సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ తన జీవితంలో ఎవరికి ఋణపడి ఉండాలో, ఎవరెవరికి విధేయురాలై జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలో వారంతా వెళ్ళిపోవడంతో లత తనకు అవకాశాలిచ్చిన వారికి, తాను విజయ పథంలో ప్రయాణించేందుకు తనతో పాటు ప్రయాణించిన వారికి విధేయురాలిగా

ఉంది తప్ప ఎన్నడూ ఎవరికీ కృతజ్ఞురాలిగా ఉండలేదు. ఎవరెంతగా సన్నిహితులైనా ‘లత నా మాట వింటుంది. నేను చెప్పినట్టు చేస్తుంది’ అనేంత చనువు, ధైర్యం ఎవరికీ లేవు. జీవితంలో పోరాటాలన్నీ లత ఒంటరిగా చేసింది. ఈ పోరాటాలన్నిటిలో లత వెంట నిలిచింది, ఆమెకు తోడుగా ఉన్నదీ, ఆమె శక్తి, ఆమె విశ్వాసం, ఆమె స్వరం మాత్రమే. అందుకే లత దైవాన్ని నమ్ముకుంది. తన స్వరాన్ని నమ్ముకుంది. స్వరాన్నే ఆయుధంలా ప్రయోగించింది. తన స్వరంతోనే ప్రజలపై రసవృష్టి కురిపించింది. తన స్వరంతోనే తనను అవమానించిన వారికి పాఠాలు నేర్పింది. స్వరంతోనే ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ప్రతి వ్యక్తికీ సన్నిహితురాలై, హితురాలై మార్గదర్శనం చేసింది. ఎవరికీ తలవంచలేదు. ఎవరినుంచీ ఏమీ ఆశించలేదు, అభ్యర్థించలేదు. తన పద్ధతిలోనే జీవించింది. తనకు నచ్చిన పని నచ్చినట్టు చేసింది. నచ్చిన వారితో పనిచేసింది. నచ్చనివారితో పనిచేయలేదు. ఒక్కసారి ఆమె కాదు అన్న తర్వాత ఎవరెంతగా బ్రతిమలాడినా ఆమె అవును అనలేదు. ఆమెని బెదిరించే ధైర్యం ఎవరికీ లేదు. ఆమెకు ప్రత్యామ్నాయ గాయనిలను నిలపాలని ప్రయత్నించి భంగపడిన వారిని ఆమె ఏమీ అనలేదు, క్షమించింది. వారు మళ్ళీ తమకు పాడమన్నప్పుడు పాడిరది. దీన్ని ప్రపంచం అహంకారంగా, ఆధిక్యంగా అనుకుంటే అనుకొమ్మంది. తానేమిటో తెలిసినవారు ఇతరుల మెప్పు కోరరు. అపోహలను, విమర్శలను పట్టించుకోరు. అందుకే లతా మంగేష్కర్‌ కష్టకాలం అధిగమించి విజయపథం వైపు సాగిపోతూ ‘ఆర్తి’ సినిమాలో రోషన్‌ స్వరపరచగా మజ్రూప్‌ా సుల్తాన్‌ పురి రచించిన ఈ పాట పాడుతున్నదనిపిస్తుంది. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.
కభీతో మిలేగీ, కహీతో మిలేగీ బహారోంకీ మంజిల్‌, రాహీ…
ఓ పథకుడా ఎప్పుడో, ఎక్కడో నీకు గమ్యం లభిస్తుంది. నడుస్తూ పోవడమే నీ పని.
లంబీ సహీ దర్ద్‌ కీ రాహే, దిల్‌ కీ లగన్‌ సే కామ్‌ లే ఆంఖోంకీ ఇస్‌ తుఫాన్‌ కో పీజా, అహోంకే బాదల్‌ థామ్‌ లే
దూర్‌ తో హై పర్‌, దూర్‌ నహీ హై నజారోంకి మంజిల్‌, రాహీ…
బాధలు కఠినం కావచ్చు. మనోబలంతో, దీక్షతో ముందుకు సాగాలి. కళ్ళల్లో చెలరేగుతున్న తుఫానులాంటి కన్నీళ్ళను పట్టించుకోవద్దు. నిరాశా నిట్టూర్పుల మేఘాలను అదిమిపట్టు. నిజానికి సుందరమైన దృశ్యాల (సుఖ సంతోషాల) గమ్యం ఎంతో దూరం ఉంది. కానీ నిజంగా అంత దూరం కాదు. ముందుకు సాగిపో. 1945లో మాస్టర్‌ వినాయక్‌ మరణంతో అంధకారంగా, అగమ్యగోచరంగా అనిపించిన భవిష్యత్తు 1948కల్లా స్పష్టమయింది. 1950కల్లా లత అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది. ‘దూర్‌ తో హై… పర్‌ దూర్‌ నహీ హై!!!’
మానా కె హై గెహరా అంధేరా గమ్‌ హై డగర్‌ కీ చాంద్‌నీ
మైలీ నహీ, ధుంధ్‌ లీ పడేనా దేఖ్‌ నజర్‌ కీ చాంద్‌ నీ
డాలే హువే హై రాత్‌ కీ చాదర్‌ సితారోంకీ మంజిల్‌, రాహి…
అత్యద్భుతమైన, స్ఫూర్తివంతమైన కవిత్వం.
అంధకారం దీర్ఘమతం. దారిలో పరచుకున్నది వేదనామయమైన వెన్నెల. అంటే వేదనకే దారి చూపించే వెలుగుగా మలచుకొమ్మంటున్నాడు. కళ్ళల్లోని వెన్నెల తగ్గకూడదు, మలినం కాకూడదు. కళ్ళల్లో వెన్నెల అంటే ‘ఆశ’, ఆత్మ విశ్వాసం. రాత్రి తారకల దుప్పటి పరచింది. ముందుకు సాగిపో నిరాశకు తావివ్వకుండా… ఎంతో ధైర్యవంతులు కూడా భయపడి బలహీనమయ్యేటటువంటి పరిస్థితులను తట్టుకుని పోరాడి విజయ శిఖరాలను అధిరోహించింది లతా మంగేష్కర్‌. అయితే అంకెల్లో, గణాంక వివరాలలో లతా మంగేష్కర్‌ ఎంతో సులభంగా విజయ సోపానాల్ని అధిరోహించిందని అనిపించవచ్చు కానీ గణాంక వివరాలకు భావనలుండవు. అవి మనస్సు లేనివి. గణాంక వివరాల పొరలను తొలగించి చూస్తే, రెండు మూడు సంవత్సరాలలో అతి సులువుగా విజయం సాధించినట్టు కనబడినా, ఈ విజయం వెనుక లత పడిన శ్రమ, సాధన, అనుభవించిన ఆశ, నిరాశలు కనిపిస్తాయి. రికార్డింగ్‌ వ్యవస్థలో సాధించిన సాంకేతిక అభివృద్ధి ఏ రకంగా లత విజయానికి మార్గం సుగమం చేసిందో అన్న విషయాన్ని పరిశీలిస్తే కానీ లతా మంగేష్కర్‌ను అర్థం చేసుకోవటం కుదరదు.
తక్‌దీర్‌ జగాకర్‌ ఆయా హు మై ఏక్‌ నయీ దునియా బసాకర్‌ లాయీ హు
‘దులారీ’ సినిమాలో నౌషాద్‌ దర్శకత్వంలో శంషాద్‌ బేగమ్‌, మహమ్మద్‌ రఫీలతో కలిసి లత పాడిన ఈ పాట ఒక రకంగా లతా మంగేష్కర్‌ సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించినప్పటి పరిస్థితులను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి తన అదృష్టాన్ని నుదుటిపై రాయించుకుని ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడని అంటారు. లతా మంగేష్కర్‌ సినీ సంగీత జీవితాన్ని పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తుంది. ఎందుకంటే లతా మంగేష్కర్‌ సినీ ప్రపంచంలో అడుగు పెట్టేసరికి నేపథ్యగానం అభివృద్ధి చెందుతోంది. పాటల రికార్డింగ్‌ సాంకేతికంగా అభివృద్ధి పథంలో పరుగులిడుతోంది. దేశం నలువైపుల నుండి యువ గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, సంగీత వాయిద్యాల నిష్ణాతులు, గేయ రచయితలు సినీ రంగంలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. కొత్త కొత్త కళాకారులు, దాదాపుగా సినిమాకు సంబంధించిన అన్ని రంగాలకు చెందినవారు, సినీ పరిశ్రమను రూపాంతరం చెందించి కొత్త దిశ వైపు నడిపించేందుకు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అంతవరకూ సినీ రంగానికి దిశానిర్దేశం చేసిన పాత తరం నెమ్మదిగా తెర వెనక్కు వెళ్ళిపోతోంది. అంటే కొత్త నీరు దూసుకువస్తుంటే, పాత నీరు ఆ కొత్త నీటికి దారి సుగమం చేస్తూ వెనక్కు వెళ్ళిపోతోందన్నమాట. ఇలాంటి సమయంలో, ఒక అల తీరాన్ని తాకి వెనక్కి వెళ్తూ, ముందుకు దూసుకువస్తున్న అలతో నిర్మాణాత్మకమైన రీతిలో కలిసి, ఆ అలను మరింత ఎత్తుకు ఎగదోస్తున్న సమయంలో, ఆ ఎగసిపడే అల శృంగంపై నిలిచి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎగసిందన్నమాట లతా మంగేష్కర్‌. ఇది మరింత స్పష్టం కావాలంటే, లతా మంగేష్కర్‌ సినీ ప్రపంచంలో అడుగు పెట్టినపుడు రికార్డింగ్‌ వ్యవస్థ ఎలా ఉండేదో, అది ఎలా అభివృద్ధి చెందిందో గమనించాల్సి ఉంటుంది.
ఆరంభంలో సినిమాల్లో మాటలుండేవి కావు. శబ్దాలుండేవి కావు. అవి ‘మూకీ’ సినిమాలు. ఆ కాలంలో సినిమా నేపథ్య సంగీతం అంటే, తెరపై బొమ్మలు కదులుతుంటే, తెర ముందు లేక తెర వెనుక వాయిద్యకారులు కూర్చుని తెరపై కనిపిస్తున్న దృశ్యానికి తగ్గట్టు వాయిద్యాలు వాయించేవారు. వీరికి తెరపై దృశ్యం ఉత్సాహంగా అనిపిస్తే వాయిద్యాల వేగం పెంచేవారు. లేకపోతే తగ్గించేవారు. పియానో, వయొలిన్‌, హార్మోనియం, తబలా ఇలా వాయిద్యాలను తెర ముందు తయారుచేసి ఒక గుంటలో కూర్చుని వాయించేవారు. కొన్ని స్థలాలలో ఓ వ్యాఖ్యాత తెర పక్కన నుంచుని తెరపై కనిపిస్తున్న దృశ్యాన్ని వ్యాఖ్యానించేవాడు. విదేశీ సినిమాలకు విదేశీ సంగీతం అందించేవారు.
“The Indian Silent Film” edited by – T.M.Ramachandran పుస్తకంలో (page.20) ఆ కాలంలో తెరపై కనపడే దృశ్యాలకు తగ్గ సంగీతాన్ని అందించే విధానం గురించిstock melodies were availed to go in harmony with the action on the screen’ అన్నారు. సినిమాతో పాటు థియేటర్లకు వాయిద్యకారులు ప్రయాణించేవారు. అదే సంగీతాన్ని అన్నిచోట్లా మ్రోగించేవారు.
‘The Cinema owners used to engage local musicians who used to sit close to the screen and played some hybrid tunes, to match the projected image on the screen, for all the three shows’ (The One and Only Kidar Sarma. Page No.50).
తెరపై కనబడే కదిలే బొమ్మలపై శబ్దాన్ని ముద్రించగల సాంకేతిక పరిజ్ఞానం సినీరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. ఇక్కడ అసందర్భమైన, ఒక గమ్మత్తైన విషయాన్ని చర్చించాల్సి ఉంటుంది. ఆ కాలంలో నిశ్శబ్ద చలన చిత్రాలను ఆకర్షణీయం చేసేందుకు వాడిన అనేక పద్ధతులు తర్వాత కాలంలో నేపథ్య సంగీతం, పాటలు చేశాయి. 1920లో విడుదలైన ‘విక్రమ్‌ ఊర్వశి’ అనే సినిమాను ప్రేక్షకులకు ఆకర్షణీయం చేసేందుకు నిర్మాతలు సినిమా ‘విశ్రాంతి’ సమయంలో ఆ కాలం నాటి ‘సెక్సీనటి’ ‘లీనా వాలెంటీనా’తో నృత్యం చేయించేవారు, ఇప్పటి ‘ఐటం నెంబర్‌’లాగా! ఆమె నృత్యం చూసేందుకు ప్రజలు విరగబడేవారట!
ఆ కాలం నాటి ‘హీర్‌ రాంరaా’, ‘అనార్కలి’ వంటి సినిమాలలో అసంఖ్యాకమైన ముద్దుల దృశ్యాలుండేవి. ప్రేమికుల నడుమ ఉన్న తీవ్రమైన ప్రేమను, ప్రేమ గాఢతను చూపించేందుకు ముద్దులను విరివిగా వాడేవారు. ‘సతీ అనసూయ’ (1921) అనే సినిమాలో అనసూయ (సకినాబా) ను నగ్నంగా చూపించారు కూడా! సినిమా ప్రకటనలలో కూడా ఇలాంటి దృశ్యాలనే ప్రధానంగా వాడేవారు. దాంతో నాయికా నాయకులకు ప్రజలలో విపరీతమైన అభిమానం వచ్చి ‘స్టార్లు’గా ఎదగడం అరంభమయింది. ఈ రకంగా సులోచన (రూబీ మేయర్స్‌), గోహార్‌, జేబున్నీసా, రామ్‌ ప్యారి, జుబేదా, రేమిస్మిత్‌ (సీతాదేవి), రాజాసాండో, మాస్టర్‌ విఠల్‌, బిల్లిమోరా వంటి వారు బాక్సాఫీసు బద్దలు కొట్టే స్టార్లుగా ఎదిగారు.(Hindi Film Song : Music Beyond Boundaries-by Ashok Da. Ranade. Page No.93-94). అయితే ‘సైలెంట్‌ సినిమాలు’ ప్రజలలో విపరీతమైన ఆదరణ పొందుతున్న తరుణంలో సినిమాలకు మాటలొచ్చాయి. సినిమాలకు మాటలు రావటంతో సినీ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అంతవరకూ గొప్ప నటీనటులుగా చెలామణి అవుతున్నవారు హఠాత్తుగా మాట్లాడాల్సి రావటం అనేక ఇబ్బందులను కలిగించింది. ఇంతకుముందు అందంగా కనిపిస్తే చాలు, ఇప్పుడు ఆకారానికి తగ్గ స్వరం అవసరమయింది. లేకపోతే బలిష్టంగా ఉండే వ్యక్తి కీచుగొంతు హీరోగా ప్రజలను మెప్పించటంలో అవరోధమయింది. దాంతో నటీనటుల కెరీర్లు తలక్రిందులయ్యాయి. సినీ పరిశ్రమ పెద్ద తుఫానుకో, భూకంపానికో గురయినట్లయింది.
దాదాసాహెబ్‌ ఫాల్కే, బాబూరావు పెయింటర్‌ వంటి వారు కూడా సినిమా ‘శబ్దమయం’ అవటాన్ని వ్యతిరేకించారు. సినిమా మాట్లాడటం వల్ల ‘భాష’ సమస్యగా పరిణమిస్తుందని భావించారు. భాష శబ్దం ‘కెమెరా భాష’ను అణచివేస్తుందని వారు భయపడ్డారు. హాలీవుడ్‌లో చార్లీ చాప్లిన్‌ కూడా, ఓ వ్యక్తి భాష తెలియని దేశంలో నృత్యం ద్వారా, మైమింగ్‌ ద్వారా వారితో సంభాషించటం చూసి, భాష శబ్దం అర్థం చేసుకోవటం కొందరికే పరిమితం అనీ, సినిమా భాష సార్వజనీనం అనీ ప్రదర్శించాడు. కానీ ముంచుకొస్తున్న సాంకేతిక ప్రగతి ప్రవాహం అన్ని అడ్డంకులను ముంచి ముందుకు సాగింది. 1931లో 24 టాకీ సినిమాలు విడుదలైతే, 207 నిశ్శబ్ద చలనచిత్రాలు తయారయ్యాయి. 1934కల్లా ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయి. 1934లో కేవలం ఏడు నిశ్శబ్ద నిశ్చల చలనచిత్రాలు విడుదలయ్యాయి. ఇది స్పష్టం చేస్తుంది, ఏ రకంగా సాంకేతిక అభివృద్ధి వల్ల సినిమాకు కొత్త నీరు అవసరమయిందో! సినిమా రూపాంతరం చెందిందో!
సినీ రంగంలో దాదాపు సగటున ప్రతి అయిదేళ్ళకు మార్పులు వస్తాయి. ఈ మార్పు సాంకేతికం కావచ్చు. నటనలోనో, స్క్రిప్టు రచనలో, సినిమాకు సంబంధించిన ఇతర ఏ అంశంలోనో కావచ్చు. దీన్నే ‘ట్రెండు’ మారటం అంటారు. ట్రెండు మారినప్పుడల్లా వ్యక్తుల అదృష్టాలు మారుతుంటాయి. అంతవరకూ తారల్లా వెలుగొందినవారు బూడిదలా మిగిలిపోతారు. ఎవరూ ఊహించని వాడు తారల్లా మెరిసిపోతాడు. ఎవరైతే మారుతున్న ట్రెండును గమనించి దానికి తగ్గట్టు తానూ మారతాడో ఆ కళాకారుడు దీర్ఘకాలం ట్రెండులను తట్టుకుని నిలబడగలుగుతాడు. అయిదేళ్ళకు ట్రెండు మారినా, దాని ప్రభావం ప్రస్ఫుటమయ్యేసరికి మరో నాలుగైదేళ్ళు పడుతుంది. కాబట్టి ఒక కళాకారుని జీవితకాలం ఉచ్ఛదశలో కొనసాగటం సగటున అయిదు నుంచి పదేళ్ళుగా భావిస్తారు. టాకీలు రావటంతో సినిమాకు మాటలతో పాటు పాటలు కూడా వచ్చాయి.
దాంతో నటీనటులకు అందంతో పాటు చక్కని స్వరం కూడా అవసరమయింది. పాటలు పాడగలగటం అవశ్యకమైన అర్హతలా ఎదిగింది. పాటలతో పాటు సంగీత దర్శకులు, వాయిద్య కళాకారులు అవసరమయ్యారు. స్టూడియో పద్ధతి పెద్ద ఎత్తున అమల్లోకి వచ్చింది. ఆ కాలంలో కొల్హాపూర్‌, పూనా, బొంబాయి, కలకత్తా, లాహోర్‌ వంటి ప్రాంతాలు సినీ నిర్మాణానికి పెట్టింది పేరు. కళాకారుల నడుమ పోటీ ఉండేది. పూనాలో వి.శాంతారామ్‌, బాబూరావ్‌ పెయింటర్‌, కలకత్తాలో పి.సి.బారువా, దేవకీ బోస్‌, నితిన్‌ బోస్‌ వంటివారు ఉండేవారు. వీరంతా బొంబాయి వచ్చి చేరారు. దేవకీ బోస్‌ అసిస్టెంట్‌ అయిన కిదార్‌ శర్మ బొంబాయి వచ్చి పెద్ద నిర్మాత దర్శకుడయ్యాడు. ఆయన మధుబాల, రాజ్‌కపూర్‌ వంటి వారిని పరిచయం చేశాడు. కిదార్‌ శర్మ అసిస్టెంట్‌గా ఆరంభించిన రాజ్‌ కపూర్‌ నటుడు, నిర్మాత, దర్శకుడై హిందీ సినిమాలో నూతన యుగానికి నాందీ ప్రస్తావన చేశాడు. శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శక జంటకు ‘బర్సాత్‌’ సినిమాలో అవకాశమివ్వటం ద్వారా ‘సినిమా’ పాట దశ, దిశ మారటంలో రాజ్‌కపూర్‌ తోడ్పడ్డాడు. ‘బర్సాత్‌’ పాటలతో శంకర్‌ జైకిషన్‌, లతల నడుమ ఏర్పడిన దోస్తీ లత అగ్రశ్రేణి గాయనిగా ఎదగటాన్ని వేగవంతం చేసింది.
బిమల్‌ రాయ్‌పై నితిన్‌ బోస్‌ ప్రభావం ఉంది. బిమల్‌ రాయ్‌ ప్రభావం హృషికేశ్‌ ముఖర్జీ, బాసు భట్టాచార్య, గుల్జార్‌ వంటి వారిపై ఉంది. భవిష్యత్తులో వీరి సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిరది లత. ఈ రకంగా సినిమాలకు ‘శబ్దం’ రావటం సినిమాలోనూ, కళాకారులలోనూ అనూహ్యమైన విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. స్టూడియో పద్ధతి రావటంతో కళాకారులు స్టూడియోలలో జీతానికి కుదిరేవారు. ఎన్ని సినిమాలలో పనిచేయాలో ఒప్పందాలు జరిగేవి.”Musicians were on the payroll of the studio and here collectively known as orchestra in the studio phase. (Hindi Film Song: Music Beyond Boundaries by Ashok Da. Ranade.) 1933లో గ్రామఫోను రికార్డులు రంగ ప్రవేశం చేశాయి. ‘మాధురి’ సినిమా పాటలు పాడిన పండిత వినాయకరావు పట్వర్థన్‌ తొలి రికార్డు తయారయిన గాయకుడయ్యాడు. ఎప్పుడైతే పాటను రికార్డు చేయటం మొదలైందో, అప్పుడే పాటకు విలువ పెరిగింది. అంతకుముందు పాట వినాలంటే సినిమాకు వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు రికార్డు కొనుక్కుంటే ఎప్పుడంటే అప్పుడు వినవచ్చు. దాంతో రికార్డుల అమ్మకాలు పెరిగాయి. ఈ ‘పాటలు’ సినిమా వ్యాపారంలో ఒక ప్రత్యేక ఉప వ్యాపారంగా ఎదిగాయి. ఇది సంగీత దర్శకుడు, గేయ రచయిత, గాయనీ గాయకులకు విలువనిచ్చింది, శక్తిని ఆపాదించింది.
1936లో సినిమాలో ‘సంగీతం’ నాదంటే నాదని సంగీత దర్శకుల నడుమ పోరాటాలు ఆరంభమయ్యాయి. ఉదాహరణకు మహబూబ్‌ ఖాన్‌ సినిమా ‘మన్‌ మోహన్‌’లో ‘తుమ్హీనే ముర్‌a కో ప్రేమ్‌ సిఖాయా’ అనే పాట ఆ కాలంలో సూపర్‌ డూపర్‌ హిట్‌అయింది. పాడిరది నటుడు, గాయకుడు సురేంద్ర. సంగీత దర్శకుడు అశోక్‌ ఘోష్‌. కొన్నేళ్ళ తర్వాత అనిల్‌ బిశ్వాస్‌ ఆ పాటను రూపొందించింది తానని, పొరపాటున అశోక్‌ ఘోష్‌ పేరు పడిరదని, ఒక స్టూడియోలో పలువురు సంగీత దర్శకులు ఉండటం వల్ల ఇలాంటి పొరపాట్లు జరిగేవని వ్యాఖ్యానించాడు. అయితే ఆ పాటను పాడి నటించిన నటుడు సురేంద్ర మాత్రం ఆ పాటను రూపొందించింది ‘అశోక్‌ ఘోష్‌’ అన్నాడు. దాంతో అనిల్‌ బిశ్వాస్‌, సురేంద్రల నడుమ వాదోపవాదాలు నడిచాయి. అంటే ఆ కాలంలోనే ఒక పాట ‘తనది’ అని నిరూపించుకోవటం వల్ల ఎన్నో లాభాలుండేవన్నమాట!
ఓ వైపు సైగల్‌, పంకజ్‌ మల్లిక్‌ వంటివారు తమ పాటలతో ప్రజలను అలరిస్తూ పోతుంటే మరోవైపు సాంకేతిక ప్రగతి వల్ల సినిమాల్లో ‘నేపథ్య సంగీతం’ ఆరంభమయింది. ఇంతలో 1935లో ఆర్‌.సి.బోరాల్‌, పంకజ్‌ మల్లిక్‌లు నేపథ్య గానానికి శ్రీకారం చుట్టారు. 1940 కల్లా ప్రొఫెషనల్‌ నేపథ్య గాయనిలు రంగప్రవేశం చేశారు. శంషాద్‌ బేగం ‘ఖజాంచి’ అనే సినిమాలో తొమ్మిది పాటలతో నేపథ్య గానం ట్రెండ్‌ను వ్యాపారపరంగా విజయవంతం చేసింది. ‘ఖజాంచి’ పాటల ఘన విజయంతో సంతుష్టి చెందిన నిర్మాత, సంగీత దర్శకుడు గులామ్‌ హైదర్‌ ఓ ‘రేలిగ్‌ సైకిల్‌’ అడిగాడట! రూ.40/` రేలిగ్‌ సైకిల్‌ ఎక్కి గులామ్‌ హైదర్‌ ప్రపంచాన్ని గెలిచినట్టు భావించేవాడట! ఆ కాలం అలాంటిది. హిందీ సినిమాలలో ‘పాటలెందుకు?’ అనేవారికి కనువిప్పు కలిగించే సంఘటన 1937లో జరిగింది. వాడియా మూవీటోన్‌ వారి సినిమా ‘నౌజవాన్‌’లో ఒక్క పాట కూడా లేదు. ఆ సినిమా చూసిన ప్రజలు ఆగ్రహావేశాలు పట్టలేక, ఒక్క పాట కూడా లేని సినిమా తీసి నిర్మాత తమను మోసం చేశాడని భావించి ‘వాడియా నే లూట్‌ లియా’ అని కేకలు పెడుతూ సినిమా తెర చించేశారు, కుర్చీలు విరగ్గొట్టారు. దాంతో సినిమా ప్రదర్శన ఆపేయాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటన చాలు టాకీలు వచ్చి… సినిమాలు మాటలు, పాటలు ఆరంభించడంతో పాటలు సినిమాలో ఎంతగా విడదీయరాని అంగం అయ్యాయో, ఒక సినిమా జయాపజయాలను, ప్రేక్షక ఆకర్షణను పాటలు ఎంతగా నిర్దేశించేవో అర్థం చేసుకునేందుకు!
ఈ సందర్భంగా ఆ కాలంలో పాటలు, గాయనీ గాయకులకు సంబంధించిన కొన్ని అంశాలను స్పృశించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గొప్పగా భావిస్తున్న సైగల్‌ పాట పాడే విధానం ఏర్పడటానికి కారణం సైగల్‌ గొంతు పాడవటం అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సైగల్‌కు జలుబు చేసి గొంతు గరగరమనటం ఆరంభించింది. బొంగురు గొంతు అయింది. దాంతో పాటల రికార్డింగ్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంత కాలానికీ అతని గొంతు బాగుకాకపోవడంతో అతను గొంతుకు శ్రమ ఇవ్వకుండా మెల్లిగా, మెత్తగా, మైక్రోఫోనుకు దగ్గరగా ఉండి పాడటం ఆరంభించాడు. ఆ పాటలు ప్రజలను విపరీతంగా అలరించటంతో సైగల్‌ అలాగే పాడాల్సి వచ్చింది. అది సైగల్‌ పాట పాడే విధానంగా ప్రఖ్యాతి పొందింది. మైక్రోఫోను, సౌండ్‌ ట్రాక్‌ల సాంకేతిక పరిమితులకు ఆ స్వరం స్థాయి చక్కగా సరిపోవటంతో సైగల్‌ ‘తొలి మైక్రోఫోన్‌ సూపర్‌ హిట్‌ సింగర్‌’గా ఎదిగాడు.
“In this way, partly by accident, was born a singing style that soon spread over India, and that somewhat resembles a simultaneous western development, the Microphone crooner’ అంటారు బార్నో, కృష్ణస్వామిindian film లో.
సైగల్‌ పాట హిట్‌ అవ్వటంతో అప్పటివరకూ శాస్త్రీయ రాగాలపై ఆధారపడిన హిందీ సినిమా పాటలు లైట్‌ క్లాసికల్‌ గీతాలుగా మారాయి.”Saigal is credited with the introduction of light classical style which became popular through other movies and phonograph recording and film songs. (The Bombay Hindi Film song Genre: A Historical Survey by Teri Skillman.) సైగల్‌ గానం ఆ కాలంలో పాట రికార్డింగ్‌కు అమలులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సరిగ్గా సరిపోయింది. శబ్దాన్ని రికార్డు చేసే మైక్రోఫోన్‌ కదలకుండా స్థిరంగా ఉండాలి. లేకపోతే ఇతర అనవసర శబ్దాలు రికార్డవుతాయి. కాబట్టి నటీనటుల కదలికలు కూడా పరిమితంగా ఉండాల్సిందే. కానీ 1940లో, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాధించిన సాంకేతిక ప్రగతి సినిమా పాటల రికార్డింగ్‌ను, నేపథ్య సంగీతాన్ని అనూహ్యంగా మార్చివేసింది.
‘నేపథ్యగానం’ ఆరంభమవటంతో నటీనటులు స్వేచ్ఛ పొందారు. వారిప్పుడు తప్పనిసరిగా పాడాల్సిన అవసరం లేదు. నటీనటులు స్వతహాగా ‘పాట’ వచ్చినవారు కాకపోవటంతో పాటలు పాడేందుకు వారు తిప్పలు పడేవారు. వారు పాడగలిగేటటువంటి పాటలను రూపొందించేందుకు సంగీత దర్శకులు తంటాలు పడేవారు. వారి సృజనపై బోలెడన్ని పరిమితులుండేవి. పైగా మైక్రోఫోన్‌లు అంత శక్తిమంతమైనవి కాకపోవడంతో వాయిద్యాల వాడకం కూడా పరిమితంలోనే ఉండాల్సి ఉండేది. ఆ కాలంలో మానవ చెవి వినగలిగే శబ్ద తరంగాలలో కొన్ని శబ్దాలనే రికార్డు చేయగలిగేవారు. దాంతో పాటలలో వాయిద్యాల కన్నా మానవ స్వరానికే ప్రాధాన్యం ఉండేది. ఇది పాట అలవాటు లేని గాయనీ గాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసేది. అశోక్‌ కుమార్‌ లాంటి వారికి పాటలు పాడటం ప్రాణ సంకటంగా ఉండేది. ‘నేపథ్యగానం’ నటీనటులకు, సంగీత దర్శకులకు విధించిన సంకెళ్ళను పరిమితులను తొలగించింది. నేపథ్య గాయనీ గాయకులనే కొత్త ‘జీవి’కి సినీరంగంలో స్థానం లభించింది.
‘నటీనటులకు తప్పకుండా పాట రావాలి’ అనే నిబంధన తొలగడంతో యువకులెందరో సినీ రంగంలో ఎంతో ఉత్సాహంగా ప్రవేశించారు. యువతులు కూడా నాయికలయ్యేందుకు పోటీపడుతూ సినీరంగం వైపు ప్రయాణించారు. ఇదే సమయంలో ‘పాట’ తెలిసినవారు సినీ పాటల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శంషాద్‌ బేగంలా ఉత్తమ గాయని స్థాయికి ఎదిగేందుకు సినీరంగంవైపు వచ్చారు. అయితే అప్పటికీ అంతగా సాంకేతికంగా అభివృద్ధి చెందని సినీ రికార్డింగ్‌ ప్రక్రియ గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు, వాయిద్యకారులకు పలు ఇబ్బందులు కలిగించేది.
ఆ కాలంలో ప్రత్యేకంగా రికార్డింగ్‌ స్టూడియోలుండేవి కావు. ప్రొద్దున్న పూట సినీ షూటింగ్‌ అయిన తర్వాత రాత్రికి రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రికార్డింగ్‌ చేయాల్సి వచ్చేది. అంటే, ఉదయం పూట పాటలు రిహార్సల్స్‌ చేసి రాత్రి, స్టూడియోలో అందరూ పనులు ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిన తర్వాత, ఎలాంటి శబ్దాలు లేనప్పుడు పాటల రికార్డింగులు జరిగేవన్నమాట. ఆ రోజుల్లో పాటల తయారీ, రికార్డింగుల గురించి 2012లో శంషాద్‌ బేగం, గజేంద్ర ఖన్నాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘మామూలుగా మేము రిహార్సల్స్‌ చేసేందుకు ప్రొద్దున్నే వచ్చేవాళ్ళం. రికార్డింగ్‌ సాయంత్రం ఆరు తర్వాతే, అన్ని శబ్దాలు తగ్గిపోయిన తర్వాత జరిగేవి. అప్పుడు రికార్డింగ్‌కు ప్రత్యేకమైన గదులుండేవి కావు. ఉదయం నాటకాలు ఆడిన స్టేజీల పైనే రికార్డింగ్‌ చేసేవాళ్ళం. ఎక్కడబడితే అక్కడ జిగురు వాసన వేస్తున్న చెక్కలు పడి ఉండేవి. మేము ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుని రికార్డింగ్‌ ఆరంభించేవాళ్ళం. చుట్టూ భరించలేని దుర్గంధం ఉన్నా మేము పాటకు తగ్గ మూడ్‌లోకి వచ్చి నోరు తెరవడానికే కష్టంగా ఉన్నా ‘సావన్‌ కే నజారే హై’ అని పాడేవాళ్ళం. అప్పుడు మైక్రోఫోన్‌లపై రెండు వ్రేళ్ళ వెడల్పు గల గీత ఉండేది. మేము ఆ గీత పరిధిలో పాడితేనే సరిగ్గా రికార్డయ్యేది. సాంకేతిక పరికరాల నుంచి మద్దతు లేకపోవడంతో కళాకారులు ఖచ్చితంగా సరిగ్గా పనిచేయాల్సి వచ్చేది. ఏ ఒక్కరు ఎలాంటి పొరపాటు చేసినా, ఎంత చిన్నదైనా మళ్ళీ రికార్డింగ్‌ ప్రక్రియ మొదటి నుంచీ ఆరంభించాల్సి వచ్చేది. అందుకే రికార్డింగ్‌ ఆరంభించే కన్నా ముందు సంగీత దర్శకుడితో, తర్వాత వాయిద్యాలతో రిహార్సల్స్‌ చేసేవాళ్ళం. అంతా సంతృప్తిగా అనిపించిన తర్వాతనే రికార్డింగ్‌ ఆరంభించేవాళ్ళం. రికార్డింగ్‌ కోసం కట్టిన గదిలోకి రికార్డింగ్‌ కోసం వెళ్ళేవాళ్ళం. అయితే సినిమా కోసం చేసిన రికార్డులు అంత నాణ్యంగా ఉండేవి కావు. రికార్డింగ్‌ కంపెనీలకు ఆ నాణ్యత వచ్చేది కాదు. అందుకని రికార్డింగ్‌ కంపెనీలు అదే పాటను మళ్ళీ ప్రత్యేకంగా ఆ గాయనితోటో లేక మరొకరితోటో పాడిరచి రికార్డు చేసేవి. వాటిని కమర్షియల్‌గా మార్కెట్లోకి విడుదల చేసేవి. అందుకే ఆ కాలంలో అనేక సందర్భాలలో, సినిమా పాటకూ, బయట వినిపించే రికార్డుల్లోని పాటకూ తేడా ఉండేది. ఒకోసారి సినిమాలో గాయని వేరే, రికార్డుల్లో గాయని వేరే అయ్యేది.’’
“It was necessary for the musicians to travel to the small HMV Studios in South Mumbai to record song for vinyl while it was still fresh in their minds. This meant that there were some significant difference between the film or gramophone version of songs, especially in the size of the orchestra, instrumentation and the song form. Ex.Aana merijan” (Bollywood Sounds by Jason Beaster-Jones).
శంషాద్‌ బేగం ఒక రకంగా చాలా సులువు అనిపించేలా చెప్పారు. కానీ రికార్డింగ్‌లు అంత సులభమయ్యేవి కావు. ఉదయమంతా రిఫ్లెక్టర్ల వెలుతురు ఉండడంతో గదులు వేడెక్కేవి. ఫ్యాన్లు వేసుకునే వీల్లేదు. ఎందుకంటే ఆ శబ్దాలు రికార్డవుతాయి. కాబట్టి చెమటలు కక్కుతూ, ఇబ్బందులు పడుతూ రికార్డులు చేసేవారు. అలా రూపొందినవే 1940`50కు నడుమ అత్యంత మధురమైన పాటలన్నీ…
సాంకేతికంగా శబ్దాన్ని, దృశ్యాన్ని వేరు చేయటం, కలపగలగటం సంభవమవటంతో సినిమాలో నటనతో పాటు సంభాషణలు రికార్డు చేయటం, పాటలు, నేపథ్య సంగీతం రికార్డు చేయటం వేరయ్యాయి. దాంతో నటీనటులకు పాటలకు పెదిమలు కదల్చి, సినిమాలో నటనపై దృష్టి పెట్టే వీలు చిక్కింది. సంగీత దర్శకులకు కూడా సంక్లిష్టమైన బాణీలు, రాగ ఆధారిత బాణీలను రూపొందించే వీలు చిక్కింది. గాయనీ గాయకులకు శాస్త్రీయ సంగీతంతో పరిచయం లేకున్నా శిక్షణనిస్తే, సరిగ్గా పాడగలిగితే చాలు సినిమాలో పాటలు పాడే వీలు చిక్కేది. దాంతో ముకేష్‌, కిషోర్‌ కుమార్‌, గీతాదత్‌ వంటివారు పెద్దగా శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకున్నా పాటలు పాడేందుకు సినీ రంగంలో అడుగు పెట్టారు. ‘సైగల్‌ మరణం’ పురుష నేపథ్య గాయకులకు మార్గం సుగమం చేసింది. ‘కిస్మత్‌’ (1943) సినిమాలో హిట్‌ పాటలు పాడిన అశోక్‌ కుమార్‌ 1947 వచ్చేసరికి రఫీ పాట ‘హమ్‌ కో తుమ్హారా హి ఆసా’ (సాజన్‌)కు పెదిమలు కలపాల్సి వచ్చింది. ‘జైత్రయాత్ర’, ‘దిల్‌ కీ రాణి’ వంటి సినిమాల్లో పాటలు పాడిన రాజ్‌ కపూర్‌ సైతం పాటలు మానేసి ముకేష్‌ పాటకు పెదిమలు కలపాల్సి వచ్చింది. అంటే పాటలు పాడే నటీనటులు దాదాపుగా అదృశ్యమై పోయారనే చెప్పవచ్చు. సురయ్య, కిషోర్‌ కుమార్‌లు కొంతకాలం కొనసాగారు. కిషోర్‌ కుమార్‌ సైతం నటన మాని పాటపైనే పూర్తి సమయం కేటాయించిన తర్వాతనే గాయకుడిగా అగ్రస్థాయికి చేరుకున్నాడు. అంటే 1940లో వేగవంతమైన నేపథ్య గానం వ్యవస్థ 1947 కల్లా స్థిరపడి ‘నటగాయక’ వ్యవస్థను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఇదే సమయానికి నేపథ్య గాయనిగా లత రంగప్రవేశం చేసింది.
ఆరంభంలో మాస్టర్‌ వినాయక్‌ సినిమాలలోనే పాడినా వినాయక్‌ రావు మరణం తర్వాత లత ఫ్రీలాన్సర్‌ అయింది. గులామ్‌ మహ్మద్‌ పరిచయం కావటంతో, ఆయన లతతో పాటలు పాడిరచటంతో ఇతర సంగీత దర్శకులందరికీ లత పట్ల ఆసక్తి కలిగింది. ఆ కాలంలోని ఇతర గాయనిలకు భిన్నంగా లతా మంగేష్కర్‌కు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ఉండటం ఆమెను అందరికన్నా ముందు నిలిపింది. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ దగ్గర నేర్చిన శాస్త్రీయ సంగీతాన్ని ఆమె వదలకుండా సాధన చేస్తూ వచ్చింది. ఉస్తాన్‌ అమాన్‌ అలీఖాన్‌ దగ్గర లత శాస్త్రీయ సంగీతంతో పాటు ‘ఖయాల్‌ గాయకీ’ నేర్చుకుంది. అమానత్‌ ఖాన్‌ దేవాసాలె వద్ద ఠుమ్రీలు, గజళ్ళు, లలిత గీతాలు పాడటం నేర్చుకుంది. తులసీశర్మ వద్ద పాటియాలా ఘరానా గాయకి నేర్చుకుంది. హిందీ సినీ ప్రపంచంలో స్థిరపడేందుకు హిందీ నేర్చుకుంది. ఉర్దూ పదాలను సక్రమంగా ఉచ్ఛరించేందుకు ఉర్దూ నేర్చుకుంది. పాటలను భావయుక్తంగా పాడేందుకు కవితలను అర్థం చేసుకునేందుకు హిందీ సాహిత్యాన్ని చదివింది. అంటే లత అమ్ముల పొదిలో ఇతర సమకాలీన గాయనిలకు కానీ, అప్పటికే పేరు ప్రఖ్యాతలు పొందిన గాయకులకు గానీ లేనన్ని విశిష్టమైన బాణాలు ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ మించి దేవుడిచ్చిన మధురమైన స్వరం ఉంది. కాలం ఆమెవైపు ఉంది. దాంతో లత సినీ నేపథ్య సంగీత ప్రపంచంలో ‘మహారాణి’గా ఎదిగింది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.