గిరిజనుల కనుపాప-మహాశ్వేతాదేవి

రెంటాల కల్పన
మారుమూల అడవుల్లో వొదిగి వుండే అమాయక జనం-గిరిజనం. నది వొడ్డునో చెట్టుకొమ్మనో  కాసింత నీడ వెతుక్కొని, ప్రకృతి ప్రసాదించిన ఏ కొద్దిపాటి ఆహార వనరులతో బతికే గిరిజనానికి బయటి లోకపు పోకడలేమీ తెలియవు. బయటి లోకపు రోడ్లు,  సౌకర్యాలు ఏవీ వాళ్ళ దరి చేరవు. కానీ పట్టెడు నేల కనిపిస్తే చాలు, కబళించి కాసులుచేసుకోవాలనుకునే దురాశ జీవులు ఇప్పుడు కొండల్ని కరిగిస్తున్నారు. చెట్ల అడవుల్లో దొరికే ప్రతి సంపదనీ కొల్లగొట్టి, లాభాలతో తమ సంపదల్ని పెంచుకుంటున్నారు. జన్మహక్కయిన భూముల్ని ఆక్రమించి, ఆ భూమ్మీద బతికే గిరిజనాన్ని వెళ్ళగొడ్తున్నారు. తిరిగి వాళ్ళని దోపిడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారు. లెక్కలు, పట్టాలు, దస్తావేజులు, తెలియని అమాయక ఆదివాసులు నమ్ముకున్న భూమిని వదులుకొని, చెట్టుకొకరు చెదిరిపోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళే కాదు, ప్రకృతి అందాలన్నీ చెదిరిపోతున్నాయి. వాళ్ళ ఆటలూ పాటలతో ప్రతిధ్వనించాల్సిన అడవులు దెయ్యాల గూళ్ళవుతున్నాయి. అలా చెదిరిపోతున్న ఆదివాసులకు ఏ ప్రభుత్వమూ అండగాని వాళ్ళ హక్కులేమిటో వాళ్లకే తెలియక అజ్ఞానంలో, అవిద్యలో, అంధకారంలో ఆదివాసీ జన సమూహాల్లోకి, వాళ్ళ చీకటి బతుకుల్లో ఒక దీపంలా నడిచి వచ్చింది.
ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యత లేదన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగల  ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతెగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాలు పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అటు వెళ్లింది. నగర జీవితంలో పుట్టి పెరిగిన మహాశ్వేతాదేవి కీకారణ్యాలలో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనతో వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్య్రం, అమాయకత్వం… వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకు అమ్మ. తరతరాల దోపిిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చి దిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశలోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యంగా పోరాడి గెలిచిన యోధ మహాశ్వేతాదేవి.
ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకాలోని ఒక సాహిత్య సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మహాశ్వేతాదేవి చిన్న వయస్సులోనే ‘గణ నాట్య’ అనే ఒక థియేటర్‌ బృందంతో కలిసి పని చేసింది. 1930, 40ల్లో ‘గణ నాట్య’ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్‌లోని పల్లె సీమల్లో ‘గణ నాట్య’ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘గణ నాట్య’ అడుగు పెట్టిన చోట అజ్ఞానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎమ్మే చదువుతున్న కాలంలో కూడా మహాశ్వేత ‘గణ నాట్య’ ప్రభావంతో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగంలో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలంలోనే ఆమె అధ్యాపకురాలిగా, పత్రికా రచయితగా ఉద్యోగ జీవితంలోకి అడుగిడింది.
మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్ల వాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారంగా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన ”ఝాన్సీ రాణి” తో ఆమె సాహిత్య జీవితం 1956లో మొదలైంది.
కేవలం గ్రంథాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా శాశ్వతంగా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకంలో ఆ వీరనారి జ్ఞాపకాలు ఏ విధంగా సజీవంగా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహాశ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబంలో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్‌ ఖాండ్‌కి ప్రయాణమైంది మహాశ్వేత. బుందేల్‌ ఖాండ్‌ చుట్టూరా ఎన్నో ఊర్లు తిరిగింది. మామూలు జనంతో ముఖ్యంగా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్‌ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ఝాన్సీ రాణి’.
ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితంలో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభకి నిలువుటద్దాలు. భారతదేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ఆసియా నోబెల్‌’గా పేరు పొందిన ‘రామన్‌ మెగాసెసే’ అవార్డ్‌ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోషని అక్షరబద్ధం చేసిన ‘హజార్‌ చౌరాసీ మా’ నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్‌ నిహలానీ దర్శకత్వంలో చిత్రంగా వెలువడి, ఆమె కీర్తిని అంతర్జాతీయపటం మీద నిలబెట్టింది.
1965లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేతలో చాలా మార్పు వచ్చింది. ”ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధనస్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమిని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోట మట్టికొట్టి విలాసంగా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితంలో ఇన్ని వ్యత్యాసాలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.
తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహాశ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రంగా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితంలో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేతా దేవిది.
ఒకవైపు దేశం 21వ శతాబ్దంలోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశలోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రిగా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్తగా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.
గిరిజన బతుకుల్లో వెలుగులు నింపే దశలో ఆమె మొదటి మెట్టు : వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచడం, జీవన స్థితిని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటులో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారంగా తీసుకొని, వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయంలో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటులో వున్న వనరులు. అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్కపంట వేసి, భూమిని పోడుతో పాడు చేసే స్థితి నుంచి, ఇప్పుడు అదే భూమిలో మూడు పంటలు వేసే స్థితికి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్థిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కొంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనలు ఇప్పుడు శక్తి సామర్థ్యాలున్న రైతులుగా మారి, ధాన్యంతో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.
ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకువచ్చిన వెలుగులు లెక్కలేనన్ని. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన, కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యంతో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని చిన్నాభిన్నమయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.
కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితంగా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహాశ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని, నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియాలోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులుగానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథంలో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే, పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులుగానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్‌ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతంతో ఈ పోరాటానికి నాంది పలికింది మహాశ్వేత. బుధాన్‌ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్‌కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత. ఈ పోరాటంలో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.
మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెట్టివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్‌ చేసింది. ”డీ నోటిఫైడ్‌ ట్రైబ్స్‌ అండ్‌ కమ్యూనిటీస్‌ రైట్‌ యాక్షన్‌ గ్రూప్‌” నే ఒక సంస్థ ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశంలోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చింది.
2006లో ఫ్రాంక్పర్డ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిథిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశంలో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పడింది. దుష్ట శక్తుల పన్నాగంలో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.
(2007లో ఈటీవీ-2మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి యిచ్చిన స్క్రిఫ్టు – తూర్పు – పడమర బ్లాగ్‌ నుండి)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.