మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ ‘‘జీవించే హక్కు’’ కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా తెలుస్తుంది.
మరణించిన భర్త శవంతో పాటు అతని భార్యను అదే చితిపై దహనం చేయటాన్ని సహమరణం లేదా సహగమనం అని, భర్త మరణించిన కొన్నాళ్ళకు భర్త అస్థికలు లేదా వాడిన వస్తువులతో పాటు అతని భార్యను కూడా దహనం చేయటాన్ని అనుమరణం అని అంటారు. బ్రాహ్మణ స్త్రీలకు సహమరణమే అర్హమని, అనుమరణం కాదని శాస్త్రాలు చెప్పాయి.
కొద్దిగా చరిత్ర: ముస్లిముల రాకతో హిందూ స్త్రీలను కాపాడుకోవటం కోసం సతిదహన ఆచారం వచ్చిందని కొందరు వాదిస్తారు. కానీ సతి దురాచారం ముస్లిముల రాకకు కొన్ని వందల సంవత్సరాల ముందు నించీ పాటింపబడుతూ ఉంది. సతిసహగమనం గురించిన మొదటి చారిత్రిక ఆధారం గ్రీకు చరిత్రకారుల నుంచి లభిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన Diodorus Siculus అనే చరిత్రకారుడు Bibliotheca Historica అనే గ్రంథంలో ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక సతీసహగమం గురించి ఇలా వర్ణించాడు.
‘‘Ceteus అనే భారతీయ సైనికాధికారి యుద్ధంలో మరణించాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య గర్భవతి కనుక భర్తతో సహమరణించటానికి సేనాధిపతులు చిన్న భార్యను ఎంపిక చేసారు. దాసిలు ఆమెను కొత్త పెళ్ళికూతురుగా అలంకరించి తలపై పుష్పకిరీటాన్ని ఉంచారు. ఆమె సద్గుణాలను స్తుతిస్తూ కీర్తనలు పాడారు. ఆమె తన ఆభరణాలను స్నేహితులకు, సేవకులకు ఇచ్చివేసింది. ఆమె సోదరుడు ఆమెను చితి వద్దకు నడిపించుకు వెళ్ళాడు. ఆమె స్వయంగా భర్త పక్కన పడుకోగా చితికి నిప్పుపెట్టారు. ఆమె అగ్నికి ఆహుతి అయ్యింది. Diodorusతో సహా కొందరు గ్రీకులు ఇది క్రూరమైన అనాగరిక ఆచారమని భావించారు’’ సతికి సంబంధించి లభించే అత్యంత ప్రాచీన ఆధారం ఇదే. సతీసహగమన ఆచారానికి సంబంధించి మరింత స్పష్టమైన ఆధారాలు గుప్తులకాలం నుండి లభిస్తాయి. ఇది మొదటగా క్షత్రియులలో మొదలై క్రమేపీ బ్రాహ్మణులకు పిదప సాంస్క్రిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇతర కులాలకు కూడా విస్తరించింది. 1000 CE నాటికి ఇది సమాజంలో ఒక ఆచారంగా స్థిరపడిరదని పురాణాల ద్వారా తెలుస్తుంది. మృతదేహాన్ని అగ్నికి ఆహుతి చేయటం ఆర్యసంస్కృతి. ఋగ్వేదం దహన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను చెప్పింది (10.16). వేదకాలంలో సతిసహగమనం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించవు. అథర్వణవేదంలోని 18.3.1 శ్లోకానికి భర్త మృతదేహం సరసన పడుకొన్న స్త్రీకి ఆమె భర్తతో పాటు సద్గతులు ప్రాప్తిస్తాయి అనే అర్ధం చెబుతారు. కానీ ఇతర శ్లోకాలతో పోల్చినపుడు అక్కడ సతీసహగమన అర్ధం పొసగదు. ఇలాంటి వ్యాఖ్యానాలను సతిదహనానికి వేదాల అంగీకారం ఉంది అనేవారు చేసిన కిట్టింపుగా భావించవచ్చు. ఇక స్మృతులు, పురాణేతిహాసాలలో సహమరణం గురించి అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి.
లి వైష్ణవ ధర్మశాస్త్రం (విష్ణు స్మృతి) మొదటగా సహగమనం గురించి ప్రస్తావించింది. భర్త కోల్పోయిన స్త్రీలకు సహగమనం ఐచ్ఛికమని చెప్పింది. (25.14)
లి భర్త మరణించిన స్త్రీ బ్రహ్మచర్యం ఆచరిస్తే ఆమె మరణానంతరం స్వర్గాన్ని చేరుకొంటుంది. అలా కాక భర్తతో పాటు సహగమిస్తే మనిషి దేహంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. పరాశర స్మృతి 4.29-31
లి. భర్తతో పాటు సహగమనం చేసిన స్త్రీలు స్వర్గానికి చేరుకొంటారు. అగ్నిపురాణం, 222:19-23.
లి సహగమనం చేసిన స్త్రీ, భర్త శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో
ఉంటుంది. గరుడ పురాణం,1.107:29.
లి సతి సహగమనం చేసిన స్త్రీ, తన భర్త బ్రహ్మహత్యాపాతకుడు, కృతఘ్నుడు, పరమపాపి అయినప్పటికీ అతనిని మోక్షానికి తీసుకువెళుతుంది. స్త్రీలకు ఇదే గొప్ప విమోచనం. కూర్మ పురాణం, 2.34:108బి-109.
లి శ్రీ కృష్ణుని అష్ట భార్యలు సహగమనం ఆచరించినట్లు విష్ణుపురాణం 5:38 చెబుతుంది.
లి భర్తతో పాటు మరణించటం స్త్రీ ధర్మం. ఇది వేదాలలో చెప్పబడిరది. పాములు పట్టేవాడు పుట్టలోంచి పాముని బయటకు రప్పించినట్లు సహగమించిన ఆ స్త్రీ మరణించిన భర్తను యమదూతల నుండి విడిపించి స్వర్గానికి తీసుకువెళుతుంది. బ్రహ్మ పురాణం 10.75.
లి మహాభారతంలో సూరుని నలుగురు భార్యలు సతీసహగమనం చేసి స్వర్గంలో భర్తను చేరుకొన్న కథ ఉంది. మహాభారతం, 16.7.24-26
లి మహాభారతంలో మాద్రి సహగమనం ప్రస్తావన ఉంటుంది.
లి కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుధర్మ శాస్త్రంలో సహగమనం గురించి లేదు. పురాణ యుగపు (ష300-1400 జజు) రచనల్లో సహగమనాన్ని ఒక ఉత్కృష్టమైన చర్యగా ఆకాశానికెత్తటం గమనించవచ్చు.
… … …
510 జజులో మధ్యప్రదేష్లోని ఎరాన్ అనే ప్రాంతంలో గోపరాజ అనే పేరుగల సైన్యాధిపతి జ్ఞాపకార్ధం వేయించిన శాసనం అత్యంత ప్రాచీనమైన సతిశిల (sati stone)గా గుర్తించారు. దీనిలో ‘‘ఇతను (గోపరాజ) దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రునితో సమానంగా స్వర్గానికి చేరాడు. భక్తి కలిగిన, అందమైన ఇతని భార్య చిత్తశుద్ధితో చితిపై అగ్నిలో ఇతనితో సహగమనం చేసింది’’ అని ఉంది. అలాంటి సతిశిలలు దేశవ్యాప్తంగా పద్దెనిమిదో శతాబ్దం వరకూ వేయబడుతూనే ఉన్నాయి. ఇలాంటి శిలలలో సాధారణంగా గాజులు ధరించిన కుడిచేయి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది సుమంగళత్వానికి సంకేతం. Al Biruni (973-1048CE), Ibn Battuta (1304CE) లాంటి విదేశీ యాత్రికులు సతిదహనాల గురించి తమ రాతలలో వర్ణించారు. కాకతీయుల పాలనలో జరిగిన సతి ఉదంతాన్ని 1210జజు నిడుబ్రోలు శాసనం చెబుతుంది. విజయనగర సామ్రాజ్యంలో సాగిన సతిదహనాలను Nuniz, Barradas వంటి పోర్చుగీస్ చరిత్రకారులు తమరచనలలో ప్రస్తావించారు. 1760లో ఆనంద గజపతిరాజుతో జరిగిన యుద్ధంలో పెద్దాపురం జగపతిరాజు మరణించాడు. అతని భార్య సతీసహగమనం చేసినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తుంది.
ముస్లిం పాలనలో సతిదహనం: మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-1351) సతి ఆచారాన్ని నిలువరించటానికి చేసిన ప్రయత్నంలో, సతిదహనం చేయాలనుకొన్న వారు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చట్టం చేసాడు. అక్బర్ (1556-1605) ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ రచించిన అక్బర్ నామలో సతి గురించి ‘‘భర్త చనిపోయిన స్త్రీకి ఇష్టమున్న ఇష్టం లేకపోయిన చితిపై దహనం చేయటం హిందువుల ఆచారం’’ అని ఉంది. అక్బర్ ఈ సతి దురాచారాన్ని నిషేదించాడు. ఈ నిషేదాన్ని అమలు పరచటానికి అధికారులను నియమించాడు. ఇతని తరువాత జహంగిర్ కూడా సతి దహనం, ఆడశిశువుల హననం లాంటి దుశ్చర్యలను నిషేదించాడు. కానీ ఇవి ఉత్తర్వులకే పరిమితమైనాయి. షాజహాన్, ఔరంగజేబులు కూడా సతిపట్ల కఠినంగానే వ్యవహరించి, బాలవితంతువులకు విద్యాబుద్ధులు నేర్పమని ఆదేశాలు జారీచేసినా అవి ఈ దురాచారాన్ని శాశ్వతంగా పరిష్కరించలేదు. దీనికి కారణం ఆనాటి హిందూ సమాజం శాస్త్రాల ప్రకారం జీవించటమే ధర్మంగా భావించటం, అన్యమతాల ఆచారాలలో ఎక్కువ జోక్యం కల్పించుకోకూడదు అనే రాజధర్మం కూడా కావొచ్చు.
బ్రిటిష్ పాలన: ‘‘సతి’’ ఆచారాన్ని 1787లో పీష్వా పాలకుల వద్ద రెసిడెంట్గా ఉన్న
C Malet అనే బ్రిటిష్ అధికారి గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాడు. 1788లో బెనారస్ రెసిడెంట్ Jonathan Dungan, భర్త చనిపోయాడు అనే పుకారును నమ్మి అతని భార్యను బంధువులు బలవంతంగా ఇంట్లో ఉంచి దహనం చేసారనే దారుణమైన విషయాన్ని లార్డ్ కార్న్ వాలిస్కు తెలియచేసాడు. 1789లో షాహాబాద్ కలెక్టర్. Brooks, తన అధికారాలను ఉపయోగించి సతి ఆచారాన్ని నిలుపుదల చేయించిన ఒక సంఘటనను పై అధికారులకు చెప్పినప్పుడు ‘‘నువ్వు చేసిన పని మంచిదే కానీ ఇకపై ఆ ఆచారంలోని అమానవీయతను వాళ్ళు తెలుసుకొనేలా చేయి తప్ప వారిపై బలప్రయోగం చేయకు’’ అని సలహా ఇచ్చారు. 1805లో బీహార్లో పన్నెండేళ్ళ బాలికను బలవంతంగా సతిదహనం చేయిస్తున్నప్పుడు JR Elphinstone, అనే మాజిస్ట్రేట్ అనుమతుల కొరకు ఎదురుచూడకుండా తన విచక్షణ అధికారాలతో నిలుపుదల చేయించినట్లు, దానికి ఆ బాలిక ఎంతో సంతోషించినట్లు తెలియచేస్తూ ఈ దురాచారం పట్ల భవిష్యత్తులో ఎలా వ్యవరించాల్సిందో తదుపరి ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగాడు. జావా యుద్ధం, లార్డ్ కార్న్ వాలిస్ మరణం వంటి అనేక కారణాల వల్ల ఈ అంశం చాన్నాళ్ళు మరుగునపడిపోయింది. సతిదహనాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నట్లు, చాలా సందర్భాలలో సతికి పాల్పడే అమ్మాయికి అధిక మోతాదులో మత్తుపదార్ధాలు ఇచ్చి దహనం చేస్తున్నట్లు వస్తున్న రిపోర్టులను ఆధారంగా చేసుకొని 1812లో ప్రభుత్వం హిందూ పండితులతో చర్చించి, సతిదహన నియంత్రణ కొరకు ఈ క్రింది నియమావళిని ప్రతిపాదించింది.
ఎ. బంధువులు, పండితులు, ఇతరుల వత్తిడి లేదా బలవంతంపై ఆ మహిళ సతిదహనంలో పాల్గొనటం లేదని నిర్ధారించుకోవాలి
బి. సతిదహన సమయంలో ఆ మహిళకు మత్తుపదార్ధాలు ఇవ్వలేదని తేల్చాలి
సి. ఆ మహిళకు 16 ఏళ్లకన్న తక్కువ వయసు ఉండరాదు. బహిష్టులో ఉండరాదు. గర్భవతి అయి ఉండకూడదు.
డి. ఈ ఆచారం హిందువులకు మాత్రమే అనుమతించబడిరది. ఆ మహిళ కనుక తన పోలీసులకు అయిష్టతను తెలియచేసినచో వెంటనే బలప్రయోగంతో ఆ సతిదహనాన్ని నిలుపుచేయాలి.
ఇన్ని చేసినా హిందూ మతాచారాలకు అనుగుణంగా పండితుల సలహాలతో, సతిదహనాలు దేశవ్యాప్తంగా జరగటం బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరచేది. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవటానికి, 1815 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సతిదహనం చేసుకొన్న స్త్రీల పేర్లు, భర్త కులం, వయస్సు లాంటి వివరాలు సేకరించసాగింది. బెంగాలుకు సంబంధించి 1815-1818ల మధ్య జరిగిన సహగమనాల సంఖ్యలు ఇలా ఉన్నాయి. 1815లో 378, 1816లో 442, 1817లో 707, 1818లో 839. 1817, 1818లలో కలరా మరణాలు ఎక్కువగా ఉండటం వలన సతిదహనాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదయ్యింది. మద్రాసు డివిజనుకు సంబంధించి 1816 నాటికి మూడేళ్ళ సతిదహన లెక్కలు ఇవి. గంజాం-45బ; విశాఖపట్నం-6బ; రాజమండ్రిలో ఇద్దరు బ్రాహ్మలు, ఒక రాజు, ఆరుగురు శూద్రులుబీ మచిలిపట్నం -42: గుంటూరు-14: నెల్లూరు-12: చిత్తూరు-13: కుంభకోణం-18. ఆనాటి ఫ్రెంచి పాలిత యానాంలో 1830లో జరిగిన ఒక సతిదహన ఉదంతాన్ని ప్రముఖ ప్రపంచ యాత్రికుడు CPT Laplace, Travel around the world అనే పుస్తకంలో గ్రంథస్థం చేసాడు.
బ్రిటిష్ పార్లమెంటు పేపర్లలో సతిదహనంపై జరిగిన చర్చలు: భారతదేశంలో తన అధికారిక వ్యవహారాలకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ అఫిషియల్ రిపోర్టులను లండన్లో ఉండే బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించేది. వీటిని పార్లమెంటరీ పేపర్స్ (PP)అంటారు. భారతదేశంలో ఉండే గవర్నర్ జనరల్ బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయాలకు లోబడి పనిచేసేవారు. ఈ పార్లమెంటు పేపర్లలో 1821-30ల మధ్య సతిదహనం గురించి విస్త్రుతమైన చర్చలు జరగాయి. వీటి ద్వారా సతిసహగమన నిషేదం వెనుక ఉండిన ఆనాటి సామాజిక పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చును. వాటిలోంచి ఇవి కొన్ని ఉటంకింపులు.
1. గవర్నర్ జనరల్ మోయిరా (1812-1829): స్థానిక హిందూ చట్టాలపై విదేశీ పాలకులమైన మన ప్రభావం పరిమితమైనది. బ్రిటిష్ అధికారులు సతిదహనం విషయంలో జోక్యం చేసుకోవటంపై జాగ్రత్తగా ఉండాలి. ప్రజల మతపరమైన అభిప్రాయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకొంటోందనే అభియోగం రాకుండా చూసుకోవాలి (PP 1821:243).
2. లండన్లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1823లో – సతిదహనం అనే ఆచారానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలా చేసి సతిదహనం అనే క్రియలో భాగస్వామి కావటం తమకు ఇష్టం లేదని, శాసనకర్తలుగానే కాక క్రైస్తవులుగా కూడా అట్టి ఆచారాలను తాము అంగీకరించబోమని అన్నారు. (PP 1824: 45).
3. కలకత్తా నుండి వెలువడే Quarterly friend of India అనే పత్రిక 1822లో- బ్రిటిష్ పాలకులు హిందూ చట్టాలపై స్వేచ్చానుసారంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటే, అభాగ్యులైన హిందూ విధవలను కనికరంతో కాపాడగలిగే హక్కు ఉండేది’’ అని వ్యాఖ్యానించింది (PP 1822: 22)
4. సతిదహనానికి ఒక మహిళ తనంతట తాను సిద్ధపడినప్పుడు మనమేం చేయగలం అనే వాదనకు సమాధానంగా, ఇ. వాట్సన్ అనే న్యాయమూర్తి- ‘‘ఒక మహిళ సతిదహనానికి సిద్ధపడి తన ఆమోదం తెలిపినప్పటికీ ఆ ఆమోదం చట్టపరంగా పూర్తిగా చెల్లనిది/విలువలేనిది కావాలి. ఆమె కోరికపై ఆమెను చంపేవారు చట్టం ముందు హంతకులుగానే పరిగణింపబడాలి’’ అన్నాడు. (PP 1821: 99)
5. పై అభిప్రాయాన్ని మరింత విపులంగా జుషవతీ అనే బ్రిటిష్ అధికారి ‘‘సతికి సిద్ధపడిన మహిళ స్వచ్చందంగా ఆ పని చేస్తున్నట్లు నమ్మలేమని, అది బలవంతం లేదా ప్రలోభ పెట్టటం వలన మాత్రమే జరిగే ప్రక్రియ అని, ఎక్కువ శాతం హిందూ మహిళలను మానసికంగా ప్రభావితం చేయటం సులభమని, ఆమె స్వచ్చందంగానే దహనానికి సిద్ధపడుతున్నాను అని చెప్పినప్పటికీ ఆమె మాటలు ఆమె నిజమైన భావాలను తెలియజేయవు’’ అన్నాడు (PP 1821:227)
6. పార్లమెంటరీ పత్రాలలో పండితులను ‘‘నిత్యం ఆకలిగొన్న’’ వారిగా వర్ణించారు. జుషవతీ అనే బ్రిటిష్ అధికారి ఈ మొత్తం సతి ఆచారాన్ని ఇలా చూసాడు. మొదటి సతి ఆచారం జరిగిన కొద్దికాలంలోనే పండితులు దీనిని సరైన రీతిలో నిర్వహించినట్లయితే తమకు మంచి ఆదాయవనరుగా మారుతుందని గుర్తించారు. అప్పటి అత్యంత గౌరవనీయ రచయితలు సతిని శ్రేష్టమైన పుణ్యకార్యంగా, విధవ మరియు ఆమె భర్త ఆత్మలకు అలాగే కుటుంబంలో మిగిలిన ఇతర బంధువులకు మంచి ఫలితాలు కలుగుతాయి అని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం, సంబంధిత పూజావిధానాలు జరిపించటానికి పండితుల హాజరు తప్పనిసరి చేసారు. (PP 1821: 231)
7. Council Governor-General అయిన Lord Amherst,, ఇలా అన్నాడు- స్త్రీలు చిన్నతనం నుండి ఒక విశ్వాసంతో పెరుగుతారు, అంటే సతీగమనం చేయడానికి ఒప్పుకోవడం ద్వారా వారు తప్పనిసరి కర్తవ్యాన్ని మాత్రమే కాకుండా, తమకు మంచి పేరు వస్తుందని, తమ కుటుంబం ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తారు. సతీగమనం చేయడానికి నిరాకరిస్తే, పిరికితనం, భర్తపట్ల అంకితభావం లేకపోవడం అనే అపవాదును ఎదుర్కోవలసి వస్తుందని భయపడతారు (PP 1824:43).
8. ఒక చండాల స్త్రీ సతీదహనానికి అనుమతి కోరగా, ఆమె అతిశూద్ర స్త్రీ అయినప్పటికీ స్థానిక పండితులు ఆమెకు శూద్ర స్త్రీ స్థానాన్ని కల్పించి సతిసహగమనానికి అనుమతించారు (PP 1825:42)
9. చేనేత కులస్థులలో భర్త శవంతో పాటు సజీవంగా ఉన్న భార్యను ఖననం చేయటం సతిసహగమన ఆచారం. ఇంతటి అమానవీయ ఆచారాన్ని ఇంకా కొనసాగించటం ఎంతో అభ్యంతరకరంగా ఉందని కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు (PP 1821:179).
ముగింపు: ఆచారాలు, సేవాధర్మం, పాతివ్రత్యం లాంటివి అనాదిగా హిందూ స్త్రీకి ఊపిరాడనివ్వకుండా చేసాయి. సనాతన ధర్మంలో హిందూ స్త్రీ ఎలా జీవించాలి అనే అంశంపై ‘‘స్త్రీ ధర్మ పద్దతి’’ అనే ఒక సంస్కృత గ్రంథం మార్గదర్శనం చేస్తుంది. దీనిలో ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ హిందూ స్త్రీ ఎలాంటి విధివిధానాలను (మలమూత్ర విసర్జనాదులతో సహా) పాటిస్తే పతివ్రతగా పేరు తెచ్చుకొంటుందో ఎంతో విపులంగా వర్ణించబడిరది. ఈ గ్రంథంలో భర్త మరణించిన స్త్రీ సహగమనం చేసినట్లయితే లభించే పుణ్యం గురించి అనేక శ్లోకాలలో ఎంతో రసవత్తరంగా చెబుతాడా పండితుడు. ఈ గ్రంథాన్ని 18వ శతాబ్దంలో త్రయంబకయాజ్వన రచించాడు. దీనినిబట్టి 18వ శతాబ్దం వరకూ కూడా సతి సహగమనంను పండితులు ఏ రకంగా బతికించుకొంటూవచ్చారో అర్ధం చేసుకొనవచ్చును. ప్రతి హిందువు ఆచరించాల్సిన ధర్మాలను తెలియచేసే కొల్లూరికామశాస్త్రి క్రోడీకరించిరాసిన ‘‘ధర్మసింధు’’
అనే గ్రంథంలో వివిధ వర్ణాల వారికి సహగమనాన్ని చేయించే విధివిధానాలు, మంత్రాలు ఉన్నాయి.
… … …
బ్రిటిష్ అధికారి విలియం కేరీ 1799లో మొదటిసారి సతీదహనాన్ని చూసి చలించిపోయాడు. జాషువా మార్ష్ మాన్, విలియం వార్డ్ వంటి మిత్రులతో కలిసి ఈ సతి దురాగతాన్ని రూపుమాపటానికి బ్రిటిష్ పార్లమెంటులో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఎంతగానో శ్రమించాడు. సతిని నిషేదించమని కోరుతూ అనేక వ్యాసాలు రాసాడు. వీరితో ఆధునిక భావాలు కలిగిన రాజారామ్మోహన్ రాయ్ చేతులు కలిపాడు. స్వామినారాయణ శాఖ వ్యవస్థాపకుడైన సహజానంద్ స్వామి కూడా సతినిషేదాన్నిసమర్ధించాడు. వీరిపై స్థానిక సనాతన బృందాల నుండి ప్రతిఘటన ఉండేది. ఎట్టకేలకు తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ 4, డిశంబరు 1829న రెగ్యులేషన్ XVIIను జారీ చేసి సతి దహనం చట్టవ్యతిరేక, శిక్షించదగిన నేరంగా ప్రకటించాడు. దీనిపై సనాతనుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ప్రధానంగా రాధాకాంత్ దేవ్ స్థాపించిన ధర్మ సభ అనే సంస్థ సతినిషేదాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. (ఇదే సంస్థ 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని వ్యతిరేకించింది). సతి ఆచారాన్ని నిషేదించటం అనేది ‘‘భారతీయుల ఆచార వ్యవహారాలలో కలగచేసుకోము’’ అని మూడవ జార్జి చక్రవర్తి ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉందని సనాతనులు వాదించారు. బీహార్, బెంగాల్ ఒరిస్సాల నుంచి కొన్ని వేలమంది సంతకాలు చేసిన పిటిషనులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈస్ట్ ఇండియా కంపనీ ప్రభుత్వం సతీదహనాన్ని నిషేదించటాన్ని 1830లో లండన్ ప్రివీ కౌన్సిల్ లో సవాలు చేసారు సనాతనులు. రాజా రామ్ మోహన్ రాయ్ ఈ సనాతనుల వాదనను ఖండిస్తూ సతిని ఎందుకు నిషేదించాలో కౌంటర్ పిటిషన్లు పార్లమెంటులో సమర్పించాడు. ఇతను చేసిన పోరాటంవల్ల 1832లో సతినిషేదానికి సంపూర్ణ ఆమోదం లభించింది.
… … …
హిందూ ధర్మశాస్త్రాలు స్త్రీకి సముచిత స్థానం ఇవ్వలేదు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, ఆస్తి హక్కు లేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటం, విడాకులు తీసుకొనే స్వతంత్రత లేకపోవటం లాంటివి కొన్ని
ఉదాహరణలు. వీటన్నిటికీ పరాకాష్టలాంటి ఆచారం ఈ సతీదహనం. బహుజనులలో సతీసహగమనం పొందిన స్త్రీలను పేరంటాళ్ళుగా కొలుస్తారు. ఇవన్నీ సామాజిక రుగ్మతలు. వీటిని భారతీయ సమాజం తొలగించుకొనే ప్రతిదశలోనూ సనాతనులు అడ్డుపడ్డారు. ఇవన్నీ మా ఆచారాలు మీరెవరు మార్చటానికి అంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. స్త్రీలకు ఆధునిక ప్రజాస్వామిక హక్కులను కల్పించే హిందూకోడ్ బిల్లును పార్లమెంటులో చర్చిస్తున్న సమయంలో డిశంబరు 11, 1949న వేయిమందికి పైన సనాతనులు పార్లమెంటును ముట్టడిరచి ఆ బిల్లు అమలు కాకుండా చూసారు. ఈ రకపు వాదనలు నేడు కూడా వినిపిస్తాయి. ఎవరైనా రేషనల్గా మాట్లాడితే విశ్వాసాలమీద దాడిగా భావిస్తారు కొందరు. నిజానికి ఈ పాత విషయాలు ఇప్పుడెందుకు అంతా బాగానే ఉంది కదా అంటూ కొందరు వాదిస్తారు. కానీ మనం నడిచి వచ్చిన దారిని మరచిపోతే, చేసిన తప్పులే మరల మరలా చేసే ప్రమాదం ఉంటుంది. గతం ఎంతో అందమైనది అంటూ తిరిగి అక్కడకే హిందువులను నడిపించాలని, ఆధునిక ప్రజాస్వామిక యుగలక్షణాలైన స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మించుకొన్న రాజ్యాంగం బదులు మనుధర్మశాస్త్రాన్ని అమలుపరచాలని కుట్రలు పన్నుతున్న కాలంలో ఉన్నాం మనం. చరిత్ర అర్ధం కాకపోతే ఏ వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొల్పటానికి ఈ కుట్రలు పన్నుతున్నారో అర్ధం కాదు.
… … …
సతి దురాచారాన్ని నిషేదించిన ఒక బెంటింగ్, వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఒక డల్హౌసీ, బాల్యవివాహాలను రద్దు చేసిన ఒక లార్డ్ ఇర్విన్, హిందూకోడ్ బిల్ ప్రవేశపెట్టిన ఒక డా. బి.ఆర్. అంబేద్కర్ లాంటివారు ప్రాతఃస్మరణీయులు.
రిఫరెన్సులు:
1. Religion and Philosophical Research E-ISSN: 2667-6583 Haziran | June 2020 Volume: 3 – Sayi | Number: 5, A Brief Historical Background Of Sati Tradition In India, Pn.45
2. The dharmasastric debate on widow burning, David Brick, Yale University
3. మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరి జిల్లా, బొల్లోజు బాబా
4.Susil Chaudhuri, Sati as Social Institution and the Mughals, Proceedings of the Indian History Congress, vol. 37 (1976), pp. 218 223.)
5. Calcutta Review 1868, vol 47, pn 221
6. ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా
7. Hindu Pasts, Women, Religion, Histories, Vasudha Dalmia. Chapter: Sati as a Religious Rite: Parliamentary Papers on Widow Immolation
8. https://www.jstor.org/stable/4397528
9. The perfect Wife, Sridharmapaddhati, by I Julia Leslie pn.293
10.The Dharmasastric Debate on Widow-Burning, David Brick, Yale University
11.https://penelope.uchicago.edu/Thayer/E/Roman/Texts/Diodorus_Siculus/19B*.html
12. శ్రీ బ్రహ్మశ్రీ కొల్లూరి కామశాస్త్రి గారిచే పరివర్తితము, 2016