ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’ – అనల

నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మనముందుంచిన ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్‌ శాల్యూట్‌.
‘అక్కలకెన్నో కష్టాలున్నాయని గుర్తొచ్చినప్పుడు నేను దళంల భర్తి గావాలెననుకున్న. అన్నలు సదువుకున్నోళ్ళు గదా, నేను దళంల వోతె నాక్కుడ నేర్పుతరేమో అని ఆలోశించిన.

దళంల వోతె రాజకీయం నేర్చుకోవచ్చుగదా అనుకునేదాన్ని. నేర్చుకొని జనాల్ను ఒందికట్టు జేసి శత్రువులను ఓడిరచి మా గరీబోళ్ళ రాజ్యం గెలవాలె… ఎన్ని తిప్పలొచ్చినా లడాయి యిడ్సివెట్టొద్దని గట్టిగ అనుకున్న. లడాయిలనే పానమిస్తనని ‘కిరియ’ జేసిన…
మొబైల్‌ అకడమిక్‌ స్కూల్‌లో అప్పుడప్పుడే చదువు నేర్చుకుంటున్న రజితను ఏదైనా రాయమని అడిగితే రాసిన కథనం ఇది. దండకారణ్యం నుండి వెలువడే రaంకార్‌ పత్రికలో వచ్చిన కథ ఇది. ‘వియ్యుక్క’లో ఇది ఒక కథ. మహిళలకు సమస్యలున్నయ్‌. సమస్యలు పోవాలంటే సంఘంలో చేరాలె, చదువుకోవాలె, రాజకీయాలు నేర్చుకోవాలె, నేర్చొకొని పీడిత ప్రజలను ఏకం చెయ్యాలె. ప్రజాశత్రువును ఓడిరచాలె… ఓడిస్తే పేదోళ్ళ రాజ్యం వస్తది. పేదోళ్ళ రాజ్యం కోసం చేసే పోరాటంలో ప్రాణాలైనా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న. పోరాటక్రమాన్నంతా మూడు ముక్కల్లో చెప్పింది. మొత్తం కథ ఇంతే. ఇది ఒక వియ్యుక్క కథ. ‘వియ్యుక్క’ అంటే గోండి భాషలో వేగుచుక్క అని అర్థం. ‘వియ్యుక్క’ పేరుతో ‘విరసం’ ప్రచురిస్తున్న ‘అజ్ఞాత రచయిత్రుల కథాసమయం’ అనేకథల సంపుటంలో ఇటువంటి కథలు ఎన్నో. సమసమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో వేగుచుక్కలై దారి చూపుతున్న సాయుధ మహిళలు తమ అనుభవాలను, పోరాటాలను చరిత్రలో రికార్డు చేయడం కోసం చేసిన ప్రయత్నాలను, సాహిత్య కృషిని ఒక్కచోటకు చేర్చి సంకలనంగా కూర్చి ఆరు సంపుటాలుగా వెలువరిస్తున్నది విరసం.
గత నాలుగు దశాబ్దాల (1980`2023) విప్లవోద్యమంలో… అంటే సిపిఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ పార్టీ ఏర్పడిన 1980 నుండి, అది 2004లో రెండు పార్టీల విలీనంతో మావోయిస్టు పార్టీగా కొనసాగుతున్న నేటి వరకు 52 మంది అజ్ఞాత మహిళలు రాసిన 282 కథలను సేకరించిన కృషి సంపాదకురాలు బి.అనూరాధది. అరుణతార, మహిళామార్గం, మాతృక వంటి ప్రముఖ పత్రికలే కాకుండా దండకారణ్యంలో, ఈస్ట్‌ డివిజన్‌లో వెలువడిన తూర్పుకనుమ, పోరుమహిళ, విప్లవి, రaంకార్‌, విప్లవ మహిళ వంటి పత్రికలను, విడివిడిగా వెలువడిన కథా సంకలనాలను ఎన్నింటినో తూర్పారబట్ట కుప్పజేసిన ఈ కథల పంట తెలుగు సాహిత్య చరిత్రకే ప్రమాణంగా నిలుస్తుందని ఈ కథలు చదివినవారికెవరికైనా అర్థమవుతుంది. మహిళలు రాసినవి కనుక మహిళా కోణమే ఎక్కువగా కనిపించినా వీటిలో ఈ రచయిత్రులు తడిమిన విషయాలు చాలా విస్తారమైనవి. ఆదివాసీ మహిళ ఆచార కట్టుబాట్ల నుంచి మొదలుపెట్టి దళజీవితం, దళాల్లో చదువు, సహచర్యం, పిల్లల సమస్య, పితృస్వామ్యం, కులవివక్ష, అత్యాచారాలు, నిర్బంధం, ధిక్కారం, జైలు జీవితం, సామాన్య ప్రజల సాహసాలు, మిలిటరీ చర్యలు, ఎన్‌కౌంటర్‌ సంఘటనలు, అమరత్వం… వరకు వస్తువు పరంగా అధ్యాయాలుగా విభజించారు.
బుజ్జి పసికందుగున్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఆదివాసీ జీవితంలోని కష్టాల కడగండ్ల మధ్యనే పెంచిన తల్లి ఆదివాసీ ఆచారాల ప్రకారం ఆరేండ్ల బిడ్డను నానమ్మ దగ్గర వదిలేసి పుట్టింటికి పోయింది. చిన్నాన్న చిన్నమ్మలతో వ్యవసాయ పనుల్లో చేరింది బుజ్జి. పదేండ్ల వయసుకే నాటు వేయడం, నాగలి దున్నడం నేర్చుకుంది. లేత చేతులు కాయలు గాస్తే కష్టాన్ని ఓర్చుకోడానికి పాటను తోడుగా తెచ్చుకున్నది. అమ్మ ప్రేమకు దూరమై ప్రేమలేని జీవితం ఎవరికోసం అనుకుంటున్న బుజ్జికి దళంలో అన్నయ్యలు, అక్కయ్యల ప్రేమ పరిష్కారంగా కనబడిరది. షావుకార్ల దోపిడీ నుంచి… సామ్రాజ్యవాద దోపిడీ వరకు అర్థం చేసుకున్నది. దేవుడి పాటలు పాడే గొంతు జనం గుండెల చప్పుడును వినిపించింది. సాయుధ జననాట్యమండలి కమాండర్‌గా అమరురాలైన ఆదివాసీ జర్తా వెంకటలక్ష్మి కథ ఇది. వెంకటలక్ష్మి సర్వనామం. రజిత, వెంకటలక్ష్మిల జీవితాలను ప్రపంచానికి తెలపడమే అయితే అది విప్లవోద్యమ చరిత్ర మాత్రమే అవుతుంది. ఆ జీవితాల నుండి, అట్టడుగు ఆదివాసీ ప్రజల, మహిళల ఆలోచనా స్థాయి, మేధస్సు పరిణతి చెందిన క్రమం రచనల్లో ప్రతిఫలించడం వల్ల ఇది గొప్ప కల్పనా సాహిత్యంగా మన ముందుకు వస్తున్నది.
1970ల చివరలో, 80లలో ఎక్కువగా అనువాద సాహిత్యం… ముఖ్యంగా చైనా సాహిత్యం విప్లవాభిమానులకు ప్రేరణనిచ్చేదిగా ఉండేది. కాల్పనిక సాహిత్యంలో ‘లాంగ్‌మార్చ్‌’ చైనా కథలు, ‘నా కుటుంబం’, ‘ఉప్పెన’, ‘విముక్తి’, ‘తండ్రులూ కొడుకులూ’… ఆ తర్వాత బొలీవియా మహిళ ‘మా కథ’, మేరీటైలర్‌ ‘భారతదేశంలో నా జైలు జీవితం’… జననాట్య మండలి పాటలతో సమానంగా విద్యార్థి యువకులను ఉత్తేజితులను చేసిన రచనలివి. అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’, ‘అగ్నికణం’, సాధన ‘అడవిలో అన్నలు’ వచ్చేంతవరకూ కూడా మేం కొత్తగా వచ్చే విద్యార్థులతో చదివించే రచనలు అవే ఉండేవి.
లాంగ్‌మార్చ్‌ చైనా కథల్లో ప్రజావిముక్తి సైన్యం లాంగ్‌ మార్చ్‌ చేస్తున్న క్రమంలోనే, నడుస్తూ ముందువాళ్ళ వీపునకు పలక కట్టి వెనక నడుస్తున్నవాళ్ళు అక్షరాలు దిద్దుకునేవారని చదువుకున్నాం. సరిగ్గా అదే దృశ్యం మనకు విప్లవోద్యమంలో దళజీవితంలో ఈరోజు కనిపిస్తుంది. ‘కా.విక్రమ్‌ పాఠశాల’ అని రాసిన బోర్డు చెట్టుకి వేలాడుతుంటుంది. ఎనిమిది మంది మహిళలు, నలుగురు మగ కామ్రేడ్స్‌ విద్యార్థులుగా ఉంటారు. ఇద్దరు టీచర్లు, ఒక ప్రిన్సిపాల్‌ను పెట్టుకుంటారు. పౌర శాస్త్రం, భూగోళం, లెక్కలు చెప్తారు. రోజూ గంటసేపు తెలుగు ఎట్లానూ ఉంటుంది. సైన్సులో మానవ పరిణామం చెప్తూ ఉంటారు. కమాండర్‌ వచ్చి కిట్లు సర్దుకోమంటుంది. స్థావరం మార్చాలి. ప్రయాణంలో విద్యార్థుల్లో ఒకరికి మలేరియా వస్తుంది. 104 డిగ్రీల జ్వరం. అయినా రెండోరోజే లేసి నడుస్తారు. ‘ముందు నడుస్తున్నవాళ్ళు కాషన్‌ ఇవ్వడం, ఫైర్‌ చేయడం, క్రాంతి తనని కిందికి లాగడం, సంగీతకి అర్థమయ్యేలోపే రెండువైపుల నుండి హోరాహోరీ కాల్పులు మొదలైపోయాయి’. షహీదా రాసిన ‘చదువు’ కథలో దండకారణ్యంలోని లాంగ్‌మార్చ్‌ కనిపిస్తుంది మనకు.
‘మనిషి జ్ఞానం మనిషి బతుకును తెలుసుకోవడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడాలని అక్క చెప్పింది’అంటాడు అనాథ ఆదివాసీ బాలుడు సుక్రు. మిలీషియా అక్క ఆ పిల్లలకు వాళ్ళు ఏరుకొచ్చే రాళ్ళు, గింజలతో కూడికలు, తీసివేతలు చెప్తుంది. కుంకుడుకాయలు, తేనె అమ్మేటప్పుడు తూకం వేయడం చూపిస్తుంది. షావుకార్ల దొంగ తూకాలను కనిపెట్టడానికి ‘ఎంత బరువు సరుకుకు ఎంత డబ్బులు వస్తాయో చెప్తుంది. సాంఘిక శాస్త్రం చదువులో ప్రపంచ పటంలో రమణసింగ్‌ సర్కార్‌ ఎక్కడ కొలువైందో చూపిస్తుంది. ‘‘ప్రపంచ దేశాలన్నిటిని కొట్టుకు తిని బతుకుతున్న పెద్దపులి అమెరికా ఎక్కడ ఉందో అక్క చెప్పింది’’ అంటాడు భానుమతి రాసిన ‘కొత్త చదువు’ కథలో సుక్రు. ‘చదువు రానివారు ఉద్యమాన్ని ఎట్లా గైడ్‌ చేస్తారు’ అని బయటనుండి వచ్చిన ప్రశ్నకు జవాబుగా దళంలోని పాఠశాలల గురించి చెప్తూ కళ్ళముందే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి గొంతు కలపలేని ‘చదువుకున్నవారి’కి చూపించడానికి ఇతరుల కష్టాలు తమవిగా చేసుకున్న ‘చదువురానివారు’ రాసిన కథలను తన కిట్టులో భద్రంగా దాచిపెట్టి తెచ్చి మనముందుంచుతుంది తాయమ్మ కరుణ.
మొబైల్‌ స్కూళ్ళే కాకుండా సాహిత్య పాఠశాలలు నిర్వహించి విప్లవోద్యమంలో గన్ను పట్టి పోరాడుతున్న వారికి పెన్ను విలువను తెలిపి, ప్రతి ఒక్కరికీ ఒక తెల్ల కాగితం ఇచ్చి తప్పనిసరిగా ఏదైనా రాయాలని ప్రోత్సహించటం వల్ల బయట సమాజం ఊహించలేనంత స్థాయిలో ఇవాళ దండకారణ్యంలో సాహిత్య సృజన జరుగుతోంది. సంకలనకర్త అనూరాధ అన్నట్లు ‘దండకారణ్య రచయితలు’ అని సింబాలిక్‌గా వాడుతున్నాం. విప్లవోద్యమం అంటే దండకారణ్యానికి చెందినదే కాదు, నల్లమల, పల్నాడు, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌ కమిటీ అన్ని ప్రాంతాల గురించి, అర్బన్‌ జీవితం గురించిన కథలు దీంట్లో ఉన్నాయి. విప్లవోద్యమ అవసరాలు ఎక్కడికి పంపితే అక్కడికి పోయి ఆ భాష నేర్చుకొని అక్కడి సమస్యలను రాసిన కథలున్నాయి. ఉదాహరణకు ఆలూరి లలిత రాసిన మరాఠీ పట్టణ స్త్రీల కథలు.
‘విప్లవోద్యమంలోకి అడుగు పెట్టడమంటేనే కుటుంబం అనే పితృస్వామిక వ్యవస్థ నుండి బయటపడి సమష్టి జీవితంలోకి అడుగు పెట్టడం. ఇక్కడ మహిళలు తమ జీవితంలోకి తొంగి చూసుకోవడం మొదలుపెడతారు’ అని అనూరాధ రాసినట్లు తమలోకి తాము తొంగి చూసుకోవడం వల్ల ‘తాము చేస్తున్న పని చాలా ప్రత్యేకమైనదని గుర్తించడం వల్ల’ మహిళలు తమ అనుభవాలను బహిర్గతం చేయాలనే సంకల్పంతో సాహిత్య సృజన చేస్తున్నారు. వియ్యుక్క మొదటి సంపుటిలో ఇచ్చిన వరుసక్రమం చూస్తే మొదటిది ఆదివాసీల ‘రీతి రివాజుల సంకెళ్ళు’. దళ జీవితం, చదువు, సహచర్యం, అమ్మతనం, మిలిటరీ జీవితం, సామాన్య ప్రజల సాహసాలు, నిర్బంధం, జైలు కథలు, సాల్వాజుడుం, అమరత్వాలు… ఇలా విప్లవోద్యమమే వస్తువుగా ఉన్నవి మొదటి మూడు సంకలనాల్లో వస్తాయి.
‘అంత పెద్ద ఫైరింగ్‌ నుండి ఎట్ల తప్పుకున్నవ్‌ బిడ్డా?’ జీరబోయిన గొంతుతో అడిగింది తల్లి. …‘నేనెప్పుడూ ఫైరింగ్‌ చూడలేదు కదా ఏం చేయాలో తోచలేదు. మెల్లగా వరిచేండ్ల దూరిన. చేను ఇంత ఎత్తుంది. తుపాకీ పట్టుకొని వంగుకుంట వచ్చుడు కష్టమని తుపాకీని ఒకచోట దాచిపెట్టిన. దూరంగా వచ్చేసిన…’ తండ్రి మొహం గంభీరంగా మారిపోయింది. ‘ఏందీ తుపాకి ఇడిసిపెట్టి వచ్చినవా? అయినా నువ్వు తుపాకి ఎందుకు పట్టుకున్నవ్‌? ఏమన్న సంబురానికి పట్టుకున్నవా, కొట్లాడెతందుకు పట్టుకున్నవా? పోలీసులు కనబడంగానే కొట్లాడాలె గద’ అన్నాడాయన. ‘తుపాకీ ఏమన్న ఆటబొమ్మనా బిడ్డా, ఉత్తగనే పట్టుకొని తిరిగేందుకు. దానితోని ఫైరింగు జేసుడు మంచిగ నేర్చుకోవాలె గద’ తండ్రిలా కోపంగా కాకుండా, అనునయంగా చెప్పింది తల్లి. ఆసిఫా రాసిన ‘విప్లవంలో ఒక తల్లీ తండ్రీ’ కథలో ఈ సంభాషణ చదివితే ‘విప్లవ మొలకలు’ మిలీషియాగా అడవంతా ఎట్లా విస్తరిస్తున్నాయో అర్థమవుతుంది.
పోలీసులు యువకులందర్నీ ఊరి మధ్యలో కుప్పచేసి, రక్తాలు కారేట్టు కొట్టిన దాంట్లో తమ కొడుకు కూడా ఉన్నా, తమ ఇంటిని పోలీసులు కాలబెట్టినా తమ దగ్గరున్న ఎర్రజెండాలను మాత్రం పాలిథిన్‌ కవర్లో పెట్టి బాయి దగ్గర భద్రంగా దాచి, నారాయణపట్నంలో భూములు ఆక్రమించినప్పుడు ఎగరేసిన ఆదివాసీ జంట గురించి ‘ఎర్రజెండా’ కథలో రాస్తుంది శ్వేత. కోరాపుట్‌ పోలీస్‌స్టేషన్‌ మీద దాడి, కరువు దాడులు, సోమ్లానాయక్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌… మైలురాళ్ళవంటి ప్రతి సంఘటననూ రచనగా మలిచిన తీరు ఈ రచయిత్రులకున్న బాధ్యతను తెలియజేస్తుంది. దళంలోని వాళ్ళంతా కొందరు ఎపిటికి వెళ్ళి శత్రువుకి దొరికిపోయి, కొందరు ఫైరింగ్‌లో అమరులయి ఒక్కతే మిగిలిపోయినా, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఊరూరా తిరిగి, ప్రజల దగ్గర తలదాచుకొని, ఇన్‌ఫార్మర్‌ చేతికి చిక్కి తప్పించుకొని, పోలీసుల కళ్ళుగప్పి కొండలు, గుట్టల మీద పరుగులు పెట్టి, తండ్రి, అన్న వచ్చి తీసుకుపోతామన్నా వాళ్ళకు నచ్చచెప్పి పంపించి, తుప్పలల్లో, గుట్టలల్లో తిరుగుతూ చివరికి దళాన్ని కలుసుకున్న శ్యామలది నల్లమల ఏరియాలోని కొల్లాపూర్‌ దగ్గర గ్రామం. శ్యామల దళంలో కలిసిందని తెలిసి ఆమె అన్న బాలస్వామిని మంటల్లో వేసి సజీవదహనం చేశారు ఆ ఊరి భూస్వాములు. గిరాయిపల్లి గిరిజ రాసిన ఈ ‘వస్తావా నేస్తమా’ కథ ఒక యదార్థ సంఘటన. తర్వాత శ్యామల కూడా అమరురాలయింది.
‘విప్లవ ప్రజాసంఘాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణవాద హిందూత్వ సంఘం అంటుమొక్క మొలిచింది’ అని యామిని రాసిన ‘కర్తవ్యం’ కూడా ఒక ఏరియాలో జరిగిన సంఘటనే. భజరంగ్‌దళ్‌ను అడ్డుపెట్టుకొని క్రిస్టియన్‌ ఆదివాసీల ఇళ్ళపై దాడి చేయడం, ఎన్నో కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం రాజకీయ ఆధిపత్యం కోసమే అని చెప్తుంది రచయిత్రి ఈ కథలో.
రచయిత్రులలో షహీదా, మిడ్కో, తాయమ్మ కరుణ, బి.అనూరాధ, పద్మకుమారి తెలుగు సాహిత్య ప్రపంచానికి చిరపరిచితులు. నలభై ఏళ్ళుగా దండకారణ్య ఉద్యమ గమనంలో భాగమైన మైనా, నిత్య, సుజాతల కథలు సంకలనాలుగా కూడా వచ్చాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌ సెక్రటరీగా పనిచేసి అమరురాలైన ఎల్లంకి అరుణ రచనలు ‘ప్రణీత సవ్వడి’ పేరుతో ప్రచురితమయ్యాయి. సంకలనాలుగా రాకపోయినా అరుణతారలో ఎక్కువసార్లు కనిపించిన పేర్లు జీవని, యామిని. ఇందులో ఒక్క కథ రాసిన రచయిత్రుల నుండి చేయితిరిగిన వారి కథల వరకు ఒక్కసారిగా చదివితే శిల్పపరమైన తేడాలు ఏవీ పెద్దగా కనిపించవు. దళంలో చదువు నేర్చుకుని రాసిన వాళ్ళ కథ కూడా వస్తువుపరంగా ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే చాలా కథలు మనను చదివినంతసేపు గెరిల్లాలుగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఫైరింగ్‌, ఎన్‌కౌంటర్‌ సంఘటనలను చిత్రించిన కథలు ఎంత అద్భుతమైన శైలిలో సాగుతాయంటే ప్రశాంతమైన అడవి ఒడిలోనో లేదా పీడిత ప్రజల నీడలోనో లిప్తపాటు కాలం విశ్రమించిన గెరిల్లాల గుండెల్లో ‘ఢాం’ అని పేలిన తుపాకి శబ్దం మనం వినగలుగుతాం. గుట్టబోర్లలో దబ్బున కింద పడుకొని పొజిషన్‌ తీస్కున్న పద్మక్క క్రాలింగ్‌ పొజిషన్‌లో పోతూ ఛాతీకింద ఏదో తడిని గుర్తించి ఒక్క నిమిషం ఆగి, మళ్ళీ కాషన్‌ ఇస్తూ ముందుకు పోతున్న దృశ్యమంతా కళ్ళకు కడుతుంది గజ్జల సరోజ ‘సాహసిక యోధురాలు’ కథలో.
భారతి కథ కౌకొండ గుట్టల్లో జరిగిన ఫైరింగ్‌ సంఘటన ‘చంద్రగిరి అమరత్వం’ మైదాన ప్రాంతంలో జరిగిన యుద్ధకాండ. వరంగల్‌ జిల్లాలో కౌకొండ గుట్టల్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల సంఘటన భారతి స్వానుభవం. ‘విజయకు నడుములో తూటా దిగగానే కిందపడి ‘నన్ను కాపాడండి’ అనకుండా, ‘అన్నా నేను రాలేను, నా తుపాకీని తీసుకొని మీరు వెళ్ళండి’ అంది. గుట్టల చుట్టూ ఫైరింగ్‌ జరుగుతోంది. విజయను వదిలి వెళ్ళక తప్పలేదు. వెంటనే మరో కామ్రేడ్‌ కుమారస్వామి అమరుడయ్యాడు. గుట్ట ఎక్కుతూ ఉంటే ఆర్‌కె గార్డ్‌ కోర్నెల్‌… తర్వాత ఐలన్న… ఒక్కో కామ్రేడ్‌ని వదిలి గుట్టపైకి చేరుకున్న దళానికి ప్రకృతి కాపాడుతుందన్నట్లుగా ఒక దోనె కనబడిరది. దళమంతా దోనెలోకి దిగింది. దోనె పైవరకు వచ్చిన శత్రువు దోనె లోపలికి ఆటో ఫైరింగ్‌ చేశాడు. బాంబులు లోపలికి వదులుదాం అన్న వాడి మాటలు వినబడుతున్నాయి. ఆ పరిస్థితిలో దోనెలో ఒక పగలు, రాత్రి దళం ఎంత ఉద్రిక్త వాతావరణంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని గడిపి, బైటపడి తిరిగి ఎలా ప్రజల దగ్గరికి చేరిందో భారతి మినిట్స్‌ లాగా ఒక్కో క్షణాన్ని రికార్డు చేసింది.
‘చంద్రగిరి అమరత్వం’, మిడ్కో రాసిన ‘ఉక్కుకోట’… రెండూ కూడా నిజంగా అద్భుతమైన డాక్యుమెంటరీలు. ఎందుకంటే అవి కథలు కావు, కల్పనలు కావు… అవి వాళ్ళ వీరోచితమైన సాహసాలు, కదనరంగంలోని కవాతులు. ఉక్కుకోట అనంగనే మళ్ళీ లాంగ్‌మార్చ్‌ కథల్లోని ‘నిజమైన ఉక్కుకోట ఏది’ కథ 35 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుకొస్తున్నదంటే సాహిత్యానికున్న ప్రభావం అర్థమవుతుంది.
దక్షిణ తెలంగాణ, నిజామాబాద్‌ సిర్నాపల్లి ఏరియాలో ఒక ఇంట్లో మకాం వేసిన దళంపై పోలీసుల దాడి జరిగింది. పొద్దున్న ఏడు గంటలకు మొదలై సాయంత్రం వరకు దాదాపు 12 గంటలు జరిగిన ఫైరింగ్‌లో ఆరుగురు దళసభ్యులు అమరులయ్యారు. కమాండర్‌ స్వామి ఫైరింగ్‌ చేస్తూనే చాకచక్యంగా తప్పించుకొని ప్రజల్లో కలిసిపోయాడు. ఆ ఫైరింగ్‌ సంఘటన, తర్వాత ప్రజలు అతడ్ని కాపాడుకున్న తీరు మొత్తాన్ని దృశ్యీకరిస్తుంది మిడ్కో. ప్రజాయుద్ధ వీరులను ప్రజలే కాపాడుకుంటారు ‘రక్షణ వలయం’లో రజితను కాపాడుకున్నట్లు. ‘చేపలను నీళ్ళు రక్షిస్తాయి. పార్టీని ప్రజలు కాపాడుకుంటారు’ అని రాస్తుంది చాడ విజయలక్ష్మి ఒక కథలో. ఒక గ్రామీణ మహిళ డెలివరీ బెడ్‌ మీద నొప్పులు పడుతూ తన వీపు వెనుక ఒక కామ్రేడ్‌ని పడుకోబెట్టుకొని కాపాడిన నిజమైన సంఘటనను ‘ప్రజలే ఉక్కుకోట’ కథలో చిత్రించింది విజయలక్ష్మి అలియాస్‌ కరుణ. ఇటువంటి ఇంకా ఎన్నో సంఘటనలు ‘సామాన్యుల సాహసాలు’ విభాగంలో ఉన్నాయి. తప్పులు అందరూ చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేయగలరు. త్యాగాలు చేసే విప్లవకారులు కూడా పాత భావజాలాన్ని పూర్తిగా వదిలించుకోకపోవడం వల్ల ప్రజలపట్ల తప్పులు జరుగుతుంటాయి. వాటిని చాలా తీవ్రమైనవిగా గుర్తించి పార్టీ తీసుకున్న ప్రోగ్రాం ‘దిద్దుబాటు’ క్యాంపెయిన్‌ను నిజాయితీగా రికార్డు చేశారు ఈ విప్లవకారులు.
ఈ మొత్తం రచనలలో, ఇన్ని విభాగాలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ‘ధిక్కారమైన దుఃఖం’ అధ్యాయం. ఉద్యమంలో అమరులయిన వారి కోసం వారి బంధువులు, మిత్రుల దుఃఖం, వారిని చివరి చూపు చూసుకొని సగౌరవంగా అంత్యక్రియలు జరపడానికి వారు పడే ఆవేదన, వారి జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి పడే ఆరాటం… అన్నీ జరిగినవి, జరుగుతున్నవీ. పద్మకుమారి రాసిన… కాదు చేసిన ‘ప్రయాణం’ను పరిచయం చేయడానికి, అంచనా వేయడానికి మన భాష సరిపోదు.
ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సాంబిరెడ్డి భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి అతని కుటుంబంతో కలిసి బీజాపూర్‌ బయల్దేరుతారు అమరుల బంధుమిత్రులు. భద్రాచలం, భానుప్రతాప్‌పూర్‌, జగ్‌దల్‌పూర్‌ల మీదుగా 700 కి.మీ. పైగా ప్రయాణం. ఛత్తీస్‌గఢ్‌ మొదలైనప్పటి నుంచి ప్రతి ఊరిలో బేస్‌ క్యాంపులు, సాల్వాజుడుం గూండాలు, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు అంబులెన్స్‌లో బయలుదేరిన వీళ్ళను వాహనాల మీద వెంబడిస్తుంటారు. హఠాత్తుగా పక్క నుండి వెహికల్‌ మీద లైట్లు వేస్తుంటారు. ఎక్కడా ఆగడానికి లేదు. చీకటి పడి దారి తెలవక పోలీసులనే అడుగుదామని పోలీస్‌స్టేషన్‌ ముందుకు వెళ్ళిన మహిళలను చూసి నక్సలైట్లే అన్నట్లుగా స్టేషన్‌ మొత్తం అలర్ట్‌ అయిపోతుంది. ఇంక అటునుండి ఫైరింగ్‌ జరుగుతుందేమో అన్న బీభత్స వాతావరణంలో పరిగెత్తుకొచ్చి వ్యాన్‌ ఎక్కుతారు. తీరా మృతదేహాల వద్దకు చేరుకున్నాక మృతుడి అన్న, వదినలు ఒక పక్క ఏడుస్తూ ఉంటే బాగా కల్లు తాగి ఉన్న సాల్వాజుడుం కార్యకర్తలు విని తట్టుకోలేని బూతులతో, చేష్టలతో మీదిమీది కొచ్చి బెదరగొడుతుంటారు. ఉబ్బిపోయి, పురుగులు పట్టి, తెచ్చుకోవడానికి వీలులేని స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే అంతిమ సంస్కారం జరిపిస్తారు బంధుమిత్రులు. దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో జోహార్లు చెబుతూ, వెళ్ళిన వాళ్ళందరూ సాంబిరెడ్డి మృతదేహంపై తలా పిడికెడు మట్టి వేస్తారు. ‘వదిన’ రాజేశ్వరి మరో పిడికెడు మట్టి తీసి అంత దూరంలో
ఉన్న పోలీసుల మీద చల్లింది. నేలమీద అరచేతులతో చరిచింది.
తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా చిక్కటి అడవి, చీకటి. ఎటువైపు కిలోమీటరు వెళ్ళినా పోలీసు క్యాంపుకే చేరుకునే పరిస్థితి. ఇంక ప్రయాణం చెయ్యలేక ఒక ఊరిలో కొంచెంసేపు ఊపిరి పీల్చుకుందామని ఆగి అరుగుల మీద కూర్చుంటే టార్చ్‌లైట్లు మొఖాల మీద పడుతున్నాయి. పక్కనే తాళ్ళగూడెం పోలీసు క్యాంపు. అక్కడ బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు కంచె దగ్గరికి వచ్చి పొజిషన్‌ తీసుకొని ఉంటారు అని చెప్పారు ఆ ఇంటివాళ్ళు. ఇంక వేకువ కోసం చూడడం తప్ప చేసేదేం లేదు.
మొదటి మూడు సంకలనాలలో ఉన్న ఈ కథలన్నీ సాయుధ విప్లవోద్యమం కథావస్తువుగా
ఉన్న కథలే. ఇతర సామాజిక సమస్యలను, జనరల్‌ విషయాలను చర్చించినవి కూడా 134 కథలు, రాబోయే మూడు సంకలనాల్లో ఉన్నాయి. పితృస్వామ్యం, కులవివక్ష, హిందుత్వ దాడులు, అత్యాచారాలు, లొంగుబాట్లను, మానసిక సంఘర్షణలను చిత్రించిన ఈ 52 మంది రచయిత్రులలో సాహిత్య వాతావరణంలో పెరిగినవాళ్ళు ఏ ఇద్దరో, ముగ్గురో ఉండొచ్చు. ప్రజలపట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, నక్సల్బరీ వెలుగులో నడిచిన ఆచరణ, సామాజిక చలనాన్ని వీక్షించిన తీరు వీళ్ళను రచయితలుగా మార్చింది. ఇంత విస్తారమైన జీవితం గురించి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమూలమైన మార్పు కోసం జరుగుతోన్న ఉద్యమ గమనం గురించి రికార్డు చేసిన రచయిత్రులు అభినందనీయులు. ఉద్యమకారులు కూడా అయిన ఇంతమంది రచయిత్రులు ఇన్ని కోణాలను ఆవిష్కరించిన ఈ కథల్ని కేవలం సాహిత్యంగా మాత్రమే చూడలేం. ఇది చరిత్ర రచన కూడా. అయితే వీటిని విడివిడిగా చదువుతున్నప్పుడు మన దృష్టి కొంత రూపం మీద ఉంటుంది. విభిన్నమైన వస్తువులు గల ఈ రూపాలన్నీ ఒక దగ్గర గుదిగుచ్చబడి సమగ్ర చరిత్ర రూపు కట్టినపుడు, వీటిలోని సారం పాఠకులకు సరిగ్గా అందుతుంది. అల్లం రాజయ్య చెప్పినట్లు ప్రతి కథలో స్థలకాలాలు, రక్తమాంసాలు ఉన్న మనుషులు ఉంటారు. వాళ్ళు స్పృశించిన జీవిత కోణాలకు ఒక ఆకృతినిచ్చి చరిత్రలో రికార్డు చేసే బాధ్యతను తలకెత్తుకున్న సంపాదకులను, విప్లవ రచయతల సంఘాన్ని కూడా అంతే స్థాయిలో అభినందించాలి.
నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మన ముందుంచిన ఆలివ్‌గ్రీన్‌ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్‌ శాల్యూట్‌.
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.