో ఆమె అవగాహనా శక్తి, నిజాలను నిర్భయంగా చూసి ప్రశ్నించగల ధైర్యం కనిపిస్తాయి. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరగవచ్చని ఆమె భర్త చెప్పినప్పుడు కూడా ‘‘అధికారంలోకి ఎవరు వచ్చినా దేశ పరిస్థితులలో మార్పు ఉండదని, ఒక నిరక్షరాస్యుడైన సైనికుడు తనదైన పద్ధతిలో దేశ నాయకత్వాన్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి తమ దేశ దౌర్భాగ్యం’’ అని ఫాతిమాతో కలిసి ఆలోచిస్తుంది. పన్నులు కట్టమని ఒత్తిడి తెచ్చే ప్రభుత్వంపై స్త్రీలందరూ నిరసన తెలపాలని ఉద్యమిస్తారు. దానికి అమీనా నాయకత్వం వహిస్తుంది. ‘‘నువ్వు ముందుకెళ్తే చనిపోతావు, వెనక్కెళ్ళినా చనిపోతావు. అందువల్ల ముందుకెళ్ళేందుకే నిశ్చయించుకో’’ అంటూ మహిళలంతా ఒక్క తాటిపై నిలిచి ప్రశాంతంగా ప్రభుత్వ వైఖరి పట్ల తమ నిరసన తెలుపుతారు. ప్రభుత్వం పోలీసులను పంపి మహిళా సమావేశంపై స్మోక్‌ బాంబులను విసరడంతో కొందరు మహిళలు గాయపడతారు. లారై పోలీసు కాల్పులలో మరణిస్తుంది. అమీనా కూడా చాలా దెబ్బలు తిని జైలు పాలవుతుంది. ఆమె భర్త ప్రభుత్వ పోలీసులతో జైలుకు వచ్చి వారి నిరసన ప్రతిపక్షాల ప్రోద్భలంతో జరిగిందని చెప్పి శిక్ష తప్పించుకోమని చెప్పినా అమీనా అమ్ముడుపోవడానికి ఒప్పుకోదు. చివరకు ఆమె మరో స్నేహితురాలు లాయరుగా వాదించి ఆమెని విడిపించడం జరుగుతుంది. విద్యార్థి నాయకులను ప్రభుత్వం జైలు పాలు చేస్తుంది. ముఖ్య నాయకులు విదేశాలకు పారిపోతారు. అక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అమీనాను భర్త ఆమె కోసం కట్టిన కొత్త ఇంటికి తీసుకువస్తాడు. ఆమెకు మరిన్ని విలాసాలు సమకూర్చి ఆమెను ఉద్యమం నుండి మళ్ళించాలని ప్రయత్నిస్తాడు. గర్భవతి అయిన అమీనా అతనికి ఎదురు చెప్పదు. ప్రభుత్వం మారిన తరువాత పాత ప్రభుత్వంలోని మంత్రులే ఈ ప్రభుత్వంలో చేరి పెద్ద పదవులలోకి వెళ్తారు. ఆమె భర్త కూడా పాత ప్రభుత్వాన్ని వదిలిపెట్టి అవకాశవాదిగా మరో పెద్ద పదవిని పొందుతాడు. ఆమెకు కూడా ప్రభుత్వం తమ శాఖలో ఒక పదవిని ఇవ్వాలని అనుకున్నప్పుడు అమీనా తాను ఆ పదవిని స్వీకరించనని, తన నమ్మకాలను, ఆదర్శాలను అమ్ముకోనని, తన తోటి స్త్రీల అభివృద్ధికి సంబంధించిన పనులు తాను ఇక ముందు కూడా చేస్తానని గట్టిగా చెబుతుంది. విదేశంలో ఉన్న ఫాతిమాతో సంభాషిస్తూ తన కొత్త కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది.
నవల మొదట్లో అమీనా ఒక నిస్సహాయ, అందమైన, ముస్లిం ధనికుని భార్యగా కనిపిస్తుంది. కానీ చదువు తెచ్చిన అవగాహనతో ఉద్యమంలో పనిచేస్తున్న మిత్రుల సహాయంతో ఎదుగుతుంది. తన తోటి స్త్రీల కోసం పనిచేయడమే కాక చివరకు తన దేశ భవిష్యత్తు కోసం తానే ఉద్యమకారిణిగా మారడానికి సంసిద్ధమవుతుంది. ఆమెలో విద్య తెచ్చిన ఈ మార్పు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సరైన సామాజిక అవగాహనతో స్త్రీలు ఒకటిగా నిలబడితే తమ ఉన్నతి కోసం తాము ఎంత పని చేయవచ్చో, ఎందరికి స్ఫూర్తిదాయకం కావచ్చో అమీనా జీవితం చెబుతుంది. ధనమనే మోహంలో విలాసాల మోజుతో విద్యావంతులైన స్త్రీలు సోమరులుగా బతుకుతున్న సమాజంలో స్త్రీ విద్య, స్త్రీ చైతన్యం, స్త్రీల ఐకమత్యం ఎన్ని ఆశాజనకమైన మార్పులు తీసుకురాగలవో, దేశ భవిష్యత్తుకు ఎటువంటి పునాదులు వేయగలవో చర్చించిన గొప్ప నవల అమీనా. ఇది చదువుతున్నంతసేపూ ఇది కేవలం నైజీరియాలో స్త్రీల జీవితం అనిపించదు. మన చుట్టూ మనం చూస్తున్న స్త్రీల నిస్సహాయత, అవిద్య, బేలతనం… అన్నీ ఆ పాత్రలలో కనిపిస్తాయి. కానీ తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి తాము ప్రయత్నించాలనే అవగాహన వారిని శక్తివంతమైన మనుషులుగా మారుస్తుంది. స్త్రీ చైతన్యం నేటి సమాజ అవసరం. దాన్ని గొప్ప ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తావించిన నవల అమీనా. ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప అనువాద నవల ఇది. ఇందులో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చలుంటాయి. అవి ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను పరిచయం చేస్తాయి. ‘‘అమీనా’’ చాలా విలువైన సమాచారమిచ్చే స్ఫూర్తిదాయకమైన నవల. రచయిత చాలా గంభీరమైన అంతర్జాతీయ విద్రోహాలను సరళమైన భాషలో విపులంగా చర్చించే ప్రయత్నం చేయడంతో ఇది అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.
(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.